Wednesday, April 24, 2019

పార్టీలో చీలికకు దారితీసిన అభిప్రాయభేదాలు ..... వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


పార్టీలో చీలికకు దారితీసిన అభిప్రాయభేదాలు
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (25-04-2019)
1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ  కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

తెనాలిలో జరిగిన సమావేశాల వివరాలకు సంబంధించి "ప్రజాశక్తి" పత్రిక "మార్క్సిస్ట్" మాగజైన్ లో వచ్చిన వ్యాసాన్ని జలై 12, 2009 రోజున ప్రచురించింది. ఆ వివరాలు:

"భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలోని ఒక సెక్షన్‌లో తెలంగాణా పోరాట కాలంలోనే రివిజనిస్టు పోకడలు పొడచూపాయి. రివిజనిజానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆంతరంగిక పోరాటం 1955- 56 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి పార్టీలోని రివిజనిస్టు నాయకత్వం అనుసరిస్తున్న వర్గసంకర విధానాన్ని పార్టీలోని పెద్ద సెక్షన్‌ (తరువాత మార్క్సిస్టు పార్టీగా పునర్నిర్మాణం చెందింది) తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల విషయంలో ఆంతరంగి కంగా పార్టీ నిలువునా చీలిపోయింది. 1961 లో విజయవాడలో జరిగిన ఉమ్మడి పార్టీ చివరి మహాసభ ఈ విభేదాలను పరిష్కరించలేక పోయింది. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా ఉండాలంటే పార్టీలో కిందినుండి పైస్థాయివరకు కార్యక్రమం, ఎత్తుగడలపై కూలంకషమైన చర్చ కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్దతుల్లో జరగాలని పార్టీలోని ఒక భాగం డిమాండ్‌చేసింది. కాని నాటి పార్టీ నాయకత్వంలోని మెజారిటీ సభ్యులు రివిజనిస్టు ప్రభావానికి గురైఉన్నందున ఇటువంటి చర్చకు ఆస్కారం ఇవ్వలేదు సరికదా కాంగ్రెస్‌ప్రభుత్వంతో చేతులు కలిపి అలా డిమాండ్‌ చేసినవారిని అరెస్టు చేయించడం ప్రారంభించింది”.


“1962 భారత్‌-చైనా యుద్ధాన్ని రివిజనిస్టు నాయకత్వం దీనికోసం ఉపయో గించుకుంది. చైనాతో యుద్ధాన్ని బలపరుస్తూ రివిజనిస్టు నాయకత్వం జాతీయ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించిన వారందరినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రారంభిం చింది. నాయకులు జైళ్లలో ఉన్న సమయంలో మొత్తం పార్టీ కార్యాలయాలనూ, పత్రికలనూ రివిజనిస్టు నాయకత్వం స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ప్రజాతంత్ర విరుద్ధంగా జరుగుతున్న ఇటువంటి కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్‌పెట్టాలనీ, పార్టీలో ఐక్యత పాదుకొల్పేం దుకు అన్ని స్థాయిల్లో చర్చలజరగాలని జాతీయ కౌన్సిల్‌కు కొందరు సభ్యులు ఇచ్చిన నోటీసును నాయకత్వం తిరస్కరించడంతో ఇంక చేసేది లేక 32 మంది జాతీయ కౌన్సిల్‌సభ్యులు వాకౌట్‌చేసి బయటకు వచ్చేశారు. పార్టీని విప్లవ పంథాలో పునర్నిర్మించాలని ఆ 32 మంది సభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రకారమే తెనాలిలో 1964 జులైలో మూడురోజుల జాతీయ సదస్సు జరిగింది. అదే ఏడాది నవంబర్‌లో కలకత్తాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏడవ మహాసభకు సన్నాహంగా తెనాలి సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల పత్రం రూపుదిద్దుకుంది. కలకత్తా మహాసభ దీన్ని ఆమోదించింది".

No comments:

Post a Comment