Thursday, August 27, 2020

నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన పురంజనోపాఖ్యానం .... శ్రీ మహాభాగవత కథ-18 : వనం జ్వాలా నరసింహారావు

 నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన పురంజనోపాఖ్యానం

 శ్రీ మహాభాగవత కథ-18

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         ఒకనాడు, ఏదైనా గొప్ప మహత్కార్యం చేయాలన్న తలంపుతో వున్న మహారాజు ప్రాచీనబర్హి దగ్గరికి నారదుడు వచ్చాడు. వచ్చి, ఏ శుభాన్ని కోరి మహత్కార్యం చేయాలనుకుంటున్నాడని ప్రాచీనబర్హిని ప్రశ్నించాడు. మోక్షస్థితిని తెలుసుకోవడానికి తనకు జ్ఞానోపదేశం చేయమని నారదుడిని అడిగాడు ప్రాచీనబర్హి. సంసార చక్రంలో పరిభ్రమించే తన లాంటివాడు మోక్షపదాన్ని పొందలేడు అని కూడా అంటాడు. అప్పుడు నారదుడు, యజ్జాలలో ఆయన చంపిన జంతువులు వేలసంఖ్యలో వున్నాయనీ, అవన్నీ ఆయన కసాయితనాన్ని స్మరిస్తూ, ఆయన ఎప్పుడైతే పరలోకం చేరుతాడో అప్పుడు ఆయన్ను హింసించడానికి ఎదురుచూస్తున్నాయనీ, ఆ ఆపద నుండి దాటడానికి ఒక ఇతిహాసాన్ని చెప్తాననీ అంటూ పురంజనోపాఖ్యానం చెప్పాడు.

         పూర్వకాలంలో పురంజునుడనే రాజుండేవాడు. అతడికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన కల విజ్ఞాతుడనే స్నేహితుడున్నాడు. తనకు అనుకూలమైన పురం కొరకు స్నేహితుడితో కలిసి పురంజనుడు భూమండలమంతా తిరిగాడు. భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు ఒకనాడు. అది గోపురాలతో, ప్రాకారాలతో, బురుజులతో, కందకాలతో.....ఇలా రకరకాల సౌకర్యాలతో, సర్వలక్షణాలు కల నాగుల నివాస పట్టణమైన భోగవతి లాగా వున్నది. ఆ పురానికి వెలుపల అందమైన ఒక ఉద్యానవనం వున్నది. అందులో సరస్సులున్నాయి. ఆ ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన యువతిని అనుచరగణంతో సహా చూశాడు. ఆమె ఎవరని, ఆమె పేరేమిటని, తండ్రి ఎవరని, ఆమెను అనుసరిస్తున్న వున్న పదకొండు మంది సేవకులు ఎవరని, ఆమె ఈ వనంలోకి రావడానికి కారణం ఏమిటని, ఆమె ముందు నడుస్తున్న పాము ఎవరని ప్రశ్నించాడు పురంజనుడు. తనను ప్రేమించమని కూడా అడిగాడు.      

తనకు తన తండ్రి ఎవరో, తన కులం ఏమిటో, పేరేమిటో, తానున్న ఈ పురం పేరేమిటో, దాన్ని నిర్మించిన వాడెవరో తెలియదనీ, తన వెంట వున్నవాళ్లు తన సఖులని, చెలికత్తెలని, ఆ పాము తను నిద్రించేటప్పుడు  పురాన్ని పాలిస్తుందని అన్నది ఆ యువతి జవాబుగా. తన భాగ్యవశాన పురంజనుడు అక్కడికి వచ్చాడని, ఆ పురాన్ని స్వీకరించి పాలించమని, తాను సమకూర్చే కోరికలన్నిటినీ నూరేళ్లు అనుభవించమని అన్నది. పురంజనుడు లాంటివాడిని తనలాంటి కన్య తప్పక వరిస్తుందని చెప్పింది. ఆ పద్మాక్షిని పురంజనుడు తక్షణమే వరించాడు. ఆ పురంలోకి ప్రవేశించి ధన్యుడయ్యాడు. వంద సంవత్స్రరాలు సమస్త సౌక్యాలను అనుభవించాడు. ఆ పురానికి వున్న మొత్తం తొమ్మిది ద్వారాల అధిపతులకు, తూర్పున వున్న అయిదు ద్వారాల అధిపతులకు మహాధిపతి పురంజనుడే. ఆయా ద్వారాల ద్వారా రకరకాల విషయాలను పొందుతాడు.

అతడి నగరంలో నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరు గుడ్డివాళ్లున్నారు. వాళ్ల సాయంతో ఆయన గమనం, కరణం అనే పనుల్ని నెరవేర్చుకుంటాడు. అంతఃపురంలోకి వెళ్లేటప్పుడు విషూచీ అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహప్రసాద హర్షాలను పొందుతాడు. ఇలా పురంజనుడు కామాసక్తుడై, ’బుద్ధ’ అనే పట్టమహిషి వల్ల వంచించ బడ్దాడు. ఆమె పురంజనుడు ఏది చేస్తే అది చేస్తుంది. తింటే తింటుంది, తాగితే తాగుతుంది, నడిస్తే నడుస్తుంది. అలా పురంజనుడు తన నిజస్వరూపాన్ని ఎడబాసి, పట్టమహిషి వల్ల మోసపోయి, జ్ఞానం కోల్పోయి, ఆ పురంలో కాపురం వున్నాడు. అలా కొన్నాళ్లు గడిచాక ఒకనాడు ధనస్సు, బాణాలు ధరించి సైన్యంతో కలిసి వేగంగా బయల్దేరి, పురాన్ని వదిలి, పంచవ్రస్తం అనే అడవికి వెళ్లి, పట్టమహిషిని విడిచి, మదంతో సంచరించాడు. మృగాలను దయాహీనుడై వధించాడు. వేటాడింది తన ఆహారం కోసం కాదు, కేవలం వినోదం కోసం చేసిన రాక్షస క్రీడ. జ్ఞానియైన విద్వాంసుడు చేయతగని హింసను చేసి, నియమాన్ని ఉల్లంఘించి, దుస్సహంగా వేటాడి, అలసిపోయి మందిరానికి వెళ్లాడు.

బడలిక తీరేదాకా నిద్రపోయాడు పురంజనుడు.

మళ్లీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసుపడ్డాడు. భార్య కనిపించక పోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు. కిందపడి పొర్లాడుతూ, ప్రణయ కోపం నటిస్తూ పడుకున్న భార్యను చూపించారు వారు. ఆమెను దగ్గరికి తీసి ఓదార్చాడు. అనునయించాడు. ఆమె కోపాన్ని వీడి అలంకరించుకుని భర్తను చేరింది. ఇద్దరూ శృంగారంలో రాత్రిపగలు అనే తేడా లేకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి గడిపి, ఆయువు క్షీణిస్తున్నదన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు. పురంజనుడు ఒళ్లు మరిచిపోయి జీవితాన్ని గడిపాడు. అతడి నవయవ్వన కాలమంతా అరక్షణం లాగా గతించి పోయింది. పదకొండు వందలమంది కొడుకులను, నూటపదిమంది కూతుళ్లను కన్నారు వారిద్దరు. అతడి ఆయుష్షులో సగభాగం తరిగిపోయింది. కుమారులకు, కుమార్తెలకు వివాహం చేశాడు. వారికి ఒక్కొక్కరికి వందమంది చొప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది.

ఆ తరువాత నిష్ఠగా యజ్ఞదీక్ష వహించి, అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు. ప్రాచీనబర్హి లాగానే యజ్ఞాలకోసం వేలాది పశువులను చంపాడు. తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. అప్పుడు చండవేగుడు అనే గంధర్వ రాజు పురంజనుడి పురాన్ని చుట్టుముట్టాడు. అతడు ఏమీ చేయలేక చింతాక్రాంతుడై పోయాడు. ఇదిలా వుండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవడంతో కోపించి శపించింది. యవన దేశాధిపతైన భయుడు కూడా ఆమెను తిరస్కరించాడు. ఆమెకు భర్త ఎవరో చెప్తానని అంటూ, తమ్ముడు ప్రజార్వుడుతో కలిసి పురంజనుడి పురాన్ని ముట్టడించాడు.  కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది. పురంజనుడు ఇష్టం లేకపోయినా ఆ పురాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధపడ్దాడు. శక్తిహీనుడైపోయాడు. తన సంతానాన్ని తలచుకుని తపించాడు. తాను మరణిస్తే భార్య అనాథై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు. అలా దుఃఖిస్తున్న పురంజనుడిని తీసుకుపోవడానికి భయుడు వచ్చాడు. అతడిని పశువును కొట్టినట్లు కొట్టి ఈడ్చుకుపోయాడు. అనుచరులంతా ఆయన వెంట వెళ్లారు. ఆయన వున్న పురం పంచభూతాలలో కలిసిపోయింది. చనిపోయి పరలోకం చేరిన పురంజనుడిని యజ్ఞపశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి. చాలాకాలం పరలోక బాధలు అనుభవించాడు. మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు.   

మలయకేతనుడనే పాండ్యరాజు విదర్భ రాకుమారిని వీర్యశుల్కంగా పొంది వివాహమాడాడు. వారిద్దరికి ఒక కూతురు, ఏడుగురు కొడుకులు జన్మించారు. కొడుకులు ద్రావిడ దేశాధిపతులయ్యారు. ఒక్కొక్కరికి కోటానుకోట్ల కొడుకులు పుట్టారు. మలయకేతుడి కుమార్తె అగస్త్యుడిని పెళ్లిచేసుకుంది. మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్లి వెయ్యి దివ్య సంవత్స్రాలు తపస్సు చేశాడు. చివరకు ప్రాణాలు త్యజించాడు. వైదర్భి విలపించింది. సహగమనం చేయడానికి సిద్ధపడింది. అప్పుడొక విజ్ఞానస్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి, ఆమెతో, పూర్వ జన్మలో తామిద్దరం హంసలమని, స్నేహితులమని చెప్పాడు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తికలిగి వైదర్భి కామినీ నిర్మితమై, ఆయిదు ఆరామాలు, తొమ్మిది వాకిళ్లు, ఒకే పాలకుడు, మూడు చావళ్లు, ఆరు గుంపులు, అయిదు అంగళ్లు, పంచ ప్రకృతులు, స్త్రీయే నాయికా కలిగిన ఒక పురాన్ని చూశావని చెప్పాడు. అలాంటి పురంలో ప్రవేశించినవాడు స్త్రీలమీద ఆధారపడే అజ్ఞాని అనీ, దాంట్లో వైదర్భి ప్రవేశించి, కామినికి చిక్కి, ఆమెతో ఆనందిస్తూ, ఈశ్వరుడిని విస్మరించి, చివరకు వైదర్భిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా తన మాయతో కలిపించబడిందని, తామిద్ద్రరం పూర్వం హంసలమని, అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు.

ఇదంతా చెప్పిన నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మ తత్త్వాన్ని ప్రాచీనబర్హికి తెలియచెప్పాను అని అన్నాడు. ప్రాచీనబర్హి దర్భలను భూమండలమంతా పరచి, అహంకారంతో, అవినయంతో ఎన్నో పశువులను చంపాడని, కానీ, కర్మస్వరూపాన్ని, విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడని అదేంటో చెప్తాను వినమని అన్నాడు. "ఆ సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదయితే వుందో అదే విద్య. ఆ పరమాత్మయే దేహధారులకు అత్మ. ఈశ్వరుడు. కాబట్టి క్షేమకరమైన ఆశ్రయం నారాయణుడి పాదమూలాలే. ఆ శ్రీమహావిష్ణువే ప్రియాతిప్రియమైన వాడు, సేవించతగ్గవాడు. ఆయనను ఆశ్రయించి సేవించే వారికి అణుమాత్రమైనా దుఃఖం కలగదు. ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరిస్వరూపం. కాబట్టి సకల జీవులకు ఆశ్రయమైన ఈశ్వరుడిని భజించు. సర్వ విధాలా విరక్తిని పొందు. మనస్సే జీవులందరికీ సంసార కారణం. అటువంటి కర్మ వశం వల్ల ఇంద్రియాలలో సంచరించడం జరుగుతుంది. దాన్నే అవిద్య అంటారు. అవిద్య వల్లే అనేక జన్మలు, కర్మ బంధాలు కలుగుతున్నాయి. కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు. సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుడిని, పద్మనేత్రుడిని, ఈశ్వరుడిని ధ్యానించు. సర్వజగత్తును భగత్ స్వరూపంగా అర్థం చేసుకుని అతడి పాదపద్మాలను ఆరాధించు".

ఈ విధంగా, జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన వెళ్లిపోయాడు. ఆ తరువాత ప్రాచీనబర్హి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. అవ్యయానందమైన విష్ణుపదాన్ని పొందాడు.            

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment