Tuesday, April 30, 2019

ఖమ్మంలో పౌరహక్కుల ఉల్లంఘలనపై నివేదిక ఆవిష్కరణ ..... వైఆర్కే జైలు – కోర్టులు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఖమ్మంలో పౌరహక్కుల ఉల్లంఘలనపై నివేదిక ఆవిష్కరణ  
వైఆర్కే జైలు – కోర్టులు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (01-05-2019)
1977లో ఎమర్జెన్సీ ఎత్తి వేశాక, కేంద్రంలో అధికారంలోకొచ్చిన జనతా ప్రభుత్వం, ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాల అధ్యయనం కోసం, "షా కమీషన్" ఏర్పాటు చేసింది. ఆ స్ఫూర్తితో తిరిగి పౌర హక్కుల ఉద్యమాన్ని జిల్లాలో ప్రారంభించే ప్రయత్నం చేశారు డాక్టర్ గారు. అప్పటికి సిపిఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులతో కాంగ్రెస్ నాయకులు గెల్లా కేశవరావుగారు, పూర్వ కమ్యూనిస్ట్ నాయకులు గండ్ర సుబ్బారెడ్డిగారు, జనతా పార్టీ నాయకులు చేకూరి కాశయ్యగారు సహకరించారు. జస్టిస్ తార్కుండే గారి నాయకత్వాన ఒక కమిటీ, పౌర హక్కుల ఉల్లంఘనలపై ఒక పెద్ద నివేదిక విడుదల చేసింది. నివేదికను హైదరాబాద్‍లో ఆవిష్కరించిన తరువాత ఖమ్మంలో ఆవిష్కరించే ఏర్పాట్లు చేశారు. వర్తక సంఘం భవనంలో పెద్ద సదస్సు జరిగింది. హైదరాబాద్ నుండి కన్న భీరన్ గారు, ప్రముఖ హేతువాది అడ్వకేట్ ఎం. వి. రామ్మూర్తి గారు, కాళోజీ నారాయణ రావు గారు హాజరయ్యారు.

ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారి ఆధ్వర్యంలో, ఆనాటి నక్సల్స్ పై జరిగిన మారణకాండపై, విషయ సేకరణ కోసం ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమీషన్‍ను నియమించింది. ఈ కమీషన్ హైదరాబాద్‍లో విచారణ ప్రారంభించింది. సుందరయ్య, ఓంకార్‍గార్లు విచారణలో పాల్గొన్నారు. కన్నభీరన్‍గారు న్యాయ సంబంధమైన వివరణలు ఇచ్చారు. ఆ కమీషన్ కార్య కలాపాలకు పత్రికలు పెద్ద ఎత్తున ప్రాముఖ్యం ఇవ్వడంతో, ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కమీషన్ విచారణ బహిరంగంగా చేయరాదని, గుంభనంగా మాత్రమే జరగాలని ఆదేశించింది. అందుకు జస్టిస్ భార్గవ కాని, కన్నభీరన్, సుందరయ్యగార్లు కాని సుముఖంగా లేకపోవడంతో దాన్ని మూసి వేశారు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో కూడా చాలా ఘోరాలు జరిగాయి. సత్తుపల్లికి చెందిన అడ్వకేట్ బత్తుల వెంకటేశ్వరరావును నక్సలైట్ పేరుతో అమానుషంగా పోలీసులు చంపివేశారు. అది పెద్ద సంచలనం సృష్టించింది.

ఆ కేసు తదితర కేసులకు సంబంధించిన వివరాలు డాక్టర్ వై.ఆర్.కె, ఆయన మిత్రులు కర్నాటి రామ్మోహనరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు(అడ్వకేట్), ఆయా ప్రదేశాలకు వెళ్లి, సమాచారం సేకరించి, భార్గవ కమీషన్ ముందుకు పంపించారు.

అదే సమయంలో వెంగళరావు అవినీతి అంశంపై విచారణకు "జస్టిస్ విమద్ లాల్ కమీషన్" ఏర్పాటైంది. అది చేకూరి కాశయ్య గారి చొరవతో వేయబడ్డ కమీషన్. దానితో డాక్టర్ వై.ఆర్.కె కు సంబంధం లేదు. కాని, ఆ కమీషన్ కూడా, జస్టిస్ గారి మెతక వైఖరి వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. ఆ నాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేపట్టిన వారందరికీ నిరాశ కలిగించింది.


భార్గవ కమీషన్
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, బూటకపు ఎన్‍కౌంటర్లలో అనేక మంది పోలీసుల చేతుల్లో చనిపోయారు. ఆ ఘటనలను విచారించి, నిజానిజాలను కనిపెట్టి బహిరంగంగా బయట పెట్టి బాధ్యులకు శిక్ష విధించాలన్న ఉద్యమం మొదలైంది. ఎమర్జెన్సీ ముగిసిపోయి, జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఆ పాటికే ప్రముఖ పౌర హక్కుల ఉద్యమ నాయకుడు విఎం. తార్కుండే అధ్యక్షుడుగా, ఎనిమిది మంది సభ్యులతో ఏప్రిల్ 1977లో ఏర్పాటైన "తార్కుండే కమిటీ" సాక్ష్యాల సేకరణలో నిమగ్నమైంది. అనేక ప్రాంతాలలో కమిటీ సభ్యులు పర్యటించి, సమాచారాన్ని సేకరించి, నివేదికలను రూపొందించి, ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‍కు, హోం మంత్రి చరణ్ సింగ్‍కు పంపింది కమిటీ. ఆ కమిటీ సభ్యులలో కన్నబిరాన్, కాళోజీ నారాయణరావు, బి.జి. వర్గీస్, అరుణ్ శౌరి లాంటి ప్రముఖులున్నారు. ప్రధానిని, హోం మంత్రిని కన్నభీరన్ పలుసార్లు స్వయంగా కూడా కలుసుకున్నారు. నివేదికలు చదివిన మొరార్జీ దేశాయ్ విచారణ కమీషన్ వేయాల్సిన అవసరం వుందనే అభిప్రాయానికి వచ్చారు. కాకపోతే అలాంటి కమీషన్‍ను వేసే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వుందనేది గమనించాల్సిన అంశం. కేంద్రం జోక్యం తప్పని సరి అని కన్నభీరన్ ప్రభృతులు ప్రధానిని కోరడంతో, రాజీ ఫార్ములాగా, కేంద్రం సూచించిన న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించి విచారణ జరిపించాలన్న నిర్ణయం జరిగింది.

పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ట భార్గవ నాయకత్వంలో, వెంగళరావు ప్రభుత్వం, భార్గవ కమీషన్‍ను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ భార్గవకు నిజాయితీపరుడని, ముక్కుసూటిగా మాట్లాడే వాడని, జిల్లా జడ్జీగా-హైకోర్టు జడ్జీగా-సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడని గుర్తింపు వుంది. కమీషన్ కార్యదర్శిగా బీనాదేవిగా ప్రసిద్ధిగాంచిన రచయిత బి. నరసింగ రావును నియమించింది ప్రభుత్వం. ఆయన కార్యదర్శిగా జులై 1977 చివరి వారంలో, కమీషన్‍కు సంబంధించిన తొలి విచారణ బహిరంగ ప్రకటన వెలువడింది. హైదరాబాద్ దిల్ కుషా ప్రభుత్వ అతిధి గృహంలో విచారణ జరిగింది. మొట్ట మొదటి వాంగ్మూలం తార్కుండే ఇచ్చారు. తార్కుండే కమిటీ పక్షాన ఎం. వి. రామమూర్తి, కన్నబిరాన్ వాదనలు వినిపించేవారు. పి. శివ శంకర్‍ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఆయా రంగాలలో నిపుణులైన మరి కొందరిని కూడా కమీషన్ నియమించింది.  

No comments:

Post a Comment