Tuesday, August 2, 2016

వలదు రక్షోవల్లభా! సీతన్ బలిమిని గొనిపోవ! ....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 14 వ భాగం ....అరణ్య కాండ:వనం జ్వాలా నరసింహా రావు

వలదు రక్షోవల్లభా! సీతన్ బలిమిని గొనిపోవ!
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
14 వ భాగం అరణ్య కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (01-08-2016)

రావణుడికి సీత తన వృత్తాంతాన్నంతా వివరంగా చెపుతుంది. రావణుడూ తన వృత్తాంతాన్ని చెప్పి ఆమెను దుర్భాషలాడుతాడు. సీత నిష్ఠూరాలాడుతుంది. బెదిరిస్తుంది. మరణకాలం ఆసన్నమయిందంటుంది. సీతకు తన నిజస్వరూపం చూపించి భయపెట్తాడు రావణుడు. సీత రావణుడిని నిందిస్తూ చెప్పినమాటనే మళ్లీ మళ్లీ చెపుతుండడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలిచారిలా వాసు దాసుగారు:

మత్తకోకిలము:      దుష్టచిత్తుఁ డ వజ్రహస్తుని తోయజాక్షిఁ బులోమజన్
                        భ్రష్టశీలుడ ! యాహరించి మ నంగవచ్చును గాక యు
                        త్కృష్టతేజుఁ డు రామచంద్రుని యీశ్వరిన్ ననుబోఁ టి నీ
                        కష్టవాక్యము లాడి మోక్షము కానవున్ సుధఁ ద్రావినన్ - 57

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     ఓరీ చెడ్డ మనస్సుగలవాడా ! ఇంద్రుడి భార్యను హరించైనా బ్రతకవచ్చునుగాని, రామచంద్రుడి భార్యనైన నా లాంటి దానిని, నీచవాక్యాలాడడంతో నువ్వు అమృతం తాగినా నీకు మోక్షం కలగదు. ఇక హరించితే ఏమవుతుందో తెలుసా ? మృత్యువునుండి నీకు విడుదలలేదు. మిక్కిలి మలినమైన అంతఃకరణం కలవాడివైనందునే జ్ఞానం వల్ల కలగాల్సిన మోక్షం నీకు కలగలేదని అర్థం.

సీతాదేవి మాటలను లెక్కచేయకుండా, రావణుడు ఆమెను కఠిన వాక్యాలతో దూషించుకుంటూ అపహరించుకొని పోతాడు. రథం మీద తీసుకొని పోబడుతున్న సీత పిచ్చిపట్టిన దానివలె, రామలక్ష్మణులను పేర్కొంటూ దుఃఖిస్తుంది. అలా విలపిస్తున్న సీతకు జటాయువు కనిపించడంతో, పెద్దగొంతుకతో గట్టిగా పిలుస్తుంది. పాపాత్ముడైన రావణుడు దయాహీనుడై ఎత్తుకొనిపోతున్నాడని అంటుంది. జటాయువును ఉద్దేషించి ఆమె అన్న పలుకులను "మత్తకోకిలము" వృత్తంలో ఇలా పద్యంగా రాసారు కవి:

మత్తకోకిలము:                   అన్న ! తండ్రి ! జటాయువా ! దురితాత్ముఁ డీయసురుండు న
                        న్ని న్నెఱిన్ హరియించి యేగెడి నిట్టినాదురవస్థలన్
                        విన్నవింపఁ గదయ్య యిప్పుడ వేగ మేగి సమస్త మా
                        యన్నదమ్ముల కోమహాత్మక యార్తనన్ దయఁ బ్రోవుమా -58

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     అన్నా ! తండ్రీ ! జటాయువా ! పాపాత్ముడగు ఈ రాక్షసుడు, నన్నీవిధంగా బలవంతంగా పట్టుకొనిపోతున్నాడు. యుద్ధంచేయ వలదంటివే. ఇక నేనేమి చేయగలనందువేమో ? ఇప్పుడే శీఘ్రంగా పోయి, నా కష్టస్థితిని సమస్తం రామలక్ష్మణులకు చెప్పు. మహాత్మా ! ఈ మాత్రం సహాయం చేసి ఈ దీనురాలిని రక్షించు.

సీత చేస్తున్న మొరను విన్న జటాయువు, రావణుడిని సంబోధిస్తూ, తానెవరో-తన బలం ఏమిటో, శ్రీరామచంద్రుడనగా ఏమిటో తెలియచేసి, వాడికి రాముడు చేసిన కీడేమీ లేనప్పుడు ఏ పాపం ఎరుగని రాముడి విషయంలో ఎందుకు దోషం చేస్తున్నావని-దాని వల్ల అతడికి అపాయం జరుగుతుందని హెచ్చరించాడు. ఇలా ప్రశ్నిస్తూ, మగతనం వుంటే శ్రీరాముడితో యుద్ధం చేయమంటాడు. ఈ సందర్భంలో రావణుడిని వారిస్తూ జటాయువు చేసిన హెచ్చరికను "మాలిని" వృత్తంలో పద్యంగా రాసారీవిధంగా:

మాలిని:                  వలదు వలదు రక్షో వల్లభా నీవు సీతన్
                        బలిమిని గొనిపోవం బాప మాభూపరుండున్
                        దెలిసినయెడ నిన్నున్ దృష్టిచేనే దహించున్
                        గులిశమునను వృత్రుం గూల్చు జంభారిమాడ్కిన్ - 59

ఛందస్సు:      మాలినికి న----గణాలు, తొమ్మిదో ఇంట యతి.

తాత్పర్యం:    
రాక్షసరాజా ! నువ్వు సీతను బలాత్కారంగా తీసుకొనిపోవద్దు. వలదు. అది అతి మిక్కిలి పాప కార్యం. నువ్విలా చేశావని రామచంద్రమూర్తికి తెలిస్తే, వజ్రంతో ఇంద్రుడు వృత్రుడిని వధించినట్లు చూపులతోనే నిన్ను దహించివేస్తాడు.



రావణుడిని హెచ్చరించిన జటాయువు, వాడు మగవాడైతే తనతో యుద్ధంచేయమంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నరావణాసురుడు, జటాయువుతో ఢీకొంటాడు. జటాయువు-రావణుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. యుద్ధం మధ్యలో రావణుడుని జటాయువు మరోమారు దూషిస్తాడు-పరుషోక్తులాడుతాడు. రావణుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. (పర్ణశాలకు మైలు దూరంలో వున్న జటాయువు వృక్షం దగ్గర మొదలైన వారిద్దరి మధ్య యుద్ధం, ఐదారు మైళ్ల దూరంలో వున్న దుమ్ముగూడెం వరకూ కొనసాగి, జటాయువు రెక్కలు ఖండించబడేంతవరకూ సాగుతుంది). ఇది చూసిన సీత రామలక్ష్మణుల గురించి ఆక్రోశిస్తుంది. ఇదంతా పట్టనట్లు రావణుడు సీతనెత్తుకొని పరిగిడుతుంటాడు. రామలక్ష్మణుల కొరకు పరితపిస్తూనే, సీత రావణుడుని నిందిస్తుంటుంది. శ్రీరాముడిని మోసగించిన రావణుడు లంకలోనే కాదు స్వర్గ-పాతాళాలలో దాక్కున్నా రామచంద్రమూర్తి వాడిని వధించడం తధ్యమంటుంది. సీత అలా రావణుడుని నిందిస్తున్నప్పుడు ఆమె పరిస్థితిని "కరిబృంహితము" వృత్తంలో పద్యంగా రాశారిలా:

కరిబృంహితము:      
ఇట్టు పలుకుచుఁ బెక్కువిధముల నేడ్చి కరుణము దోఁ పగాఁ
                దిట్టుచును ఘనశోక భరమున దీన యయి స్మృతి దప్పుచున్
                గట్టిగను విలపించి పొరలుచుఁ గంప మొనరఁ దపించుచో
                దిట్ట యయి యసురాధముఁ డు నృపు దేవి గొని చనె బాపియై - 60
ఛందస్సు:      "కరిబృంహితము" నకు భ-న-భ-న-ర గణాలు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం:     ఈ విధంగా పలు విధాలుగా మాట్లాడుతూ, ఏడుస్తూ, తిట్తూ, శోకాతిశయంతో దీనురాలై స్మృతి తప్పి పడితూ-గట్టిగా ఏడుస్తూ, పొర్లుతూ, దేహం వణుకు పుట్టి తపిస్తుండగా, రాక్షసాధముడు దిట్టతనంతో సీతను తీసుకొని పారిపోయాడు.

