Saturday, August 6, 2016

ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం
(నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (20-04-2016)

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. బధ్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టినరోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్షం-నవమి తిథి నాడు, పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం-కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం అయింది. వివాహం జరిగింది నవమి నాడు కాదు. యథావాల్మీకమైన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసు గారు రాసినదాన్ని బట్టి చూస్తే, సౌమ్య నామ సంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగరక్షణకు తీసుకెళ్తాడు. 27వ రోజు, అంటే, శుక్ల త్రయోదశి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతా కల్యాణం జరిగింది. మరి ఆ 27వ రోజు, నవమి అని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఎందుకు మనవాళ్లందరూ వివాహం జరిగిన తిథి నాడు కాకుండా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం జరుపుతున్నారో సామాన్యులకు అర్థంకాదు-అర్థం చేసుకొని అడగాలని కూడా ఎవరూ అనుకోరు. అలాగే ఒంటిమిట్టలో నవమి నాడు కాకుండా మరో ఐదు రోజుల తరువాత కల్యాణం జరిపించడానికి కారణం కూడా ప్రత్యేకంగా ఏదీ లేదు. ఇది దైవ కార్యం. ఎప్పుడైనా చేయొచ్చు. తిరుమలలో నిత్య కల్యాణం పచ్చ తోరణం. ప్రతి రోజు కల్యాణమే!

వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా ప్రప్రథమంగా తెనిగించిన "ఆంధ్ర వాల్మీకి-కవిసార్వభౌమ" వావిలికొలను సుబ్బరావు (వాసుదాసు) గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండలో సీతా కల్యాణ ఘట్టం అపురూపంగా వర్ణించబడింది. వివాహం పూర్వ రంగం, వివాహ ఘట్టం చదువుతుంటే ఆసక్తికరంగా వుంటుంది. స్వాయంభువ మనువు, పూర్వం, గోమతీ తీరాన వున్న నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు, మనువు దశరథుడిగా పుట్టినప్పుడు "శ్రీరాముడు" గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు "శ్రీకృష్ణుడు" గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో "శంబళ గ్రామం" లో-కలియుగంలో-నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి "కల్కి" గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవ ప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది.

దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తుండగా అగ్నిహోత్రం మధ్యనుంచి వచ్చిన ప్రాజాపత్య మూర్తి దివ్యపరమాన్నం దశరథుడికిచ్చి, నలుగురు భార్యలకు పంచమంటాడు. అలా చేస్తే దశరథుడు కోరినట్లే కొడుకులు పుట్తారని అంటాడు. ప్రాజాపత్య పురుషుడిచ్చింది భగవంతుడి తేజస్సు మనుష్య స్త్రీ గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. అందుకే, శ్రీరామాది జననాలు "రేతస్సర్గం" కారణం కాదు. వారి దేహాలు అ ప్రాకృతాలు. శుక్ల రక్త సంయోగాలవలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యం కాని, దివ్య తేజస్సుతో ఏర్పడేవాటికి స్త్ర్రీ గర్భ వసతితో పనిలేదు. ఇందు క్షేత్రం ప్రధానం కాదు-గర్భస్థజీవుడే తన తపో బలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు. వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కాని-తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు. అంటే, తల్లిదండ్రుల జాతికి, బిడ్డల జాతికి సంబంధం లేదక్కడ.

కొడుకులు కలిగేందుకు దశరథుడు పాయసం పంచితే, రాజపత్నులు సంతోషించారు. పాయసం తాగిన కౌసల్య-సుమిత్ర-కైకేయిలు గర్భాలను ధరించారు. ఆరు ఋతువుల తర్వాత, పన్నెండో నెలలో, చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య, గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్చ స్థలాల్లో (సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్చ స్థానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి రాముడిని కనింది. శ్రీరామావతారానికి ముఖ్యకారణం కౌసల్య తపః ప్రభావమేనని అనవచ్చు. ఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్ల భగవంతుడు నవమి నాడు జన్మించాడు.


విశ్వామిత్రుడి యాగం పరిసమాప్తమైన తర్వాత, మిథిలకు తీసుకెళ్లాడు వారిని. అక్కడ శివ ధనస్సును గురించి వివరించాడు. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు అవలీలగా జనక మహారాజు దగ్గరున్న శివ ధనుస్సు వింటిని అరచేత్తో పట్టుకొని, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోతుంది. ఇది చూసిన జనకుడు, సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లైందని అంటాడు  విశ్వామిత్రుడితో. "నా కూతురు వీర్య శుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయగా, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞ లేదని అంటాడు రాముడు. విశ్వామిత్రుడి ఆదేశం మేరకు, మిథిలకు రమ్మని ఆహ్వానిస్తూ, దశరథుడి దగ్గరకు దూతలను పంపాడు జనకుడు. దూతలు అందించిన వార్తను విన్న దశరథ మహారాజు వామదేవ - వశిష్ఠాదులను, మంత్రులను పిలిపించి "మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తన కూతురునిచ్చి వివాహం చేయనున్నాడు. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరూ ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు.

మర్నాడు దశరథుడు చతురంగ బలాలతో, వాసుదేవుడు-వశిష్టుడు-జాబాలి-కశ్యపుడు- మార్కండేయుడు-కాత్యాయనుడు లాంటి పెద్దలతో కలిసి బయలుదేరి ఐదవ రోజు పగటిపూట కల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు స్వాగతం పలికి, "నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది" అంటాడు. వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి. మర్నాడుదయం, జనకుడి ఆహ్వానాన్ని అందుకుని దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాకు వంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు.

వున్న జనకుడితో వశిష్టుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు. "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య" అంటూ మొదలుపెట్టి, చివరలో అంబరీషుడికి నహుషుడు, అతడికి యయాతి, అతడికి ఆభాగుడు, అతడికి అజుడు, అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు" అని సూర్యవంశ క్రమాన్ని సవివరంగా తెలియచేశాడు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులనీ, వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైందని, వీరందరు అసమాన ధర్మరతులు-వీరులనీ, సత్యమంటే ప్రీతికలవారనీ అంటూ, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలు గల తన ఇరువురు పుత్రికలను ప్రేమ పూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.

            ఇక్ష్వాకుల వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని కూడా వినిపించాడు. తమ వంశానికి పూర్వీకుడు ధర్మాత్ముడైన "నిమి" అనీ, అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడనీ, ఆయనే మొదటి జనకుడనీ, ఆ పేరే తమ వంశంలో "జనకుడు" అని రాసాగిందనీ, అదే వంశ నామం అయిందనీ అంటాడు.  మిథి కొడుకు దగ్గరనుంచి మొదలెట్టి, మహారోముడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు; హ్రస్వరోముడికి తను తన తమ్ముడు కుశధ్వజుడు కొడుకులమని వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో. ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారుల కిస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుందనీ, ఆ రోజున వివాహం చేద్దామనీ అంటాడు. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరామచంద్రమూర్తికి శుభకరమే కాని సీతకు జన్మ నక్షత్రం. అయినా గాని, తిథి-వార-నక్షత్ర దోష శాస్త్రం ప్రకారం, అభిజిత్సర్వదోషఘ్నం అయినందున, ఆ లగ్నమే మంచిది. అదే నక్షత్రంలో మొదటి పాదం తర్వాత ఆమెది కన్యారాశి అయినందున, తృతీయ ఏకాదశ రూప నక్షత్ర కూట శుద్ధి కావడంతో నక్షత్ర దోషం లేదు. అయినా, భార్యా-భర్తలిద్దరికి ఏక నాడి అయినందున వియోగ ప్రాప్తంటారు.  

ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవ శాలకు చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్టుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్టుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్టుడు జనకుడికి తెలియచేశాడు.

వశిష్టుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అన్న మాట ప్రకారం సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. అదే రీతిలో సాంప్రదాయ బద్ధంగా ఈ కల్యాణాన్ని కడప, బధ్రాచలం లాంటి పుణ్య క్షేత్రాలతో సహా ముత్తారం లాంటి కుగ్రామాలలో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం.

(ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి రామాయణం మందరం ఆధారంగా)

                                         

No comments:

Post a Comment