Tuesday, July 14, 2020

దెందులూరు పెద్దింటివాడు స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు:వనం జ్వాలా నరసింహారావు


దెందులూరు పెద్దింటివాడు
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూన్ 11-17, 2000)

         ఖద్దరు దుస్తులేసుకుంటున్నఆయన్ను కాంగ్రేస్ వాదన్నారు.  స్వాతంత్రోద్యమం రోజుల్లో ఆయన పాల్గొన్న విధానాన్ని తెల్సినవారు ఆయన్ను మార్క్సిస్టు అన్నారు.  కాదు... కాదు... ఆయనో  సినిమా మనిషన్నారు  మరికొందరు. నిజానికి ఆయనకు అవన్నీ వర్తిస్తాయి. సీదా - సాదాగా తిరుగుతు, అందర్నీ పలకరిస్తూ, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా మెసిలే ఆ వ్యక్తే శ్రీ కె.బి.తిలక్.

         ఆయనో మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ వాటికి వ్యతిరేకంగా పోరాడేవారిలో ఆయన కనిపిస్తాడు. సినీ కార్మికుల బాధామయగాథలు విని వారి మంచికోసం రంగంలోకి దిగాడాయన.

          ఎక్కడో.. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో 1926లో జన్మించిన శ్రీ తిలక్ పిన్న వయస్సులోనే... చదువుకు స్వస్టిచెప్పి... 1939లో స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. జైలు కెళ్లారు.

         ఆయన... ఆ తర్వాత కాలంలో... స్వతంత్ర భారతావనిలో... సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా... అలాంటి ఇతివృత్తాలే కధావస్తువుగా పలు చిత్రాలను నిర్మించారు. దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావు లాంటి ఉద్దండ సినీ దర్శకులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సినిమాల నిర్మాణ దర్శకత్వంలో కీలక పాత్ర పోషించారు.

ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ, ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, చోటీబహు, కాంగన్ లాంటి చిత్రాల రూపకర్త ఆయన,  ఆయన్ను గురించి ఆయన మాటల్లోనే ప్రజాతంత్ర పాఠకులకు (ఫేస్ బుక్ స్నేహితులకు, హితులకు, సన్నిహితులకు) తెలియచేసే ప్రయత్నమే ఇది.

         ఓ మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా శ్రీమతి  కుముద్ బెన్ జోషి పదవిలో ఉన్నరోజుల్లో నేను రాజభవనకు చెందిన చేతన అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నప్పుడు, మొట్టమొదటి సారిగా శ్రీ కె.బి.తిలక్ గారితో  పరిచయం కాగానే, ఆయనో 'పిచ్చి ఆ మనిషి' గా అనిపించాడు. అయితే  నాభావన అప్పుడూ, ఇప్పుడూ కూడా తప్పని నేననుకోవటం లేదు. తను అనుకున్నది సాధించేటంతవరకు శ్రీ తిలక్ ఓ పిచ్చివానిలాగే వ్యవహరించటం, నాటి నుండి నేటి వరకు (ఆయన చనిపోయే వరకు) నేనెరుగుదును. అది ‘గాంధీ'  సినిమా విషయంలోనూ, రాజభవన్ ప్రాంగణంలో 'డోమ్' ఇల్లు - నిర్మాణం విషయంలోనూ, సినీరంగంలో పనిచేసే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ విషయంలోనూ, సినీనటుడు కృష్ణ రాజకీయరంగ ప్రవేశం విషయంలోనూ, ఇండో-పాక్ మైత్రి సంబంధమైన కార్యక్రమ నిర్వహణ విషయంలోనూ... ఇలా... ఏ విషయంలోనైనా కార్యదక్షత ఆయన సుగుణం.

ఆనుపము చలన చిత్ర దర్శక - నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకుడిగా శ్రీ తిలక్ గారు చాలా మందికి సుపరిచితులే. ఆయన్ను గురించి మరింత తెలుసుకోవాలని,  ఓరోజు ఉదయం ‘మార్నింగ్ వాక్’ లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ను కదిలించగా బయటపడ్డ విషయాలను పాఠకులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన  నోటి నుండి విన్న ఆసక్తి కరమైన  సంఘటనల్లో కొన్ని 'ప్రజాతంత్ర " పాఠకుల (ఫేస్ బుక్ పాఠకుల) ముందుంచుతున్నాను. పశ్చిమ గోదావరి  జిల్లా దెందులూరు అనే కుగ్రామంలో పెద్దింటివారు' అని పిలువ బడే కుటుంబంలో జన్మించిన శ్రీ తిలక్ తండ్రి పేరు వెంకటాద్రిగారు. రైతుగానూ, స్వాతంత్ర్య సమర యోధునిగానూ మాత్రమే వెంకటాద్రి గారు ఆ చుట్టు ప్రక్కల గ్రామాల వారికి పరిచయం.


పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వాతంత్ర్య సమరం వుద్యమం వైపు ఆకర్షితుడైన శ్రీ తిలక్ కు 1942 నాటి ‘క్విట్ ఇండియా' మరింత స్పూర్తి నిచ్చింది. రైలు పట్టాలను తొలగించటం, టెలిఫోన్ తీగెలను కత్తిరించటం, రైళ్లను ఆపుచేయటం లాంటి బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న శ్రీ తిలక్ ను భీమడోల్ లో 1942 ఆగస్టు/సెప్టెంబర్ ప్రాంతంలో అరెస్టు చేసి ఏలూరు సజైలుకు పంపారు. ఆ తర్వాత శిక్షపడి, అది అనుభవించటానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కదిలించారు ఆయన్ను. జైలులో తన అనుభవాలను గురించి చెప్తున్నప్పుడు ఆయన చలించిపోయారు. దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు, ఇతరుల బాధలు చూడలేని పరిస్తితుల్లో తామున్నందుకు. స్వాతంత్ర్య సమరయోధునిగా తిలక్ ను ఆయన సహచరులను వుంచిన సెల్ 'సింపుల్ ఇంప్రిజన్మెంట్  సెల్' గా వ్యవహరించగా, దాని వెనుకన వున్న మరో దానిని 'కండెమ్డ్స్ ఇంప్రిజనర్స్ సెల్' గా పిలిచేవారట. ఆ సెలో వున్న వారందరూ అచిరకాలంలో పురిశిక్షకు గురి కాబోయే వారు కావటం, వారు తమకు రాబోయే పరిస్థితిని తలచుకొని భోరున విలపించటం-అందునా రాత్రిళ్లు మరీ ఎక్కువగా విలపించటం తలచుకొని శ్రీ తిలక్ వాపోయారు.

         శ్రీ తిలక్ జైల్లో వున్నప్పుడు ఆయనతో జైలు శిక్ష అనుభవించిన వారిలో ఇప్పటికీ (ఎప్పటికీ) గుర్తున్న వ్యక్తుల పేర్లను ఎన్నో చెప్పారాయన. గద్దె విష్ణుమూర్తి గారి విషయం చెప్తూ, ఆయన వినాయక చవితినాడు మట్టితో గణేశ్ విగ్రహం తయారు చేసిన సంగతి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన స్వాతంత్ర్యం వచ్చింతర్వాత కాంగ్రెసు పార్టీ ప్రధాన ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడు అయ్యారు.

          శ్రీ తిలక్ స్వగ్రామం దెందులూర్ లో ‘పెద్దింటివారు' గా పిలువబడి చిన్న తనంలో గడపిననాటి పరిస్థితులను తల్చుకొని కూడా తిలక్ బాధపడ్డారు. గ్రామపెద్దలు కొందరు, తమ స్వలాభం కొరకు, స్వార్థం కొరకు,  బ్రిటీషువారి ‘విభజించి పాలించు' నీతిని, ఆమలుపర్చిన తీరు ఆయనింకా మర్చిపోలేదు. హరిజనులుగా మహాత్మాగాంధీచే పిలువబడిన, తమ గ్రామంలోని కొందరిని, మాలలుగా, మాదిగలుగా విభజించి గ్రామపెద్దలు తమ పబ్బం ఎలా గడుపుకొంది తిలక్ వివరించారు. దుర్భరమైన జైలు జీవితంలో మరుపురాని సంఘటనలు కూడా కొన్ని వున్నాయని అన్నారు. శ్రీ తిలక్.  తమ మూత్రాన్ని తామే కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతి ఇచ్చినప్పుడు బయట పారబోయటం, తాము తినటానికి జైలులో పెట్టేది తినదగ్గ వస్తువుగా ఏమాత్రం అనిపించుకోని విషయం, ప్రక్కనున్న సెల్ లో వారి ఆక్రందనలు... దుర్భరమైన  సంఘటనలుగా పేర్కొన్నారు ఆయన. అయితే, తనతోపాటు జైలులో వున్న తన గ్రామానికి చెందిన హరిజనులు, తాను ‘పెద్దింటివారి’ అబ్బాయిని అయినందున మర్యాదగా, గౌరవంగా వారు  త్రాగే బీడీలను జైలువార్డెన్ కు అమ్మి, ఆ డబ్బుతో తనకు రొట్టెలు (తిన తగినవి) తెప్పించిన విషయం చెప్పినప్పుడు శ్రీ తిలక్ కళ్లు చెమ్మగిల్లాయి.  కాకపోతే, తానూ అందరిలాగానే కష్టాలు అనుభవిస్తానని తనకి ప్రత్యేక మర్యాద వద్దని  వారికి చెప్పానని అన్నారాయన. తాను జైల్లో వున్నప్పుడే తన తండ్రిగారి ఆస్తిని దెందులూరులో జప్తు చేయించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఆ రోజుల్లో.

         రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయింతర్వాత, జేబులో చిల్లిగవ్వ కూడా లేని తిలక్ గారు, కాలినడకన తన స్వగ్రామమైన దెందులూరు వెళ్లారు. ఆ తర్వాత 'ఉషామెహతా' స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని పేపర్ డిస్ట్రిబ్యూషన్  బోయ్ గా స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రచారం చేసారు శ్రీ తిలక్.  ముదిగొండ జగ్గన్న శాస్త్రి గారి ప్రోద్బలంతో, సహకారంతో, ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన శ్రీతిలక్ అతివాద పంథా కళాకారుల ఉద్యమాలతో చేతులు కలిపారు. నాటకాలు వేయటం, వేయించటంతోపాటు, డప్పులు మ్రోగించుతూ ప్రజానాట్య మండలి విప్లవ గీతాలను ఆలపించుతూ గ్రామగ్రామాన తిరిగేవారు. 'పెద్దింటి వాళ్ళము.... తప్ప త్రాగివచ్చి డప్పు కొట్తున్నాము... తప్పుకోండి... తప్పుకోండి...' అంటూ తమ బృందం ఆ రోజుల్లో కొంటెగా ఆలపించిన జానపదాన్ని గుర్తుచేసుకుని... ఆ రోజుల్లో ప్రజల స్పందనను మననం చేసుకున్నారాయన-తిలక్.

         మాజీ మంత్రి కీర్తిశేషులు పరకాల శేషావతారంతో పనిచేస్తూ ఆనాటి యూత్ లీగ్ కార్యకలాపాల్లో తాను, తన సహచరులు ఏ విధంగా చురుకుగా పాల్గొన్నదీ వివరించారాయన. ఇదంతా ఒక ఎత్తైతే... ఇక అక్కడి నుండి బొంబాయి (నేటి ముంబాయి) కి, సినీ పరిశ్రమలో చేరేటందుకు దారితీసిన పరిస్థితులను కూడా ఆయన నెమరువేసుకున్నారు.

         విశ్వవిఖ్యాత చలన చిత్ర దర్శక, నిర్మాత స్వర్గీయ శ్రీ ఎల్.వి.ప్రసాద్ గారికి శ్రీ తిలక్ స్వయానా మేనల్లుడు. ఆయన ఆ రోజుల్లో బొంబాయిలో వుంటుండే వారు. తిలక్ గారి మేనత్త ఒకావిడ, ఈయన్ను వెంటేసుకుని బొంబాయికి ప్రయాణం కట్టింది. దారిలో విజయ వాడ (నాటి బెజవాడ) లో రైలు మారవలసి వుంది. ఏలూరు నుండి విజయవాడ చేరుకోగానే, బొంబాయికి వెళ్లాల్సిన రైలు  బయలుదేరటానికి ఇంకా కొంత ఆలస్యమున్నందున, ఆ కాస్త సమయం ఎందుకు వృధా చేయాలన్న ధ్యాస తిలక్ లోని 'అతివాద' మనస్తత్వానికి కలిగింది. వెంటనే అత్తకు చెప్పాపెట్టకుండా, మొగల్రాజు పురంలో వుంటున్న స్వర్గీయ కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావుగారి ఇంటికి పరుగెట్టారు శ్రీ తిలక్. గడ్డం గీసుకుంటున్న ఆయనతో కాసేపు కబుర్లు చెప్పి, ఆయన వద్దనుండి బొంబాయిలోని స్వర్గీయ శ్రీపాద అమృతడాంగే గారికి తిలక్ ను పరిచయం చేస్తూ వ్రాసిన ఓ ఉత్తరాన్ని సంపాదించుకున్నారు తిలక్. వెంటనే రాజేశ్వరరావుగారి వద్ద శలవు తీసుకుని రైలు కదిలే సమయానికి స్టేషన్‌కు చేరుకుని, తాను రైలెక్కిన సంగతి తన మేనత్తకు తెలియ కుండానే బొంబాయి చేరుకున్నారాయన.    బొంబాయి రైలు స్టేషన్లో తిరిగి కల్సుకున్నారు. వారిరువురూ.

         బొంబాయి సినీపరిశ్రమలో అడుగిడిన శ్రీ తిలక్ లోని స్వతంత్ర సమరాభిలాష అక్కడా కొనసాగింది. ఆ నగరంలోని నాటి 'పీపుల్స్ థియేటర్’ లో చేరి,  ప్రముఖులు బల్ రాజ్ సహానీ, రోమేప్ తాపర్ లతో సాన్నిహిత్యం సంపాదించు కున్నారప్పట్లో.

          ఓ రెండేళ్లు బొంబాయిలో గడిపిన అనంతరం (1943-1945) మద్రాసు (నేటి చెన్నై) కు ‘గృహ ప్రవేశం' అనే చలనచిత్రానికి  దర్శకత్వం వహించేందుకు బయలు దేరిన ఎల్.వి. ప్రసాద్ గారితో అక్కడికి చేరుకున్నారు శ్రీతిలక్ 1945 ప్రాంతంలో.         
                                                     (మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment