Showing posts with label దసరా. Show all posts
Showing posts with label దసరా. Show all posts

Thursday, November 5, 2015

ఆయుత చండీ యాగంపై అనవసర రాద్ధాంతం : వనం జ్వాలా నరసింహారావు

ఆయుత చండీ యాగంపై అనవసర రాద్ధాంతం
వనం జ్వాలా నరసింహారావు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయ తలపెట్టిన ఆయుత చండీ యాగంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అలాగే, తెలంగాణాలో అనాదిగా జరుపుకుంటున్న బతుకమ్మ, బోనాలు, దసరా లాంటి పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. వీరి మాటలు మెజారిటీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విగా, వాళ్ల నమ్మకాలకు వ్యతిరేకంగా వున్నాయి. అనాదిగా, సృష్టి ఆరంభం నుంచీ, మనిషి అనే వాడు, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, రకరకాల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, నమ్మకాలను అనుసరిస్తూ రావడం జగమెరిగిన సత్యం. శ్రీరాముడే దేవుడని నమ్మేవాళ్లున్నారు, కాదు శ్రీ కృష్ణుడే అనేవాళ్లున్నారు. వారిద్దరూ కాదు పరమశివుడని మరికొందరంటారు. క్రమేపీ అనేక మతాలు, విధానాలు ఆచరణలోకి రావడంతో మనిషి కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాలను, ఆచారవ్యవహారాలను పాటించే వారు కొందరైతే, ఆస్తికత్వం నుంచి నాస్తికత్వం వరకూ మారిన వారు మరికొందరున్నారు.

ఇంతకీ ఎవరి నమ్మకం వాళ్లది. తమ నమ్మకమే గొప్పదనీ, ఇతరుల నమ్మకాలు తప్పనీ వాదించే ప్రయత్నం మంచిది కాదు. నమ్మకం విషయానికొస్తే యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం కూడా ఒక నమ్మకమే. అది నిజం కావచ్చు-కాక పోవచ్చు. కాని చేసే వాళ్లను తప్పు చేస్తున్న వాళ్లగా చిత్రీకరించడం అంతకన్నా గొప్ప తప్పు. చివరికి విమర్శకుల మాటలు ఎంతవరకు పోయాయంటే, ప్రజలను చంపడానికే యాగాలు అనేంతవరకూ పోయింది. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి  కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావో కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. బాంకాక్ లో రహదారుల పేర్లన్నీ రామ అక్షరంతో మొదలవుతాయి. ఎవరి నమ్మకం వాళ్ల ది.

యజ్ఞయాగాదులనేవి ఈ నాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందిన మన వేదాలలో యజ్ఞాలు ప్రతిపాదించబడ్డాయి. యజ్ఞయాగాదుల విధి-విధానాల గురించి వివరంగా చెప్పడం కూడా జరిగింది. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి కారణం కూడా యజ్ఞ యాగాలే. మానవ జాతి సృష్టే యజ్ఞ సహితంగా జరిగిందంటారు. యజ్ఞం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. జగత్ కళ్యాణానికి కారణం కూడా యజ్ఞయాగాదులే. దేవతార్చనతోనే హిందూ జీవన విధానం ముడిపడి వుంది. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. జీవుడు తల్లి గర్భంలో చేరినది మొదలుకుని, భూమిమీద అడుగుపెట్టినప్పటినుంచి, వివిధ సంస్కారాలతో సంస్కరించబడాలని వైదిక సాంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. అలా సంస్కరించబడడానికి అమూల్యమైన ప్రక్రియ యాగాలు, యజ్ఞాలు చేయడం, చేయించడం. యజ్ఞాలు మహత్వ పూర్ణాలు, అవశ్యం ఆచరణీయాలు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు. అలాంటివాటిలో రుద్ర యాగాలు, సూర్య యాగాలు, గణేశ యాగాలు, చండీ యాగాలు, శాంతి యాగాలు లాంటివి బహుళ ప్రచారంలో వున్నాయి. మనం చేయలేని దాన్ని మరొకరు చేస్తుంటే వారిని ప్రోత్సహించడం మన కనీస ధర్మం. విమర్శించకుండా వున్నా చాలు.

యజ్ఞ యాగాలు చేయడం ఫ్యూడలిజం లక్షణాలుగా కొందరు ఎద్దేవా చేస్తున్నారు. రాజులు-రాజ్యాలు పోయినా పరిపాలన పోలేదు అనే విషయం సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది. రాచరికం పోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ, పాలకులు-ప్రజలు అనే పద్ధతి కొనసాగుతూనే వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారు ప్రజల సంక్షేమ-అభివృద్ధికి బాటలు వేస్తూనే, అనేక రకాలుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత కూడా వుంది. ఉదాహరణకు వర్షాలు కురవకపోతే కృత్రిమంగా వర్షాలు కురిపించడం ఒక పద్ధతైతే, ఆధ్యాత్మిక పద్ధతిలో యజ్ఞ యాగాలు కూడా చేయొచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలొచ్చు, రాలక పోవచ్చు. కాని, ప్రజల నమ్మకాలకు అనుగుణంగా నడచుకుంటే తప్పు లేదు కదా! ఆ బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారిదే.

ఓ మూడేళ్ల క్రితం భద్రాచలంలో అతిరాత్రం అనే ఒక మహా యజ్ఞం నిర్వహించారు కొందరు. నేను కూడా అందులో కొంత పాత్ర పోషించాను. విపరీతంగా ఎండలు కాస్తున్న ఏప్రియల్ చివరి, మే నెల మొదటి వారం రోజులవి. పన్నెండు రోజులు నిర్విఘ్నంగా సాగిన యజ్ఞం ఆరంభం నుంచీ, చివర వరకూ అడపదడప కుండపోతగా వర్షం కురుస్తూనే వుంది. అది కాకతాళీయం కూడా కావచ్చు. కాని భద్రాచలం చుట్టుపక్కల అంత మోతాదులో వర్షాలు ఆ క్రితం పది-పన్నెండేళ్లలో ఎప్పుడూ కురవలేదని ఇప్పటికీ అక్కడి వారు చెప్పుకోవడం జరుగుతోంది. శాస్త్రీయంగా, యజ్ఞం జరిగనన్ని రోజులు, ఆ తరువాత కూడా పరిసర ప్రాంతాలలో పరిశోధనలు చేశారు కొందరు సైంటిస్టులు. అద్భుతమైన ఫలితాలొచ్చాయి. అంతకు ఒక ఏడాది క్రితం, హిందువుల సంప్రదాయాలకు, నమ్మకాలకు, ప్రత్యక్ష సాక్ష్యంగా అద్భుతంగా సాగింది ఇలాంటి అతిరాత్రం పుణ్య యజ్ఞం కేరళలోని పంజాల్ గ్రామంలో. అప్పుడక్కడున్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని వాదించే ప్రబుద్ధులను నిశ్చేష్టులను చేస్తూ యాగం పరి సమాప్తమైన కొద్ది నిమిషాలలోనే, ఆకాశం మేఘావృతమై, కుండపోతగా వర్షం కురిసింది. యజ్ఞాన్ని తిలకిస్తున్న పదిలక్షలమంది జనం పులకించి పోయారు. ఇదొక నమ్మకం. ఫ్యూడలిజం లక్షణం కానేకాదు. భద్రాచలంలో జరిగిన యజ్ఞం తిలకించిన వారిలో అన్ని రకాల నమ్మకస్తులు వున్నారు. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే సారధ్య సంఘం సభ్యుడు కూడా. స్వయంగా ఆయన ఒకరోజు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయనే కాదు అనేక మంది పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల వారు కూడా పాల్గొన్నారు.

మరో సంఘటన కూడా ఈ సందర్భంగా ఉదహరించడం మంచిదేమో! 1979 లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. రిజర్వాయర్లే కాకుండా బావుల్లో కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. యాత్రీకులను కొండ పైకి రావద్దని హెచ్చరించే ఆలోచన కూడా కలిగిందట. పరిష్కార మార్గాలు అన్వేషిస్తూనే అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీవీఆర్‍కె ప్రసాద్ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా వుందా అని శోధన సాగించారు. వేద వేదాంగ పారంగతుడు, భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషన్ గౌరవ పురస్కార గ్రహీత ఉప్పులూరి గణపతి శాస్త్రిని సంప్రదించారు. ఇలాంటి సమస్యలకు వేదాల్లో పరిష్కార మార్గాలున్నాయని, భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో, త్రికరణ శుద్ధిగా యజ్ఞం ఆచరిస్తే ఫలితం తప్పకుండా వుంటుందనీ ఆయన సలహా ఇచ్చారు. వరుణ జపం నిర్వహించి, వరుణ దేవుడి కరుణ పొందాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లోని బంగారు వాకిలిలో, అర్థరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక, తలుపులన్నీ వేశాక, హఠాత్తుగా భారీ గంటలు గణ-గణ మోగాయి. తెల్లవారుతూనే వరుణ జపానికి అన్నీ సన్నాహాలు అప్పటికే జరిగాయి. నవంబర్ 7 న ప్రారంభమైన వరుణ జపం, ఋత్విక్కుల వేద మంత్రోఛ్ఛారణల మధ్య మూడు రోజులు జరిగింది. ఆ సాయంత్రం వరకూ ఏ విశేషమూ జరగలేదు. హేళనలు మొదలయ్యాయి. విమర్శలు పుంజుకున్నాయి. ఇంతలో, క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వర్షం కురిసింది. మర్నాడు ఉదయం ఏడు గంటల సమయంలో సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యే దాకా అలా కురుస్తూనే వుంది. ఇంతలోనే సమాచారం వచ్చింది. రిజర్వాయర్లన్నీ పొంగి పొర్లుతున్నాయని. విచిత్రం ఏంటంటే, ఒక్క తిరుమలలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా వర్షం ఛాయలు కూడా కాన రాలేదు.  ఇదంతా కాకతాళీయమా? వేద మంత్రాల శక్తి ప్రభావమా? భక్తులు నమ్ముకున్న దేవ దేవుడి అనుగ్రహమా? ఈ విషయాలను స్వయంగా పీవీఆర్‍కె ప్రసాద్ గారు తన పుస్తకం (నాహం కర్తా, హరిః కర్తా) లో వివరంగా రాశారు.

యాగాలు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపించిన మహత్తర నేపధ్యంలో, లోక కళ్యాణం కొరకు, విశ్వ శాంతి కొరకు, యాగాలన్నింటిలో శ్రేష్ఠమైన ఆయుత మహా చండీ యాగం చేయడానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పించు కోవడం అభినందించాల్సిన విషయం. శత, సహస్ర చండీ యాగాలు చాలామంది చేశారు, చేయించారు కాని, ఇంతవరకు, ఒక్క శృంగేరి పీఠాధిపతి మినహా మరెవ్వరూ ఆయుత మహా చండీ యాగం చేసిన దాఖలాలు లేవు. బహుశా ఆయుత మహా చండీ యాగ నిర్వహణ కష్టతరమైంది కావడం మూలాన ఎవరూ సాహసించక పోయి వుండవచ్చు. మూడు వేల మందికి పైగా బ్రాహ్మణులు యాగ స్థలంలో వుంటూ నిత్యం పది వేల పర్యాయాలు దుర్గా పారాయణం చేయాలి ఈ యాగం సందర్భంగా. రెల్లు గడ్డితో భారీ యాగ శాల తయారు చేయాలి. వంద యజ్ఞ హోమ గుండాలు ఏర్పాటు చేయాలి.  ఆయుత మహా చండీ యాగం లక్ష చండీ యాగాలతో సమానం. ఆయుత చండీ యాగాన్నే శత సహస్ర చండీ యాగంగా కూడా అంటారు. ఒక చండీ యాగం కోటి యజ్ఞాల ఫలం, ఆయుత మహా చండీ యాగం లక్ష కోట్ల యజ్ఞాల ఫలంగా వేద పండితులు అంటారు. అత్యంత నియమ, నిష్ఠలతో ఈ యాగం చేయాల్సి ఉంటుందని కూడా వేద పండితులు చెపుతారు. యాగ పరిసమాప్తం ఐన తరువాత పూర్ణాహుతి వుంటుంది.

యజ్ఞ-యాగాలకు సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచిన అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇండాలజిస్ట్ స్వర్గీయ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి, గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!". అందుకే, ఇందుకే యజ్ఞ యాగాలు చేయడం అవశ్యం. END 

Thursday, June 6, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు

బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అక్కయ్యతో పాటు మాకూ సంబరమే! దసరా పండుగకు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ. ఒక విధంగా దసరా, బతుకమ్మ పండుగలు ఏక కాలంలోనే జరుపుకుంటాం. బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలను మేం ఇంటింటికి వెళ్లి సేకరించేవాళ్లం. మా జీతగాళ్లు తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లు. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. ఒక్కొక్కరి స్థోమతను బట్టి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ ఒక సంరక్షిత దేవత. తెలుగువారు, అందులో తెలంగాణ వారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. బతుకమ్మ బొమ్మను వుంచాల్సిన పళ్లెం, ఆకులతో కాని, వెదురుతో కాని చేసే వాళ్లు. గుమ్మడి పూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మ (గౌరమ్మ) ను వుంచేవారు. ఇలాంటివే మరికొందరు చేసిన వాటిని ఒక స్థలంలో వుంచి పూజిస్తారు. ధర్మాంగ-సత్యవతి దంపతులకు లక్ష్మీదేవి కటాక్షం వల్ల పుట్టిన బిడ్డ బతుకమ్మ. బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూంటారు స్త్రీలు. ఉదాహరణకు..."ఒక్కొక్క పూవేసి చందమామ, ఒక్క ఝాము ఆయె చందమామ, పోయిరా గౌరమ్మా, పోయిరా గౌరమ్మా, పోయి అత్తవారింట్లో గౌరమ్మా, బుద్ధిగా వుండాలి గౌరమ్మా...." అనే పాటలు పాడేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. ఓ గుడి ముందో, లేకపోతే ఎవరో ఒకరి ఇంటి ముందో దీనికి అనువుగా వుండే స్థలాన్ని ఎంపిక చేసుకునేవారు. ఎనిమిది రోజులపాటు...అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలెట్టి, తొమ్మిదో రోజున మా వూరు సమీపంలోని ముత్తారం పక్కన వున్న వూర చెరువు దగ్గర చద్దుల బతుకమ్మ ఆడేవారు. ఆడి, బతుకమ్మను నీటి ఒడిలో చేర్చేవారు. చద్దుల బతుకమ్మ రాత్రి బాగా పొద్దుపోయే దాకా ఆడేవారు. స్త్రీలతో పాటు పురుషులు కూడా వచ్చి దూరం నుంచి చూసి ఆనందించేవారు. ఐదు రకాల ప్రసాదాలను ఆ పండుగలో పంచి పెట్టే వారు. పెసర పప్పు, గోధుమ పిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో తయారు చేసినవవి. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది. బతుకమ్మ పండుగను బలే ఎంజాయ్ చేసే వాళ్లం మేం.

బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. దసరాకు, మా ఊరూ-వాడా, వూరి బయట పైలు పెంట సమీపంలో, పాఠశాలకు ఎదురుగా, పాతిన జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. విజయ దశమి (దసరా) కి, మా ప్రాంత పరిసరాలకి కొంత అవినాభావ సంబంధముంది. మా వూరికి అతి సమీపంలో వున్న "బాణాపురం" గ్రామ సరిహద్దులలోని జమ్మి చెట్టుపైనే, పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందర, వారి శస్త్రాస్త్రాలను వుంచారట. అదే విధంగా, సమీపంలోని మరో గ్రామం నేలకొండపల్లిలో "విరాటరాజు గద్దె" వుంది. భీముడు వంట చేసిన పెద్ద గాడి పొయ్యిలు కూడా వున్నాయి. ఇప్పుడా గద్దె పురా తత్వ శాఖ వారి ఆధీనంలో వుంది. దసరా పండుగ రోజుల్లో మా ఇంట్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. సాధారణంగా గ్రామాల్లో దసరా పండుగ నాడు నివురు గప్పిన నిప్పులా వున్న తగాదాలే మన్నా వుంటే బయట పడతాయి. ఒక ఏడాది మా వూళ్లో అదే జరిగింది. మా గ్రామ రాజకీయాలనే పూర్తిగా మార్చి వేసిన ఆ వివరాలు మరో సందర్భంలో ప్రస్తావిస్తాను.

మేం ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి మా చిన్నతనంలో "రోలు-రోకలి" అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. అదే విధంగా, రాత్రిపూట కాల్చుకునే టపాసులు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. అన్ని టపాసుల్లోకి చీమ టపాకాయలు  బలే మజా వచ్చేవి. దీపావళి నాడు కాల్చగా మిగిలినవి బధ్రపర్చుకుని, కార్తీక పౌర్ణమికి కాల్చే వాళ్లం. ఆ రోజున ముత్తారం దగ్గరలో వున్న వూర చెరువులో దేవుడి "తెప్ప ఉత్సవం" జరిగేది. దీపావళి పండుగకు ముత్తారం నుంచి దేవుడి ఉత్స విగ్రహాలను వూరేగింపుగా మా వూళ్లోకి తీసుకొచ్చేవారు. కొఠాయి మీద వుంచి పూజలు చేసే వాళ్లు. ఆ రోజంతా హడావిడే. చాలా సరదాగా గడిచేది. ముక్కోటి ఏకాదశికి కూడా దేవుడు వూళ్లోకి వచ్చేవాడు. ముక్కోటి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది.

మా ఇంటి ముందు భాగాన వున్న ధాన్యం పాతర్లు

మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు", రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. మా జొన్న కల్లం మా ఇంటి పక్కనే తోటలో వేసే వాళ్లం. ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" మా వూరి రైతుల్లో అతి కొద్ది మందికి మాత్రమే వుండేవి. మా ఇంట్లో వుండేవి. ధాన్యం కొలవడానికి మా ఇంటి నుంచి చాలా మంది తీసుకెళ్తుండేవారు. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. కొలత కొలిచేటప్పుడు కుండకు కాని, మానికకు కాని, తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం....పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. రాజకీయ కొట్లాటలున్న గ్రామాలలో తప్ప, మిగతా చోట్ల ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది.

అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు చిన్నతనం నుండి నేటి వరకు హాజరవుతూనే వున్నాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. ముత్తారంలోనే స్థిరపడి పోయిన వనం గోపాలరావు బాబాయింట్లో అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.

మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో బత్తుల వారి ఇంటి సమీపంలో "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు. మా కుటుంబానికి వంశ పారంపర్యంగా "హస్సేన్-హుస్సేన్" పీర్లుండేవి. ఏడవ సరగస్తు నాడు వాటిని బయటకు తీసేవారు. కుదాయ్ సాహిబ్ వీటిని నిర్వహించేవాడు. 

చిన్నతనంలో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం (రాత్రవుతుండగానే) జరిగే ఒక కార్యక్రమం నాకింకా గుర్తుంది. మాది పెద్ద వ్యవసాయం. జీతగాళ్లు కూడా పది మందికి పైగా వుండేవారు. రోజువారీ కూలీకి వచ్చే వాళ్లు కూడా కొందరుండేవారు. పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగొచ్చి, పశువులకు ఆ రోజుకు వేయాల్సిన దానా, ఇతర పనులు పూర్తైన తరువాత జీత గాళ్లకు "పొగాకు" పంచే కార్యక్రమం మొదలయ్యేది. జీత గాళ్లకు ఏటా ఇచ్చే జీతంతో పాటు, ఏడాదికి రెండు జతల చెప్పులు, ప్రతి రోజు తాగడానికి (పీల్చడానికి) పొగాకు (లేదా బీడీలు) ఇవ్వడం ఆనవాయితీ. మా నాన్న గారు ఒక కుర్చీలో కూచుని, హుందాగా ప్రతి రోజు పొగాకు కాడల పంపకం చేసేవారు. ఒకే సారి నెలకో-పదిహేను రోజులకో కలిపి ఇవ్వక పోయేవారు. పొగాకు పంపిణీ జరిగే సమయంలోనే ఆ రోజు పొలం పనులను సమీక్షించేవారు. జీత గాళ్లకు పొగాకు ఇవ్వడానికి మేం పొగాకు పంట కూడా వేసే వాళ్లం మొదట్లో. ఆ తరువాత రోజుల్లో పొగాకు పంట వేయడం ఆపుచేశాక బీడీలు పంపకం చేసే వాళ్లం