Thursday, August 6, 2020

షబానా ఆజ్మీ హైదరాబాద్ అమ్మాయే! ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

షబానా ఆజ్మీ హైదరాబాద్ అమ్మాయే!

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(నవంబర్ 12-18, 2000)

         తమ్ముడు కామ్రేడ్ అమర వీరుడు రామనరసింహారావు జ్ఞాపకాలు తనమదిలో ఎప్పుడూ మెదులుతూనే వుంటాయనీ, అతనెప్పుడూ సమాజం పీడిత ప్రజలు అనే విషయాలను గురించే ఆలోచించేవాడనీ, తీరిక సమయాల్లో విప్లవ సాహిత్యం చదువుతుండేవాడనీ, బెంగాల్ నుండి నక్సల్ ఉద్యమానికి సంబంధించిన సినిమాలు తెచ్చేవాడనీ ... ఇలా ఎన్నో విషయాలను జ్ఞాపకం చేసుకున్నారు తిలక్ చెమ్మగిల్లిన కళ్లతో. కుటుంబం గురించి, బంధువుల గురించి ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత పట్టించుకోనేలేదనీ, అతని భార్య ఇవన్నీ ధైర్యంతో ఎదుర్కొందని చెప్పారు. నరసింహారావు అసువులర్పించిన తర్వాత ఆయన కూతురుకు పెళ్లయింది. ఆమె భర్త తిలక్ గారి మేనత్త కొడుకు హరి. వారికో కూతురు, కొడుకు. కొడుకు పేరు కూడా నరసింహారావు అనే పెట్టుకున్నారు. అతను తాతగారి లాగా కాకూడదని ఆశిస్తున్నానన్నారు తిలక్. రామనరసింహారావు మనుమరాలు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమె డాక్టరే.

         తిలక్ గారు హిందీ సినిమాలు తీస్తున్న రోజుల్లో, నరసింహారావు చనిపోయిన తర్వాత కాలంలో ఓ సందర్భంలో నక్సలైట్ నాయకుడు శ్రీ నాగభూషణం పట్నాయక్ తిలక్ గార్ని కలిసారు. ప్రజల్ని కష్టాలనుండి బయట పడేస్తాం అన్న మాట సరియైంది కాదనీ, వాళ్లను 'మోటివేట్’ చేసి,  చైతన్యవంతులను  చేయండని పట్నాయక్ తో సూచనగా చెప్పారు తిలక్.  రుమేనియన్ రచయిత పుస్తకం ‘హరికేన్’ ను ఆ సందర్భంగా పట్నాయక్ కు ఇచ్చారు తిలక్ గుర్తుగా.

         తనకు వామపక్ష సిద్ధాంతాల పట్ల పరిపూర్ణ విశ్వాసం, నమ్మకం వున్నప్పటికీ ఏదో ఒక్క వ్యక్తి తన విశ్వాసాలను ఇతరులపై రుద్దితే అటు మాత్రం మొగ్గు చూపలేనని చెప్తూ, అన్ని సిద్ధాంతాల వామపక్షాలు కలవాలనే వుద్దేశంతో 'భూమికోసం' చిత్రాన్ని తీసానని అన్నారు. అయితే తనకు చెందినంతవరకూ,  పుచ్చల పుల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, చారుముజుందార్ ఇలా ఆ కోవకు చెందిన అందరూ విలక్షణమైన వ్యక్తులేనని వారు నమ్మిన సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన త్యాగధనులూ-మహనీయులనీ పేర్కొన్నారు. అందరికంటే సుందరయ్య గారి పైన తనకు ఎక్కువ అభిమానమనీ, గౌరవమనీ అన్నారు. ఏదేమైనా తనకు ‘సమస్య’ ప్రధానమనీ వ్యక్తులు కారనీ అన్నారాయన. వ్యక్తులు ప్రధానంగా ఉద్యమాలు నడిపితే ఫలితం శూన్యమని ఆయన భావన.

         ఇదిలా ఉండగా.. ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకునే ఉద్యమకారులు, ఆ ఉద్యమాలకు పరోక్షంగా సహకారాన్నిచ్చే రచయితలు ప్రాంతీయ - భాషా, కుల -మత వర్గ విభేదాలను మరచి వసుదైక కుటుంబంలాగా మమైకం అయిన సందర్భాలు ఎన్నో వున్నాయనీ, ఆ సందర్భాలలో వ్యక్తులతో తనకు అంతో ఇంతో సంబంధముండటం అదృష్టంగా భావిస్తున్నానని అంటారు తిలక్. ఆ విషయాలను చెప్తూ ఆసక్తికరమైన రెండు వివాహాలను గురించి వివరించారు.

         ‘ఈడూ-జోడూ' మరాఠీ తర్జుమా 'ధర్మపత్ని’ నిర్మాతకూ, దర్శకునికి మధ్య కొన్ని విభేదాలు వచ్చి, సినిమా తీయటం మధ్యలోనే ఆపివేయవలసి వస్తే, దాన్ని పూర్తి చేయాల్సిందిగా నిర్మాతలు కోరితే,  హైదరాబాద్ కు వచ్చారు తిలక్. ఆ సందర్భంలో ఓసారి గుమ్మడి గారిని కల్సారు - ఆ పాత్రను మరారీలో పోషిస్తున్న శ్రీ సి.రామచంద్ర. 'నీలాగా త్రాగిన వేషం చేద్దామని, చేయలేక, నిజంగా త్రాగిచేద్దామనుకుంటే కుదరటం లేదు' అని అన్నారు గుమ్మడితో. హిందీలో అశోక్ కుమార్ చేసిన ఆ పాత్రను మరాఠీలో సి రామచంద్ర చేసారు. ధర్మపత్ని పాటలన్నీ సారధిలోనే రికార్డు చేసారు.

         ఇది చెప్తూ, ప్రకాశ్ పిక్చర్స్ కు చెందిన శ్రీ చంద్ జైన్, తన ముద్దుబిడ్డ సినిమాను హిందీలో తీయటానికి అడిగిన విషయం వెల్లడించారు తిలక్. అప్పట్లో ఆ సంస్థకు లీగల్ అడ్వైజర్ గా శ్రీ రామ్ జిత్ మలానీ వుండేవారట. ఆ సినిమాకు వారెంపిక చేసుకున్న రచయిత విశ్వామిత్ర ఆదిల్. ఆయన పెళ్లి చేసుకుంది తెలంగాణ సాయుధ పోరాట సమరయోధుడు, విప్లవ రచయిత స్వర్గీయ కామ్రేడ్ ముగ్దుం మొహియుద్దీన్ కజిన్ ను. తెలంగాణ సాయుధ పోరాటపు రోజుల్లో కొంతమంది వామపక్ష భావాల రచయితలు, బాంబే నుండి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ పరోక్ష పోరాటం సలిపేవారు. అలా వచ్చిన వారిలో ప్రముఖ ఉర్దూ రచయిత ‘కైఫీ ఆజ్మీ' ఒకరు. ఆయన హైదరాబాద్ కు చెందిన 'షౌకత్' ను వివాహమాడారు. వారి కూతురే నేటి ప్రముఖ నటీమణి, సంఘ సేవకురాలు, పార్లమెంటు సభ్యురాలు, శ్రీమతి షబానా ఆజ్మీ. ఆ విధంగా షబానా ఆజ్మీ హైదరాబాద్ అమ్మాయి అని చెప్పవచ్చునంటారు  తిలక్.  తెలంగాణ సాయుధ పోరాటపు రోజుల్లో భాషా - ప్రాంతీయ భేదాలు మరిచి వీటికి అతీతంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నారని చెప్పారు తిలక్. విశ్వామిత్ర ఆదిల్ పెళ్లి చేసుకున్న ముగ్దుం కజిన్ స్వంత సోదరుడు చాలా కాలం   ‘బ్లిట్జ్' ఉర్దూ పత్రికకు ఎడిటర్ గా పనిచేసారు. ఆయన మల్లేపల్లిలో ఉండేవారట. వీళ్లకూ తిలక్ గారికి కంటాక్ట్, ప్రజానాట్యమండలి వేదిక ద్వారా - బలరాజ్ సహానీ ద్వారా.

         విశ్వామిత్ర ఆదిల్ ను, ఎల్ వి ప్రసాద్ పిలిపించుకుని కోరి, కోరి  "శారద" సినిమాకు స్క్రిప్ట్ వ్రాయించుకున్నారు. ఆయనకు హైదరాబాద్ లో సన్మానం కూడా  చేసారు. శాంతారామ్ నిర్మించిన 'గీత్ గాయా పద్ధరోంనే' సినిమాకు ఆదిల్ గారే రచయిత. అది అందరికీ తెలిసిందే. తిలక్ గారు మద్రాసులో వుంటున్నప్పుడు, ఆ తర్వాత రోజుల్లోనూ ఆయన దగ్గర 'రాజు' అనే వ్యక్తి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేవాడు. ఆయన తర్వాత - తర్వాత, పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయనే ఆర్టిస్ట్ గిరిజను పెళ్లిచేసుకున్నాడు. రాజు, స్వర్గీయ ఎన్టీరామారావుతో చాలా సన్నిహితంగా వుండేవాడు.

ఓసారి, ఎన్టీఆర్ కోరికమేరకు, హైదరాబాద్ నుండి మద్రాసులో వున్న తిలక్ కు ఫోన్ చేసి ఆయన తీయబోయే  అనార్కలి సినిమాకు శ్రీ సి రామచంద్రను సంగీత దర్శకుడిగా వుండేటందుకు ఒప్పించాలని కోరారు. తిలక్ గారు, రామచంద్ర గార్కి చెప్పి (అప్పుడు ఆయన బాంబేలో వుండేవారు) టిక్కెట్ కొనుక్కుని హైదరాబాద్ వెళ్లి ఎన్టీఆర్‌ను కలవమని సలహా ఇచ్చారు. ఆయన కొనుక్కున్న టిక్కెట్ పైకం తప్పక ఇస్తారని, అయితే మిగతా డబ్బు వ్యవహారం మటుకు నిక్కచ్చిగా మాట్లాడుకోమనీ సూచించారు. ఆయన అలానే హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ ఆయన్ను సగౌరవంగా-సాదరంగా రిసీవ్ చేసుకుని, సకల మర్యాదలు చేసారట. రామచంద్ర గారి సంగీత దర్శకత్వంలోనే రూపొందింది అనార్కలి. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్, ఆయన్ను కొన్ని స్థలాలకు కూడా తోడు తీసుకెళ్లారు.

         సి రామచంద్ర మరాఠీ సినిమా పాటలను హైదరాబాద్ సారధీలోనే రికార్డు చేసారని చెప్పారు తిలక్. సి.రామచంద్ర గారితో తిలక్ పరిచయం చాలా సన్నిహితమైంది. బాంబేలో తరచు కలుస్తుండేవారు. కల్సి పూనాకి వెళ్లేవారు. ఆయన షిర్డీ సాయి భక్తుడవటం వల్ల అక్కడికి తరచు వెళ్లేవారు. తోడు తిలక్ గారు కూడా వెళ్లేవారు అప్పుడప్పుడు. సి రామచంద్ర, ప్రదీప్, బాంబే థియేటర్ రికార్డింగ్ శర్మ, డేవిడ్ అనే ఆర్టిస్ట్, తిలక్ లు ఓ సందర్భంలో కలిసినప్పటి సంఘటన గురించి చెప్పారాయన. రాజకీయాలు ముచ్చటించుకున్నారు కొంతసేపు.

సి రామచంద్ర, డేవిడ్ చెప్పిన జోక్- అది విపి నాయక్ కు, చమత్కారంగా తిరిగి చెప్పారు. 'యూపీ మే భాండ్ రాజ్ (సుచేత కృపలానీ) ఢిల్లీ మే రాండ్ రాజ్ (ఇందిరాగాంధీ), దోనోకో ఊపర్ కామరాజ్ (కాంగ్రెసు అధ్యక్షుడు) కైసా మిలేగా రామ్ రాజ్? అని డేవిడ్ వి పి నాయక్ ను ఓ సందర్భంలో ఆడిగారట. విపి. నాయక్ పకపకా నవ్వారా జోకువిని. అదే వీళ్లు సరదాగా చర్చించుకున్నారు. అప్పుడే డేవిడ్ మరో జోక్,  సోషల్ యాక్టివిటీస్ గురించి చెప్పారట. డేవిడ్ సిగరెట్లు ఎక్కువగా తాగేవాడు. సి రామచంద్ర చాలా అరుదుగా పొగ పీల్చేవాడు. వాటిల్లోంచి పుట్టుకొచ్చిన ఆ జోక్ చాలా గమ్మత్తుగా ఉందని ఆ జోక్ రిపీట్ చేసారు తిలక్. 'సిగరెట్ ఈజ్ ఎ స్ట్రె గర్ల్, సిగార్ ఈజ్ యువర్ కీప్, వైప్ ఈజ్ యువర్ వైఫ్’ ఇది చెప్తూ వివరించారు. సిగార్ ఎప్పుడూ వెలిగించకుండా, అప్పుడప్పుడూ కాలుస్తూ, ఆర్పుతూ పిలుస్తారు. వైఫ్ సాధారణంగా ఇంటిలో వుంటుంది. ఇక సిగరెట్ సంగతి తెలిసిందే, ఇది స్మోకర్స్ కు ఓ జోక్ అన్నారట డేవిడ్. ఈ జోక్ ఓ సందర్భంలో తిలక్ గారు భవనం వెంకట్రామరెడ్డిగారికి, రాజశేఖరరెడ్డి గారికి చెప్పారట. వాళ్లూ పకపకా నవ్వారట.  


         శ్రీ చంద్ జైన్, విశ్వామిత్ర ఆదిల్ తిలక్ గార్లు ఏవో స్క్రిప్టులు తయారు చేయటానికి ఓసారి జైపూర్ వెళ్లారు. జైపూర్ నుండి బాంబే నగరానికి వచ్చారు. అక్కడ వెస్ట్ ఎండ్ హోటల్లో బసచేసారు కొంతకాలం. విశ్వామిత్ర ఆదిల్ గారికి జుహూలో ఆపార్ట్ మెంట్ వుండేది. అక్కడే బలరాజ్ సహానీ, కైఫీ ఆజ్మీ, ఇంకా ఇతర పీపుల్స్ థియేటర్‌కు చెందిన వామపక్ష భావాల వ్యక్తులు        కొందరు కలిసే వారు. సమావేశాలు అవుతుండేవారు తరచు. శ్రీ చంద్ జైన్ ముద్దుబిడ్డ హిందీ వర్షన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా మదన్ మోహన్ ను ఎంపిక చేసుకున్నారు. కైఫీ ఆజ్మితో మొదలు పాటలు వ్రాయిద్దామని అనుకున్నారు. హీరోగా చేతనానంద్ తీస్తున్న సినిమాలో నటిస్తున్న రాజేష్ ఖన్నాను పెడ్దామనుకున్నారు. అప్పుడే రాజేష్ ఖన్నా నటిస్తున్న ఓ సినిమా రషెస్ ను చూపించారు తిలక్ గారికి చేతనానంద్. ఆ సినిమా పేరు ' ఆఖరీ బాత్' కావచ్చునని అన్నారు. ఆ రషెస్ చూసి రాజేష్ ఖన్నా అయితే బాగుంటాడు అని కూడా అనుకున్నారు. ముద్దు బిడ్డ సినిమాలో (హిందీ) హీరోగా, బాంద్రాలో వెదురు ఆడితిల వద్ద తీసిన కొన్ని షాట్స్ వీళ్లు చూసిన సినిమా (రషిస్) లో బాగున్నాయట.

         శ్రీచంద్ జైన్ గార్కి మొదటి నుండి సైరాబాను అంటే ఇష్టం. ఎందుకంటే ఆమె పిక్చర్లన్నింటికి ఆయనే పంపిణీదారు కావటం మూలాన. అందుచేత రాజేష్ ఖన్నా సరసన నటించటానికి, హింది ముద్దుబిడ్డలో, సైరాబానును సెలక్ట్ చేసుకున్నారు. ఇద్దరూ ఓకే ఆనుకున్నారు. దర్శకుడు  తిలక్ గారే. శ్రీచంద్ జైన్ గారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆ ప్రాజెక్ట్ దాంతోపాటే ఈడూ జోడూ కూడా తీద్దామనుకుని తీయలేకపోయారు.  అయితే తీద్దామనుకున్న ఈ రెండు స్కిప్టులు-రెండు ప్రింట్లు సర్క్యులేట్ అయ్యాయి బాంబేలో. కాని శ్రీచంద్ జైన్ గారయితే తీయలేదు.

         శ్రీచంద్ జైన్ గారి పరిచయాలతో, సి రామచంద్రగారి పరిచయంతో మరాఠీలో ‘తమాషా’ల పై తిలక్ గారికి ఆసక్తి కలిగింది. ఆదో ప్రక్రియ. పెద్దాపురం మేజూవాణి తరహా అని చెప్పుకోవచ్చు. అదే ‘సవాల్ జవాబ్’ లాగా వుంటాయి. అలాంటి నాటకాలు, సినిమాలు చూసేవారు తిలక్ గారు శ్రద్ధగా. అటువంటి సినిమాల్లో బాగా విజయవంతమైన సినిమా ఆధారంగా, ఓ సినిమాతీస్తే బాగుంటుందన్న ఆలోచనతో, శంభు ఫిల్మ్స్ భాగస్వామి లక్ష్మీ నారాయణ గారికి సూచించారు. అదే తిలక్ గారి ‘పంతాలు పట్టింపులు’ సినిమా. ‘పంతాలు పట్టింపులు’ సినిమాకు మరాఠీ సినిమాల్లో 'తమాషా’ సన్నివేశాల్లో నటించే మేటినటిగా పేరొందిన లీనాగాంధీనే పెట్టారు.

         సి రామచంద్రగారికి మంచి గ్రంథాలయం ఉండేది. ఆ పుస్తకాల్లో తిలక్ గారికి నచ్చిన పుస్తకం చార్లీ చాప్లిన్ జీవిత చరిత్ర. దాన్ని తీసుకుని ఓ వారం రోజులుంచుకున్నారు తిలక్ తనవద్ద. ఆయన హ్యూమర్ వున్న హ్యుమానిటేరియన్ అని అంటారు తిలక్. ఆయన సినిమాల ప్రభావం కూడా తనపై పడిందంటారు తిలక్. అలానే ఇంకో సినిమా గురించి చెప్పారు వేరే వాళ్లు తీసింది. ‘స్మిత్ గోస్ టు వాషింగటన్' అనే సెనేటర్స్ జీవితచరిత్ర. ఇంగ్లీష్ సినిమా. అట్లాగే ‘మీట్ మిస్టర్ జాండో’ అనే మరో సినిమా కూడా ఆయనకు చాలా బాగానచ్చింది. ఆ  మోడల్ లో ఓ సినిమాను తీద్దామనుకుని విశ్వామిత్ర ఆదిల్ తో  స్క్రిప్ట్ కూడా వ్రాయించారు. జర్నలిస్ట్ కు చెందిన థీమ్ అది.

         రాజ్ బబ్బర్ భార్య నదీరా బబ్బర్ ఓ రచయిత కూతురు. ఆమె ఒక స్టేజ్ ఆర్టిస్ట్, డ్రామాలు వేసేది. వేయించేది. పృథ్వీరాజ్ కపూర్ చనిపోయిన తర్వాత, జూహూలో ఓ థియేటర్ కట్టారు, ఆయన కుటుంబీకులు ప్రత్యేకించి డ్రామాలు వేయటానికి, వాటిలో ఎప్పుడూ డ్రామాలు వేస్తుండేది నదీరా బబ్బర్. దాంట్లోనే ‘చాట్ సర్కిల్’ చేసింది. ‘బర్టోర్డ్ బ్రష్ట్’ అనే జర్మన్ రచయిత డ్రామాలను హిందీలోకి తర్జుమా చేసి ఆమె వాటికి దర్శకత్వం వహించటంతో పాటు నటించేది. అలా ట్రాన్స్ లేట్ చేసిన డ్రామాల్లో ఒకటి చాట్ సర్కిల్.  ఇది చూసి ప్రభావితుడైన తిలక్ అప్పటికే తెలుగులోకి తర్జుమా చేయబడిన బర్టోర్డ్ బ్రష్ట్  నాటకాన్ని తాను సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు. దానిపేరు 'గుడ్ వుమెన్ ఆఫ్ షేజ్వానీ’ తెలుగులోకి జగ్గయ్యగారి ముందుమాటతో కొండేపూడి లక్ష్మీనారాయణగారు అనువదించారు. తాను తీద్దామనుకున్న సినిమాకు తెలుగులో పర్చూరి వెంకటేశ్వరరావు గారితో, హిందీలో విశ్వామిత్ర ఆదిల్ తో  స్క్రిప్ట్  వ్రాయించారు. హిందీ సినిమాకు ఇక్భాల్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ పాటను కూడా కంపోజ్ చేయించారు.

         తీద్దామనుకుని తీయలేని మరో సినిమాగా మిగిలిపోయిందది!

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment