Tuesday, August 4, 2020

శ్రీ మహాభాగవతము, అష్టమ స్కందం:వనం జ్వాలా నరసింహారావు

శ్రీ మహాభాగవతము, అష్టమ స్కందం

(మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత, రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది

వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది, చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                   చదివినను ముక్తి కలుగును, చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని, అందులో భాగంగా అష్టమ స్కందాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు, తెనిగించాడు. డాక్టర్ అపర్ణా శ్రీనివాస్ గారు, విశ్వనాథం సత్యనారాయణ గారు అనువదించారు. 190 పేజీల ఈ అష్టమ స్కందం ఉపోద్ఘాతంతో మొదలై, గజేంద్ర మోక్షం దగ్గర నుండి మత్స్యావతార కథ వరకు 14 అంశాలు కలిగి ఉన్నది. ఈ స్కందంలో ప్రత్యేకంగా చదవాల్సింది గజేంద్ర మోక్షం, క్షీరసాగర మథనం, మత్స్య, కూర్మ, వామనవాతారాలకు సంబంధించిన వివరాలు. క్లుప్తంగా ఆ 14 అంశాల వివరమైన వివరాలు:

అష్టమ స్కందానికి ఉపోద్ఘాతం నుండి నుండి ఈ స్కందం ఆరంభం అవుతుంది. ఆ తరువాత వరుసగా స్వాయంభువుడూ, స్వారోచిషుడూ, ఉత్తముడూ, తామసుడూ అనే మనువుల చరిత్ర; ఎనుగుకూ-మోసలికీ జరిగిన పోరాటం, గజేంద్ర మోక్షం-శ్రీహరి గజేంద్రుడిని కాపాడడం; రైవతుడు-చాక్షుసుడు అనే మనువుల చరిత్ర; క్షీరసాగర మథనం-దేవదానవులు సముద్రాన్ని మథించడం; కూర్మావతార కథ; శివుడు దేవతల ప్రార్థనను మన్నించి హాలాహలాన్ని మింగడం; పాలకడలి నుండి ఐరావతాదులు (కామధేనువు, లక్ష్మీదేవి, ఐరావతం, ఉచ్చైశ్రవం అనే ఏనుగు, కల్పవృక్షం, అప్సర స్త్రీలు, చంద్రుడు, వారుణి అనే కన్యక, ధన్వంతరి, అమృతం)   జన్మించడం; విష్ణుమూర్తి మోహినీ రూపాన్ని ధరించడం; అమృతం కొరకు దేవాసుర యుద్ధం; విష్ణువు మొహినీరూపంతో రాక్షసులను మోసం చేసి దేవతలకు అమృతాన్ని పోయడం;  రాక్షస సంహారం ఉన్నాయి.

ఇవికాకుండా, శివ-కేశవుల సరస సంభాషణ; శ్రీహరి తన మోహినీ రూపంతో ఈశ్వరుడిని ఆకర్షించడం, భ్రమింప చేయడం; వైవస్వుతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి అనే మనువుల వృత్తాంతం; బలిచక్రవర్తి దేవతలమీడికి యుద్ధానికి వెళ్లడం;స్వర్గలోక వర్ణన; దేవతల పలాయనం; వామన చరిత్ర కథా ప్రారంభం, వామనమూర్తి ఆవిర్భావ ఘట్టం, బలిచక్రవర్తి దగ్గరకు వామనమూర్తి రావడం, శుక్ర-బలిచక్రవర్తుల సంభాషణ; వామనుడు బలిని మూడడుగుల నేల దానమివ్వమని అడగడం; వామనమూర్తి విశ్వరూపాన్ని పొందడం, రాక్షసులు బలిచక్రవర్తితో సహా సుతలానికి పోవడం; సత్యవ్రతుడి వృత్తాంతం; మత్స్యావతార కథ అనే వివిదాంశాలు ఈ అష్టమ స్కందంలో ఉన్నాయి.   

అష్టమ స్కందంలో అత్యంత ప్రాముఖ్యమైనది, తప్పక చదవాల్సింది, ఆసక్తికరమైనది, మనోహరంగా పోతన గారు వర్ణించి రాసినదీ ‘గజేంద్రమోక్షం’ ఘట్టం. అదే విధంగా క్షీరసాగర మథనం కూడా. గజేంద్ర మోక్షం ఘట్టంలో నీళ్లలో తిరిగే మొసలికి, అడవిలో సంచరించే ఏనుగుకు అసలు పోరాటం ఎలా జరిగింది అనే విషయం దగ్గర నుండి, శ్రీమహావిష్ణువు ఆ ఏనుగు పరితాపాన్ని ఏవిధంగా తీర్చాడు అనే వివరాలున్నాయి.

క్షీరసాగరంలో త్రికూటం అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద అనేక రకాల, వృక్షాలు, లతలు, తీగెలు ఉన్నాయి. దాని దగ్గరున్న అరణ్యంలో భయంకరంగా ఉండే మట్టగజాలు దిగ్గజాలను మించి ఉన్నాయి. అవి భయంకరంగా విహరిస్తుంటే వాటిని చూసి అడవి జంతువులన్నీ పారిపోతాయి. అల అఒకనాడు అవి స్వైర విహారం చేస్తున్నాయి. ఆ సమయంలో ఆ ఏనుగుల గుంపు ముందుకు సాగిపోతుంటే, ఆ సమూహంలోనే ఉన్న గజనాథుడు వెనుకబడ్డాడు. దాని భార్యలైన ఏనుగులు మాత్రం దాని పక్కనే కనిపెట్టుకుని అనుసరిస్తున్నాయి. అలా వెళ్తుంటే ఆ గజరాజుకు ఒక పెద్ద కొలను కనిపించింది. తన్మయత్వంతో ఆహ్లాదకరమైన ఆ కొలనులోకి ఏనుగుల సమూహం ప్రవేశించాయి. అందులో గజరాజు ఆనందంగా ఈదులాడాడు.


అప్పుడు ఆ గజరాజును ఆ మడుగులో దాగివున్న ఒక మొసలి చూసింది. సరస్సు నుండి కుప్పించి ఒక్క ఎగురు ఎగిరి, మకరరాజు కరిరాజును పట్టుకుంది. గజరాజు దాని పట్టు విడిపించుకోవడానికి పోరాడాడు. మొసలి ఏనుగును నీళ్లలోకి లాగుతుంటే, ఏనుగు మొసలిని గట్టుమీదికి లాగింది. దాన్ని వర్ణిస్తూ పోతన గారు ఇలా రాశాడు:

కం:      కరి దిగుచు మకరి సరసికి, గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి, భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్       

         ఇలా కరి, మకరి భీకరంగా పోరాడుతుంటే, నీళ్లలో జీవించే మొసలికి సహజంగా బలం, పట్టుదల అంతకంతకూ పెరిగసాగాయి. గజరాజు బలం క్షీణించసాగింది. మొసలి ఏనుగు కుంభస్థలం మీదికి దూకింది. కంఠాన్ని, వెన్నునూ గాయపరచింది. అలా గజేంద్రుడిని రకరకాల భాదించింది. అయినా అలసిపోకుండా, వెనుకంజ వేయకుండా, గజరాజు తన పరాక్రమంతో వేయి సంవత్సరాల కాలం ఆ మొసలితో పోరాడింది. చివరకు ఓపిక క్షీణించడంతో, దాన్ని గెలవడానికి తన శక్తి చాలదని నిర్ణయించుకున్నాడు. లోకాల సృష్టికి, సంరక్షణకు, లయం కావడానికి, మూలకారకుడైన ఆ పరమేశ్వరుడిని శరణు వేడుతానని అనుకుంది.

         ఆ భావనను, ఆలోచనను, పోతన మహాకవి ఇలా పద్యరూపంలో వర్ణించాడు;

ఉ:       ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై

యెవ్వని యందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం

బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా

డెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్  

         కర్మ, గుణ, భేదాలు లేని ఆ పరమేశ్వరుడిని అనేక విధాల ప్రార్థించిందా ఏనుగు. చివరకు ఒక సందర్భంలో ఇలా అనుకుంది: దీనులపాలిట ఉంటాడు ఆ భగవంతుడు అని అంటారు. పరమయోగీశ్వరులైన వారి చెంతనే ఉంటారని చెప్పుతారు. అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనే ఆ భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహిస్తాడు గజరాజు. ఉంటే తన మీద ఎందుకు దయచ్ప్పాడు, ఎందుకు వేగంగా రాడు  అనుకుంటాడు. చివరకు దీనంగా  ప్రార్థిస్తూ, భగవంతుడు తప్ప తనకు ఎవ్వరూ లేరనీ, నిస్సహాయ స్థితిలో ఉన్న తనను మన్నించి కాపాడమనీ, రమ్మనీ పిలుస్తాడు. ఈ సందర్భంలో పోతన రాసిన రెండు పద్యాలు ఆబాలగోపాలానికి చిరపరిచయమైనవే!

ఆ రెండు పద్యాలు:

కం:                కల డందురు దీనుల యెడ, గల డందురు పరమయోగి గణముల పాలం

గల డందు రన్ని దిశలను, గలడు కలండనెడు వాడు గలడో లేడో!

శా:                 లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!    

         అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తి గజరాజును కాపాడాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో విష్ణువు ఎలా వైకుంఠపురంలో ఉన్నాడు, ఎలా లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు, ‘పాహి పాహి అన్న గజేంద్రుడి మొర వినగానే ఎలా బయల్దేరిందీ, ఆయన వెనకాలే ఎలా లక్ష్మీదేవి, అంతఃపుర పరివారం, గరుత్ముంతుడు, వైకుంఠపురంలో ఉన్నవారందరూ వచ్చేసిందీ, అమోఘంగా మూడు పద్యాలలో వర్ణించారు పోతన కవి ఇలా:

మ:                అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై. 

మ:                సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై

మ:                తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వె

న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ

క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వొచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్

         విష్ణువు మొసలిని ఖండించడానికి తన చక్రాయుధాన్ని పంపాడు. అది ఆ మొసలిని సమీపించింది. మొసలి తల నరికింది. ఏనుగు రక్షించబడగానే ఆడ ఏనుగులు గజరాజును జలాలతో అభిషేకించాయి. విష్ణువు ఏనుగును బయటకు తీసుకువచ్చి దాని దుఃఖం పోగొట్టాడు. అలా గజేంద్ర మోక్షం కలిగింది. ఆ తరువాత విష్ణుమూర్తి గరుడ వాహానం ఎక్కి తన లోకానికి వెల్లి పోయాడు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్ష గాథను భక్తిగా వింటారో, చదువుతారో వారికి సకల శుభాలు కలుగుతాయని, ప్రాణం పోయే సమయంలో ఉత్తమ గతులను ప్రసాదిస్తాననీ విష్ణుమూర్తి అంటాడు.

ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం. 

No comments:

Post a Comment