Wednesday, September 9, 2020

ఖగోళ విషయ విస్తారం-1 ..... శ్రీ మహాభాగవత కథ-31: వనం జ్వాలా నరసింహారావు

 ఖగోళ విషయ విస్తారం-1

శ్రీ మహాభాగవత కథ-31

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపి తపింప చేస్తూ, కామ్తిమంతం చేస్తున్నాడు. సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ-తక్కువలు ఉండవు. సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.

ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉన్నది. దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉన్నది. దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం నిమ్లోచని ఉన్నది. ఉత్తరం వైపున చంద్రుడి పట్టణం విభావరి ఉన్నది. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి, నివృత్తులకు హేతువులై ఉంటాయి.

సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షద్రాదులతో కూడి తిరుగుతూ వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వెల యోజనాల మేర సంచరిస్తుంది.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు ఒక కోటి ఏభై ఏడులక్షల ఏభై వెల యోజనాలు. ఈ ఇరుసుకు గానుగ చక్రంలాగా, చక్రం అమర్చబడి, మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం వైపు, ఇంకొకటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరిసులు రెండింటి మీద ఈ చక్రం ధ్రువాల లో బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర-దక్షిణ ద్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడుతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ద్రువాలకు బిగించబడి ఉంటాయి. అ రథంలో సారథి కూర్చోడానికి అనువైన చోటు ముప్పైఆరు లక్షల యోజనాల పొడవు, తొమ్మిది లక్షల యోజనాల వెడల్పు కలిగినది. ఆ రథానికి కాడి కూడా ముప్పైఆరు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది.         

సూర్య రథానికి గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులు (గాయత్రి, ఉష్ణిక్, త్రిష్ణువ్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి) గుర్రాలై ఉంటాయి. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60 వేలమంది ఋషిశ్రేష్ఠులు సూర్యుడి ముందర సౌరసూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు బొటన వేలు పైభాగం ఎంత ఉంటుందో అంతే శరీరం కలవారై ఉంటారు. ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, పతంగులు మొదలైన వారంతా నెలనెలా వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది ఇలా సేవిస్తూ ఉంటే, సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు సంచరిస్తాడు.

         మేరువుకు, ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం, రాశి చక్రం మీద సంచరించడం ఎలా కుదురుతుందన్న సందేహం కలగవచ్చు. అంటే, ఉత్తర ధ్రువం ఉండేది ఉత్తర దిశలో కదా, రాశి చక్రం ఉండేది భూమధ్య రేఖ మీద కదా, అలాంటప్పుడు, ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం, రాశి చక్రం మీద సంచరించడం ఏక కాలంలో ఎలా అన్నది అసలు సందేహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది. అదే, సకలం భగవత్సృష్టి విలాసం అనే విషయం. ఇలాంటి సందేహాలను పూర్తిగా తీర్చగలగడం ఒక్క సర్వేశ్వరుడికే చేతనవుతుంది.

         నక్షత్రాలతో, రాశులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ కాలచక్రం వెంట సంచరించే సూర్యాది గ్రహాలకు నక్షత్రాలతోను, రాశులతోను, ఉనికి ఉండడంతో చక్రగతి వల్ల, వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల, రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమపురుషుడు జ్యోతిశ్చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీవింప చేస్తున్నాడు. మేషాది పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు (అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు.

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment