Wednesday, February 17, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-52: వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

 బాలకాండ మందరమకరందం
సర్గ-52
వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

"వశిష్ఠుడి ఆశ్రమాన్ని చూసిన విశ్వామిత్రుడు, సంతోషంతో లోపలికి పోయి, వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించగా, అయన క్షేమ సమాచారాలు తెలుసుకున్న ముని ఆయన్ను ఆసనం మీద కూర్చోమంటాడు. వశిష్ఠుడిచ్చిన తియ్యటి ఫలాలను స్వీకరించిన రాజు ముని శ్రేష్ఠుడిని కుశల ప్రశ్నలడిగాడు. ఆయన శిష్యులెలా వున్నారని, తపస్సు చక్కగా జరుగుతున్నదానని, వారికి కావాల్సిన పళ్లు-ఫలాలు లభిస్తున్నవానని వశిష్ఠుడినడిగాడు. జవాబుగా మహర్షి విశ్వామిత్రుడిని: రాజా, నీకు-నీ సేవకులకు-బంధువులకు-మిత్రులకు-అందరికీ క్షేమమేనా? ధర్మం తప్పక, రాజనీతిననుసరించి ప్రజలను రక్షిస్తున్నావా? నీ సేవకులు నీ మాటకు లోబడి ప్రవర్తిస్తున్నారా? నీవూ వారిని దయతో చూస్తూ, వారి యోగక్షేమాలను విచారిస్తున్నావా? శత్రువులందరినీ జయించావా? చతుర్విధ సేనలు-బొక్కసం-స్నేహితులు నిండుగా వున్నారా? భార్యా-కొడుకులు-మనుమలు క్షేమంగా వున్నారా? అని అడగ్గా అందరూ కుశలమేనని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇట్లా వీరిద్దరు సంతోషంతో ఒకరినొకరు పలుకరించుకుంటూ, పుణ్య కథలు చెప్పుకుంటూ సమయం గడిపారు కొంత సేపు".



విశ్వామిత్రుడికి విందుచేసిన వశిష్ఠుడు


"సమయమలా గడిచిపోతుంటే, జపశీలుడైన వశిష్టుడు, అతిథుల్లో గుణంవల్లా-పదవి వల్లా శ్రేష్టుడైన విశ్వామిత్రుడు పూజ్యుడనీ, అందువల్ల సేనలతో సహా అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించదల్చుకున్నాననీ, హిత బుద్ధితో అంగీకరించమనీ కోరాడు. వశిష్ఠుడి ప్రియ వాక్కులతో, అమృత సమానమైన కందమూల ఫలాలు తినడంతో ఆయన ఆతిథ్యం స్వీకరించినట్లేనని, ఆయన దర్శనంతో ధన్యుడనయ్యానని, సెలవిస్తే వెళ్తానని అంటాడు విశ్వామిత్రుడు. అయినా వశిష్ఠుడు బలవంతం చేయడంతో, ఆయన ఇష్ట ప్రకారమే ఆతిథ్యం తీసుకునేందుకు అంగీకరించాడు. వెంటనే వశిష్ఠుడు తన కామధేనువైన శబలను పిలిచి, తను రాజుకు-ఆయన సేనలకు విందు భోజనం పెట్టదల్చుకున్నానని, శీఘ్రంగా వారందరికి, తియ్యని అన్నాన్ని-పానకాన్ని-రసాయనాల్ని-లేహ్యాల్ని, ఇతర భోజ్యాల్ని ఏర్పాటుచేయమని ఆదేశించాడు".  

No comments:

Post a Comment