Saturday, August 6, 2016

నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ

(Recovered and Reloaded)
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ

తెలంగాణ రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్-రీ డిజైన్ చేసి చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర శాసనసభలో 31-03-2016 న చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వివరాలు…..

భగవంతుడు ఎలా మనసు కలిగించాడో తెల్వదుగానీ కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు కట్టారు. ఇట్లా 75వేల పైచిలుకు చెరువులు తెలంగాణలోని మేజర్ గ్రామాల్లో నిర్మించారు. ప్రతి చెరువు కట్టమీద పోచమ్మో మైసమ్మో గుడి దాని ముందు కాకతీయ రెడ్డిరాజుల శిలాశాసనాలు కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అసఫ్‌జాహీలు ఇంకో అడుగు ముందుకేశారు. 1956 నాటికే 20 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

తెలంగాణ సాగునీటి కథ రాసుకుంటే రామాయణమంత.. వింటే భారతమంత. కాకతీయ రాజులు, కులీకుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు నిర్మించిన చెరువులు ధ్వంసమయ్యాయి. అప్పర్‌మానేర్, కోయిల్‌సాగర్, ఎస్సెల్బీసీ వట్టిపోయాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, కరెంటు కోతలు, బిల్లుల మోతలతో రైతు బతుకు దుర్భరంగా మారింది. తెలంగాణ బతుకు ఆ రోజు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి.

ఎవరెన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించి తీరుతాం. తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వవలిసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం ఆ దిశగా మా ప్రస్థానం కొనసాగుతుంది. దీనిని ఆపాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల భ్రమే. తెలంగాణ ఉద్యమం మొయిన్ ట్యాగ్‌లైన్ నిధులు, నియామకాలు.. నీళ్లు. రాష్ట్రం ఏర్పడింది కనుక రెండు ఇప్పటికే సాధించుకున్నాం. కావాల్సింది నీళ్ల సమస్యకు పరిష్కారంగతం, వర్తమానం , భవిష్యత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు:

దాదాపు మూడు గంటలపాటు ఏకధాటిగా ముఖ్యమంత్రి విడమర్చిన తీరుతో.. తెలంగాణ మాగాణం కోటి ఎకరాల్లో పసిడి పంటలు పండించనున్న భావి దృశ్యం గోచరించింది!

ఎవరెన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వవలిసిన బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందని, ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం ఆ దిశగా తమ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. దాన్ని ఎవరూ ఆపలేరు. ఆపుతమనుకుంటే అది వాళ్ల భ్రమ తప్ప ఇంకోటి కాదు అని కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లు కోటి ఎకరాలకు నీళ్లు రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తెచ్చి తీరుతం. నా తెలంగాణ కోటి ఎకరాల వీణ కావాలి.

ప్రాణం పోయినా సరే... రాజీ పడకుండా నీళ్లు తెస్తం అని సీఎం తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చారు. ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ ఐదేండ్లలో పూర్తి చేసి రైతన్నల కన్నీరు తుడిచి ఆకుపచ్చ తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గురువారం శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆవిష్కరించిన కేసీఆర్...సాగునీటిరంగం చరిత్రనుంచి ప్రారంభించి, సమైక్య పాలకుల ద్రోహాలు, తాజా ప్రాజెక్టుల పరిస్థితి, తెలంగాణ సర్కారు రీ డిజైనింగ్ ద్వారా ఏం సాధించనుంది... అనే అంశాలపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఇదీ... తెలంగాణ గోస...
తెలంగాణ వ్యవసాయం సాగునీటి కథ రాసుకుంటే రామయణమంత.. వింటే భారతమంత. ఒకసారి పాత విషయాలను కొంచెం నెమరు వేసుకుంటే 2001లో ఆనాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ ప్రజల దుస్థితి దుర్భరంగా ఉంది. వర్ష పాతం తగ్గిపోవడం, కరువులు రావడం, వలసలు పెరగడం జరిగింది. కాకతీయ రాజులు, కులీకుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు నిర్మించిన చెరువులు ధ్వంసమయ్యాయి. అప్పర్‌మానేర్, కోయిల్ సాగర్, ఎస్‌ఎల్‌బీసీ వట్టిపోయాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, కరెంటు కోతలు, విద్యుత్ బిల్లుల మోతలతో రైతుల బతుకు దుర్భరంగా మారింది. తెలంగాణ బతుకు ఆ రోజు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. మహబూబ్‌నగర్ నుంచి 15-20 లక్షల మంది పొట్ట చేత బట్టుకుని దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగినా పనిచేసే దుస్థితి. ఆనాటి ప్రభుత్వంలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నా. మంత్రిగా కూడా అదే ప్రభుత్వంలో పనిచేశా. కరెంటు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తే క్యాబినెట్ మంత్రిగా 1.45 గంటలపాటు వ్యతిరేకించిన. ఎందుకో ఏమో నాటి సీఎం సీనియర్లను సంప్రదించకుండా విద్యుత్ చార్జీలు పెంచారు. నా నిరసనను వ్యక్తం చేస్తూ అది తెలంగాణ ప్రజలకు ఉరిశిక్ష అని బహిరంగ లేఖ రాసిన. కరెంటు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వివిధ సంస్థలు చలో అసెంబ్లీ జరిపితే బషీర్‌బాగులో కాల్పులు జరిగాయి. ఇద్దరు ముగ్గురు బలిఅయ్యారు. ఇక తెలంగాణ ప్రాంతం సమైక్య రాష్ట్రంలో న్యాయాన్ని పొందజాలదని గుర్తించి నా పదవులకు రాజీనామా చేశాను. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినం. ఏప్రిల్ 21, 2001న జై తెలంగాణ నినాదం ఎగిసిపడింది. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, అనేక మంది మేధావులు కలిసి పనిచేసినం. చాలామంది అపహాస్యం చేశారు. ఒడిదొడుకులు సృష్టించారు. సుదీర్ఘపోరాటంలో 36పార్టీలు తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. ఆత్మబలిదానాల మధ్య చివరికి 2014, జూన్ 2 తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అనంతరం సాధారణ ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమాన్ని అగ్రభాగాన నిలిచి, రాష్ట్రాన్ని సాధించినందుకు, ఈ రాష్ర్టాన్ని మీరే చక్కదిద్దాలని, మంచి చెడులు చూడాలని టీఆర్‌ఎస్ పార్టీ చేతుల్లో ప్రజలు ప్రభుత్వాన్ని పెట్టారు.

నిధులు, నియామకాలు సాధించుకున్నాం... నీళ్లే మిగిలాయి
తెలంగాణ ఉద్యమం మొయిన్ ట్యాగ్‌లైన్ నిధులు, నీళ్లు, నియామకాలు. వీటిలో రెండింటిని ఇప్పటికే సాధించుకున్నాం. నిధులు మన పరిధిలోనే ఉంటాయి కనుక అవి మన ప్రజల వికాసం కోసం ఖర్చు అవుతాయి. నియమకాలు కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం కనుక అన్ని రాష్ర్టాల మాదిరిగానే ఉద్యోగాలు ఇక్కడి యువకులకే దక్కుతాయి. ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. ఈ టర్మ్‌లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పరిష్కారం కావాల్సింది నీళ్ల సమస్య. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు మన ముందు పెడుతున్న సమస్య నీళ్లు. ఖమ్మం పోయినా.. నిజామాబాద్ పోయినా అదే ప్రశ్న. తాగునీరు, సాగునీరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు, వ్యవసాయ ఆధారిత జీవితం గడుపుతున్న వారు తెలంగాణకు నీళ్లు ఎప్పుడు వస్తాయి.. ఎలా వస్తాయని ఎంతో ఆసక్తిగా అడుగుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిశ్రమలు, ఐటీ, సంక్షేమం, అత్యంత ప్రాధాన్యమైన ఇరిగేషన్‌లో మన విధానం ఎలా ఉండాలనేది సాకల్యంగా సమీక్ష చేశాం.

2001 నాటి స్థితి
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001లో ఈ ప్రాంతం మీద పూర్తి వివక్ష కనిపించేది. జూరాల ప్రాజెకును పూర్తిగా నింపుకునే పరిస్థితి లేదు. కర్నాటక భూములు మునిగిపోతే వారికి పరిహారం ఇవ్వకపోవడంతో వారు అడ్డుకున్నారు. మనమే పోరాటం చేసి పరిహారం చెల్లించేలా చేసినం. ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద అధికార పార్టీ సభ్యులే బాంబులు పెట్టి తూములు పేల్చారు. ఆర్డీఎస్ అన్యాయాన్ని ఎత్తి చూపేతందుకు అలంపూర్ నుంచి గద్వాల్‌కు పాదయాత్ర చేసిన. ఇదే శాసనసభలో నాటి సీఎంను నేనే ప్రశ్నించిన.. నాగార్జునసాగర్‌కు రెండు కాల్వలుంటే ఆంధ్రాకున్న కుడికాల్వల లిఫ్టులు ప్రభుత్వం నిర్వహించి తెలంగాణకు ఉన్న ఎడమ కాల్వల కరెంటు బిల్లు, నిర్వహణ రైతుల మీద ఎందుకు పెట్టారని నిలదీసినం. ప్రభుత్వం రియలైజ్ అయి జీవో మార్చింది.
అలాంటి పరిస్థితిలో తెలంగాణకు న్యాయంగా నీళ్లు ఎట్ల వస్తాయి. నా కార్ డ్రైవర్ పేరు బాలయ్య. ఆయనది సిద్దిపేట. 30-35 ఏండ్లు నా వద్ద డ్రైవర్‌గా ఉన్నారు. నేను కృష్ణా లేదా గోదావరి దాటే టూర్ అంటే చాలు వెంట రూపాయి బిల్లలు పెట్టుకుని వచ్చేది. రూపాయి బిల్లు నదిలో వేసి నమస్కరించడం తెలంగాణ సంప్రదాయం. ఎక్కడ గోదావరి వచ్చినా కృష్ణా వచ్చిన ఆగి నేను రూపాయి బిల్లలు వేసేవాడిని. కృష్ణా, గోదావరిలో నేను వేసినన్ని నాణాలు ఎవరు వేసి ఉండరు. ఈ విషయం అదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్యకర్తలకు, పోలీసులకు కూడా తెలుసు. తల్లి గోదావరి.. మా బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు ఎప్పుడు మార్చుతావు అనే దండం పెట్టి ఎన్నోసార్లు వేడుకున్న.

అంతా కుట్రలే..
చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత జల విధానంపై సమీక్షిస్తే బయటపడ్డ విషయాలు దారుణం. తెలంగాణ ప్రాజెక్టులంటే అంతరాష్ట్ర వివాదాల్లో పెడతారు. అలాంటి ప్రాజెక్టు ఇచ్చంపల్లి. బీజేపీ నాయకులు, నేటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే లక్ష్మణ్, ఇతర నాయకులు గోదావరి జలయాత్ర కూడా చేశారు. అంతరాష్ట్ర వివాదం పేరుతో దీనిని చేపట్టలేదు. అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుపోయేలా చేయడం ఒక ఎత్తుగడ అయితే, పర్యావరణ నెపంతో ఆపడం రెండో ఎత్తుగడ. వన్యప్రాణుల పేరుతో ఆపడం ఇంకో ఎత్తుగడ. 2001లో ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ 2ను అనుమతులు లేవని పెండింగ్‌లో పెట్టారు. టీఆర్ఎస్ పెట్టిన తరువాత దానిపై పోరాటం చేస్తే ఆనాటి ప్రభుత్వం ఉరుకులు పరుగులతో దాన్ని పూర్తిచేశారు. టీఆర్ఎస్ వచ్చి గగ్గోలు పెట్టిన తరువాతే అంతో ఇంతో పని జరిగింది. కాగితాల మీద, ఫైళ్లమీద తెలంగాణకు నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో సమైక్య రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు నీటి కేటాయింపులు చేశాయి. దీనిపై మేం సుప్రీంలో కొట్లాడుతున్నాం. ఇదేమాసంలో ట్రిబ్యునల్ వద్ద వాదనలున్నాయి. గోదావరిలో 954టీఎంసీల నీళ్లు ఆనాటి ప్రభుత్వాలే కేటాయించి, సీడబ్ల్యుసీ అనుమతులు తెచ్చారు. కృష్ణాలో 299టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు చూపారు. కల్వకుర్తి, నెట్టెంపాడుకు మిగులు జలాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా కృష్ణాలో 37 6టీఎంసీలు కేటాయించారు. 259 టీఎంసీలు మైనర్ గిరిగేషన్‌లో రెండు నదులపై చూపారు. ఇందలో 170 టీఎంసీలు గోదావరిలో, 89 టీఎంసీలు కృష్ణాలో చూపారు. మీడియం, మేజర్ ఇరిగేషన్‌లో 1071 టీఎంసీలు కేటాయించినట్లు చూపారు. తెలంగాణలో అడవులు, పట్టణాలు, ఇతరాలు పోను వ్యవసాయం చేసుకునే భూమి 1.65కోట్ల ఎకరాలు ఉంది. ఇంకో లెక్క ప్రకారం 1.11కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేలింది. 1071టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయిస్తే కోటిఎకరాల పైచిలుకు భూమి ఎందుకు పారదు?”

భయంకర దగా దుమ్ముగూడెం టెయిల్‌ పాండ్
మనది కానటువంటి, మనకు పనికిరాని భయంకరమైన దగా ప్రాజెక్టు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్. వాళ్లు చెప్పేది ఒకటి. ముసుగులో ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా 1060 టీఎంసీల గోదావరిజలాల్ని టెయిల్‌పాండ్‌లో పోస్తరు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మంకు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను బంద్ పెడతరు. అంటే ఉన్న హక్కును తెలంగాణ కోల్పోవాలి. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను బంద్‌పెట్టి, టెయిల్‌పాండ్ ద్వారా వచ్చే నీటిని లిఫ్టు చేసి పాలేరులో పోసుకొని పారించుకోవాలి. దటీజ్ దుమ్ముగూడెం టెయిల్‌పాండ్. అది తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్టు కాదు. ఈప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో 4500 ఎకరాల అటవీ, 16వేల ఎకరాల రైతుల సాగు భూమిని కోల్పోవాలి. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ద్వారా ఖమ్మం జిల్లాకు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను వదులుకొని లిఫ్టు ద్వారా కరెంటు బిల్లులు కట్టుకొని నీళ్లు తీసుకోవాలె. మరి ఈ ప్రాజెక్టును ఉంచాల్నా? తీసేయాల్నా?”

450 బాబ్లీలు కట్టారు..
ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటే... మనకో పెద్ద ఉత్పాతం వచ్చి పడింది. కొంతమంది నాయకులు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కడుతుండ్రంటూ గొడవ పెట్టినరు. చెప్తే భయానకం.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రెండూ ప్రమాదంలో ఉన్నయి. కృష్ణా, గోదావరి నదులపై మహారాష్ట్ర కర్ణాటకలు 450 బాబ్లీలను నిర్మించినవి. ఫలితంగా 35 ఏండ్ల చరిత్రలో ఒక చుక్క నీరు రాకుండా సింగూరు ఎండిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఒక్క చుక్క నీరు రాలేదు. మరి ఏం చేయాలి? ఎట్ల ముందుకుపోవాలి? ఎట్ల నీళ్లు తెచ్చుకోవాలి? గతంలో సీఎం మాత్రమే హెలిక్యాప్టర్‌లో తిరిగేవాళ్లు. కానీ మూడు హెలిక్యాప్టర్లను అందుబాటులో ఉంచి మంత్రి హరీశ్‌రావు, సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో రెండు హెలిక్యాప్టర్ల ద్వారా కృష్ణా, గోదావరి బేసిన్లలో మొత్తం తిప్పి పరిశీలన చేయించినం. అనేక విషయాలు అధ్యయనం, అవగాహన చేసుకున్న తర్వాత స్థిరమైన నిర్ణయం ఎట్ల తీసుకుంటే తెలంగాణ బాగుపడతది? ఏ పద్ధతుల్లో చేస్తే ప్రాజెక్టులు సత్వరం పూర్తవుతయి? అని మేం ప్రయత్నిస్తుంటే. దానిని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. మరి వాళ్లు ఎందుకు అట్ల చేస్తున్నరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఆ జిల్లాకు చెందిన నేతలే పిల్ వేసినరు. అయినా హైకోర్టు అది రాంగ్ అని కామెంట్ చేసి... తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది... ప్రాజెక్టు కట్టుకోండి... గోహెడ్ అని చెప్పింది. ఇలా కొంతమంది ప్రజల్ని కన్ఫ్యూజన్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నరు.

ఇది కిన్నెరసాని కుట్ర..
తెలంగాణ మీద జరిగిన కుట్రలు చెప్తే నమ్మలేకుండ ఉంటయి. అదే కిన్నెరసాని కుట్ర. ఈ ప్రాజెక్టును 1960 లో చేపట్టినరు. ఇదే సభలో నేనున్న. ఈ ప్రాజెక్టు ద్వారా తమకు 10-15వేల ఎకరాలకు సాగునీరు వస్తదని కిన్నెరసాని కింద ఉన్న ఆదివాసీలు ఆశపడినరు. కానీ అప్పటి మంత్రి విద్యాధర్‌రావు.. అది కేటీపీఎస్ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు తప్ప సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదన్నరు. ఎందుకు? ఇక్కడ పొంగిపొర్లే నీళ్లు ధవళేశ్వరం పోవాలని, కేటీపీఎస్ ఉత్పత్తి ద్వారా జనరేటెడ్ వాటర్ కిందకు పోవాలని. దానికోసం కిన్నెరసాని ప్రాజెక్టును మానవ సంచారంలేని జోన్‌లోకి పెట్టారు. 1996-99లో దీనిని వైల్డ్‌లైఫ్ సాంక్చురీ కింద గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఎక్కడన్నా వన్యప్రాణి కేంద్రం అంటే ఎకో జోన్ 100, 200 మీటర్లు లేకుంటే కిలోమీటర్ ఉంటది. కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతాన్ని ఎకో జోన్ కింద 10 కిలోమీటర్లగా డిక్లేర్ చేసినరు. అంటే ఆ పరిధిలో మానవ సంచారం ఉండొద్దు. రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెం ప్రాజెక్టు కాలువను కూడా అక్కడినుంచి ప్రతిపాదించారు. అక్కడినుంచి కాలువ 40 కిలోమీటర్లు పోవాలె. అందులో వన్యప్రాణి సంరక్షణ కింద 28 కిలోమీటర్లు అడవుల్లో నుంచి, 18 కిలోమీటర్లు ఈ వన్యప్రాణి ప్రాంతంలో నుంచి ఉంటది. అంటే పర్మిషన్లు రావు. ఇట్ల సమైక్య పాలనలో తెలంగాణకు చేసిన ప్రాజెక్టులంటేనే అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టడం.. లేకుంటే పర్యావరణ పంచాయితీ పెట్టడం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కాంట్రాక్టరుకు రూ.1050 కోట్ల ఎస్కలేషన్ ఇచ్చింది. సివిల్ వర్క్స్ కాకుండానే పైపులు మాత్రం కొన్నారు. అంటే రిజర్వాయర్ పనులు, ఇన్‌టేక్ పనులు మొదలే కావు. ఎవరి కమీషన్ వాళ్లు తీసుకుని దాచుకున్నరు..ప్రాజెక్టు పక్కన పడింది.

పూర్ణా నదిపైనా అదే పరిస్థితి...
మహారాష్ట్ర ఒక్క నదినీ వదల్లేదు. పూర్ణా నది(ఇదీ గోదావరికి ఉపనది.) మీద కూడా ఇదే పరిస్థితి. నల్ల నల్ల మార్కులున్నవి... మీడియం, మేజర్ ప్రాజెక్టులు. ఒక్కటికాదు...పూర్ణ, ప్రవర, ముంబ. కృష్ణా, భీమా, పంచగంగ... అన్నీ కలిసి... 450 వరకు బ్యారేజీలు నిర్మించినరు. ఇవన్నీ వివరాలు కేంద్ర జల సంఘంలో ఉండవు. సంవత్సరాల తరబడి కట్టుకుంటూ పోయినరు. ఇప్పుడు మనం అక్కడ పోయి పేచీలు పెడితే రక్తపాతాలు తప్ప పరిష్కారం కావు.

1300 టీఎంసీలు ట్యాప్ చేస్తున్న ఎగువ రాష్ర్టాలు..
ఇక నాసిక్.. దాని పక్కన త్రయంబకం. అక్కడే గోదావరి పుడుతుంది. పక్కన నది ప్రవర దాని ఉపనది. దాని ఉప నదులు.. ఎక్కడ చూసినా... ఎక్కడ తెరిచినా... సిరీస్ ఆఫ్ బ్యారేజీలు. ఒకటికొకటి షేక్‌హ్యాండ్ ఇచ్చుకునేటట్లు బ్యారేజీలు నిర్మించినరు. ఒక బ్యారేజీ నీళ్లు ఇంకో బ్యారేజీకి తగులుతయి. అట్ల నది ఎప్పుడూ లైవ్(ఎండిపోకుండా)గా ఉంటది. ఇవన్నీ వాస్తవాలు. గూగుల్ ద్వారా చూస్తే సభ్యులకు అవగాహన ఉంటదని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కోసం అనుమతి కోరాం. విషయం అర్థం కావాలని ప్రజంటేషన్ తప్ప ఇందుల వేరే ఉద్దేశం కాదు. మహారాష్ట్రలో మన నాగార్జునసాగర్‌లాంటి ప్రాజెక్టు నార్త్‌సాగర్ అంటే మనం జైక్వాడ్ అంటం. దీని సామర్థ్యం 102 టీఎంసీలు. అంటే నాసిక్‌నుంచి మొదలుకుని ఉపనదులనుంచి వచ్చే నీరు అక్కడ చెరువులు కుంటలు నిండి మైనర్, మీడియం, మేజర్ అన్నీ నిండి... ఆ తర్వాత నదీ మార్గంలోని బ్యారేజీలు నిండిన తర్వాత వచ్చే నీళ్లు జైక్వాడ్‌కు చేరుతయ్. అక్కడ 102 టీఎంసీలు నిండి.. అప్పటికీ వర్షం కురిస్తే తప్ప మనకు నీళ్లు రావు. అందుకే ఈ ఏడాది మంజీరా, ఎస్సారెస్పీ, శ్రీశైలంలకు చుక్కరాలేదు. ఇక బాబ్లీ.. ఇది గోదావరి మీద మహారాష్ట్ర కట్టిన ఆఖరి బ్యారేజీ. చూస్తే ఇక్కడ కూడా నది లైవ్‌గా ఉంటది. అంటే నాసిక్‌నుంచి మొదలు పెట్టి బాబ్లీ దాకా ఇదే స్థితి.

ఎస్సారెస్పీ నీళ్లు ఇక రావు..
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆశించిన తెలంగాణ ఇవ్వాలి. ఇక ముందు ఎస్సారెస్పీ నీళ్లు రావు. ఆశలు అడుగంటినవి. పైవన్నీ నిండి.. దేవుడు కరుణించి భారీ వర్షాలొస్తే మనకు నీళొస్తయి. సింగూరు ఎండిపోయినది ప్రత్యక్షంగా ఈ సంవత్సరం మనం చూస్తున్నం. గోదావరి నీళ్లు తెచ్చుకోకుంటే హైదరాబాద్ బతుకుతుండెనా? హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీర పూర్తిగ ఎండిపోయినయి. గోదావరి నీళ్లు వచ్చినవి కాబట్టి హైదరాబాద్‌ను కాపాడుకుంటున్నం. ఇలాంటి విపత్కర పరిస్థితి. ఈ సందర్భంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవాలంటే రీడిజైనింగ్ చేయాలా? వద్దా? పై రాష్ర్టాలు ఇట్లా ఏండ్ల నుంచి ఇన్ని బ్యారేజీలు కట్టుకుంటూ పోతుంటే ఆ నాటి సీఎం ఏం చేశారు? విజనరీ సీఎంలని చెప్పుకుంటరు. తెలంగాణ వాళ్లకు పరిపాలన రాదన్నరు. 450 బ్యారేజీలకు సరాసరి 3 టీఎంసీలు లెక్క వేసుకున్నా 1300 టీఎంసీలు పైన ఆపుకుంటున్నరు. మరి తెలంగాణను ఎవరు కాపాడాలి? సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం వస్తదా? కేంద్ర జల సంఘం వస్తదా? ఇప్పుడు ఎవరిని తిడితే ఏం లాభం? మంజీరాపైన మహారాష్ట్ర, కింద కర్ణాటక... బ్యారేజీలను ఎవరికివారు కట్టుకుంటే మరికొన్ని సంయుక్తంగా కూడా కట్టుకున్నరు. ఇలా ఇష్టమొచ్చిన రీతిలో కట్టుకున్నరు.
తెలంగాణ బార్డర్ ఆనుకుని బ్యారేజీలు...
మహారాష్ట్ర, కర్ణాటకలు ఎంత భయంకరంగా బ్యారేజీలు కట్టుకున్నరంటే.. మనకు రెండు చిన్న ప్రాజెక్టులున్నయి. ఒకటి మెదక్ జిల్లాలోని నల్లవరం, రెండోది కౌలాస్ నాలా. ఇది నిజామాబాద్‌లో ఉంది. ఒక్క టీఎంసీ ప్రాజెక్టు. జుక్కల్ నియోజకవర్గంలో 6-7వేల ఎకరాలకు నీళ్లొస్తయి. ఈ ప్రాజెక్టు నెత్తిమీదనే. మహారాష్ట్ర రెండు బ్యారేజీలు కట్టుకుంది. మన తెలంగాణ బార్డర్‌కు ఆనించి కట్టుకున్నరు. అందుకే మనం ప్రమాదకర పరిస్థితుల్లోకి పోతున్నం. కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా బ్యారేజీలు కట్టుకున్నవి. బ్యారేజీ కట్టడం.. దాని పక్కన లిఫ్టులు పెట్టుకోవడం. అందుకే అక్కడ నది లైవ్‌గా ఉంటది. బ్యారేజీ టు బ్యారేజీ. వాళ్లు అదృష్టవంతులు. అందుకే అట్ల చేసుకున్నరు. లెక్క తీస్తే 450 బ్యారేజీలు. పరిశోధిస్తే ఇవి దొరికినవి. ఏ అధికారులు ఇచ్చినవి కావు. అడిగితే ఇయ్యను కూడా ఇవ్వరు. గూగుల్ మ్యాపులు పరిశోధించి పట్టుకున్నవి. ఈ విధంగా కృష్ణా, గోదావరి, వీటన్నింటిపైనా బ్యారేజీలు కట్టిన మూలంగా దుర్భర పరిస్థితి నెలకొంది.

ధవళేశ్వరం నీళ్ల కోసం సమైక్య కుట్రలు..
ఇక ఖమ్మం జిల్లా. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకున్నవి. ఏపీలో కలిసిన ఏడు మండలాలు గతంలో తెలంగాణలో ఉండేవి. అప్పట్లో రుద్రమకోట అనే ప్రాంతంలో ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్,ఇన్‌టేక్ లెవల్ పాయింట్ పెట్టారు. ఇపుడు అవి ఏపీలోకి పోయినయి. నీళ్లు కావాలంటే అక్కడ పంపుహౌజ్ పెట్టి నీళ్లు తెచ్చుకోవాలె. అదంతా ఆంధ్రప్రదేశ్‌లోకి పోయిన దరిమిలా నీళ్లు తెచ్చుకోలేం. అది మన చేతుల ఉండదు. మరి ఈ ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేయాలా? వద్దా? తెలంగాణకు నీళ్లు రావాలి... అది ఎట్ల?”

పెనుగంగపైనే 80-100 టీఎంసీల స్టోరేజీ...
గూగుల్ మ్యాప్‌ను చూపిస్తూ..పచ్చ మార్కు తెలంగాణ రాష్ట్ర పరిధి. పక్కకు కనిపించే రెడ్‌మార్కులు ప్రమాదకరమైనవి. పెన్‌గంగ(గోదావరి ఉపనది)తో ప్రారంభిస్తున్న. 31బ్యారేజీలు కట్టారు.. మరో 9 నిర్మాణంలో ఉన్నవి. పెనుగంగపై ఉన్న ఈ బ్యారేజీల వివరాలు కేంద్ర జల సంఘంలో ఉండవు. మహారాష్ట్ర ఎప్పుడు ఎవరు అడిగినా, ఇతర రాష్ర్టాలు, కేంద్ర జల సంఘం అడిగినా ఒకే సమాధానం చెప్తది. అదేందంటే... మాకు కేటాయించిన నీళ్ల పరిమితలోనే ఉన్నం అంటరేగానీ ఈ వివరాలు సమర్పించరు. అసలు ఏంది కథ అని ఒక సందర్భంలో రాత్రి 2-3 గంటల వరకు నేను వ్యక్తిగతంగా, సహాయకులతో గూగుల్ మ్యాపులు అంగుళం అంగుళం పరిశోధన చేసి తీసిన సమాచారం ఇది. గూగుల్ మ్యాపుల ద్వారా వందల గంటలు శ్రమించి ఈ వివరాలు తెలుసుకున్నం. ఈ కట్టిన బ్యారేజీలన్నీ షేక్ హ్యాండ్ బ్యారేజీలు(ఒక బ్యారేజీ నుంచి రెండో బ్యారేజీదాక నిండుగా నీళ్లు ఉంటాయి. కింది బ్యారేజీ నీరు పై బ్యారేజీని తాకుతూ ఉంటుంది.) మ్యాప్‌లో కనిపించే రెడ్ మార్కువన్నీ బ్యారేజీలే. వీటి ఫలితం ఏమిటి? పెన్‌గంగ నుంచి ప్రవాహం ద్వారా మనకు వస్తయనుకున్న నీళ్లు రావు. ఈ 40 బ్యారేజీలు ఒక్కోటి 1, 2, 3 టీఎంసీల సామర్థ్యం సరాసరి 2-2.5 టీఎంసీలు అనుకున్నా 80-100 టీఎంసీల నీళ్లు బ్యారేజీల దగ్గర ఆగుతయి. అంటే అక్కడ భారీ వర్షాలు పడి వారి చెరువులు నిండాలి. ఉపనదులు, వాగులు వంకలు దాటి మీడియం ప్రాజెక్టులు నిండాలి. అవన్నీ సర్‌ప్లస్ కావాలి. ఆతర్వాత ప్రవహించి మేజర్ ప్రాజెక్టులు నిండాలి. మళ్లీ వర్షాలు కురవాలి. బ్యారేజీలు నిండాలి. ఆతర్వాత మళ్లీ వర్షం కురిస్తే మనకు నీళ్లు. లేకుంటే రావు. అది ఈ బ్యారేజీల వల్ల పరిణామం. రెడ్ మార్కు ఉన్న చోట్ల బ్యారేజీలున్నాయి. దానికి ముందు లిప్టులు. ఇట్లా ప్రతిచోటా కట్టినరు. బ్యారేజీలు కట్టే అవకాశంలేని చోట కూడా డైరెక్ట్‌గా లిఫ్టు పెట్టుకున్నరు. ఇదీ పరిస్థితి.

దేవాదుల గాథ ఇది..
దేవాదుల ప్రాజెక్టు. రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. ఇది లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు. 2001లో జై తెలంగాణ నినాదం ఎగిసిన తర్వాత వరంగల్‌లో బహిరంగ సభ పెట్టిన తర్వాత ఆనాటి సీఎం తాపీ మేస్త్రీని హెలికాప్టర్ల తీసుకొనిపోయి పునాది రాయి వేసి... 50 టీఎంసీల నీళ్లు కేటాయించినరు. 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తం. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అది 2001. ఇపుడు 2016. పది సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ ఉండె. ఇక్కడ 175 రోజులు పంప్‌హౌజ్ ద్వారా నీళ్లు తీసుకోవాలి. ఒక్క చెక్‌డ్యాం కూడా లేదు. గోదావరి అటు ఉంటే పంపుహౌస్ ఇటు ఉంటది. ఈ విధంగా ఎవరైనా ప్రాజెక్టులు కడతరా? చెక్‌డ్యాం కట్టాలని నేను అడిగితే.. చాలా రోజుల తర్వాత కంతనపల్లిలో పెట్టారు. 85-86 మీటర్ల లెవల్ పెట్టినారు. అక్కడ మళ్లీ చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ముంపు ప్రాబ్లం. 11,500 ఎకరాలు కంతనపల్లి దగ్గర గిరిజనుల భూమలు కూడామునుగుతాయి. నేను స్వయంగా అక్కడికి పోయిన. అక్కడ ప్రజా సంఘాలతో, ఆదివాసి నాయకులతో మాట్లాడిన. మేమే మునగాల్నా అని వారంటారు. అక్కడా అంతర్రాష్ట్ర వివాదం. యథావిథిగా నీళ్లు ధవళేశ్వరం పోవాలి. ఏ ప్రాజెక్టు చూసిన ఇదే పద్ధతి. ఇపుడ దేవాదులను రక్షించుకోవాలి.. వరంగల్ జిల్లాకు నీళ్లు తెచ్చుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌తో వివాదం లేకుండా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాల మధ్య తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నాం. ఇక్కడ రెండువైపులా తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది. 11,500 ఆదివాసీల భూముల ముంపు లేకుండా పొలాలకు నీళ్లు పారుతాయి. ఇది ప్రజలకు నష్టమా..? తెలంగాణకు ప్రమాదమా? సభ్యులు చెప్పాలి.

ఎందుకు పారిపోయారో జవాబు చెప్పాలి...
దురదృష్టం.. ఒక జాతీయ పార్టీగా చెప్పుకునే ప్రధాన ప్రతిపక్షం సభ నుంచి ఎందుకు పారిపోయిందో అర్థం కాదు. ఏ బేషజాల కోసం, ఎవరి క్షేమం కోరి, ఏం ఆశించి... సభ నుంచి పారిపోయినరో జవాబు చెప్పాలి. సభ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏవిధంగా ముందుకుపోదామో చర్చిద్దామని చెప్తే.. అసెంబ్లీ నుంచి పారిపోయి.. బయట అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. వాళ్లు అట్ల బతికారని, మమ్మల్ని అట్లనే బతకమంటే ఎట్లా? పాలమూరు నాయకులు వాళ్ల ప్రాజెక్టుకే అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రైతుల దగ్గరికిపోయి రూ.15 లక్షలిస్తే తప్ప భూములియ్యకండని చెప్తున్నరు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక నాయకుడు హైకోర్టుకు వెళ్తరు. మిషన్ భగీరధ మీద ఒక ఎంపీ కంప్లయింట్ చేస్తరు. ప్రాణహిత-చేవెళ్లపై పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేసేందుకు సిద్ధమవుతున్నరని తెలిసింది. రైతుల కన్నీళ్లు చూసి తెలంగాణలో శాశ్వత కరువు లేకుండా చేద్దామని అనుకుంటున్నామే తప్ప చిల్లర రాజకీయాల కోసం కాదు. మనకు కావాల్సింది.. మహారాష్ట్రతో పంచాయితీనా? మన పొలాల్లోకి నీళ్లా? ప్రభుత్వం పంచాయితీలకు పోదు. భేషజాలకు పోయి పిచ్చి పంచాయితీలు పెట్టుకోదలచుకోలేదు. మహారాష్ట్రతో సయోధ్య కొనసాగిస్తాం. ఆ రాష్ట్ర సీఎంను రప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తం. ఆఘమేఘాల మీద పనులు చేపడతం. కలిసి వచ్చే వాళ్లు కలిసిరండి. మంచి సూచనలు చేయండి. కొందరు కుహనా మేధావులను తయారుచేసి జనాన్ని కన్ఫ్యూజన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు”.

ఇదీ మన జలవనరుల చరిత్ర..
మన కాకతీయ, రెడ్డి రాజులు వాటర్‌షెడ్‌ను చేపట్టి ప్రపంచానికి చూపారు. 75 వేల పైచిలుకు గొలుసుకట్టు చెరువులు కట్టారు. కులీకుత్‌బ్‌షాహీ రాజులు వేటకు పోయి నౌబత్‌పహాడ్ ఎక్కినప్పుడు కనిపించిన సరస్సు హుస్సేన్‌సాగర్. ఇంతమంచి జలవనరును తటాకంగా ఎందుకు మార్చకూడదు.. అని హుస్సేనీశావలికి నిర్మాణ బాధ్యత అప్పగిస్తే దాన్ని పూర్తిచేశారు. అసఫ్‌జాహీలు ఇంకో అడుగు ముందుకేశారు. కాకతీయుల కాలంలో కట్టిన లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. నిజాం ఫ్రాన్స్ టెక్నాలజీతో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ప్రపంచంలో తొలి అతిపెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. 2.5లక్షల ఎకరాలకు నీరు అందించారు. ఇంకో 20-30వేల ఎకరాలకు అదనంగా నీరు వచ్చేది. ఒకప్పుడు తెలంగాణలో సంపన్నమైన జిల్లాగా నిజామాబాద్ ఉండేది. ఇవాళ అక్కడి నుంచే దుబాయి, బొంబాయి పోతున్నారు. సమైక్య రాష్ట్రంలో దుస్థితి ఇది. గణపురం, అప్పర్‌మానేరు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను అసఫ్‌జాహీలు కట్టించారు. ఇదంతా చరిత్ర. ఇవన్నీ వాస్తవాలు. ఎవర్నో విమర్శించడానికో, నిందించడానికో కాదు. పొరుగు రాష్ట్రంగా ఇచ్చిపుచ్చుకోవాలని చంద్రబాబుకు చెప్పిన. కలహించుకోవడం మంచిది కాదు. కృష్ణా, గోదావరి నీటిని అందుబాటులో ఉన్నంత వరకు కలిసి వాడుకుందాం. చీటికిమాటికి చిల్లర పంచాయితీలు వద్దని ఈ సభ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పీల్ చేస్తున్న.

ఎక్కడి గోదావరి.. ఎక్కడి రంగారెడ్డి?
రంగారెడ్డి జిల్లా వంద శాతం కృష్ణా బేసిన్‌లో ఉంటుంది. కానీ వంద కిలోమీటర్ల దూరంలో గోదావరికి దీనికి లింకు పెట్టి ప్రాణహిత-చేవెళ్ల అని పెట్టి అమలుకానిది పెట్టి ముడేసినారు. ఎక్కడి గోదావరి ఎక్కడి రంగారెడ్డి. ఇది సాధ్యమా? తమ్మిడిహట్టి దగ్గర రిజర్వాయర్‌కు తట్టెడు మట్టి ఎత్తలేదు, కానీ చేవెళ్ల దగ్గర సొరంగం మొదలు పెట్టారు. ఇదీ సమైక్యపాలకుల తీరు. కేవలం పోలవరం కోసం ప్రారం భించిందే ప్రాణహిత చేవెళ్ల. నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు ప్రపంచలోనే లాంగెస్ట్ టన్నెల్ పెట్టారు. 44 కి.మీ. టన్నెల్. దాని తర్వాత మళ్లా మరో ఏడు కిలోమీటర్ల టన్నెల్. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టునుంచి వెళ్లాలి. నిజంగా పూర్తి కావాలనే కట్టారా? 1969 ఉద్యమం తర్వాత నీళ్లు ఇవ్వాలని అడిగితే నాగార్జున సాగర్ ఎడమకాలువ మీద లిఫ్టులు పెడతామని చెప్పారు. తర్వాత పట్టించుకోలేదు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు లిఫ్టా? సొరంగమా? అని చర్చ. ఆఖరుకు టన్నెల్ అన్నారు. దాన్ని టైగర్‌వ్యాలీనుంచి పెట్టారు. 44 కి.మీ మేర టన్నెల్. ఇక అది తవ్వే పద్దతి విచిత్రం. టన్నెల్ బోర్ మిషన్ అని ఉంటది. అది ముందటికి పోదు.. వెనకకు రాదు. టన్నెల్ తవ్వుకుంటూ పోతది. ఒకేసారి రెండు దిక్కుల నుంచి మొదలు పెడితే రెండు దిక్కుల నుంచి తవ్వుకుంట వచ్చి సొరంగం క్లియర్ అయిన తర్వాత అక్కడనే మిషన్ డెడ్ చేస్తరు. అలాంటి టన్నెల్ బోరు మిషన్లు ఇందులో చొరగొట్టిండ్రు .అవి ముందటికి పోవు. వెనకకి రావు. ఇక టైగర్ వ్యాలీ మానవ సంచారం ఉండొద్దు. పర్యావరణ సంఘాలు వచ్చి ఆందోళనలు చేస్తయి. షాఫ్ట్ పెట్టుకొని గాలి పెట్టుకునేలా చేద్దామంటే కూడా ఒప్పకోలేదు. గాలి పంప్ చేస్తవుంటరు. ఆ గాలి పీల్చుకుంటూ డ్రైవర్లు టన్నెల్ తవ్వాలి. ఇట్ల ఎన్నేండ్లకు కంప్లీట్ కావాలి. ఇపుడు కూడా అడిగితే మూడేండ్ల అందాజాకు అయితది సార్ అని ఇంజినీర్లు అంటున్నరు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు వెనుక భయంకరమైన కుట్ర ఉంది. ప్రాణహిత- చేవెళ్లపై మూడు, నాలుగు జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్రతో అసలు ఒప్పందమే కుదరలేదు.



పోతిరెడ్డిపాడుతో జల దోపిడీ...
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు తెలుగుగంగ కోసం కేవలం 19 టీఎంసీల నీళ్లు కేటాయించిన ప్రాజెక్టు. తెలుగు గంగ విస్తరణను పోతిరెడ్డి పాడు రూపంలో 65వేల క్యూసెక్కుల సామర్థ్యంకు పెంచి పారేశారు. వాటిని అనంతరంపురం వెలిగోడులో పోసుకొని మూడు కాల్వలు పోతున్నాయి. బనకచర్ల డీప్‌కట్ ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోయారు. వాళ్ల దయ, అడిగే వాళ్లు లేరు. ఈ అన్యాయంపై అనేక సార్లు బయట, లోపట గొడవ పెట్టాం. కేంద్ర మంత్రిగా సోనియా వద్దకు వెళ్లి వైఎస్‌ను పిలిపించి చెప్పాం. వినలేదు. కృష్ణా నది తమ సొంతమైనట్టు నాటి సమైక్య పాలకులు వ్యవహరించారు. పులిచింతల ప్రాజెక్టును సాయుధ పోలీసుల పహారాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్మించారు. అక్కడి నుంచి గోదావరి జలాల వైపుకు మళ్లిండు. అర్జెంటుగా పోలవరం కట్టాలని చూసిండు. తెలంగాణ వాళ్లు అమాయకులు, చెప్పింది నమ్ముతారని ఆయన నమ్మకం. పోలవరంకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమం మొదలుకావడంతో తెలంగాణకు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చాడు.మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందం లేకుండానే తెలంగాణలోని 16 లక్షల సాగునీరిస్తామని ప్రకటించారు. 16 టీఎంసీల నీటితో 16 లక్షల ఎకరాల సాగు సాధ్యమా?ప్రపంచంలో ఎక్కడైన ఈ రకమైన ప్రతిపాదనతో కూడిన ప్రాజెక్టు ఉంటదా? సమైక్య పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను రెండు వివాదాల్లో ఇరికిస్తారు. అయితే అంతరాష్ట్ర వివాదం, లేకపోతే పర్యావరణ అనుమతుల లింకు. ప్రాజెక్టును ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును చాప్రాల్ వద్ద వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కడితే మహారాష్ట్రకు చెందిన 3వేల ఎకరాల భూమి ముంపునకు గురౌతుంది. దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ప్రాజెక్టు ముందుకు పోతదా?

తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రీడిజైనింగ్...
రీ డిజైనింగ్‌లో మేము మేడిగడ్డ మీద ప్రతిపాదించిన బ్యారేజ్ ఎత్తు వంద మీటర్ల వరకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర అన్నది. దీని వల్ల మనకు 16 టీఎంసీల నీరు వస్తుంది. ఎత్తు 101 ప్రతిపాదిస్తే ఇంకో మూడు టీఎంసీలు పెరుగుతుంది. ఇక్కడ 365 రోజులు కూడా నదిలో నీరు ఉంటుంది. ఇక్కడ బ్యారేజీ అయితే ప్రాణహిత వరకు వాటర్ నిల్వ ఉంటుంది. మెయిన్ గోదావరిలో కూడా 28 కిలోమీటర్ల వరకు నీళ్లు ఉంటాయి. దీని వల్ల కాళేశ్వరం అద్భుత పర్యాటక క్షేత్రంగా, మహా ఫుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుంది. కాళేశ్వరం వద్ద రోజుకు మూడు టీఎంసీల నీరు లిఫ్ట్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. ఇది ముందు తరాలకు పనికి వస్తుంది. దేవాదుల స్కీంకు ఛత్తీస్‌గఢ్‌తో వివాదం, ముంపు లేకుండా ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య రెండు వైపులా మన భూభాగమే ఉన్న తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ కడుతున్నాం. గోదావరిలో ఇంద్రావతి నది కలిసిన తరువాత 800టీఎంసీల నీరు అదనంగా వస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ కట్టి, అక్కడ మినీ టౌన్‌షిప్ తెస్తే నీరు స్టోరేజ్ చేసుకుంటాం. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల దూరం కాల్వలు తవ్వి నీరు తెస్తే కొత్త బ్యారేజీ లేకుండానే సాగునీరు ఇవ్వొచ్చు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కడితే పైనుంచి ప్రాణహిత, గోదావరినుంచి వచ్చే నీరు, అదిలాబాద్ జిల్లాలో వర్షపాతం కారణంగా ప్రవహిచే నీరు, కడెం నీరు, కరీంనగర్ వర్షపాతం కారణంగా మానేరు నుంచి వచ్చే నీరు అన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఏకారణం వల్లనైనా ఏ సంవత్సరమైనా పైనీరు సరిపోకపోయినా సమీపంలోని ఇంద్రావతి నీరు కూడా వాడుకునే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రీడిజైనింగ్ చేస్తుంటే కొందరు మహారాష్ట్ర ఆత్మగౌరవం తాకట్టు పెట్టారంటున్నారు. పూర్తిస్థాయిలో అవగాహన రాహిత్యంతో మూర్ఖంగా అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు.

మిడ్‌మానేరులో మూడు టీఎంసీల నీరు
వచ్చే జూన్ తరువాత మిడ్ మానేర్‌లో మూడు టీఎంసీలు నీళ్లు ఆపేందుకు పనులు జరుగుతున్నాయి. మిడ్ మానేరు కింద లోయర్ మానేరు ప్రాజెక్టు ఉంటుంది. మిడ్‌మానేరులో నీళ్లు లోయర్ మానేరుకు పంపుతాం. గేట్లు ఎత్తితే నీళ్లు పోతాయి. కానీ కాంగ్రెస్ వారు చిత్రవిచిత్రాలు చేశారు. పైన ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తనే ఉన్నాయి....అయినా కింద కాల్వ తవ్వారు. ఈ కాల్వ మిడ్‌మానేరు కట్టకిందకు వస్తుంది. ఎన్నో కోట్లు ఖర్చు చేశారు. సగం పనే జరిగింది. దీనితో ఫ్లడ్‌ఫ్లో కెనాల్ వల్ల పంటలు మునిగిపోతున్నాయని అక్కడి ప్రజలు లొల్లి పెడుతున్నారు. నష్టపరిహారం కడుతున్నాం. ఆలేరు, భువనగిరి, మెదక్‌జిల్లాకు, కామారెడ్డి, ఎల్లారెడ్డికి నీళ్లు ఇవ్వాలి. మిడ్‌మానేరు, అనంతగిరి ప్రాజెక్టు సామర్థ్యం కూడా పెంచాం. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇస్తున్నాం. ఇది 50 టీఎంసీల ప్రాజెక్టు. ఇది మల్టిపుల్ యూజ్ ప్రాజెక్టు. ఇక్కడి నుంచి ఆలేరు, భువనగిరికి నీళ్లు ఇస్తున్నాం. కొమురవెల్లి మల్లన్నసాగర్ నుంచి సింగూరు, నిజాంసాగర్‌లకు నీరు గ్రావిటీతో నింపొచ్చు. లిఫ్ట్ అవసరం లేదు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 58 టీఎంసీల నిజాంసాగర్ ప్రాజెక్టు అసఫ్‌జాహీలు కట్టారు. మేం చేసిన రీ డిజైనింగ్‌లో దీన్ని మళ్లీ పునరుజ్జీవింప చేస్తాం. హల్దీ వాగుపై హల్దీ ప్రాజెక్టు ఉంటుంది. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా నిజాంసాగర్ నింపుకోవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్‌పీకి ఏర్పడ్డ దుస్థితితో నిజాంసాగర్ ఎండింది. మంజీరా నది ద్వారా శ్రీరాంసాగర్‌కు నీరు పోతుంది. వట్టిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌పీని, ఆరిపోయిన నిజాంసాగర్‌ను నిలబెట్టుకోవాలనే రీడిజైనింగ్ చేస్తున్నాం. కాళేశ్వరంలో లిప్ట్ చేసే నీరుతో ఉత్తర తెలంగాణ సుభిక్షంగా ఉండేట్టూ, వ్యవసాయం కళకళలాడేలా చేస్తున్నాం. ఆరు లక్షల ఎకరాలకు దేవాదుల నీరు వస్తున్నది. మిడ్‌మానేరు పూర్తయితే కరీంనగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు నీరు వస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే వరంగల్ బ్రహ్మాండంగా సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం వల్ల బాగా లాభపడే జిల్లా వరంగల్. ఇప్పటికిప్పుడు కాళేశ్వరం నీరు రాకపోయిన బాగా వర్షాలు పడితే ఎల్లంపల్లి మంచి నీరు తెచ్చి ఎల్‌ఎండీ నింపుకుంటే వరంగల్ బాగుపడుతుంది. 2017లో మిడ్‌మానేరు పూర్తిగా నింపుకొని వరంగల్ ఇంచుకూడా ఖాళీ లేకుండా పారించుకోవచ్చు.
ఇది దక్షిణ తెలంగాణ జల దృశ్యం..
నల్లగొండలో ఉదయసముద్రం. పనులు దాదాపు పూర్తికావొచ్చినయి. రూ.230 కోట్లు ఖర్చు పెడితే నీళ్లిచ్చే అవకాశం ఉంది. దీనికి డబ్బులు ఇస్తున్నాం. సంవత్సరంలోపు పూర్తి చేస్తాం. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రీడిజైనింగ్ ప్రకారం.. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉదయ సము ద్రం బ్రాహ్మణవెల్లంల ద్వారా, డిండి ద్వారా నీళ్లు తీసుకుంటూ మునుగోడు, దేవరకొండ కాపాడుకుంటూ హైదరాబాద్‌కు కూడా నీళ్లిస్తూ , ఎల్‌ఎల్‌బీసీని పూర్తి చేసుకోవడం ద్వారా పాలమూరులో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం ద్వారా రేలంపాడు నుంచి గట్టు మండలానికి 25వేల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా దక్షిణ తెలంగాణకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చే పరిస్థితి తెచ్చుకుంటాం.

కల్వకుర్తి ద్వారా జూన్‌లో నీరిస్తాం..
పాలమూరు జిల్లాలో కల్వకుర్తిలో సరైన రిజర్వాయర్లు లేవు. 20 టీఎంసీల కోసం స్టోరేజీ కెపాసిటీ పెంచండని సర్కారు ఆదేశించింది. సర్వేజరుగుతుంది. సమగ్ర ప్రాజెక్టు అయ్యే అవకాశం ఉంటుంది. జూన్ వరకు ఈ సీజన్‌లో లక్ష యాభైవేల ఎకరాలకు నీళ్లు.. 2017లో కల్వకుర్తికి 3.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తం. స్టోరేజ్ కెపాసిటీ పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తం. మరో ఎత్తిపోతల పథకం భీమా. 95 శాతం పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాది నాటికి కంప్లీట్ చేస్తం. 8 లక్షల ఎకరాలు ప్రతిపాదిత లిఫ్టుల ద్వారా పాలమూరులో రావాలి. పాలమూరు ఎత్తిపోతల కింద జిల్లాకు మరో 7 లక్షల ఎకరాలు, 5 లక్షల రంగారెడ్డి జిల్లాకు రూపకల్పన చేసినం. ఈ మధ్యనే దాన్ని హైకోర్టు కూడా కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది.

పాలమూరుతో రంగారెడ్డికి జీవం పోస్తాం..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మించే లక్ష్మీదేవిపల్లె రిజర్వాయర్ తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడ్నుంచి నీళ్లు తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా గ్రావిటీ ద్వారా పంపించే అవకాశం ఉంటుంది. ఇబ్రహీంపట్నంకు కూడా ఈ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఆనంతారం రిజర్వాయరు 18.4 టీఎంసీలు.. అక్కడి నుంచి కొడంగల్, నారాయణ్‌పేట్ నియోజవర్గాలకు సంపూర్ణంగా నీళ్లు వస్తాయి. ఇక్కడ్నుంచే తాండూరు వికారాబాద్, చేవెళ్ల, పరిగికి నాలుగు నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. పశ్చిమ రంగారెడ్డి జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాలకు నీరు, తూర్పు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 5 లక్షలు, పాలమూరు 7 లక్షల కోసం 35వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయ్యింది. మహబూబ్‌నగర్ జిల్లాకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా .. అది వలసల జిల్లా అనే దృష్ట్యా దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షించి అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తా.

ఖమ్మంలో నీటి నిల్వ పెంపు...
ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రీడిజైన్‌లో భాగంగా దుమ్ము గూడెం నుంచి 60 టీఎంసీల నీళ్లు తీసుకొని ఎకో జోన్ పంచాయతీలు లేకుండా రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటున్నం. ఇక్కడ చిన్న చిన్న చెరువుల సిస్టమ్ తప్ప వేరే లేవు. కనీసం 20టీఎంసీల స్టోరేజీ ఉండాలి. 6 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో నీళ్లు తీసుకుంటం. ఖమ్మం జిల్లా రెండు నదుల నీళ్లు పొంది.. ఉభయ గోదావరి జిల్లాలకు సరిసమానంగా తయారవుతుంది. బ్యారేజీ కట్టుకోవడం ద్వారా దేవాదులను పటిష్ఠం చేసుకొని ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటం.

గత పాలకులు కరుణించని ఆదిలాబాద్...
ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కశ్మీర్‌లాగా ఉండే జిల్లా. గత పాలకులు కరుణించలేదు. జిల్లాలో ఆరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయి. ర్యాలివాగు, మత్తడి వాగు ఈ సీజన్‌లోనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది నాటికి గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. కొమురంభీం 2018 నాటికి సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది. సదర్‌మాట్ మీద 500 కోట్లతో బ్యారేజీ ఇచ్చినం. రెండు జిల్లాలకు లాభం వస్తుంది. ఈ బ్యారేజీ వల్ల ఇంతకు ముందు సదర్‌మాట్ కింద ఉన్న ఆయకట్టు 20వేల ఎకరాలకు పెరుగుతుంది. కడెం వాగుపైనే 6.5 టీఎంసీల సామర్థ్యంతోని కుప్టి ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నం. ఇచ్చోడ తదితర ప్రాంతాలకు బోథ్ నియోజకవర్గంలో నీళ్లిచ్చుకునే అవకాశం ఉంది. కుంటాల జలపాతాన్ని సజీవంగా ఉంచుకొని టూరిస్టులను ఆకర్షించవచ్చు. ప్రాణహిత చేవెళ్ల పథకంలో నిర్మల్ ముథోల్‌కు డిజైన్ లేదు. ఆరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం.. సదర్‌మాట్ బ్యారేజీలు కంప్లీట్ చేయడం, ప్రాణహిత, చేవెళ్ల ప్యాకేజీలు పూర్తిచేసి ముథోల్, నిర్మల్‌కు నీళ్లు తెచ్చుకోవడం, ఆ తర్వాత తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి రిజర్వాయర్‌ను మహారాష్ట్ర చెప్పిన దానికి ఒప్పుకొని.. 2 లక్షల ఎకరాలకు మేం ప్రతిపాదిస్తున్నాం. కడెం గ్యాప్ ఆయకట్టు కోసం గూడెం లిఫ్టు ఇరిగేషన్‌ను నేనే ప్రారంభించిన.

నీరు కావాలా వద్దా?
తెలంగాణ వచ్చింది. ప్రజలు బతకాలి. మహారాష్ట్రతో పంచాయతీ పెట్టుకోవాల్నా? తమ్మిడిహట్టి వద్ద 5 టీఎంసీల నీరు కావాల్నా? లేక మేడిగడ్డ వద్ద 16టీఎంసీల నీరు కావాల్నా? మన పైన రెండువైపులా మహారాష్ట్రనే ఉంది. గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలున్నాయి. పైన ఏం చేసినా మనం చేయగలిగిందేం ఉండదు. మనకు మేడిగడ్డ వద్ద నీరు అధికంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక బ్యారేజీలు కట్టిన తరువాత పైనుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో గోదావరిలో తెలంగాణ కేటాయింపులు వాడుకోవాలి ..అయితే 954 టీఎంసీలు పైనుంచి వచ్చే పరిస్థితి లేదు. సీడబ్ల్యుసీ కూడా చెప్పింది. తెలంగాణకు నీళ్లు ఉన్నది ప్రాణహిత, ఇంద్రావతిలో మాత్రమే. మరోచోట నీళ్లు లేవు. తరతరాల భవిష్యత్తుకు మార్గం ఇదే. ఇంతకు మించిన అవకాశం లేదు.

సామర్థ్యం పెంచితే ఖర్చు పెరగదా?
రూ. 38 వేల కోట్ల ప్రాణహితను రూ.83 వేల కోట్లకు పెంచారని కొందరు అంటున్నారు. వాళ్లు ప్రతిపాదించిన ప్రాజెక్టుల సామర్థ్యం 16 టీఎంసీలు మాత్రమే. మేం చేపట్టిన ప్రాజెక్టుల సామర్థ్యం 200టీఎంసీలపైనే. ఇంత సామర్థ్యం పెరిగితే ఖర్చు పెరగదా? తమ్మిడిహట్టి వద్ద 5 టీఎంసీల బ్యారేజీ కట్టి మిగిలిన 11 టీఎంసీలతో 16లక్షల ఎకరాలు పారిస్తామని అన్నారు. ఇటువంటి ఇంజనీరింగ్ ఎక్కడైనా ఉంటుందా? ఇది తెలంగాణ నమ్మాలి! మేం రీ డిజైనింగ్‌లో ప్రాణహిత/కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తం 200 టీఎంసీలతో రిజర్వాయర్లు పెట్టాం. 16 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు పెంచితే ప్రాజెక్టు కాస్ట్ పెరగదా? ఆకాశం నుంచి ప్రాజెక్టులు వస్తాయా! తమ్మిడిహట్టి కాడ అదిలాబాద్‌కు వాడుకోవడం కోసం రెండు లక్షల ఎకరాలు పారించుకోవడం కోసం 1.85 టీఎంసీలతో రిజర్వాయర్ కడుతున్నాం. దీనికి మహారాష్ట్ర అంగీకరిస్తున్నది. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల కాడ 16 టీఎంసీలు, 101 అంగీకరిస్తే 19.73 టీఎంసీలు వస్తుంది. అన్నారం బ్యారేజీ 6.22 టీఎంసీలు, సుందిళ్ల 2.16 టీఎంసీలు, మేడారం 2 టీఎంసీలు, దీన్ని మూడునాలుగు టీఎంసీలులకు పెంచుతాం.పత్తిపాక వద్ద 5.5 టీఎంసీలు, మల్కపేట 0.3 టీఎంసీలు, ఇమాంబాద్ వద్ద 2.5 టీఎంసీలు, కొమురవెల్లిసాగర్ 50 టీఎంసీలు, పాములపర్తి వద్ద కొండపోచమ్మ సాగర్ 21 టీఎంసీలు, బస్వాపూర్ వద్ద 14.16 టీఎంసీలు, గంధమల్ల 10 టీఎంసీలు, మోతే 2.90 టీఎంసీలు, గుజ్జుల 1.5 టీఎంసీ, కాతేవాడి 5 టీఎంసీ, తలమద్ద 5 టీఎంసీ, తిమ్మక్కపల్లి 3 టీఎంసీలు, కాచపూర్‌లో 2.5 టీఎంసీలు, ఇసాయిపేట 2.5 టీఎంసీలు పెట్టాం. మంచింప-కొండం 0.5 టీఎంసీలు, హైదరాబాద్‌కు 20 టీఎంసీలతో శామీర్‌పేట్‌లో మరో రిజర్వాయర్ పెట్టాం. వరద నీరు వచ్చే చోట హుస్నాబాద్ వద్ద 25 టీఎంసీలతో ప్రాజెక్టు కడుతున్నాం. మేం అంచనా వేసిన రూ.83 వేల కోట్ల ఖర్చులో గతంలో ఖర్చు చేసిన 8 వేల కోట్లు కూడా కలిసే ఉన్నాయి. 2007లో ఏం కాస్ట్‌లో ఉంది. ఇవాళ ఏం కాస్ట్ ఉంటది. ఆలోచించి మాట్లాడాలి.

గోదావరి వాటాను వాడుకుని తీరుతం...
తెలంగాణలో ఉన్నది... మొత్తం కలిపి 19 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. నిన్న చీఫ్ ఇంజినీర్, ఈఎన్‌సీ, ప్రభుత్వ కార్యదర్శి కూర్చుని ప్రతి ఎకరా వివరాలు తీసినం. అంతా కలిపితే నెట్ ఆయకట్టు.. అంటే పొలాల్లోకి వచ్చే నీళ్లతో రైతులు పంటలు వేసుకునేది కేవలం 19 లక్షలు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రయాణం అంతా పెయిన్‌ఫుల్. దగా, మోసపోయిన, మోసగించిన జర్నీ. ఈరోజు మా హక్కు మాకు ఉంది. గోదావరిలో వాటాగా ఉన్న 954 టీఎంసీలను కచ్చితంగా వాడుకొని తీరుతం.

ఆర్డీఎస్ ఆయకట్టు రక్షిస్తాం..
మరొకటి.. ఆర్డీఎస్‌లో అన్యాయం జరిగింది, నడిగడ్డ అంతా చెడిపోయింది. అడిషనల్‌గా రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి గట్టు మండలానికి 25 వేల ఎకరాలకు ఎస్టిమేట్ ఎయ్యమని చెప్పినం. ప్రతిపాదిత నెట్టెంపాడ్ కన్నా.. గట్టు మండలానికి కూడా నీళ్లిస్తుంది. ఆర్డీఎస్‌లో నష్టపోయిన ఆర్డీఎస్ దిగువభాగాన్ని బాగు చేస్తం. ఆర్టీఎస్ ఆయకట్టను కూడా తిరిగి రాబట్టుకుంటం.

కాళేశ్వరం దగ్గరే ఎందుకంటే..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుమీద ప్రతిపక్షాలు కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాళ్లు చెప్పుకుంటున్నట్టు వాళ్ల హయాంలో మహారాష్ట్రతో ఏ ఒప్పందం కూడా కుదరలేదు. బ్యారేజ్ కట్టేందుకు మహారాష్ట్ర అంగీకరించనేలేదు. ఎందుకంటే మహారాష్ట్రలో అనేక గ్రామాలుముంపుకు గురవుతున్నాయి. ఇక మన రాష్ర్టానికి నీటిని ఎక్కువ లభ్యత ఉన్న దగ్గర తీసుకోవాలా? తక్కువ ఉన్న దగ్గర తీసుకోవాలా? తమ్మిడిహట్టి దగ్గర 1100 టీఎంసీల లభ్యత ఉంటే , కాళేశ్వరంలో 1,650 టీఎంసీలలభ్యత ఉంది. పేరూరు దగ్గర గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత నీటి లభ్యత 2,340 టీఎంసీలకు చేరుతుంది. కాళేశ్వరం దగ్గర పంప్‌హౌజ్ కట్టుకుంటే ఆ నీటిని వినియోగించుకోవచ్చు. అందుకే మేడిగడ్డ దగ్గర నిర్మిస్తున్నాం. దీనిని అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ హయాంలో 152 మీటర్లకు ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మేం వచ్చాక ఎత్తు తగ్గించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా ప్రాజెక్టుకు ఖర్చు పెడితే అది నిష్పలం అవుతుందని రాశారు.

కోటి ఎకరాల లెక్క ఇది...
          “ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలు; దేవాదుల కింద వరంగల్‌లో 6 లక్షలు; తమ్మిడిహట్టి ద్వారా 2 లక్షల ఎకరాలు; కాళేశ్వరం ప్రాజెక్టుతో 26 లక్షల ఎకరాలు; లోయర్ పెనుగంగ ద్వారా 60వేల ఎకరాలు; పాలమూరు-రంగారెడ్డి ద్వారా 15 లక్షల ఎకరాలు; ఎస్సెల్బీసీ ద్వారా నల్లగొండలో లక్ష ఎకరాలు; మహబూబ్‌నగర్‌లో ఆన్‌-గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల ఎకరాలు; ఎస్సారెస్పీ స్టేజ్-2లో మిడ్‌మానేరును కాళేశ్వరంతో కనెక్ట్ చేసి నింపుకొంటే 9 లక్షలు, వరద కాల్వ ద్వారా 2 లక్షల ఎకరాలు; ఆదిలాబాద్ మీడియం ప్రాజెక్టు ద్వారా 1.75 లక్షలు; నిజాంసాగర్ కింద మరో 2 లక్షల ఎకరాలు; మొత్తం 96 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకువస్తం. కోటి ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇస్తామంటే ఇప్పటికే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలు, దేవాదుల కింద వరంగల్‌లో ఆరు లక్షలు, ప్రాణహిత-చేవెళ్ల ఇక నోమోర్. అది ప్రాణహిత-ఆదిలాబాద్. తమ్మిడిహట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు, కొత్తగా చేపట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కింద గతంలో ప్రతిపాదించిన 16 కంటే ఎక్కువగా 26 లక్షలకు నీళ్లిస్తం. అందుకు సంబంధించి రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుతున్నం. లోయర్ పెనుగంగ ద్వారా 60వేల ఎకరాలు ఆదిలాబాద్‌లో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ల్లో 15 లక్షలు, ఎస్సెల్బీసీ ద్వారా నల్లగొండలో లక్ష ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజ్-2లో మిడ్‌మానేరును కాళేశ్వరంతో కనెక్ట్ చేసి నింపుకుంటే తొమ్మిది లక్షలు, వరద కాల్వ ద్వారా రెండు లక్షలు, ఆదిలాబాద్ మీడియం ప్రాజెక్టు ద్వారా 1.75 లక్షలు, నిజాంసాగర్ కింద ఒక లక్ష ఎకరాలు పారుతుంటే, పారని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తం. ఇలా మొత్తం 96 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకువస్తం.

అంతా రికార్డుల్లో ఉండాల్సిందే...
ప్రాజెక్టుల పరిస్థితి- రీడిజైనింగ్‌లను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చెబితే అర్థమవుతుందని ప్రతివిషయం రికార్డుల్లోకి వెళుతాయని భావించాం ఇదంతా చరిత్రలో ఉండాల్సిన అక్కర ఉంది. ఐదు సంవత్సరాల్లో కోటి ఎకరాలకు నీళ్లిస్తం. మేజర్ పోర్షన్ పనులు ఈ మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తం. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల్ని 2017 వరకు పూర్తి చేస్తం. మిడ్ మానేరుకు కూడా కనెక్ట్ పూర్తయితది. వచ్చే మూడేళ్లలో 60-70 శాతం పూర్తి చేస్తం. గతంలో ప్రాజెక్టులంటే 10-20 ఏండ్లు సాగదీసే పద్ధతి. అవన్నీ మార్చినం. సరళీకృతం చేసినం. ఆర్థికశాఖ, ఇరిగేషన్ శాఖ మధ్య సమన్వయం చేసి... కొత్త ఛానెల్ ఏర్పాటు చేసినం. ఫండ్స్ రిలీజ్ కోసం గ్రీన్ ఛానెల్ పెట్టినం. ఈ ఏడాది ఇరిగేషన్‌కు రూ.25వేల కోట్లు ఏదో తమాషాకు, చక్కిలిగింతలు పెట్టేందుకు కాదు. వచ్చే ఏడాది మరో రూ.5వేల కోట్లు పెంచుతం.

మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణం...
ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర పోయి వచ్చిన తర్వాత మొదటిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిఫడ్నవీస్‌ను కలిశా. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడా. ఆయన ఒకే విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నీటిని తీసుకోకపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు నికరజలాల నీటి కేటాయింపులున్నాయి. 152 కాకుంటే 158 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టుకోండి. కానీ మహారాష్ట్ర ముంపు గ్రామాలను తగ్గించుకొని తీసుకుపొండి అని సూచించారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు. తమ్మిడిహట్టి మనం చేపట్టినపుడు మహారాష్ట్రలో ముంపు గ్రామాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అలా ఆందోన చేసిన తాను ఇప్పుడు అదే 152 మీటర్లకు ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించినరు. 148 మీటర్లు అయితే ఇబ్బందిలేదని చెప్పారు.

స్టోరేజ్ లేకుండా నీళ్లెలా తెస్తారో...
గోదావరి ఎక్కడ చూసినా లైవ్‌గా ఉంది. మనరాష్ట్రంలో కూడా మంచిగా ఉంది. మేడిగడ్డ రిజర్వాయర్ వరకు నీరు వస్తున్నది. ఇక్కడినుంచి సుందిళ్ల, అన్నారం బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాం. వీటిని నింపితే ఎల్లంపల్లి వరకు నీరు ఉంటుంది. ఇది కట్టిన ప్రాజెక్టు కనుక వచ్చే సంవత్సరం 20 టీఎంసీలు పూర్తిగా నింపుతాం. ఇది నిండితే ధర్మపురి వరకు నీళ్లు ఉంటాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరకు నీళ్లు తీసుకుపోతే 20 కిలోమీర్ల వరకు ఒకటోరెండో బ్యారేజీలు కడితే శ్రీరాంసాగర్ వరకు గోదావరి వస్తుంది. మేడిగడ్డ నుంచి ఎస్‌ఆర్‌ఎసీ 200 కిలోమీర్లు ఉంటుంది. మొత్తం గోదావరి నీటితో ఈ ప్రాజెక్టులు 365రోజులు కళకలలాడుతాయి. చేనుచేలుక పచ్చగా ఉంటుంది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా టన్నెల్స్ తవ్వారు. నిజామాబాద్‌కు శ్రీరాంసాగర్ నుంచి నీటిని పెట్టారు. ప్రాణహిత నీరు తెస్తాం అంటున్నారు. స్టోరేజ్ లేకుండా నీళ్లు ఎలా తెస్తారో చెప్ప. అశాస్త్రీమైన పద్ధతి, దీన్ని రద్దు చేసి పత్తిపాక వద్ద 5.5 టీఎంసీల స్టోరేజ్‌తో రిజర్వాయర్ తెస్తున్నాం. సొరంగాలు పెద్దగా చేయిస్తున్నాం.

హైదరాబాద్‌కు ఢోకా లేదు..
డిండిలో సెకండ్ లిఫ్ట్ ద్వారా కెనాల్ నుంచి వేసుకుంటే టోటల్ గ్రావిటీ మీదనే మునుగోడు , దేవరకొండ, చౌటుప్పల్ వరకు కూడా నీళ్లు పోతాయి. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా ఉండాల్సిన పరిస్థితిలో లేదు. మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక వారం నీళ్లు రాకపోతే కోటి జనాభా ఉన్న పట్టణం ఏం కావాలె? ఇరిగేషన్‌తో లింకు లేకుండా... డెడికేటెడ్ రిజర్వాయర్లు రెండు ఉండాలి. కృష్ణా నుంచి 20 టీఎంసీల నీటిని ప్రతిపాదించాం. రామోజీ ఫిల్మ్‌సిటీకి కొద్దిదూరంలో రాచకొండ గుట్టలో రిజర్వాయర్ ఉంటుంది. అట్లాగే శామీర్‌పేటకు గోదావరి నుంచి 20టీఎంసీలు.. హైదరాబాద్‌కు యాభై అరవై ఏండ్ల వరకు ఇబ్బంది లేని పరిస్థితి వస్తది.

మిషన్ కాకతీయ ద్వారా 10-12 లక్షల ఎకరాల సాగు...
1956లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో కలిసే నాటికి 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఉండేది. నిజాంసాగర్ కింద మూడు లక్షలు, కాకతీయ రాజులు, ఆసిఫ్‌జాహి నిర్మించిన మీడియం ప్రాజెక్టుల కింద ఐదు లక్షలు, 15 లక్షల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ కింద ఉండె. సమైక్య రాష్ట్రంలో 75వేల పైచిలుకు ఉన్న చెరువుల్ని ధ్వంసం చేసినరు. మిషన్ కాకతీయ లెక్కలు తీస్తే 46,500 చెరువులు మిగిలినయి. ఈ చెరువులను సంపూర్ణంగా బాగు చేసుకుంటే తెలంగాణ ఆయకట్టు 10-12 లక్షల ఎకరాలు మిషన్ కాకతీయ కింద రైతాంగానికి వచ్చే ఆస్కారం ఉంది.

మండలి సభ్యులు మన్నించాలి..
సభలో ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్‌గారికి, సభ్యులకు ధన్యవాదాలు. మండలి సభ్యులు నన్ను మన్నించాలి. రాజ్యాంగబద్దంగా రూల్స్ ప్రకారం రెండు సభల్ని కలపడానికి కుదరలేదు. అందుకే మన సభ్యులను గ్యాలరీలో కూర్చోవాల్సిందిగా ఆహ్వానించినం. తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాసయ్యే రోజు నేను లోక్‌సభ సభ్యుడిని. నేను, ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోజు రాజ్యసభ గ్యాలరీలో కూర్చున్నం. రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి. అందుకే మండలి సభ్యులు అన్యథా భావించొద్దు.

రైతు ఎక్కడున్నా మంచిగుండాలె...
ఈ మధ్యకాలంలో నేను ఒక మహాయాగం చేసిన. మర్యాదపూర్వకంగా ఏపీ సీఎం చంద్రబాబును యాగానికి ఆహ్వానించేందుకు అమరావతికి వెళ్లిన. ఆ సందర్భంలో ఇద్దరం కూర్చుని మాట్లాడుకునే సందర్భంలో చెప్పిన. మహారాష్ట్రతో ఎంత సామరస్యంగా ఉన్నమో.. ఏపీతో కూడా తెలంగాణ సీఎంగా సయోధ్యను కోరుకుంటున్న అని చెప్పిన. పొరుగు రాష్ర్టాలం. మనం జరిపితే జరిగిపోయెటోళ్లం కాము. అలంపూర్ నుంచి భద్రాచలం వరకు మనకు బార్డర్ ఉంది. నీళ్ల అంశంలోనే కాదు... అనేక విషయాల్లో ప్రేమ, పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటది. రెండు రాష్ర్టాల రైతులు బతకాలి. ఖమ్మంలో కట్టే సీతారామ ప్రాజెక్టుతో పాటు ఎన్‌ఎస్‌పీ ద్వారా వచ్చే రీజనరేటెడ్ వాటర్ ప్రకాశం బ్యారేజీకి పోతయి. అవి ఆంధ్ర రైతాంగానికి ఉపయోగపడతయి. ఎక్కడా ఒక రైతు ఇంకో రైతు పొలం ఎండాలని అనుకోడు. తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా రైతు బతకాలి. అప్పుడే మనకు బర్కత్. అందరూ బతకాలని కోరుకుంటం తప్ప దగా చేసి బతికే స్వభావం తెలంగాణది కాదు. తెలంగాణ నైజం యూ లీవ్ అండ్ లెట్‌లీవ్. ఇచ్చి పుచ్చుకునే ధోరణి తప్ప ఏమార్చి బతికే స్వభావం కాదు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలు బ్యారేజీలు కట్టినయి వివరాలున్నయి... పెన్‌డ్రైవ్ పంపుతానన్న. గోదావరిలో ఎగువన 1100 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కాళేశ్వరం వద్ద 1600 టీఎంసీలు, ఇంద్రావతి కలిసిన తర్వాత 2400 పైచిలుకు టీఎంసీల నీటి లభ్యత ఉంది. పోలవరం దగ్గరకి పోయేసరికి 2600 టీఎంసీల లభ్యత ఉంది. కాళేశ్వరం దగ్గర ఉన్న 1600 టీఎంసీల్లో తెలంగాణ ఎంత ఎత్తుకుంటది? రోజుకు 3 టీఎంసీల చొప్పున 150 రోజుల్లో మహా అంటే ఎక్కువకు ఎక్కువ అయితే 450 టీఎంసీలు. ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీలు, దేవాదుల దగ్గర మరో 50-60 టీఎంసీలు. ఇంతకుమించి తెలంగాణ ఏం చేసినా ఎత్తుకునే పరిస్థితి లేదు. ఎన్ని రిజర్వాయర్లు కట్టుకొని ఎంత నింపుకున్నా... మహా మహా వాడితే 2631 టీఎంసీల్లో 631 టీఎంసీలు. ఇంత వాడుకున్నా పోలవరం దగ్గర 2వేల టీఎంసీల నీటి లభ్యత ఉంటది. మనం వేయి టీఎంసీలు వాడుకున్నా ఇంకా 1631 టీఎంసీల నీటి లభ్యత కచ్చితంగ ఉంటది. ఇవే వివరాలు ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పిన. తెలంగాణతో పోలిస్తే భౌగోళిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో సానుకూలం. 900 కిలోమీటర్ల కోస్ట్ ఏపీని ఆనుకుని ఉంది. అందుకే చంద్రబాబూ పోలవరం మీద ఉర్రూతలూగకు. రెండువైపులా బ్యారేజీలు కట్టమని చెప్పిన. ఎందుకంటే భద్రాచలం.. దుమ్ముగూడెం దాటిన తర్వాత తెలంగాణ గోదావరి నీళ్లను వాడుకోలేదు. ఆ తర్వాత పోయే నీళ్లు సముద్రంలోకి పోవాల్సిందే. సముద్రంలోకి పోయే బదులు మీరు వాడండి. ఒకవైపు వైజాగ్, మరోవైపు నాయుడుపేట దాకా తీసుకుపోవచ్చు. చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకుని రాయలసీమకు కూడా పూర్తిగా నీళ్లిచ్చే అవకాశం ఉంది అని చెప్పిన. ఇదే విషయమై ఇటీవల చంద్రబాబు వ్యాప్కోస్‌కు సర్వే చేయమని ఆదేశించారని తెలిసింది. చాలా సంతోషం.

నేనే చొరవ తీసుకొని బాబుతో మాట్లాడతా...
వాళ్లు పట్టిసీమ కట్టుకున్నరు. ఆ ప్రాజెక్టు మీద వాళ్ల రాష్ట్రంల పంచాయితీలు ఎట్లున్నా... పట్టిసీమ కట్టినందుకు చంద్రబాబును నేను అభినందిస్తున్న. మంచి పని. గోదావరిలో నీటి లభ్యత ఉంది. కృష్ణాలో కూడా ఉంది. చీటికి మాటికి ఇద్దరం కలహించుకోవడం మంచిది కాదు. కృష్ణా, గోదావరి నీటిని అందుబాటులో ఉన్నంత వరకు కలిసి వాడుకుందాం. మహారాష్ట్రతో ఒప్పందం అయిపోయిన తర్వాత నేనే ఇన్షియేట్ (చొరవ) తీసుకుంటా. చంద్రబాబుతో మాట్లాడతా. ఈవిధంగ చీటికిమాటికి చిల్లర పంచాయితీలు వద్దు, డిగ్నిఫైడ్‌గ ఉందామని ఈ సభ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పీల్ చేస్తున్న. పంచాయితీ కాదు.. నీళ్లు రావాలి, రైతులు, ప్రజలు బతకాలి. అది మన ఉద్దేశం.

నో మోర్ ప్రాణహిత-చేవెళ్ల..
ప్రాణహిత-చేవెళ్ల ఇక నోమోర్. ఇక ప్రాణహిత చేవెళ్ల ఉండదు. ఇపుడు అది కాళేశ్వరం ప్రాజెక్ట్. దేవుని పేరు మీద పెట్టుకున్నాం. తెలంగాణకు మంచి జరగాలని ఉద్దేశం. ఇక తమ్మిడిహట్టి దగ్గర కట్టేది ప్రాణహిత- ఆదిలాబాద్. అదే పేరుతో పిలుస్తాం. తమ్మిడిహట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు వస్తయి. కొత్తగా చేపట్టే కాళేశ్వరం ఇప్పటినుంచి ఇలాగే వ్యవహరిస్తాం. ఈ ప్రాజెక్టు కింద గతంలో ప్రతిపాదించిన 16 కంటే ఎక్కువగా 26 లక్షలకు నీళ్లిస్తం.

ప్రాణం పోయినా అవినీతికి ఆస్కారం ఉండదు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాణంపోయినా అవినీతికి ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అనుమానాలకు సీఎం సమాధానం ఇచ్చారు. వారికి సీఎం ఇచ్చిన సమాధానం ఆయన మాటల్లోనే..

సెక్రటేరియట్‌లో పైరవీకారులు కనిపించడంలేదు. గత ఇరవై నెలలుగా వందశాతం పొలిటికల్ కరప్షన్ తీసేసినం. రూ. 83వేల కోట్లతో కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికాదు. అందులో దాదాపు 26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకుంటే ఎస్సారెస్పీ నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు కోల్పోతున్న నష్టాన్ని కూడా అవసరమైన సందర్భంలో భర్తీ చేసుకోవడానికి దీంట్లో ప్రణాళిక ఉంది. చాలా పెద్ద మొత్తంలో ప్రయత్నం జరిగితే తప్ప ఇది వచ్చేది కాదు. మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు. భారత ప్రభుత్వ వాప్కోస్ సంస్థ సూచనల మేరకు ఇది చేసినం. ఎల్లంపల్లి టు మిడ్‌మానేరుకు రెండు టీఎంసీలు పెట్టలేదు. 1.7 టీఎంసీయే ఉంది. దాన్ని మేం 2 టీఎంసీలు చేస్తావున్నం. మిడ్‌మానేరు నుంచి పైకొచ్చే క్రమంలో 9000 క్యూసెక్కులే పెటిన్రు. దాన్ని కూడా ఈరోజు 2 టీఎంసీలకు తీసుకుపోతావున్నం. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీలు తీసుకొస్తున్నం. ఈ పథకంలో సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఉపక్రమించింది. ఖర్చు పెట్టకుంటే నీళ్లు రావు. వందశాతం పారదర్శకంగా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తం.

శాసనసభకు మించిన దేవాలయం ఉంటదా ?
శాసనసభకు మించిన దేవాలయం ఇంకొకటి ఉంటదా? మీరందరూ రండి మొత్తం కంప్లీట్ చర్చ చేస్తాం అన్నం. రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్‌ల ఉంది. కృష్ణా జలాల్లో మన హక్కులు మనం కోల్పోకూడదు. కొండా వెంకటరంగారెడ్డి తెలంగాణ కోసం పోరాడిన మహానుభావుడు. 2013 జూన్‌లో కొండా వెంకటరంగారెడ్డి విగ్రహప్రతిష్ఠాపన చేవెళ్ల మండల కేంద్రంలో జరిగింది. నేను ఆ సభలో చెప్పిన. ఈరోజున్న ప్రభుత్వం చేవెళ్లకు గోదావరి నీళ్లు తెస్తా అంటున్నది. అది సాధ్యం కాదని చెప్పిన. క్రిష్ణా బేసిన్‌లో మీరున్నరు, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి మీకు వస్తది, మీకు కడుపునిండా నీళ్లు తెస్తా అని అప్పుడు చెప్పిన. 2014 ఎన్నికల సభలలో కూడా అదే చెప్పిన. ఉద్ధండపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకురాకుండా జడ్చర్ల, కొడంగల్, నారాయణ్‌ఖేడ్ గానీ, షాద్‌నగర్‌కుగానీ నీళ్లు వచ్చే అవకాశాలు లేవు. జడ్చర్లలో నిర్మించే ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చిన తర్వాతే గ్రావిటీ ద్వారానే రంగారెడ్డి జిల్లకు వస్తయి. పాలమూరు ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్న నీళ్లు 50 టీఎంసీలు. ఈ 50 టీఎంసీలతో 5 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం. మేడ్చల్ నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి.

నాదీ నిర్వాసితుల కుటుంబమే...
నాది కూడా నిర్వాసితుల కుటుంబమే. 1947లో అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టినప్పుడు దాంట్లో మా కుటుంబానికి చెందిన 3 వేల ఎకరాల భూమి మునిగిపోయింది. అక్కడ్నుంచి మేం చెదిరిపోయి చాలా కష్టాలు పడ్డం.

ప్రజెంటేషన్‌పై ప్రశంసలు వస్తున్నయ్...

పొత్తూరు వెంకటేశ్వర్‌రావు హాస్పిటల్‌లో కీమోథెరపీ చికిత్స చేయించుకుంటా వున్నరు. నాకిప్పుడు ఓ ఎస్‌ఎంఎస్ ఇచ్చినరు. శాసనసభలో సీఎంగారి ప్రసంగం అద్భుతం అని చెప్పినరు. ప్రజలను నుంచి ప్రశంసలు వస్తున్నయి. ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ప్రజలకు ఈ రోజు ప్రభుత్వం ఏమిచేస్తుంది? ఏమి ఆలోచిస్తుందనేది తెలిసిపోయింది. ప్రజలు కరెంట్ భారం భరిస్తరు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం వల్ల ప్రజలకు ఆర్థిక శక్తి పెరుగుతుంది. లిఫ్ట్‌ల వల్ల రైతులకు కరెంటు బిల్లులు పెరుగాతాయన్న మాట వాస్తవం. కానీ ప్రాజెక్టులు పూర్తకావడం వల్ల రైతులకు రూ.8000 కోట్ల నుంచి రూ.9000 కోట్ల వరకు బిల్లలు చెల్లించే శక్తి వస్తది. హైదరాబాద్‌కు 40 టీఎంసీలు నీరు వస్తది. కృష్ణ నుంచి అచ్చంపేట, డిండి, దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు 40 టీఎంసీల నిరందిస్తం. హైదరాబాద్‌లో ఒక్కసారి 40 టీఎంసీలు నింపితే ఏడాది మొత్తం సరిపోతయి. ఖమ్మం జిల్లాలో గోదావరి అటుపక్క మండలాలకు కూడా నీరందిస్తం. ఇప్పటికే మొండికుంట, పాలెం వంటి నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నం. అందరికీ న్యాయం చేస్తం.

పోలవరం ముంపు ప్రాంతాల నుంచి తెలంగాణకు ఐదు లేదా ఆరు మండలాలు కలువబోతున్నాయి. ఇది శుభవార్త. ఇప్పటికే ఏపీ వాళ్లతో మాట్లాడిన. పోయిన మండలాలను తిరిగి రాబట్టుకుంటున్నం. సింగూర్‌కు నీరందిస్తం. సింగూరు ప్రాజెక్టు తొలిసారిగా ఈ ఏడాదిలో ఎండిపోయింది. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీళ్లచ్చే ప్రయత్నం చేస్తున్నం. వంద శాతం సింగూరు ప్రాజెక్టును మల్లన్న సాగర్ ద్వారా గ్రావిటీ ద్వారా గాని, లిఫ్ట్ ద్వారా గాని నింపుతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, మెట్‌పల్లి ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తం. మెట్‌పల్లి ప్రాంతంలో ఒక రిజర్వాయర్ కట్టాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ప్రయత్నం చేస్తున్నం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ ముందు జిల్లాల వారీగా కేటాయింపులు చేయాలని వాదించబోతున్నాం. ఈసీపీ విధానాన్ని రద్దు చేసిందే టీఆర్‌ఎస్ ప్రభుత్వం. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వం. సీడీఆర్ ఉన్న వాళ్లకే కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించాం. కొందరు చెత్త కాంట్రాక్లర్లు పనులు దక్కించుకుని వాటిని సకాలంలో పూర్తిచేయడంలేదు. మిడ్‌మానేరు డ్యాం పనులకు కాంట్రాక్టురు 21 శాతం లెస్‌కు వేశారు. రెండు మూడు సంవత్సరాల క్రితం పూర్తిచేయాల్సిన పనులు ఇప్పటికీ పూర్తికావడంలేదు. దీనికి ప్రధాన కారణం కాంట్రాక్టరే. ఇలాంటి వారు పనులు దక్కించుకోవద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి నిబంధనలు పెట్టాం.

పెండింగ్ ప్రాజెక్టులు 2017కల్లా పూర్తి: సీఎం
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను 2017 చివరి కల్లా పూర్తిచేస్తాం. మహూబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తికావడానికి రూ.2400కోట్లు కావాలి. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు మాత్రం 2018-19 వరకు పూర్తవుతుంది. వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొంత భాగంలోని ప్రాంతాలకు 2018 కల్లా నీరందిస్తాం. ప్రాజెక్టు పనులు పూర్తయినా ఇరిగేషన్ చానల్(కాలువలు) పనులు కొంతవరకు పెండింగ్‌లో ఉండొచ్చు. ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు ఈ సంవత్సరం పెంచాం. రాబోయే సంవత్సరాల్లోనూ పెంచుతాం. బడ్జెట్‌పై సభలో మరోసారి చర్చిస్తాం. నిధులు, నియామకాలు, నీళ్లు తెలంగాణ రాష్ట్ర సాధన నినాదం. వీటిలో ఇప్పటికే మన నిధలు మనకే ఉన్నాయి. నియామకాలు చెపడుతున్నాం. లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం. నీళ్లు ప్రాధాన్యం ఉన్న అంశం కాబట్టే ఆదరాబాదరగా చేయలేదు. సమగ్ర అధ్యయనం చేయాలనే ఉద్దేశంతోనే సమయం పట్టింది”.

త్వరలో కాళేశ్వరం టెండర్లు
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లు పిలిచాం. కాళేశ్వరంపై స్పష్టత వచ్చింది.. వెంటనే టెండర్లు సిద్ధం చేస్తాం. తెలంగాణ ఉత్పన్నమయ్యే నాటికి ప్రాణహిత చేవెళ్ల టెండర్లు పిలిచారు. రూ.8వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రాణహిత పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. అయితే వారందరు వచ్చి మా పరిస్థితి ఏంది.. ఏం చేయాలని అన్నారు. గతంలో ఎంత మొత్తం పనులు కేటాయించారో అంతే విలువైన పనులు పాత కాంట్రాక్టర్లకు కేటాయిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు పూర్తిగా రీ టెండర్లు పిలుస్తాం. పాదర్శకంగా, జవాబుదారీతనంతో పనులు చేస్తాం.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


No comments:

Post a Comment