Tuesday, July 28, 2020

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము, చతుర్థ స్కంధం: దనుగ్రహంతో చదవడం పూర్తయింది వనం జ్వాలా నరసింహారావు


మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)
శ్రీ మహాభాగవతము
భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది
వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,
                   చదివించును కృష్ణు
                   చదివినను ముక్తి కలుగును
                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా 

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. చతుర్థ స్కందాన్ని డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు అనువదించారు. 294 పేజీల ఈ చతుర్థ స్కందంలో మైత్రేయుడు విదురుడికి స్వాయంభువ మనుపుత్రికల వంశ క్రమాన్ని తెలపడం దగ్గరనుంచి, నారదుడు ఉపదేశంతో ప్రచేతసులు ముక్తి పొందడంవరకు 30అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 30 అంశాల వివరాలు వివరంగా:

మైత్రేయుడు విదురుడికి స్వాయంభువ మనుపుత్రికల వంశ క్రమాన్ని తెలపడం, స్వాయంభువ మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేవాళ్లు జన్మించడం,వాళ్ళలో ఆకూతిని ‘రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి గర్భంలో విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు జన్మించడం, లక్ష్మీ అంశతో ‘దక్షిణ అనే కన్య కలగడం, మనువు కుమార్తె దేవహూతిని కర్థముడికి ఇవ్వడం, ప్రసూతిని దక్షప్రజాపతికి ఇవ్వడం, దక్షప్రజాపతి సంతతి, ప్రసూతి-దక్షుల వల్ల ప్రజాపరంపరలు కలగడం, కర్దమప్రజాపతి సంతతి, కర్దమ ప్రజాపతి తన పుత్రికలను క్షత్రియులకు, బ్రహ్మర్షులకు ఇవ్వడం, కర్దముడి కూతురైన కళవల్ల మరీచికి కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టడం, పావుర్నిమకు గంగ అనే కూతురు, విరజుడు అనే కొడుకు కలగడం ఉన్నాయి.

ఇంకా: కశ్యప ప్రజాపతి వల్ల కలిగిన ప్రజా పరంపరల చేత మూడు లోకాలు నిండి పోవడం, అత్రి మహాముని తపస్సు, ఆయనకు త్రిమూర్తులు ప్రత్యక్షం కావడం, అనసూయాదేవి పాతివ్రత్య మహాత్మ్యం వల్ల ఆమెకు త్రిమూర్తుల అంశతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు జన్మించడం, దక్షుడి కుమార్తెల జననం, భృగువుకు-ఖ్యాతికి శ్రీమహాలక్ష్మి జన్మించడం, సత్రయాగంలో దక్షుడు శివుడిని నిందించడం ఉన్నాయి.     

ఇంకా: ఈశ్వరుడికి-దక్షప్రజాపతికి విరోధం కలగడం, దక్షప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు దాక్షాయణి అక్కడికి వెళ్లడం, శివుడు వీరభద్రుడి ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించడం, అక్కడ నుండి పరాజితులైన దేవతలు బ్రహ్మకు విన్నవించడం, బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుడైన ఈశ్వరుడుని స్తుతించడం, ఈశ్వరుడు దక్షుడుని అనుగ్రహించడం, దక్షాదులు విష్ణువును స్తుతించడం, సతీదేవి హిమవంతుడికి జన్మించి శివుడిని చేరడం, ఉత్తానపాదుడి వృత్తాంతం ఉన్నాయి.

ఇంకా: ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు నారదుడి ఉపదేశాన్ని గైకొని తపస్సు చేయడం, సాక్షాత్కరించిన భగవంతుడిని ధ్రువుడు స్తుతించడం, శ్రీహరి అతడి మనోరదాన్ని నెరవేర్చడం, ధ్రువుడు మళ్లీ తన పురానికి రావడం, ధ్రువుడు కుబేరుడి అనుచరులైన గుహ్యకులతో యుద్ధం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ రాజ్యభోగాల పట్ల విరక్తి పొంది ఉల్కుడికి పట్టాభిషేకం చేసి ధ్రువుడు అంతరిక్షంలో నిలవడం, ఉల్కలుడు వత్సారుడు అనే కొడుకుకు పట్టం కత్తి హరిణి చేరడం, వత్సరుడి వంశపరంపర, అంగపుత్రుడు వేనుడి చరిత్ర,  అర్చి పృథుల జననం, పృథు చక్రవర్తి గోరూపంలో ఉన్న భూమి నుండి ఓషధులను పితకడం, పృథు చక్రవర్తి అశ్వమేథం చేస్తుండగా ఇంద్రుడు అశ్వాన్ని అపహరించడం, ఆయనకు శ్రీహరి ప్రత్యక్షం కావడం, ఆధ్యాత్మ విద్యను ప్రబోదించడం ఉన్నాయి.

ఇవికాకుండా: నారాయణుడు ప్రసన్నుడై పృథు చక్రవర్తిని అనుగ్రహించడం, పృథు చక్రవర్తి సభాసదులకు సద్ధర్మాలను ఉపదేశించడం, పృథు చక్రవర్తి దగ్గరకు సనకాదులు రావడం, పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తిని పొందడం, రుద్రుడు ప్రచేతసులకు యోగాదేశం అనే స్తోత్రం చెప్పడం, రుద్రగీత-రుద్రుడు శ్రీహరిని స్తుతించడం, నారదుడు ప్రాచీనబర్హికి జ్ఞానమార్గాన్ని తెలియచేయడం, పురంజనోపాఖ్యానం, ప్రచేతసుల తపస్సుకు భగవంతుడు మెచ్చి వరాలివ్వడం, ప్రచేతసులకు మారిష వల్ల దక్షుడు జన్మించడం, నారదుడి ఉపదేశంతో ప్రచేతసులకు ముక్తి కలగడం ఈ చతుర్థ స్కందంలో ఉన్నాయి.
ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం.

No comments:

Post a Comment