Thursday, March 29, 2012

బాధ్యతా రాహిత్యంతో ప్రజా సమస్యలను పట్టించుకోని అధికార-ప్రతిపక్షాలు: వనం జ్వాలా నరసింహారావు


శాసన సభ బడ్జెట్ సమావేశాలు 29-03-2012 న ముగిసిన సందర్భంగా
వనం జ్వాలా నరసింహారావు

ఎనిమిదిమంది తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మరికొందరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ సీట్ల వద్దే నిలబడి తెలంగాణ నినాదాలు చేశారు. అదే విధంగా తెలంగాణ తెలుగుదేశం సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు, సీపీఐ, బీజేపీ సభ్యులు, ఎవరికివారే, తెలంగాణ అంశంపై వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టాయి. సభాపతి నాదెండ్ల మనోహర్‌ వీటిని తిరస్కరించడంతో, టీ-టీడీపీ, టీఆర్ఎస్‌, సీపీఐ, బీజేపీ సభ్యులతోపాటు స్వతంత్య్ర ఎమ్మెల్యే నాగం జనార్థన రెడ్డి జై తెలంగాణ నినాదాలతో స్పీకర్‌ పోడియంను చుట్టు ముట్టారు. స్పీకర్‌ ఎంత వారించినా సభ సజావుగా సాగేందుకు వారు సహకరించక పోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే మరో మారు టీ-టీడీపీ, టీఆర్ఎస్‌, సీపీఐ, బీజేపీ సభ్యులు తెలంగాణ నినాదాలతో స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. టీ-కాంగ్రెస్‌ సభ్యులు మాత్రం వారి సీట్ల వద్ద నిలబడి తెలంగాణకు అనుకూలంగా గొంతు విప్పారు. ఇదిలా ఉంటే... మరికొందరు శాసనసభ సభ్యులు కూడా స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకోక మునుపే స్పీకర్‌ సభను మరోసారి వాయిదావేశారు. ఆ తరువాత మర్నాటికి వాయిదా వేశారు" ఇది ఒక రోజు శాసనసభ పరిస్థితి. ఈ పరిస్థితే ఐదారువారాల పాటు కొనసాగింది. అటు ప్రతిపక్షాల వారికి కాని, ఇటు అధికార పక్షానికి కాని శాసనసభ సజావుగా జరగాలని కాని, ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కాని లేదనటానికి ప్రతిరోజూ చోటుచేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉదహరించవచ్చు.

ఐదారు వారాల పాటు జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చ మచ్చుకు కూడా జరగలేదు. అలా జరగకపోవడానికి అధికార, ప్రతిపక్షాల సమష్టి బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణం. శాసనసభ ప్రతిరోజూ సమావేశమైంది కేవలం వాయిదాపడటానికే అని పౌరులందరికీ అర్థమైంది. సభ సమావేశం కాగానే, ఆనవాయితీగా, ప్రశ్నోత్తరాల అంశం చేపట్టాలని సభాపతి కోరడం, ఆయన నోట ఆ మాట వచ్చే లోపునే ప్లకార్డులతోనో, నినాదాలతోనో, వాయిదా తీర్మానాలతోనో, అలాంటి మరో అంశంతోనో, ప్రతిపక్షాలు ఎవరి ఎజెండాతో వారు సభ జరగకుండా అంతరాయం కలిగించేందుకు శ్రీకారం చుట్టడం జరిగేది. సభాపతి తన సహజ సిద్ధమైన నవ్వు ముఖంతో, సభ్యులను అత్యంత గౌరవ మర్యాదలతో సంబోధిస్తూ, సభకు అంతరాయం కలిగించ వద్దని, సాంప్రదాయాలు-సభా మర్యాదలు కాపాడమని విజ్ఞప్తి చేయడం, ఆయన మాట ఆందోళన చేస్తున్న సభ్యులు  ఏ మాత్రం వినిపించుకోక పోవడం, అలా కొంత సేపు జరిగిన తరువాత, సభను పది-పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు వాయిదా వేయడం చోటుచేసుకునేది. ఆ తరువాత సమావేశం కావడం, అదే సీను మళ్లీ పునరావృతం కావడం, అలా ఒకటి-రెండు పర్యాయాలు జరిగిన తరువాత మర్నాటికి సభ వాయిదా పడడం నిత్యకృత్యమైపోయింది. సభను కొనసాగేలా చూడడానికి, సభాపతి, బిజినెస్ అడ్వైజరీ కమిటీని, ఫ్లోర్ లీడర్లతో సమావేశ పరిచి కొంతలో కొంత అవగాహన కుదిర్చినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కాకపోతే, రాజ్యాంగపరంగా, తప్పనిసరిగా శాసనసభ చేపట్టాల్సిన అంశాలను మాత్రం, ఏదో ఒక పద్ధతిని అవలంబించి, కొనసాగించడం జరిగింది. ఉదాహరణకు, బడ్జెట్ ప్రసంగం అనుకున్న సమయంలోనే, అనుకున్న విధంగానే, అంతరాయం లేకుండా జరగడానికి, కొందరు సభ్యులను సభ నుంచి సస్పెండు చేయడం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం కూడా ఆగలేదు. సభ జరిగినా-జరగకపోయినా బడ్జెట్‌ను శాసనసభ గిలెటిన్ పద్ధతిన ఆమోదం పొందడమూ ఆగలేదు. ఎటొచ్చీ సభలోకి రాంది-సభ చర్చించనిది ప్రజా సమస్యలనే. దీనికి ప్రధాన కారణం సభ్యులు ప్రతిదినం ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలు-వాటికి సభాపతి నిర్ద్వందంగా తిరస్కరణ. వాయిదా తీర్మానాలలోని అంశాలను మరో పద్ధతిన లేవనెత్తితే బాగుంటుందని ప్రతి పక్షాలు భావించలేదు. పోనీ, ఒకటో-రెండో తీర్మానాలను అనుమతించితే సరిపోతుంది కదా అని సభాపతి భావించలేదు. అధికార-ప్రతి పక్షాల మధ్య పట్టు విడుపులు లేక పోవడంతో చివరికి జరిగింది ప్రజా సమస్యలను సభలో చర్చించకపోవడమే!

ఇంతకీ, ఈ వాయిదా తీర్మానం అనే ఆయుధాన్ని ఇలా ప్రతిపక్షాలు విచ్చలవిడిగా ఉపయోగించుకోవచ్చా? ఒక వేళ ప్రతిపక్ష సభ్యులు అలా కోరినప్పుడు, ఎల్లవేళలా సభాపతి ఆ తీర్మానాలను తిరస్కరించవచ్చా? వాయిదా తీర్మానంలోని అంతరార్థం సభను వాయిదా వేయించడమే అనే అర్థం స్ఫురించే రీతిలో, సభాపతి, చివరకు చేస్తోంది సభను అరగంట-గంట వాయిదా వేసి, అప్పటికీ సభ్యుల ఆందోళన ఆగకపోతే, ఏకంగా మర్నాటికి వాయిదా వేయడమేనా? సభ్యుడు కోరుకుంది, సభాపతి అంగీకరించింది సభ వాయిదా వేయడమే ఐతే, దీనికింత రాద్ధాంతం ఎందుకు? అంటే, వాయిదా తీర్మానం మనం అనుకుంటున్నంత తేలికైన అంశం కాదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ తీర్మానానికి అత్యంత ప్రాధాన్యత వుంటుందనీ, దురదృష్టవశాత్తు కీలకమైన ఈ విషయాన్ని, అధికార-ప్రతిపక్షాలు అర్థం చేసుకోవడంలో ఎక్కడో కొంత లోపం వుందనీ బోధపడుతోంది.

