Thursday, January 28, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-35 : విశ్వామిత్రుడిని గంగానదీ వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-35
విశ్వామిత్రుడిని గంగానదీ 
వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

ఆ విధంగా మిగిలిన రాత్రంతా మునీంద్రుల సమూహంతో, శోణ నదీతీరంలో హాయిగా నిద్రించిన "ముని సింహం"-విశ్వామిత్రుడు, తూరుపు తెల్లవారగా మేల్కొని, ఆ సమయంలో చేయాల్సిన స్నాన-సంధ్యావందనాది కార్యక్రమాల నన్నిటినీ పూర్తి చేసుకుని, మిక్కిలి ప్రీతితో-గౌరవంతో-శుభకరమైన మంచి మాటలతో, రామ లక్ష్మణులను మేలుకొలిపాడు. రామ లక్ష్మణులు బ్రహ్మచారులే కనుక, వారికి స్నానం-సంధ్య తప్ప వేరే కృత్యాలు ఉదయాన లేవు. కాబట్టి, తన కార్యక్రమాలన్ని నెరవేర్చుకుని వాళ్లను నిదురలేపుతూ: " నాయనా, రామచంద్రా ! తూర్పు తెల్లవారడం ప్రారంభమయింది. ప్రాతస్సంధ్య సమీపించింది. కమలాక్షా ! సూర్యుడు ఉదయించిన తర్వాత, కమలాలు ముకుళించి వుండవుకదా-కాబట్టి నిద్ర లే. మీరు సంతోషంతో ప్రయాణం చేయాలి-అలా ప్రయాణం చేసేందుకు మీకు మేలు కలగాలి" అని విశ్వామిత్రుడు అనడంతో, వారు నిద్రలేచి, స్నాన-సంధ్యావందనం చేసి, ప్రయాణానికి సిద్ధమయ్యారు. నిర్మలమై-శుభప్రదమై-శుభ్రమైన నీటినిగలదై-ఇసుక దిబ్బలతో సుందరమై-ఎంతో లోతుగా వున్న శోణ నదిని ఎలా దాటాలి అని మునిని అడుగుతాడు శ్రీరాముడు. మునిశ్రేష్ఠులందరు ఎలా దాటుతారో, మనమూ అలానే వెళ్దామని ఆయన జవాబివ్వడం, ఋషేశ్వరులందరూ సంతోషంతో నదిని దాటి, వనంలో ప్రవేశించి, దారి వెంటబడి నడుచుకుంటూ పోయి, మధ్యాహ్నం కల్లా హంసలు-చక్రవాకాలున్న గంగా తీరానికి చేరారు.



మనస్సుకింపైన గంగానదీ తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారందరు. ఆ సమయంలో గంగానదిని చూపిస్తూ, అదెలా మూడు మార్గాల్లో సముద్రాన్ని చేరడానికి కారణమేంటని రాముడు ఆయన్ను ప్రశ్నిస్తాడు. దశరథుడి ముద్దుల కొడుకైన రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు సంతోషించిన విశ్వామిత్రుడు గంగానదీ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. " అనేక రత్నాలను కూడిన శిఖరాలతో ఆకాశాన్నంటుతూ, నానా ధాతు వర్ణాలతో ప్రకాశిస్తూ, మిక్కిలి చల్ల గాలి వీచడంవల్ల అసమానమైనదిగా ప్రసిద్ధిగాంచిన హిమవత్పర్వతం గురించి తెలియనివారు లేరు. ఆ హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మేనకనే మనోరమను పెళ్లి చేసుకుని, ఇద్దరు కూతుళ్లను కన్నాడు. వారిలో పెద్దది ’గంగ” , చిన్నది ’ఉమ’. వారిద్దరూ పెరిగి పెద్దవారైతున్నప్పుడు, దేవతలు ఆయన్ను కలిసి, తమ కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, అందులో ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. దేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు, మూడు లోకాలను పావనం చేసేదై-స్వేఛ్చగా చరించేదై-ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను, వారికి వెంటనే ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు. ఇక రెండో కూతురైన ఉమా దేవి, ఆకులలాలు కూడా తినకుండా, అపర్ణగా, ఘోరమైన తపస్సు చేసింది. హిమవంతుడామెను సమస్త లోకాలు మ్రొక్కే శివుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా పర్వతరాజు ప్రియపుత్రికలిద్దరు కీర్తిమంతులై ప్రకాశించారు" అని మొట్టమొదట పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియచెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు. 

No comments:

Post a Comment