Wednesday, August 12, 2020

శ్రీరాముడి దండకారణ్య ప్రవేశం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడి దండకారణ్య ప్రవేశం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ, చింతన (13-08-2020)  

          చిత్రకూటం నుండి సీతారామలక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు. శ్రీమద్రామాయణంలో శ్రీసీతారామలక్ష్మణులు మినహా, తక్కినవారందరూ సందర్భానుసారంగా వచ్చినవారే. ఈ ముగ్గురి సంబంధం చిద చిదీశ్వరుల సంబంధాన్ని తెలుపుతున్నది. ప్రకృతికి అధిష్ఠాన దేవత లక్ష్మి. ఆమె సీత. ఈమె చైతన్య స్వరూపిణి. ప్రకృతి బద్ధాత్మ స్థానంలోఈమె చెప్పబడింది. లక్ష్మణుడు ప్రకృతి సంసర్గంలేని జీవుడు. కాబట్టే ఈయన్ను భార్యతో జంజాటంలేని వాడిగా చెప్పడం జరిగింది. శ్రీరాముడు ఈశ్వరుడు. ప్రకృతి బద్ధజీవుడు, శుద్ధజీవుడు. ఇరువురూ ఈశ్వరుడిని ఆశ్రయించి, ఆయనకు శేషభూతులై వుండేవారే. ఈ తత్వం తెలిసినవాడు ముక్తుడవుతాడని భగవద్గీతలో చెప్పబడింది. శ్రీమద్రామాయణం ఈ ముగ్గురి సంబంధమనే విషయం ఆద్యంతం బోధిస్తున్నది.

శ్రీరామచంద్రమూర్తి భయంకరమైన క్రూర మృగాలతో కూడిన దండకారణ్యంలో ప్రవేశించి, అక్కడ నానారకాలైన సుందర వృక్షాలతో అందంగా, శుభంగా వున్న మునీశ్వరుల ఆశ్రమాలను చూశాడు. ఫలాలు, కందమూలాలు ఆహారంగా, ఇంద్రియ నిగ్రహం కలిగి, నారచీరెలు, జింకచర్మాలు కట్టి, బ్రహ్మ వర్చస్సుతో సూర్యాగ్నులలాగా ప్రకాశించే మునులున్నారక్కడ. వానప్రస్థ, సన్న్యాసాశ్రమం స్వీకరించిన వారితో, తపస్వులతో, వేదనాదంతో, పరబ్రహ్మజ్ఞానం కలవారితో నిండివున్న ఆప్రదేశంలోకి ప్రవేశించాడు శ్రీరాముడు.

శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని, సీతాదేవిని మునులంతా మంగళాశాసనాలు చేసి సేవించారు. ధర్మాత్ములైన ఆ ఋషీశ్వరులు తమ పర్ణశాలకు రామచంద్రమూర్తిని పిలుచుకునిపోయి, ఆసనం చూపించి, కూర్చుండబెట్టి, కందమూలాలు, ఫలాలు, పుష్పాలు సమర్పించి చేతులు జోడించి ఇలా తమను రాక్షసుల నుండి రక్షించమని వేడుకుంటారు. “మమ్మల్ని రక్షించే భారం సర్వకాల సర్వావస్థలలో నీమీదే వుంది. అందుకే నువ్వు మమ్మల్ని రక్షించాలి. నువ్వు ఎక్కువ దయకలవాడివి కదా! నీమీద మా రక్షాభారం వేసి నిన్నే నమ్ముకుని వుంటాం" అని అంటారు. శ్రీరామచంద్రమూర్తి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి, అక్కడే నిద్రించి, ఉదయాన అడవిలోకి పోయాడు.

అడవిలో పోతున్న శ్రీరామచంద్రమూర్తి పర్వత శిఖరంలాగా పొడగాటి దేహంతో, పెద్ద ధ్వని చేస్తూ మనుష్యులను తినేవాడిగా, లోతైన పెద్ద కళ్లతో, భయంకరమైన పెద్ద నోటితో, భయంకరమైన వికార ఆకారంతో, కొత్తగా నెత్తురుకారే పులిచర్మం కప్పుకుని, మూడులోకాలని మింగే విధంగా నోరు తెర్చుకుని, యముడిలాగా భూతాలకు భయంకరంగా వుండి, నాలుగు పులులు, రెండు తోడేళ్లు, పది దుప్పులు, ఏనుగుతల శూలంకొనలో గుచ్చి, పెద్దగా బొబ్బలు పెట్తూ వున్న విరాధుడు  అనే క్రూరుడుని చూశాడు. ఆ విరాధుడు తటాలున వాళ్లమీద పడ్దాడు. పడి, సీతాదేవిని ఎత్తుకుని, చంకలో వుంచుకుని, శ్రీరామలక్ష్మణులతో వారి నెత్తురు తాగుతానన్నాడు.

లక్ష్మణుడు, రాక్షసుడివైపు తిరిగి, వాడెవడని ప్రశ్నించాడు. ముందు వారెవరో చెప్పాలనీ, వారెక్కడికి పోతున్నారనీ, విరాధుడు జవాబుగా ప్రశ్నించాడు. దానికి శ్రీరామచంద్రుడు తాము ఇక్ష్వాకు వంశంలో పుట్తిన క్షత్రియులమనీ, అడవిలో తిరుగుతున్నామనీ, పాపాత్ములం కాదనీ అన్నాడు. జవాబుగా విరాధుడు: "నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద నన్ను దనుజులందరూ విరాధుడు అని పిలుస్తారు. నేను తపస్సు చేసి శస్త్రంతో చావకుండా బ్రహ్మ నుండి వరం పొందా. నరకబడడం వల్ల, చీల్పబడడం వల్ల, చంపబడకుండా వరం పొందా. మీరు బతకాలనుకుంటే ఈ స్త్రీని నాకు వదిలి వెళ్లండి. ఈమెను నాకు వదిలితే మిమ్మ్లని చంపను" అని అన్నాడు.


విరాధుడు చెప్పిన మాటలకు కోపగించిన శ్రీరామచంద్రుడు, "ఓరీ! నీచ రాక్షసుడా! దుష్టుడా! నీ అంతట నువ్వే చావును వెతుక్కుంటూ వచ్చావు. నా ఎదురుగా నిలబడి మరల బతికిపోతావా?" అంటూ బాణం ఎక్కుపెట్టాడు. పదునైన బాణాలను రాక్షసుడిమీద వేశాడు. రాముడు ఏడు బాణాలను విరాధుడి రొమ్ము దూర్పోయే విధంగా వేయగా, అవి కొండ లాంటి వాడి దేహాన్ని చీల్చి, ఎర్రగా మారిపోయి, భూమిలోకి పోయాయి. బాణాల తాకిడి బాధను సహించలేని విరాధుడు జానకిని నేలమీద వదిలి, శూలం తీసుకుని రామలక్ష్మణులను సమీపించాడు. రామలక్ష్మణులిరువురూ ఆ రాక్షసుడి మీద పదునైన బాణాలను వర్షంలాగా కురిపించారు. వారు వేసిన బాణాలను చూసిన విరాధుడు, ఈ బాణాలు తననేమీ చేయలేవని నవ్వి, తన భయంకరమైన శరీరాన్ని పెంచాడు. దేహంలో నాటుకుని పోయిన బాణాలన్నీ నేలరాలాయి. శ్రీరామచంద్రమూర్తి మరి కొన్ని బాణాలను వేశాడు. శ్రీరామలక్ష్మణులు వేస్తున్న పదునైన బాణాలను చూసి రాక్షసుడు నవ్వాడు. వాళ్లూ వదలకుండా వీడిపై బాణాలు వేయసాగారు. వాటివల్ల బాగా బాధకలిగిన విరాధుడు, ప్రాణాలను బిగపట్టుకుని, రామలక్ష్మణులపై వజ్రసమానమైన శూలాన్ని విసిరాడు. మండుతూ వస్తున్న ఆశూలాన్ని చూసి శ్రీరాముడు దాన్ని రెండు బాణాలతో నరికాడు. భూమి కంపించే విధంగా అది నేలరాలింది. వాడి శూలం విరగగానే, రామలక్ష్మణులిద్దరూ వాడి మీద దూకారు. దూకి తమ కత్తులతో వాడిని కొట్టారు. అప్పుడా రాక్షసుడు వాళ్లిద్దరినీ ఎత్తుకుని ఆకాశంలో పరుగెత్తాడు. అడవి మధ్యలోకి వాళ్లను తీసుకుని వెళ్లి తమను చంపాలన్న వాడి కోరికను గ్రహించాడు శ్రీరాముడు. వాడు ఎక్కడికి తీసుకునిపోతే అక్కడికే పోదామనీ, అదే మన మార్గమనీ శ్రీరాముడు లక్ష్మణుడితో అన్నాడు.

          చంటి పిల్లను ఎత్తుకున్న విధంగా రామలక్ష్మణులను భుజాలమీద ఎత్తుకుని అడవిలో పోతున్న ఆ విధానం చూసిన సీతకు భయం కలిగింది, ఏడ్చింది. సీత ఏడుపు మాటలు విన్న శ్రీరామలక్ష్మణులు రాక్షసుడిని చంపడానికి తొందరపడసాగారు. విరాధుడి కుడి భుజమందున్న లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని, ఎడమ భుజాన వున్న శ్రీరాముడు వాడి కుడిచేతిని నరికారు. విరాధుడు ఆయుధాలతో చచ్చేవాడు కాదు. చేతులు లేనివాడయ్యాడు. కాబట్టి వాడిని మోచేతులతో, మోకాళ్లతో గుద్ది, పైకెత్తి కింద పడేశారు. కత్తులతో నరికినా, బాణాలతో గుచ్చినా, నేలమీద వేసి గుద్దినా, చావని ఆ కఠిన రాక్షసుడిని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో , వీడిని ఒక గుంట తీసి పూడుద్దామన్నాడు. ఇది విన్న విరాధుడు, రాముడితో, తాను ఆయన చేతిలో చచ్చిపోయాననీ, అజ్ఞానం వల్ల ఆయన ఎవరైందీ తెలుసుకోలేక పోయాననీ, అని తన శాప విషయాన్ని గురించి చెప్పాడు.

          విరాధుడిలా అన్నాడు: " శ్రీరామచంద్రా! మీరెవరో ఇప్పుడు తెలుసుకున్నా. శ్రీరాముడివి నీవు. అవతార మూర్తైన భవంతుడవని, సీతాదేవి లక్ష్మి అని తెలుసుకొంటిని. నేను పూర్వం తుంబురుడనే గంధర్వుడిని. రంభతో కూడి కామావేశాన మర్యాద తప్పి సంచరిస్తుంటే కుబేరుడు నన్ను రాక్షసుడివి కమ్మని శపించాడు. శాపం తొలగే ఉపాయం కూడా ఆయనే చెప్పాడు. దశరథ కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు నన్ను చంపుతాడో అప్పుడు నాకు రాక్షసత్వం పోతుందని, గంధర్వ రూపం వస్తుందని అన్నాడు. శ్రీరఘురామచంద్రమూర్తీ! నీ కరుణవల్ల భయంకరమైన శాప బాధ తొలగింది. మీ దర్శనం వల్ల కృతకృత్యుడనయ్యాను. స్వర్గానికి పోతాను. దయ చేసి ఆజ్ఞ ఇవ్వు. మీకు మేలు కలుగుగాక! ఈ దారిలో ఒకటిన్నర ఆమడ దూరం పోయాక అక్కడ సూర్యతేజుడైన శరభంగ మహర్షి వున్నాడు. ఆయన్ను మీరు దర్శించండి. మేలు కలుగుతుంది. నన్ను పూడ్చి వేయండి. ఆ తరువాత అక్కడికి పోండి శ్రీరామచంద్రమూర్తీ! ఏనుగును పూడ్చడానికి ఎంత గుంట తవ్వుతారో అంతది తవ్వండి" అన్నాడు. వెంటనే చనిపోయాడు.

శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విధంగా లక్ష్మణుడు విరాధుడిన దేహం పక్కనే వెంటనే ఒక గుంత తవ్వాడు. శ్రీరామలక్ష్మణులు కల్సి వాడి శరీరాన్ని ఆ గుంటలో వేశారు. ఇంకా ప్రాణంతో వున్న విరాధుడు, శ్రీరామలక్ష్మణులు బలవంతంగా గుంతలో పడేయగానే, భయంకరమైన ధ్వని చేస్తూ, దాంట్లో పొర్లాడు. వాడిని పిడికి పోటులతో చంపారు రామలక్ష్మణులు. ఊపిరితో పూడ్చరాదు కాబట్టి చంపి మరీ పూడ్చారు. శ్రీరామలక్ష్మణులు విరాధుడిని ఈ విధంగా చంపి, సంతోషించి, ఆ గోతిని పెద్ద రాయితో పూడ్చారు. ఇలా చేసి, దూరంగా వుంచిన వారి బాణాలను మరల తీసుకుని, సీతాదేవి దగ్గరకు పోయారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment