Friday, January 29, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-36 : శ్రీరాముడికి గంగ "త్రిపథగ" అయిన వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-36
శ్రీరాముడికి గంగ "త్రిపథగ" అయిన వృత్తాంతాన్ని
 చెప్పిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

గంగ వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు, పాప రహితమైన గంగ దేవలోకంలో-మనుష్యలోకంలో ఎలా సంచరించిందని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావడానికి కారణమేంటని, ఏ పని చేయడంవల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైందిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా, ఋషులందరు వినే విధంగా, రామచంద్రా అని సంబోధిస్తూ గంగా చరిత్రను చెప్పాడు విశ్వామిత్రుడు. "పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని, సంతోషంగా ఆమెతో నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు. రేతస్ఖ్సలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖ్సలనం కాకపోతే-అయినప్పుడు ఎంత బలిష్ఠమైనవాడు పుడతాడోననీ, వాడెలాంటివాడవుతాడోననీ, వాడిని భరించడమెట్లాననీ దేవతలు భయపడి, తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్లి శివుడిని కలిసి, నమస్కరించి, తమ మ్రొక్కులను గ్రహించి తమననుగ్రహించమని వేడుకుంటూ, ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలెన్ని కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని-పార్వతిని, వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ, ఆయన నుండి వెలువడే కాంతి పూరితమైన తన రేతస్సును పార్వతిలో విడువకుండా తనలోనే వుంచుకొమ్మని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్ని సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించారు".

(దీన్నే "మహా మైథునం" అని వాడుకలో పిలుస్తారు. పంచమ కారులైన శాక్తేయులకు ఇది పరమ పవిత్రమైన వ్రతం).


"ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు, వారి కోరినట్లే చేస్తానంటాడు. తను వీర్యాన్ని, పార్వతి శోణితాన్ని తమలోనే ధరించెదమని-రెంటినీ కలవనీయమని-వేర్వేరుగా వుంచుతామని అంటూ, మనుష్యులు, దేవతలు సుఖంగా వుండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా, ఆయన తేజం జారితే, దాన్ని భూదేవి ధరిస్తుందని దేవతలంటారు. అప్పుడు శివుడు దాన్ని వెలుపలకి వదిలాడు. అది, అడవులు-కొండలు తో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయమేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి, అగ్నిహోత్రుడిని-వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా, అగ్నిహోత్రుడందులో ప్రవేశించాడు. ఆకారణాన అదొక పెద్ద మంచు కొండలాగా యింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోకసమ్మతమయింది. కాలక్రమంలో అది శరవణం అయింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు".

దేవతలను శపించిన పార్వతి


"ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి, వారుచేసిన పాప ఫలం అనుభవించమని నిష్ఠురాలాడింది. దోసిట్లో నీళ్లు తీసుకుని, కళ్లల్లో కోపం కనపడుతుంటే, తనకు కొడుకు కనాలన్న కోరికని విఘ్న పరిచిన దేవతల భార్యలు బిడ్డలను కనరని-వారు గొడ్రాళ్లవుతారని శపించింది పార్వతి. ఆ తర్వాత భూమిపైనా కోపించింది పార్వతి. తను బిడ్డలను కనడం సహించలేకపోయిన భూదేవి, అనేక మందికి భార్యగా-అనేక రూపాలుగలిగుండి, ప్రీతితో బిడ్డల్ని కనే సంతోషం లేకుండా పోవాలని శపించింది పార్వతి. అందుకే, భూపుత్రి-సీత-నరకాసురుడు భూ పుత్రులైనా రేతస్సువల్ల గర్భం ధరించి కనే సుఖాన్ని భూమికి కలిగించలేదు. ఇలా పార్వతీదేవి అహంకార-రోషాలతో శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు వంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసేందుకు పోయాడు" ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు.

No comments:

Post a Comment