Showing posts with label ఇందిరా గాంధీ. Show all posts
Showing posts with label ఇందిరా గాంధీ. Show all posts

Friday, March 1, 2013

చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక: వనం జ్వాలా నరసింహారావు


చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక

వనం జ్వాలా నరసింహారావు

          కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం చిదంబరానికి ఇది ఎనిమిదోసారి. దివంగత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ తరువాత ఇన్ని సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానిదే. భారత దేశ చరిత్రలో తాత్కాలిక బడ్జెట్‌తో కలుపుకుని, ఇప్పటివరకు బడ్జెట్‌ను మొత్తంమీద 82 సార్లు ప్రవేశపెట్టారు. మొట్ట మొదటిసారి నవంబర్‌ 26, 1947 న మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె షణ్ముఖం చెట్టి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. గతంలో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో, ప్రస్తుతం రాష్ర్ట పతిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో సహా, ప్రధాని మన్మోహన్ సింగ్, టిటి కృష్ణమా చారి, ఆర్‌ వెంకట్రామన్‌, హెచ్ ఎం పటేల్‌, జస్వంత్‌సింగ్‌, విపి సింగ్‌, సి సుబ్రమణియం, జాన్‌ మతాయ్‌ లాంటి ప్రముఖులున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, చరణ్‌ సింగ్‌, ఎన్‌ డి తివారీ, మధు దండావతే, ఎస్‌ బి చవాన్‌, సచింద్ర చార్దురి కూడా ఒకసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానిగా ఉంటూ మరోవైపు ఆర్థిక శాఖను అదనంగా నిర్వహించిన సమయంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. అదే విధంగా చరణ్‌ సింగ్‌, మొరార్జీ దేశాయిలు డిప్యూటీ ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. యశ్వంత్‌ సిన్హా, వై.బి చవాన్‌, సి.డి దేశ్ ముఖ్‌ ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

          ఆర్థిక మంత్రి చిదంబరం 2013-14 సంవత్సరానికి రూ. 16, 65,297 కోట్ల వ్యయ అంచనాతో భారీ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 5, 55,322 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 11, 09,975 కోట్లు. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సవరించిన అంచనాలకన్నా 29.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2012-13) బడ్జెట్ వ్యయ అంచనా రూ. 14, 90,925 కోట్లు. సవరించిన అంచనాలో దానిని రూ. 14, 30,825 కోట్లకు కుదించడం జరిగింది. సామాజిక రంగాలకు గత ఏడాదికన్నా కేటాయింపులు పెంచారు. వచ్చే ఏడాది సబ్సిడీ బిల్లును రూ. 2, 57,654 నుంచి రూ. 2, 31,084 కు తగ్గించారు. పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ. 55,000 కోట్లు సమీకరించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ రంగానికి కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాకన్నా 14 శాతం పెంచి రూ. 2, 03,672 కోట్లు ఇచ్చారు. విద్యా రంగానికి రూ. 65,867 కోట్లు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధికి రూ. 11,500 కోట్లు, తాగునీరు, పారిశుధ్యానికి రూ. 15,260 కోట్లు, జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)కు రూ. 14,873 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 27,049 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 7, 00,000 కోట్లకు పెంచారు.

          చిదంబరం తన బడ్జెట్‌లో అదనంగా రూ. 18,000 కోట్ల ఆదాయార్జనకు కొన్ని కొత్త పన్నులు వేశారు. ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 13,300 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని లెక్క చెప్పారు. అందరూ ఆశించినట్లుగా సగటు వేతన జీవికి పన్ను మినహాయింపును పెంచలేదు. అయితే.. రూ. 3లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వార్షికాదాయం గల వ్యక్తులకు ఆదాయ పన్నులో రూ.రెండు వేల రాయితీ ప్రకటించారు. పన్ను కట్టే వారందరి పై మూడు శాతం విద్యా సుంకం కొనసాగుతుందన్నారు. రూ. 50 లక్షలకు మించిన స్థిరాస్థి లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించారు. ఇందులో వ్యవసాయ భూమిని మినహాయించారు. షేర్ల లావాదేవీలపై పన్ను (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్) ను తగ్గించారు. కొత్తగా, వ్యవసాయేతర సరుకుల షేర్ల లావాదేవీల పన్నును ప్రవేశపెట్టారు.

          తొలిసారిగా గృహాలను కొనుగోలు చేసే వారికి 25 లక్షల రూపాయల లోపు రుణంపై లక్ష రూపాయల వడ్డీ రాయితీని ప్రకటించారు. 25 లక్షలకన్నా పైబడిన రుణాలపై 1.5 లక్షల రూపాయల వడ్డీని తొలగిస్తామని తెలిపారు. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని చూపే దేశీయ కార్పొరేట్‌ సంస్థలపై 5 నుంచి 10 శాతం వరకూ సూపర్‌ రిచ్‌ టాక్స్ విధిస్తున్నట్టు తెలిపారు. దేశీయ కంపెనీలతో పోలిస్తే విదేశీ కంపెనీలు ఇప్పటికే అధిక పన్నులను చెల్లిస్తున్నందున వాటిపై సర్ చార్జీని 2 నుంచి 5 శాతానికి పరిమితం చేస్తున్నట్టు వివరించారు. డివిడెండ్‌ పంపిణీ పన్నును 5 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. 50 లక్షల రూపాయల దాటిన గృహాల బదిలీపై ఒక శాతం వారసత్వ పన్ను విధిస్తున్నట్టు చిదంబరం తెలిపారు.

          పన్ను చెల్లింపుదారులందరిపైనా 3 శాతం విద్యా సుంకం వసూలు కొనసాగుతుందని, కొత్తగా ప్రకటించిన సర్‌ చార్జీలన్నీ 2013-14లో మాత్రమే అమలవుతాయని తెలిపారు. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ద్వారా అదనంగా 13,300 కోట్లు, పరోక్ష పన్నుల నుంచి 4,700 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ‘విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీని ఆదర్శంగా తీసుకుని సర్‌ చార్జ్‌ భారాన్ని ధనవంతులపై మోపాలని భావిస్తున్నాను. ఈ స్వల్ప భారాన్ని ఈ ఒక్క సంవత్సరమూ భరించేందుకు వారు ఆనందంగా అంగీకరిస్తారని భావిస్తున్నాఅని చిదంబరం వ్యాఖ్యానించారు. పొగ తాగేవారిపై ప్రతియేటాలానే ఈ సంవత్సరం కూడా ఎక్సయిజ్‌ సుంకాల భారాన్ని చిదంబరం మోపారు. సిగరెట్లు, సిగార్స్‌, చిరోట్స్‌, సిగారిల్లోస్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని 18 శాతానికి పెంచుతున్నట్టు వివరించారు. ఎసి రెస్టారెంటులపై సుంకాలను పెంచారు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే వారు 50 వేల రూపాయల వరకూ బంగారు ఆభరణాలను ఎటువంటి సుంకాలు చెల్లించకుండా తీసుకురావచ్చని, అదే మహిళలైతే లక్ష రూపాయల విలువైన ఆభరణాలు తెచ్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయేతర ఉత్పత్తుల దిగుమతిపై ప్రస్తుతమున్న సుంకాలే కొనసాగుతాయని చిదంబరం స్పష్టం చేశారు.

          వెయ్యి కోట్ల రూపాయలతో నిర్భయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బ్యాంకుకు ఈ బడ్జెట్‌లో చోటు లభించింది. మహిళల కోసం మహిళలచే నిర్వహించ బడేలా మహిళా బ్యాంకును 1000 కోట్ల రూపాయల ప్రాధమిక మూలధనంతో ప్రారంభించనున్నట్టు చిదంబరం ప్రతిపాదించారు. ఈ బ్యాంకుల నుంచి మహిళా రుణాలు, మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలకు చేయూత వంటి కార్యకలాపాలు సాగిస్తామని తెలిపారు. దేశంలోని మహిళల భద్రత, సాధికారతకు ఈ నిధిని వినియోగిస్తామని ఆయన తెలిపారు. దీంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు.

          ఒక్క సారి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విశ్లేషణ చేస్తే కొన్ని నిజాలు బయటపడ్తాయి. కలసిరాని వ్యవసాయంతో అనునిత్యం అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వాటిని తీర్చే దారిలేక, సాగు కొనసాగించలేక, సాయం కోసం వేచి చూస్తున్న రైతాంగానికి అంతంత మాత్రం ఊరట కూడా లభించకపోవడం దురదృష్టం. ఆకాశాన్నంటుతోన్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయటం మాట అటుంచి, వాటి దుష్ఫలితాలను భరించాల్సిన సగటు వేతన జీవిని సంతోషపెట్టేందుకు చిదంబరం చేసిన ప్రయత్నం ఏమీలేదు. పేదరికంలో మగ్గుతూ, ఒళ్లు హూనం చేసుకుని, ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేని, పేద ప్రజలకు ఎలాంటి ఆధారమూ చూప లేదు. కంటి తుడుపు గా, ఆహార భద్రత కోసం ఓ పది వేల కోట్లు పక్కన పెడుతున్నామన్న ప్రకటన మాత్రం చేశారు. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు అవసరమని గీతా బోధన చేసారు. వివిధ శాఖలకు, వివిధ రంగాలకు కేటాయింపులను పెంచడమై తే చేసారు కాని, కచ్చితంగా ఇలా చేయబోతున్నా మన్న హామీ కనిపించలేదు. మహిళా లోకానికి ఆదరణ చేసీచేయనట్లు, నామ్‌కే వాస్తే అన్నట్టు ప్రకటించారు. రూపు-రేఖలు లేని నిర్భయ నిధి, మహిళా బాంక్ ప్రతిపాదనలు కంటి తుడుపువే! ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క తిప్పలుపడుతూ ఆగ్రహావేశాలతో ఆవేదనతో అవకాశాల కోసం నిరీక్షిస్తున్న యువ జనానికి ఎలాంటి ఆశా లేదు. ‘‘అన్ని వర్గాల సుస్థిరమైన అభివృద్ధికి దోహదం చేసే అధిక వృద్ధి మా లక్ష్యం.. అదే మూల మంత్రం...’’ -అంటూ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థికమంత్రి.. ఆద్యంతం మాటల గారడితో మురిపించారు. కానీ చేతల్లో చేసింది మాత్రం శూన్యం! చివరాఖరికి.. ‘నగదు బదిలీనే నమ్ముకున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నగదు బదిలీని యూపీఏ పదవీ కాలం ముగిసే లోగా దేశమంతటా విస్తరించి.. ‘ఆధార్కు అనుసంధానించే పని పూర్తిచేస్తామని సెలవిచ్చారు!

ఒకవైపు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. మరొక వైపు ఏడాదిలో ఎన్నికలు.. ఒకవైపు ఆర్థిక సంస్కరణాభిలాషి ప్రధాని మన్మోహన్ సింగ్!, మరోవైపు ఆమ్ ఆద్మీమంత్రం పఠించే మేడమ్ సోనియాగాంధీ!, ఎన్నికల వరాలు ప్రకటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం!, ఆర్థిక సంక్షోభం ముదరకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అగత్యం! వీటి మధ్య సమన్వయం సాధించడానికి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విశ్వ ప్రయత్నం చేశారు. ఈ తక్కెడలో ఎటు మొగ్గాలో తెలియక తర్జనభర్జన పడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించే భారీ సంక్షేమ పథకాలేవీ లేవు. అలాగని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే పెద్ద చర్యలూ లేవు! కవితలు, సూక్తులు చెప్తూ.. సున్నితమైన అంశాలపై బరువైన మాటల మాయాజాలంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు!! మరో ఏడాదిలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. మహిళలు, యువత, పేద ప్రజల వర్గాలను ఆకట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నోబెల్ బహుమతి గ్రహీత-ఆర్థిక శాస్త్ర వేత్త జోసెఫ్ స్టీగ్లిట్జ్, తిరువళ్లువర్, స్వామి వివేకానందల హితోక్తులను ప్రస్తావించటం జరిగింది. ప్రసంగం ఆరంభంలోనే, అన్ని వర్గాల సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఆర్థికవృద్ధి తన బడ్జెట్ మూల మంత్రం అని అన్నారు. సమానత్వం సాధించటమన్న ఒత్తిడి నైతిక బాధ్యతగా తనపై ఉందని, ఐతే, సుస్థిర అభివృద్ధి కావాలంటే అదికూడా అవసరం అనీ అన్నారు. "ఒక దేశపు అత్యంత ముఖ్యమైన వనరు ఆ దేశ ప్రజలే" అన్న స్టీగ్లిట్జ్ వ్యాఖ్యను ఉటంకించారు. ప్రసంగాన్ని ముగించే సమయంలో, తన అభిమాన తమిళ కవి తిరువళ్లువర్ రచనల నుంచి "మనసు నిద్రాణస్థితిలో లేకుండా, దృఢచిత్తంతో ఏది సరైనదని కన్ను విస్పష్టంగా గుర్తిస్తుందో.. మనిషి దానిని నెరవేర్చాలి" అనే పంక్తులను చదివారు. సాధారణంగా చిదంబరం బడ్జెట్ ప్రసంగంలో మూడు నాలుగు సార్లైనా తమిళ కవి తిరువళ్లువర్ పలుకులు వినిపించాల్సిందే! కానీ... ఈసారి ఆయన ఒక్కసారి వినిపించారు. వివేకానంద వాణినీ గుర్తు చేశారు. End

Thursday, September 15, 2011

నాయకుడెవరు - మోడీనా, రాహులా?: వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (16-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఎవరు నాయకులు? నాయకత్వ సామర్ధ్యాలేమిటి?, ప్రదర్శితం కాని రాహుల్ నాయకత్వ లక్షణాలు, ప్రశంసలనందుకున్న వరుణ్‌ గాంధీ ప్రసంగం, మోడీ, రాహుల్‌లలో నాయకుడెవరైనా కావచ్చు, కాకపోవచ్చు, నిర్ణేతలు ప్రజలే! ...ఎడిటర్

అందరికీ నాయకత్వ లక్షణాలుండాలని లేదు. నాయకత్వ లక్షణాలు లేనంత మాత్రాన మంచివారు కాదని కాని, గొప్ప వారు కాకూడదని కాని అనలేము. మంచితనం వేరు, నాయకత్వం వహించడం వేరు. నాయకత్వం కొందరికి పుట్టుకతో అబ్బితే, మరి కొందరికి వయసు పెరిగినా కొద్దీ ఆ లక్షణాలు రావచ్చు. ఎలా-ఎప్పుడు రావడం కంటే, వచ్చిన వాటిని ఆచరణలో నిరంతరం పెట్టగలిగే వారే శాశ్వతంగా నాయకులుగా మిగిలి పోతారు. కుటుంబ నేపధ్యంతో కొందరు హఠాత్తుగా నాయకులుగా ఎదగ వచ్చు. నాయకులైన తర్వాత స్వయం ప్రతిభతో సమర్థవంతంగా ముందుకు సాగవచ్చు. ఇక కొందరికి, ఎన్ని విధాల నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎన్ని లభించినా, ఉపయోగించుకోలేక మరో నాయకుడి కిందనే పని చేయడానికి ఇష్ట పడతారు. రాజకీయాల విషయానికొస్తే, వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, (అవినీతికి దూరంగా) మంచి-మంచి అలవాట్లతో, ఫలవంతమైన సహాయాన్ని తన పార్టీకి-రాష్ట్రానికి-దేశానికి అందించగల వారే నాయకులనిపించుకోగలుగుతారు. వీరిలో రక-రకాల స్థాయికి చెందిన వ్యక్తులుంటారు. అందరు, అన్ని రంగాలలో రాణించ లేరు.

"మొదటి స్థాయి (కింది) యోగ్యత గల స్వయం సాధకులు", "రెండో స్థాయికి చెందిన బృందంలోని భాగస్వామ్య సభ్యులు", సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల శక్తిగల వారై వుంటారు. "మూడో స్థాయికి చెందిన మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వారై వుంటారు. ఇక "నాలుగో స్థాయి సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. ఇలాంటి వారి నాయకత్వ లక్షణాలను ఉమ్మడిగా కలిగుండి, వీరందరిని, ఏఏ పనికి-ఎవరిని-ఎప్పుడు-ఎలా ఉపయోగించుకోవాలో, లక్ష్యాలను చేరుకోవడానికి-అధిగమించడానికి సరైన స్థానంలో ఎవరెవరిని-ఎంత మేరకు నియమించాలో నిర్ణయించగలిగేది, కేవలం "ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి" మాత్రమే. వీరు తమ వ్యక్తిగత నమ్రతలను, అణకువలను వృత్తి పరమైన కార్య సాధనతో జోడించి, ఒక రకమైన అసంభవ మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థానాన్ని చేరుకోగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. అలాంటివారే, రాజకీయాలలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర-జాతీయ స్థాయి అధ్యక్షులుగా, మంత్రులుగా-ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా-ప్రధాన మంత్రిగా, "స్వయం ప్రతిభతో" ఎదగ గలుగుతారు. వారసత్వం గానో, అయాచితంగా నో, రాజీ అభ్యర్థిగా నో, తాత్కాలిక నాయకుడుగా నో, ఒకరి త్యాగ ఫలితంగానో, "మధ్యంతర ఏర్పాటు" గానో, ఇలాంటి ఉన్నత స్థానాలకు చేరుకున్న వ్యక్తులకు, ఆ స్థానాలు తాత్కాలికంగానే మిగిలిపోతాయి తప్ప, శాశ్వతం కావు. ఇవన్నీ అనుభవంలో, మన దేశంలో-ఇతర దేశాలలో గమనిస్తూనే వున్నాం.

ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆమె అప్పగించిన నలుగురిలో తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే, సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం మొదలెట్టింది. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో, అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి తిరిగొచ్చారని భావించారు పలువురు. ఇక ఆయన భజన బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్" తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను, రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం. హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా, లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించు తూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.

మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. ఒక వేళ అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం, "దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!

ఈ నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఇటీవల. ఇదే సమయంలో యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది. ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో సహా చర్చలకు నడుం బిగించారు. వీరిద్దరిలో ఎవరు ప్రధాని అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!

జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్ ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ, తప్పో-ఒప్పో, అప్పటికే ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!

తన తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్ గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం, అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్ గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు. అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా, పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్ తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పన్నెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత మాత్రాన నాయకులు కాకుందా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం కలిగుండాలని లేనే లేదు.

ఇన్ని తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే, ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే, ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే, కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!

సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని వుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!

Saturday, May 21, 2011

యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు:వనం జ్వాలా నరసింహారావు

సాఫల్యాలతో సార్థక పాలన

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (24-05-2011)


డాక్టర్ మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్లయింది. భారత దేశ చరిత్రలో, స్వాతంత్ర్యం వచ్చిన సుమారు ముప్పై సంవత్సరాల అనంతరం, అలనాటి జనతా పార్టీ సారధ్యంలో, ప్రప్రధమంగా కాంగ్రేసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది. ఆ తర్వాత, ఓటమి పాలైన రెండున్నర ఏళ్లకే, అదే పూర్వ శోభతో కాంగ్రెస్ పార్టీని, మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కింది. ఆమె హత్యానంతరం, రికార్డు స్థాయిలో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధి. తదనంతరం సంభవించిన-సంభవిస్తూ వస్తున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో, అధికారం చేపట్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలే కాని, ఏ ఒక్క రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి మాత్రం కాదు. రాజీవ్ హత్యానంతరం ప్రధానైన పీవీ నరసింహారావు సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకి తొలుత లోక్ సభలో మెజారిటీ లేదు. అలానే ఆయన తర్వాత ప్రధానైన వాజ్ పాయే సారధ్యంలోని బీజేపీకి సొంత మెజారిటీ లేదు. కేంద్రంలో అధికారం దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ పార్టీ చేరుకోలేని పరిస్థితుల్లో, పీవీ-కేసరిల తర్వాత, పార్టీ పగ్గాలను చేపట్టిన సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర 2004 లో ప్రారంభమైంది. రాజీవ్ హత్యానంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని సోనియా గాంధీ 1996 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంభవించిన పరాజయం తర్వాత, పీవీ వారసుడు కేసరి పార్టీకి న్యాయం చేకూర్చలేడని భావించి పదవి స్వీకరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లోక్ సభలో పార్టీ బలాన్ని పెంచగలిగినా, ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేయలేకపోయింది కాంగ్రెస్.

ఆ నేపధ్యంలో 2004 లో జరిగిన ఎన్నికలలో 145 స్థానాలు గెలిచి, తన ప్రత్యర్థి ఎన్డీయేకు ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యాబలం లేదని తేలిన తర్వాత, "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" ఏర్పాటు చేసింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి 2004 ఎన్నికలలో ఎన్డీయే పక్షాన లోక్ సభకు గెలిచింది 169 మంది సభ్యులు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, తన సభ్యులతో సహా-తన ఆలోచనా ధోరణికి దగ్గర లో వున్న, వివిధ పార్టీల నుంచి లోక్ సభకు గెలుపొందిన, 222 మందితో 59 మంది సభ్యుల వామ పక్ష కూటమిని కలుపుకుని తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. "కామన్ మినిమమ్ ప్రోగ్రాం" పేరుతో, సంకీర్ణ భాగస్వామ్య పార్టీలందరికీ ఆమోద యోగ్యమైన ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది యూపీఏ.

వామ పక్షాలు ఒకానొక సందర్భంలో మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో, సమాజ్ వాది పార్టీ, బహు జన సమాజ్ పార్టీలు సమయానుకూలంగా మద్దతిచ్చి యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా కాపాడాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, యూపీఏ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టి, తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగును యూపీఏ పక్షాన ప్రధాన మంత్రిగా ప్రతిపాదించారు. పదమూడవ భారత ప్రధానిగా 2004 లో బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ సారధ్యంలోని తొలి యూపీఏ ప్రభుత్వం సాధించిన సాఫల్యాలు, ఐదేళ్ల అనంతరం 2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, తిరిగి యూపీఏ ను అధికారంలోకి వచ్చేందుకు దోహద పడ్డాయి. 2004 ఎన్నికల అనంతరం ఏర్పాటైన "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" భాగస్వామ్య పక్షాలు, ఈ సారి 2009 లో జరిగిన ఎన్నికలలో, ఉమ్మడిగా పోటీ చేసి, సంఖ్యా పరంగా తమ బలాన్ని పెంచుకుని, గతంలో కంటే, 61 స్థానాలను అధికంగా గెలుచుకుని, మొత్తం 262 సభ్యుల బలీయమైన కూటమిగా విజయ పథాన నిలిచింది. భారత దేశంలో, జవహర్లాల్ నెహ్రూ తర్వాత, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మరో మారు ప్రధాని కాగలిగిన రెండో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ రికార్డు సాధించారు. మే నెల 22, 2009 , సరిగ్గా రెండేళ్ల క్రితం, రెండవ పర్యాయం ప్రధాన మంత్రిగా, యూపీయే ప్రభుత్వ సారధిగా, బాధ్యతలు చేపట్టారు. సుస్థిర ప్రభుత్వానికి బాటలు మరో మారు వేశారాయన.

మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం తొలి విడత అధికారంలో వున్న మొదటి ఐదేళ్ళలో, పాలనా పరమైన సంస్కరణలు, సమాచార హక్కు చట్టం, పనికి ఆహార పథకం లాంటివి ప్రవేశ పెట్టి తన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టారు. ఐనా, ఏ నాడు, తన ప్రభుత్వం సాధించిన దాన్ని, అతిగా చెప్పే ప్రయత్నం చేయలేదు. అలానే, రెండో విడత అధికారం చేపట్టి ఏడాది నిండిన సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను, తక్కువ చేసి చూపుతూ, చేయాల్సింది ఇంక ఎంతో ఉందన్నారు. "సముచితమైన సాఫల్యాలను" సాధించిందని మాత్రమే అన్నారు ప్రధాని. తాను సాధించ దల్చుకున్నది ఎంతో మిగిలి పోయిందని, తన సాఫల్యాలను చారిత్రక కారులు ఎప్పుడో ఒకప్పుడు సరైన రీతిలో అంచనా వేస్తారని కూడా అన్నారాయన.

మన్మోహన్ సింగ్ ఎంత సవినయంగా తన ప్రభుత్వం గురించి అన్నప్పటికీ, యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ అంచనా వేయలేం. విదేశాంగ విధాన కానీయండి, ఆర్థిక పరమైన నిర్ణయాలు కానీయండి, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పే విషయమే కానీయండి, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వారి విషయంలో, సమతుల్యం పాటిస్తుందనడానికి నిదర్శనం తొలి విడత-మలి విడతలలో ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి". అందులోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం.

గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో పని చేసిన నాటి ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. ఆ మాటకొస్తే, పీవీ మంత్రివర్గంలో మన్మోహన్ నాటిన ఆర్థిక సంస్కరణల విత్తనాలు, మొక్కలై-వృక్షాలై, యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో భారతావనికి ఆ ప్రభావం పడకుండా చూడడానికి, యూపీఏకు ముందున్న ఎన్డీఏ సారధి వాజ్ పాయే కూడా కారణమనాలి. ప్రపంచం దృష్టిలో ఆర్థిక పరంగా రెండు దశాబ్దాల క్రితం భారత దేశంపై నున్న చులకన భావన స్థానంలో, అత్యంత గౌరవ స్థానం లభించడానికి కూడా మన్మోహన్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వమే కారణం. అలానే ప్రపంచ వర్తక-వాణిజ్య రంగంలో కూడా చక్కటి పురోగతి సాధించింది గత ఏడాది-రెండేళ్లలో. స్టాక్ మార్కెట్ పతనం దరిమిలా, దాని దుష్ప్రభావం ఏ మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా కాపాడిందీ ప్రభుత్వం.

మన్మోహన్ సింగ్ సారధ్యంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను-సాధించలేక పోయిన వాటిని గురించి ప్రతి పక్షాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే, బహుశా, రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సభ్యులనుద్దేశించి, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్తూ, ప్రధాని చేసిన ప్రసంగంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చి ఓటర్లు గెలిపించ తల్చుకోనప్పుడు, సంకీర్ణాలు తప్పవు. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.

రాష్ట్రపతి ప్రసంగంలో లేవనెత్తిన అంశాలను-ప్రతిపక్ష నాయకుల విమర్శలకు అనుసంధానం చేస్తూ, తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని, పరోక్షంగా, భవిష్యత్ లో యూపీఏ చేయబోతున్న వాటితో కలిపి చెప్పారు మన్మోహన్ సింగ్. సామాన్యులు-సగటు మనిషి, అధిక ధరల తాకిడి తట్టుకోడానికి ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడం, ప్రజా జీవితంలో సత్య నిష్టను-న్యాయ బుద్ధిని ప్రోత్సహించడం, బీద-సాద-పేద-బలహీన-వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధిలో తమ వంతు వాటా పొందేలా ఆర్థికాభి వృద్ధి సాధించడం, దేశ సమగ్రత-సమైక్యత విషయంలో అప్రమత్తంగా వుండడం, అంతర్జాతీయ స్థాయిలో భారత జాతి గొంతు గట్టిగా వినిపించేలా విదేశాంగ విధానం రూపొందించడం యూపీయే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం, తొలి విడత-మలి విడతలలో సాఫల్యం సాధించిందని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మాటల్లోనే, యూపీఏ సాధించిన ప్రగతిని అవగాహన చేసుకోవచ్చు.

అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, వారికి-యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు కూడా. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది.

పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. జాతీయ ఆరోగ్య బధ్రతా బిల్లు దీని కొరకే తెచ్చే ఆలోచనలో వుంది యూపీఏ ప్రభుత్వం. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.

సంకీర్ణ ధర్మం అడపదడప యూపీఏ ప్రభుత్వాన్ని ఊగిసలాటలో పడ వేసినప్పటికీ, మొదటి విడత లాగానే, గత రెండేళ్లలో గణనీయమైన సాఫల్యాలను సాధించిందనడంలో అతిశయోక్తి లేదనొచ్చు. యూపీఏ విజయాల వెనుక ప్రధాని మన్మోహన్ సింగ్, చైర్ పర్సన్ సోనియా గాంధి, సంకీర్ణ భాగస్వామ్య పక్షాల నాయకులు, బాధ్యతాయుతమైన ప్రతి పక్షాలున్నాయని చెప్పాలి.

Saturday, April 30, 2011

ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం

వనం జ్వాలా నరసింహారావు

ఇటీవలి కాలంలో, "అపనమ్మకం" అనే ఆయుధం అలవోకగా వాడకంలో కొచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంత కంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరి లోను, ప్రత్యేకించి రాజకీయ నాయకులలోను బలంగా నాటుకుని పోయింది. అకార క్రమంలో అగ్రభాగాన వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఆది మానవుడు చేతికి దొరికిన దాన్నే తనకు రక్షణగా ఉపయోగించుకుంటే, పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారడంతో, అలా రక్షణకు వాడిన వాటినే, ఇతరులపై దాడికి ఉపయోగించుకో సాగారు. మరి కొంతకాలం గడిచాక, వాటినే పదునైన ఆయుధాలుగా మలచుకోవడం మొదలైంది. ఇలా ఆరంభమైన ఆయుధాల వాడకం, పరిణామ క్రమంలో, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో, తుపాకులుగాను-ఫిరంగులగాను, దరిమిలా రసాయన-అణ్వాయుధాల వాడకం వరకూ పోయింది. ఆ తర్వాత ఆంత్రాక్స్...అలాంటి మరి కొన్ని మాధవ మేధస్సులోంచి బయటకొచ్చాయి.

ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి తన రక్షణకోసం-ఎదుటివారిని దెబ్బతీయడానికి ఆది మానవుల కాలం నుంచి మొదలైన ఆయుధాల వాడకం, నాగరికత పెరిగే కొద్దీ, దేశ దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే దాకా పోయింది. ఇవన్నీ ఒక వైపు ఇలా కొన సాగుతూంటే, ఆధిపత్య పోరులో భాగంగా, అధికారం కొరకు, వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి వాడే ఆయుధాలు, వ్యూహాత్మకమైన ఆయుధాలు కా సాగాయి. వాటి రూపకర్తలు ప్రజాస్వామ్యం ముసుగులో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ నాయకులు. మొదట్లో ఆ వ్యూహాలు, ప్రజలకు తామేం మంచి చేయదల్చు కున్నామో తెలియచేసే "వాగ్దానాలు" మాత్రమే. అలా చెప్పే వారిలో నిజాయితీ ప్రతి బింబించేది మొదట్లో. క్రమేపీ, చేస్తామని మభ్య పెట్టే వాగ్దానాలు మొదలయ్యాయి. సమాంతరంగా, ఎదుటి వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చాలా కాలం వరకు కొంతలో కొంత నిజాయితీగానే, ఒకరిపై మరొకరు ప్రచారాలు చేసుకునే వారు. అవన్నీ పనికి రాని రోజులొచ్చాయిప్పుడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, వారి నుంచి పాఠాలు నేర్చుకుంటూ-వారినే ఆదర్శంగా తీసుకుంటున్న అనేక మంది, ఎదుటి వారిని దెబ్బ తీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం "అప నమ్మకం". తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటు వ్యాధి అన్ని రంగాల్లోకి పాక సాగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంతకాలం నుంచి, సాగుతున్న మాటల యుద్ధమే.

పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం, సినిమా హీరో నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించి, తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీదుల్లో అవమానం పాలైందనీ-ఆ అవమానానికి ప్రతీకారంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోను-దేశంలోను ఓడించాలని ఇచ్చిన పిలుపుకు తొలుత ఆయన స్వరాష్ట్రంలోను, అనంతరం దేశ వ్యాప్తంగానూ స్పందించిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు (ఆంధ్ర ప్రదేశ్ తో సహా) రాష్ట్రాలలోను, అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలడం గత శతాబ్ది డబ్బై దశకంలో మొదలైంది. రాష్ట్రాలలో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971 లో కాంగ్రెస్ పార్టీని విజయ పధంలో నడిపించిన ఇందిరా గాంధిని ఓడించడానికి, అప్పటి రాజకీయ పార్టీలు, ఎదురు దెబ్బ తీశారే తప్ప, వెన్ను పోటు రాజకీయాలను కాని, అవాస్తవాలు ప్రచారం చేయడం కాని చేయ లేదు. ఆమె చేసిన "తప్పు" నే తమ ఎన్నికల ప్రధానాంశంగా ఉపయోగించుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన "అవినీతి వ్యతిరేక ఉద్యమం" లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, ఆబాల గోపాలాన్ని అందులో పాల్గొనే లా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఇందిరా గాంధి పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా, ఎందరో, ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఇందిరను ఓడించారు. ఆమె చేసిన తప్పులను మాత్రమే ఎంచి చూపారు కాని, ఆమె చేయని-ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై "అప నమ్మకం" కలిగే ప్రయత్నం బహుశా ఎవరూ చేయలేదు.

1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నాయకులు ఉపయోగించిన మరో బ్రహ్మాస్త్రం "నియంతృత్వమా-లేక-ప్రజాస్వామ్యమా" కోరుకొమ్మని ఓటర్లను అడగడం. ఎమర్జెన్సీకి ముందు-ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు, కారణాలు సహేతుకమైనా-కాక పోయినా, ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు చోటు చేసుకున్న విషయం, ఆమెకు అతి సన్నిహితంగా మెలిగిన వారు సహితం ధృవీకరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాల పిలుపుకు స్పందించిన ఓటర్లు, "ప్రజాస్వామ్యానికి" ఓటే సారు. జనతా పార్టీని గెలిపించారు. రెండేళ్ల లోనే ప్రజాస్వామ్యానికి సరైన సారధులు "జనతా పార్టీ నాయకులు" కానే కాదని, కాలేరని నిరూపించడానికి ఇందిరకు అవకాశం దక్కింది. తనపై నమ్మకం పెట్టుకునే దిశగా దరిమిలా వచ్చిన మధ్యంతర ఎన్నికలలో వాగ్దానాలు చేసిందే కాని, ప్రత్యర్థులపై అపనమ్మకం అస్త్రాన్ని వాడుకోలేదు. జనతా పార్టీ అప్పట్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమయిందని ఓటర్లకు తెలియచేసే ప్రయత్నం మాత్రం చేసింది ఇందిరా గాంధి.

ఇందిరా గాంధీనైతే ఓడించ గలిగారు కాని, నిల దొక్కుకోలేక పోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. ఎన్నికలొచ్చాయి. ఇందిరా గాంధి వ్యూహాత్మకంగా, "సుస్థిరతా? అస్థిరతా" అన్న నినాదం లేవనెత్తిందే కాని, "అప నమ్మకం" ఆయుధాన్ని వాడ లేదు. శత్రువును తన బలంతోను, వారి బలహీనతల తోను, గెలిచిందే తప్ప, వాళ్లకు అపవాదు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే, అయిదేళ్ల తర్వాత, అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్ టీ రామారావు, ఇందిరా కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీశాడే కాని ఆమెపై ప్రజల్లో "అప నమ్మకం" ప్రచారం చేయలేదు. తన వ్యతిరేకులతో ఆమె జత కట్టిందని అసత్య ప్రచారాలు చేయలేదు. "మాచ్ ఫిక్సింగ్" అన్న పదాలు ఆమెకు వ్యతిరేకంగా వాడిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్ధతి, మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇటీవలి కాలం వరకూ అవలంబిస్తూనే వున్నాయి. కాని కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైంది, ప్రత్యర్థిని కించపరచడం-అసత్యాన్ని ప్రచారం చేయడం-ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వారిపై ఓటర్లలో "అప నమ్మకం" కలగ చేయడం అని గ్రహించాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఎవరు కూడా ఒకరికి మరొకరు తీసిపోరనే చెప్పాలి.

ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం "మాచ్ ఫిక్సింగ్". క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల-కోచ్ ల-కెప్టెన్ల ప్రతిభ కాదని, ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని, ప్రచారాలు మొదలయ్యాయి. దాన్నే "మాచ్ ఫిక్సింగ్" అని ముద్దుగా పిలువ సాగారు. అదొక అ నైతిక ఒప్పందంగా ముద్ర పడింది. నిజానికి అలా జరిగుంటే అది అ నైతికమే. ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా. కాకపోతే, ఎప్పుడు ఏ మాచ్ ఏ టీం గెలిచినా, దానికి ఏదో రకమైన "మాచ్ ఫిక్సింగ్" కారణం అనే "అప నమ్మకం" ప్రచారంలోకొచ్చింది. ఆ తరహా "అప నమ్మకం" ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే, గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం "మాచ్ ఫిక్సింగే మో!" అన్నంత "నమ్మకం" గా భావించడం మొదలైంది. ఇక రాజకీయ నాయకులు ఆ ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం.

ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ ఆర్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, ప్రస్తుతం జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్" అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో, ప్రచారం తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. ఇటీవలి కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు.

ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా. దీన్ని అరికట్ట లేక పోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించే స్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటి వారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్య పోనక్కర లేదు. తస్మాత్ జాగ్రత్త!

Tuesday, March 8, 2011

"తెలంగాణ" వైకుంఠ పాళి": వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన అధినేత్రి వ్యూహం;
సొంత పార్టీ వారే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న వైనం
శాసన సభలోనూ అదే పరిస్థితి;అప్పుడే తెలంగాణ ఏర్పడే పరిస్థితి లేదన్న సంకేతం
మళ్ళీ మొదటికి వచ్చిన ఆట!;తెలుగు దేశంలో మరో కుంపటి

చిన్నతనంలో వైకుంఠపాళి ఆట ఆడనివారు అరుదుగా వుంటారు. ఆ ఆటనే "పరమపద సోపాన పటం" అని కూడా కొందరనేవారు. ఇక ఇప్పటి ఆంగ్ల మాధ్యం పిల్లలు "పాముల-నిచ్చెనల" ఆట అంటున్నారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది ఆడడానికి అందరికీ ముఖ్యంగా కావాల్సింది, ఒక అట్టపై కాని, లేదా చిన్నగా ఉండే బోర్డుపై కాని, రంగు రంగుల గళ్ళతోనన్నా-నలుపు, తెలుపు రంగులలో నన్నాతయారు చేసిన పటం. ఆ పటం పెట్టడానికి పావులు-ఆడడానికి గవ్వలు. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డు వరుసకు 10 గళ్ళ చొప్పున, నిలువుగా పది వరుసలు వుంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. పావు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, దాని నోట బడి మింగడంతో, ఆ గడి నుంచి పాము తోక ఉన్న కింది గడి దాకా పావు దిగుతుంది. పావు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, అది నిచ్చెన ఎక్కి, పై చివర వరకూ చేరుకోవచ్చు. పాము నోట్లో పడకుండా-దాటుకుంటూ, నిచ్చెనలు ఎక్కు కొంటూ, 100వ గడికి ముందుగా చేరుకున్నవారు ఆటలో విజేత. నూరవ గడికి చేరుకునే ముందు కూడా, చిట్ట చివరి గడి వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పాముండే ఏర్పాటు వైకుంఠపాళి ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడడం తెలిసిన ప్రతి వారికీ, అందునా చిన్నా-పెద్దా పాముల బారిన పడి ఓడిన వారికి, చాకచక్యంగా ఆడి నిచ్చెనలను అధిరోహించుకుంటూ పైకెదిగి, గెలవబోతున్నామనుకున్న సమయంలో, "అతి పెద్ద పాము" నోట బడి, మళ్ళీ ఆట మొదలెట్టిన వారికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడొస్తుందో ఊహించడం అంత కష్టం కాదు. బహుశా గత కొద్ది రోజుల పరిణామాలు నిశితంగా గమనించినవారికి, చిన్ననాటి పరమపద సోపాన పటం ఆట జ్ఞప్తికి వస్తుండవచ్చు.

డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లే అని భావించారందరూ. 1971 సార్వత్రిక ఎన్నికల్లో, అలనాటి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులుగా పోటీచేసిన వారిలో, దాదాపు అందరూ గెలిచినా, కించిత్తైన చెక్కు చెదరని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, "తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు" అని ఎంత స్పష్టంగా ప్రకటించిందో, అదే స్పష్టతతో, "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ" ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు చిదంబరం. ఇందిరా గాంధి ప్రకటన, వైకుంఠపాళి ఆటలో గెలిచేవారి తరహాలో గవ్వలు విసిరి-పావులు కదిపి, పాము నోట్లో పడకుండా నిచ్చెనలెక్కి, పెద్ద పామును కూడా తప్పించుకుని విజేతగా నూరవ గడికి చేరుకున్న రీతిలో వుంటే దానికి పూర్తి భిన్నంగా వుంది చిదంబరం ప్రకటన. ఒక ఔచిత్యం లేకుండా చిదంబరం చేసిన ప్రకటన, గవ్వలు విసరడం చేతకాని-పావులు కదపడం రాని ఆటగాళ్లు పరమపద సోపాన పటంలో పాము నోట్లో తలదూర్చిన వారి రీతిలో వుంది. చిదంబరం నిర్ణయం దరిమిలా చోటు చేసుకున్న సంఘటనలు, ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అని ఆందోళన చేసిన వారికి కాని, సమైక్యాంధ్రే వుండాలని కోరుకుంటున్న వారికి కాని అనుకూలంగా లేవు.

తాను ఆడుతున్నది రాజకీయ వైకుంఠపాళి అని, జాగ్రత్తగా పావులు కదపకపోతే, పరిణామాలు తీవ్రంగా వుంటాయని చిదంబరం గ్రహించకపోవడం దురదృష్టం. ఇక ఆ తర్వాత, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడంతో, తానేదో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నానన్న భ్రమలో పడ్డారాయన. మరో ఏడాదిపాటు తెలుగు వారితో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చని భావించాడు. ఆయన భావనకు అనుగుణంగానే, రాష్ట్రంలో, కమిటీ నివేదిక వచ్చేంతవరకు, చిదంబరం పావులు పరమపద సోపాన పటంపైన నిచ్చెనలెక్కుకుంటూ పోయాయి. డిసెంబర్ 31, 2010 వరకు-ఆ తర్వాత బహుశా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే దాకా, నిచ్చెనలను అధిరోహించిన పావు "పెద్ద పాము నోట్లో పడింది". మళ్లీ కధ మొదటికొచ్చింది. ఇందిరా గాంధీ తన రాజకీయ చతురతతో, తెలంగాణ ప్రజా సమితి టికెట్ పై పోటీ చేసి గెలిచిన వారందరినీ, దాని నాయకుడు మర్రి చెన్నారెడ్డితో సహా, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాగలిగితే, చిదంబరం వ్యూహం-ఆయనకు అండగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ వ్యూహం, వారి అధినాయకురాలు సోనియా గాంధీ వ్యూహం దానికి పూర్తి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది. సొంత పార్టీ వాళ్లే, పార్లమెంటును స్థంబింప చేసే దాకా పోయింది. చివరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, పరమపద సోపాన పటంలో, చిట్ట చివరి గడికి పావు చేరుకున్న చందాన తయారయింది.

కేంద్రంలో వ్యవహారం అలా వుంటే, రాష్ట్రంలో సంగతులు కూడా అలానే వున్నాయి. శాసన సభ సమావేశాలు ఆరంభం కావడానికి ముందు వరకు, అటు ప్రభుత్వం, ఇటు తెలంగాణ వాదులు, తమ తమ పావులను జాగ్రత్తగా కదుపుకుంటూ, (మాటల తూటాలనే) గవ్వలు ఆచితూచి విసురుకుంటూ, నిచ్చెనలు ఎక్కుకుంటూ-పాము నోట్లో పడుకుంటూ, పై గడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ చేరుకోలేక పోయారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు, హఠాత్తుగా (కాంగ్రెస్, తెరాస, తెలుగు దేశం) తెలంగాణ వాదులందరూ, విడి విడిగా గవ్వలు విసురుకుంటూ-పావులు కదుపుకుంటూ, నూరవ గడి దరిదాపుల్లోకి వచ్చే దిశగా చకచకా కదిలారు. వీరందరి కంటే ముందే, ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కోదండ రామ్, నూరవ గడికి అతి సమీపంలోకి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళనలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ, శాసన సభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల జై తెలంగాణ నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, బడ్జెట్ ప్రసంగాన్ని సాగనీయక పోవడం, కాంగ్రెస్ శాసన సభ సభ్యులు-మంత్రులు ఢిల్లీకి మకాం మార్చి పార్లమెంటు సభ్యులతో కలిసి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు, పట్టాల పైకి పల్లెలు లాంటి చర్యలు, ఎవరి పరిధిలో వారి గవ్వలు సక్రమంగా విసిరిన రీతిలో-పావులు కదిపిన తరహాలో, పరిష్కారాన్ని చివరి అంకానికి వచ్చేలా చేయగలిగాయి. ఇంతలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు-సహచర లోక్ సభ సభ్యురాలు విజయ శాంతి వ్యూహాత్మకంగా గవ్వలు విసిరి, పావులు కదిపి, లోక్ సభను స్థంబింప చేశారు. మరో మారు తెలంగాణ ఇచ్చినట్లే-వచ్చినట్లే కనిపించింది అందరికీ. అందరూ, ఫిబ్రవరి చివరి వారంలో అతి పెద్ద పాము నోటికి అతి చేరువలో, నూరవ గడికి, అతి సమీపంలో చేరుకున్నారు. మార్చ్ మొదటి వారంలో-ఆరంభంలో, గవ్వలు సరిగ్గా పడకుండా, అందరి పావులను పాము నోటికి చేర్చాయి. హఠాత్తుగా పరిస్థితిలో ఊహించని పరిణామం, అందరికి దాదాపు అర్థమయ్యేలా, చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేది లేదు అన్న సంకేతం స్పష్టంగా వెలువడింది.

మళ్ళీ ఆట మొదటి కొచ్చింది. పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. ఎన్డీయే సారధి భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చేజారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. గవ్వలు విసిరారు. తన పావులను కదిలించారు. కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. చేతిలో గవ్వలు జారి పోయాయి. తాత్కాలికంగా ఆట గెల్చారు ప్రణబ్. ఆట గెలుపు ధీమాతో, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ-ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను సరాసరి-నేరుగా కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. మూడు నెలలు ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ.

ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. ఆటలో మళ్లీ నిచ్చెనలు ఎక్కడం మొదలెట్టారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు-మంత్రులు-ఎమ్మెల్సీలతో సహా, ఢిల్లీకి పోయి సోనియాను కలిసే ప్రయత్నంలో పడ్డారు. వారి ఆటలో వారూ కొంత ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు తన వర్గంలోని బలీయమైన తెలంగాణ వాది-నాగం జనార్ధన రెడ్డి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగు దేశం వారు ప్రత్యేక నినాదం వైకుంఠపాళి ఆటలో చేరడానికి మరికొంత సమయం పట్టొచ్చునేమో. ఎలాగూ, మూడు నెలల సమయం వుందికదా! ఇక ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, తెరాస నాయకులు తేల్చుకోవాల్సింది మిలియన్ మార్చ్ వ్యవహారం. అలా వారూ పావులు కదుపుతున్నారు.

పరమపద సోపాన పటంలో నూరవ గడికి ఎవరు ముందుగా చేరుకుంటారో ఊహించడం కష్టమైనా, మూడు నెలల వరకూ, నిచ్చెనలెక్కుతూ-పాము నోట్లో పడి కిందకు జారుతూ, వుండడం మాత్రం తధ్యం.

Saturday, October 30, 2010

ఇందిరా గాంధి-ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం : వనం జ్వాలా నరసింహారావు

ఇందిరా గాంధి మరణించి అక్టోబర్ 31, 2010 కి
26 సంవత్సరాలైన సందర్భంగా

అస్థిర పాలన కంటే నియంతృత్వ ప్రజాస్వామ్యమే
మెరుగైందని తీర్పు చెప్పిన భారత ఓటరు
వనం జ్వాలా నరసింహారావు

ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్‌ టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధి హత్యకు గురై 26 సంవత్సరాలు నిండాయి. బియాంత్ సింగ్ ను ఇతర బాడీ గార్డులు తక్షణమే కాల్చి చంపగా, సత్వంత్ సింగ్ ను, హత్యకు కుట్రపన్నాడన్న అభియోగంపై కేహార్ సింగ్ ను, ఐదేళ్ల తర్వాత తీహారీ జైలులో ఉరితీశారు. ఇందిరా గాంధి మరణించి పాతికేళ్లు దాటినా జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. కోట్లాది ప్రజలు అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి చెడులను నిశితంగా విమర్శించేవారు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమె దో అరుదైన వ్యక్తిత్వం.

సుమారు పదహారేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా వున్న ఇందిరా గాంధీ, దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి, సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. సర్వేపల్లి రాధా కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్థిక, విదేశాంగ, సమాచార శాఖలను నిర్వహించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న "సిండికేట్" నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన కాంగ్రెస్ పార్టీని, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలను-పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.

రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, రాజకీయాల్లో మునిగితేలుతుండె వాతావరణంలో పెరిగి, జవహర్లాల్ అడుగుజాడల్లో బహుముఖ రంగాల్లో తీర్చి దిద్దబడి, అవకాశం వచ్చిన వెంటనే అత్యున్నత పదవిని పొంది, తండ్రికంటే మిన్నగా ఆ పదవికి వన్నె తెచ్చి, అధికారంలో వున్నా-లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొంది, వైరి వర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి, తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరా గాంధీతో పోల్చతగ్గవారు చాలా అరుదుగా వుంటారనడం అతిశయోక్తి కాదే మో! తండ్రి చాటు బిడ్డగా వుంటూ, అనధికారిక ఆంతరంగికురాలిగా ఎదుగుతూ, కూతురుగా వారసత్వ అధికారాన్ని వంశపారంపర్యంగా-తరతరాలుగా, తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిరా గాంధీ, నవ భారత వర్తమాన చరిత్రలో వేరెవరూ సాధించలేని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా చిర స్థాయిగా మిగిలిపోతుంది. విధి వక్రీకరించి, సంజయ్ గాంధీని ప్రధాన మంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన తదనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి చేయాల్సిన దంతా చేసింది.

ఇందిర ప్రియదర్శిని బాల్యమంతా ఒంటరితనంతోనే గడపాల్సి వచ్చింది. అలహాబాద్ లోని ఆమె కుటుంబం వుంటుండే ఇల్లు స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రధాన కార్యాలయంగా వుండేది. తాత, తండ్రి తరచుగా జైలుకెళ్ళి వస్తుండడం ఇందిరా గాంధీకి గుర్తున్న విషయాల్లో ముఖ్యమైంది. చిన్న పిల్లల ఆట వస్తువులు కాని, ఆటలు కాని ఆమెకు తెలియవు. ఆడిన ఆటల్లా, ఒక నాయకురాలిగా, మూడేళ్ల వయసులోనే బల్లపైకెక్కి, ఇంట్లో పనిచేసే వారందరికీ రాజకీయ ఉపన్యాసాలివ్వడం-తనను తానే జోన్ ఆఫ్ ఆర్క్ లాగా ఊహించుకోవడం. పెద్ద వారెవరూ అందుబాటులో లేనందున, యువరాణిలా ఎదుగుతున్న ఇందిరలో ఒకరకమైన అహంభావం పెరిగినట్లు ఆమే ఒక సందర్భంలో చెప్పింది. ఇంటిమీద పోలీసు దాడులు జరగడం, సాధారణ జీవనం కొరవడడం, ఇంట్లో వారిని అరెస్టు చేసి జైలుకు పట్టుకెళ్లడం లాంటివి నిత్యం ఆమెకు అనుభవంలోకి వచ్చేవి.

అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ విదేశాంగ విధానం "భారత అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు, తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో నిరూపించింది.

ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకుంది ఇందిరా గాంధీ. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. పార్టీ పరంగా కూడా నియంతృత్వ ధోరణులే అవలంబించసాగింది. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్ లోని సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది. "కమ్యూనిజం" కంటే "కమ్యూనలిజం" వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేసింది. ఎప్పుడైతే, ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ-వీరూ అనే తేడా లేకుండా, తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో "సామ్యవాదం, లౌకిక వాదం" అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా, మరేదైనా, ఏమి చెప్పినా-చేసినా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని-తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేది. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలయ్యాయి-ఓటమికి కారణాలయ్యాయి.

ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని, ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే దో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టే దో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు-ఎందుకు ఏ పని చేసే దో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఆ దేశ ప్రయివేట్ పౌరుడిగా, ప్రధాని ఇందిరను కలిసిన సమయంలో, ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత, ఇంకెంత సేపు ఆ సమావేశం కొనసాగుతుందని, నిక్సన్ వెంట వచ్చిన విదేశాంగ ప్రతినిధిని హిందీలో అసహనంగా ప్రశ్నించిందట ఆమె. ప్రశ్న హిందీలో వేసినా, దాని గూడార్థాన్ని గ్రహించిన నిక్సన్ సంభాషణను త్వరగా ముగించి వెళ్ళాడని అనధికార వార్తగా పత్రికలు ప్రచురించాయి అప్పట్లో. అందులోని నిజానిజాలు ఎంతవరకో గాని, ఆమెలోని అసహనం పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై, ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో, నిశ్శబ్దం పాటించడమో, అదో రకంగా నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు వేయడమో చేసేదని విశ్లేషకులు అంటుండేవారు.

ఆక్స్ ఫర్డ్ లో చదువుకుంటున్న రోజుల్లో బ్రిటీష్ లేబర్ పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్ గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్ కూడా పనిచేసింది. స్వదేశానికి తిరిగొచ్చే సమయంలో ఆమె వెంట, చిన్ననాటి స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీలో అప్పటికే చురుగ్గా పాల్గొంటున్న అలహాబాద్ పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీ కూడా వున్నారు. తామిద్దరం వివాహం చేసుకుంటామని ఇందిర ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఇరువురి దీ ఒక మతం కాదు-ఒక కులం కాదు. అయినా, ఇద్దరి వివాహం జరగడం, కొద్ది కాలంలోనే ఇరువురు జైలు జీవితం గడపాల్సి రావడం, ఆ తర్వాత విడుదలై వైవాహిక జీవితం గడపడం, రాజీవ్-సంజయ్ లు పుట్టడం ఒకటి వెంట ఒకటి జరిగింది నాలుగేళ్లలోపు.

జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను ఇందిరా గాంధీ తెలుసుకోగలిగింది. సంజయ్ గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, అనధికారికంగా ఇందిర చేపట్టాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఇష్టంగానో-అయిష్టంగానే ఆమె తన బాధ్యతలను కర్తవ్య పరాయణ తో నిర్వర్తించింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడడంతో, ఆమె అవసరం నెహ్రూకు కూడా పెరిగి పోవడంతో, ఫిరోజ్ తో గడిపే వీలు తగ్గి, చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది. ఆయన చనిపోయేంతవరకూ అంతే కొనసాగింది.

జవహర్లాల్ ను కలవడానికొచ్చిన దేశ-విదేశీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు, ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను, తండ్రి చాటు బిడ్డగా నెహ్రూ కూతురుగానే చూసేవారు. ఆమె రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి చేరుకుంది. జవహర్లాల్ వెంట దేశ-విదేశాల్లో కలిసి తిరగడంతో, లక్షలాది మంది భారతీయులకు, చాలా మంది విదేశ ప్రముఖులకు, ఇందిరా గాంధీ సుపరిచితురాలైంది. 1955 లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నుకోవడంతో, జాతీయ స్థాయిలో స్వతంత్రంగా గుర్తింపు లభించినట్లయింది. నాలుగేళ్ల అనంతరం, నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించిందనాలి. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టింది. ఇందిరా గాంధీ మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సుముఖత చూపలేదు. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాలణ మొదలైంది ఆమె నేతృత్వంలో.

తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ ప్రధాన మంత్రి కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో-కనుసన్నల్లో నడుచుకుంటుదన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిరా గాంధీ వైపు మొగ్గు చూపారే కాని, భవిష్యత్ లో ఆమె నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు. అనిశ్చిత పరిస్థితుల నడుమ, ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించింది ఇందిరా గాంధీ. జాతీయ స్థాయిలో యావత్ భారత దేశ ప్రజలంగీకరించే ఏకైక నాయకురాలు తానేనని గ్రహించింది ఆమె. పార్టీ ప్రక్షాలణకు సమయం ఆసన్నమైందని, ప్రజలకు తాను మరింత చేరువ కావాలంటే, సామ్యవాద పంథాలో పయనించడం మినహా మార్గం లేదని విశ్వసించింది. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేయసాగింది.

అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించింది. ఆమే నెగ్గింది. నీలం ఓటమి పాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు, తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ దేశాయ్ ని మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు కలిపించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించడంతో, వారందరినీ అభివృద్ధి నిరోధక శక్తులు గాను-సామ్యవాద పథకాలను అడ్డుకునేవారి గాను చిత్రించింది ఇందిరా గాంధీ. పార్లమెంటరీ పార్టీ ఆమె పట్ల విశ్వాసం ప్రకటించడంతో, ఆమె ప్రధాన పదవికి ఢోకా లేకపోగా, పార్టీ చీలిపోయింది. ఇందిర పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. నైతిక విలువలకు కట్టుబడడం లేదని శత్రువులు ఆమెను విమర్శించ సాగారు. ఆమెకు మద్దతు పలుకుతున్న కొందరు స్వపక్షీయులు కూడా వారితో గొంతు కలిపారు. గోరు చుట్టుపై రోకటి పోటులా, అలహాబాద్ హైకోర్టు, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులు హరించిందని, పత్రికా స్వాతంత్ర్యం కాల రాసిందని దేశ విదేశాల ప్రముఖుల విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసింది. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది. అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. మరిన్ని రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకుంది. ఆమె ప్రతిపాదించిన అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించి, ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. భారత దేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి తోడ్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయనను ప్రవేశ పెట్టింది. వారసత్వానికి బాటలు వేసింది.

ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రాం కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ ముందు హాజరవడానికి ఇందిర నిరాకరించింది. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, రాజ్యాంగ బద్ధంగా, మంత్రివర్గం సిఫార్సుపై, పార్లమెంటు ఆమోదం లభించిన చర్య అని ఆమె స్పష్టం చేసింది. కమీషన్ ఏర్పాటుకు చట్ట బద్ధత లేదన్నది. అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. బెయిలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన సలహాను ఆమె నిరాకరించింది. ఆమె అరెస్టుకు తగిన కారణాలు ప్రభుత్వం చూపలేక పోయిందని, ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, మరో మారు పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్ గా ప్రకటించింది.

కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక సభకు ఎన్నికవడంతో, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మ రధం పట్ట సాగారు. మాజీ ప్రధానిగా తనను వేధించడం తగదని పార్లమెంట్ లోపలా-వెలుపలా పదే పదే జనతా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఒకానొక సందర్భంలో, లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచుంది ఇందిరా గాంధీ. అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది. ఆమె అరెస్టుకు నిరసనగా లక్షలాది మంది అభిమానులు ఆందోళన చేశారు. అరెస్టయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆమెను విడుదల చేసింది ప్రభుత్వం. ఆమెను వదిలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు, ప్రజల నుండి లభిస్తున్న అభిమానాన్ని గమనించి తిరిగి ఆమె పంచన చేరారు. ఇంతలో అంతర్గత వైరుధ్యాల మధ్య జనతా ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.

జులై 1979 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణ భూతుడైన చరణ్ సింగ్ కు మద్దతు పలికి, వ్యూహాత్మకంగా ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడింది ఇందిరా గాంధీ. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా వున్న చరణ్ సింగ్ ఆచరణలో ఇందిర ప్రతినిధిగానే పాలన చేశాడనాలి. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ), మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. సుస్థిరతా-అస్థిరతా అన్న నినాదంతో ఇందిరా గాంధీ ఎన్నికల బరిలో దిగి గెలిచింది. సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. అస్థిర పాలన కంటే, నియంతృత్వ ప్రజాస్వామ్యమే మెరుగైందని ఓటర్లు తీర్పిచ్చారు. దాని రూపకర్త ఇందిరా గాంధీని మరో మారు ప్రధానిని చేశారు.