Sunday, July 19, 2020

చెన్నపట్నం తరలిన సాంస్కృతిక యోధులు .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


చెన్నపట్నం తరలిన సాంస్కృతిక యోధులు
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూలై 9-15,  2000)
         తెలంగాణా విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వున్న రీతిలోనే, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రజా నాట్య మండలికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో ఉండటం అయితే ఎల్ వి ప్రసాద్ గారింట్లోనే అయినా 'తన అజ్ఞాత, ఉద్యమకార్యక్రమాలను మాత్రం మరెన్నో ఇళ్ళ నుండి నిర్వహిస్తుండే వారు తిలక్ గారు. భోజనం మాత్రం ఎక్కువగా ప్రసాద్ గారింట్లోనే.
         నిషేధం నీలినీడల్లో ప్రజా నాట్యమండలి తాలూకు వ్యక్తులు ఒక్కరొక్కరే మద్రాసు చేరుకోనారంభించారు. అలా వచ్చిన వారిలో  తొలుతగా సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి (మా భూమి రచయితలుగా ప్రసిద్ధి కెక్కిన సుంకర-వాసిరెడ్డి), తుమ్మల వెంకట్రామయ్య (రచయిత), రాంభట్ల కృష్ణమూర్తి, షెట్టి ఈశ్వరరావు, తాపీ ధర్మారావు కొడుకు మోహనరావులు ఉన్నారు. ఓ విధంగా సాంస్కృతిక విభాగం అంతా చేరుకుంది మద్రాసుకు.
          అలానే వచ్చిన వారిలో, అక్కడికి అప్పటికే చేరుకున్న వారిలో తాతినేని ప్రకాశరావు, వీరమాచనేని మధుసూదనరావు, మిక్కిలినేని, పెరుమాళ్ళు, చదలవాడ కుటుంబరావు, రాంకోటి, కోగంటి గోపాలకృష్ణయ్యల్లాంటి భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరంతా ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో తమ శక్తి  మేరకు పనిచేసిన వారేనని వేరే చెప్పనక్కర్లేదు.
         మరి వీళ్ళకు మద్రాసులో ఓ ఆధారం దొరకాలి కదా. అది  కె ఎస్ ప్రకాశరావు గారు, తిలక్ గారి ద్వారా ఎల్ వి ప్రసాద్ గారు వీలయినంత వరకు కల్పించసాగారు. ఆ విధంగా సినీ పరిశ్రమలో ప్రజానాట్యమండలి తాలూకు పలువురు కళాకారులు స్థిరపడటానికి నాంది జరిగింది. ఇతరుల ప్రోద్బలంతో కొంత కాలంపాటు ఎల్ వి గారు కూడా (ఆంధ్ర) ప్రజా నాట్య మండలి అధ్యక్షుడిగా పనిచేశారు.
         సరిగ్గా అదే ప్రాంతంలో కృష్ణా జిల్లాకు చెందిన కొందరు ధనవంతులు ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో ప్రసాద్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించారు. వారిలో నిర్మాతలు ఎవి సుబ్బారావు, శేషగిరిరావులు ఉన్నారు. ఆ సంస్థను ప్రోత్సహించిన వారిలో తాతినేని  ప్రకాశరావు గారు కూడా ఒకరు.
         ఇదిలా వుండగా తిలక్ గారు అప్పుడప్పుడే సినీరంగంలో ఎడిటర్‌గా స్థిరపడున్న రోజులవి. సరిగ్గా అప్పట్లోనే కొండముది గోపాల రాయశర్మ గారు వ్రాసిన "శ్రీమతి" అనే స్క్రిప్ట్ సారథి ఫిల్మ్స్ కు ఉద్దేశించబడింది. గృహప్రవేశం సినిమా తీసిన తర్వాత మోడల్ ప్రొడక్షన్స్, సారథి నుండి విడిపోయింది. "స్వతంత్ర ప్రొడక్షన్స్" అనే పేరుతో అదే రోజుల్లో మరో స్వంత కంపెనీని స్థాపించారు. ఇలా విస్తరించసాగాయి తెలుగు వారి ఫిల్మ్ కంపెనీలు రకరకాల కారణాల వల్ల. ఆ స్వతంత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ క్రిందనే ఎల్ వి ప్రసాద్ గారి దర్శకత్వంలో ‘‘ద్రోహి" అనే సినిమాను తీశారు కెఎస్ గారు.
         కామ్రేడ్ పి సి జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు పలువురు ఆ పార్టీపై అభిమానం పెంచు కున్నారు. ప్రతి ఇంటిలోనూ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు కనీసం ఒక్కరైనా కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యే వారని అన్నారు తిలక్. విచిత్రంగా ప్రతి ఇంటిమీద కాంగ్రెస్, కమ్యూనిస్టు జండాలు ఎగిరేవి. ఇలా ఆకర్షితులైన చాలా మంది ప్రజా నాట్య మండలిలో సంబరాలు పెట్టుకోవటంతో కాలక్రమేణా మద్రాసుకు వచ్చి సినీ రంగంలో స్థిరపడి క్యాపిటలిస్టయ్యారు.


         ఇక ఎల్ వి ప్రసాద్ గారి విషయానికొస్తే, ఆయన మటుకు ఆయనకు ఏ ఉద్యమాలతో సంబంధం ఆదినుండీ లేదు. ఆయనది ఎప్పుడూ ‘‘ప్రొఫెషనల్ మోటివేషనే". ఆయన సామాజిక స్పందన కేవలం సినీ పరిశ్రమకే - పోనీ - సినిమాలు తీయటం వరకే పరిమితం, ఏ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొనే వారు కారాయన.
         కొండముది గోపాల రాయశర్మ గారు "శ్రీమతి" అనే సినిమా స్క్రిప్ట్ తయారుచేసి సారధీ బ్యానర్ క్రింద సినిమా తీసేటందుకు ఇచ్చారని చెప్పుకున్నాం గదా. దానికి అప్పట్లో డైరెక్టర్ ఎల్ వి ప్రసాద్. "మేడమ్ ఎక్స్" అనే నవల ఆధారంగా తయారు చేయబడిందా స్క్రిప్ట్.
         ‘‘శ్రీమతి" సినిమా తీసేటందుకు నూతన ఆర్టిస్టుల అన్వేషణలో ఆంధ్రా టూర్ కెళ్ళారు రచయిత కొండముది (ఆయనే అప్పటికే నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు) డైరెక్టర్ ఎల్ వి ప్రసాద్ పనిలో పనిగా లొకేషన్ (షూటింగ్ కొరకు) చూడటానికి అమరావతిని కూడా దర్శించారు. అప్పుడే.
         వారప్పుడు ప్రాథమికంగా ఎంపిక చేసి మద్రాసుకు రమ్మని పిలిచిన వారిలో దశాబ్దాలపాటు సినీరంగాన్ని, దశాబ్దం పైగా ఆంధ్ర రాజకీయ రంగాన్ని శాసించిన నందమూరి తారక రామారావు గారు ఒకరు. మిగిలిన వారిలో బ్యాంకు ఉద్యోగి, రచయిత అయిన ప్రసాద్ గారు, జర్నలిస్ట్ గా ఆంధ్ర పత్రికలో పని చేసిన వెంకట్రావు గారు, చిన్న చిన్నపాత్రలను సినిమాల్లో పోషించిన ముక్కామల గారి సోదరుడు వున్నారు. ఈ రచయిత ప్రసాద్ గారు ఆ తర్వాత కాలంలో, గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూటర్‌ సోషల్‌ యాక్షన్ (నీసా) అనే స్వచ్ఛంద సంస్థ రూపొందించిన "భారతరత్న ఇందిరమ్మ" రూపవాణి కార్యక్రమానికి స్క్రిప్ తయారు చేస్తున్నప్పుడు తోడ్పడ్డారు. ఈ రూపవాణి కార్యక్రమం ద్వారా ఇందిర పాత్రను ధరించిన శ్రీమతి గీతారెడ్డి రాజకీయ రంగప్రవేశానికి బాటలు వేసింది. ఎంఎల్ఏ గానూ, మంత్రిగానూ ఆమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో స్థానం పొందిన సంగతి తెలిసిందే.
         ఎన్టీరామారావు గారికి మూవీ టెస్ట్, స్టిల్ చేస్ట్, మేకప్ టెస్ట్ ప్రసాద్ గారు చేయించినప్పుడు ఎడిట్ చేసిన ఇద్దరు వ్యక్తులు శ్రీ రాజన్, శ్రీ తిలక్ లు.  ఎమెచ్యూర్ కెమెరామెన్ డివి ఎస్ మణ్యం (సుబ్రహ్మణ్యంగా, గుంటూరులో ఎన్టీఆర్ కు స్నేహితుడు కూడా ఆయన) స్టిల్ ను తీశారు.  అప్పట్లో స్టిల్ స్టూడియో ఎల్ వి ప్రసాద్ గారింట్లోనే ఉండేదట. ఆ సందర్భంలోని తిలకమీద కూడా తీసిన ఓ స్టిల్ ఇప్పటికీ ఆయన వద్ద వుంది.
         తిలక్ గారితో సహా అందరూ ఎన్టీరామారావు గారినే ఎంపిక చేయటం, ఆయనంటే ఇష్టపడటం జరిగింది వెంటనే. అయితే దురదృష్టవశాత్తు "శ్రీమతి" సినిమా తీసే ప్రాజెక్టు వివిధ కారణాలవల్ల వాయిదా పడింది. కనీసం తాత్కాలికంగా నన్నా వాయిదా వేయక తప్పలేదు.
         దరిమిలా సారథి ఫిల్మ్స్ చల్లపల్లి రాజాగారి సోదరుడు రామకృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలోకి పోవటం, “విజయా" వారితో సహా ఇతరుల ప్రొడక్షన్స్ లో ఎల్.వి.ప్రసాద్ కూడా బిజీ కావటం కూడా "శ్రీమతి" వాయిదా వేయటానికి దోహదపడ్డాయి.
         అప్పట్లో తిలక్, ఆ తర్వాత కె ఎస్ ప్రకాశరావు గార్లకు మిర్జాపూర్ రాజు గారికి చెందిన "మీర్జాపూర్ స్టూడియో"తో సంబంధముండేది. ఆ స్టూడియో ఆధ్వర్యంలో శరత్ నవల ఆధారంగా "మన దేశం" అనే సినిమా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. శ్రీ ఎల్ వి ప్రసాద్ గారు దానికి దర్శకులు, నాయకుడి పాత్రను సిహెచ్ నారాయణరావు పోషించగా, నాయకిగా ఆయన సరసన మీర్జాపూర్ రాజా గారి భార్య శ్రీమతి కృష్ణవేణి పోషించారు. అందులో అవకాశమిచ్చారు మొట్టమొదటి సారిగా ఎన్టీరామారావుకు సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర వేయటానికి.  అలా జరిగింది. ఆయన సినీరంగ ప్రవేశం.
          ‘పుడోకిన్’ అనే రష్యన్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్ మీద రచించిన ఓ చక్కని పుస్తకాన్ని తిలక్, ఎన్టీఆర్ కు బహూకరించారట అప్పట్లో.  ఎన్టీఆర్‌ను విశ్వవిఖ్యాత నటునిగా తీర్చిదిద్దటంలో ఆ పుస్తకం ఆయనకెంతగానో తోడ్పడిందని, ఆ విషయం ఎన్టీఆరే తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు తిలక్.
                                                                        (మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment