Showing posts with label చెన్నారెడ్డి. Show all posts
Showing posts with label చెన్నారెడ్డి. Show all posts

Monday, July 8, 2013

1968 నాటి "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం": వనం జ్వాలా నరసింహారావు

1968 నాటి 
"ప్రత్యేక తెలంగాణ 
రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం"
వనం జ్వాలా నరసింహారావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే()ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.

 1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగింది. కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. ఆ నేపధ్యంలో నాకు గుర్తున్నంతవరకు, హక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించారు. వారి విజ్ఞాపనకు ముఖ్యమంత్రి స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా భావించారు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నా కంటే ఏడాది సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

1968 (నవంబర్-డిసెంబర్ నెలల్లో అనుకుంటా) లో జరిగిన "రక్షణల అమలు" ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జె. చొక్కా రావు, రాష్ట్ర పంచాయితీ మండలి అధ్యక్షుడు జలగం వెంగళరావు, నూకల రామచంద్రారెడ్డి, జి. సంజీవరెడ్డి వున్నారు. వారి అనుయాయులు కొందరు అలనాటి ఉద్యమంలో పాల్గొన్నారు కూడా. క్రమేపీ టి. అంజయ్య, ఎం. ఎం. హాషిం, జి. వి. సుధాకర్ రావు, బి. రాజారాం, కె. ఆర్. ఆమోస్, ట్. సదా లక్ష్మి, ఎస్. బి. గిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. కొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో ఉద్యమం క్రమేపీ మిలిటెంటుగా మార సాగింది. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. కోదాడ, నందిగామలలో జరిగిన కొన్ని దుర్ఘటనలు నల్గొండ, వరంగల్ విద్యార్థులను రెచ్చగొట్టాయి. మొత్తం మీద అరాచకాలు ప్రబలిపోసాగాయి.

పునాదులు కదిలిన ప్రభుత్వం పోలీసుకు సహాయపడేందుకు, సైన్యాన్ని పిలిపించింది. సైనికులు పోలీసుల సహకారంతో పాశవికంగా ప్రవర్తించారని నాటి పత్రికలు పేర్కొన్నాయి. ఎందరో విద్యార్థులను, అమాయకులను జైళ్లలో నిర్బంధించారు. వేలాదిమంది తెలంగాణ ప్రజా సమితి నాయకులు, విద్యార్థి నాయకులు జైళ్లలో బంధించబడిన దరిమిలా, రెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. పరిస్థితిని అదుపులో తేవడానికి వ్యూహాత్మకంగా నాటి ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్ చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజి, రామచంద్రారెడ్డి, చొక్కా రావు లతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారు. ప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. అసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా సమితి నాయకులను పిలవలేదు. మదన్ మోహన్ జైల్లో వున్నారప్పుడు. మరోవైపు తెలంగాణ ప్రాంతమంతా సత్యాగ్రహ శిబిరాలు వెలిశాయి. సామూహిక నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఢిల్లీ సమావేశంలో ఏ అంగీకారం కుదరలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడం, దాన్ని  డాక్టర్ చెన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, చొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది

వి. బి. రాజు చొరవతో, ఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైంది. మదన్ మోహన్, వెంకట్రామరెడ్డి, ఎస్. బి. గిరి, మల్లిఖార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయి. అణచివేత విధానాన్ని, హింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. అదే సందర్భంలో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి పోటీ ప్రజా సమితిని స్థాపించి తన వ్యతిరేకతను వ్యక్త పరిచాడు. చెన్నారెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టగానే, ప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుంది. కొన్ని వనరులు కూడా చేకూర సాగాయి. ఉద్యమం కూడా తీవ్రమైంది. సాయుధ పోలీసుల రక్షణ లేకుండా ముఖ్యమంత్రి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలానికి ఎన్. జీ. వోల సంఘం నాయకుడు ఆమోస్‍ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సత్యాగ్రహాలు చేసి కొన్ని వందల-వేల మంది అరెస్ట్ అయ్యారు. లాఠీ చార్జీలు నిత్యకృత్యమయ్యాయి. పరిస్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది. రాజధాని హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించబడింది. ఢిల్లీలో వున్న ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కా రావును వెంట పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధి, హుటాహుటిన ఒకనాడు హైదరాబాద్ వచ్చింది. నగరంలో రాత్రికి రాత్రే పర్యటించి తెల్లవారు ఝామున ఢిల్లీ వెళ్లి పోయారు.  

కొద్ది దినాల తరువాత, ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. దాంతో పాటే మరో విడత చర్చలకు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ప్రభృతులను ప్రభుత్వం ఆహ్వానించింది. చర్చలవలన ఏ ఫలితం చేకూరలేదు. ఉద్యమం నిలుపు చేయాలని మొరార్జీ దేశాయ్, వై. బి. చవాన్ ప్రభుత్వ పక్షాన కోరడం, అది అసంభవమని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ లు స్పష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన నాయకులకు ఘన స్వాగతం లభించింది. ఇదిలా వుండగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి. వెంకట స్వామిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆ మర్నాడు తెలంగాణ అంతటా సంపూర్ణ హర్తాళ్ జరిగిందిడాక్టర్ జి. ఎస్. మెల్కోటే, సంగం లక్ష్మీబాయి తమ రాజీనామా లేఖలను ప్రజా సమితి అధ్యక్షుడికి అందచేశారు. అదే రోజు రాత్రి నారాయణ గుడాలోని స్నేహితుడు డాక్టర్ సుదర్శన రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించసాగారు పోలీసులు. చెన్నారెడ్డితో పాటే, ఏడెనిమిది మంది శాసన సభ సభ్యులను, సుమారు పాతిక మంది ఇతర ప్రముఖులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజునుంచి వందల సంఖ్యలో విద్యార్థి నాయకులను ప్రజా సమితి కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. పోలీసులు చెన్నారెడ్డిని తీసుకెళ్తున్న కారును సూర్యాపేటలో ఆందోళనకారులు అడ్డగించారు కొద్ది సేపు. చెన్నారెడ్డి స్థానంలో మదన్ మోహన్ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన తరువాత సదా లక్ష్మి ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు, ఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలోనే, బి. వి. గురుమూర్తి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి కొందరి మంత్రుల రాజీనామాను ఆపు చేసేందుకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యూహాత్మకంగా తన రాజీనామాను అధిష్టానానికి సమర్పించారు. ఆ రాజీనామాను తమ విజయంగా భావించిన లక్షలాది మంది తెలంగాణ వాదులు రోడ్ల పైకొచ్చి పండుగ చేసుకున్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపుకున్నారు. పరిస్థితి పోలీసుల అదుపు తప్పే స్థాయికి చేరుకుంది మరో మారు. ముఖ్యమంత్రి తరహాలోనే కొందరు తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అయితే చేశాడు కాని, పదవిలో కొనసాగడానికి కాసు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చి, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పేరుతో కాసుకు మద్దతు కూడగట్టారు కామరాజ్ నాడార్, నిజలింగప్పలు. బ్రహ్మానంద రెడ్డి కొనసాగాడు. ఆయన మంత్రివర్గంలో జె. వి. నరసింగ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఆ తరువాత జరిగిన శాసన సభ సమావేశాలలో, గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ ప్రసంగం, అర్థాంతరంగా ముగిసింది. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు జరుగుతుండగా, కొందరు విద్యార్థులు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి, మంత్రులపై కోడి గుడ్లు, టొమాటోలు విసిరారు. మరో సంఘటనలో ఒక యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌పైన బాంబు విసిరాడు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న నాయకుల విడుదలకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నారు. చివరకు డిటెన్యూలందరినీ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దరిమిలా ఉద్యమ ఉదృతి అనేక కారణాల వల్ల తగ్గింది.


1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.

Sunday, February 6, 2011

మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు:వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 2011 న మల్లు అనంతరాములు 21 వ వర్ధంతి సందర్భంగా....
మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు
వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 1990 ఉదయం రాజ్ భవన్ ప్రాంగణంలో నివసిస్తున్న మా ఇంటికి "బ్రేక్ ఫాస్ట్ అతిథి" గా వచ్చిన డాక్టర్ మల్లు అనంతరాములు ఎంతో ఉల్లాసంగా-ఉత్సాహంగా కనిపించారు. రాజీనామా చేసిన కుముద్ బెన్ జోషి స్థానంలో నియమితులైన కృష్ణకాంత్, ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా, అదే రోజున, మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజ భవన్ కు మల్లు వస్తున్నందున, నేను ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. డాక్టర్ చెన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడంతో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాజీనామా చేసిన ఆయన స్థానంలో, అధిష్ఠానం మల్లును పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఆ హోదాలో ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడుగా నియామకం కావడానికి రెండు నెలల పూర్వం, 1989 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, రెండో పర్యాయం, మహబూబ్ నగర్ జిల్లా-నాగర్ కర్నూల్ రిజర్వు డు నియోజక వర్గం నుంచి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు మల్లు. ఉదయం బ్రేక్ ఫాస్టులోను, ఆ తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలోను, ఎప్పటిలాగా చురుగ్గా-సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ గడిపిన మల్లు అనంతరాములు, ఆ మధ్యాహ్నమే హఠాత్తుగా మరణించారన్న వార్తను ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారితో సహా ఎవరూ నమ్మలేక పోయారు. మల్లు మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్య మంత్రి చెన్నారెడ్డి స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన సంతాప సందేశాన్ని సీఎం పీఆర్వోగా పత్రికల వారికి, ఆయన కుటుంబ సభ్యులకు పంపాను. రాష్ట్ర శాసన సభకు, దేశ వ్యాప్తంగా లోక్ సభకు, జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మల్లు వహించిన పాత్రను అప్పటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి, ఘనంగా పొగుడుతూ మల్లుకు నివాళులు అర్పించారు.

పెద్దవాళ్ల మధ్య పెద్దవాడి గాను, చిన్న వాళ్ల మధ్య పెద్ద తరహా గాను మలగుతూ, అందరినీ తన వారిగా భావించే మనస్తత్వమున్న అనంతరాములు మల్లు, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అరుదైన దళిత నాయకుడు. పదవిలో వున్నా-లేకపోయినా, సన్నిహితులకు-అంతగా పరిచయం లేని ఇతరులకు, తన చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు మల్లు. ఒకే జిల్లాకు చెందిన మా ఇద్దరికి, రెండు దశాబ్దాల పరిచయం. మొట్టమొదటి సారి, మా జిల్లా నుంచి కాకుండా, మహబూబ్ నగర్ జిల్లానుంచి 1980 లో లోక్ సభ కు ఎన్నికైన తర్వాత, రాజకీయంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఢిల్లీ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాకు-మితృడు భండారు శ్రీనివాస రావుకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, వచ్చిన తర్వాత, ఇక్కడున్నన్ని రోజులు కలిసి మెలిసి వుండడం తప్పని సరిగా జరిగేది. ఒక సాధారణ "వీ ఎల్ డబ్ల్యూ" గా పని చేసి, కాంగ్రెస్ సంస్థలో ఉన్నత పదవులను అలంకరించిన అతి కొద్దిమంది దళితుల్లో మల్లు ఒకరు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడడం ఆయన కార్య దక్షతకు, పట్టుదలకు నిదర్శనం. వీ ఎల్ డబ్ల్యూ యూనియన్ క్రియాశీలక వ్యక్తిగా మల్లులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు, ఖమ్మం జిల్లా నాయకులతో సహా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయనను చేరువ చేసింది. ఆయన ఉపన్యాసాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అధికారం, రాష్ట్ర స్థాయిలో పట్టు కోల్పోయిన ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లు లాంటి వారి అవసరం కలిగింది.

1978 లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నో ఎన్నికల సభల్లో ఆయన ఉపన్యాసాలు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని మెప్పించాయి. అప్పటి ముఖ్య మంత్రి చెన్నారెడ్డి మల్లు నాయకత్వ లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, నాగర్ కర్నూల్ నియోజక వర్గం లోక్ సభ టికెట్ ఇప్పించారు. ఆయన ఘన విజయం సాధించడంతో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఆరంభమయింది. పార్లమెంటు సభ్యుడుగా ఢిల్లీలో అడుగు పెడుతూనే, కేంద్ర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా, నియోజక వర్గం అభివృద్ధికి ఉపయోగించుకుంటూ, ప్రజలకు చేరువయ్యారు. నాటి ఆర్థిక సహాయ మంత్రి జనార్థన్ పూజారి తోడ్పాటుతో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు ప్రదేశాల్లో రుణ మేళాలు ఏర్పాటు చేసి, షెడ్యూల్డు కులాల వారికి-తెగల వారికి-వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో రకాల ఆర్థిక సహాయం అందేలా చూశారు మల్లు. నాగర్ కర్నూలు తో సహా, స్వస్థలమైన ఖమ్మం జిల్లా వాసులకు కూడా సహాయ పడే వారాయన. కార్య శీలతకు, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలూ అంకితమై పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు దొరకడం కష్టం కాదని మల్లు నిరూపించారు. ఖమ్మం జిల్లా స్వంత గ్రామం లక్ష్మీపురంలో, ఆత్మీయుల మధ్య పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్న సందర్భంలో, నాటి ప్రధాని-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాతికేళ్ల క్రితం, దేశ రాజధాని నుంచి కుగ్రామానికి ప్రధాన మంత్రి దగ్గర నుంచి నేరుగా పిలుపు రావడం సాధారణ విషయం కాదు. మల్లు ప్రతిభే దానికి కారణం. పదమూడు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించు తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లును నియమిస్తున్నట్లు రాజీవ్ గాంధి నుంచి సమాచారం అలా చేరింది ఆయనకు.

న్యూ ఢిల్లీలోని మల్లు కార్యాలయం ఎప్పుడూ అత్యంత కోలాహలంగా వుండేది. గత పది-పదిహేనేళ్లలో జాతీయ స్థాయికెదిగిన పలువురు కాంగ్రెస్ నాయకులను మల్లు అనంతరాములు దగ్గర కలిసే అవకాశం కలిగింది. తన దగ్గర కొచ్చిన ప్రతి వారినీ, బయట వరకు వచ్చి పంపడం ఆయన అలవాటు. ఎప్పుడన్నా పని ఒత్తిడుల వల్ల అలా వీలు కాకపోతే తప్ప, సాధారణంగా ఆయన ఆ మర్యాద పాటించేవారు. ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, తన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పడం మల్లు లోని సద్గుణం. అడిగిన పని తనకు సాధ్యం కాదని అనే అలవాటు ఆయనలో లేదు. ప్రయత్న లోపం వుండదని దానర్థం. మల్లు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, రాజీవ్ గాంధి ఆయనను నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడుగా నియమించారు. ఆ పదవిలోనూ మల్లు రాణించారు. రాజీవ్ గాంధీకి మరింత చేరువ కావడానికి ఆ పదవి తోడ్పడింది. పార్టీ ప్రయోజనాలకై చాలా మందికి తెలియని ఎన్నో గురుతర బాధ్యతలను రాజీవ్ గాంధి ఆయనకు అప్ప చెప్పారు. ఎంఏ వరకు చదువుకున్న మల్లు పార్లమెంటు సభ్యుడైన తర్వాత రీసెర్చ్ చేసి, పీ హెచ్ డి తెచ్చుకుని, డాక్టర్ అనంతరాములు మల్లు ఐపోయారు.

ఎన్ టీ రామారావు సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన తెలుగు దేశం పార్టీని ఓడించడానికి చెన్నారెడ్డి నాయకత్వంలో 1989 లో ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ, మరో పర్యాయం, మల్లు అనంతరాములుకు నాగర్ కర్నూలు లోక్ సభ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనకు శాసన సభకు పోటీ చేయాలని మనసులో కోరికగా వుండేది. వీలుంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజక వర్గం నుంచి టికెట్ వస్తే బాగుండేదనుకునేవారాయన. కాకపోతే, ఖమ్మంలోని రిజర్వుడు నియోజక వర్గాల నుంచి గతంలో పోటీ చేసిన వారు కాని, సిట్టింగ్ అభ్యర్థులు కాని పోటీ చేస్తుండడంతో మల్లుకు అవకాశం దొరకడం కష్టమైంది. రాజీవ్ గాంధీ ఆదేశం కూడా లోక్ సభకు పోటీ చేయమనే. తనకు పార్టీ విజయం ముఖ్యమని, రాష్ట్రంలోను-దేశంలోను, ప్రత్యేకించి తనకప్పగించిన పదమూడు రాష్ట్రాలలోను, అభ్యర్థుల విజయానికి తన పూర్తికాలం వినియోగిస్తానని చెప్పినప్పటికీ, రాజీవ్ గాంధీ మల్లును నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. తన నియోజక వర్గంతో పాటు, ఇతర నియోజక వర్గాలలోను మల్లు ప్రచారం చేశారు. లోక్ సభకు మరో మారు గెలిచారు. కాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది. 1989 ఎన్నికల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం కొరకు రాజీవ్ గాంధీ కూడా వచ్చారు.

మర్రి చెన్నారెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం జరిగిన నాటి రాత్రి పది గంటల సమయంలో మర్నాడు హైదరాబాద్ వస్తున్న సంగతి ఫోన్ చేసి మరీ చెప్పారు మల్లు అనంత రాములు స్వయంగా. పీసీసీ అధ్యక్షుడుగా ఆయన నియామకం చేయడానికి బలవత్తరమైన కారణం వుండొచ్చు. బ్రతికున్నట్లయితే, మర్రి చెన్నారెడ్డి తర్వాత, బహుశా మల్లుకు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చి వుండేదేమో! నేను ముఖ్య మంత్రి చెన్నారెడ్డి పీఆర్ వో గా పని చేస్తున్నప్పటికీ, మల్లు పీసీసీ అధ్యక్షుడుగా హైదరాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి పోవడమే కాకుండా, ఆయన వెంట వూరేగింపులో కొంత సేపు ప్రయాణం కూడా చేశాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లు పలువురి మన్ననలను, ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఎన్నో నూతన ఒరవడులకు నాంది పలికారు. ముఖ్య మంత్రికి, ఇతర మంత్రులకు, గాంధీ భవన్ కు మధ్య వారధిగా పని చేశారు. ముఖ్య మంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఇతర సందర్శకులలాగానే వ్యవహరించేవారు తప్ప, తన కంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరేవారు కాదు.

అది యాధృఛ్చికమో, దైవ సంకల్పమో కాని, మల్లు అనంతరాములు హఠాత్తుగా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆయన తమ్ముడి మామగారు, అప్పట్లో రాష్ట్ర కాబినెట్ మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేశారు. అనంతరాములు సోదరుడు మల్లు రవి ఆయన స్థానంలో నాగర్ కర్నూలు లోక్ సభ సభ్యుడుగా రెండు సార్లు ఎన్నికకాగా, మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా, మధిర శాసన సభ సభ్యుడుగా ఎన్నికై ప్రస్తుతం ప్రభుత్వ ఛీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గవర్నర్ ప్రమాణ స్వీకారం, కాబినెట్ మంత్రి రాజీనామా, పీసీసీ అధ్యక్షుడి హఠాన్మరణం అన్నీ ఒక్క నాడే, ఫిబ్రవరి 7, 2011 న సంభవించాయి. మల్లు మరణించి సరిగ్గా 21 సంవత్సరాలైంది. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికై, నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ చైర్మన్ పదవిని పొంది, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా-పదమూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు నిర్వహించిన మల్లును, ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మరిచిపోయినట్లే కనిపిస్తోంది. భావి తరాల వారు-ఆ మాటకొస్తే నేటి తరం వారుకూడా, ఆయన్ను గుర్తుంచుకునే ట్లు, ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టి తే బాగుంటుందేమో!

Thursday, September 2, 2010

ఆత్మీయతకు మారుపేరు ముఖ్యమంత్రి రోశయ్య : వనం జ్వాలా నరసింహారావు

రెండు దశాబ్దాలుగా నేనెరిగిన-నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య
వనం జ్వాలా నరసింహారావు

ముఖ్యమంత్రి రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో లేదు. ఆయనతో నాకు కేవలం పరిచయం మాత్రమే. పది మందికి ప్రాణాపాయంలో అవసరానికొచ్చే 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన నా ఉద్యోగ నిర్వహణ విషయంలో, రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యను ప్రభుత్వ పరంగా పరిష్కరించబడడానికి ఆయనతో వున్న పరిచయానికంటే, రోశయ్యతో వున్న సాన్నిహిత్యమే ఎక్కువగా ఉపయోగ పడిందనాలి. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల్లో, కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే, ఆయనను కలిసేందుకు మితృడు భండారు శ్రీనివాస రావుతో కలిసి వెళ్లాను. సాధారణంగా లోగడ కలిసే సమయంలోనే, కలవడానికి ధైర్యంగా వెళ్ళిన మాకు, ఇంటిముందరకు పోయిన తర్వాత నిరాశ మిగిలింది. అప్పటికే విధుల్లో చేరిన సెక్యూరిటీ సిబ్బంది, అప్పాయింట్మెంవట్ లేకుండా వెళ్ళడం కుదరదన్నారు. లోపడున్నవారిని ఫోనులో సంప్రదించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఈ నేపధ్యంలో లోనికి వెళ్లగలిగినా, ముఖ్యమంత్రిని కలవడం సాధ్యపడే విషయం కాదని అనుకుంటున్న సమయంలో, బాగా పరిచయమున్న ఒక పోలీసు ఉన్నతాధికారి, ముఖ్యమంత్రిని కలిసి బయటకు రావడం జరిగింది. ఆయన మమ్మల్ని పలకరించిన తీరు చూసి, బహుశా ఆయన సైగలను అర్థం చేసుకుని, సెక్యూరిటీ సిబ్బంది మా ఇద్దరిని లోనికి వదిలారు. మాకు తెలిసిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది ఇంకా రాలేదప్పటికి. ముందు గదిలో మేము కూర్చొన పోతుండగా, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తున్నప్పుడు తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన ఆయన, పేర్లు పెట్టి పిలిచి మరీ రమ్మనడంతో ఊపిరి పీల్చుకున్నాం. ముఖ్యమంత్రికి నమస్కారం చేసి, మర్యాదపూర్వకంగా ఆయనను కలవడానికి-అభినందనలు వ్యక్తిగతంగా చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. సున్నితంగా మా కోరికను తిరస్కరించి, మమ్మల్ని కూచోమని అనడమే కాకుండా, ఎప్పటి రోశయ్య గారి లాగానే, మాట్లాడారు చాలా సేపు. నేను 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణ సంస్థలో ఉద్యోగం మానేసిన విషయం, అమెరికా వెళ్తున్న విషయం చెప్పి, ఇద్దరం బయటకొచ్చాం. బహుశా మరొక రాజకీయ నాయకుడై తే అలా పిలవక పోయేవారేమో! అలా సాదాసీదాగా మాట్లాడకపోయేవారేమో! ఆ తర్వాత నేను అమెరికాలో మా పిల్లలతో వున్నప్పుడు దసరా, సంక్రాంతి పండుగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, ఇంకే ముఖ్యమంత్రి కూడా (బహుశా) కేటాయించనంత సమయం నాతోను-అక్కడుంటున్న మా అమ్మాయితోను మాట్లాడడానికి కేటాయించడం, ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం, ఆయన నిరాడంబరానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి, అందునా అప్పట్లో వున్న పరిస్థితుల్లో, ఫోన్లో దొరకడం-సంభాషించడం నా లాంటివారెప్పుడూ మరిచిపోలేని మరుపు రాని సంఘటన.

సీఎం రోశయ్యతో నాకు మొదటిసారి దగ్గరగా పరిచయం 1989 లో అయింది. అంతకుముందు కలిసినా అంతగా పరిచయం చేసుకునే అవకాశం కలగలేదు. అప్పట్లో నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్నప్పటికీ, పాత్రికేయ ప్రవృత్తితో వున్న సంబంధం నన్ను స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పరిచయానికి దారితీసింది. అదే క్రమంలో, చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో నేనాయనకు మరింత చేరువయ్యాను. ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డికి అన్ని విషయాల్లో చేదోడుగా వుండేవారు రోశయ్య. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం, రోశయ్య ఆయన మంత్రివర్గంలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన నన్ను చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, ఆయనను మధ్య-మధ్య కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా చాలా పర్యాయాలు కలిసి ఆయన సహాయం కోరితే కాదనలేదెప్పుడు. 1994-2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు శ్రీనివాసరావు తో కలిసి చాలా సార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఇన్-చార్జ్ గా చేరాను. ఆ మధ్యలో, నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, నాకేమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మొదటి వారంలోనే, ఒకే కంపార్ట్ మెంటులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005 న ఆ సేవలు లాంఛనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు ఆయన అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థిక శాఖకు అదనంగా, ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖకు కూడా రోశయ్య గారే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి, అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రయివేట్ నిధులతోనే నడుస్తున్న ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను బడ్జెట్లో మున్ముందు కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను మొట్టమొదటి సారిగా బహిరంగంగా ప్రకటించింది రోశయ్య గారే. ఇచ్చిన మాట ప్రకారం 2007-2008 బడ్జెట్లో 23 కోట్లు కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో అప్పటికింకా వివరంగా పడలేదాసేవల విషయం.

రోశయ్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ పరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి-ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు మధ్య ఆయన సమక్షంలో సెప్టెంబర్ 2006 లో అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ సంఘటన అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మక మలుపు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు సలహాదారుడుగా పనిచేస్తున్న అధికారి, పీకె అగర్వాల్, అప్పట్లో ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ రోశయ్య ద్వారా దివంగత ముఖ్యమంత్రికి చేరువైన సేవల నిర్వహణకు, మరిన్ని అంబులెన్సులను చేర్చడంలోను, నిర్వహణ నిధులను 95% వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ప్రాంగణానికి రావడం దాకా, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఎల్ల వేళలా ఆయన సహకారం కొరకు కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ రామలింగ రాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009 న, దివంగత ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలన్నీ రోశయ్య సలహాతోనే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. తిరిగి నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమని జీవి కృష్ణారెడ్డితో రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్య కాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇ.ఎం.ఆర్.ఐ ఖాతాలో వున్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడం, ఆయన సహాయం కోరిన వెంటనే ఆయన దానిని పరిష్కరించడం జరిగింది. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రయివేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే తన ఇంట్లో ఆయన కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి "బ్రాండ్ అంబాసిడర్" లాగా ఆయనకు వివరించారు రోశయ్య. తనకున్న కొన్ని పరిమితుల వల్ల ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించలేక పోయిన అజయ్ పిరమల్, మరో స్వచ్చంద సంస్థ పై ఆసక్తి కనబరిచి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఇటీవల కలిసినప్పుడు నేను కూడా ఆ సంస్థ అధికారులతో కలిసి వెళ్లాను. మళ్ళీ అదే అత్మీయత చూపారు రోశయ్య గారు.

ఇలా ఎప్పుడు ఏది అడిగినా కాదనని రోశయ్య అనుకోని పరిస్థితుల కారణంగా, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రభుత్వ శాఖల పనితీరుపై అవసరమైనప్పుడు తక్షణమే సమీక్షలు నిర్వహిస్తారనడానికి నిదర్శనంగా ఇటీవలి నా అనుభవమే ఉదాహరణ. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో సేవలందిస్తున్న సంస్థలో పనిచేస్తున్న నేను, ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారితో కలిసి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఎంతో పని ఒత్తిడిలో వున్న ముఖ్యమంత్రి మాతో మాట్లాడడానికి నిమిషం కంటె ఎక్కువ సమయం కేటాయించ లేకపోయారు. అయినా ఆ ఒక్క నిమిషంలోనే సమస్య పరిష్కారం దిశగా ఆంతరంగిక సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారిని కలవమని కూడా సూచించారు. మేము ముఖ్యమంత్రి సూచన మేరకు ఆయన చెప్పినట్లే చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో కాని, నేను పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రభుత్వ శాఖాధికారులతో, మర్నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. సమస్యకు సంబంధించిన తక్షణ ఇబ్బందులు తొలగిపోయాయి.

అధికారంలో లేనప్పుడు ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రి కానప్పుడు అధికారంలో వుండగా ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రిగా పనుల ఒత్తిడివల్ల అతి తక్కువ సమయం కేటాయించినా, రోశయ్య కనిపించే ఆత్మీయతలో మార్పు కొంచెమైనా లేదు. హద్దులు మించని ఏ కోరిక కోరినా ఆయన స్పందనలో ఒకే రకమైన
ఆత్మీయత.

Also please click for more here: