Friday, July 24, 2020

‘ఎం ఎల్ ఎ’ సినిమాకు కొల్లేటికీ లింకు ! ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


‘ఎం ఎల్ ఎ’ సినిమాకు కొల్లేటికీ లింకు !
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(ఆగస్టు 20-26,2000)
         కొల్లేటి కాపురం సినిమా షూటింగ్ చేసేటందుకు ఒక పర్యాయం తిలక్ తన యూనిట్ తో హైదరాబాద్ కొచ్చారు. చంచల్‌గూడా జైల్లో జగ్గయ్య గారితో ఇతరులతో ఓ సీన్ చిత్రీకరణ చేయాల్సి వచ్చింది. జైలుగోడలు, అక్కడి వాతావరణం బాగా యధాతథంగా చూపించే వుద్దేశ్యంతో అలా చేసి వుండవచ్చు. సినిమాలలో ‘చంద్రం' కారెక్టర్ చేసిన హీరో కృష్ణను మోసం చేసి జైలుకు పంపుతారు కొల్లేటి విలన్ ‘భుజంగం’ అనే కారెక్టర్. చంద్రం ఓ పశువుల డాక్టర్. ఆయన విడుదలై పోతున్న సందర్భంలో అదే జైల్లో, చేయని ఓ హత్యా నేరానికి శిక్షను అనుభవిస్తున్న జగ్గయ్యకు, హీరో కష్ణకు మధ్య జరిగిన సంభాషణను చిత్రీకరించారు హైదరాబాద్ చంచల్‌గూడా జైల్లో.
         కొల్లేట్లోని జనంలో పలుకుబడి సంపాదించాలని అక్కడి 'చిల్లర దేవుళ్లు' వీరయ్యగారనే పంతుల్ని పట్టుకొస్తారా ప్రాంతానికి.  వీరయ్యగారు ప్రజల్ని బాగుచేయాలని రాత్రిపాఠశాల కూడా పెడ్తారు. ఆ పాఠశాలలో వడ్డెల అమ్మాయి ‘రత్నం’ - ‘జాన రంగన్న’ (జగ్గయ్య) ప్రేమ పాఠాలు మొదలెట్తారు. అయితే కులం కట్టుబాట్లు కళ్లెర్ర చేసాయి. కత్తులు కర్రలు దూశాయ్. అయినా భయంలేదని అభయ మిచ్చిన పంతులు వీరయ్యగారిపై పలుకుబడి తగ్గిన చిల్లర దేవుళ్లు పగపట్టారు. కొల్లేటి ప్రజలందరూ ‘దేవుడిరయ్యా-దేవుడిరయ్యా’ అంటూ దండాలు పెట్టే పంతులుగారి మంచితనమే ఆయన హత్యకు దారి తీసింది. జాన్ రంగన్న (జగ్గయ్య) ప్రేమికురాలు వడ్డెల రత్తానికి (ఫ్లాష్ బ్యాక్- యాక్టర్ లేని కారెక్టర్) పంతులు వీరయ్యగారికి సంబంధం వుందని పుకార్లు పుట్టించి, చంపించి, వాళ్లిద్దరూ పురిపోసుకున్నారని ప్రచారం చేస్తారు ‘చిల్లర దేవుళ్లు’.  దీనికి సంబంధించిన సంభాషణలను చిత్రీకరించారు చంచల్ గూడ జైల్లో.  ఆత్మహత్యకు జగ్గయ్యను కారకుడిని చేసి జైలుకు పంపుతారు కథలో. చిల్లర దేవుళ్ల కథను జైలుగోడమీద గీసిపెడ్తాడు జగ్గయ్య.
         చంచల్ గూడా జైల్లో ప్రముఖ కమ్యూన్నిస్ట్ నాయకుడు శ్రీ ఎమ్ ఓంకార్‌ను కూడా కల్సుకున్నారు తిలక్. అక్కడే విజయవాడకు చెందిన సుబ్బరాజు గారిని కూడా కల్పారు. ఎన్కౌంటర్లో చనిపోయిన తిలక్ సోదరుడు నరసింహారావు ప్రస్తావన తెచ్చారు శ్రీ ఓంకార్ .ఆ వివరాలలోకి తర్వాత వెళ్తానన్నారు తిలక్.
         హైదరాబాద్ లో ఈనాడు ఎడిషన్ ప్రారంభించే సన్నాహాలు చేస్తున్న రోజులవి. అప్పటి వరకు వైజాగ్ ఎడిషన్ మాత్రమే వుండేది. ఆ సందర్భంలో ఈనాడు చీఫ్ ఎడిటర్ శ్రీ రామోజీరావును కూడా కలిసారు తిలక్. దెందులూరు గ్రామానికి చెందిన తిలక్ పరిచయస్తుడు శ్రీ ఎమ్ వి సుబ్బారావుగారు ఆయన భార్యతో కలిసి ఈనాడు ఎడిషన్ కు సంబంధించిన యంత్రాలనమరుస్తున్న ప్రదేశానికి వచ్చారు, వారు వారు బంధువులు, స్నేహితులు కూడా.
         కొల్లేటి కాపురం సినిమాకు సంబంధించి పత్రికా పరమైన సీను షూట్ చేసుకోవటానికి ఈనాడు పేపరు అవసరమొచ్చింది. ఈనాడు పేపర్లో ‘ఆత్మహత్య కాదు -- అది హత్యే' అనే ఓ శీర్షికను ప్రచురించి ఆ హెడ్ లైన్ కనిపించేటట్లు షూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలా ప్రింట్ చేయించటానికి తిలక్ గారు చేసిన విజ్ఞప్తిని రామోజీరావుగారు అంగీకరించి ఆయన కోర్కె తీర్చారు. ఇరవై (అప్పటికి) సంవత్సరాల క్రితం కొల్లేటి ప్రాంతంలో వాస్తవంగా జరిగిన ఆ సంఘటనను ఆధారంగా సినిమాలో ఆ వ్యవహారాన్ని చూపారు.
         ‘సినిమాల్లో ఏముంది’ అనే అభిప్రాయంతో వుండేవారట రామోజీరావు గారు అప్పట్లో. అయితే ఆ తర్వాత  శ్రీ యు విశ్వేశ్వరరావుగారు తీసిన 'తీర్పు’ అనే చిత్రంలో ‘న్యాయమూర్తి’ పాత్రను పోషించాడు రామోజీరావుగారు. స్వర్గీయ ఎన్టీఆర్ కూడా అందులో నటించారు. 'నువ్వు ఎట్లాగూ సినిమా వాడివే అవుతావు' అని అప్పుడు విశ్వేశ్వర్రావు గారు అంటే ఒప్పుకోని రామోజీరావుగారు తదనంతర కాలంలో సినీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ స్టూడియోకు అధినేత అయ్యారు.
         ‘కొత్తదనానికి’ కొల్లేటి కాపురం సినిమా మచ్చుతునక. ఏదో రకంగా, ఎంతో మందిని ప్రథమంగా పరిచయం చేసారా సినిమా లో తిలక్.  నాడు రేడియో ఆర్టిస్టుగా వుండే శ్రీ పూర్ణ చంద్రరావుగారిని నేపథ్య గాయకునిగా పరిచయం చేసారు. తరువాత ఆయనో ప్రముఖ గజల్ సింగర్ అయ్యారు. తెనాలిలో డ్రామా ట్రూప్ ను కంట్రోల్ చేస్తున్న శ్రీమతి రామకుమారి అనే కళాకారిణిని, ఆమెతో పాటు అబ్బూరి కమలగారిని పరిచయం చేసారు కొళ్లేటి కాపురం సినిమాలో.


         కొల్లేటి సరస్సుల్లో వ్యవసాయం ఓ చిత్రమైన అనుభూతి. నీళ్లలో పెరిగే విత్తనం కావాలి. అలాంటిది అస్సాంలో దొరికేది, ‘నవారు’గా పిల్చుకునే ఆ రకం విత్తనాన్ని కొల్లేటికి తెప్పించుకున్నారు స్థానికులు. విత్తనం చల్లటం, నారు పోయటం, నాటు వేయటం...మీద ఓ జానపద గేయం వుండేది. ఆ మొత్తం గేయాన్ని .. పాటగా.. రామాయణం కథ ఆధారంగా నాట్లు వేసే సమయంలో చిత్రీకరించారు తిలక్ తన కొల్లేటి కాపురం సినిమాలో. ఆ సినిమాలోని ప్రతి పాట, మాట ఆ ప్రాంతానికి, సంస్కృతికీ, అక్కడి జీవన విధానానికి సంబంధించినవే కావటం విశేషం.
         ఆపాటను గుర్తు చేసుకుంటూ, పాట ముందర చంద్రం (కృష్ణ) డైలాగునూ గుర్తు చేసుకున్నారు. ఆ డైలాగూ, ఆ వెంటనే జనంపాడుకునే ఆ పాట ఇలా సాగుతాయి...
         ‘ఈ కొల్లేరు ఆంధ్రప్రదేశ్ కు నడిబొడ్డున వున్నప్పటికి గుర్తింపు లేకుండా పోయింది. అంతే కాదు.. ఈ కొల్లేట్లో కరణాలు, ఇంజన్ దార్లు మీ కాయకష్టంతో కామందులౌతున్నారు' అని హీరో స్పీచ్ ఇచ్చిన వెంటనే పాట ప్రారంభమవుతుంది.
         ‘ఎవ్వారె యవ్వా-ఇనుకోవే గువ్వ ఎవ్వార యవ్వ ఇనుకోవే గువ్వ- నేలదున్నే ఏల నెలవంక పొడిచింది ఎవ్వారి యవ్వ-ఇసుకోవె గువ్వ ఆహజనకరాజంటిలో సీతమ్మనే పట్టె- ఎవ్వారెయవ్వ ఇనుకోని గువ్వ శివుని విల్లూ విరిసి సీతమ్మనే పట్టె-ఎవ్వారెయవ్వ - ఇనుకో గువ్వ పట్టమూ పట్టంగ పట్టు పట్టే కైక-నారబట్టలతోడ పెట్టడవికంపి ఎవ్వారెయవ్వఇనుకోవే గువ్వ-వనములో సీతమ్మ ఒంటరి గనుండ పదితలలరేడు పరమ నీచుడువాడు- ఎవ్వారెయవ్వా- ఇనుకోవే గువ్వ’ అని సాగుతుంది ఆ పాట.
         అలాగే ఆరుద్ర కలం నుండి వెలువడిన మరోపాటను సినిమాలోని మొదటి పాటను గుర్తు చేసుకున్నారు తిలక్.  అదే అంతరాల పడవమీద పాట: ‘హైలేసో హైలేసో బైలేసా --ఎల్లారే వల్లామాను- హైలెసా హైలెసా - ఆంతరాలు పడువమీద -- అందీ పువ్వులు కొయ్యబోతే .. కొమ్మావంగీ కొప్పునిండే -- ఎల్లారే.. ఎల్లారే చల్లగాలి-- పడుచూ చిలకలు పడవయెక్కె -- ఆగడుసు తలుపులు గంతులు వేసే- చల్లాగాలి అల్లరి చేసే -ఎల్లారె-హైలెసా బైలెసా’.
కొల్లేటి కాపురం సినిమాలో పాటలే కాదు మాటలు కూడా భావవర్భితంగా ఆదోరకం ఆర్థం ప్రస్ఫుటించేలా వుంటాయి. మచ్చుకు కొన్నిచెప్పుకోవచ్చు.
         ‘లంకమేతకు ఏటి ఈతకు ఉన్నట్లు యీ కొల్లేట్లో గొడ్డు పుట్టుటమెంతో గిట్టడమూ అంతే.
         'నాటు వేసిన చేతులేనయ్యా కోతలు కూడా కోసేది’
         ‘కల వాళ్లు కాబట్టి చోటులేకపోయినా సమాధులు కట్టిస్తున్నారు. లేనివాళ్ల శవాలన్నీ కొల్లేటి పాలేగా’.
         ‘ఈ కొల్లేట్లో కుండ కూడు గుండె కెక్కేదాకా నమ్మకంలేదు.... కళ్లనీరు తుడువటానికి పళ్లు తీసుకొచ్చింది’..
         కొల్లేటి కాపురం సినిమాలో యాండ్ర్యూస్ అనే ఓ క్రిస్టియన్ మిషనరీకి చెందిన గుంటూరు వాస్తవ్యుడ్నీ కూడా పరిచయం చేసారు. ఆయన తిలక్ గారు తీసిన 'భూమికోసం' సినిమాను చూసి స్వయంగా తానే కర పత్రాలు ముద్రించి, ప్రచారంచేసారు. తిలక్ మొదట్లో తీసిన ఎమ్మెల్యే సినిమాకు కొల్లేటి కాపురం సినిమాకు లింక్ చేయాలన్న ప్రయత్నం చేసారు చాలా సందర్భాలలో.
         ఎమ్మెల్యే సినిమాలోని 'ఇదేనండి,  ఇదేనండి భాగ్యనగరం-- మూడు కోట్ల ఆంధ్రుల ముఖ్య పట్టణం' అని ఆరుద్ర వ్రాసిన పాటను దశాబ్దంన్నర తర్వాత తీసిన కొల్లేటి కాపురం టైటిల్ సాంగ్ గా కొద్ది మార్పులతో వాడుకున్నారు తిలక్. మార్పు లేకుండా ఆ పాటను రికార్డు చేస్తున్నప్పుడు సెట్స్ లోకి వచ్చారట గజ్జెల మల్లారెడ్డిగారు. ఫలితంగా ఆయన సలహా మేరకు ఆ పాట ‘ఇదేనండీ, ఇదేనండి, భాగ్యనగరం.... ముప్పేట ఆంధ్రుల ముఖ్య పట్టణం’గా మారింది. ఆపాట ద్వారా చార్మినార్, భాగ్యనగరం.. ఇలా హైదరాబాద్ కు  చెందిన చారిత్రక విషయాలు ఎన్నో వర్ణించటం జరిగింది.
         తిలక్ గారి జ్ఞాపకాల్లో సుస్థిర స్థానం కొల్లేటి కాపురం ఆయన మాటల్లో అహర్నిశలూ ఆ సినిమా ప్రస్తావన వస్తూనే వుంటుంది.
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment