Saturday, August 6, 2016

కొత్త జిల్లాలు : రూపొందుతున్న చరిత్ర : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
కొత్త జిల్లాలు : రూపొందుతున్న చరిత్ర
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-05-2016)
పాలనలో జిల్లాలదే ప్రధాన భూమిక
ఆంధ్ర భూమి దినపత్రిక (11-05-2016)
వనం జ్వాలా నరసింహారావు

          అపర మేధావిగా, సంస్కర్తగా, హైదరాబాద్ రాజ్యాన్ని సుస్థిర పరిచిన వాడిగా, చరిత్ర పుటల్లోకి ఎక్కిన సాలార్జంగ్ ప్రధాన మంత్రిగా వున్న రోజుల్లో, 1865 సంవత్సరంలో "జిల్లా బందీ" విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అప్పటి హైద్రాబాద్ రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం వున్న జిల్లాల వ్యవస్థ, రెవెన్యూ పాలనా వ్యవస్థకు సాలార్జంగ్ అలా పునాదులు వేసి, ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చి శాశ్వతంగా వుండిపోయేలా చేశాడు. వీటిలో తెలుగు మాట్లాడే 8 జిల్లాలు, హైదరాబాద్ తో సహా, నేటి తెలంగాణ ప్రాంతంలో వుండేవి. దరిమిలా 1953 లో వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా వున్న ఖమ్మం వేరే జిల్లాగా ఏర్పాటైంది. జిల్లాల సంఖ్య 9 కి పెరిగింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో భాగంగా వున్న కొన్ని తాలూకాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయడంతో తెలంగాణ ప్రాంతంలో జిల్లాల సంఖ్య పదికి చేరుకుంది. ఇక అప్పటినుంచి...అంటే...గత మూడున్నర దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాల్లో నే పాలన సాగుతోంది.

          ఈ నేపధ్యంలో, 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ప్రస్తుతం వున్న పది జిల్లాల సంఖ్యను పెంచి మొత్తం 24 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి పేర్కొన్నది. అధికారం చేపట్టిన తరువాత ఆ దిశగా చర్యలు చేపట్టింది. సగటున ఒక్కో జిల్లా జనాభా కొన్ని రాష్ట్రాల మాదిరిగా మరీ ఎక్కువగా కాకుండా, మరి కొన్ని రాష్ట్రాల వలె మరీ తక్కువ కాకుండా, మధ్యే మార్గాన్ని అనుసరిస్తామని కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పడం జరిగింది. చేసిన వాగ్దానానికి అనుగుణంగానే కొత్తగా మరో 14 లేదా, 15 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. సీఎం చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం...అలానే పాలనా సౌలభ్యం కొరకు అదనంగా కొత్త జిల్లాల ఏర్పాటు మరో చారిత్రక ఘట్టం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, మరి కొన్ని కొత్త మండలాల ఏర్పాటు వల్ల కూడా పాలనా కేంద్రాలు ప్రజలకు చేరువలోకి రాబోతున్నాయి. పాలనా సంస్కరణలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయనాలి.


అనాదిగా భారత దేశంలో పరిపాలన సౌలభ్యానికి వెసులుబాటు కల్పించడంలో జిల్లాలు ముఖ్య భూమిక వహిస్తూ వస్తున్నాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందించడంతో, జిల్లాలకు ప్రాధాన్యత పెరిగి, అభివృద్ది పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మరింత కీలకమైన పాత్ర పోషించడం మొదలైంది. క్షేత్రస్థాయిలో జిల్లాలు ఒక యూనిట్ గా కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషించడం తదనుగుణంగా పరిపాలనా విధివిధానాలు బేరీజు చేసుకోవడం చాలాకాలం నుంచి అమల్లో వున్న ప్రక్రియ అని చెప్పాలి. జిల్లాల పరిపాలనా భాద్యతలు ఐఏఎస్ స్థాయి అధికారులైన జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తుంటారు. వారినే కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని సంభోదిస్తుంటారు. న్యాయపరమైన బాధ్యతలు కూడా వారి అదుపులోనే వుంటాయి. భద్రతా పరమైన అంశాలు, ఐపీఎస్ అధికారైన జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ లకు అప్పజెప్పబడతాయి. సాధారణంగా జిల్లా కలెక్టరుకు మూడు ముఖ్యమైన భాద్యతలు ఉంటాయి. ఒకటి ఆర్థిక పరమైన (రెవెన్యూ), రెండు న్యాయపరమైన, మూడు అభివృద్ధి పరమైన భాద్యతలు. భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉండి, పదిహేను లక్షల మంది కన్నా ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లాలలో అన్ని కోణాలలో దృష్టి సారించి, ప్రతీ అంశంలో ఏకాగ్రతతో విధులు నిర్వహించడం ఒక రకంగా విశ్లేషించి చూస్తే, ఆయా జిల్లాల కలెక్టర్లకు దుస్సాధ్యమే అవుతుందనాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, గ్రామ జ్యోతి, హరిత హారం, భూ సమీకరణ-కొనుగోళ్లు, దళితులకు భూపంపిణీ, జిల్లా స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పర్యవేక్షణ లాంటి వంటి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాల విస్తృతి, ప్రస్తుత పరిమాణం కన్నా తక్కువగా వుంటే సులభతరం, సుసాధ్యం అవుతుంది.

ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం అమలు దిశగా, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.  ఆ కమిటీ ప్రాధమిక స్థాయిలో వివరాలు సేకరించి, నివేదికలు రూపొందించింది. ఈ కమిటీ నివేదికలు పరిశీలించిన మేరిట ప్రస్తుత 10 జిల్లాల స్థానే అధిక సంఖ్యలో జిల్లాలు ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది. టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో  పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 24 లేదా 25 కు పెరిగే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రతీ జిల్లాకు 15 లక్షల జనాభా మించకుండా జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టడం జరిగే అవకాశం వుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం భారత దేశంలోని 29 రాష్ట్రాలలో 681 జిల్లాలున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుండాలి, ఎంత మంది జనాభాకు ఒక జిల్లా వుండాలి, ఎంత భౌగోళిక ప్రాంతం ఒక జిల్లా పరిధిలో వుండాలి, ఒక జిల్లాలో ఎన్ని శాసనసభ-లోక సభ నియోజక వర్గాలుండాలి అనే విషయంలో ఫలానా ప్రామాణికాలు వుండాలి అంటూ నిర్దేశించబడలేదు. ఆయా రాష్ట్రాల పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల సంఖ్యను ఎంచుకోవటం జరిగింది. అలాగే లోక్ సభ స్థానాల సంఖ్యకు, శాసన సభ స్థానాలకు ఎటువంటి ప్రామాణికం నిర్దేశించబడలేదు. జనాభా ప్రాతిపదికన, జిల్లాల ప్రాతిపదికన, లోక్ సభ, శాసన సభ స్థానాల ప్రాతిపదికన నిష్పత్తులను పరిశీలించినట్లయితే  ఇలాంటి వ్యత్యాసాలు స్పష్టంగా కనబడుతాయి.


రాష్ట్రాల జనాభా వాటి సంఖ్యాపరమైన వ్యత్యాసాలు గమనించినట్లయితే వైవిద్యాలు ఇట్టే కనపడతాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జనాభా 20 కోట్లు కాగా (దేశ జనాభాలో 16.49 %) సిక్కిం రాష్ట్ర జనాభా 6 లక్షలు (దేశ జనాభాలో 0.05 %). అదే విధంగా లోక్ సభ స్థానాల సభ్యలు ఉత్తర ప్రదేశ్ నుండి 80 మంది ఉండగా, సిక్కిం రాష్ట్రం నుండి కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఆశ్చర్యం కలిగించే మరో అంశం ఏంటంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి 80 పార్లమెంట్ సభ్యులకు గాను 404 అసెంబ్లీ సెగ్మెంట్లు కేటాయించబడటం, అదే సిక్కిం నుండి కేవలం ఒక్క పార్లమెంట్ సభ్యుడికి 32 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటం విశేషం. ఏ లెక్కన ఈ ఏర్పాటు జరిగిందో తెలియదు. అలానే, వివిధ రాష్ట్రాల్లోని లోక్ సభ - అసెంబ్లీ సెగ్మెంట్ల నిష్పత్తుల్లోని వైవిధ్యాలు గమనిస్తే: ఉత్తర ప్రదేశ్ లో  ఒక్క లోక్ సభ స్థానానికి ఐదుగురు ఎమ్మెల్యేలుండగా, నాగాలాండ్ లో ఒక్క ఎంపీ నియోజకవర్గ పరిధిలో అరవై మంది శాసనసభ సభ్యులున్నారు. ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్ సభ సెగ్మెంట్లకు 404 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపి, మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 412 కాగా లోక్ సభ సెగ్మెంట్లు 13 మాత్రమే!. ఏవిధంగా ఇది న్యాయబద్ధమో తెలియదు. అవగతం కాని ప్రశ్న. ఈశాన్య రాష్ట్రాలలో నిష్పత్తి తేడాలు పరిశీలించినట్లయితే ఉత్తర ప్రదేశ్ 1:5 కాగా, ఉత్తరా ఖండ్, జమ్మూ కాశ్మీర్ ల నిష్పత్తి 1:14. ఎక్కువ శాతం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ నిష్పత్తి 1:7 గా ఉండటం విశేషం. జిల్లాల సంఖ్య నిర్ణయంలో కాని, ఆయా లోక్ సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయంలో కానీ సరైన ప్రామాణికాలను పాటించక పోవడం గమనించాల్సిన అంశం.

          వివిధ రాష్ట్రాలలోని జిల్లాల సంఖ్యను తెలంగాణ రాష్ట్రం లోని జిల్లాల సంఖ్యతో పోల్చిచూసినట్లయితే చాలా తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం 68 లక్షల జనాభాకు 12 జిల్లాలు ఉండటం, నలుగురు లోక్ సభ సభ్యులు, 68 మంది శాసనసభ సభ్యులు ప్రాతినిథ్యం వహించటం విశేషం. ఉత్తరా ఖండ్ లో కోటి జనాభాకు గాను 13 జిల్లాలు, 5 గురు లోక్ సభ సభ్యులు, 70 మంది శాసన సభ సభ్యులున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కోటి 25 లక్షల జనాభాకు గాను 22 జిల్లాలు, 6 గురు లోక్ సభ సభ్యులు, 89 మంది శాసన సభ సభ్యులున్నారు. హర్యానా రాష్ట్రంలో 2.53 కోట్ల జనాభాకు 21 జిల్లాలు, 10 మంది లోక్ సభ సభ్యులు, 90 మంది శాసన సభ సభ్యులున్నారు. అలాగే చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో 2.55 కోట్ల జనాభా వుండగా, 27 జిల్లాలు, 11 మంది లోక్ సభ సభ్యులు, 91 మంది శాసన సభ సభ్యులున్నారు. పంజాబ్ రాష్ట్రంలో 2.77 కోట్ల జనాభాకు 22 జిల్లాలు, 13 మంది లోక్ సభ  సభ్యులు, 117 మంది శాసన సభ సభ్యులున్నారు. అస్సాం రాష్ట్రంలో 3.12 కోట్ల జనాభాకు 32 జిల్లాలు, 14 మంది లోక్ సభ  సభ్యులు, 126 మంది శాసన సభ సభ్యులున్నారు. జార్ఖండ్ రాష్ట్రం లో 3.29 కోట్ల జనాభాకు 24 జిల్లాలు, 14 మంది లోక్ సభ సభ్యలు, 81 మంది శాసన సభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

          ఈ లెక్కన చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో 3.53 కోట్ల మంది జనాభాకు కేవలం 10 జిల్లాలు, 17 మంది పార్లమెంట్ సభ్యులు, 119 మంది శాసన సభ సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైన పేర్కొన్న ఎనిమిది రాష్ట్రాలతో పోల్చిచూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ, శాసన సభ స్థానాలతో సహా, జిల్లాల సంఖ్య కూడా తక్కువగా వుండటం గమనించాల్సిన విషయం. అత్యంత చిన్న రాష్ట్రాలయిన అరుణాచల్ ప్రదేశ్ లో సైతం 14 లక్షల జనాభాకు 19 జిల్లాలు, నాగాలాండ్ లో 20 లక్షల జనాభాకు 11 జిల్లాలు, మేఘాలయ రాష్ట్రంలో 29 లక్షల జనాభాకు 11 జిల్లాలు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల విషయానికొస్తే, మధ్య ప్రదేశ్ లో 28 లోక్ సభ సెగ్మెంట్లకు 51 జిల్లాలు; ఒడిస్సా రాష్ట్రంలో21 లోక్ సభ సెగ్మెంట్లకు 30 జిల్లాలు; రాజస్థాన్ లో 25 లోక్ సభ స్థానాలకు 33 జిల్లాలు; కర్ణాటకలో 28 లోక్ సభ సెగ్మెంట్లకు 30 జిల్లాలు; గుజరాత్ లో 26 లోక్ సభ సెగ్మెంట్లకు 33 జిల్లాలున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 80 లోక్ సభ సెగ్మెంట్లకు 75 జిల్లాలు; బీహార్ లో 40 లోక్ సభ సెగ్మెంట్లకు 38 జిల్లాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో లోక్ సభ సెగ్మెంట్ల సంఖ్యకు ఇంచు మించు సరి సమానంగా జిల్లాల సంఖ్య ఉండటం గమనార్హం. కాగా మహారాష్ట్రలో 48 లోక్ సభ సెగ్మెంట్లకు గాను 36 జిల్లాలు, పశ్చిమ బెంగాల్ లో 42 లోక్ సభ సెగ్మెంట్లకు గాను 20 జిల్లాలు, తమిళనాడులో 39 లోక్ సభ సెగ్మెంట్లకు 32 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ సెగ్మెంట్లకు 13 జిల్లాలు, కేరళ రాష్ట్రంలో 20 లోక్ సభ సెగ్మెంట్లకు 14 జిల్లాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి 10 జిల్లాలు, 17 లోక్ సభ సెగ్మెంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం మీద ఈ ఆరు రాష్ట్రాల్లో జనాభాకు సంబంధం లేకుండా తక్కువ సంఖ్యలో జిల్లాలు, లోక్ సభ సెగ్మెంట్ల సంఖ్య ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా చిన్న దేశాల మేనేజ్‌మెంట్ తేలిక అనే విషయం అవగత మౌతున్న నేపధ్యంలో మన రాష్ట్రంలో కూడా జిల్లాలు చిన్నవిగా వుండడం సమంజసం.


ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యతో పాటు, మండలాలను, రెవెన్యూ డివిజన్‌లను, అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యను ...వీలున్నప్పుడు లోక్ సభ స్థానాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విధంగా మార్పు రావటం జరిగితే ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాల పరంపరలో మరో మైలురాయి అదిగమించినట్లు అవుతుంది. మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది. End

No comments:

Post a Comment