Tuesday, January 26, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-33 : వాయుదేవుడు తమను అవమాన పరిచాడని తండ్రికి చెప్పిన కుశనాభుడి కూతురులు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-33
వాయుదేవుడు తమను అవమాన పరిచాడని
తండ్రికి చెప్పిన కుశనాభుడి కూతురులు
వనం జ్వాలా నరసింహారావు

అమితమైన దుఃఖంతో, కళ్లనుండి నీళ్లు ప్రవాహంలాగా కారుతుంటే, బ్రహ్మతో సమానమైన తమ తండ్రి పాదాలపై శిరస్సుంచి చెప్పారు ఆ కూతుళ్లిలా: " ఏమని చెప్పాలి తండ్రీమోహాంధుడై-గర్వంతో వాయువు మాలో పోకూడని మార్గంలో ప్రవేశించి, మాకిలాంటి సంతాపం కలిగించాడు. ఆయనకు మేం ఏ అపరాధం చేయలేదు. మమ్మల్నందరినీ పెళ్లి చేసుకుంటానని ఆయన అంటే, మా తండ్రిని అడగమని చెప్పాం. మా తండ్రి నీకిస్తే చేసుకుంటామన్నాం. మాకు మా తండ్రిని మించినదేదీ లేదు-ఆయన మాట జవదాటం అనీ, మాకు స్వాతంత్ర్యం లేదనీ, ఆకు చాటు పిందెలమనీ, తండ్రి చాటున వుండే వారిమనీ, ధర్మం తప్పి మాట్లాడ వద్దనీ, మాకు కోపం తెప్పించ వద్దనీ చెప్పాం. మేము ఆడపిల్లలమనీ, మేమేమీ చేయలేమనీ అనుకుని, ఆ పాపాత్ముడు మమ్మల్నిట్లా అవమానకరమైన మరుగుజ్జులలాగా తయారుచేశాడు". ఉత్తమ గుణాలను ప్రదర్శించిన తన కూతుళ్లతో, ఎలాంటి శత్రువైనా నమస్కరించేటంత శక్తిమంతుడైన కుశనాభుడు, వారి ఓర్పు శ్లాఘించదగిందనీ, తన కడుపున పుట్టినందుకు వారందరూ ఒక్క మాటపై వున్నారనీ, ఒక్కరు కూడా పొరపాటునైనా వాయుదేవుడిని శపించలేదనీ, ఆడవారికైనా-మగవారికైనా దేహ సౌందర్యం-భూషణ సౌందర్యం కంటే కష్టాల్లోనైనా క్షమా గుణమే భూషణమనీ అన్నాడు.


"స్త్రీలకు-అందునా బాలికలకు తమనవమానించిన వారిని సహించడం సాధ్యం కాని పని. రూప యౌవనాలతో వున్న మీరు, మీ సౌందర్యాన్ని-యౌవనాన్ని చూసి, కామానికి వశ పడక, తండ్రికొరకై, సహించి వుండడమంటే గొప్ప విషయమే. దానికి కారణమైన వారిని శపించక రక్షించడం మరీ శ్లాఘ్యం. ఒక్కరు కూడా కామ-క్రోధాలకు వశ పడకుండా వుండడం ఉత్తమోత్తమం. క్షమే దానం-యజ్ఞమంటే క్షమే-క్షమే సత్యం-సత్కీర్తి క్షమే-క్షమే మేలైన ధర్మం-క్షమలోనే జగమంతా ఆధారపడి వుంది. క్షమను సాధిస్తే ప్రపంచాన్ని జయించినట్లే-అన్నీ సాధించినట్లే" అని కుశనాభుడు తన కూతుళ్లను సమాధాన పరిచి, కొలువు తీరి, మంత్రులందరినీ పిలిచి, అన్నివిధాలా ఆలోచించించి, తన కూతుళ్లకు తగిన వరులెవ్వరని యోచన చేశాడు. అదే సమయంలో "చూళి" అనే రేతస్స్ఖలనం లేని (ఊర్థ్వ రేతస్కుడు) మునీశ్వరుడు తపస్సు చేస్తుంటే, ఊర్మిళనే గంధర్వ స్త్రీ కూతురు-సోమదనే కన్య ఆ మునికి శుశ్రూష చేస్తూండేది.

బ్రహ్మ దత్తుడి చరిత్ర


కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, సోమద శ్రద్ధా భక్తులకు సంతోషించిన చూళి, ఆమెకేం కావాల్నో అడగమంటాడు. తనకు కలగనున్న అదృష్టానికి ఆనందపడ్డ సోమద, తియ్యటి మాటలతో, దివ్య మహర్షులలో శ్రేష్ఠుడు-అసమాన తపఃప్రకాశంతో సూర్యుడిని జయించినవాడు-అపర బ్రహ్మ అయిన చూళి తో, తనకు " మిగుల పవిత్రుడు, బ్రహ్మ జ్ఞానంతో కూడినవాడు" అయిన కొడుకును అనుగ్రహించమని అంటుంది. తనకు మొగుడు లేడనీ, వివాహం కాలేదనీ, ఆయన్నే శరణుజొచ్చాననీ, ఆయన తపో మహిమతో తనకు పుత్రుడు కలిగేటట్లు చేయమనీ ప్రార్థిస్తుంది. ఆ మాటలకు సంతోషించిన చూళి తన సంకల్ప బలంతో ఆమెకు కొడుకును-మంచి నడవడి గలవాడిని కలిగేటట్లు చేసి పంపించాడు. సోమద కొడుకైన బ్రహ్మదత్తుడు కాంపిల్యమనే పురానికి రాజై, కీర్తిమంతుడై, ఇంద్రుడు అమరావతిని పాలించినట్లే, పాలించాడు. ఆ బ్రహ్మదత్తుడిని తన యోగ్యతకు తగిన మార్గంలో పిలిపించి, తన అభిప్రాయాన్ని తెలిపి, ఆయనకు తన వందమంది కుమార్తెలనిచ్చి వివాహం జరిపించాడు కుశనాభుడు. బ్రహ్మదత్తుడు వివాహ సమయంలో, ఆ కన్యలను చేత్తో ముట్టుకోగానే, వారందరి వికార దేహాలు పోయి, పూర్వంలాగానే మనోహరమైన సుందర శరీరాలొచ్చాయి. అలా ప్రకాశిస్తున్న తన కూతుళ్లను చూసి, కుశనాభుడు ఆశ్చర్యంతో-సంతోషంతో మైమర్చి, వారిని బ్రహ్మదత్తుడితో పంపాడు. బ్రహ్మ దత్తుడి తల్లి సోమద కూడా వారిని చూసి సంతోషించింది. ఆ కన్యలున్న ప్రదేశానికే "కన్యాకుబ్జం" అని పేరొచ్చింది. దాన్నే ఇప్పుడు "కనోజ్" అంటారు.

No comments:

Post a Comment