Saturday, September 8, 2018

జటాయువును చూసిన శ్రీరాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-25 : వనం జ్వాలా నరసింహారావు


జటాయువును చూసిన శ్రీరాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-25
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (09-09-2018)
పంచవటికి వెళ్తున్న రామలక్ష్మణులకు పెద్ద దేహం కల గద్దరాజును, మహా పరాక్రమవంతుడిని, అగస్త్యుడు చెప్పిన మర్రిచెట్టు మీద వుండగా చూసి, రాక్షసుడీరూపంలో వున్నాడని భావించారు. అతడిని ఎవరని అడిగారు వారు. జవాబుగా "రామచంద్రా! మీ తండ్రికి నేను మిక్కిలి ప్రియమైన స్నేహితుడిని" అని చెప్పగా, వారి సంతోషించి, ఆయనను తమ తండ్రిలాగా గౌరవించి, ఆయన పేరు జటాయువు అని తెలుసుకున్నారు. జటాయువు తన పూర్వకథను, భూతాలు పుట్టిన విధం మొదలు పెట్టి చెప్పసాగాడు.

"భూత సృష్టికి కారణభూతులై, పూర్వం కొందరు ప్రజాపతులు ఉద్భవించారు. వాళ్లలో మొదటివాడు కర్ధముడు. ఆ తరువాత విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరుడు, ప్రచేతుడు, పులహుడు, దక్షుడు, వివస్వతుడు చివరగా కశ్యపుడు ఉద్భవించారు. వీళ్లలో దక్షుడికి నలబై మంది కూతుళ్లు పుట్టారు. వాళ్లలో ఎనిమిదిమందిని కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల పేర్లు: అదితి, దితి, దనువు, కాళి, క్రోధవశ, తామ్ర, మనువు, అనల. ఈ ఎనిమిదిమందిని భార్యలుగా చేసుకున్న కశ్యపుడు వాళ్లతో ఇలాఅన్నాడు...’మీరు మూడులోకాలను రక్షించేందుకు సమర్థులైన వాళ్లను, నాతో సమానమైన వారిని, కనండి’. ఈ మాటలకు అదితి, దితి, దనువు, కాళి అంగీకరించారు. మిగతావారు భర్త మాటను అంగీకరించలేదు. దరిమిలా, అదితి పదకొండు మంది రుద్రులను, ఎనిమిదిమంది వసువులను, ఇద్దరు అశ్వినేయులను, పన్నెండు మంది ఆదిత్యులను, ముప్పై మూడు మంది దేవతలను కనింది. వీరంతా స్వర్గవాసులు. దితికి దైత్యులు పుట్టారు. సముద్రాలతో, వనాలతో కూడిన ఈ భూమంతా మొదలు వారిదే. దనువుకు అశ్వగ్రీవుడనేవాడు, కాళికకు నరకుడు, కాలకుడు అనేవారు జన్మించారు".

"తామ్రకు క్రౌంచి, భాసి, శ్వేని, ధృతరాష్ట్రి, శుకి అనే ఐదుగురు కలిగారు. వారిలో క్రౌంచి ఊలూకాలను (గూబలు) కూడి భాసాలను కనింది. శ్యేని గద్దలను, డేగలను కనింది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కనింది. శుకి నతను కనింది. సత వినతను కనింది. క్రోధ అనే భార్యకు ఐదుగురు కూతుళ్లు, సురస, మృగమంద, హరి, శ్వేత, సురభి, భద్రమద, మాతంగి, శార్ధూలి, కద్రుక, మృగు పుట్టారు. మృగికి జింకలు పుట్టాయి. మృగమంద అనే ఆమెకు ఎలుగులు, సృమరాలు, చమరాలు జన్మించాయి. హరి అనే ఆమెకు సింహాలు; భద్రమతకు ఇరావతి; దానికి ఐరావత గజం, మాతంగోవులు, గంధర్వికి గుర్రాలు జన్మించాయి. లు; శార్ధూలికి వ్యాఘ్రాలు, గోలూంగాలు; శ్వేతకు దిగ్గజాలు; సురభికి రోహిణి, గంధర్వి; రోహిణికి గోవులు, గంధర్వికి గుర్రాలు జన్మించాయి. సురసకు పడగల నాగుపాము పుట్టింది. కద్రువకు పాములు పుట్టాయి”.


"మనువుకు మనుష్యులు పుట్టారు. మానవులు, మనుజులు అనే శబ్దానికి ఇదే సరైన ఉత్పత్తి అర్థం. మనుస్మృతికారుడైన మనువు వల్ల పాలించబడినవారిని మానవులు, లేదా, మనుజులు అనవచ్చు. ఈ మనుజులలో నాలుగు భేదాలున్నాయి. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనేవి. అనలకు సమస్థమైన ఫల వృక్షాలు జన్మించాయి. శుకి కూతురు, సతకూతురైన వినతకు అరుణుడు, గరుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. సురస చెల్లెలైన కద్రువకు భూమిని మోసే వేయిపడగల శేషుడు పుట్టాడు. కద్రువ నాగమాత అయింది. ఇక నేను సంపాతికి తమ్ముడిని. నా పేరు జటాయువు. శ్యేని కుమారుడిని....నీకిష్టమైతే నీకు నేను సహాయం చేస్తాను".

(జటాయువు వంశ పరంపర...కశ్యపుడు...శుకి...నత...వినత...అనూరుడు... జటాయువు...అంటే, కశ్యపుడికి ఆరవ వాడు జటాయువు. శ్యేని, శుకి అనే వారిద్దరు కశ్యపుడు భార్య అయిన తామ్ర కూతుళ్లు. జటాయువు, తన తల్లి పేరు శ్యేని అన్నాడు కాని, తనకు ముత్తవ్వ అని చెప్పలేదు. కాబట్టి ఆమె పృన్న మరొక ఆమె కలదని అనుకోవాలి).

"మాకు ఇతరుల సహాయం ఎందుకు? నువ్వేం సహాయం చేస్తావంటావేమో? చేయగలవని అడుగుతావేమో? ఈ అడవి ప్రవేశించలేనిది. తోవలు, డొంకలు సరిగ్గా లేవు. జనసంచారం అసలే లేదు. కంపలుకొట్టి తోవ చేయడం సాధ్యపడదు. దానికి తోడు ఇక్కడ రాక్షసులుంటారు. ఈ సందర్భంలో, మీరిద్దరూ అడవికి వేటకు పోతే, ఒంటరిగా వున్న సీతాదేవికి, మృగాల బాధ, రాక్షసుల బాధ లేకుండా నా బలంతో ఆమెను రక్షిస్తాను" అని జటాయువు చెప్పాడు.

జటాయువు మాటలన్నీ ప్రీతితో విన్న శ్రీరాముడు తన తండ్రి స్నేహితుడైన ఆయనను సంతోషంగా కౌగలించుకుని, తన తండ్రికి ఆయనకు కలిగిన స్నేహ విషయమంతా విని, ఇక తన భార్య సీత రక్షన భారం ఆయనదే అని ఆయనకు అప్పగించి, అంతా కలిసి పంచవటి చూదడానికి వెళ్లారు. ఆ తరువాత వారంతా శీఘ్రంగా పంచవటి చేరుకున్నారు.

No comments:

Post a Comment