Monday, April 22, 2019

భారత కమ్యూనిస్ట్ బృందంతో చర్చించిన స్టాలిన్... వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు ..... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


భారత కమ్యూనిస్ట్ బృందంతో చర్చించిన స్టాలిన్
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (23-04-2019)
భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లుగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగలదా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను  పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.


చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్‍ఘోష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్‍ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్యగారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్‍ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి  అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో.

No comments:

Post a Comment