Monday, August 8, 2016

తెలంగాణ నాటి నుంచి నేటి వరకు : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
తెలంగాణ నాటి నుంచి నేటి వరకు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (02-06-2016)

          1766 నుండి నైజాం పరిపాలన కింద వున్న తెలుగు ప్రాంతానికే తెలంగాణ అన్న పేరొచ్చింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు ఒకనాడు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల పాలన తెలంగాణలో స్వర్ణయుగం నాలి. అప్పుడే వ్యవసాయానికి నీటి పారుదలకు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. గొలుసు కట్టు చెరువులు కూడా వారి హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్య స్థాపకుడు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అప్పట్లో దాని పేరు భాగ్యనగరం. సుబేదారుగా వున్న నిజాముల్ ముల్క్ స్వతంత్రం ప్రకటించుకుని ఆసఫ్ జాహీ వంశ పాలనకు శ్రీకారం చుట్టాడు. ఏడవ రాజైన నిజాం ఉస్మాన్ మీర్ అలీఖాన్ తో ఆసఫ్ జాహీ వంశం అంతరించింది.

          సాలార్ జంగ్ సంస్కరణలో భాగంగా, ప్రస్తుతం వున్న జిల్లాల వ్యవస్థ, రెవెన్యూ పాలనా వ్యవస్థ, జిల్లా బందీ విధానం వచ్చింది. హైదరాబాద్ తో కలుపుకుని తెలుగు మాట్లాడే ఎనిమిది (దరిమిలా అవే పది జిల్లాలయ్యాయి) జిల్లాలను ఒక ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అదే ఇప్పటి తెలంగాణ రాష్ట్రం. సాలార్ జంగ్ నిజాం రాజులను ఒప్పించి కృష్ణా నదికి వెళ్లే వరదలను సముద్రం పాలు కాకుండా నివారించడానికి డిండి, మూసి, పాలేరు, వైరా జలాశయాలను కట్టించాడు. ఇప్పటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును మొదటగా ఆలోచించి డిజైన్ చేసి, నిర్మాణానికి ప్రయత్నం ఆయన కాలంలోనే జరిగింది. అలాగే, హైదరాబాద్ నగరానికి వరదలు తెచ్చే ప్రాంతంలోని నీటిని నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ శక్తి వ్యవస్థ నెలకొల్పారు. వీటి నిర్మాణంలో అలీ నవాజ్ జంగ్ కృషి వుంది. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజీ, ఆసిఫియా గ్రంధాలయం ఏర్పాటయ్యాయి. పోలీసు చర్య తదనంతరం ఆంధ్ర ప్రాంత అధికారుల పెత్తనం పెరిగిపోయింది. కమ్యూనిస్టుల సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. 1950 లో పౌర ప్రభుత్వం ఏర్పాటై, ఎం కే వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యారు. 1952 ఎన్నికల వరకు బూర్గుల రామకృష్ణారావుకు మంత్రి పదవిలో వున్నారు. 1952 లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పాటైంది.

          1952 నాటి ముల్కీ ఆందోళనలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ వూపందుకుంది. తెలంగాణలే గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం, రిమిలా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా డిమాండ్ చరిత్రలో భాగాలు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటై, అందులో తెలంగాణ విలీనమైంది. పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. కాకపోతే అది కాగితాలకే పరిమితమై పోయింది. అంతటితో ఆగకుండా, తెలంగాణ ప్రాజెక్టులను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల రీ డిజైన్ చేసింది. అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. వనరులు దోపిడీ చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రాంతం వారే ఉద్యోగాలు దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం విడిపోతే తప్ప న్యాయం జరుగదనే భావన సర్వత్రా కలిగింది. 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. కొంతకాలం తరువాత అనేక కారణాల వల్ల అప్పట్లో ఉద్యమం రాష్ట్ర ఏర్పాటయ్యే వరకు కొనసాగలేకపోయింది. తెలంగాణకు సంబంధించిన నిధులు, నీళ్లు, నియామకాల్లో అన్యాయం జరుగుతూనే వచ్చింది.

          ఈ నేపధ్యంలో, విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా, తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవులకు రాజీనామా చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టారు. సుదీర్ఘంగా పదమూడేళ్ల పాటు సాగిన ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ పార్టీలతో సహా, జాతీయ పార్టీ నాయకుల మద్దతు కూడగట్టారు కేసీఆర్. 2009 నవంబర్ 29న లో కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాన ఉద్యమంలో ఒక కీలకమైన మలుపు. తెలంగాణ ప్రజల సమిష్టి పోరాట ఫలితంగా డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి వెనక్కు తగ్గింది. తెలంగాణ సమాజం ఉద్యమాన్ని తీవ్రతరం చేసి, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి వెన్నో చేపట్టి తెలంగాన సాధన దిశగా ముందుకు సాగింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన విభజన చట్టం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది. జూన్ 2, 2016 , 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం కావడం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.

            బంగారు తెలంగాణ సాధన దిశగా తెలంగాణ ముందుకు సాగింది. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే, టీఆరెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాగ్దానాల అమలు దిశగా, పరేడ్ మైదానంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ భవిష్యత్ కార్యక్రమాన్ని, ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వారంలోపల, ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతోందీ, ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేయబోతోందీ, వాటి అమలుకు ప్రభుత్వం రూపొందించుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక ఏంటీ, అన్న విషయంలో స్పష్టమైన అవగాహనతో, ఆలోచనతో ముందుకు సాగుతూ, వాగ్దానాల అమలు దిశగా వడివడిగా అడుగులు వేసింది కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం.

ఇక అప్పటినుంచి...ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలన్నీ అమలు జరుగుతున్నాయి. ాన్నింటి కన్నా ముఖ్యంగా, రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి వేసే దిశగా వ్యూహం రూపొందించడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు కాసాగాయి. కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ పాలన కూడా ఉద్యమ పథంలోనే జరగ సాగింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి తలమానికమయ్యేలా సుపరి పాలన అన్ని రంగాల్లో చోటు చేసుకుంది. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం దొరికింది. ఈ వర్గాల కోసం ఏటేటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ప్రతి పేద కుటుంబానికి 120 గజాల స్థలంలో రెండు పడకగదులు, వంటగది, హాలు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న ఇల్లు కట్టింఛేంకు ప్రణాళిక సిద్ధమైంది. అమలు కూడా మొదలైంది. ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఇప్పటికే రెండి విదతల పంట రుణాల మాఫీ అయింది. మూడో విడతకు బడ్జెట్ కేటాయింపులు అయ్యాయి. "సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా" గా తెలంగాణ అవతరించనుంది. వ్యవసాయ విద్యాలయాల విస్తృతం, వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహంఫార్మా, పౌల్ట్రీ రంగాలు మరింత పురోగమనంచక్కటి పారిశ్రామిక విధానం....ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన అమలు జరిగాయి. అధికారంలోకి వచ్చిన అచిరకాలంలోనే నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, కోతల్లేని తెలంగాణ అన్న పేరు తెచ్చుకుంది. మూడేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నది. వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ....ఇలా ఎన్నో..ఎన్నెన్నో అమలు చేస్తున్నది ప్రభుత్వం.

అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పన-అమలు దేశంలో ఎక్కడ లేని విధంగా జరుగుతోందిక్కడ. ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, మైనారిటీలు, ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందీ ప్రభుత్వం. సంక్షేమ రంగానికి అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నది రాష్ట్రం తెలంగాణ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్...ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, దారిద్ర్య రేఖకు దిగువన వున్న ఇతర వర్గాల ఆడపిల్ల పెళ్లికి 51 వేల రూపాయల ఆర్థిక సాయం....దాదాపు లక్ష మందికి లాభం చేకూరింది. ఆసరా పెన్షన్లు....వృద్దులు, వికలాంగులు, వితంతువులతో పాటు కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులకు లబ్ది కలిగింది. దాదాపు 36 లక్షల మందికి లాభం చేకూరింది. పేదలకు వారి ఆత్మ గౌరవం కాపాడే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు....2015-16 సంవత్సరంలో 66 వేల డబుల్ బెడ్ రూముల మంజూరు.... 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల బెడ్ రూములు..... ఐడి హెచ్ కాలనీలో నిర్మించిన ఇండ్లు దేశ వ్యాప్త ప్రశంసలను అందుకుంటున్నాయి.

          అలాగే, కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం...ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 250 రాబోతున్నాయి. కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా మొదటి అడుగు అట్టడుగు వర్గాల నుంచే ప్రారంభం కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు సన్న బియ్యం…. ప్రతీ పేద వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తుఉనది ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ...2,860 కుటుంబాలకు, 7,485 ఎకరాల భూ పంపిణీ....ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు...అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్....ప్రభుత్వం అమలు చేస్తున్న మరికొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు.

          ఉద్యోగులకు 43% పీఆర్సీ అమలుతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్, టిఎస్పిఎస్సీ ఏర్పాటు,  సింగరేణి కార్మికులకు చేయూత అందింది. ఆర్టీసీ ని ఆదుకుంది ప్రభుత్వం. ఆ సణ్స్థ ఉద్యోగుల జీతాలు కూడా పెంచింది. విద్యుత్ ఉద్యోగులకు 27.5 శాతం ఫిట్ మెంట్, ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు, విద్యుత్ ఉద్యోగులకు పీ.ఆర్.పి., కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ వేతనాలు పెంపు, సకల జనుల సమ్మె కాలం ప్రత్యేక సెలవు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు, పదవీ విరమణ చేసిన వారికి ఒకే సారి బెనిఫిట్స్, ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్, ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భత్యం, హోంగార్డుల జీతాలు 9 వేల నుండి 12 వేలకు పెంపు, పవర్ లూమ్ కార్మికుల రుణాలు మాఫీ, హమాలీల రేట్లు పెంపు, గీత, మత్స్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద భీమా, ఫీజు రీఎంబర్స్ మెంట్, పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్స్, ఆటోలు, ట్రాక్టర్ల పై టాక్స్ రద్దు, అమర వీరుల కుటుంబాల సంక్షేమం, బ్రాహ్మణ పరిషత్….ఇలా మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నది ప్రభుత్వం.


            సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులను, దెబ్బతిన్న వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, పునరుద్ధరించడానికి పటిష్ఠమైన ప్రణాళిక వేసి అమలు చేస్తున్నదీ ప్రభుత్వం. చెరువులకు పూర్వ కళ రాసాగింది. తెలంగాణలోని 46,300 చెరువుల్లో ఐదేళ్ల కాలంలో ఏడాదికి 9,060 చెరువుల చొప్పున పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికి 9000 చెరువుల పూడికతీత, మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు లభించాయి. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1318 టిఎంసి లకు అదనంగా మరో 150 టిఎంసిలకు పైగా మిగులు జలాలు లభించే అవకాశం వుంది. ఐనా, సమైక్య పాలనలో అంతర్రాష్ట్ర వివాదాలుండేవి. అందుకే, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు శ్రీకారం చుట్టిందీ ప్రభుత్వం. శాస్త్రీయం అధ్యయనం చేసి ప్రాజెక్టుల రీ-డిజైన్ అవసరం వున్న చోట చేసింది. తద్వారా, కోటి ఎకరాలను  సాగునీరు అందనుంది. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందికు మిషన్ భగీరథను చేపట్తింది. ప్రతీ ఇంటిలో నల్లా ద్వారా మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం అమలు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. అని ధైర్యంగా, ఆత్మ విస్వాసంతొ చెప్పారు సీఎం. కొద్ది రోజుల్లోనే పది నియోజకవర్గాలకు, అంటే ఈ ఏడాది చివరికి ఆరు వేల గ్రామాలకు, 12 పట్టణాలకు మంచినీరు రాబోతోంది. 2017 చివరి నాటికి 95 శాతానికి పైగా గ్రామాలు, పట్టణాలకు నీరొస్తుంది. బడ్జెట్ తో సంబంధం లేకుండానే మిషన్ భగీరథకు నిధుల సమీకరణ జరిగింది. ఈ పథకానికీ పలువురి ప్రశంసలు, మన్ననలు లభించాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో వున్నాయి...మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ, అత్యుత్తమ సింగిల్ విండో పారిశ్రామిక విధానం అమలు, భారీగా పెట్టుబడులు-ఉపాధి అవకాశాలు, ఐటీ లో దేశంలోనే ప్రధమ స్థానం పొందే దిశగా రాష్ట్రం, బలోపేతం కానున్న సర్కారు ఆరోగ్య-వైద్యం, నూతన రాష్ట్ర-జాతీయ రహదారుల ఏర్పాటు, విశ్వనగరంగా భాగ్యనగరం, సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలపై ప్రత్యెక శ్రద్ధ...లాంటివి వున్నాయి.

ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలు దిశగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేయడంతో పాటు, చెప్పనివెన్నో కూడా, ప్రజల బహుళార్థ సంక్షేమం-అభివృద్ధిని దృష్టిలో వుంచుకుని రూపొందించి అమలు చేస్తున్నదీ ప్రభుత్వం. ప్రజలకు ఈ ప్రభుత్వం పైన నమ్మకం, అభిమానం, విశ్వాసం వుందనడానికి నిదర్శనంగా అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నకల ఫలితాలను తీసుకోవాలి. ప్రజా క్షేత్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుపు ప్రభుత్వంలో వున్న పార్టీదే. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్య క్రమం ప్రజల సంక్షేమానికేననేది తిరుగులేని సత్యం. ప్రతి పథకం ఈ రోజున దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రశంసలను అందుకుంటున్నది. ఎన్నో రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆవార్డులందుతున్నాయి. ఏ తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలందరూ పోరాడారో...ఏ తెలంగాణ పోరాట ఫలితంగా సాకారమైందో...ఏ తెలంగాణాలో ప్రతి వ్యక్తీ సుఖ శాంతులతో జీవించాలని కోరుకుంటున్నాడో....ఏ తెలంగాణాలో ప్రతి వ్యక్తీ తన అవసరాలు తీరాలని భావిస్తున్నాడో..... ఏ తెలంగాణలో గతంలో జరిగిన దోపిడీకి తావులేకుండా పోతుందో..... ఏ తెలంగాణాలో బంగరు భవితకు బాటలు పడాల్నో...ఆ తెలంగాణాలో మనం వున్నాం ఇప్పుడు. తెలంగాణ ధనిక రాష్ట్రం. ఇక్కడి వనరులు ఇప్పుడు ఇక్కడివారికే. మన నిధులు మనవే. మన ఉద్యోగాలు మనవే. మన సాగు నీరు మనదే. మరో రెండు మూడేండ్లలో మనం రూపొందించుకున్న ప్రాజెక్టులు, పథకాలు, కార్యక్రమాలు ఫలితాలను ఇవ్వడం మొదలవుతుంది. మన రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆదాయం, రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందుతుంది. రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. జాతి పునర్నిర్మాణంలో మనవంతు పాత్ర పోషిస్తాం. మన కలలు పండుతాయి. End


No comments:

Post a Comment