సాధారణంగా శాసనసభలో చర్చకు చేపట్టాల్సిన అంశానికి సంబంధించి, అది కావాలని భావించిన సభ్యుడు, నోటీసు ఇవ్వడం ఆనవాయితీ. అది ప్రశ్నోత్తరాల రూపంలో కాని, మరో నిబంధన కింద చర్చకు చేపట్టాలని కానీ అడగడం జరుగుతుంది. వాయిదా తీర్మానం లక్ష్యం-ధ్యేయం వేరు. ప్రజా ప్రాముఖ్యత సంతరించుకున్న వర్తమాన కాలానికి చెందిన అత్యంత ప్రాధాన్యతా అంశాన్ని, దాని ద్వారా సంభవించనున్న తీవ్ర పరిణామాలను, చట్ట సభ దృష్టికి తెచ్చేందుకు, సరైన నోటీసు ద్వారా సభాపతిని కోరేదే వాయిదా తీర్మానం. రాష్ట్రంలో సంభవించిన ఒకానొక సంఘటన అత్యంత తీవ్రతరమైంది గా భావించిన నేపధ్యంలోనే, శాసనసభ ఆ విషయంలో ఇతర విషయాలన్నింటినీ పక్కకు పెట్టి ఆ విషయాన్నే చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరడం జరగాలి. అంటే, శాసనసభ సాధారణంగా చేపట్టాల్సిన రోజువారీ కార్యక్రమాన్ని-ఎజెండాను వాయిదావేసి, ఈ అసాధారణ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం. ప్రభుత్వ పనితీరును-వైఫల్యాన్ని సూటిగా ఎత్తి చూపుతూ, ఈ అసాధారణ అంశంపై చర్చ జరగాలని సభ్యుడు కోరడమే వాయిదా తీర్మానం. ఉదాహరణకు, షెడ్యూల్డ్ కులాల-జాతుల వారిమీద, వెనుకబడిన-బలహీన వర్గాల వారిమీద, ఏదైనా అఘాయిత్యం జరిగి ప్రభుత్వం దానిని సరిగ్గా పరిష్కరించ లేకపోతే, అలాంటి అంశాన్ని వాయిదా తీర్మానం ద్వారా లేవనెత్తి, సభ దృష్టికి తెచ్చి చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇవ్వ వచ్చు. ఐతే, ఎటువంటి కారణం చూపకుండా సభాపతి ఆ తీర్మానాన్ని తిరస్కరించవచ్చు.

శాసనసభ ఒక సిట్టింగులో, ఒక్కో సభ్యుడికి, ఒక్క సారి మాత్రమే వాయిదా తీర్మానానికి నోటీసు ఇవ్వడానికి అర్హత వుంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, మొదటి సంతకం పెట్టిన వ్యక్తి మాత్రమే నోటీసు ఇచ్చినట్లు లెక్క. అతడి కోటా ఐపోయినట్లు భావించాలి. ఒకే అంశంపై, ఒకటికంటే ఎక్కువ నోటీసులు వస్తే, ఆ అంశాన్ని చర్చకు చేపట్టాలని నిర్ణయం జరుగుతే, ఎవరు ప్రతిపాదించిన అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఓటింగు చేపట్టడం జరుగుతుంది. సభ సమావేశం ప్రారంభం కావడానికి గంట ముందుగా వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. నోటీసును నిర్ణీత ఫారంలో మాత్రమే ఇవ్వాలి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసే రోజున నోటీసులు స్వీకరించబడవు. వాయిదా తీర్మానం అంగీకరించాలా? తిరస్కరించాలా? అన్నది సభాపతి నిర్ణయంపైనే ఆధారపడి వుంటుంది. ఆయనదే తుది నిర్ణయం. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఐతే ఆయన నిర్ణయం కొన్ని సంప్రదాయాలమీద, రాజ్యాంగపరమైన మార్గదర్శకాలపైన ఆధార పడి వుండాలి. వాయిదా తీర్మానంలో లేవనెత్తిన అంశం వాస్తవంగా ప్రజా ప్రాముఖ్యత కలిగిందై వుండాలి... అది వర్తమాన కాలానికి చెందిన అంశమై వుండాలి... ఎప్పుడో భవిష్యత్‍లో జరగబోయే సంఘటనకు సంబంధించినది కాకూడదు...ఆ అంశంపై సభ అంతకుముందే చర్చించిన అంశం కాకూడదు... ఎవరైనా సభ్యుడి హక్కులకు భంగం వాటిల్లే అంశం కారాదు. నిబంధనల ప్రకారం వాయిదా తీర్మానం వుందని సభాపతి భావించి తేనే, ఆయన అంగీకరించుతాడు. అలా అంగీకరించితే, ప్రశ్నోత్తరాల సమయం ఐపోయిన తర్వాత, సభాపతి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చిన తరువాత, సభ అనుమతితో నోటీసు ఇచ్చిన సభ్యుడు ప్రవేశపెడ్తాడు. శాసనసభ సభ్యుల సంఖ్యలో కనీసం పదో వంతు మంది తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడితే, చర్చకు సభాపతి అనుమతి ఇస్తారు. వాయిదా తీర్మానానికి సంబంధించిన అంశం గురించి తన దగ్గర సరైన సమాచారం లేకపోతే, సంబంధిత శాఖా మంత్రిని వివరణ కోరిన తరువాత అంగీకరించడం కాని, తిరస్కరించడం కాని చేయవచ్చు. వాయిదా తీర్మానాన్ని సభ ఆమోదించితే (సాధారణంగా జరగదు) సభ ఆటోమేటిక్‌గా వాయిదా పడ్డట్లు లెక్క.

మొత్తం మీద, ఫిబ్రవరి 13న మొదలై, ఆరువారాలపాటు-సుమారు నెల రోజులు నడిచి, మార్చి 29 న ముగిసిన బడ్జెట్ సమావేశాల చివరి రెండు-మూడు రోజులు కూడా సజావుగా నడవలేదు. ఆ మాటకొస్తే, ప్రజాసమస్యల ప్రస్తావనే లేకుండా, ఆసాంతం బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. నామమాత్రపు చర్చ కూడా జరగకుండానే లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ప్రజాధనం (దుర్)వ్యయంపై చర్చ లేకుండానే నలబై శాఖల పద్దులు గిలెటిన్ అయ్యాయి. పట్టుమని పది రోజులు కూడా పూర్తి స్థాయి చర్చలు జరగలేదు. ధరల పెరుగుదల కాని, తాగు నీటి సమస్య కాని, ధాన్యానికి గిట్టుబాటు ధర కాని, విద్యుత్ కోత అంశం కాని, తెలంగాణ సమస్యపై కాని, మద్యం ముడుపుల వ్యవహారం కాని, అవినీతి నిర్మూలన విషయం కాని, గిరిజన సమస్యలపై కాని, ఆ మాటకొస్తే ఏ ప్రజా సమస్యపై కాని సంతృప్తికరంగా కాకపోయినా నామమాత్రంగా నన్నా చర్చ జరగకపోవడం దురదృష్టం. సుమారు 100 సార్లకు పైగా స్పీకర్ సభను వాయిదా వేయడం జరిగింది. ఇక వారూ-వీరూ అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం విలువైన సభా సమయాన్ని వృథా చేశారనక తప్పదు. నిశితంగా పరిశీలిస్తే పలువురు-పలుమార్లు ఉద్దేశపూర్వకంగానే అడ్డుతగిలారా అన్న అనుమానం కలిగింది.

అధికార-ప్రతిపక్ష పార్టీల సమిష్టి బాధ్యతారాహిత్యానికి ముగిసిన శాసనసభ సమావేశాలే ప్రత్యక్ష నిదర్శనం! 

Friday, March 23, 2012

ఉప సమరం నేర్పిన గుణపాఠాలు: వనం జ్వాలా నరసింహారావు



సూర్య దినపత్రిక (25-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

కోస్తాంధ్రలో ఒక్క సీటుకు, ఉత్తర-దక్షిణ తెలంగాణాలో ఆరు సీట్లకు ముగిసిన ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పు అమోఘం. అందరికీ అంతో-ఇంతో గుణపాఠం చెప్పకనే చెప్పారు. ఒక పక్క తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావును, మరోపక్క వైఎస్సార్ సీపీ నేత జగన్మోహన్‌ రెడ్డిని హీరోలుగా అంగీకరించుతూనే, తస్మాత్ జాగ్రత్త అంటూ ఇతోధికంగా చురకలు కూడా వేశారు ఓటర్లు. ఇక ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అదే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, తాజా కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి, వారి-వారి జిల్లాలలో ప్రచార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్-తెలుగుదేశం నేతలకు తగు సంకేతాలిచ్చారు. పార్టీల పరంగా తెరాసకు, తెలుగుదేశానికి, కాంగ్రెస్‌కు, భారతీయ జనతా పార్టీకి కొన్ని సంకేతాలిచ్చారు. ఐదు చోట్ల పోటీ చేసిన టీఆర్ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల గెలిచి, తెలంగాణా సెంటిమెంటును ఎంత బలంగా నిరూపించిందో, అంతే మోతాదులో బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క మహబూబ్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకుని నిరూపించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటునీ కైవసం చేసుకుని, సమీప భవిష్యత్‍లో జరుగనున్న పద్దెనిమిది శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగు దేశానికీ ధీటుగా నిలవబోతోంది. పాలక, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం ఏడు చోట్లా పోటీ చేసి, ప్రతి చోటా ఓటమి చవిచూశాయి. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు చోట్ల రెండో స్ధానంతోను, మూడు చోట్ల మూడో స్ధానంతోను సర్దుకోవాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఒక చోట నాలుగో స్ధానంలో, రెండు చోట్ల రెండో స్ధానంలో, నాలుగు చోట్ల మూడో స్ధానంలో ఉంది. రెండు చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది.  ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌ ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు గతంలో తెలుగుదేశం అధీనం లో ఉండేది. ఇప్పుడది జగన్‌ పార్టీ పరమైంది.

ఇంతకూ, గెలుపెవరిది? ఓటమి ఎవరికి? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినంతవరకు, కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ఆ పార్టీల ప్రతిష్ట కూడా పూర్తిగా దిగజారి పోయిందనాలి. 2009 లో కాంగ్రెస్ గెల్చుకున్న రెండు స్థానాలను, ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మరో సభ్యుడి స్థానాన్నీ, మొత్తం మూడు స్థానాలనూ కోల్పోయింది. పడ్డ ఓట్లు కూడా అంతంత మాత్రమే! తెలుగుదేశం దీ అదే పరిస్థితి. 2009 లో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలలో దారుణంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ ప్రతిష్టా మంట కలిసింది. భవిష్యత్‍లో తెలంగాణ ప్రాంతంలో జరగబోయే ఏ ఎన్నికైనా తెలంగాణ వాదంతోనే బలంగా ముడిపడి వుంటుందన్నతరహా తీర్పిచ్చారు ఓటర్లు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీలకు చెందిన ఇతర నాయకులు, వాస్తవానికి, తమ వంతుగా తెలంగాణ వాదాన్ని మొన్నటి ఉపఎన్నికలలో వినిపించే ప్రయత్నం చేశారు కూడా. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బాబు, తెలంగాణ సెంటిమెంటు గణనీయంగా వుందని, ఐనా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయబట్టే, ఆ మాత్రం ఓట్లన్నా రాలాయి. ఆ రెండు పార్టీల భవిష్యత్ తెలంగాణకు సంబంధించినంతవరకు ఇక ప్రశ్నార్థకమే! సమైక్య్తవాదానికి కట్టుబడి పోటీ చేసిన ఏకైక పార్టీ సీపీఎం సోదిలోకి లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించడానికి నడుం బిగించిన భారతీయ జనతా పార్టీని, మహబూబ్‌నగర్‌లో, తెరాస కంటే ఎక్కువగా నమ్మారు ఓటర్లు. భవిష్యత్‍లో తెలంగాణ సాధన ప్రక్రియలో, కేవలం రాజకీయ ఐకాసలో కల్సి వుండడమే కాకుండా, ఎన్నికలలో కూడా, తెరాస-బీజేపీ అవగాహన కుదుర్చుకోవాలన్న సంకేతాన్ని కూడా ఓటర్లు మహబూబ్‌నగర్ స్థానం ఫలితం ద్వారా ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పుట్టగతులు లేకుండా పోతుంటే, సీమలో-ఆంధ్రలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నదనాలి. కోవూరు ఫలితమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏనాడైతే దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదో, ఆ నాడే, కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని కోల్పోవడానికి తానే స్వయంగా బాటలు వేసుకుందనాలి. రాజశేఖర రెడ్డి వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య కానీ, ఆయన వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, జగన్ దూకుడుకు కళ్లెం వేయ లేకపోయారు. 154 మంది కాంగ్రెస్ శాసనసభ సభ్యుల మద్దతుతో-సంతకాలతో ప్రారంభమైన ఆయన అసమ్మతి ప్రస్థానం, "గోపీ" ల పుణ్యమా అంటూ,  17 కు పడిపోయినా, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ మాత్రం వీసమెత్తైనా పడిపోలేదు. ఓదార్పు పేరుతో ఆయన చేపట్టిన వేలాది కిలోమీటర్ల రాష్ట్రవ్యాప్త ప్రజా యాత్ర, ఆబాలగోపాలాన్ని జగన్ చెంతకు చేర్చింది. ఏం జరిగినా-ఎంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి వున్నా, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడంతో, విసిగివేసారిన జగన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తన తల్లి విజయమ్మతో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. తరువాత జరిగిన ఉపఎన్నికలలో కడప-పులివెందులల నుంచి అఖండ విజయం సాధించి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు ఆనాడే సవాలు విసిరారు జగన్. ఆ ఎన్నికలలో పోటీ చేసి ఘోర ఓటమి పాలై-డిపాజిట్ కూడా కోల్పోయిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పట్లో రాజీనామా చేయాలని తోచలేదు పాపం! దరిమిలా జగన్ అక్రమాస్తుల వ్యవహారం, సీబీఐ దర్యాప్తు ప్రక్రియ, శాసనసభలో అవిశ్వాస తీర్మానం అంశం లాంటివి జగన్ వెంట నడిచే నిఖార్సైన ఎమ్మెల్యేల-ఎంపీల సంఖ్యను తేల్చింది. ఎంపీ రాజమోహన రెడ్డి రాజీనామాతో సహా, పదిహేడు మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోవడంతో జగన్ వర్గం మరింత బలపడ సాగింది. ఆ నేపధ్యంలో వచ్చిందే కోవూరు శాసనసభ ఉప ఎన్నిక. కడప-పులివెందుల ఫలితం ప్రభావం కోవూరు మీద స్పష్టంగా పడింది. భారీ మెజారిటీతో కాకపోయినా మంచి మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పెను సవాలు విసిరారు. తెలంగాణలో సెంటిమెంటుకు, (సీమ) ఆంధ్రలో సెంటిమెంటుకు కొంత తేడా వున్నప్పటికీ, అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఓటమి పాలు కావడానికి ఆ రెండు సెంటిమెంట్లే కారణమయ్యాయి. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఆయన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోదగ్గ వ్యక్తిగా, భావి ఆంధ్ర ప్రదేశ్ యువతరం నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు తీర్పిచ్చారు. ఇక ఆయనదే హవా!

అధికార పక్షానికి చెందినంతవరకు, ఉప ఎన్నికలలో ఓటమికి బాధ్యత ఎవరిది అన్న అంశంపై, సమ్మతి-అసమ్మతి రాగాలు ఆరున్నొక్క శ్రుతిని దాటాయి. అసమ్మతి రాగాల మాట అటుంచితే, సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డితో అన్నట్లుగా చెప్పుకుంటున్న మాటలు కొంచెం ముఖ్యమంత్రిని ఇబ్బందిలో పడేసి విగా వున్నాయనాలి. "ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రిది కాకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది?" అని ఆజాద్ వ్యాఖ్యానించారట. అసమ్మతి గళం విప్పినవారిలో అగ్రగణ్యుడు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. కడప లోక్ సభ స్థానానికి ఓడినప్పుడు కూడా అంతగా బాధపడని డీఎల్, ఈ ఉపఎన్నికలలో ఓటమికి చాలా కలత చెందారు పాపం! మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలన్న డిమాండుతో సరిపుచ్చుకోకుండా. ఆయన తన రాజీ-నామా పత్రాన్ని అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద, బొత్స మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, తనదైన "క్రికెట్ స్టయిల్ లో" ఈ ఆటలో ఓడామని వ్యాఖ్యానించి సరిపుచ్చుకున్నారు. బొత్స కూడా రాజీనామా చేసే వరకు వ్యవహారం పోయిందంటారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా కిరణ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇక కే కేశవరావు, ఎంపీ వివేక్‌లు సరే సరి. ఇంత జరిగినా తప్పెవరిది అంటే అంతా గప్ చిప్!

ఒకరి మీద మరొకరి విమర్శనాస్త్రాలు తీవ్రతరమౌతున్నాయి. విభేదాలు పెరిగిపోతున్నాయి. హస్తంలో కీచులాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రకంపన లింకా ఆగలేదు. సరికదా ఊపందుకుంటున్నాయి. పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన-దాదాపు కామరాజ్ నాడార్ ప్రణాళిక లాంటిది అవసరమనేంతవరకూ వెళ్లింది వ్యవహారం. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు డిమాండుతో మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి బలహీనుడని, ఆయన పదవిలో కొనసాగాలా-వద్దా అనే విషయం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు సహితం ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. సీఎం పక్షాన మాట్లాడేవారే కరవయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక్కొక్కరు-ఒక్కొక్కవిధంగా మాట్లాడడం సరికొత్త అసమ్మతికి తెరలేపినట్లయింది. ఐనా, పూర్తిగా ముఖ్యమంత్రిదే ఓటమికి బాధ్యత అనడం ఎంతవరకు సబబు? ఆయనను ఆయన మానాన ఎన్నడన్నా వదిలేశారా ఇలా మాట్లాడుతున్న నాయకులు? ఉపఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి, ప్రచార బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడం దాకా, ఏ కాంగ్రెస్ నాయకుడు ఎంతవరకు తమ వంతు పాత్రను సక్రమంగా పోషించారో వారికి వారే బేరీజు వేసుకోవడం మంచిది. మరోవైపు ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలుగుతున్నవారు, అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న సీనియర్ నేతలపై యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో, చివరకు పరిస్థితి ఎటు నుంచి ఎటు వైపునకు దారి తీస్తుందోనన్న ఆందోళన అధిష్ఠానానికి పట్టుకుంది. రాష్ట్రంలో అసమ్మతి నిప్పులపై నీళ్లు చల్లేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగవలసిన అవసరం ఏర్పడింది.

ఏదేమైనా, ఆద్యతన భవిష్యత్‍లో సీమాంధ్రలో జరుగనున్న పదిహేడు శాసనసభ స్థానాల ఉపఎన్నికలు, తెలంగాణలోని ఒక స్థానానికి జరగనున్న ఎన్నిక రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కీలకమైన మలుపుకు దారితీయనున్నది. కోవూరు ఓటమితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్షానికి వలస పోయే అవకాశాలు రోజు-రోజుకూ పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు మొదలవుతాయి. ఒకవేళ అందరూ ఊహించినట్లుగానే, ఉపఎన్నికలు జరుగనున్న పద్దెనిమిది స్థానాలలో మెజారిటీ (లేదా అన్నింటిలో) స్థానాలలో కాంగ్రెస్-టీడీపిలు ఓటమి పాలైతే, ఇక ఆ పార్టీల పరిస్థితి, 2014 ఎన్నికలొచ్చే సరికి అగమ్యగోచరం అనక తప్పదు!

Thursday, March 15, 2012

విజ్ఞానాన్ని అందించిన స్వామీ ప్రణవానంద: వనం జ్వాలా నరసింహారావు


విజ్ఞానాన్ని అందించిన స్వామీ ప్రణవానంద
నమస్తే తెలంగాణ దినపత్రిక (16-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయాలను అధ్యయనం చేసి, మ్యాపులు గీశాడు. ఆయన పర్యటనలకు సంబంధించి హెదిన్ అనేకానేక విషయాలను గ్రంధస్థం చేశాడు. "థ్రూ ఏసియా" అన్న ఆయన ప్రఖ్యాత గ్రంధం వందేళ్ల క్రితం 1898 లో ప్రచురించడం జరిగింది. ఏసియా సంస్కృతిని గురించి అధ్యయనం చేయదల్చుకున్న వారికి ఆయన రాసిన పుస్తకాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. ఐతే స్వెన్ హెదిన్ గీసిన టిబెట్ మ్యాపులకు, భారత దేశానికి-ఆంధ్ర ప్రదేశ్‌కు-తూర్పు గోదావరి జిల్లాకు చెందిన, స్వామీ ప్రణవానంద గీసిన మ్యాపులకు చాలా తేడా వుందని పరిశోధకులంటారు. ఇరువురి మ్యాపులను శ్రద్ధగా పరిశీలించిన పలువురు, స్వెన్ హెదిన్ సరిగ్గా చూడకుండా, కేవలం తెలివితేటలు ఉపయోగించి, మ్యాపులు గీశాడంటారు. కాకపోతే, ఒక యూరోపియన్ గీసిన మ్యాపులు బాగాలేవనే ధైర్యం మనకు లేదు కదా! అప్పటి తరం వారికే లేనప్పుడు, ఇప్పటి తరం వారికి అసలే వుండదు. ప్రణవానంద గీసిన మ్యాపులను స్వెన్ హెదిన్ ఈసడించుకున్నాడు కూడా. ప్రణవానంద తన టిబెట్ యాత్రను గురించి రాసిన గ్రంధాన్ని కాని, ఆయన అక్కడ నుంచి సేకరించి తెచ్చిన, వృక్ష-పక్షి-ఖనిజ అవశేషాలను కానీ, ఆంధ్ర విశ్వ విద్యాలయం ముట్టనే లేదట! కానీ, కలకత్తా విశ్వ విద్యాలయం "ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్" పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించింది. ఆయన పట్టుకొచ్చిన వస్తు జాలాన్ని తీసుకుని ప్రదర్శన శాలలో పెట్టింది. లక్నో ప్రదర్శనశాల వారు కూడా కొన్నింటిని తీసుకున్నారు. అదీకాక అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, టిబెట్‍కు సంబంధించిన ఎంతో సమాచారాన్ని స్వామీ ప్రణవానంద ద్వారా సేకరించి, నాలుగువేల పేజీల డాక్యుమెంటు తయారు చేయించుకుని, భవిష్యత్‍లో అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు బధ్రపరిచారట. ఇంతకీ ఎవరీ ప్రణవానంద స్వామి?

స్వామీ ప్రణవానంద స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని, టిబెట్ వెళ్ళి, అక్కడి నైసర్గిక స్థితిగతులన్నీ చూసి, తెలుసుకుని, మ్యాపులు గీసి భారత్ దేశానికి సమర్పించుకున్న మహనీయుడు. ప్రణవానంద స్వామి సరిగ్గా 115 సంవత్సరాల క్రితం 1896 మార్చ్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. 1918 లో లాహోర్‌లోని దయానంద కళాశాల నుంచి పట్టభద్రుడై నాడు. భగత్‌సింగ్ ప్రభృతుల బృందానికి చెందిన వ్యక్తి. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిక్కులన్నీ అనుభవించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే, ఘర్వాల్ జిల్లాలో క్షామ నివారణ చర్యలలో స్వచ్చందంగా పనిచేశాడు. 1920 నుంచి 1926 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాదీ ప్రచారం, హరిజన సేవ చేయడమే కాకుండా, తెలుగునాట మొట్టమొదటి హిందీ విద్యాలయం నెలకొల్పిన ఖ్యాతి దక్కించుకున్నాడు. అప్పట్లోనే పది నెలలు జైలు జీవితం కూడా అనుభవించాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో అణుశాస్త్ర విభాగం నెలకొల్పిన స్వామీ జ్ఞానానంద హిమాలయాలలో ఆధ్యాత్మిక విషయాలలో పరిశోధనలు కూడా చేశారు. స్వాములనేవారు, కేవలం స్వాములోరిగానే మిగిలిపోకుండా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా, సాంకేతిక విజ్ఞానులుగా ఉండాలనేది జ్ఞానానంద సందేశం. అలాంటి మహనీయుడి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించాడు ప్రణవానంద. ఇరువురిదీ అంతటి ఉదాత్త ఆశయ సమ్మేళనం!

1928 లో ప్రారంభమైంది ప్రణవానంద అన్వేషణ. తొలుత ఉత్తర ప్రదేశ్‌కు చేరుకున్న ప్రణవానంద, అక్కడ అల్మోరా ఫిటోర్‍ఘర్ ప్రాంతంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని గమనించాడు. అక్కడ సంచార వైద్య సేవలు ప్రారంభించాడు. హిమాలయాల పాదమైన ఉత్తర ప్రదేశ్ నుంచే హిమాలయాలకు చేరుకోవాలన్నది ఆయన ఆశయం. హిమాలయ యాత్రను ఆధ్యాత్మిక సాధన కోసం ఉద్దేశించినప్పటికీ, తీరా మొదలెట్టిన తరువాత, అది వృక్ష-జంతు-ఖనిజ-పురా తత్వ-సాంఘిక-ఐతిహాసిక విజ్ఞానాలన్నింటికీ విస్తరించిన ఆసక్తికర అంశంగా మారిపోయింది. కైలాస పర్వతాన్ని చుట్టి వచ్చాడు. మానస సరోవరానికి చేరుకున్నాడు. మన వాళ్ళు నమ్మకంగా నమ్ముతుండే, "సహస్ర దళాలు", "హంసలు" అక్కడ లేవని స్పష్టం చేశాడు. నవీన శాస్త్రీయ పద్ధతులకు అనుగుణంగా, మానస సరోవర్, రాక్షస తావ్, గౌరీకుండ్‍ల లోతులను-అడుగున వున్న మట్టిని-రాతి నమూనాలను సేకరించాడు. బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు, కర్నాలి నదుల జన్మస్థానాల నుంచి, టిబెట్‍లో అవి ప్రవహించే మేరనంతా చూశాడు. అక్కడ నివసించే లామాలతో స్నేహం చేసుకుని, సాహిత్యం-చరిత్ర లోతులను అవలోకించి, అధ్యయనం చేశాడు ప్రణవానంద.

సాధారణంగా, పురాతన గ్రంధాలలో ఏది రాస్తే, దానినే, రాసినంతవరకే నమ్మడం మనలో చాలామందికి అలవాటు. కొత్త విషయాలు చెప్పినా వినరు. తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా పలువురిలో మృగ్యం. ప్రణవానంద స్వామి అలా కాదు. బౌద్ధ లామాలతో నెలలకు-నెలలు, సంవత్సరాల తరబడి వుండి, అక్కడి ప్రకృతిని ఒక సుబోధక విమర్శనా గ్రంధంగా మలచ గలిగాడు. ఆ జిజ్ఞాసే ఆయనతో పాతికేసి పర్యాయాలు కైలాస గిరి ప్రదక్షిణలు, మానస సరోవర ప్రదక్షిణలు చేయించింది. ప్రకృతి సౌందర్యంతో పాటు, ప్రకృతిలో నిక్షిప్తమై వున్న విజ్ఞాన రహస్యాలను కూడా ఆకళించుకోగలిగాడు. తనలో వున్న వైద్య నిపుణత్వంతో, అక్కడున్న చిన్నా-పెద్దా, అధికార-అనధికార వర్గాల వారందరితో స్నేహం చేసుకున్నాడు. ఇలాంటి పర్యటనలు సాధారణంగా విదేశీయులే చేయడం, వారి అనుభవాలను గ్రంధస్థం చేయడం పరిపాటి. మనమేమో వాటిని చదివి వారి గొప్పతనాన్ని ఉగ్గడించడం కూడా పరిపాటే! స్వామీ ప్రణవానంద అంతకంటే మిన్నగా, విజ్ఞాన వైవిధ్యాన్ని చూపే అనుభవాలను తెలియ చెప్పారు. అక్కడి సరస్సులను శోధించడానికి భారతదేశం నుంచి ఒక "ఉక్కు పడవను" మోసుకో పోగలిగారు. అక్కడి నుంచి మొదటిసారిగా సముద్ర వస్తు అవశేషాలను తీసుకోరాగలిగారు. అవును మరి...ఒకప్పుడు హిమాలయాలు సముద్ర ప్రాంతమే కదా! ఆయన ఏది చేసినా పరిశోధక దృష్టితోనే. సన్యాసి చేయాల్సిన పని అదే అనిపించాడు. కస్తూరి మృగంపై ఆయన చేసిన పరిశోధన చెప్పుకోదగింది. అలానే ఔషధాలపై చేసిన పరిశోధనలు కూడా.

అలా స్వామీ ప్రణవానంద హిమాలయాలలో, టిబెట్‍లో చేసిన అన్వేషణ-అధ్యయనం, హిమాలయాల అనేకానేక అందాలను ఆవిష్కరించింది. సింధూ, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలీ నదుల వాస్తవ జన్మస్థానాలను కనిపెట్టగలిగాడాయన. లండన్‌లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ, భారత దేశంలోని సర్వే ఆఫ్ ఇండియా ఆయన పరిశోధనలను అంగీకరించారు. 1941 లో సర్వే ఆఫ్ ఇండియా వారు ముద్రించిన మ్యాపులలో ప్రణవానంద గీసినవన్నీ వున్నాయి. సుమారు ఐదువందల సంవత్సరాలకు పైగా యూరోపియన్ మిషనరీలను, అన్వేషకులను టిబెట్ ఆకర్షించింది. ఇండియా నుంచి మాత్రం, ప్రణవానంద లాంటి ఒకరిద్దరు మాత్రమే అక్కడకు వెళ్ళి పరిశోధనలు చేయగలిగారు.

ప్రణవానంద రాసిన "ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్" అనే గ్రంధాన్ని కలకత్తా విశ్వ విద్యాలయం వారు 1950 లో ప్రచురించారు. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ పరిచయం చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, "ఖర్చు లేకుండానే ఇంత పరిశోధన చేశారీ సన్యాసి. ఆత్మానందం కొరకు ఇంత పని చేశాడు. ఇరవై ఐదేళ్లకు పైగా పవిత్ర హిమాలయాలలో గడిపాడు. ఆయన పరిశోధనలను నిపుణులు మెచ్చారు" అని అన్నారు. 1954 లో టిబెట్ ఎల్లలలోని మన దేశ ప్రాంతంలో భారత ప్రభుత్వం చెక్ పోస్టులను పెట్టి, విదేశీయులను దరిదాపులలోకి రాకుండా చేసింది, ప్రణవానంద సూచనల మేరకే! వృద్ధాప్యంలో కూడా తొంబై ఏళ్ల వయస్సులో మరణించడానికి ముందు, తూర్పు గోదావరి జిల్లాలో, ఒక ప్రదేశంలో శ్రీ చక్ర దేవాలయం కట్టడానికి శ్రమ పడ్డాడు. అదేమైందో మరి. 1960 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.

ఎవరు నిజం చెప్పారో, ఎవరు అబద్ధం చెప్పారో కాని, సింధు నది, సట్లెజ్-బ్రహ్మపుత్ర నదుల మూలాలను తొలిసారిగా కనుక్కున్నది తానేనంటాడు స్వెన్ హెదిన్. టిబెటన్లు మినహా తాను తప్ప మరెవ్వరూ, ఆ మూలాల దగ్గరకు చేరుకోలేక పోయారని బల్ల గుద్ది మరీ చెప్పాడు. ఐతే స్వెన్ హెదిన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్న విషయాన్ని, స్వామీ ప్రణవానంద బయట పెట్టాడు. 1928-1938 మధ్యలో, ఆయన మానసరోవర్-కైలాస్‍గిరి ప్రాంతాలలో చేసిన యాత్రలు, మానవ మాత్రులెవ్వరూ పోలేని ప్రాంతానికి ఆయన వెళ్లడమే కాకుండా ఒక ఏడాది పాటు నివసించడం, స్వెన్ హెదిన్ చెప్పిన విషయాలపై కొంత అనుమానాలకు తావిచ్చింది. వృత్తి రీత్యా భౌగోళిక శాస్త్రవేత్త కాకపోయినా, స్వామీ ప్రణవానంద పరిశోధనలు, ఆ నదుల వాస్తవ మూలాలను అధ్యయనాత్మకంగా కనుగొన్న దాఖలాలు స్పష్టంగా బయట పెట్టాయి. వాస్తవానికి ఏ జీవనది ఎక్కడ ఉద్భవించిందో అన్న విషయాలపై చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది. ఐనా ఎవరిది వాస్తవమో కనుక్కోవడం అంత కష్టమేమీ కాదు. అదే జరిగింది సింధు నది, సట్లెజ్-బ్రహ్మపుత్ర నదుల విషయంలో కూడా. స్వామీ ప్రణవానంద రాసిన "ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్" పుస్తకంలో, టిబెట్ ప్రాంతంలోని మానసరోవర్-కైలాసగిరి భాగాన్ని గురించే ఎక్కువగా వుంటుంది.

ఏదేమైనా స్వామీ ప్రణవానంద లాంటి అరుదైన సహజ భౌగోళిక శాస్త్రవేత్తల జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కావడం మన గర్వించ తగ్గ విషయం. మార్చ్ నెలలో ఆయన 115 వ జయంతి సందర్భంగా స్వామీజీని గుర్తుచేసుకోవడం ఎంతైనా సమంజసం. సాధులు, సన్యాసుల వేషధారణలో ఉన్నా శాస్త్రీయ దృష్టితో భవిష్యత్ తరాలకు ఎంతో ఉపకరించే పరిశోధనలు చేసిన వారు ఎందరో మన చరిత్రలో కనిపిస్తారు.
  

Sunday, March 11, 2012

Bhadrachalam to Host Oldest Vedic Ritual “Athirathram”: Vanam Jwala Narasimha Rao


Bhadrachalam to Host “Athirathram”


(The Hans India dated 16th March 2012)
Vanam Jwala Narasimha Rao
Chief Coordinator 
Athirathram-2012 Steering Committee

The stage is almost all set to perform the World's oldest surviving 4000-year old fascinating Vedic ritual, “Athirathram-2012”, as per the Vedic ritual hierarchy, for the first time in Andhra Pradesh from April 21 to May 2, 2012 this year, at Etpaka near Bhadrachalam. Athirathram refers to “building up of the fireplace and performed overnight”. According to Kerala Namboodiri Brahmins, who alone have kept this alive, it is considered to be one of the most complex and greatest rituals.

Vedic rituals have come down to human beings in two broad types-the Grhya and the Srauta. The former is concerned with rites of an individual such as the Upanayana or Marriage. The later on the other hand, is solemn and exalted, show casing in oral tradition the great learning of the Sruti literature, comprising, in other words, the three Vedas-Rig, Yajur and Sama and their ancillary texts. The Grhya system is still in existence almost all over India, whereas, the Srauta type has survived in only few isolated pockets of Brahman groups. In Valmiki Ramayana’s Balakanda there is a reference to Athirathram in fourteenth Sarga (Chapter) said to have been performed by King Dasaratha.

The Namboodiri Brahmans of Kerala have been keeping alive traditions of the Srauta rituals. Agni to the Namboodiris, lasting twelve days, is a great spectacle and display of learning. The ritual is the basic feature of the civilization and religions of India. Ritual activity is essentially physical and is therefore primarily related to the body unlike thinking or believing, which are mainly connected with the mind. Athirathram ritual emerged around the 10th century BC, and was practiced until the 6th century BC. In post-Vedic times, there were various revivals of the practice, under the Gupta and Chola Empire. By the 11th Century, the ritual was kept alive only by the Namboodiri Brahmans of Kerala. There is interesting information available both from “Brahma Vaivartha Purana” and from Telugu Literary Volumes published by Madras Government, that, Namboodiri Brahmins migrated from Andhra Pradesh to Kerala. After Satavahanas, the most popular emperors were Kadambas dynasty. Mayoora Sharma, one of the Kings of that Dynasty ruled the Kerala Area for some time. He took some of the Andhra Brahmin families from his native Coastal Andhra forming part of Konaseema in East Godavari District to Kerala who came to be known as Namboodiris. Adi Shankara too belongs to Namboodiri sect of Brahmins.

Long considered extinct, the ceremonies require several months of preparation and rehearsals. This performance was in a way revived by the Indologist Dr. Frits Staal of the University of California who passed away recently at an advanced age and by Robert Gardner, with support from several international agencies. Frits Staal was responsible for organizing and recording the ritual.

Seventeen priests are required for performing the ‘Agni’. The course of time is 12 days. The First day begins with the Yajamana and his priests entering the ritual enclosure carrying three sacred fires in pots. The main ritual vessel is prepared from clay. A symbolic animal sacrifice would be performed for Vayu. After selection of five chief priests fire is produced by friction. This is followed by tying a turban around the head of Yajamana. He is protected by a golden breast plate, is given a staff and closes his fists and deprived of speaking (except for recitations), from bathing etc. The Yajamana picks up the main ritual vessel filled with fire, and takes three steps with it.

On the Second day another ritual pot, also made of clay is prepared. A sacrificial pole is made on the Third day. On the Fourth day among others, the Indra God is invited to attend the ritual. From Fifth day to Seventh day, layers of the altar are laid on each day. On the Eighth day the fifth layer is laid. On the Ninth day, the implements used in the process are putdown on the new altar in the shape of a man. The ceremonies from Tenth day up to the dawn of twelfth day will continue throughout and on the twelfth day the Yajamana and his wife take “Avabhratha bath”. The Yajamana installs three fires on his home after returning. He performs morning and evening Agnihothra for the rest of his life. The major offerings to the sacrificial fire are Somarasa, the juice of Somalatha, an herbal plant plus dozens of other herbs.

Each day, the rituals vary. The major offerings to the sacrificial fire are Somarasa, the juice of Somalatha, an herbal plant plus dozens of other herbs. The fire is created by rubbing two pieces of wood, as detailed in ancient Vedic scriptures. No modern prop is used.

Vedic Scholar Brahmasree Naduvam Narayanan Somayaji would be primarily responsible for the Athirathram-2012 and will be the “Yajamana” along with his wife Savitri Pathanadi. Two other Ghanapathis and Vedic Scholars Brahmasree Krishnan Namboodiri and Brahmasree Kadaloor Sri Das Namboodiri, would occupy central positions in the ritual realm of the Rig-Veda and Yajurveda. Both of them as well as the Yajamana have already been initiated in to the Holy penance required for the Athiarhram-2012 for the last six months.  

62 Year old Brahmasree Hari Haranatha Sarma who performed 16 Somayagas to his credit along with son, also a Vedic Pundit Raja Sekhara Sarma, after witnessing the Panjal Athirathram-2011 and impressed by the whole process decided to perform the same in Andhra Pradesh through his organization “the Samatha Lok Seva Samithi”.  This would be the 17th Yagnam to be performed by them. A Steering Committee with Sri P. V. R. K. Prasad (Ret IAS) and former Executive Officer, TTD as Chairman and persons of eminence from different walks of life like former Prasarabharati Chairman Sri KS Sharma, former TTD Executive Officers Sri P. Krishnayya and Sri MVS Prasad, DG Prisons Dr CN Gopinath Reddy, Senior IAS Officer Sri CVSK Sharma, former MD AP Forest Development Corporation, BJP Leader Sri NVSS Prabhakara Rao, former DGP Sri Roddam Prabhakara Rao, Members of Parliament Rayapati Sambasiva Rao, Vundavalli Arun Kumar and Balaram Naik etc has been formed to organize the Athirathram-2012. Help and assistance from State Government, TTD, Singareni Collieries, ITC Bhadrachalam, and Public Sector Undertakings is being sought to meet the huge expenditure expected to be incurred. The efforts are encouraging. The Steering Committee has been formed to serve the society at large by imparting and disseminating ancient Indian scientific and philosophical knowledge towards attaining unity, peace, prosperity and ultimate wisdom.

Athirathram Steering Committee Meeting

Athirathram is planned in Bhadrachalam from April 21, 2012 to May 2, 2012. The training and rehearsals for the ritual are on-going. The ritual will be performed just as it was done 4000 years ago, with wooden vessels and bricks made from Kerala forest products. No use of metal will be made. All the main priests come from Kerala and all of them are Namboodiri Brahmins. The Yajamana or the main conductor of Athirathram has gone through rigorous preparation prescribed for performance of Athirathram. The Adhvaryam of the Yajurveda in the ritual and the heaviest load will be borne by the Kapra family, the Hautram of the Rig-Veda is led by the Naras family and the Audgatram of the Samaveda in the ritual by Tottam.

Bhadrachalam is getting ready to host Athirathram. Preparations began on the sixty acres of Land donated for the purpose by Sree Sitaramachandra Swami Temple Trust Board Chairman Kuricheti Panduranga Rao. The Yajurveda and Samaveda practices that precede Athirathram have already begun. Traditional craftsmen are busy making the innumerable clay and wooden utensils that will be utilized during the ritual. The choice of the venue is also in accordance with geographic and vaastu principles. 
Bhoomipooja

Can anyone confidently confirm that ritual would be conducted precisely in accordance with the Vedas? "Spotting of a solitary eagle flying in the sky above the Yagnashala and a heavy downpour are indications that the gods are pleased with the ritual," says a Namboodiri who believes strongly in the Athirathram. In 1975 and in 2011, for instance, it happened!

Scientific research has proved the impact of Vedic chanting and Yaga on agriculture and its implications on micro organisms. Athirathram is held for universal harmony, peace and spiritual enlightenment. This will bring peace, tranquility and ecological balance besides all-round development in the state. This Holy Ritual is attributed to the definite impact on the thinking processes of the individuals, who participate in the Yaagam and those who reside in that Rajya (State) bestowing positive thoughts, bringing about harmony amongst people, while contributing to their overall prosperity and well being.

Writing about Athirathram, Prof Staal mentioned that, “temples, cathedrals, and skyscrapers were built and fell into decay, languages and religions have come and went, and innumerable wars were fought, the Vedas and their ritual continued to be transmitted by word of mouth, from teacher to pupil, and from father to son. What a triumph of human spirit over the limitations of matter and the physical body!” 

All that what we are all supposed to do is to participate in the Holy Ritual Athirathram-2012 which is being performed during our life time and extend a helping hand if we can!

Saturday, March 10, 2012

భద్రాచలంలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం: వనం జ్వాలా నరసింహారావు


"అతిరాత్రం"

భద్రాచలంలో "అతిరాత్రం"
ఆంధ్రజ్యోతి దినపత్రిక (24-03-2012)
వనం జ్వాలా నరసింహారావు
("అతిరాత్రం-2012" సారధ్య సంఘం సమన్వయకర్త)

సుమారు నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుండి కేరళ రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న, ప్రాచీన వైదిక సాంప్రదాయక పుణ్య యజ్ఞం "అతిరాత్రం", మొదటిసారి మన రాష్ట్రంలో జరిపేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే నెల 2 వరకు, బధ్రాచలం సమీపంలోని ఎటపాక జటాయువు మండపం దగ్గర, వైదిక సాంప్రదాయ క్రమానుగతిని అనుసరించి, పన్నెండు దినాలు నిర్విరామంగా నిర్వహించనున్న అపురూపమైన అతిరాత్రం విన్యాసాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి పలువురు దేశ-విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. మౌలిక ప్రమాణాలుగా చెప్పుకునే  వేదాలు భగవత్ ప్రేరితమేనని, మానవుల రచనలు కావని సాంప్రదాయుల విశ్వాసం. వేదవ్యాసుడు నాలుగు భాగాలుగా వేదాలను విభజించి, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలని పేర్లు పెట్టాడు. అనాదిగా వస్తున్న ఆ వేదాలకు సంబంధించిన మూల గ్రంథాల్లో పేర్కొన్న ఒకానొక అతి ప్రాచీనమైన సాంప్రదాయ కర్మకాండే "అతిరాత్రం". పన్నెండు రోజులు, తెల్లవార్లూ-రాత్రింపగళ్లూ, అగ్ని హోమంతో నిర్వహించే "అతిరాత్రం", వైదిక కర్మకాండలన్నింటిలోకి అత్యంత సంక్లిష్టమైనది, మహోన్నత మైనదని, కేరళ రాష్ట్రానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణులు అంటారు. వాల్మీకి రామాయణం బాల కాండలో, 14 వ సర్గలో, అశ్వమేధ యాగం ప్రస్తావనలో అతిరాత్రం గురించి పేర్కొనడం జరిగింది.
            
వైదిక పుణ్య యజ్ఞాల సాంప్రదాయాలను, మానవ సమాజం ఆచరణలో పెట్టడానికి, రెండు రకాల పద్ధతులున్నాయి. మొదటిది "గ్రహ్య", రెండోది "శ్రుత". వ్యక్తిగత ఆచార వ్యవహారాలైన ఉపనయనం, వివాహం లాంటివి మొదటి పద్దతికి చెందినవి. సంస్కార పూర్వ కంగా, అత్యంత ఉన్నత స్థాయిలో, శ్రుతి సాహిత్యంలో పేర్కొన్న విధంగా, మౌఖిక సాంప్రదాయ బద్ధంగా, ఋగ్వేద-యజుర్వేద-సామవేదాలలో చెప్పినట్లు తూచ తప్పకుండా ఆచరించేదే రెండో పద్ధతి. కీలకమైన ఈ రెండో రకమైన వైదికాచారాలను, కొద్దిమంది, అక్కడో-ఇక్కడో అడపాదడపా పాటించడం జరుగుతోంది. అలా పాటిస్తున్న వారిలో కేరళ నంబూద్రి బ్రాహ్మణులు ముందు వరుసలో వున్నారు. శంకరాచార్యుడు నంబూద్రి బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. నంబూద్రీ కేరళ బ్రాహ్మణుల గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది. శాతవాహనుల తరువాత ప్రసిద్ధి చెందిన రాజవంశం కాదంబ వంశం. కాదంబులలో ప్రసిద్ధుడైన రాజు మయూర శర్మ కేరళ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన తన స్వస్థలమైన కోనసీమ (తూర్పు గోదావరి) నుండి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను కేరళకు తీసుకు వెళ్ళాడు. ఆ కుటుంబాల వారే తరువాత నంబూద్రి బ్రాహ్మణులుగా పేరు పొందారు. ఈ విషయం బ్రహ్మ వైవర్త పురాణంలోను, మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన తెలుగు గ్రంథం సంపుటాలలోను లభిస్తుంది. శంకరుడు తెలుగువాడు ఐనప్పటికీ వల్లభుడు, నింబార్కుడు, త్యాగరాజు, మొదలైన అనేకమంది మహాపురుషుల లాగే ఆయనకు తెలుగు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగింది.
          
వైదిక ఆచారాలు అంతరించి పోకుండా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు, ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. పన్నెండు రోజులు, అహోరాత్రులు, ఆరిపోకుండా అగ్నిహోత్రం వుంచడమనే ప్రక్రియ, నంబూద్రి బ్రాహ్మణులకు అత్యంత ఆకర్షణీయమైన విజ్ఞాన-వినోద దృశ్యం లాంటిది. సనాతన సంప్రదాయాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే "అతిరాత్రం", భారతీయ మతాచారాలకు-నాగరికతకు అసలు-సిసలైన రూపురేఖగా నంబూద్రీలు భావిస్తారు. "అతిరాత్రం" నిర్వహణ శారీరక శ్రమతో కూడుకున్నది. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దిలో మొదలైన ఈ ఆచారం, ఆరవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో, ఎందరో, ఎన్ని విధాలుగానో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. గుప్తుల, చోళుల కాలంలో పునరుద్ధరణకు నోచుకున్న అతిరాత్రాన్ని, పదకొండవ శతాబ్దం వచ్చే సరి కల్లా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు సజీవంగా కొనసాగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రక్రియ నేటికీ సాగుతోంది.

Poster Release by Endowments Minister
          
అతిరాత్రం ఆచారం ఒక రకమైన అద్భుత విన్యాసం. ఆ విన్యాసంలో ప్రధాన భాగమైన అగ్ని హోమం ప్రక్రియను నిర్వహించడానికి 17 మంది ఋత్విక్కులు (పూజారులు) వుంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజున హోమం చేసే "యజమాని", ప్రత్యేకంగా తయారుచేసిన మూడు కుండలలో, పవిత్రమైన అగ్నిని నింపుకుని యజ్ఞ వాటికలో ప్రవేశిస్తాడు. "బంకమట్టి" తో తయారు చేసిన ప్రత్యేకమైన కుండలవి. నామ మాత్రంగా-లాంఛన ప్రాయంగా, వాయుదేవుడికి జంతు బలి జరిపించుతారు. ఐదుగురు ప్రధాన పూజారుల ఎంపిక జరుగుతుందప్పుడు. ఆ తర్వాత రాపిడి ద్వారా నిప్పు వెలిగించుతారు. యజమాని శిరస్సుకు తలపాగా లాంటిది కట్టుతారు. ఇక ఆ క్షణం నుంచీ, యజమానిని ప్రత్యేక రక్షణలో వుంచుతారు ఆ పన్నెండు రోజులు. పిడికిలి బిగించిన చేతులతో, మౌనంగా ఆ పన్నెండు రోజులు యజమాని యజ్ఞాన్ని చేయాలి. కాకపోతే, ఆయన చేయాల్సిన మంత్రోచ్ఛారణలకు మౌనం వీడవచ్చు. అలానే, స్నానం చేసేటప్పుడు పిడికిలి సడలించవచ్చు. అగ్నితో నింపిన ప్రధాన కుండను తీసుకుని, మూడడుగులు నడవాలి యజమాని ఆ తర్వాత. బధ్రాచలంలో జరుగనున్న యజ్ఞానికి యజమానిగా-ప్రధాన ఋత్విక్కుడుగా కేరళకు చెందిన బ్రహ్మ శ్రీ నడువం నారాయణన్ సోమయాజి, ఆయన ధర్మపత్ని సావిత్రి పఠనాడిని ఎంపిక చేశారు నిర్వాహకులు. అలానే జైమినీ సామ వేదంలో దిట్టలు, ఘనాపాఠీలు, ఋగ్వేదం-యజుర్వేదం ఆచారాలను-సాంప్రదాయాలను ఔపోసన పట్టిన వారైన బ్రహ్మ శ్రీ కృష్ణన్ నంబూద్రి, బ్రహ్మ శ్రీ కడలూర్ శ్రీ దాస్ నంబూద్రి అనే వైదిక పండితులిద్దరు అతిరాత్రం యజ్ఞాన్ని నిరాటంకంగా జరిపించేందుకు గత ఆరు మాసాలుగా దీక్షలో కూర్చున్నారు.

అతిరాత్రం యజ్ఞంలో భాగంగా, రెండో రోజున బంక మట్టితో ప్రత్యేకమైన కుండను తయారు చేస్తారు. మూడో రోజున నైవేద్యం కొరకు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని తయారు చేస్తారు. "మహావేది" గా పిలువబడే యజ్ఞ వాటిక కొలతల ప్రకారం, లాంఛనప్రాయంగా బలి ఇవ్వడానికి, పక్షి ఆకారంలో బలిపీఠం నమూనాను తయారు చేస్తారు అదే రోజున. నాలుగో రోజున దేవతల రాజైన ఇంద్రుడిని యాగానికి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. మహావేది వున్న ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందులో విత్తనాలు చల్లి, మొదటి రోజున తయారు చేసిన ప్రధాన కుండను భూమిలో పాతిపెట్టు తారు. పక్షి ఆకారంలో బలిపీఠం నిర్మాణం ఆరంభమవుతుంది అదే రోజున. ఐదు, ఆరు, ఏడు దినాల్లో, బలి పీఠం నిర్మాణాన్ని అంచలంచలుగా కొనసాగిస్తూ, రాత్రివేళల అగ్నిహోత్రం పనిని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిదో రోజున, బలి పీఠంలో మరొక అంతస్తు వేయడంతో పాటు, దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేస్తాడు. రుద్ర పూజ కూడా జరిపించుతారు పూజారులు. అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను, పూర్తి చేయబడిన బలి పీఠంలో, మానవ ఆకారంలో పేర్చుతారు తొమ్మిదో రోజున. ఆ ప్రదేశంలో మళ్లీ అగ్నిని వుంచడం జరుగుతుంది. మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని హోమంలో నెయ్యి పోసుకుంటూ అతిరాత్రం కొనసాగుతుంది. లాంఛనప్రాయంగా-నామ మాత్రంగా జంతు బలి ఇవ్వడం ఆ తర్వాత ప్రక్రియ. చివరి మూడు రోజులు రాత్రింబగళ్ళు యాగం కొనసాగుతూనే వుంటుంది. బలిపీఠం చుట్టూ, పదవ రోజున, యజమాని పూజారులతో కలిసి, పాములాగా తిరగాలి. నామ మాత్రంగా (వాస్తవంగా కాదు) పదకొండు జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా "అవభ్రత స్నానం" చేసి, మేక బలిని (వాస్తవంగా కాదు) ఇచ్చి, ఇంటికి తిరిగొచ్చి మూడు చోట్ల అగ్నిని పేర్చి, ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం చేస్తూ పోతుండాలి. పన్నెండు రోజులు ఒకే రకమైన కర్మ కాండలుండవు. అగ్నిలో ప్రధానంగా సోమ రసం ఉపయోగించుతారు. వైదిక గ్రంధాల్లో చెప్పిన ప్రకారం రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు.

హైదరాబాద్‌కు చెందిన బ్రహ్మ శ్రీ హరి హరనాథ్ శర్మ, ఆయన కుమారుడు-స్మార్త వేద పండితుడు రాజశేఖర శర్మ, వారు నెలకొల్పిన "సమతా లోక్ సేవా సమితి" ఆధ్వర్యంలో, స్వయంగా కేరళకు వెళ్లి పంజాల్‍లో జరిగిన యాగాన్ని చూసి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా దాన్ని నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. హరి హరనాథ్ శర్మ ఈ పాటికే విజయవంతంగా పదహారు ఉత్కృష్ట యాగాలను నిర్వహించారు. ఇది పదిహేడోది. సమతా లోక సేవా సమితి నిర్వహించ తలపెట్టిన ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపేందుకు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణ అధికారి పి.వి.ఆర్.కే. ప్రసాద్ అధ్యక్షతన పలువురు ప్రముఖులతో ఒక సారధ్య సంఘం ఏర్పాటైంది. ఈ ప్రముఖులంతా ఒక బృందంగా ఏర్పాటై, అతిరాత్రం ఆచారాన్ని మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ అద్భుత అపురూపమైన సనాతన సాంప్రదాయిక విన్యాసాన్ని మరో రెండు నెలలలో బధ్రాచలంలో ప్రదర్శించబోతున్నారు. ఏప్రిల్ 21-మే 2 మధ్య నిర్వహించనున్న అతిరాత్రం రిహార్సల్లు మొదలయ్యాయి. ఎటపాకలో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని, నాలుగువేల ఏళ్ల క్రితం ఎలా జరిగిందో, అచ్చు అలానే జరపడానికి అన్ని జాగ్రత్తలు సారధ్య సంఘం తీసుకుంటున్నది. పనిముట్లన్నీ ఆ ప్రాంతంలో లభ్యమయ్యే కట్టెతోనే తయారవుతున్నాయి. ఏ రకమైన లోహ సామగ్రిని ఉపయోంచడం జరగదు. బలి పీఠానికి వాడే ఇటుకలు కూడా కట్టెతో తయారుచేసినవే. అవన్నీ కేరళలోనే తయారవుతున్నాయి. అతిరాత్రంలో పన్నెండు రోజులు కూచోగల సామర్థ్యం యజమానికి కలగడానికి చర్యలు చేపట్టారు. పుణ్య యజ్ఞంలో అతి భారమైన యజుర్వేద పఠన బాధ్యతను కాప్రా కుటుంబీకులు, బ్రహ్మ శ్రీ కాప్రా నారాయణన్ నంబూద్రి సారధ్యంలో, తమ భుజాలపై మోపుకున్నారు. ఋగ్వేదం నిర్వహణను నారాస్ కుటుంబీకులు, సామవేదాన్ని తోట్టం కుటుంబీకులు చేపట్టుతున్నారు.

బధ్రాచలం దేవాలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడు కురిచేటి పాండురంగా రావు తాత్కాలిక ప్రాతిపదికపైన విరాళంగా ఇచ్చిన సుమారు ఏబై ఎకరాల భూమిలో, అవసరమైన అనుమతులతో, కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్విఘ్నంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భౌగోళిక-వాస్తు పరమైన సిద్ధాంతాల ప్రాతిపదికగా యజ్ఞ వాటికను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, దేవా దాయ శాఖ మంత్రిని, తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులను, పారిశ్రామిక వేత్తలను, రాజకీయ ప్రముఖులను, దాతృత్వ స్వభావం వున్న లోకోపకారులను, సారధ్య సంఘం కలిసి, వారి సహాయాన్ని కోరుతోంది.

ఎటపాక అద్భుత విన్యాసానికి ముస్తాబవుతోంది. హిందువుల నమ్మకాలుసంస్కృతీ సాంప్రదాయాలువైదిక కర్మ కాండలువేదాల్లో ఉటంకించిన విషయాలువాటిని ఆచరిస్తున్న కేరళ నంబూద్రి బ్రాహ్మణుల తరహా సంప్రదాయ నిబద్ధత లాంటివి అక్షరాలా ఆచరించడానికి రంగం ఏర్పాటవుతోంది. "మంత్రాలకు చింతకాయలు రాలు తాయా" అని వాదించే ప్రభుద్ధులకు ప్రత్యక్ష నిదర్శనం పంజాల్ గ్రామంలో గత ఏడాది నిర్వహించిన యజ్ఞం పరిసమాప్తమైన వెంటనే జరిగిన సంఘటనే! అతిరాత్రం పుణ్య యజ్ఞం సరిగ్గా పన్నెండు రోజులు నిర్విరామంగా-నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా,  వేద పండితులు ఋత్విక్కులుగా వ్యవహరిస్తుండగా జరిగింది. ఏ రోజుఏ సమయంలోఏదిఎలా నిర్వహించాల్నో అనేది శాస్త్రోక్తంగా, ముందే ప్రణాళికా బద్ధంగాసిద్ధం చేసుకుని అలానే ముందుకు సాగారు. దాని ప్రకారంముగింపు రోజున యాగ శాలను అగ్నికి ఆహుతి చేయాల్సిన సమయం కొన్ని నిమిషాలు మాత్రమే ఆలశ్యమైంది. అయితేమరి కొన్ని నిమిషాలలోయాగ శాలను అగ్నికి ఆహుతి ఇవ్వ పోతుండగాఅనుకున్న సమయానికేఆకాశం చిల్లులు పడినట్లుగాకుండ వృష్టితోభారీ వాన పడింది పంజాల్ పరిసరాల్లో. పుణ్య యజ్ఞాన్నిఆ క్షణానకను లారా వీక్షిస్తున్న సుమారు పది లక్షల మందిఆ వర్షంతోయజ్ఞం పరిసమాప్తమవుతుంటేపులకించి పోయారు. అంటే, సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే...గత ఏప్రిల్ నెలలో కూడా...అచ్చు.. అలానే "అతిరాత్రం" జరిగిందని చెప్పగల ధైర్యం, దాఖలాలు కూడా వున్నాయి. యజ్ఞం పూర్తవగానే, యజ్ఞ శాలపై ఆకాశంలో ఒకే ఒక గద్ద ఎగురుతూ కనిపించితే, ఆ క్షణంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిస్తే, దేవతలు సంతోషించారనడానికి నిదర్శనం అని అతిరాత్రం గట్టిగా విశ్వసించే నంబూద్రి బ్రాహ్మణులు అంటారు. అంతా అలానే జరిగింది.

దేశ విదేశాలకు చెందిన పలువురు పరిశోధకులు, ఘనాపాఠీలు, పండితులు, విద్యావేత్తలు అతిరాత్రం తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు బధ్రాచలం రానున్నారు. అతిరాత్రం వైదిక సాంప్రదాయ ఆచారాన్ని, దాన్ని జరిపించే తీరుతెన్నులను, అతిరాత్రం సంబంధించిన పలు ఇతర అంశాలను శాస్త్రీయ పరంగా అధ్యయనం  భావి తరాల వారికి పని కొచ్చే రీతిలో బధ్ర పరిచేందుకు కృషి జరుగుతోంది. వైదిక మంత్రోచ్ఛారణలు, యాగాలు, వ్యవసాయ రంగంపైన, సూక్ష్మ క్రిముల చూపే ప్రభావం గురించిన విషయాలపై పరిశోధనలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేసి, ఇటీవలే మరణించిన ఇండాలజిస్ట్ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్, రాబర్ట్ గార్డినర్ "అతిరాత్రం" ఆచారానికి సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచారు. ప్రొఫెసర్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం మంచిది. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు-ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి-గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!"

మనం చేయాల్సిందల్లా, మన జీవితకాలంలో , మన రాష్ట్రంలో జరుగుతున్న అతిరాత్రం పుణ్య యజ్ఞం వీక్షించడమే! చేతనైతే మన వంతు భాగస్వాములం కావడమే!  End