Wednesday, August 19, 2020

పంచవటి ఏది? : వనం జ్వాలా నరసింహారావు

 పంచవటి ఏది?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ, చింతన (20-08-2020)

మౌని సుతీక్ష్ణుడు శ్రీరాముడిని అగస్త్యాశ్రమానికి పొమ్మని చెప్తాడు. ఆయన చెప్పినట్లే అక్కడికి బయల్దేరి పోయారు సీతారామలక్ష్మణులు. అగస్త్యుడి ఆశ్రమం సమీపిస్తుంటే లక్ష్మణుడికి వాతాపీల్వలుల చరిత్ర చెప్పాడు రాముడు. పూర్వం ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే సోదరులు బ్రాహ్మణ వేషం వేసి బ్రాహ్మణులను చంపుతుండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం వేసుకుని, బ్రాహ్మణుల దగ్గరకు పోయి, ఆ రోజున తన ఇంట్లో శ్రాద్ధం వుందనీ, నిమంత్రణకు రమ్మనీ, సంస్కృత భాషలో పిలుస్తాడు. పిలిచింది నిజమైన బ్రాహ్మణుడే అని మోసపోయి అంగీకరిస్తారు బ్రాహ్మణులు. వాడు తన తమ్ముడిని మేకగా చేసి, చంపి, ఆ మాంసాన్ని బ్రాహ్మణులకు వడ్డించేవాడు. (పూర్వకాలంలో మాంసం తినేవారు బ్రాహ్మణులు కూడా. దానిలోని చెడు గుణాలను, ఇలాంటి మోసాలను తెలుసుకొని దానిని నిషేధించారు). బ్రాహ్మణులు నోరారా తిని పొట్టలు తడవుకొంటూ కూర్చోగానే, ఇల్వలుడు "వాతాపీ రమ్ము” అని పిలిచేవాడు. అలా పిలవగానే వాతాపి వారి పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణులు చనిపోయేవారు. వారిని వారిరువురూ పీకి తినేవారు.

ఈ విధంగా రాక్షసులవల్ల వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు. అప్పుడు దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు వారిని తన తపఃప్రభావం వల్ల శాంతింప చేశాడు. ఒకనాడు వీరు అగస్త్యుడికి నిమంత్రణం చెప్పగా అయన అంగీకరించి, భోజనానికి వెళ్ళి సర్వం బక్షించాడు. “జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం” అన్నాడు పొట్ట తడుముకుంటూ. శ్రాద్ధం ముగించిన తరువాత ఎప్పటిలాగా ఇల్వలుడు వాతాపీ అని పిలిచాడు. అగస్త్యుడు అప్పుడు “నీ తమ్ముడి మీద ఎందుకు భ్రాంతి? నీ తమ్ముడు జీవించి వున్నాడని అనుకుంటున్నావా? నీ భ్రాత చచ్చిపోయాడని తెలియదా? నా కడుపులోంచి బయటకు రావడం సాధ్యమా? నీ తమ్ముడు ఎక్కడ వున్నాడో చెప్తా విను. మేకలాగా నా కడుపులో పడి జీర్ణమై నరకానికి పోయాడు తెలియదా?” అని పలికాడు.

తన తమ్ముడు చనిపోయాడని తెలుసుకున్న ఇల్వలుడు కోపంతో అగస్త్యుడిని చంపడానికి ఆయన మీదకు పోవదానికి ప్రయత్నించగా, ఆ ముని, నిప్పులు కక్కే చూపులతో అతడిని భస్మం చేశాడు. అలాంటి మహిమ కలవాడి ఆశ్రమం ఇదే లక్ష్మణా, అని చెప్పాడు శ్రీరాముడు. ఆశ్రమ ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్య మునిని దర్శించుకున్నాడు. ఆ ముని శ్రీరామచంద్రమూర్తిని అతిథిగా గ్రహించిప్రేమతో అతిథులకు ఇవ్వాల్సిన అర్ఘ్యంపాద్యం ఇచ్చిపూజించియోగక్షేమాలు విచారించివానప్రస్థగృహస్థ ధర్మాలు తెలిపాడు. శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప విల్లుఅక్షయ బాణాలుతూణీరాలు ఇచ్చాడు. తరువాత ఇలా అన్నాడు. దగ్గరలో వున్నా పంచవటికి వెళ్లమని సలహా ఇచ్చాడు. పంచవటికి పోయే మార్గం చూపించాడు. రామలక్ష్మణులు అగస్త్యుడు చెప్పిన మార్గంలో పంచవటికి పోయారు.

పంచవటిని చూసిన శ్రీరాముడు, లక్ష్మణుడితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! పంచవటి ఇదే. చక్కగా పూసిన తీగలు, చెట్లు, గుంపులు-గుంపులుగా, కన్నుల పండుగగా కనపడుతున్నాయి. ఇక్కడ సీతకు, నీకు, నాకు, మన ముగ్గురికి అనుకూలమైన, సంతోషకరమైన స్థలమేదో చూడు. నీటికి దూరంగా వుండకూడదు. మనసుకు ఇంపైనదిగా, నీటికి దూరం లేకుండా, స్వేచ్చా విహారానికి యోగ్యమైందిగా వుందాలి. నేల చదునుగా, పడుకోవడానికి సుఖంగా వుండాలి. నువ్వు తేవడానికి అవసరమైన పూలు, కట్టెలు, దర్భలు దండిగా దగ్గరలోనే వుండాలి. గట్టి నేల కాకుండా పడుకోవడానికి, కూర్చోవడానికి, అనుకూలంగా మెత్తని నేలగా వుండాలి. పెంట, పేడ కుప్పలు లేకుండా నిర్మలంగా వుండాలి. మనం కొన్నాళ్లు ఇక్కడే వుంటాం. కాబట్టి అనుకూలమైన ప్రదేశమైతే మంచిదు కదా? అందుకే మన ముగ్గురికీ సౌఖ్యమైన స్థలాన్ని చూడు".


ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా లక్ష్మణుడు, అన్ననే తగిన స్థలం ఎంపిక చేయమని అన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే శ్రీరాముడు తగిన స్థలాన్ని నిశ్చయించి, అక్కడ ఆశ్రమం నిర్మించమనీ అంటాడు. త్వరగా పర్ణశాల నిర్మించమని శ్రీరాముడు అనగానే, లక్ష్మణుడు ఒక ఆకుల ఇంటిని కట్టాడక్కడ. భూమిలో పునాది తీసి, చక్క్గా గోడలు కట్టి, లావాటైన వెదుళ్లు స్థంబాలుగా నాటి, వాటిమీద బక్కటి, సన్నటి వెదుళ్లను పరచి, జమ్మికొమ్మలు వాసాలుగా చేసి, నారలతో గట్టిగా బిగించి, ఆ వెదుళ్ల మీద బోద రెల్లును దట్టంగా కప్పి, నేలను చదరంగా, నున్నగా చేసి, దిమ్మెసతో మూడు-నాలుగు సార్లు నీళ్లు చల్లి కుటీరాన్ని సిద్ధం చేశాడు లక్ష్మణుడు.

పంచవటి స్థలం ఏదనే వివాదం చిరకాలంగా అనేకమందిని బాధిస్తున్నది. భద్రాచలం దగ్గరున్న పర్ణశాల అని కొందరు, నాసిక దగ్గర అని మరి కొందరు, అభిప్రాయ పడుతున్నారు. వీటిల్లో ఏది సత్యమో అనే విషయాన్ని రామాయణాన్ని బట్టి, స్థలశోధనాన్ని బట్టి నిర్ధారించాల్సి వుంది. పంచవటి గోదావరీ తీరంలో వుందనే విషయం నిర్వివాదాంశం. పంచవటి దగ్గర గోదావరి నది ఉత్తరాన్నుండి దక్షిణానికి పారుతూ వుండాలి. ఎందుకంటే రామలక్ష్మణులు సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ గోదావరీ తీరాన వెళ్లారు. ఇలా వెళ్తున్న రామలక్ష్మణులకు దక్షిణ దిక్కుగా సీత పోయిందని మృగాలు, పక్షులు చూపాయి. అప్పుడు రామలక్ష్మణులు నేరుగా దక్షిణానికి పోకుండా, నైఋతి దిశగా పోయి, గోదావరీ తీరంలో జటాయువును చూశారు. ఈ కారణాన, గోదావరి నది జటాయువు పడ్డ స్థలం దాకా, దక్షిణాభిముఖంగా పారుతుండాలి. జటాయువుకు గోదావరీ జలాలతో రామలక్ష్మణులు నివాపాలు విడిచినందున వారున్న స్థలం గోదావరి తీరమే అయ్యుండాలి. ఇక్క్డినుండి రామలక్ష్మణులు నైఋతిదిశగానే మూడు కోసుల దూరం పయనించారు. ఇంతదాకా తూర్పుగా పోవడానికి ఏరు అడ్దం వస్తుంది. కాబట్టి తూర్పుగా పోలేదు. కొంత తూర్పుగా పోతేనే కాని జటాయువు చెప్పిన దక్షిణ మార్గం కనిపించదు. కాబట్టే అక్కడినుండి మూడు కోసులు తూర్పుగా పోయారనుకోవాలి. ఇప్పుడు ఇప్పటి భద్రాచలం దగ్గర, గోదావరి నదికి దక్షిణాన వున్నారు వారు. ఇలా వచ్చినందున వారికి గోదావరి దాటాల్సిన పనిలేదు. ఈ కారణాన పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన వున్నదని అంగీకరించాలి. తూర్పునే వుండి వున్నట్లయితే, గోదావరి దాటే వుండాలి. ఆ విషయాన్ని వాల్మీకి చెప్పలేదు.

ఇప్పటి పర్ణశాలే పంచవటి అని అనుకుంటే, వారొకవేళ నైరుతి దిక్కుగా ప్రయాణం చేసే వుంటే, ఏటి పాలు అయ్యేవారు. భద్రాచలం దగ్గర ఏరు దాటినట్లు కొందరు రాశారుకాని, అది ఆలోచించి రాసిన రాతకాదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న పర్ణశాల కాదు కాని, దానికి ఎదురు ఒడ్డున, చక్కగా పంచవటి వుండేదని చెప్పొచ్చు.

అలాగే ఒకాయన నాసికను పంచవటి అని పేర్కొన్నారు. అక్కడి నుండి దక్షిణంగా వచ్చినట్లు చెప్పారాయన. ఇది రామాయణానికి విరుద్ధం. పంచవటి గోదావరీ నదీ పశ్చిమ తీరాన వున్నదనడానికి స్థలం ఆధారంగా వుంది. పర్ణశాలకు ఎదురుగా రథగుట్ట అనేదొకటి వుంది. ఇక్కడ రావణాసురుడు తన రథాన్ని దాచిపెట్టాడని అంటారు. ఎందుకంటే సీతాపహరణ సందర్భంలో, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని రాగానే రథం సిద్ధంగా వుంది అని చెప్పడం జరిగింది. సమీపంలో అది కనపడనందున ఆ పని కొనసాగింది కాని, ఏటికి ఒక ఒడ్డున రథం; సీత, రావణుడు మరో ఒడ్డున వుంటే ఇది సాగి వుండేది కాదు. కాబట్టి పంచవటి పడమటి దిక్కునే వుండాలి. సీతాపహరణం ఆ పక్కనే అయి వుండాలి. అంతే కాదు, దీనికి సమీపంలోనే, సీత గుట్టలని పెద్ద పర్వతం వుంది. ఇక్కడ ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడు సీతాలక్ష్మణులు వున్నారని, ఆ కారణాన ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందని అంటారు. కాదనడానికి కారణం లేదు. తూర్పు ఒడ్డున వున్నట్లయితే, ఏరు దాటి పోయి, అక్కడి గుట్టల్లో వుండాల్సి వచ్చేది. ఈ గుట్ట కింద పడమటి దిక్కుగా పెద్ద బయలు ప్రదేశం వుంది. అక్కడ పద్నాలుగువేల రాక్షసులు నిలిచి యుద్ధం చేయగలిగే పెద్ద స్థలం వుండేది. సీతాలక్ష్మణులకు ఇక్క్డ జరిగిన యుద్ధం గుట్ట మీదనుండి కనపడేది.

మరొక చోట వాల్మీకి రామాయణంలో పద్మ సరస్సు పంచవటికి దగ్గర్లోనే వుందని చెప్పడం జరిగింది. అది ఇప్పటిదాకా వుందో, లేదో, చెప్పడం సాధ్యపడదు కాని ఇలాంటి పెద్ద చెరువొకటి వున్నట్లు అక్కడుండే కోయవాళ్లు చెప్తుంటారు. ఈ చెరువుకూ, గోదావరి నదికి, మధ్య పంచవటి వుంది. వర్షాకాలంలో ఏటి నీళ్లు బురదగా వున్నప్పుడు ఈ చెరువు నీళ్లు సీతారామలక్ష్మణులు వాడుకునేవారు. ఇప్పటి పర్ణశాలకు దక్షిణంగా గోదావరీ తీరంలో భద్రాచలానికి వచ్చే తోవలో, దుమ్మగూడెం అనే వూరుంది. దీనికి ఎదురుగా ఏటికి ఆవలి ఒడ్డున ఒక చిన్న గుట్ట వుంది. దీని దగ్గరలోనే జటాయువుకు, రావణుడికి యుద్ధం జరిగిందని రామాయణంలో వుంది. ఇప్పుడు గోదావరి నది తూర్పు ఒడ్డు కోసుకొని వస్తున్నది. ఇప్పటి ఏటి మధ్యలో దుమ్మగూడేనికి చెందిన కొంత భాగం వుండేదట. అక్కడ అలా చూసిన వారు ఆంధ్రవాల్మీకికి చెప్పారా విషయాన్ని. వాస్తవానికి ధూమగూడెమే దుమ్మగూడెం అయింది. ఆ గుట్ట దగ్గరే జటాయువుకు సంస్కారాలు చేశాడు శ్రీరాముడు.

ఇప్పటి హంపే పంప అనీ, అక్కడే పర్ణశాల వున్నదనీ, చెప్పడానికి ఒక నిరాకరించలేని ప్రబల కారణం వుంది. రామలక్ష్మణులు లంకకు పోయేటప్పుడు ఏ మార్గంలో వెళ్లినా, లంక నుండి తిరిగొచ్చేటప్పుడు విమానాన్ని చక్కగా వచ్చేట్లు చేశారు కాని, వంకర-టింకరగా పోలేదనేది స్పష్ఠం. లంక నుండి సముద్రం దాటిన తరువాత, రామేశ్వరం దగ్గరనుండి, అయోధ్యకు వెళ్లారనేది అందరూ అంగీకరించిందే. అలాంటప్పుడు ఎడమవైపున కిష్కింద, కుడివైపున పంచవటి వుండి వుండాలి. ఈ రెండు స్థలాలను రామచంద్రమూర్తి సీతాదేవికి చూపించాడు. ఈ మార్గానికి, నాసికకు సంబంధమే లేదు. కాబట్టి పంచవటి నాసిక కాదు. కావడానికి వీల్లేదు. నాసిక అనేది మొదటి పేరు కాదనీ, నవశిఖ అనేది నాసిక అయిందనీ, పురాణాలలో ప్రసిద్ధికెక్కిన నాసిక శూర్ఫణకదే అయినందువల్ల ఆ కథకు, దీనికి ముడిపెట్టారని కూడా కొందరు రాశారు. నాసిక పంచవటి కాదనడానికి మరికొన్ని కారణాలున్నాయి.

సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుండి దక్షిణంగా ఋక్షవంతానికి వచ్చి, అక్కడనుండి, పశ్చిమాభిముఖంగా నాసిక చేరినట్లు కొందరంటారు. వాళ్లు చెప్పిన మార్గంలో వింధ్యపర్వతాన్నే కాకుండా, నర్మద, తపతీ నదులను దాటి, విదర్భ గుండా నాసికలోకి పోవాల్సి వుంటుంది. ఇది చాలా దుర్గమ మార్గం. అదీ కాకుండా, వాల్మీకి ఎక్కడా, సీతారామలక్ష్మణులు వింధ్యనూ, నర్మదా తపతులను దాటినట్లు చెప్పలేదు. వారు దాటే వుంటే ఆ సుప్రసిద్ధ నదుల గురించి వాల్మీకి తప్పక రాసేవాడే. రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి, ఆ తరువాత ఆగ్నేయంగా కిష్కింధకు వచ్చారనడం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధం అనాలి. వాస్తవానికి రామలక్ష్మణులు నైఋతీ మూలగా, ఆ తరువాత కొంత మేరకు నైఋతిగా పోయి, అక్కడనుండి తూర్పుగా పోయి, కబంధుడిని చంపి, అక్కడనుండి మళ్లీ పడమరగా పోయి, పంప (తుంగభద్ర) చేరి అక్కడికి పడమర వున్న శబరి గుహకు పోయారు. జటాయువు గుట్ట దగ్గరనుండి నైఋతిగా వస్తేనే కిష్కింధకు రాగలరు. అలా కాకుండా కొందరు చెప్పినట్లు ఆగ్నేయ మూలగా పోయివుంటే, సముద్ర తీరానికి చేరేవారే కాని, కిష్కింధ చేరకపోయేవారు. ఆగ్నేయ మూలగా ప్రయాణం చేసినట్లు రామాయణంలో ఎక్కడా ఒక్క మాటైనా లేదు. అలాగే భద్రాచలం దగ్గర ఉష్ణ గుండం వుందనడం, సీతాదేవి స్నానం చేసేదనడం, రేకపల్లె దగ్గర జటాయువు రెక్క పడిందనడం బహుశా కల్పితాలు కావచ్చు. (వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment