Showing posts with label పుచ్చలపల్లి సుందరయ్య. Show all posts
Showing posts with label పుచ్చలపల్లి సుందరయ్య. Show all posts

Wednesday, January 11, 2012

సిపిఎం ఆవిర్భావ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు


జనవరి 11, 12 న హైదరాబాద్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో


సూర్య దినపత్రిక (12-01-2012)


వనం జ్వాలా నరసింహారావు

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో (జనవరి 3, 4 తేదీల్లో) జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పార్టీ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరగనున్న నేపధ్యంలో కీలకమైన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పార్టీకి నూతన కార్యదర్శిని ఎన్నుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ఖమ్మం పట్టణంలో ప్రముఖ ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్ర-"తీపి గుర్తులు-చేదు అనుభవాలు" లో పేర్కొన్న పార్టీ ఉమ్మడి మహాసభలు, పార్టీలో చీలిక, సిపిఎం ఆవిర్భావం లాంటి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను గురించి, ఆ పుస్తకాన్ని గ్రంధస్థం చేసిన రచయితగా పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది. 

ఏబై మూడు సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ మహాసభ, 1958 డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు. 7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు. అజయ్ ఘోష్ తన ప్రసంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు. నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు ఆకర్షించాయి. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్‌కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, రణదివేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం దరిమిలా అజయకుమార్ ఘోష్‌ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.

అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‌సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించింది జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషిలు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‌గా నియమించింది.

సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగా లేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ  కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో సహితం ఉత్సాహవంతులైన కొందరు యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో బత్తుల వెంకటేశ్వరరావు లాంటి వారు తొలినాళ్లలోనే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో

Friday, December 2, 2011

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తికి "కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు": వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 7

కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఏడవ అధ్యాయం ఇది).

భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ (8 ) మహాసభ, డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

తొలుత, ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు.

పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు.

7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు.

అజయ్ ఘోష్ కల్చరల్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు.

నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అజయ్ ఘోష్ డాక్ట్రర్ గారింట్లో నాలుగు రోజులు బస చేశారు.

మహాసభ డెలిగేట్లకు అవసరమైన వైద్య సహాయం వై.ఆర్.కె ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసారు.

Wednesday, November 2, 2011

జై తెలంగాణ - జై ఆంధ్ర - జై సమైక్యాంధ్ర : కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి? - వనం జ్వాలా నరసింహారావు

జై తెలంగాణ - జై ఆంధ్ర - జై సమైక్యాంధ్ర :

కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి?

సూర్య దినపత్రిక (4-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ పై సిపిఎం అస్పష్ట వైఖరి; పార్టీలో సహజమైన మిలిటెన్సీ లోపించడమే కారణమా?; సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామన్న ప్రకటనకే పరిమితం; సిపిఎం గతాన్ని మరచిందా?; ఆందోళన చెందుతున్న అసలైన మార్క్సిస్టులు; ఎవరిని సంతోషపెట్టడానికి ఇదంతా అనే అనుమానాలు - ఎడిటర్ సూర్య (4-11-2011)


1930వ దశకంలోనే భారత దేశాన్ని భాషా ప్రాతిపదికన పునర్విభజించి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, జాతీయోద్యమం తీర్మానించింది. దక్షినాదిన, విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహా కర్నాటక, బృహన్మహారాష్ట్రలు ఏర్పాటు చేయాలనీ, అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా భావించింది. ఆ ఆలోచనతోనే, 1946లో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య, "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న పేరుతో ఒక పుస్తకం రాశారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరిచే అనేక సూచనలు ఆ పుస్తకంలో ఆయన చేశారు. 1946లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో తెలంగాణా జిల్లాల నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు నరసింహా రెడ్డి, భీమిరెడ్డి నరసింహా రెడ్డి, ఆరుట్ల దంపతులతో పాటు, ఆంధ్ర జిల్లాల నుండి సుందరయ్య, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, లావు బాల గంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి తదితర నాయకులతో సహా వేలాదిమంది ఇరు ప్రాంతాల కార్యకర్తలు భుజం-భుజం కలిపి 1951 వరకు వీరోచిత పోరాటం చేశారు. నాలుగువేల మందికి పైగా ప్రాణాలను అర్పించారు. సెప్టెంబర్ 17, 1948 న నిజాం హైదరాబాద్ రాష్ట్రం - హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం, 1953లో భాషా ప్రాతిపదికన విభజన జరగడం, 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడం తెలియని వారెవరూ లేరు.

1953లో తెలంగాణ కోసం కొందరు గొంతు విప్పిన నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ "సమైక్యాంధ్ర సదస్సు" ను ఏర్పాటు చేసి, దానికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ సదస్సుకు శ్రీశ్రీ ప్రధాన ఆకర్షణ. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైంది. ఖమ్మం లో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహారదీక్షకు పూనుకోవడం ఉద్యమానికి నాందిగా చెపుతారు. అతని కుటుంబం వెంగళరావుకు అనుచర వర్గమన్నది అప్పట్లో అందరికీ తెలిసిన వాస్తవం. ఉద్యమానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. హైదరాబాద్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమం గ్రామ సీమల్లోకి పాకక పోయినా, నగర - పట్టణ ప్రాంతాలలో విద్యావంతులను ఆకట్టుకుంది. నగరంలో విధ్వంసం చోటు చేసుకుంది. ఆంధ్ర జిల్లాల వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లు కూడా మార్చుకున్న ఉదంతాలున్నాయి. హైదరాబాద్ నగర గోడలపై ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై, ఆయన భార్యపై అశ్లీల రాతలు వెలిశాయి.

ఖమ్మంలో జులై నెల 6, 1969న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) - సిపిఎం ఆధ్వర్యాన సమైక్యతా సభ జరిగింది. నాటి మునిసిపల్ చైర్మన్ స్వర్గీయ చిర్రావూరి లక్ష్మీనరసయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ సభలో, శ్రీ శ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్య, గోరా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావు, నాటి సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, సమైక్యతను సమర్థిస్తూ ఉపన్యసించారు. సదస్సు తరువాత, సాయంత్రం నాలుగు గంటలకు మూడువేల మందితో ఊరేగింపు మొదలైంది. ఊరేగింపును అడ్డుకున్న వారికి బి.ఎన్. నాయకత్వాన ఎర్ర జెండా కర్రతో దుండగులను తరిమి కొట్టిన సంగతి అప్పట్లో పలువురి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలోని మొత్తం జిల్లాలలో సమైక్యత కోసం సిపిఎం చేసిన మొదటి ప్రయత్నం ఇది. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా సమైక్యతా వాద సదస్సులు జరిగాయి.

సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెపుతూ, ప్రజలలో అవగాహన కలిగించడానికి సిపిఎం అనేక కరపత్రాలను వేసిందా రోజుల్లో. సిపిఎం నాయకుడు స్వర్గీయ మోటూరి హనుమంతరావు అనేక వివరాలతో రాసిన "విశాలాంధ్రలో విషాదచ్ఛాయలు" పుస్తకం వేల కాపీలు రాష్ట్రం మొత్తం పంచబడింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా పార్టీ ఆధ్వర్యాన సదస్సులు, సభలు జరిగాయి. 1973 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర జిల్లాలలో "జై ఆంధ్ర ఉద్యమం" ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలోను, మార్క్సిస్టు పార్టీ దానికి వ్యతిరేకంగా తిరిగి పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం వెలువరించింది. సభలు నిర్వహించింది. ఆ సభలకు నాటి కృష్ణా జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి మానికొండ సుబ్బారావు, ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (మాజీ రాజ్యసభ సభ్యుడు) ఉపన్యాసకులుగా వెళ్లారు. ఆ సందర్భంలో కృష్ణా జిల్లా జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు (1983-1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రి), వారి శిష్య గణం సభా ప్రాంగణం చుట్టూ రాళ్లు పేర్చుకుని తెలంగాణ ప్రతినిధి డాక్టర్ యలమంచిలి ప్రసంగిస్తుండగా రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. బందోబస్తులో వున్న పోలీసు బృందం తగు రక్షణలు కలిగించింది. ప్రత్యేక వాదం ఉద్యమాలపట్ల, ఆ నాడు భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ తీసుకున్న క్రియాశీల వైఖరికి ఇవి కొన్ని ఉదాహరణలు.

2001-2010 మధ్య సాగిన - తరువాత సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎడల పార్టీ వైఖరికి, 1969-73 మధ్య తీసుకున్న వైఖరికి చాలా తేడా కనిపిస్తుంది. ఈ వైఖరికి బహుశా కారణం, ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో పెద్ద ఎత్తున లేకపోవడమైనా కావచ్చు, లేదా, అది కేవలం మాటల యుద్ధంగా వుండడం వల్ల కావచ్చు, లేక వివిధ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ 2004 లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడం వల్ల కావచ్చు, తిరిగి 2009 ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితితో కూడిన గ్రాండ్ అలయెన్స్ లో భాగస్వామి కావడం వల్ల కావచ్చు. ఏదేమైనా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించింది. 2004 లో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సిపిఎం ఎందుకు ప్రాతినిధ్యం నిరాకరించింది? తాము సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం వరకే ఎందుకు పరిమితం అవుతోంది? కొంత మంది నాయకులు "తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి లేదనీ" అనడం భావ్యమేనా? బాధ్యత కాంగ్రెస్ ది కాగా తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేయడం "తమ పార్టీ భుజాన తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం తప్పు" అనడం సిపిఎంకు సమంజసమేనా? చివరకు "కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే మేం వద్దన్నామా?" అనడం, "మేం వ్యతిరేకించమనీ" ఇచ్చే ప్రకటనలు తప్పు దోవ పట్టించే విగా లేవా? మార్క్సిస్టు పార్టీయే తరులు - అటు తెలంగాణ ప్రాంతం వారైనా, ఇటు ఆంధ్ర ప్రాంతం వారైనా - అపహాస్యం చేసే పరిస్థితికి సిపిఎం చేరుకోవడం అసలుసిసలైన మార్క్సిస్టులను ఆందోళనకు గురిచేస్తుందనక తప్పదు. ఎందుకీ అస్పష్ట వైఖరి? ఎవరిని సంతోషపెట్టడానికి ఇదంతా? ఇటీవల కాలంలో ఆ పార్టీకి సహజమైన "మిలిటెన్సీ" కూడా లోపించిందనక తప్పదు.

ఈ అంశాన్ని ఒకరిద్దరు ప్రముఖ మార్క్సిస్టు నాయకుల దగ్గర ప్రస్తావించినప్పుడు సైద్ధాంతిక కోణంలో సమాధానాలు కొంత మేరకు లభించినా, సంతృప్తికరంగా లేవనే అనాలి. 2011 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సమర్థన అస్తిత్వం వుందన్నారు కొందరు సిపిఎం నాయకులు. ప్రాంతీయ అస్తిత్వ వాదం అనీ, ఈ సిద్ధాంతానికి మూలాలు పోస్టు మోడర్నిజంలో వున్నాయనీ, విజ్ఞులందరికీ తెలుసు. పోస్టు మోడర్నిజం అనేది సైద్ధాంతికంగా "యాంటీ మార్క్సియన్" అని చాలామందికి తెలుసు. ఇది ప్రాంతీయ కుల-జెండర్ వాదాలకు దారితీస్తుంది. ఈ నేపధ్యంలో ఆంగ్ల భాషలో వచ్చే మార్క్సిస్టు త్రైమాసిక పత్రికలో రెండు చక్కటి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఒకటి ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి ఇంతియాజ్ అహ్మద్ రాసిన ఇరవై పేజీల విపులమైన వ్యాసం. అదే సంచికలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వ్యాసం కూడా ఆ అంశంపైనే వుందన్నారు. ఆ రెండు వ్యాసాలు, ప్రస్తుత వేర్పాటు ఉద్యమ వాతావరణంలో, వామపక్ష ఆలోచనలు వున్నవారికి ఉపయోగకరంగా వుంటాయి. సమైక్యత నినాదానికి కట్టుబడే వుంటే, సిపిఎం వాటిని తెలుగులోకి అనువదించి, ప్రచారంలోకి తీసుకురావడంలో ఎందుకు వెనుకాడుతున్నదో అర్థం కావడం లేదని కూడా కొందరు సిపిఎం నాయకులు అభిప్రాయపడ్డారు.

"ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐదీ, సిపిఐ (న్యూ డెమాక్రసీ)దీ అత్యుత్సాహంగా వుంటే, మాది నిరుత్సాహంగా, నిర్లిప్తంగా వున్నట్లు తోస్తుందిఅని ముగించారు సిపిఎం పార్టీకి చెందిన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు.

అసలింతకీ మనముందున్న సమస్య, కేవలం సమైక్యమా? విభజనా? లేక మరింత లోతుగా పరిశీలించ వచ్చా? తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇది జాతుల, అంతర్జాతీయాల సమస్యను రంగంమీద కి తెస్తోంది. జాతి అంటే ఒక స్పష్టమైన అవగాహన లేకుండానే ఏ ప్రాంతానికి బడితే ఆ ప్రాంతానికి జాతి అనే ముద్ర తగిలించేవాళ్లున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వాళ్లూ-మద్దతిచ్చిన వాళ్లూ వున్నారు. అంతర్జాతీయ పౌభాతృత్వం పేరిట అనలు జాతుల ఉనికినే ప్రశ్నించేవారూ వున్నారు. రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఒకే భాష వుంటేమాత్రం రెండు గాని అంతకుమించి సంఖ్యలోగాని రాష్ట్రాలుంటే నష్టమేమిటని, తప్పేంటి? అని ప్రశ్నించేవారూ వున్నారు. వివిధ భాషలు గల ప్రాంతాలను ఒకే ఉమ్మడి రాష్ట్రంగా, ఇంగ్లీషు వాళ్లకాలంలోవలె చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందని సవాలు చేసేవారూ లేకపోలేదు. అందుకే జాతి అంటే ఏమిటన్న విషయంలో, అదీ మార్క్సిస్టు ఆలోచనా ధోరణితో, కొంత స్పష్టమైన అవగాహనకు రావడం సమస్యను అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుందేమో!

మన దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అవి కేవలం పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే ఏర్పడినవిగావు. భాషా ప్రయుక్తంగా ఏర్పడినవి. పేరుకు భాషా ప్రయుక్తం అంటున్నా నిజానికి అవి వివిధ జాతులు గానూ కూడా వున్నాయి. భారతదేశం (అంటే "ఇండియన్ యూనియన్") ఒక్కటే అయినా అది వివిధ జాతుల కూటమి కూడాను. ఈ జాతుల సమైక్యతే మన దేశపు ఏకత్వాన్ని, ఔన్నత్యాన్నీ కాపాడుతుంది. ప్రపంచంలో ఏక జాతి దేశాలూ వున్నాయి. బహుళ జాతి దేశాలూవున్నాయి. చైనా, ఇండియా వంటివి బహుళ జాతి దేశాలు. సకల జాతి, సకల దేశ సమైక్యతే విశ్వ మానవ కళ్యాణానికి దోహదం చేస్తుంది. అది కేవలం భౌగోళికంగా సమైక్యంగా వుండాలని లేదు. ఒక మనిషి వేరొకమనిషినీ, ఒక జాతి వేరొక జాతినీ దోపిడీ చేయడం అంతమవ్వాలి. అందుకు ఆర్ధిక వ్యత్యాసాలూ జాతి విచక్షణలూ పోవాలి. అప్పుడు వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది. సోషలిస్టు వ్యవస్థే వర్గ రహిత సమాజాన్ని తీర్చిదిద్దగలదు. కాని అది మనదేశంలో జరగడం లేదే? జరిగే సూచనలు కూడా లేవే?

సమైక్యత అనేది సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యం గనుక ఈలోగా ఏ జాతీ ఒక్కటి గా వుండవలసిన అవసరంలేదని కానీ, వుండి తీరాలని కానీ, ఎన్ని ముక్కలుగా చీల్చినా పరవాలేదని కానీ, అసలు విభజన ఆలోచనే తప్పనీ, ఎవరికి నచ్చిన భాష్యం వారు చెప్పడం సరైంది కాదు. ఇవన్నీ దారితప్పిన వాదనలు తప్ప మార్క్సిస్టు వాదనలు కనే కావు. ఒక జాతిగా వున్న వాళ్లు అవకాశమున్న చోట ఒకే రాష్ట్రంలో వుండటం ఎంత మంచిదో-అదెంత జాతి అభివృద్ధికి దోహద కారి అవుతుందో, అదే విధంగా అవసరమైతే-ప్రజలు కోరుకుంటే, ఒక జాతి విభిన్న భాగాలుగా చీలడం, విభిన్న జాతులకు చెందిన భాగాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం అంతే దోహద కారి అవుతుంది.

జాతి అన్న దానికి సరైన నిర్వచనాన్ని లెనిన్ - స్టాలిన్ లు ఇచ్చారు. “ఒకే భాష, ఒకే భూభాగం, ఒకే ఆర్ధిక వ్యవస్థ ఒకే సాంఘిక సంస్కృతీ సముదాయంగా గలదీ, స్థిరమైన సమాజంగా చారిత్రక పరిణామం పొందినదీ ఒక జాతిగా పరిగణించబడుతుంది”. చైనా, ఇండియా లాంటి దేశాల్లో వున్న వారంతా ఒకే జాతి వారా? భాష ఒకటే అయినా ఒకే దేశంలో వున్న వారందరూ ఒక జాతి వారు కాజాలరు. ఇంగ్లండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇంగ్లీషు భాషే మాతృ భాషగా వున్నది. అయినా వారంతా విభిన్న జాతులుగా రూపొందారు. ఇంగ్లండు, ఐర్లాండు లలో మాట్లాడేది ఒకే భాష. సన్నిహిత భూ భాగంకూడా వున్నది. అయినా అవి రెండూ రెండు జాతులుగా పరిణామం చెందాయి. ఆలాగే కెనడా, అమెరికాలు సన్నిహితంగా వున్నా ఒకే జాతిగా పెంపొందలేదు. అందుకనే భాష, భూభాగం, సంస్కృతీ, చరిత్రా, ఆర్ధిక వ్యవస్థ, స్థిరమైన మనుగడ వంటి లక్షణాలన్నీ కలిసి వుంటేనే సమైక్యత సాధ్యమవతుందేమో! సాధ్యంకాకపోవడానికీ అవకాశాలున్నాయి కూడా!

ఈ లక్షణాలన్నీ తెలుగు జాతి కలిగివుందా? సమాధానం "అవును" కావచ్చు, "కాదు" కావచ్చు. పూర్తి ఫ్యూడల్ వ్యవస్థలో, ఉర్దూ భాష పెత్తనం క్రింద కొన్నేళ్లు తెలంగాణా నలిగింది. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీషు భాష పెత్తనం క్రింద కొంత పెట్టుబడి దారీ ప్రభావంలో ఆంధ్ర ప్రాంతం కొన్నేళ్లు నడిచింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నేపధ్యంలో విశాలాంధ్రగా ఏర్పడ్డాయి. విడివిడిగా, కలిమిడిగా దేని అస్తిత్వం దానికే వుంది. మరిప్పుడు కలిసున్నా, విడిపోయినా లాభనష్టాలు ఒకటేగా? ఒకరు విడిపోతా మన్నప్పుడు మరొకరికి అభ్యంతరం ఎందుకుండాలి? సమాధానం దొరకని ప్రశ్నలు.

కమ్యూనిస్టు పార్టీలలో సగ భాగం కలిసి వుండాలంటుంటే, మరో సగ భాగం విడిపోవాలని ఉద్యమిస్తున్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పిన సూక్తులు ఎవరికి వర్తిస్తా యో వారే తేల్చాలి! END

Saturday, October 16, 2010

పయ్యావుల చెప్పిన వీర తెలంగాణా విప్లవ గాధ : వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరణ జరిగి
(అక్టోబర్ 21, 2010 న)
59 సంవత్సరాలు నిండిన సందర్భంగా

సూర్య దిన పత్రిక (17-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

ఐదేళ్ల పాటు సాగిన వీర తెలంగాణా విప్లవ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మైలు రాయి-కీలకమైన ఒక మలుపు రాయి. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి విప్లవ యోధుల సరసన పోరాటంలో పాల్గొన్న వారిలో చరిత్ర పుటల్లోకి ఎక్కనివారి పాత్రను తక్కువగా అంచనా వేయలేము. సరిగ్గా ఏభై తొమ్మిది సంవత్సరాల క్రితం, అక్టోబర్ 21, 1951న ఉపసంహరించబడిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఖమ్మం జిల్లా, గోకినేపల్లి గ్రామానికి చెందిన 85 సంవత్సరాల పయ్యావుల లక్ష్మయ్యకు ఇప్పటికీ, ఈ వయసులోను ఎన్నో విషయాలు గుర్తున్నాయి. సాయుధ పోరాట ఉద్యమంలో దూకిన పయ్యావుల లక్ష్మయ్య, తనను నిర్బంధించిన నిజామాబాద్ జైలు కిటికీ వూచలు కోసి, తప్పించుకుని, సొంత గ్రామం గోకినేపల్లికి చేరుకున్నారు. క్రమేపీ ఉద్యమం తీవ్రమైంది.

మైదానంలో రక్షణ లేదని లక్ష్మయ్య ప్రభృతులు, ఇల్లెందు అడవుల్లోకి పోయారు. అప్పటికే రంగ ప్రవేశం చేసిన యూనియన్ సైన్యాలు అడవుల్లోకి, గుట్టల్లోకి వీరిని గాలించుకుంటూ వచ్చాయి. మిలిటరీ ధాటికి తట్టుకోలేక మొదట్లో ఐదు గురితో ఏర్పాటైన దళాలు, క్రమేణ ముగ్గురి తో, ఇద్దరితో కుదించడం జరిగింది. మొండిగా ఉద్యమం సాగించారు. ఉద్యమం కొనసాగించడం సరైందా, కాదా అన్న మీమాంసలో లక్ష్మయ్య లాంటి వారున్నప్పటికీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మాత్రం, అడవుల్లో దళాలను అంటిపెట్టుకుని ముందుకు సాగేవారు. అప్పట్లో లక్ష్మయ్య పాలేరు ప్రాంతం ఇన్-చార్జ్ గా పనిచేశారు. నేలకొండపల్లి సమీపంలోని మూటా పురానికి చెందిన బాగం వీరయ్య రైఫిల్ పోగొట్టుకుని చిత్రహింసలకు గురై కూడా రహస్యాలు బయటపెట్టని విషయం గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

చకిలం శ్రీనివాస రావు కార్యదర్శిగా వున్న (ఏరియా కమిటీ) దళంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి (పార్లమెంట్ మాజీ సభ్యుడు), మచ్చా వీరయ్య, చిర్రావూరి లక్ష్మీనరసయ్య (ఖమ్మం మాజీ మునిసిపల్ చైర్మన్) లతో పాటు లక్ష్మయ్య కూడా వుండేవారు. ఒక సారి జరిగిన దాడిలో లక్ష్మయ్య వారినుంచి చీలి హుజూర్ నగర్ దళంలో కలిశాడు. అక్కడ మేదరమెట్ల సీతారామయ్య, నిజామాబాద్ జైలునుంచి తనతో పాటు పారిపోయి వచ్చిన వంకాయలపాటి కృష్ణయ్య కలిశారు. సీతారామయ్య ధైర్య సాహసాలను గుర్తుచేసుకుంటూ, ఒకసారి అడవి దేవులపల్లి-దేవరకొండ ప్రాంతంలో పోతున్నప్పుడు, తమను నిర్భంధించడానికి వస్తున్న గూర్ఖాలను పసిగట్టి ఎలా వెనుక దెబ్బతీసింది వివరించారు లక్ష్మయ్య. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్ మీద దాడి చేసేందుకు ప్రణాళిక తయారుచేయమని లక్ష్మయ్యను పార్టీ ఆదేశించించింది. సహచర ఉద్యమకారుడు వంకాయలపాటిని, మేదరమెట్లను, మరొకరిని కలుపుకుని, నలుగురు స్టేషన్ పై దాడికి ప్రణాళిక వేసుకున్నారు. పొగాకు అమ్మే బేర గాళ్ల వేషంలో వూళ్ళోకి సాయంత్రం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. వూరి బయట పొగాకు పరిచి, తరాజులు పెట్టి అమ్మకాలు మొదలెట్టారు. జనసంచారం తగ్గింతర్వాత ముసుగులు ధరించి, వెంట తెచ్చుకున్న తుపాకీలు పట్టుకుని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. దాడికి వచ్చింది నలుగురే అని భావించని పోలీసులు భయంతో, లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వెంటిలేటర్ల నుంచి బయటున్న వీరు కాల్పులు చేయడంతో లోపలున్న పోలీసులు గాయపడి చేతులెత్తి లొంగిపోయారు. బయట కొచ్చిన ఒక్కొక్కరి ని బంధించారు వీళ్ళు. వాళ్ళ దగ్గరున్న 14 తుపాకీలను కట్టకట్టి, మోయలేక, అతి కష్టం మీద ఊరి బయటకు చేర్చారు. అప్పటికి అక్కడున్న రాతి బావిలో పడవేసి, తర్వాత తీసుకున్నారు.

అడుగడుగునా పోలీసు కాపలా అవరోధాల మధ్య, సానుభూతి పరుల సహాయం లభించేది. ఒక సారి ఈయన దళాన్ని వంద మంది పోలీసులు చుట్టుముట్టారు. సమీపంలోని జొన్న చేలలో, చుట్టూతా తుపాకీల పహరా మధ్య తప్పించుకునే ప్రయత్నంలో వుండగా, తోటి ఉద్యమకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపిస్తున్న లక్ష్మయ్యకు దండం పెట్టి, తాను పోలీసులకు చిక్కక ముందే చంపమని ప్రాధేయ పడ్డాడట. అతడిని భుజంపై వేసుకుని ఎలాగోలా లక్ష్మయ్య తప్పించుకోగలిగాడు. జొన్న చేలు దాటి, మరో దళానికి చెందిన సభ్యుడొకరిని, దొడ్డా నరసయ్య గ్రామం దగ్గరున్న చిలుకూరు సమీపంలో కలిశాడు లక్ష్మయ్య. ఒకరినొకరు క్షణకాలం అనుమానించినా కలిసిపోయారు. గాయపడిన సహచరుడిని, సుదూరంలో కనిపిస్తున్న గుర్రానికి కట్టి తీసుకెళ్దామని భావించారు. అయితే, ఆ గుర్రం సహాయంతోనే మరో సహచరుడు వంకాయలపాటి కృష్ణయ్య రావడం గమనించారు. మొత్తం మీద అందరూ కలిసి, చిలుకూరు నుంచి గొర్రగూడెం అడవులకు చేరుకున్నారు. అక్కడే హుజూర్ నగర్ దళం పని చేస్తున్నది. అప్పటికే, ఖమ్మం దళం కంటే పటిష్టంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న హుజూర్ నగర్ దళం, కాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నది.

పయ్యావుల లక్ష్మయ్యను కల్వకుర్తి జోనల్ కమిటీ కార్యదర్శిని చేసింది పార్టీ. సరిగ్గా అదే రోజుల్లో, ఉద్యమంతో బాగా అనుబంధమున్న ఒక సీనియర్ కార్యకర్తను అరెస్టు చేసింది ప్రభుత్వం. అతడు పోలీసు ఇన్ ఫార్మర్ గా మారిపోయాడు. గుట్టల్లో దళం సభ్యులను కలిసి, పాత పరిచయాలతో వారినుంచి సమాచారం సేకరించి, పోలీసులకు చేరవేయ సాగాడు. చివరకు వాడిని తమ దగ్గర నుంచి, ఎల్. బి. గంగాధర రావు సారధ్యంలోని కేంద్రానికి పంపారు. ఆ దళంలో, కొండన్న అనే మాజీ సైనికాధికారి సభ్యుడుగా వుండేవారు. అతను వీడి విషయం పసిగట్టాడు. అది గ్రహించిన ఇన్ ఫార్మర్ జరగబోయేది ఊహించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పార్టీకి, ఉద్యమానికి ద్రోహం చేశానని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా గొడ్డలితో నరికి చంపారని, ఆ సంఘటన మీద పార్టీలో చాలాకాలం చర్చ జరిగిందని, తప్పొప్పుల బేరీజు వేసుకోవడం కూడా జరిగిందని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య. ఏదేమైనా చరిత్ర మటుకు ముందుకు సాగింది.

కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలున్న విషయం ప్రస్తావించారు లక్ష్మయ్య. ఒకటి సుందరయ్య వర్గం కాగా, మరొకటి రావి నారాయణరెడ్డి వర్గం. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తర్వాత, తెలంగాణా సాయుధ పోరాటం కొనసాగించడమంటే, అది నెహ్రూ ప్రభుత్వాన్ని కూల దోయడానికి జరిగే కుట్రగా ప్రచారం మొదలైంది. యూనియన్ సైన్యాలు నిజాం సంస్థానంలో ప్రవేశించిన మరుక్షణం నుంచే, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఖండించే వర్గం మొదలైంది. తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించుతున్న నాయకత్వం లోని చండ్ర రాజేశ్వర రావు, మాకినేని బసవ పున్నయ్య, మద్దుకూరి చంద్రశేఖర రావు, పుచ్చలపల్లి సుందరయ్య అక్టోబర్ 20, 1951 న సమావేశమై, పోరాటాన్ని ఉపసంహరించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని అక్టోబర్ 21, 1951 న ప్రజలకు, పత్రికలకు విడుదల చేయడం రేడియోలో ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో పయ్యావుల లక్ష్మయ్య ప్రభృతులు, వారిలాంటి చాలామంది కార్యకర్తలు అజ్ఞాత వాసంలో వుంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

పోరాట విరమణ నిర్ణయాన్ని, దాని వెనుక వున్న భావాన్ని కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోలేక పోయారంటారు లక్ష్మయ్య. పోరాట విరమణ కార్యక్రమం ఉద్యమ కారులకు వివరించడానికి లక్ష్మయ్య జోనల్ కమిటీ కార్యదర్శిగా వున్న కల్వకుర్తి జోన్ ను ఎంపిక చేసింది పార్టీ నాయకత్వం. పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడ కొచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట వచ్చిన ఒక ప్రముఖ ఉద్యమ నాయకుడు (దరిమిలా ఆయన సీపీఐ లోను, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లోను పని చేశారు) సుందరయ్య గారి సమక్షంలో, "ఎప్పుడో పోరాటం విరమించాల్సింది" అని వ్యాఖ్యానించడంతో, అక్కడున్న వారంతా ఆయన్ను తప్పుబట్టి ఎదురు తిరిగారట. పోరాట విరమణ నిర్ణయాన్ని వివరించిన సుందరయ్య గారు, "ఆత్మ రక్షణ కొరకు పోరాటం కొనసాగిస్తే తప్పులేదు" అన్న మాటలను లక్ష్మయ్య బృందం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. "చంపవద్దు" అన్న మాట అర్థమయినా, ప్రభుత్వంతో తుపాకీల అప్పగింత విషయంలో చర్చ లింకా జరుగుతున్నాయని సుందరయ్య అనడాన్ని, ఆత్మ రక్షణ కొరకు వాటిని వాడుకోవచ్చని భావించారు.

సాయుధ పోరాటం కొనసాగుతున్న రోజుల్లో, ఇంకా తుపాకీలు అప్పచెప్పకముందు, పయ్యావుల లక్ష్మయ్య దళంలో పనిచేసిన వారిలో బూర్గుల రామకృష్ణా రావు గారి బంధువు హనుమయ్య ఒకరు. విద్యాధికుడైన హనుమయ్య, డాక్టర్ పరాంజిపే దగ్గర వైద్యం నేర్చుకున్నాడు. ఆత్మ రక్షణ కొరకు ఆయుధాలింకా ఉపయోగిస్తున్న తరుణంలో, ఒకానొక సందర్భంలో హనుమయ్యను నిర్భంధించినప్పుడు, ఆ గ్రామ పటేల్ ఆయనను కాపాడి నందువల్ల పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన సంగతిని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

ఎప్పుడో ఒకప్పుడు సాయుధ పోరాటం వస్తుందని సుందరయ్య గారు నమ్మేవారని, అందుకే, ఆయన మార్గాన్ని అనుసరించే తన లాంటి వారెందరో, తుపాకీల అవసరం తప్పక రావచ్చని భావించామని ఆనంద భాష్పాల మధ్య, వ్యక్తపరచలేని సుందరయ్య గారి మీదున్న అభిమానం మధ్య పేర్కొన్నారు. నందికొండ ప్రాజెక్టు కింద మునిగి పోయిన స్థలంలో, ఇప్పుడు సాగర్ జలాలు ప్రవహిస్తున్న అలనాటి ప్రాంతంలో, ఒక గుర్తు ప్రకారం తామంతా ఆయుధాలు దాచిపెట్టామని, అవి ఎప్పుడో ఒకప్పుడు భావి తరాల ఉద్యమకారులకు దర్శనమిస్తాయని, అపారమైన నమ్మకంతో, 85 ఏళ్ళ పయ్యావుల లక్ష్మయ్య అంటుంటే, ఆయన నమ్మకానికి జోహార్లు అనాలనిపించింది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి ఎనలేని సేవలందించిన అలనాటి వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు పయ్యావుల లక్ష్మయ్యను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణ మీద సీపీఎం నుంచి బహిష్కరించడం కడు బాధాకరమైన విషయం. విప్లవ యోధులను గౌరవించడమంటే ఇదేనని సోదాహరణంగా చూపించింది సీపీఎం. లక్ష్మయ్య లాంటి "తెలుగు సోమనాథ్ ఛటర్జీ" లు ఖమ్మం జిల్లాలో చాలామంది కనిపిస్తారు మనకు. వారిలో చాలామంది నుంచి ఇలాంటి గాధలెన్నో వినవచ్చు. ఇంత జరిగినా పార్టీ మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని అణు మాత్రం కూడా వదులుకోలేని లక్ష్మయ్య, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, తనను చూసేందుకు వచ్చిన వారితో, పార్టీతో-విప్లవంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటారు.

Friday, July 2, 2010

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం: వనం జ్వాలా నరసింహారావు

(జులై 3-4, 2010 తేదీలలో సిపిఎం పోలిట్ బ్యూరో
సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో.....)

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు


ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్), వేలాదిమంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఎదుగుతూ, కేరళ-పశ్చిమ బెంగాల్-త్రిపుర రాష్ట్రాలలో బలమైన పట్టు సాధించి, గత కొద్ది కాలంగా తిరోగమన దిశగా పయనించడానికి దారి తీసిన పరిస్థితులను అగ్రనాయకత్వం సరి దిద్దుకునే ప్రయత్నం చేయడం ఆరంభించింది. పార్టీ తలపెట్టిన విప్లవ లక్ష్యాలను-ధ్యేయాలను చేరుకుని, అధిగమించేందుకు, రాజకీయ పరంగా-సిద్ధాంత పరంగా చోటుచేసుకున్న బలహీనతలను, నిర్మాణ పరంగా జరిగిన అపరాధాలను అన్వేషించ సాగింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది.

దిద్దుబాటు ఉద్యమం తీరుతెన్నులను, పార్టీ అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు అన్వయించి అమలుపర్చే పద్ధతిని, అలాంటి ప్రక్రియనే జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ నిర్ణయం ఎంత మేరకు అమలుకు నోచుకుందో ఇదమిద్ధంగా ఇంతవరకు బయట పడలేదు. పదిహేనవ సాధారణ ఎన్నికల్లో సిపిఎం గెల్చుకున్న లోక్ సభ సభ్యుల సంఖ్య 2004 ఎన్నికలలో గెల్చుకున్న 42 నుంచి గణనీయంగా పడిపోయి కేవలం 16 కు కుదించుకుని పోవడంతో, పార్టీ నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవడంలో భాగంగా, "దిద్దుబాటు ఉద్యమం" బాట పట్టాలని భావించింది. ఇంతలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికల చేదు అనుభవం ఎదురైంది.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, చైనా-రష్యాల మధ్య బెడిసికొట్టిన సంబంధాల, భారత-చైనా యుద్ధ పరిణామాల నేపధ్యం, భారత కమ్యూనిస్ట్ పార్టీలో 1962 లో చీలికకు దారితీశాయి. నూతనంగా ఏర్పాటైన భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్)-సిపిఎం పార్టీ, సభ్యత్వ సంఖ్యాపరం గాను, ఎన్నికల్లో సాధించిన ఫలితాల పరం గాను, బలీయమైన శక్తిగా గుర్తింపు పొంద సాగింది. పార్టీలో చీలిక వచ్చిన తర్వాత కూడా కొంతకాలం, ఉభయ పార్టీలకు ట్రేడ్ యూనియన్ పరంగా ఒకే ఐక్య వేదిక వుండేది. అప్పట్లో పార్టీలో చీలికైనా, ట్రేడ్ యూనియన్ లో చీలికైనా, సైద్ధాంతిక పరమైన అభిప్రాయ భేదాల వల్ల వచ్చిందే కాని, వ్యక్తిగత కారణాల వల్ల వచ్చింది కాదు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆస్తులు కూడగట్టుకోడానికి, అంతస్తులు పెంచుకోవడానికి, చట్టసభల్లో ప్రవేశించేందుకు, ప్రవేశించి-బూర్జువా పార్టీకి చెందినవారితో సమానంగా అంతస్తులు పెంచుకునేందుకు, పార్టీ టికెట్ పొందడానికి, కాంట్రాక్టర్ల కొమ్ము కాయడానికి, పార్టీని ఉపయోగించుకునే అలవాటుండేది కాదు. ఏది జరగకూడదని పార్టీ ఆవిర్భావపు రోజుల్లో అనుకున్నా రో, దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుండడంతో, "దిద్దుబాటు ఉద్యమాల" అవసరం కలిగిందనాలి.

1964 లో ఆవిర్భవించిన సిపిఎం, ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందు వరుసలో వుండేది అలనాటి పార్టీ నాయకత్వం కింద. వామ పక్షాలలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మూడు రాష్ట్రాలలో వామ పక్ష ఐక్య సంఘటన ప్రభుత్వాలకు సారధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం పొందినప్పటికీ, అదింకా బలమైన వామ పక్షం అన్న విషయంలో అనుమానం లేదు. అంత మాత్రాన, పార్టీ బలం పది కాలాల పాటు మిగులుతుందన్న ధీమాతో వుండే అవకాశమూ లేదు.

రాజకీయ-సైద్ధాంతిక బలహీనతలను, వ్యవస్థాగత లోటుపాటులను సరి దిద్దుకుని ముందుకు సాగినప్పుడే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ లక్ష్యాలను సాధించగలదని పార్టీ నాయకత్వం భావించింది. వర్గ ప్రాధాన్యతల సమాజంలో, పాలకవర్గం మాట చెల్లుబాటు కావడమే కాకుండా, దాని ప్రభావం సమాజంపై పడుతుంది. అలాంటి సమాజంలో, బూజుపట్టిన సిద్ధాంతాలను ఇతరులపై రుద్దే ప్రయత్నంలో కమ్యూనిస్ట్ పార్టీని కూడా వదలదు పాలక వర్గం. ఆ ప్రభావానికి లోనైన కమ్యూనిస్టులను దిద్దుబాటులో పయనించేలా చర్యలు నిరంతరం చేపట్టాల్సిన బాధ్యత నాయకత్వానిదే. కాకపోతే, ఆ నాయకత్వంలోని కొందరు అదే మంచిదని ఆ ప్రభావంలో పడిపోతే, కంచే చేనును మేసినట్లవుతుంది.

భారత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలంటే అనుసరించతగిన మార్గాలకు సంబంధించి, ఆదినుంచీ భిన్నాభిప్రాయలుండేవి. ఎవరు నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా వారు మసలుకున్నారు. అంత మాత్రాన అవసరం వచ్చినప్పుడు విమర్శలకు గురికాక తప్పలేదు. 1964 నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్న మాకినేని బసవ పున్నయ్య, తన బాధ్యతలను విస్మరించి-పోరాట మార్గాన్ని విడనాడి, కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితమై పోయాడని, సాక్షాత్తు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆగస్ట్ 1975 లో పదవికి రాజీనామా చేస్తూ పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారంటే, అప్పట్లో పెద్దా-చిన్నా తేడా లేకుండా పార్టీకి చెందిన ప్రతివారిని ఎంత నిశితంగా పరిశీలించడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు... అందరూ.. పార్టీ క్రమశిక్షణకు అతీతులే !

వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విప్లవ రథ సారధులలో ముఖ్యుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య లాగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారు అరుదుగా కనిపిస్తారు. ఆయన పేరు చివర నున్న కుల ప్రాధాన్యతను గుర్తుచేసే "రెడ్డి" పదాన్ని శాశ్వతంగా తన పేరునుంచి తొలగించు కోవడంతో పాటు, సమాజ సేవే లక్ష్యంగా జీవించాలన్న తలంపుతో-భార్య అంగీకారంతో, తమకు సంతానం వద్దని నిర్ణయం తీసుకున్నారాయన. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో 1936 లోనే కేంద్ర కమిటీ సభ్యుడైన సుందరయ్య 1948-1952 మధ్య కాలంలో అజ్ఞాతంలో గడిపారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. పార్టీ పక్షాన పార్లమెంటుకు ఎన్నికైన సుందరయ్య గారు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో సైకిలెక్కి పార్లమెంటు భవనానికి వెళ్లేవారు. ఇప్పుడేమో స్కార్పియోలకు తక్కువ లేకుండా పార్టీ పక్షాన ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉపయోగిస్తున్నారు. సిపిఎం ఆవిర్భావం నుంచి 1976 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుందరయ్య గారు, దేశంలో ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితి విధించిన నేపధ్యంలో, పార్టీ అలవరచుకుంటున్న "అభివృద్ధి నిరోధక అలవాట్ల" కు నిరసనగా రాజీనామా చేశారు.

సుందరయ్య గారు రాజీనామా సమర్పించి పాతిక సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో, ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాల తరహా దిద్దుబాటు చర్యలకు, ఏడాది క్రితం పార్టీ కేంద్ర కమిటీ సూచించిన దిద్దుబాటు చర్యలకు మధ్యనున్న తేడాను, కమ్యూనిజం కోణంలోంచి పరిశీలించి చూడాల్సిన అవసరం చాలా వుంది. ఆయన సూచనలను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే, ఈనాడు అసలు “దిద్దుబాట” పట్టాల్సిన అవసరమే లేదు. సుందరయ్య గారి రాజీనామా లేఖలో ఇతర అంశాలతో పాటు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు మరొక్కమారు మననం చేసుకోవడం మంచిదే మో. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో, "జనసంఘ్" పార్టీతో కలిసి సిపిఎం ఉమ్మడి ఉద్యమాలను చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. నిశితంగా విమర్శించారు. జనసంఘ్ తో కలిసిన వారు, ఆ పోకడలను వంట పట్టించుకోక ఎలా వుండగలుగుతారు? పార్టీ వ్యూహాత్మక పంథాను పోలిట్ బ్యూరో చిత్తశుద్ధితో వాస్తవ రూపంలో అమలు పర్చలేకపోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. పార్టీని కాదనే శైలిలో ట్రేడ్ యూనియన్ విభాగం పనిచేసే విధానం ఆయనకు నచ్చలేదు. వ్యవసాయిక విప్లవాన్ని ఆచరణలో పెట్టడం విషయంలో అలసత్వం ప్రదర్శించడానికి తాను వ్యతిరేకం అన్నారు. పార్టీ సంస్థాగత ఎదుగుదలకు అవసరమైన రహస్య వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదన్నారు. బసవ పున్నయ్య లాంటి కొందరు బాధ్యతలను విస్మరించడంతో సహా, పోలిట్ బ్యూరో సభ్యులు సమష్టిగా పనిచేయకపోవడం-రణ దివే తో తనకు తలెత్తుతున్న తీవ్ర వి బేధాలు కూడా ఆయన ప్రస్తావించారు.

ఒకదానికి మరొక టి పొంతనలేని తరహా రాజకీయ-సంస్థాగత దృక్ఫదంతో సిపిఎం పోలిట్ బ్యూరో వ్యవహార ధోరణి వుండడం తనకు నచ్చడం లేదని స్పష్టం చేశారు సుందరయ్య గారు. తనకే గనుక కనీసం మూడొంతులమంది కేంద్ర కమిటీ సభ్యుల మద్దతు లభించినట్లయితే, పార్టీ కాంగ్రెస్ నిర్వహించి కొత్త ప్రధాన కార్యదర్శిని-పోలిట్ బ్యూరోను ఎన్నుకోవాల్సిందిగా డిమాండ్ చేసేవాడినని ఆయన తన లేఖలో పేర్కొన్నారంటే, ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవాలి. తనకు నచ్చని అంశాలను బహిరంగంగా లేఖలో పేర్కొనకుండా, రాజీ ధోరణిని అవలంభించినట్లయితే, పది కాలాల పాటు పదవిలో కొనసాగ వచ్చునన్న భావన ఆయనకు ఏనాడు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ, చనిపోయేంతవరకు, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మరణానంతరం సిపిఎం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, సుందరయ్య గారి అనుమానాలు నిజమవుతున్నాయనే అనుకోవాలి.

సుందరయ్య గారైనా, బసవ పున్నయ్యైనా, చండ్ర రాజేశ్వర రావైనా, మోటూరి హనుమంతరావైనా, జిల్లా-రాష్ట్ర స్థాయి నాయకులైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య అయినా, మంచి కంటి రామ కిషన్ రావైనా, బోడేపూడి వెంకటేశ్వర రావైనా.... ... ఆ మాట కొస్తే, అలనాటి కమ్యూనిస్ట్ నాయకులెవరైనా, కేవలం "పార్లమెంట్ దృక్ఫదం" తోను, "ఎన్నికల అవకాశ వాదం" తోను పనిచేయడం గాని, తద్వారా లభించబోయే లాభాలకు ఆకర్షితులవడం గాని జరగలేదు. వాళ్లకున్నదంతా త్యాగం చేశారే గాని, ఆస్తులు కూడగట్టుకోలేదు. ఇప్పుడదొక అలవాటుగా, సాంప్రదాయంగా మారిపోయింది. అలా మారిందని సాక్షాత్తు పార్టీ కాంగ్రెసే అభిప్రాయపడిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

1996 లో పార్టీ రూపొందించిన దిద్దుబాటు ఉద్యమం డాక్యుమెంటుకు కొన్ని సవరణలు చేసి, ఉద్యమాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు, నూతన విధానాన్ని తయారుచేయాలని కోయంబత్తూర్ లో మార్చ్29-ఏప్రిల్ 3, 2008 లో జరిగిన పంతొమ్మిదవ పార్టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ నిర్ణయించిన విధంగా, దిద్దుబాటు చర్యలు పటిష్టంగా అమలు చేయడం జరగలేదని, ఆత్మ విమర్శ కూడా చేసుకుంది పార్టీ నాయకత్వం. ఏవో కొన్ని చెదురు-ముదురు సంఘటనలకు సంబంధించిన తప్పొప్పులను సరిదిద్దడం జరిగినా, ఆశించిన మేర ఫలితం కలగలేదని పార్టీ భావించింది. అసలా మాటకొస్తే, దిద్దుబాటు కార్యక్రమం అమలు ప్రక్రియలో అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులను చేర్చే వ్యవహారంలో బలహీనతలు చోటుచేసుకున్నాయని కూడా పార్టీ అభిప్రాయ పడింది.

గత 12-14 సంవత్సరాల కాలంలో అమలైన దిద్దుబాటు చర్యలు అనుకున్న ఫలితాలు సాధించ లేకపోయిందని పార్టీ భావించింది. సిపిఎం కేడర్లను, లీడర్లను బూర్జువా రాజకీయ పార్టీలనుసరిస్తున్న విధానాలు గతంలోకంటే మరింతగా ప్రభావితం చేస్తున్నాయని, వారు ఆస్తులను సమకూర్చుకోవడంతో పాటు వారి వ్యాపార-వాణిజ్యాలకు తమ రాజకీయ పలుకుబడిని సంధానం చేస్తున్నారని, ఎన్నికలలో పార్టీ పరంగా ధనాన్ని పెద్దమొత్తంలో వ్యయం చేస్తున్నారని, పార్టీ కేంద్ర కమిటీ భావించింది. ఎన్నికల అవగాహన నెపంతో, అభివృద్ధి నిరోధక-బూర్జువా విధాన పార్టీల అలవాట్లను అలవరచుకుంటూన్నారని అగ్ర నాయకత్వం వాపోయింది. 2001 తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్మిక వర్గానికి చెందిన అనేక మందికి పార్టీ పట్ల-ప్రజా ఉద్యమాల పట్ల కనీస అవగాహన లేదని, ఆ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్ లో ప్రమాదం వుందని పార్టీ అభిప్రాయ పడింది. కార్మిక వర్గానికి చెందిన వారి శాతం 75 వర కుండగా, కేవలం 30 శాతం మంది మాత్రమే వివిధ కమిటీలలో స్థానం పొందగలుగుతున్నారని, ఇది కూడా బూర్జువా విధానాలకు అనుగుణంగానే వుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

గత పది-పన్నెండు సంవత్సరాలలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించిన ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం. పార్టీ కేంద్ర కమిటీ ఆత్మ విమర్శ చేసుకున్న పద్ధతి నిశితంగా గమనిస్తే, పార్టీ ఎంత ఊబిలో కూరుకుపోయిందో-పోబోతోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. దిద్దుబాటు ఉద్యమం పరిస్థితులను కొంత మేరకు సరిదిద్దగలదేమో గాని, ప్రక్షాలణ చేయడం సాధ్యమవుతుందా? ప్రశ్నార్థకమే.

Thursday, June 10, 2010

బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి స్టాలిన్ జోస్యం-భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు విప్లవ పాఠాలు : వనం జ్వాలా నరసింహారావు

(జూన్ నెల 12, 13, 14 తేదీలలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
హైదరాబాద్ లో జరుపుకున్న నేపధ్యంలో)

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.

హైదరాబాద్ లో మూడు రోజులు జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సమావేశాలలో సమకాలీన జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు, పార్టీ భవిష్యత్ లో అవలంబించాల్సిన వైఖరికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. యూపీఏ వైఫల్యాలను ఎండగట్టడంలో వామ పక్షాలు విఫలమయ్యాయని, పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వామ పక్షాలకు పెద్ద ఎదురుదెబ్బని-పరాజయంగా భావించాలని, బెంగాల్ అనుభవం దృష్ట్యా కమ్యూనిస్ట్ పార్టీ విధాన-రాజకీయ వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని సమావేశాలను ప్రారంభించిన జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా, మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.

ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919 లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920 న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టకర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. "కోమిన్టిర్న్" సంస్థకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం ఎన్ రాయ్, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి పలువురు కమ్యూనిస్ట్ భావాల నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924 న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్ర కేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడిందనాలి.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925 లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. ఇదిలా వుండగా, వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. కాకపోతే, ప్రభుత్వం అంచనాలకు విరుద్ధంగా, ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933 లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరి కీ కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948 లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి.

చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్ఘోనష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కైు-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అప్పటివరకు అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే, గోవిందన్ నాయర్, ముజఫర్ అహ్మద్ ల నాయకత్వం, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ఒకప్పుడు అదే జోషి నెహ్రూకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆయనను తప్పుబట్టింది పార్టీ. డాంగే వర్గం లేవనెత్తిన "జాతీయ వాదన" కు అనుకోకుండా లోక్ సభలో పార్టీ ఉప నాయకుడు ఏ కే గోపాలన్ నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యకరమైన విషయం. నెహ్రూ చర్యకు తమ పూర్తి మద్దతుంటుందని గోపాలన్ ప్రకటించారు. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపిఐ సెక్రెటేరియట్ లోని ఎనిమిది మంది సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే-గోపాలన్-ముజఫర్ అహ్మద్ లు నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తులు" గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ (అంతకు ముందు లేని పదవి) గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది.

అదే సమయంలో, భారత-చైనా యుద్ధం నేపధ్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. డాంగే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో, మధ్యే మార్గంలో, అతివాద-మితవాద వర్గాలకు సమాన దూరంలో వున్న నంబూద్రిపాద్ లాంటి వారు, అతివాదుల వైపు మొగ్గడానికి దారితీసింది. క్రమేపీ సంభవించిన కొన్ని పరిణామాలు పార్టీ చీలిక దిశగా తీసుకెళ్లాయి. చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. మే నెల 1981 లో కారణాలేమైనప్పటికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరోక్ష వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, ప్రపంచ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డాంగేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" తో విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.

ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి. (End)