Thursday, September 3, 2020

కాల లక్షణ నిరూపణ .... శ్రీ మహాభాగవత కథ-25 : వనం జ్వాలా నరసింహారావు

 కాల లక్షణ నిరూపణ

శ్రీ మహాభాగవత కథ-25

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

పరమేశ్వరుడి సృష్టికి అంతం, అన్యవస్తు సంయోగం, రెండూ అవసరం లేదు. ఈ యావత్ ప్రపంచం పుట్టుక వేరు. సృష్టిలో విడదియ్యలేని అత్యంతా సూక్ష్మాంశానికే ’పరమాణువు’ అని పేరు. కిటికీ నుంచి ప్రసరించే సూర్యకాంతిలో మనకు కనిపించే చిన్న రేణువులలో ఆరవ భాగానికి ’పరమాణువు’ అని పేరు. సూర్యకాంతి ఈ పరమాణువు ద్వారా ప్రసరించేటప్పుడు పట్టె కాలానికి ’సూక్ష్మకాలం’ అని పేరు. దీన్ని మనం ఊహించుకోవాల్సిందే! సూర్యుడు మేషాది పన్నెండు రాశులలో తిరిగే కాలానికి ’మహత్కాలం’ అని పేరు. దీనినే సంవత్సరం అని కూడా అంటాం. రెండు పరమాణువులు కలిస్తే ఒక ’అణువు’ అవుతుంది. మూడు అణువులు ఒక ’త్రసరేణువు’. మూడు త్రసరేణువులు కలిస్తే ఒక ’త్రుటి’. నూరు త్రుటులు కలిస్తే ఒక ’వేధ’. మూడు వేధలు కలిస్తే ఒక ’లవం’. మూడు లవములు ఒక ’నిమేషం’. మూడు నిమేషాలు ఒక ’క్షణం’. అయుదు క్షణాలు ఒక ’కాష్ట’. పది కాష్టలు ఒక ’లఘువు’. పదిహేను లఘువులు ఒక ’నాడి’. రెండు నాడులు ఒక ’ముహూర్తం’. అలాంటి నాడులు ఆరు కానీ ఏడు కానీ అయితే ఒక ’ప్రహరం’. దానినే ’యామం’ అనీ, ’జాము’ అనీ అంటారు.   

దిన పరిమాణాన్ని తెలిపే నాడిని కొలిచే విధానం ఉన్నది. ఆరు ఫలాల రాగితో పాత్రను సిద్ధం చేసి, నాలుగు మినప గింజల బరువు కల బంగారంతో నాలుగు అంగుళాల పొడవుకల కమ్మీ తయారు చేసి, దానితో ఆ పాత్ర కింద రంధ్రం చేసి, ఆ రంధ్రం గుండా తూమెడు నీరు పూర్తిగా కిందకు కారడానికి ఎంతకాలం పడుతుందో అంత కాలాన్ని ’నాడి’ అంటారు. నాలుగు జాములు ఒక ’పగలు’ అవుతుంది. అలాగే నాలుగు జాములు ఒక ’రాత్రి’ అవుతుంది. పగలు, రాత్రి కలిస్తే మానవులకు ఒక ’దినం’ అవుతుంది. పదిహేను దినాలు ఒక ’పక్షం’ అవుతుంది. ’శుక్ల పక్షం’, ’కృష్ణ పక్షం’ అని రెండు ఉన్నాయి. రెండు పక్షాలు కలిస్తే ఒక ’నెల’. అది పితృదేవతలకు ఒక ’దినం’. రెండు నెలలు ఒక ’ఋతువు’. ఆరు నెలలు ఒక ’ఆయనం’. ఆయనాలు రెండు. ’దక్షిణాయనం’, ”ఉత్తరాయనం’. ఈ రెండూ కలిస్తే ఒక సంవత్సరం. నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు. మానవుల సంవత్సరం దేవతలకు ఒక్క దినం అవుతుంది.

ఈశ్వరుడు అంశ అయిన సూర్యుడు గ్రహ, నక్షత్రాలతో కూడి తారాచక్రంలో ఉండి తారాచక్రంలో ఉండి పరమాణువు మొదలు సంవత్సరం వరకు వున్న కాలంలో పన్నెండు రాశులను చుట్టి వస్తాడు. ఈ సూర్యగమనమే సంవత్సరం, వలీసంవత్సరం, ఇడాసంవత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. సూర్యగమనం వల్ల సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం, బార్హస్పత్యమానం అనే భేదాలతో సంవత్సర కాలం ఏర్పడుతుంది. కాలాన్ని ప్రవర్తింప చేసే సూర్యుడు, విత్తనాల నుండి అంకురాలు మొలకెత్తినట్లు కాలరూపమైన తన శక్తితో అనుకూలంగా మలచుకుంటూ, జీవుల ఆయువు మొదలైనవాటిని తగ్గిస్తూ, ఆయువు తగ్గుతుంటే క్రమంగా విషయాల పట్ల కోరికలు తగ్గుతూ, కోరికలతో యజ్ఞాలు చేసేవారికి గుణాలతో కూడిన స్వర్గాది లోకాలను సమకూరుస్తూ, ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అయిదు విధాలైన సూర్యభగవానుడిని ఆరాధించాలి. 

ఇకపోతే కృతయుగ సంఖ్య నాలుగువేల దివ్య సంవత్సరాలు. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్లు. గతించిన యుగానికి, రాబోయే యుగానికి మధ్యకాలాన్ని ’సంధ్య’ అంటారు. త్రేతాయుగ ప్రమాణం మూడువేల దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్లు. ద్వాపరయుగ ప్రమాణం రెండువేల దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ ప్రమాణం వెయ్యి దివ్య సంవత్స్రరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. ఈ సంధ్యాంశాల మధ్యకాలంలో ధర్మం అతిశయిస్తుంది. సంధ్యాంశలో ధర్మం అల్పమై వుంటుంది. దర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలు, త్రేతలో మూడు పాదాలు, ద్వాపరలో రెండు పాదాలు, కలియుగంలో ఒక్క పాదంతో సంచరిస్తుంది. ఈ పాదాల భేదం వల్ల ప్రజలలో మర్యాదలు తగ్గుతాయి. అధర్మం పుట్టి వృద్ధిపొందుతుంది.

భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం.....వీటికంటే పైన సత్యలోకం ఉంటుంది. అక్కడ ఉండే బ్రహ్మకు చతుర్యుగాలు వేయి అయితే ఒక పగలు అవుతుంది. అలాగే రాత్రికూడా. బ్రహ్మ రాత్రి నిద్రపోతే లోకాలన్నిటికీ ప్రళయం వస్తుంది. మేల్కొని చూస్తే తిరిగి లోకాలు పుట్తాయి. ఆ బ్రహ్మ ఒక్క దినంలో పద్నాలుగు మన్వంతరాల కాలం గడుస్తుంది. వాళ్లలో ఒక్కొక్క మనువుకాలం 71 దివ్య యుగాలు. దీనికే మన్వంతరం అని పేరు. దేవతలు, మునులు, సప్తఋషులు వీళ్లంతా భగవదంశతో పుట్టి ఈ మన్వంతరాలలో ఈ లోకాలను పాలిస్తారు. శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాలలో జన్మించి ఈ మన్వంతరాలలో తన సత్త్వగుణం వల్ల, పురుష భావం వల్ల ఈ విశ్వాన్ని పాలిస్తాడు. పగలు పూర్తికాగానే బ్రహ్మ శయనిస్తాడు. ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయన శక్తిసామర్థ్యాలు, పరాక్రమం అంధకారంతో ఆవరింపబడి వుంటాయి. బ్రహ్మ నిద్రించే సరికి భువనత్రయం కూడా కటిక చీకటిలో సూర్యచంద్రులతో పాటు లీనమై పోతుంది. శ్రీహరి శక్తిరూపమైన సంకర్షణాగ్ని ముల్లోకాలను దహిస్తుంది. ఆ అగ్నికీలలకు వ్యాపించిన వేడికి తట్టుకోలేక మహర్లోకవాసులు జనలోకానికి పరుగెత్తుతారు. ఆ విలయ సమయంలో వీచే భీకరమైన  వాయువులకు ఎగిసిపడే మహా భయంకరమైన సముద్ర జలాలు మూడులోకాలను కప్పేస్తాయి. ఆ మహార్ణవ మధ్యలో శయనించి ఉంతాడు శ్రీమన్నారాయణుడు. తన కడుపులో సమస్త లోకాలను పెట్టుకుని యోగనిద్రలో ఉంటాడు ఆయన.  

ఈ విధంగా అనేక రాత్రుళ్లు, పగళ్లు గడుస్తుంది. మానవుల లాగానే బ్రహ్మ దేవుడి ఆయుర్దాయం కూడా (ఆయన లెక్కలో) వంద సంవత్సరాలే. ఆ వంద సంవత్సరాలలో మొదటి 50 ’పూర్వ పరార్ధం’ అనీ, రెండవ 50ని ’ద్వితీయ పరార్ధం’ అనీ అంటారు. ఈ మొత్తం కాలాన్ని ’బ్రహ్మకల్పం’ అని పిలుస్తారు. ఈ కల్పం ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఉదయించిన కారణంగా బ్రహ్మకల్పం అని పిలుస్తారు. దీనికే ’శబ్దబ్రహ్మం’ అని మరొక పేరుంది. ఎప్పుడైతే పంకజనాభుడి నాభి అనే సరస్సులో సమస్త భువనాలకు ఆశ్రయభూతమై పద్మం ప్రకాశిస్తుందో అది ’పద్మకల్పం’ అనే పేరుతో ఒప్పుతుంది. బ్రహ్మదేవుడి ఆయుర్దాయంలో మొదటి సగం అంటే ’పూర్వ పరార్ధం’ గడిచిపోయింది. ఇక రెండవది అయిన ’ద్వితీయ పరార్ధం’ ప్రారంభం ఎప్పుడంటే సూకరాకారాన్ని ఎప్పుడు ధరిస్తాడో అప్పుడు ప్రారంభమవుతుంది. దానిని ’వరాహకల్పం’ అంటాం. ఇప్పుడు నడుస్తున్న కల్పం వరాహకల్పమే! ఈ శ్వరుడికి పరమాణువు మొదలు పరార్ధం వరకు గల కాలం ఒక్క నిమిషం మాత్రమే. ఈశ్వరుడే కాలానికి కర్తగాని, కాలం ఈశ్వరుడికి కాదు. శ్రీమహావిష్ణువు అన్నిటికీ అతీతుడు. ఆ మహాపురుషుడికి కాలం ఎన్నటికీ కర్తకాదు. ఈ బ్రహ్మాండం పదహారు వికారాలతో కూడి, పంచభూతాలు, పది విధాలైన ఆవరనాలు కలిగి, 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. భగవంతుడు పరమాణు రూపంలో బ్రహ్మాండంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అసంఖ్యాకమైన మహాండ సమూహాలు ఆయనలో అణగి ఉంటాయి. ఆ పరమపురుషుడిని వర్ణించడం ఎవరి తరం కాదు.    

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

No comments:

Post a Comment