Showing posts with label సిపిఎం. Show all posts
Showing posts with label సిపిఎం. Show all posts

Saturday, December 24, 2011

"అత్యవసర" పరిస్థితి: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 16
"అత్యవసర" పరిస్థితి
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదహారవ అధ్యాయం ఇది).
                36 సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాల కోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు.
''తీవ్ర నిర్బంధ కాండకు, నియంతృత్వానికి పాలకవర్గ పార్టీ పాల్పడుతున్నది. ఇది ఏక పార్టీ నియంతృత్వాన్ని తీవ్రతరం చేస్తుంది. నేడు దేశం ముందున్న పెద్ద ప్రమాదం ఇదే'' అంటూ 1973లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ఒక హెచ్చరిక చేసింది. అంతకు ముందు, 1972లో జరిగిన పార్టీ 9వ మహాసభ కూడా ఇదే విధంగా హెచ్చరించింది. మహాసభ రాజకీయ తీర్మానంలో: ''గణనీయమైన రాయితీలు చూపి జనసామాన్యంలోని పెద్ద భాగాన్ని సంతృప్తిపరిచే శక్తి కాంగ్రెస్‌కు లేకపోవడం, మరిన్ని భారాలను మోపడం, నిర్బంధకాండను ప్రయోగించడం, వామపక్షాలు, ప్రతిపక్షం బలహీనంగా ఉండడం, పాలక పార్టీ మొత్తంగా ప్రతిపక్షాన్ని సహించలేని స్థితిలో ఉండటం ఇవన్నీ ఏక పార్టీ నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముంది...అన్ని ప్రజాతంత్ర పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఓటింగ్‌ హక్కుతో సహా కాంగ్రెస్‌ పాలనలో ఇంక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రజాతంత్ర పార్టీలు, గ్రూపులు, వ్యక్తులతో కూడిన సాధ్యమైనంత విస్తృతమైన ఐక్య సంఘటన అవశ్యం''.
ఇలా సిపిఎం హెచ్చరికలు చేసిన అనతికాలంలోనే, 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణంలేకపోలేదు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాని ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్‍లో, ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, నియంతృత్వ దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు, సిద్ధార్థ శంకర రే, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ. వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ సిపిఎం ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు. సిపిఎంతో సహా పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.
భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.
దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.
ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో-లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ విధించిన నాటి అర్థరాత్రి సమయంలో, డాక్టర్‍గారి ఆసుపత్రి కాలింగ్ బెల్ మోగింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి ఇంకా తెలియని డాక్టర్‍గారు, తలుపు తీసి, ఎదురుగా కనిపించిన మఫ్టీలోని పోలీసు అధికారిని, ఏమీ జరగనప్పుడు-ఏమవసరమున్నదని అంత అర్థరాత్రి వచ్చారని ప్రశ్నించారు. తనకు తెలియదని, ఎస్పీ గారు పిలుచుకుని రమ్మంటే వచ్చానని జవాబిచ్చాడా అధికారి. విషయం కొంతవరకు అవగాహన చేసుకున్న రాధాకృష్ణమూర్తి, అదేదో అరెస్ట్ వ్యవహారమేనని నిర్ధారించుకుని వచ్చిన పోలీసు అధికారిని గౌరవంగా సంబోధిస్తూ, కూచోమని కోరి, ఆయనకు కాఫీ ఏర్పాటు చేసి, దుస్తులు సర్దుకునేందుకు లోనికెళ్ళారు. తన జీవితంలో, అరెస్ట్ చేసేందుకొచ్చిన పోలీసు అధికారికి అంత మర్యాద ఇచ్చిన వారిని ఎవరినీ చూడ లేదన్నాడతడు. అలనాటి రాత్రి సంగతులను గుర్తు చేసుకున్న డాక్టర్‍గారు, పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వచ్చినప్పుడు, గౌరవించడం కనీస బాధ్యతని, తానదే చేసానని చెప్పారు. తాను, తన తోటి కామ్రేడ్స్ అలా ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం వల్లే, వారు కూడా తమ పట్ల గౌరవంగా వుండేవారని, ఒకటి రెండు జైలు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. జైలులో వాళ్ల కొచ్చిన ఉత్తరాలను ముందుగానే పరిశీలించి-సెన్సార్ చేసినప్పటికీ, పూర్తి పాఠాన్ని చదువుకునే వీలు కలిగించి తిరిగి తీసుకునేవారు జైలు అధికారులు. అలా సహకరించని ఒక జైలు అధికారితో, లోగడ మాకినేని బసవ పున్నయ్యగారు తాను కోరిన పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒక సందర్భంలో, "I can smuggle Elephants in to your Bloody Jail" అన్నారట.
ఇంటర్వ్యూలో పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే -అదీ ఒకరిద్దరిని, ఒక గంట సేపు మాట్లాడనిచ్చేవారట. భార్యా పిల్లలు వచ్చినా, మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి పక్కనే కూర్చుని తనకు వినబడేట్లు మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టేవారట.
డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు గార్లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జైల్లో వీరే కాకుండా నక్సలైట్లు, ఆరెస్సెస్‍కు చెందినవారు, జనసంఘీయులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన మరికొందరు కూడా వున్నారు. వారం రోజుల పాటు అందరూ ఉమ్మడి కాపురం చేసి, కలిసిమెలిసి భోజనాలు చేసేవారు. ఖమ్మం నుండి అతివాద గ్రూపులకు చెందిన చీకటి రోశయ్య, జీవన్, వడ్డెల్లి కృష్ణమూర్తి, వాసిరెడ్డి కోటేశ్వరరావు గార్లు వీరితో కలిశారు. వీరంతా డాక్టర్‍గారికి వ్యక్తిగతంగా స్నేహితులే. జైలులో ఆ స్నేహం స్థిరపడింది. తరువాత కూడా కొనసాగింది. అలాగే, కరీంనగర్ నుండి జనసంఘం పార్టీకి చెందిన చెన్నుపాటి విద్యాసాగరరావుగారు (వీరు 1998 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు)  వంటినిండా దెబ్బలతో జైలుకు వచ్చారు. , ఆ తర్వాత ఎవరి బారక్స్ వాళ్లకే కేటాయించారు. సిపిఎంకి చెందిన డాక్టర్ వై.ఆర్.కె, చిర్రావూరి, మంచికంటి, భగవాన్ దాస్, బోడేపూడి, నర్రా రాఘవరెడ్డి, ఓంకార్ లకు ఒక రెండు గదుల ఇల్లు లాంటి దాన్ని కేటాయించారు. వరండా అందరికీ కామన్‍గా వుండేది. వేరే గదిలో వంటా-వార్పు చేసుకునేవారు. తమ పార్టీ వారికి రాజకీయ పాఠాలు చెప్పినట్లే, అక్కడ ఇతరులకు తమ పార్టీ విధానాలు చెప్పడం, ఇతర పార్టీ వారి నుంచి వినడం ఒక నిత్యకృత్యమై పోయింది. డిటెన్యూలలో వరంగల్ అడ్వకేట్ ఆర్.ఎస్.ఎస్ నాయకులు భండారు సదాశివరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి. భగవద్గీత, షడ్ దర్శనాలకు సంబంధించిన పలు విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతివాది భయంకర షఠగోపాచారి మరో డిటెన్యూ. ఆయన ఆయుర్వేద వైద్య ప్రముఖులు. వరవర రావును కూడా వీరితో పాటు అదే జైల్లో డిటెన్యూగా వుంచింది ప్రభుత్వం. అలానే పలు ముస్లిం నాయకులనూ నిర్బంధించి అక్కడే పెట్టింది. పద్దెనిమిది నెలల ఆ జైలు జీవితంలో సహచర డిటెన్యూల దగ్గర భగవద్గీత, షడ్ దర్శనాలు, ఆయుర్వేద వైద్యం, ఇస్లాం మతానికి చెందిన విషయాలను నేర్చుకున్నారు డాక్టర్ వై.ఆర్.కె. ఈ జైల్లో కూడా జైలు డాక్టర్ డ్యూటీని ఆయన డిటెన్యూగా వచ్చిన తర్వాత ఆయనకే అప్ప చెప్పారు. తృప్తిగా వృత్తి ధర్మాన్ని అక్కడ కూడా నిర్వహించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడానికి నెల రోజుల ముందర అందరు డిటెన్యూలతో పాటు డాక్టర్ వై.ఆర్.కె ని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆలా బయటకు పోయి, ఇలా లోనికి వస్తానని అనుకోలేదాయన అప్పటికి. అలా గడిచింది డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారి నాలుగో పర్యాయం జైలు జీవితం.
జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకులని భావించిన డాక్టర్ వై.ఆర్.కె, రావెళ్ల సత్యం, కె.ఎల్. నరసింహారావు గార్లను అరెస్ట్ చేసి, మళ్ళీ జైలుకు తరలించారు. అలా ఐదవ సారి అరెస్ట్ చేయడం జరిగింది. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, 1977 మార్చ్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ వై.ఆర్.కె ను పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు. అలా డాక్టర్ గారి అయిదో పర్యాయం జైలు జీవితం ముగిసింది.
హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

Sunday, December 11, 2011

పౌర హక్కుల సంఘం: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 10

పౌర హక్కుల సంఘం

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో దవ అధ్యాయం ఇది).

నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, .ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ గారి తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు-డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.

సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం.

Saturday, November 5, 2011

పౌరహక్కులను హరించి వేసేందుకు నాంది పలికిన ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు

ఈ అరెస్టులు సూచిస్తున్నదేమిటి?

ఆంధ్ర జ్యోతి దినపత్రిక (8-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానంకు చెందిన ఒక్కో కాంగ్రెస్ నాయకుడు ఒకరోజొక మాట, మర్నాడొక మాట, ఒకదానికి మరొకటి పొంతన లేకుండా మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒకానొక రోజుల్లో, రాజకీయ పార్టీల నాయకులు, "స్పష్టత" తో మాట్లాడడమే విశ్వసనీయతకు గీటు రాయిగా భావించేవారు. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నేపధ్యంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేది లేదని (ఆమె నిర్ణయం మనకు నచ్చినా నచ్చకపోయినా) స్పష్టంగా తేల్చి చెప్పింది ఇందిరాగాంధి. ఈ రోజుల్లో, ఎంత "అస్పష్టత" వుంటే అంత విశ్వసనీయత అనుకుంటున్నారు (ముఖ్యంగా కాంగ్రెస్) రాజకీయ నాయకులు. ఆరంభంనుంచీ నేటి వరకూ ఒక్క మాట మీద నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే, ఏ రాజకీయ పార్టీలో కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పష్టత అనేది నూటికి నూరుపాళ్లు వుందా అని ప్రశ్నిస్తే "లేదు" అనే సమాధానమే వస్తుంది. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలని నినాదమిచ్చిన భారతీయ జనతా పార్టీకి "ఇచ్చే స్థితి లో వున్నప్పుడు స్పష్టమైన విధానం కొరవడినందున, "అడిగే స్థాయి" కి వచ్చిందాకా "స్పష్టత" రాలేదు. ఇక కమ్యూనిస్టులలో సగం మందికి ఒక రకమైన అస్పష్టత వుంటే, ఇంకో సగం మందికి వేరే విధమైన అస్పష్టత. అలానే మిగతా పార్టీలు కూడా.

డిసెంబర్ తొమ్మిది (2009) న చెప్పిన మాట మార్చిన "కాంగ్రెస్ పార్టీ-యూపీఏ కేంద్ర మంత్రి" చిదంబరం, బక్రీద్ తరువాత తెలంగాణపై ప్రకటన చేస్తామని చెప్పి రోజన్న తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై "పిడి" ని ప్రయోగించింది. ఇది శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని అమలు చేయడానికా? ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాడుతున్నవారిని అణగదొక్కే చర్యలకు శ్రీకారం చుట్టడానికా? ఇవేవీ కాకపోతే టిఆర్ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యుడిని అర్థ రాత్రి దాటిన తర్వాత పిడి చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన ఆగత్యం ఏమిటి? అరెస్టు చేయబడిన వ్యక్తికి గతంలో మావోయిస్టు కార్యకర్తలతో సంబంధాలు వుండవచ్చు. జనశక్తి, మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని వుండవచ్చు. కానిప్పుడు అందరిమధ్యా, ప్రజాస్వామ్య ఉద్యమాల మధ్యా వుంటూ, గుర్తింపు పొందిన ఒక ప్రాముఖ్య తెలంగాణ రాజకీయ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్నాడే! అంటే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై పిడి చట్టం ప్రయోగించడం, పౌరహక్కులను ఉల్లంఘించడం మొదలైందనుకోవాలా?

ఇలా పౌరహక్కులను అణచి వేయడం గమనిస్తుంటే, గతం గుర్తుకొస్తోంది. భారత చైనా యుద్ధం నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ చీలిపోవడం, పిడి చట్టం కింద చైనా వాదులుగా ముద్రపడిన సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు వేయి మందికి పైగా, అర్థరాత్రి అరెస్ట్ కావడం జరిగింది. అలనాటి కేంద్ర హోం శాఖ మంత్రి గుల్జారిలాల్ నందా పిడి చట్టానికి రూపకర్తంటారు. ఏదేమైనా అప్పుడు అరెస్టు కాబడింది కమ్యూనిస్టులే కాబట్టి, అందునా అతివాద గ్రూపుకు చెందిన (ఇంకా నక్సల్‍బరీ ఉద్యమం రాలేదు) వారు కాబట్టి, పిడి చట్టాన్ని కాని, అరెస్టులను కాని ఖండించిన రాజకీయ పార్టీలు ఒక్కటీ కూడా లేవు. చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలమీద ఉపయోగించలేదన్న సంతృప్తితో వున్నారు వారంతా!

దశాబ్దంన్నర తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దరిమిలా, అన్ని రాజకీయ పార్టీలకు అరెస్టులు స్వానుభవంలోకొచ్చ్చాయి. అప్పుడు గుర్తుకువచ్చింది వారందరికీ. భారత చైనా యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న సిపిఎం నాయకుల అరెస్టును అప్పుడే ఖండించి వుంటే, తమకీ గతి పట్టి వుండేది కాదని! వాస్తవానికి, ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐపై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, ఖమ్మం జిల్లాకు చెందిన అలనాటి పౌరహక్కుల ఉద్యమ ఆద్యులు-"మేధావి త్రయం" గా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు కె.వి.సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణలు చెప్పారు. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించినా, ఇతరులు తమకెందుకులే అని నిర్లిప్తతతో వున్నారు. ఆ నిర్లిప్తత పర్యవసానమే ఎమర్జెన్సీ అరెస్టులు, ఈనాటి తెలంగాణ ఉద్యమ నేతల పిడి అరెస్టులు.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు ("పిడి", "మీసా", "ఎస్మా" లాంటివి) ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో (ఇప్పుడు ఎమర్జెన్సీ కాకపోయినా-తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో) పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జెళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లోనే ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డి. యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఐతే ఎన్ని రకాల పౌరహక్కుల సంఘాలు ఆవిర్భవించినా, ఎన్ని ఉద్యమాలు నడిచినా, జరిగే నష్టం జరుగుతూనే వుంది. పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుందనీ, భవిష్యత్‍లో జరగదన్న నమ్మకం లేదనీ, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే అభిప్రాయపడిందంటే అంతకంటే ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంటుంది? కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే(సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ ఏడాది, జనవరి 2011 మొదటి వారంలో, ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో, అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం . 1976 లో, ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి (ఇందిరాగాంధీ) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009 , ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రికరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. జబల్పూర్ అదనపు మెజిస్ట్రేట్-శివ కాంత్ శుక్లాల హెబియస్ కార్పస్ కేసు సుప్రీం కోర్టు ముందుకు విచారణకొచ్చింది. తీర్పిచ్చిన ఐదుగురిలో, నలుగురు న్యాయమూర్తులు ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. అదే జరిగిందిప్పుడు.

ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.

అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ నాడు, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యమకారులతో సహా ఎవరి పౌరహక్కుల ఉల్లంఘన జరగడానికి వీలులేదని ఘంటాపథంగా నొక్కి చెప్పాలి. అరెస్టులు ఇంతటితో ఆగిపోవాలి. అరెస్టు ఐన వారి పౌరహక్కులు తక్షణమే పునరుద్ధరించబడాలి.

తెలంగాణ-సమైక్యాంధ్ర అన్న విషయాన్ని కాసే పన్నా మరిచిపోయి, పౌరహక్కుల ఉల్లంఘన జరిగిందని ఎలుగెత్తి చాటడమే మేధావుల (ఆంధ్రా మేధావులతో సహా) కనీస కర్తవ్యం. పౌరహక్కుల కొరకు పోరాడే మీడియా కనీస ధర్మం. End

Friday, July 2, 2010

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం: వనం జ్వాలా నరసింహారావు

(జులై 3-4, 2010 తేదీలలో సిపిఎం పోలిట్ బ్యూరో
సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో.....)

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు


ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్), వేలాదిమంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఎదుగుతూ, కేరళ-పశ్చిమ బెంగాల్-త్రిపుర రాష్ట్రాలలో బలమైన పట్టు సాధించి, గత కొద్ది కాలంగా తిరోగమన దిశగా పయనించడానికి దారి తీసిన పరిస్థితులను అగ్రనాయకత్వం సరి దిద్దుకునే ప్రయత్నం చేయడం ఆరంభించింది. పార్టీ తలపెట్టిన విప్లవ లక్ష్యాలను-ధ్యేయాలను చేరుకుని, అధిగమించేందుకు, రాజకీయ పరంగా-సిద్ధాంత పరంగా చోటుచేసుకున్న బలహీనతలను, నిర్మాణ పరంగా జరిగిన అపరాధాలను అన్వేషించ సాగింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది.

దిద్దుబాటు ఉద్యమం తీరుతెన్నులను, పార్టీ అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు అన్వయించి అమలుపర్చే పద్ధతిని, అలాంటి ప్రక్రియనే జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ నిర్ణయం ఎంత మేరకు అమలుకు నోచుకుందో ఇదమిద్ధంగా ఇంతవరకు బయట పడలేదు. పదిహేనవ సాధారణ ఎన్నికల్లో సిపిఎం గెల్చుకున్న లోక్ సభ సభ్యుల సంఖ్య 2004 ఎన్నికలలో గెల్చుకున్న 42 నుంచి గణనీయంగా పడిపోయి కేవలం 16 కు కుదించుకుని పోవడంతో, పార్టీ నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవడంలో భాగంగా, "దిద్దుబాటు ఉద్యమం" బాట పట్టాలని భావించింది. ఇంతలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికల చేదు అనుభవం ఎదురైంది.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, చైనా-రష్యాల మధ్య బెడిసికొట్టిన సంబంధాల, భారత-చైనా యుద్ధ పరిణామాల నేపధ్యం, భారత కమ్యూనిస్ట్ పార్టీలో 1962 లో చీలికకు దారితీశాయి. నూతనంగా ఏర్పాటైన భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్)-సిపిఎం పార్టీ, సభ్యత్వ సంఖ్యాపరం గాను, ఎన్నికల్లో సాధించిన ఫలితాల పరం గాను, బలీయమైన శక్తిగా గుర్తింపు పొంద సాగింది. పార్టీలో చీలిక వచ్చిన తర్వాత కూడా కొంతకాలం, ఉభయ పార్టీలకు ట్రేడ్ యూనియన్ పరంగా ఒకే ఐక్య వేదిక వుండేది. అప్పట్లో పార్టీలో చీలికైనా, ట్రేడ్ యూనియన్ లో చీలికైనా, సైద్ధాంతిక పరమైన అభిప్రాయ భేదాల వల్ల వచ్చిందే కాని, వ్యక్తిగత కారణాల వల్ల వచ్చింది కాదు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆస్తులు కూడగట్టుకోడానికి, అంతస్తులు పెంచుకోవడానికి, చట్టసభల్లో ప్రవేశించేందుకు, ప్రవేశించి-బూర్జువా పార్టీకి చెందినవారితో సమానంగా అంతస్తులు పెంచుకునేందుకు, పార్టీ టికెట్ పొందడానికి, కాంట్రాక్టర్ల కొమ్ము కాయడానికి, పార్టీని ఉపయోగించుకునే అలవాటుండేది కాదు. ఏది జరగకూడదని పార్టీ ఆవిర్భావపు రోజుల్లో అనుకున్నా రో, దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుండడంతో, "దిద్దుబాటు ఉద్యమాల" అవసరం కలిగిందనాలి.

1964 లో ఆవిర్భవించిన సిపిఎం, ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందు వరుసలో వుండేది అలనాటి పార్టీ నాయకత్వం కింద. వామ పక్షాలలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మూడు రాష్ట్రాలలో వామ పక్ష ఐక్య సంఘటన ప్రభుత్వాలకు సారధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం పొందినప్పటికీ, అదింకా బలమైన వామ పక్షం అన్న విషయంలో అనుమానం లేదు. అంత మాత్రాన, పార్టీ బలం పది కాలాల పాటు మిగులుతుందన్న ధీమాతో వుండే అవకాశమూ లేదు.

రాజకీయ-సైద్ధాంతిక బలహీనతలను, వ్యవస్థాగత లోటుపాటులను సరి దిద్దుకుని ముందుకు సాగినప్పుడే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ లక్ష్యాలను సాధించగలదని పార్టీ నాయకత్వం భావించింది. వర్గ ప్రాధాన్యతల సమాజంలో, పాలకవర్గం మాట చెల్లుబాటు కావడమే కాకుండా, దాని ప్రభావం సమాజంపై పడుతుంది. అలాంటి సమాజంలో, బూజుపట్టిన సిద్ధాంతాలను ఇతరులపై రుద్దే ప్రయత్నంలో కమ్యూనిస్ట్ పార్టీని కూడా వదలదు పాలక వర్గం. ఆ ప్రభావానికి లోనైన కమ్యూనిస్టులను దిద్దుబాటులో పయనించేలా చర్యలు నిరంతరం చేపట్టాల్సిన బాధ్యత నాయకత్వానిదే. కాకపోతే, ఆ నాయకత్వంలోని కొందరు అదే మంచిదని ఆ ప్రభావంలో పడిపోతే, కంచే చేనును మేసినట్లవుతుంది.

భారత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలంటే అనుసరించతగిన మార్గాలకు సంబంధించి, ఆదినుంచీ భిన్నాభిప్రాయలుండేవి. ఎవరు నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా వారు మసలుకున్నారు. అంత మాత్రాన అవసరం వచ్చినప్పుడు విమర్శలకు గురికాక తప్పలేదు. 1964 నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్న మాకినేని బసవ పున్నయ్య, తన బాధ్యతలను విస్మరించి-పోరాట మార్గాన్ని విడనాడి, కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితమై పోయాడని, సాక్షాత్తు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆగస్ట్ 1975 లో పదవికి రాజీనామా చేస్తూ పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారంటే, అప్పట్లో పెద్దా-చిన్నా తేడా లేకుండా పార్టీకి చెందిన ప్రతివారిని ఎంత నిశితంగా పరిశీలించడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు... అందరూ.. పార్టీ క్రమశిక్షణకు అతీతులే !

వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విప్లవ రథ సారధులలో ముఖ్యుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య లాగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారు అరుదుగా కనిపిస్తారు. ఆయన పేరు చివర నున్న కుల ప్రాధాన్యతను గుర్తుచేసే "రెడ్డి" పదాన్ని శాశ్వతంగా తన పేరునుంచి తొలగించు కోవడంతో పాటు, సమాజ సేవే లక్ష్యంగా జీవించాలన్న తలంపుతో-భార్య అంగీకారంతో, తమకు సంతానం వద్దని నిర్ణయం తీసుకున్నారాయన. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో 1936 లోనే కేంద్ర కమిటీ సభ్యుడైన సుందరయ్య 1948-1952 మధ్య కాలంలో అజ్ఞాతంలో గడిపారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. పార్టీ పక్షాన పార్లమెంటుకు ఎన్నికైన సుందరయ్య గారు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో సైకిలెక్కి పార్లమెంటు భవనానికి వెళ్లేవారు. ఇప్పుడేమో స్కార్పియోలకు తక్కువ లేకుండా పార్టీ పక్షాన ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉపయోగిస్తున్నారు. సిపిఎం ఆవిర్భావం నుంచి 1976 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుందరయ్య గారు, దేశంలో ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితి విధించిన నేపధ్యంలో, పార్టీ అలవరచుకుంటున్న "అభివృద్ధి నిరోధక అలవాట్ల" కు నిరసనగా రాజీనామా చేశారు.

సుందరయ్య గారు రాజీనామా సమర్పించి పాతిక సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో, ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాల తరహా దిద్దుబాటు చర్యలకు, ఏడాది క్రితం పార్టీ కేంద్ర కమిటీ సూచించిన దిద్దుబాటు చర్యలకు మధ్యనున్న తేడాను, కమ్యూనిజం కోణంలోంచి పరిశీలించి చూడాల్సిన అవసరం చాలా వుంది. ఆయన సూచనలను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే, ఈనాడు అసలు “దిద్దుబాట” పట్టాల్సిన అవసరమే లేదు. సుందరయ్య గారి రాజీనామా లేఖలో ఇతర అంశాలతో పాటు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు మరొక్కమారు మననం చేసుకోవడం మంచిదే మో. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో, "జనసంఘ్" పార్టీతో కలిసి సిపిఎం ఉమ్మడి ఉద్యమాలను చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. నిశితంగా విమర్శించారు. జనసంఘ్ తో కలిసిన వారు, ఆ పోకడలను వంట పట్టించుకోక ఎలా వుండగలుగుతారు? పార్టీ వ్యూహాత్మక పంథాను పోలిట్ బ్యూరో చిత్తశుద్ధితో వాస్తవ రూపంలో అమలు పర్చలేకపోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. పార్టీని కాదనే శైలిలో ట్రేడ్ యూనియన్ విభాగం పనిచేసే విధానం ఆయనకు నచ్చలేదు. వ్యవసాయిక విప్లవాన్ని ఆచరణలో పెట్టడం విషయంలో అలసత్వం ప్రదర్శించడానికి తాను వ్యతిరేకం అన్నారు. పార్టీ సంస్థాగత ఎదుగుదలకు అవసరమైన రహస్య వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదన్నారు. బసవ పున్నయ్య లాంటి కొందరు బాధ్యతలను విస్మరించడంతో సహా, పోలిట్ బ్యూరో సభ్యులు సమష్టిగా పనిచేయకపోవడం-రణ దివే తో తనకు తలెత్తుతున్న తీవ్ర వి బేధాలు కూడా ఆయన ప్రస్తావించారు.

ఒకదానికి మరొక టి పొంతనలేని తరహా రాజకీయ-సంస్థాగత దృక్ఫదంతో సిపిఎం పోలిట్ బ్యూరో వ్యవహార ధోరణి వుండడం తనకు నచ్చడం లేదని స్పష్టం చేశారు సుందరయ్య గారు. తనకే గనుక కనీసం మూడొంతులమంది కేంద్ర కమిటీ సభ్యుల మద్దతు లభించినట్లయితే, పార్టీ కాంగ్రెస్ నిర్వహించి కొత్త ప్రధాన కార్యదర్శిని-పోలిట్ బ్యూరోను ఎన్నుకోవాల్సిందిగా డిమాండ్ చేసేవాడినని ఆయన తన లేఖలో పేర్కొన్నారంటే, ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవాలి. తనకు నచ్చని అంశాలను బహిరంగంగా లేఖలో పేర్కొనకుండా, రాజీ ధోరణిని అవలంభించినట్లయితే, పది కాలాల పాటు పదవిలో కొనసాగ వచ్చునన్న భావన ఆయనకు ఏనాడు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ, చనిపోయేంతవరకు, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మరణానంతరం సిపిఎం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, సుందరయ్య గారి అనుమానాలు నిజమవుతున్నాయనే అనుకోవాలి.

సుందరయ్య గారైనా, బసవ పున్నయ్యైనా, చండ్ర రాజేశ్వర రావైనా, మోటూరి హనుమంతరావైనా, జిల్లా-రాష్ట్ర స్థాయి నాయకులైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య అయినా, మంచి కంటి రామ కిషన్ రావైనా, బోడేపూడి వెంకటేశ్వర రావైనా.... ... ఆ మాట కొస్తే, అలనాటి కమ్యూనిస్ట్ నాయకులెవరైనా, కేవలం "పార్లమెంట్ దృక్ఫదం" తోను, "ఎన్నికల అవకాశ వాదం" తోను పనిచేయడం గాని, తద్వారా లభించబోయే లాభాలకు ఆకర్షితులవడం గాని జరగలేదు. వాళ్లకున్నదంతా త్యాగం చేశారే గాని, ఆస్తులు కూడగట్టుకోలేదు. ఇప్పుడదొక అలవాటుగా, సాంప్రదాయంగా మారిపోయింది. అలా మారిందని సాక్షాత్తు పార్టీ కాంగ్రెసే అభిప్రాయపడిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

1996 లో పార్టీ రూపొందించిన దిద్దుబాటు ఉద్యమం డాక్యుమెంటుకు కొన్ని సవరణలు చేసి, ఉద్యమాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు, నూతన విధానాన్ని తయారుచేయాలని కోయంబత్తూర్ లో మార్చ్29-ఏప్రిల్ 3, 2008 లో జరిగిన పంతొమ్మిదవ పార్టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ నిర్ణయించిన విధంగా, దిద్దుబాటు చర్యలు పటిష్టంగా అమలు చేయడం జరగలేదని, ఆత్మ విమర్శ కూడా చేసుకుంది పార్టీ నాయకత్వం. ఏవో కొన్ని చెదురు-ముదురు సంఘటనలకు సంబంధించిన తప్పొప్పులను సరిదిద్దడం జరిగినా, ఆశించిన మేర ఫలితం కలగలేదని పార్టీ భావించింది. అసలా మాటకొస్తే, దిద్దుబాటు కార్యక్రమం అమలు ప్రక్రియలో అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులను చేర్చే వ్యవహారంలో బలహీనతలు చోటుచేసుకున్నాయని కూడా పార్టీ అభిప్రాయ పడింది.

గత 12-14 సంవత్సరాల కాలంలో అమలైన దిద్దుబాటు చర్యలు అనుకున్న ఫలితాలు సాధించ లేకపోయిందని పార్టీ భావించింది. సిపిఎం కేడర్లను, లీడర్లను బూర్జువా రాజకీయ పార్టీలనుసరిస్తున్న విధానాలు గతంలోకంటే మరింతగా ప్రభావితం చేస్తున్నాయని, వారు ఆస్తులను సమకూర్చుకోవడంతో పాటు వారి వ్యాపార-వాణిజ్యాలకు తమ రాజకీయ పలుకుబడిని సంధానం చేస్తున్నారని, ఎన్నికలలో పార్టీ పరంగా ధనాన్ని పెద్దమొత్తంలో వ్యయం చేస్తున్నారని, పార్టీ కేంద్ర కమిటీ భావించింది. ఎన్నికల అవగాహన నెపంతో, అభివృద్ధి నిరోధక-బూర్జువా విధాన పార్టీల అలవాట్లను అలవరచుకుంటూన్నారని అగ్ర నాయకత్వం వాపోయింది. 2001 తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్మిక వర్గానికి చెందిన అనేక మందికి పార్టీ పట్ల-ప్రజా ఉద్యమాల పట్ల కనీస అవగాహన లేదని, ఆ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్ లో ప్రమాదం వుందని పార్టీ అభిప్రాయ పడింది. కార్మిక వర్గానికి చెందిన వారి శాతం 75 వర కుండగా, కేవలం 30 శాతం మంది మాత్రమే వివిధ కమిటీలలో స్థానం పొందగలుగుతున్నారని, ఇది కూడా బూర్జువా విధానాలకు అనుగుణంగానే వుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

గత పది-పన్నెండు సంవత్సరాలలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించిన ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం. పార్టీ కేంద్ర కమిటీ ఆత్మ విమర్శ చేసుకున్న పద్ధతి నిశితంగా గమనిస్తే, పార్టీ ఎంత ఊబిలో కూరుకుపోయిందో-పోబోతోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. దిద్దుబాటు ఉద్యమం పరిస్థితులను కొంత మేరకు సరిదిద్దగలదేమో గాని, ప్రక్షాలణ చేయడం సాధ్యమవుతుందా? ప్రశ్నార్థకమే.