Saturday, August 6, 2016

ఆంధ్ర వాల్మీకి రామాయణం ఛందః ప్రయోగ మందిరం : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
ఆంధ్ర వాల్మీకి రామాయణం ఛందః ప్రయోగ మందిరం
వనం జ్వాలా నరసింహారావు 
సూర్య దినపత్రిక (13-04-2016)
                                              
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన సొంత-స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో-ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందః యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.

            ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము" , "పంచ చామరం" , "కవిరాజ విరాజితము" , "తరలము" , "ప్రహరణకలిత" , "సుగంధి" , "ఉత్సాహం" , "మనోహరిణి" , "వనమయూరము" , "తోటకము" , "మానిని" , "ఇంద్రవంశము" , "లయగ్రాహి" , "తోదకము" , "మాలిని", "కలితాంతము" , "మధురగతిరగడ" , "వనమంజరి" , "కమల విలసితము" , "వసంతమంజరి" , "మంజుభాషిణి" , "స్రగ్ధర" , "వసంతతిలక" , "మాలి" , "కరిబృంహితము" , “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మందాక్రాంత" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందః యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.

            వేదాంగాల్లో పద్య లక్షణాలను తెలియచేసే ఛందస్సు ఒక భాగం. పద్యం ఎలా రాయాలి, ఏ ఏ లక్షణాలతో ఎటువంటి పద్యాలుంటాయి, ఆ పద్యాలు రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్శాస్త్రం. ఛందస్సు పరమేశ్వరుడి నుండి పరంపరగా భూలోకానికి వచ్చిందంటారు. పద్యాలతో కవిత్వం చెప్పదల్చుకున్న రచయిత మదిలో పుట్టిన భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొంది, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక లయలాగా సాగడాన్ని ఛందస్సు అనవచ్చు. పద్యం ఒక నియమానుసారం "పాదాలు" గా విభజించబడతాయి. ఆ పాదాలు "గణాల" మీద ఆధారపడతాయి. గణాలు వాటి స్వభావాన్ని బట్టి-స్వరూపాన్ని బట్టి రకరకాలుగా నియంత్రించ బడ్డాయి. గణాల కలయిక వల్ల ఏర్పడిన పాదాలన్నీ కలిసి పద్యంగా ఏర్పడుతుంది. భాషలో వున్న అక్షరాల స్వరూప-స్వభావాలను బట్టి ఛందశ్శాస్త్రంలో "గురువు"-"లఘువు" లని వ్యవహరించబడతాయి. గురు-లఘువుల కూడికే గణాలు అంటారు. గురువు-లఘువు ఎలా ఏర్పడతాయి, ఏ ఏ అక్షరాలు గురువు-లఘువులుగా గుర్తించ వచ్చో ఛందస్సుతో కవిత్వం రాసే వారందరికీ తెలుసు. అలానే సూర్య గణాలనీ, ఇంద్ర గణాలనీ, చంద్ర గణాలనీ కూడా వుంటాయి.

షట్ శాస్త్రాలలో "ఛందస్సు" వేదాలను నడిపించేది. "ఛందౌపాదౌతు వేదశ్చ" అని శాస్త్రం. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో వాజ్మయ శరీరానికి గురు-లఘువులు అలాంటివి. ఛందస్సు ప్రాచీన మానవ పరిణిత మేధా సృష్టి! వేల యేండ్ల చరిత్ర గల ఛందశ్శాస్త్రం ఈనాడు సుప్త చేతనావస్త లో ఉంది. దీన్ని వెలికి తీసి ప్రచారం చెయ్యక పోవడం దేశ ద్రోహం కన్నా పెద్ద నేరం! మహా కవులకు కవిత్వం ముందుగా దర్శనమిస్తుంది. అదే ఛందస్సులో ప్రవేశిస్తుంది. మామూలు కవులు ముందుగా ఛందస్సును వేసుకుని దాని కింద అక్షరాలు, పదాలు పేరుస్తూ, వారివారి అదృష్టం మేరకు కవిత్వం అందులోకి ప్రవేశిస్తుంది. అందుకే, కవి ఛందశ్శాస్త్రవేత్తగా మారితే మహా కావ్యాలు సృష్టిస్తాడు. ఛందశ్శాస్త్రవేత్త కవిగా మారితే పద్య కవిగా మిగుల్తాడు.

            పద్య లక్షణాలలో ముఖ్యమయినవి "యతి-ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. దీన్ని ప్రతి పద్యానికి దాని స్వభావాన్ని బట్టి, ప్రతిపాదానికి ఏర్పాటుచేయడం జరుగుతుంది. ప్రతిపాదానికి మొదటి అక్షరమైన యతి, తిరిగి ఆయా పద్యాల్లో పేర్కొన్న స్థలాల్లో చెప్పాలని ఛందస్సు శాస్త్రం చెప్తుంది. యతికి పర్యాయ పదాలు కూడా వున్నాయి. పద్యపాదంలో మొదటి అక్షరం యతి అవుతే, రెండవ అక్షరం ప్రాస అవుతుంది. యతి-ప్రాసలకు వున్న నియమాలన్నీ పద్యకవిత్వం చెప్పేవారు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. పద్యంలో వున్న మొదటి అక్షరంతో (యతి) సమానమైన అక్షరాన్ని నియమించిన స్థానంలో నిలపడం కుదరనప్పుడు, ప్రాసగా వున్న రెండవ అక్షరాన్ని యతి స్థానం పక్కన వచ్చే విధంగా చేస్తే దాన్ని "ప్రాస యతి" అంటారు. ప్రాస యతిని వాడేటప్పుడు కూడా నియమ-నిబంధనలుంటాయి.

            ఇలా గణాలను, యతి-ప్రాసలను, ప్రాస యతులను నియమబద్ధంగా వాడుతూ పద్యకవిత్వం చెపుతారు కవులు. పద్యాల్లో వృత్తాలని, జాతులని, ఉప జాతులని వుంటాయి. ఛందః బద్దమై, యతి ప్రాసలు కలిగివుండి, సాధారణంగా నాలుగు పాదాలుంటే పద్యమంటారు. అక్షర గణాలతో ఏర్పడేవి వృత్తాలు. మనందరికీ బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటివి వృత్తాలు. తెలియనివీ, విననివీ ఎన్నో వున్నాయి. వృత్తాల్లో కూడా భేదాలున్నాయి. జాతులంటే కందం, ద్విపద, మంజరీ ద్విపద, తరువోజ, ఉత్సాహం, అక్కరలు, రగడలు లాంటివి. ఇందులో అందరికి తెలిసింది కందం. ఉప జాతుల్లో తేటగీతి, ఆటవెలది, సీసం లాంటి పద్యాలున్నాయి.

తెలుగు సాహిత్యంలో పద్య ప్రసూనాలమీద పరిశోధించి, వెయ్యేళ్ల పద్యం పొదుపుకున్న సాహిత్య ప్రక్రియలో భాగంగా, గత శతాబ్ది కాలంలో పద్య కవితలోని వస్తు వైవిధ్యాన్ని ఆవిష్కరించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు చెందిన, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వాహక అధికారి శ్రీ. కె.వి.రమణాచారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేస్తున్నారు. ఆయన పరిశోధనలో ఛందః ప్రయోగాల మీద ప్రయోగ వైవిధ్యం గురించి కూడా పేర్కొన్నారు. కొందరు కవుల రచనల్లోని పద్యాలు, అందరూ రాసే వృత్తాల్లో కాకుండా విభిన్న రీతిలో వుండే విషయాన్ని ప్రస్తావించారు. బూర్గుల రంగనాథ రావు గారు వాడిన మత్తకోకిలము గురించి, తిరుమల కృష్ణదేశికాచార్యులు గారి వసంత కోకిల-పరభృతము-నయాగరా-మనోరమా-ప్రభావతి వృత్తాల గురించి వివరించారు రమణగారు. కందతుల్య, సీసతుల్య, భాస్కరవిలసితం, సర్వలఘుసీసం లాంటి వృత్తాలను ఉటంకిస్తూ తాటిమాను నారాయణరెడ్డి శేషప్రభ కావ్యం గురించి ప్రస్తావించారు. వీ.ఎల్.ఎస్ భీమశంకరం గారు తన ప్రభందంలో సాక్షాత్కరించిన ఛందో విశ్వరూప ప్రదర్శనం మరి ఏ సమకాలిక తెలుగు కావ్యంలో కనిపించలేదని కూడా రమణ గారు రాసారు తన పరిశోధనలో. ఉదాహరణలుగా విలాసిని, కైవల్యం, సుగతి, విభావరి, ద్విపదతుల్య లను పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన రసస్రువు కావ్యంలోని అరుదైన ఛందస్సులైన వంశస్థ వృత్తం, అశ్వగతి, మేధిని, విజయమంగళ, భ్రమర లను కూడా రమణగారు ఉదహరించారు. రాళ్లబండి కవితా ప్రసాద్ రచనల్లోని విశ్వనాథ వృత్తం, భ్రమరకూజితం గురించిన ప్రస్తావన కూడా వుంది.

"శ్రీమద్రామాయణ కల్పవృక్షము" లో, విశ్వనాధ సత్యనారాయణ గారు ఉపయోగించిన వృత్తాల్లో అరుదుగా వాడే ఛందః ప్రక్రియలు ధారాళంగా వాడారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే: అంతరాక్కఱ, అజిత ప్రతాపము, అపరాజితము, అల్పాక్కఱ, అశ్వలలితము, అశ్వవిలసితము, కవిరాజ విరాజితము, ఉత్సాహము, ఇంద్రవంశము, ఇంద్రవజ్రము, అసంబాధ, అష్టమూర్తి, సుగంధి, వసంత తిలకము, లయగ్రాహి, మాలిని, మానిని, మత్తకోకిల, మంజుభాషిణి, మంగళమహాశ్రీ, భుజంగప్రయాతము, భాస్కరవిలసితము, ప్రహరణకలిత, పద్మనాభము, పంచచామరము, ద్విపద, దృతవిలంబితము, తోదకము, తోటకము, తరలము, చిత్రపదము లాంటివెన్నో వున్నాయి.

ఈ దశాబ్దంలో-ఆ మాటకొస్తే ఏ దశాబ్దంలోనైనా, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, కంద, తేటగీతి, ఆటవెలది, సీస పద్యాలు అందరూ రాస్తూనే వున్నారు. విభిన్నమైన వృత్తాలను ఉపయోగించి ప్రప్రధమంగా వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథా వాల్మీకంగా తెనిగించిన వాసు దాసుగారు చేసిన ఛందః ప్రయోగాలు బహుశా తెలుగు పద్య కవిత్వంలో అరుదైన విషయమేమో. విమర్శకులకే వదిలేద్దాం ఆ విషయాన్ని.

            అందరు కవులు తమ రచనల్లో ఉపయోగించినా-ఉపయోగించకున్నా, చాలామంది కవులకు పరిచయమున్న వృత్తాలలో: ఉత్పలమాల, చంపకమాల, మత్తేభ విక్రీడితము, శార్దూల విక్రీడితము, ఇంద్ర వజ్రము, ఉపేంద్ర వజ్ర, భుజంగ ప్రయాతము, తోటకం, మాలినీ, పంచ చామరం, మత్తకోకిల, తరళము, మేఘవిస్ఫూర్జితం, భూతిలకం, స్రగ్ధరా వృత్తం, మానినీ, మహా స్రగ్ధర, కవిరాజ విరాజితం, క్రౌంచ పదం, మంగళ మహాశ్రీ, లయగ్రాహి, దండకం లాంటివెన్నో వున్నాయి. ఇవికాక ఇంకెన్నో వున్నాయి. అందరు కవులకూ అన్ని వృత్తాలలో పద్యాలు రాసే సామర్థ్యం వుండకపోవచ్చు. అలాగే జాతుల్లోనూ, ఉప జాతుల్లోనూ పేర్కొనబడిన వాటన్నిటినీ కవులందరూ వాడాలని లేదు. అవసరం, సామర్థ్యం, సందర్భం వుండాలి.

            ఈ నేపధ్యంలో తెలుగు సాహిత్యాన్ని పవిత్రం చేసిన మహర్షి, మహా కవి, ఆంధ్ర వాల్మీకి శ్రీ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన రచించిన శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మహాకావ్యం "మందరం". వాల్మీకి 24000 శ్లోకాలలో రామాయణం రచిస్తే, ఆంధ్ర వాల్మీకి  24000 పైచిలుకు తెలుగు పద్యాలలో రచించారు ఆంధ్ర వాల్మీకాన్ని. ఆంధ్ర వాల్మీకికి అనంతమైన ఛందస్సులు అద్భుతంగా దర్శనమిచ్చాయి. ధర్మార్థకామమోక్షాలను సత్వరం లభింపచేసేది రామాయణం. పఠనం, శ్రవణం, ప్రవచనం, రచనం, దృశ్యీకరణం, శబ్దీకరణం, చర్చ....ఇలా ఏ రూపంలోనైనా రామాయణాన్ని అనుష్టిస్తే ధర్మార్థ కామమోక్షాలు కరతలామాలకాలౌతాయి.


వావిలికొలను సుబ్బారావు గారి చందః ప్రయోగాలలో మచ్చుకు కొన్ని...వాల్మీకి కోకిల తమసా నదిలో స్నానానికి వెళుతున్న సందర్భంలో వాసు దాసు గారు "మత్తకోకిల" రచించారు. వాల్మీకికి బ్రహ్మ ప్రత్యక్షమైన సందర్భంలో సృష్టికర్తకు "పంచ చామరం" తో సేవించారు. దశరథ మహారాజు ఋష్య శృంగుని వద్దకు వెళ్లే సందర్భంలో ఆరాజగమనానికి సరిపోయే "ప్రహరణ కలిత" వృత్తాన్ని తీసుకున్నారు. ఇలా కథ గమనానికి అనుగుణంగా వాసు దాస మహాకవి ప్రయోగించిన ఛందస్సులన్నింటినీ ఒక చోట చదవడం అవసరమని భావించి అవన్నీ సంకలనం చేశాను నేను. వాసు దాసు గారు కావ్యాంతంలో "సుగంధి" వృత్తంలో కాండలో ఎన్ని పద్యాలున్నాయో రహస్యంగా చెప్పారు. ఆయనే ఆ రహస్యాన్ని కూడా పాఠకులకు తెలియచేశారు. అదే ఇది:

          సుగంధి:       రామ చంద్ర గోత్ర చంద్ర రమ్యపద్య గేయమా
                        నామలోత్తర ప్రచార యాదిదేవ శ్రీహరీ
                        రామ యొంటిమిట్టధామ రాజకన్య కాలస
                        ద్వామభాగ దివ్యభోగ వాసు దాససేవథీ

          ఇందు తొలి రెండు పాదాలలో ఈ కాండలో (ఉత్తర) 1713 పద్యాలున్నాయన్న రహస్యముంది. రామ అంటే 3, చంద్ర అంటే 1, గోత్ర అంటే 7, చంద్ర అంటే 1."అంకానాం వమతో గతిః" సూత్రం ప్రకారం వెనుకనుండి వేస్తే 1713 పద్యం సంఖ్య వస్తుంది

వాసుదాసు గారి శైలి అర్థం చేసుకోవడానికి మచ్చుతునక…..రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకానికి ఆయన చేసిన తెలుగు అనువాదం. వాల్మీకి కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ సమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు. క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి. సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:

"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసు దాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసు దాసుగారు. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయి. పాదానికి 13 అక్షరాలు. సాంఖ్య శాస్త్రం ప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "" కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠస్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "" కారాన్ని బోధిస్తుంది." నీక" అనేది "" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "" కారాన్ని బోధిస్తుంది.

వాసు దాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడాఅనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో. ఇవన్నీ, వివరంగా వాసు దాసుగారు తన మందరంలో తెలియచేశారు.

ఛందశ్శాస్త్రం కనుమరుగై పోతుందన్న భయావహమైన ప్రస్తుత స్థితిలో సంప్రదాయ ప్రియులకు ఉపయోగకరంగా వుంటుందన్న ఆశతో, ఒక ప్రయత్నంగా, ఒక్కో కాండలో వాసు దాసుగారు చేసిన చందః ప్రయోగాలను క్రోడీకరించి ఒక పుస్తకంగా తయారు చేయడం జరిగింది. వాసు దాసుగారు తన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో చేసిన ఛందః ప్రయోగాలమీద, పాఠకులు తమ పరిశోధనాత్మక దృష్టిసారించి, ఈ తరం వారికి-భావి తరాల వారికి ఆ మహానుభావుడి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆశతో ఈ వ్యాసం రాయడం జరిగింది. బహుశా, తెలుగు సాహిత్యంలో విశేష ఛందస్సులు రచించిన ఇటీవలి కవులందరిపైనా ఇలాంటి పరిశోధన జరగాలని నా అభిప్రాయం.  End


1 comment: