Sunday, February 21, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-56 : వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-56
వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే
వనం జ్వాలా నరసింహారావు

అయినా ఆగని విశ్వామిత్రుడు పొగరుబోతు మాటలాడుతూ-అక్కడే నిలబడమని-ఇంకెక్కడికీ పోలేవని అంటూ, తనదగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు. తనపైకొస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ: తనక్కడే నిలుచున్నాననీ-ఆతడి బలమెంతో, చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో చూపమని-ముందు వాటన్నిటినీ భస్మం చేసి ఆతర్వాత ఆతడిని భూమి మీద లేకుండా చేస్తానని-క్షత్రియ బలానికి, బ్రాహ్మణ బలానికి తేడా అతడికి తెలియదని-దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూపబోతున్నానని, అంటూనే, విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు".

          "అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు, వారుణాస్త్రం-రౌద్రాస్త్రం-పాశుపతం-ఐషీకం-స్వాపనం-గాంధర్వం-మోహనం-మానవం-జృంభణం-మాదనం- సంతాపనం- విలాపనం- శోషణం- దారణం- జయించలేని వజ్రశరం – బ్రహ్మపాశం – కాలపాశం – వారుణపాశం - దండం-పైశాచం-దయితం-రెండశనులు-క్రౌంచాస్త్రం-శుష్కం-ఆర్థ్రం – పైనాకం - ధర్మచక్రం - భయంకరమైన కాలచక్రం – విష్ణుచక్రం – మథనం – వాయవ్యం – హయశిరం - రెండు శక్తులు – ముసలం - కంకాళం-కాలాస్త్రం-వైద్యాధరం-కాపాలం-త్రిశూలం-కంకణాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నిటినీ బ్రహ్మ సుతుడైన వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో హరించివేశాడు. తన అస్త్రాలన్ని వ్యర్థమై పోవడంతో, దీర్ఘమైన కోపంతో, భయంకరాకారుడై, దేవతా గణం-ముల్లోకాలు భయపడుతుండగా, బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు.

తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని మింగాడు.బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలిభయంకరంగా కనిపిస్తుంటే, ఆయన రోమకూపాలనుండి, అగ్నిజ్వాలలు ప్రవహించసాగాయి. ఆ మహా ఋషి శ్రేష్టుడిని, ఋషీశ్వరలందరు ప్రార్థించారు. వశిష్ఠుడి తపో బలమింతని చెప్పలేమని, సత్కీర్తిగల ఆయన తన తేజస్సును శమించజేయాలని, బ్రాహ్మణోత్తముడైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరు కోరడంతో, వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏంచేయాల్నో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడై-శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని అనుకుంటాడు. తనుకూడా శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించి, బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకొని, తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు".


(వశిష్టుడి గురించి చెప్పేటప్పుడు వాసుదాసుగారు రాసిన పద్యాల్లో, ఆయన్ను "జపివర్యుడు", "జపశీలుడు" అనే విశేషణాలను ప్రయోగించారు. ఇలా ప్రయోగించడంలో వక్త-వ్యాఖ్యాత వుద్దేశం, వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" యే. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు.ఇవేవీలేకుండా,వశిష్ఠుడు దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదేజరిగింది వశిష్ఠ-విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం-శ్రీ మధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.


గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమేకాదు. ఆత్మవిద్యకు, అనాత్మవిద్యకు మధ్యజరిగిన యుద్ధం.సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు,ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పుతిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్నవాడినీ, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడినీ, దెబ్బకు-దెబ్బ అనిగూడా కీడుతలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు).

No comments:

Post a Comment