పాపాత్ముడైన రావణాసురుడు అలా తననెత్తుకొని పారిపోతుంటే, తనను కాపాడేవాడు ఒక్కడుకూడా కనిపించక పోయేసరికి తపించిపోయిన సీతాదేవికి ఒక కొండ శిఖరం మీదున్న ఐదుగురు వానరులు కనిపించారు. కనీసం వాళ్లైనా తన దుస్తితిని గురించి రాముడితో చెప్పకపోతారా అని తలపోసి సీత తన ఆభరణాలను తీసి కొంగులో ముడివేసి, వారిముందు పడేటట్లు విసురుతుంది. ఆదరబాదరగ పోతున్న రావణుడది గమనించలేదు. సుగ్రీవాదులైన ఆ వానరులు "రామ రామ" అని ఏడుస్తున్న దానిని, రావణుడెత్తుకు పోవడం గమనించి కూడా భయంతో వూరుకుంటారు. రావణుడావిధంగా సీతతో లంక చేరుకుంటాడు. సీతను నిర్భందంలో వుంచి, రాక్షస స్త్రీలను కాపలా వుంచుతాడు రావణుడు. కొంచెం సేపైన తర్వాత సీతవద్దకు పోయి రావణుడు ఆమెను బలాత్కారంగా తీసుకొని తన నగరాన్ని చూపించసాగాడు. లంకను ఏలమని, తనను వరించమని వేడుకుంటాడు. ఇద్దరం చందనం రాసుకొని, బంగారు సొమ్ములు ధరించుదామంటాడు. సీతను తానెంతగానో ప్రేమిస్తున్నానని అంటూ, "జానకీ ! నీ పాద ధూళి నా శిరస్సున ధరించుతాను" అని చెపుతాడు రావణుడు సీతతో. ఇక్కడ రెండు పద్యాలను-ఒకటి "మత్తకోకిలము" వృత్తంలో, మరొకటి "తోటకము" వృత్తంలో రాశారిలా కవి:

మత్తకోకిలము:      ఇంచుఁ బోణిరొ పుష్పకాఖ్యస మిద్ధ  మైనవిమాన మ
                        భ్యంచదర్కవిభావికాసము యక్షు నగ్రజుఁ బోర ని
                        ర్జించి తెచ్చితి హృద్య మయ్యెడఁ జేరి ఇద్దఱ మెంతయున్
                        జంచదిష్టసుఖోపభోగముఁ జాన ! పొందుచు నుందమా ! -61

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     సీతా ! పుష్పకమని ప్రసిద్ధికెక్కిన ఈ విమానం నాలుగు దిక్కులా వ్యాపించే సూర్యకాంతి లాంటి కాంతిగలది. మా అన్న కుబేరుడుని జయించి దీన్ని తెచ్చుకున్నాను. ఇది మిక్కిలి మనోజ్ఞమైంది. దీంట్లో మనిద్దరం గడియ-గడియకు మారుతున్న సుఖభోగాలను అనుభవించుదామా !

తోటకము:               అని యీగతిఁ బల్కి ద శాస్యుఁ డు దా
                జనకాత్మజ నాత్మను సంతసిలెన్
                వనితామణి దక్కెను నాకిఁ కఁ బో
                యని యంతక పాశవ శాత్మకుఁ డై -62
ఛందస్సు:      తోటకము నకు నాలుగు "స" గణాలు, తొమ్మిదో అక్షరం యతి వుంటాయి.


తాత్పర్యం:     ఈ ప్రకారం సీతతో పలికిన రావణుడు తనలో తాను, ఈ స్త్రీరత్నం తనకు దక్కిందని, యమపాశానికి వశపడ్డవాడైనందున భావించాడు.

No comments:

Post a Comment