Monday, February 22, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-57 : త్రిశంకూపాఖ్యానం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-57
త్రిశంకూపాఖ్యానం
వనం జ్వాలా నరసింహారావు

            "వశిష్ఠుడితో తనకు కలిగిన విరోధం-పరాభవం, ఓటమికి కుమిలిపోతూ, శోకంతో ఏమీ చేయలేక లోలోపలే విశ్వామిత్రుడు బాధపడుతుండేవాడు. భార్యతో దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో, హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడనే నలుగురు కొడుకులు కలిగారు. అలానే వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజర్షులందరినీ మించిపోయాడని-ఆయన గూడా రాజర్షిగా  అయ్యాడని వరమిచ్చి తన లోకానికి వెళ్లిపోతాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, విచారపడి, సిగ్గుతో తలవంచుకుని దుఃఖంతోనూ-శోకంతోనూ కుమిలిపోయాడు. తనింతగా చేసిన తపస్సు వ్యర్థమయిందని భావించిన విశ్వామిత్రుడు, మునుపటికంటే గొప్పగా తపస్సు చేయాలని నిశ్చయించుకుని, అనుకున్న విధంగా చేయసాగాడు".



"అలా విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో, అయోధ్యలో త్రిశంకుడు అనే రాజు, దేహంతో స్వర్గానికి పోవాలని-అక్కడ స్వర్గ సుఖాలనుభవించాలని అనుకొని, వశిష్ఠుడిని పిలిచి తన కోరిక తెలిపి, దానికొరకు తనతో యాగం చేయించమని అడుగుతాడు. వశిష్ఠుడు, అది సాధ్యపడదని అనగానే, త్రిశంకుడు ఆయన్ను వదిలి దక్షిణ దిక్కుగా వశిష్ఠుడి నూర్గురు కొడుకుల వద్దకు వెళ్తాడు. కీర్తితో ప్రసిద్ధికెక్కిన అసమాన తేజోవంతులైన ఆ గురుపుత్రులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు త్రిశంకుడు. వారి శరణుజొచ్చానని, వారే తన రక్షకులని, దేహంతో స్వర్గానికి పోవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు యజ్ఞం చేయించమని అడిగితే వారి తండ్రి ఒప్పుకోనందున అవమాన పడ్డానని అంటాడు. ’గురు పుత్రులారా, మీ పాదాలపై నా శిరస్సుంచి మొక్కుతాను. పరమ తపస్వులారా నన్ను రక్షించండి. నేను ఈ దేహంతో స్వర్గానికి పోయే యాగాన్ని నాతో చేయించండి. మీ తండ్రి నేను రాజునని మరిచి-రాజుల కార్యం నెరవేర్చడం పురోహితుల ధర్మమని ఆలోచించకుండా నన్ను ధిక్కరించాడు. ఇక మీరే నాకి దిక్కు. ఇక్ష్వాకుల రాజ వంశానికి పురోహితులైన మీరే ఈ కార్యం నాతో చేయించకపోతే, మీరు పురోహితులా వుండి ఏం ప్రయోజనం’ అని వశిష్థుడి కొడుకులతో నిష్టూరంగా మాట్లాడుతాడు త్రిశంకుడు".

No comments:

Post a Comment