Thursday, April 18, 2019

మార్కెటింగ్ లో డీఎక్స్ఎన్ సరికొత్త వ్యూహం : వనం జ్వాలా నరసింహారావు


మార్కెటింగ్ లో డీఎక్స్ఎన్ సరికొత్త వ్యూహం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (19-04-2019)
            మలేషియా పర్యటనలో వున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో, సిద్దిపేటలో ఇప్పటికే ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటులో వున్న డీఎక్స్ఎన్ సంస్థ, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వనపర్తి ప్రాంతంలో రెండో పరిశ్రమ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఇక్కడ ఆ సంస్థ దాదాపు రు. 250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ సంస్థ తెలంగాణాలో సాధారణంగా పండే పంటలను ప్రోత్సహిస్తూనే, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ వున్న పంటలవైపు రైతులను మళ్లిస్తారు. సంస్థ ప్రతినిధులు త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం బాగున్నందువల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి డీఎక్స్ఎన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఇఓ డాక్టర్ లిమ్ సియో జిన్ చెప్పారు. తెలంగాణాలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు 2020 నాటికి పూర్తవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు. వీటి ద్వారా దాదాపు 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా డాక్టర్ లిమ్ సియో జిన్ చెప్పారు. ఈ డీఎక్స్ఎన్ సంస్థ పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి.

184 దేశాల్లో, 70 లక్షల పంపిణీదార్లతో, 1600 కు పైగా సిబ్బందితో, సుమారు బిలియన్ డాలర్ల వ్యాపార దిగ్గజం డీఎక్స్ఎన్ సంస్థ. నేరుగా అమ్మకాలు (డీఎస్సీ కంపెనీ) జరిపే ప్రపంచవ్యాప్త కంపెనీలలో డీఎక్స్ఎన్ ది 24 వ స్థానం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి 1984 లో డిగ్రీ పొందిన సివిల్ ఇంజనీర్ డాక్టర్ లిమ్ సియో జిన్ డీఎక్స్ఎన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి.

మలేషియా దేశంలోని వాయువ్య ప్రాంతంలో గల కేదా ప్రదేశంలో ఆవిర్భవించిన డీఎక్స్ఎన్, తన విజయ పథానికి దాన్నే కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడే ఒక సాదా-సీదా కంపెనీగా మొదలైన డీఎక్స్ఎన్, అంచెలంచలుగా ఎదిగి, ఈ రోజున ప్రపంచవ్యాప్త సంస్థగా రూపుదిద్దుకుంది. చైనా దేశపు వాడుకపదమైన “డాక్సేన్” నుంచి పుట్టుకొచ్చిందే డీఎక్స్ఎన్ నామకరణం. “డాక్సేన్” అంటే, విశ్వసనీయత, నిజాయితీ, ధర్మం. డీఎన్ఎక్స్ కంపెనీ సిద్దాంతం, “ఆరోగ్యం, సౌభాగ్యం, సంతోషం”.

డీఎక్స్ఎన్ తన 25 సంవత్సరాల పూర్తి పండుగను ఏడాది క్రితం 2018 మే నెలలో జరుపుకుంది.

ఎక్జేక్యూటివ్ చైర్మన్ హోదాలో ఏప్రియల్ 3, 1996 నుండి వ్యవహరిస్తున్న డాక్టర్ లిమ సియో, కంపెనీని 1933 లో స్థాపించారు. అత్యంత నైపుణ్యం కల డాక్టర్ లిమ్ సియో ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ నుండి డాక్టరేట్ పట్టా పొందడమే కాకుండా, పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఒక వ్యవస్థాపకుడిగా, ఔత్సాహికుడిగా, ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా, శాస్త్రవేత్తగా, పరోపకారిగా డాక్టర్ లిమ్ సియో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ప్రపంచాన్ని ఒక ఉత్తమమైన జీవన వేదికగా మార్పుకు కారకుడయ్యారు.

అనాదిగా, వేలాది సంవత్సరాలుగా ఏషియా తరహా వైద్యానికి సంబంధించిన ఏషియా మష్రూమ్ దినుసుల జాతికి చెందిన “గనోదేర్మా” మూలిక ద్వారా ఆరోగ్య లాభాలను డాక్టర్ లిమ్ సియో గుర్తించిన నేపధ్యమే డీఎక్స్ఎన్ విజయానికి కారణం. సుమారు 400 కు పైగా జీవ క్రియాత్మక సమ్మేళనాలున్న “గనోదేర్మా” వల్ల,  నిర్విషీకరణ (detoxication), శారీరక విధుల సమతుల్యం (balancing body functions), రోగ నిరోధక శక్తి ప్రభావాలు (immunoregulatory effects), అనామ్లజన చర్యలు (antioxidants activities),  కాలేయ నిరసన (liver protesting), హైపో గ్లేసీమిక్ (hypoglycaemic), బ్యాక్తీరియల్ వ్యతిరేక ప్రభావాలు (anti-bacterial effects) లాంటి అనేక రకాల రుగ్మతలతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడం కూడా చేస్తుందని అధ్యయనంలో తేలింది.

కట్టింగ్ అంచు ప్రాసెసింగ్ సాంకేతిక విధానం ద్వారా, డీఎక్స్ఎన్ చర్మ సంరక్షణ సంబంధిత నుండి కాఫీ సంబంధిత వరకూ, రక-రకాల ఉత్పత్తులను తయారుచేయగల సామర్థ్యం వుంది. “గనోదేర్మా” నుండి  తయారయ్యే “లిమ్ఘజీ” అనే ఒక అసాధారణ ఉత్పత్తికి డాక్టర్ లిమ్ సియో విజన్ నుండి రూపుదిద్దుకున్న “ఒకే ప్రపంచం, ఒకే మార్కెట్” అనే మార్కెటింగ్ వ్యూహం కారణాన, యావత్ ప్రపంచానికి అది సులువుగా లభ్యమవుతున్నదిప్పుడు.

కేవలం రెండు రకాల ఉత్పత్తులతో ఆరంభమైన డీఎక్స్ఎన్ ప్రస్థానం అంచెలంచలుగా ఎదిగి, “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” వ్యూహం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా పాకింది. మొదట్లో డాక్టర్ లిమ్ సియో తన భావనను బయటపెట్టినప్పుడు నవ్వని వాళ్ళు లేరు. “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” వ్యూహం అంటే, డీఎక్స్ఎన్ కంపెనీ తయారుచేసి, విడుదల చేసి, పాకింగ్ చేసిన ఉత్పత్తులను నేరుగా, సరాసరి వినియోగదారులకు పంపిణీ చేయడమే. దీనికి అనుగుణంగా దేశదేశాలలో తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడం కోసం ప్రపంచవ్యాప్తంగా భారీగా పెట్టుబడులు పెట్టింది డీఎక్స్ఎన్ కంపెనీ.

నేరుగా, సరాసరి (Direct Selling) అమ్మకాల వ్యాపార శైలిలో యావత్ ప్రపంచంలోనే డీఎక్స్ఎన్ సంస్థది ఒక రకమైన ఏకైక మార్కెటింగ్ భావనగా నిరూపణ కావడం విశేషం. ఇలా జరగడంతో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రజల కలిసి-మెలిసి, ఒక నెట్వర్క్ గా, ఒకరికొకరు సహాయ-సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటూ, సంబంధిత సభ్యులకు బలీయమైన ఆర్ధిక పుష్టిని కలిగించడమే కాకుండా, ఒక ప్రపంచవ్యాప్త సంఘంలో ఒకే రకమైన విలువలను పంచుకుంటూ భాగస్వాములం అయ్యామన్న తృప్తి కలిగింది.

పంపిణీదార్లు రూపొందించిన డిమాండ్ ఆధారంగా డీఎక్స్ఎన్ తన మార్కెట్ ను అంతర్నిర్మాణo చేసింది.  ఒక దేశంలోని సభ్యులు డీఎక్స్ఎన్ ఉత్పత్తుల కొరకు డిమాండ్ రూపొందించగానే, కంపెనీ తక్షణమే స్పందించి, పంపిణీదార్ల సౌలభ్యం కొరకు, ఆయాదేశాల్లో కార్యాలయాలను నెలకొల్పుతుంది. దానంతట అదిగా ఎక్కడికీ పోదు...కార్యాలయాలను నెలకొల్పదు....అమ్మకాలు ప్రారంభించదు. ఇదొక రకమైన దుకాణ రహిత భావన (shop-less concept). ఈ వ్యూహాన్ని వందమందికి పైగా చురుకైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నిర్వహిస్తుంటారు. క్రమేపీ డీఎక్స్ఎన్ రూపొందించిన “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” వ్యూహం వాస్తవరూపం దాల్చి, ఎవరైనా, ఏ దేశం నుండైనా, ఎవరితోనైనా, వారే దేశంలో వున్నప్పటికీ, వ్యాపారం చేస్తూ, వాళ్ల స్థానిక కరెన్సీలో సంపాదన చేసుకోవచ్చు.

“ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” భావన చాలా తేలికైంది. డీఎక్స్ఎన్ సభ్యులు ప్రపంచంలోని ఏ ప్రదేశం నుండైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా, ఎవరినైనా, నిరభ్యంతరంగా ఒక అభ్యర్థిగా నియమించుకోవచ్చు. కంపెనీ ఉత్పత్తులను యావత్ ప్రపంచంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. అంతర్జాతీయంగా చేసిన వాళ్ల వ్యాపారానికి ప్రతిఫలంగా అదనపు ఆదాయాలను స్థానిక కరెన్సీలో పొందవచ్చు. ఈ యావత్ ప్రక్రియలో భాగంగా, కేవలం ఒక స్మార్ట్ ఫోన్ తన చేతిలో వుంచుకుని, ఏ సభ్యుడైనా అంతర్జాతీయ మార్కెటింగ్ అతి సులువుగా చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా కావాల్సినవారిని నియమించుకోవచ్చు, అవసరమైన ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చు, దానికి అవసరమైన నగదు చెల్లించవచ్చు, చివరకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చాట్ చేయవచ్చు కూడా. ఇంత భారీ కార్యకలాపాల కారణాన, మలేషియాలోని కేదాలొ వున్న కంపెనీ ప్రాసెసింగ్ కేంద్రం, దానికి అనుబంధంగా వున్న కౌలాలంపూర్ లోని కార్పోరేట్ కేంద్ర కార్యాలయం, పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి.

డీఎక్స్ఎన్ లోగోలో కూడా ఎంతో నిగూఢ అర్థం వుంది. దాన్లోని నీలం రంగు, ప్రాణికోటి జీవించడానికి అత్యంత అవసరమైన నీటికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా వుంటుంది. ఆకుపచ్చ రంగు విస్తరణకు సంకేతం కాగా, ఎరుపు రంగు ఒక విషయం మీద మేధస్సు ఎలా కేంద్రీకృతమై వుంటుందో తెలియచేస్తుంది. డీఎక్స్ఎన్ కార్పోరేట్ సామాజిక బాధ్యతలో తన వంతు పాత్ర పోషిస్తున్నది. అవసరమనుకున్న సందర్భాలలో అంబులెన్సులను, డయాల్సిస్ యంత్రాలను లయన్స్ క్లబ్ ద్వారా దానం చేయడంతో పాటుగా, ప్రకృతివైపరీత్యాలలో ఇబ్బందులకు గురైనవారిని ఆర్థికంగా ఆదుకుంది చాలా సందర్భాలలో.

వీటన్నింటి వెనుక వున్న ఆపన్న హస్తం డాక్టర్ లిమ్ సియో. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను రూపొందించుకుని, “ఆరోగ్యం, సౌభాగ్యం, సంతోషం” అనే సిద్దాంతం ప్రాతిపదికగా ఆయన తన కార్యక్రమాలను, వ్యూహాలను అమలుపరుస్తున్నారు. డీఎక్స్ఎన్ సంస్థను ఒక వసుదైక ప్రపంచవ్యాప్త కుటుంబంగా పరిగణిస్తే, ఆ కుటుంబానికి పెద్దగా, తండ్రిలాంటి వాడిగా డాక్టర్ లిమ్ సియోను గుర్తించాలి.


ఈ విషయాలన్నీ  “మై జర్నీ విత్ డీఎక్స్ఎన్” అనే పుస్తకంలొ వివరంగా పొందుపరచబడ్డాయి. రచయిత డాక్టర్ రాజేష్ ఎస్. సవేరా, డాక్టర్ లిమ్ సియో ల మధ్య చోటుచేసుకున్న అనుభవాల మార్పిడే “మై జర్నీ విత్ డీఎక్స్ఎన్” పుస్తకంగా రూపుదిద్దుకుంది.

 “మై జర్నీ విత్ డీఎక్స్ఎన్” అనే పుస్తకం, దాని రచయిత డాక్టర్ రాజేష్ ఎస్. సవేరాకు, డీఎక్స్ఎన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ లిమ్ సియోకు మధ్య, ఏడాది క్రితం, హైదరాబాద్ నగరంలో మార్చ్ 5, 2018 నుండి నాలుగు రోజులపాటు జరిగిన సమావేశం-చర్చల పర్యవసానమే. తానెలా డీఎక్స్ఎన్ సంస్థను స్థాపించిందీ, స్థాపించాల్సి వచ్చిందీ, తన సుదీర్ఘ ప్రస్తానం ఎలా సాగిందీ, తాను చేసిన త్యాగాలేంటీ, తానెలా రాజీపడ్డదీ, ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నదీ...ఇలా ఎన్నెన్నో విషయాలను డాక్టర్ లిమ్ సియో రచయితతో పంచుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల గురించీ, తన భవిష్యత్ విజన్ గురించీ కూడా రచయితతో పంచుకున్నారు డాక్టర్ లిమ్ సియో. మిగతా చాలా విషయాలతో పాటు ఈ పుస్తకంలో ప్రధానంగా, డాక్టర్ లిమ్ సియో ఇంజనీరింగ్ విద్యార్ధి దశ, ఆయన మొదటి ఉద్యోగం, ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆయన జీవనయానం ఎలా సాగిందీ, మొదటిసారిగా డీఎక్స్ఎన్ సభ్యుడైన విధానం, ఆ సంస్థ ప్రారంభ ఉత్పత్తుల టెస్టిమోనియల్స్, “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” భావన, భవిష్యత్ లాంటివి వున్నాయి.

No comments:

Post a Comment