Showing posts with label హిందూ సాంప్రదాయ వివాహ వేడుక. Show all posts
Showing posts with label హిందూ సాంప్రదాయ వివాహ వేడుక. Show all posts

Friday, February 26, 2010

వివాహబంధం-VIII: పెళ్ళి రోజు-బంధు మిత్రుల రాక:వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్ళి రోజు-బంధు మిత్రుల రాక
"లక్ష్మి, పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపం వధువు
త్రిమూర్తుల దివ్య స్వరూపం వరుడు

వనం జ్వాలానరసింహారావు

అనుకున్న రోజు ఏప్రియల్ 30, 1969 రానే వచ్చింది. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. ముహూర్తం ఉదయమే కావడంతో పనులన్నీ తెల్లవారు ఝామునుంచే ప్రారంభమయ్యాయి. ఇక్కడ మా ఇంట్లో (విడిది), అక్కడా ఆడ పెళ్లివారింట్లో హడావిడి ఆడంబరంగా మొదలయింది. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో మాదిరిగా మాకూ ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది. అయితే మా వివాహం మాత్రం, జరిగింది బస్తీలో అయినా, పద్దతంతా పల్లెటూరుదే. మా మామగారి ఇంట్లోనే, ఉన్న జాగాలోనే, ఇంటిముందు ఖాళీ ఆవరణలో, కల్యాణ మంటపాన్ని మరిపించే తాటాకు పందిరి కింద కొబ్బరి ఆకుల వేదిక సిద్ధం చేశారు. మామిళ్లగూడెం బజార్లో కాపురముంటున్న చాలామంది మా ఇరువురికీ బంధువులే. అందరూ దగ్గరి వారే. ఆడ పెళ్లి వారి అతి సమీప బంధువుల ఇళ్లు వీరింటికి ఇరువైపుల వున్నందున ఆ ఇళ్లన్నీ పెళ్లి వారి ఇళ్ల లానే కనిపించాయి. వధువు ఇంటినుంచి మా ఇంటి దాకా రోడ్డంతా మా వాళ్లతోనే నిండి పోయిందనాలి.

బంధువుల రాక ఉదయాన్నుంచే మొదలయింది. మా మామ గారు మంచి పేరున్న జిల్లా స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుడైనందున హేమా-హేమా కాంగ్రెస్ నాయకులందరూ ఉదయాన్నే రాసాగారు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని మా గ్రామాలన్నీ రాజకీయంగా మా వెంట వుండేవి. ప్రతి గ్రామంలోనూ, ఎవరో ఒకరు, మా బంధువులకు చెందిన వారో- లేక వాళ్ల అనుంగు అనుచరుడో సర్పంచ్‍‍గా ఎన్నికవాల్సిందే. ఆ నేపధ్యంలో, మా మామగారి గ్రామం వల్లభిలో ఆయనకు-ఆయన వ్యతిరేక వర్గం వారికీ ఘర్షణలొచ్చి, ఆయన అనుచరులైన హరిజనులను గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు కొందరు. అహింసా మార్గాన్ని అవలంబించే మా మామగారు అయితరాజు రాంరావు గారు, ఘర్షణలకు దిగకుండా, గాంధేయ మార్గంలో సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు. ఆచార్య వినోబా బావే శిష్యుడు ఆచార్య భన్సాలీని వల్లభి గ్రామానికి ఆహ్వానించి, గ్రామ పరిస్థితులను వివరించారు. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కదిలొచ్చిన అలనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, ఆచార్య భన్సాలికిచ్చిన హామీకి అనుగుణంగా హరిజనులందరూ గ్రామ ప్రవేశం చేశారు. సమస్య పరిష్కారమయ్యి, అందరూ కలిమిడిగా వుండడానికి ఇష్టపడ్డారు. ఇవన్నీ జరిగి అప్పటికింకా ఎక్కువ రోజులు కానందున, సత్సంబంధాలు కొనసాగించే దిశగా, వల్లభి గ్రామం మొత్తం కదిలొచ్చింది. ఇక మావైపు వారి విషయానికొస్తే, మేమూ చాలామందిమే అయ్యాం.

నేనప్పుడప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ వారితో తిరుగుతుండడం వల్లా, గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నందు వల్లా, మా వూరినుంచీ అనేకమంది రావడమే కాకుండా, జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకత్వమంతా పెళ్ళికొచ్చారు. ఇలా పెళ్ళి వారిల్లు కళ-కళలాడింది. పెళ్ళికి వచ్చినవారిలో మాకు గుర్తున్నంతవరకు హాజరయిన పెద్దల్లో, శ్రీయుతులు (అప్పటి ఎమ్మెల్యే) కత్తుల శాంతయ్య, (జిల్లా పరిషత్ అధ్యక్షుడు) భువన సుందర రెడ్డి, (ప్రముఖ కవి-ఎమ్మెల్సీ) హీరా లాల్ మోరియా, రావులపాటి జానకి రాంరావు, (ఒకసారి ఎమ్మెల్యే) బొమ్మకంటి సత్యనారాయణ రావు, (ఒకసారి ఎమ్మెల్యే) చేకూరి కాశయ్య, (ఒకప్పటి సమితి అధ్యక్షుడు) రావులపాటి సత్యనారాయణ రావు వున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన శ్రీయుతులు (ఎమ్మెల్యే) రజబ్ అలి, (మునిసిపల్ చైర్మన్) చిర్రావూరి లక్ష్మీనరసయ్య, (ఒకసారి ఎమ్మెల్యే) మంచి కంటి రామ కిషన్ రావు, (ఒకసారి ఎమ్మెల్యే) బాజి హనుమంతు, వనం నరసింగరావు, రావెళ్ల సత్యనారాయణ, గండ్లూరి కిషన్ రావు కూడా వచ్చారు. ఇంతలో పెళ్లి తంతు మొదలయింది. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలయ్యాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. ఆ నాడు-ఆ కాసేపు మేమిద్దరం ఆ పాత్రలను పోషించాం.(Part IX Next Follows)

Wednesday, February 24, 2010

వివాహబంధం-IV: పెళ్లి చూపులు-ఇరు కుటుంబాల నేపధ్యం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం- IV
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం-వాగ్దానాలు
వనం జ్వాలానరసింహారావు

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం మేమందరం, మా బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూడాలి. అదే చేశాం మేమందరం. వల్లభి, వారి స్వగ్రామ మైనా, వారికి ఖమ్మంలో కూడా ఇల్లున్నందువల్ల, మాకూ అక్కడ ఇల్లున్నందువల్ల పెళ్లి చూపుల ఏర్పాటు ఖమ్మంలో చేశారు. మా రెండు కుటుంబాల వాళ్ళ ఇళ్లు "మామిళ్లగూడెం" వీధిలో వున్నాయి. ఆ వీధిలో అప్పట్లో నూటికి తొంబై మంది బ్రాహ్మణ కుటుంబాలవారే వుంటుండేవారు. ఇప్పటికీ, మూడొంతుల మంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారే. అక్కడి మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ కూడా సాధారణంగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే అయ్యుంటారు. ప్రస్తుతం మా ఆవిడ అక్క కొడుకు జూపూడి షమంత్ అక్కడినుంచి కౌన్సిలర్గాం ఎన్నికయ్యాడు. పెళ్ళి చూపులకు మా వైపునుంచి, వారి వైపునుంచి వచ్చిన వారిలో చాలామంది ఇరువురికీ కావాల్సినవారే-ఇరుకుటుంభాలకూ పరిచయస్తులే. పింగళి తిరుమలరావు గారు, వనం శ్రీరాంరావు గారు, కవుటూరి కృష్ణమూర్తి గారు, జూపూడి నరసింహారావు గారు, జూపూడి ప్రసాద్, వనం నరసింగరావు-వారి కుటుంబానికి చెందిన వారు పెళ్ళి చూపులకు వచ్చినవారిలో ప్రముఖులు. మా అమ్మ, నాన్న, మా అన్నదమ్ములందరూ, అక్కచెళ్లెల్లందరు, బావగారు చలపతిరావు గారు వచ్చారు.

నా వయస్సు అప్పటికి 20 సంవత్సరాలు. కాబోయే శ్రీమతి వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. అయినా, వధూ-వరులు పరస్పరం నచ్చారన్న నిర్ణయానికి ఇరు పక్షాల బంధువులు వచ్చారు. అది నిజంకూడా. అయితే ఎలా నిజం? అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అందుకే, సమాధానం రాబట్టుకొనేందుకు, సీతా కల్యాణ ఘట్టం చదవాలి. ఇక ఆ తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. వరకట్న నిషేధం అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవాలి. పెళ్ళి చూపుల కార్యక్రమం అయింతర్వాత, మిగిలిన విషయాలను మాట్లాడుకోవడానికి మర్నాడు మా ఇంటికి రమ్మని మా నాన్నగారు వాళ్లను ఆహ్వానించారు. వారూ సమ్మతించారు. అంచెలంచల ఘట్టంలో మరో అడుగు పడింది.

మా ఆహ్వానం మేరకు మర్నాడు ఆడ పెళ్లి వారి పెద్దలందరూ మా ఇంటికి భోజనానికి వచ్చారు. మాటా-మంతీ జరిగింది. ఒకే ఒక్క రోజులో పెళ్ళి సంబంధం కుదిరినందుకు మా మామగారి తరఫు బంధువులంతా సంతోషించారు. మార్చ్ నెల 30న లగ్నాలు పెట్టుకుందామని అనుకున్నారు. లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న రాంరావు గారి పెద్ద కొడుకు డాక్టర్ రంగారావు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వుత్తరాలు రాసేవాడని మా ఆవిడ తర్వాత చెప్పింది. అటువైపు-ఇటు వైపునుంచి మా ఇంటికి వచ్చిన పెద్దలు మా ఇరు వంశాల వారి గురించీ-వారి గొప్పదనాన్ని గురించీ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇది సహజంగా ప్రతి పెళ్ళిముందరా జరిగేదే. సీతా కల్యాణ ఘట్టంలో వశిష్టుడు మాదిరిగా ఇరుపక్షాలకు చెందిన పురోహితులో, ఎవరైనా పెళ్లి పెద్దలో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో వంశ క్రమం ప్రస్తావన తెస్తారు. ఎవరెంత గొప్పవారైందీ-ఎంత మందీమార్బలం వున్నవారైందీ చెప్పుకుంటారు. అదే జరిగింది మా ఇంట్లో కూడా.

మా విషయానికొస్తే, మాది పరాశర గోత్రమైనందున మా వంశానికి ఆది పురుషుడు వశిష్ట మహర్షి, ఆయన కొడుకు శక్తి, ఆయన కొడుకు పరాశరుడి వంశీయులం మేము. వనం కృష్ణ రాయలు గారనే మా పూర్వీకుడు నిర్మించిన గ్రామమే మా వూరైన వనం వారి కృష్ణా పురం. మా తాత గారి పేరు వెంకట రంగారావు, బామ్మ గారి పేరు కనకమ్మ. వెంకట రంగారావు గారి తండ్రి పేరు నరహరి రావు. వెంకట రంగారావు గారి అన్న చలపతిరావు గారు, తమ్ముడు వెంకటప్పారావు గారు. అన్నదమ్ముల్లో ఒక్క వెంకటరంగారావు గారికి తప్ప ఎవరికీ సంతానం కలగలేదు. ఆయన ఏకైక కుమారుడే మా నాన్న వనం శ్రీనివాసరావు గారు. ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల కొడుకు. చలపతిరావు (మా నాన్నకు "బాప్ప") గారి భార్య పెద వెంకట రామ నర్సమ్మ గారు, వెంకటప్పారావు (మా నాన్నకు "కక్కయ్య") గారి భార్య చిన వెంకట రామ నర్సమ్మ గారు మా పెళ్లినాటికి ఆరోగ్యంగానే వుండేవారు. పిల్లల్లేని వాళ్లిద్దరిలో చలపతిరావు గారికి మా నాన్నగారే కొడుకు వలె అన్ని కార్యాలూ చేశాడు. వెంకటప్పారావు గారి భార్య చిన వెంకట రామ నర్సమ్మ గారు కోరినందున మా తమ్ముడుని ( నా తర్వాత పుట్టిన వాడు) ఆమెకు దత్తత ఇచ్చాం. మా నాన్న మేనమామల వూరు మా వూరికి ఆమడ దూరంలోని చెరువుమాధారం.

మా అమ్మ సుశీల పుట్టింది బలపాలలోనైనా, పెరిగింది దత్తతొచ్చిన నాచేపల్లి గ్రామంలో. మా వరకు మాకు అమ్మమ్మ గారంటే నాచేపల్లిలోని సుభద్రమ్మ గారు, తాతయ్యంటే ముదిగొండ వెంకట్రామనర్సయ్య గారే. వారికి సంతానం కలుగనందున మా అమ్మను చిన్నతనంలోనే తెచ్చుకొని పెంచుకున్నారు. మా అసలు అమ్మమ్మకు పురుడు సమయంలో కొంచెం మతిస్థిమితం తప్పేదని అంటారు. అందుకే పసిగుడ్డుగా వున్నప్పుడే అమ్మను నాచేపల్లికి తెచ్చుకున్నారు. బలపాల అమ్మమ్మ-తాతయ్యల(లక్ష్మీ నర్సమ్మ-వెంకటేశ్వర రావు గార్లు) కు నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు కలిగారు. ఆమ్మ లలితమ్మ గారు అందరి లోకి పెద్ద. ఆమెను గోకినేపల్లి గ్రామానికి చెందిన రావులపాటి సీతారాంరావు గారికిచ్చారు. తర్వాత రమణారావు గారు (భార్య మా గ్రామంలో పుట్టిన మధురమ్మ గారు). మూడో ఆమె రుక్మిణమ్మ గారు. నాలుగో ఆమే మా అమ్మ. నాచేపల్లికి దత్తతగా వచ్చింది. ఐదో సంతానం వెంకట కిషన్ రావు-భార్య మా గ్రామంలో పుట్టిన లక్ష్మిబాయి గారు-మధురమ్మ గారి చెల్లెలు. (వారి రెండో కూతురునే మా దత్తత పోయిన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు). కిషన్ రావు గారి తర్వాత రాజేశ్వర రావు గారు-భార్య లక్ష్మీ నర్సమ్మ. వీరి పెద్దమ్మాయిని మా రెండో తమ్ముడు వివాహం చేసుకున్నాడు. ఆయనా దత్తత పోయి జగన్నాథరావుగా పేరు మార్చబడి నేలకొండపల్లిలో వుండేవారు. తర్వాత మా చిన్న మామయ్య సత్యనారాయణ రావు గారు. ఆఖరున భారతమ్మ గారు పుట్టారు. ఆమెను భైర్నపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు గారు వివాహమాడారు. మామయ్య సత్యనారాయణరావు గారు హైదరాబాద్‍లో వుంటున్నాడు. నేను ఆయన ఇంట్లోనే వుండి డిగ్రీ చదువుకున్నాను. అత్తయ్య విమలమ్మ పెట్టిన భోజనం ఎప్పటికీ మరువలేను. సత్యనారాయణరావు మామయ్య డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ రావడమే కాకుండా, మా కుటుంబానికి చెందినవారిలో మొదటి గ్రాడ్యుయేట్. మా అమ్మ అసలు (జన్మస్థానంలో) పుట్టింటి వారి పేరు "కంకిపాటి" కాగా, దత్తత పోయినవారి పుట్టింటి పేరు "ముదిగొండ".

కంకిపాటి వారి గోత్రం "కణ్వస"-ఋషులు అంగీరస, అజామీళ, కణ్వస. మా బలపాల అమ్మమ్మ గారి పుట్టిల్లు, మా నాచేపల్లి అమ్మమ్మగారి పుట్టిల్లు మా పక్కనున్న కమలాపురం గ్రామానికి చెందిన "వనం" వారి కుటుంబం. నాచేపల్లి అమ్మమ్మకు స్వయానా మేనకోడలు బలపాల అమ్మమ్మ. ఆమె స్వయానా తమ్ముడి కొడుకే, నాకు అత్యంత ఆప్తుడు, కమ్యూనిస్ట్ పాఠాలు నేర్పిన బాబాయి వనం నరసింగరావు. ఆయన అక్క గారే, మా నేలకొండపల్లి మామయ్య రాజేశ్వర రావు గారి భార్య.

నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు (చెల్లెళ్లకు, ముగ్గురు తమ్ముళ్లకు అప్పటికింకా పెళ్లిళ్లు కాలేదు). అక్కకు పెళ్లైంది. పేరు రాధ (భర్త చలపతి రావు గారు అలియాస్ సహదేవ రావు గారు). దత్తత పోయిన తమ్ముడుకి కూడా పెళ్లైంది. ఒక చెల్లెలు ఇందిర (భర్త కందిబండ నరసింహారావు గారు), ఇంకో చెల్లెలు కృష్ణవేణి (భర్త శ్రీనివాస రావు గారు). తమ్ముళ్ల పేర్లు: వెంకట ప్రసాదరావు (భార్య ఇందిర), నరహరి రావు (భార్య ఇందిర), శ్రీనాథ్ (భార్య జ్యోతి), శ్రీరామచంద్ర మూర్తి (భార్య రుద్రాణి). అక్క-బావ వ్యవసాయం వృత్తిగానూ, చెల్లెలు ఇందిర భర్త కేంద్ర ప్రభుత్వోద్యోగి గానూ, మరో చెల్లెలు కృష్ణవేణి లాయర్ గానూ-భర్త రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, పెద్ద తమ్ముడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, రెండో తమ్ముడు వ్యవసాయం-వ్యాపారం వృత్తిలోనూ, మూడో తమ్ముడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, నాలుగో తమ్ముడు వ్యవసాయం వృత్తిగానూ వున్నారు-వుండేవారు.

ఇక మా కాబోయే శ్రీమతి పుట్టింటి వారి విషయానికొస్తే, వారిది భారద్వాజ గోత్రం. ఋషులు, అంగీరస, బార్హస్వత్య, భరద్వాజలు. తండ్రి అయితరాజు రాంరావు గారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని భారత ప్రభుత్వం వారిచ్చిన "తామ్ర పత్ర గ్రహీత". స్వగ్రామం వల్లభి. దేశంలోనే ప్రప్రధమంగా, ఒక దళితుడు పూజారిగా వున్న రామాలయం వల్లభిలో కట్టించింది ఆయనే. ఆయన తండ్రి మంగపతి రావు గారు, తల్లి సీతారామమ్మ గారు. అయితే పాలివారైన వెంకట కిష్టయ్య గారికి దత్తత పోయారు రాంరావు గారు. దత్తత ఇంట్లో రాంరావు గారి తాత పేరు రంగారావు గారు. రాంరావు గారి అక్క రాజ్యలక్ష్మి గారు, చెల్లెలు రుక్మిణమ్మ గారు. సోదరులలో పెద్దవాడు నరసింహారావు గారు కాగా, చిన్నవాళ్లు వెంకట కిషన్ రావు, రాధా కిషన్ రావు, సీతారాంరావు, సత్యనారాయణ గార్లు. మా కాబోయే అత్తగారి పేరు రాధ-కృష్ణా జిల్లా ఖమ్మం పాడు లో జన్మించారు. రాధ గారి తల్లి వెంకట్రామమ్మ గారు, ఇటీవలే మరణించారు.

మా అత్తగారికి ఆరుగురు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు. చెల్లెళ్ల పేర్లు: శారద (భర్త కొలిపాక రామచంద్ర రావు గారు), సరస్వతి (భర్త తుర్లపాటి హనుమంత రావు గారు), సావిత్రి (భర్త కవుటూరు కృష్ణమూర్తి గారు), అన్నపూర్ణ (భర్త కొమరగిరి అప్పారావు గారు), ప్రేమ (భర్త పింగళి మధుసూధన రావు గారు), భారతి (భర్త తుర్లపాటి రంగారావు గారు) గార్లు. తమ్ముళ్ల పేర్లు: పర్వతాల రావు గారు (భార్య సరోజిని గారు), రామచంద్ర రావు గారు (భార్య విమల గారు), వెంకటేశ్వర రావు గారు (భార్య అరుణ గారు), శ్రీనివాస రావు గారు (భార్య నిర్మలాదేవి గారు). మా కాబోయే అత్త గారి పుట్టింటి పేరు "భండారు"-గోత్రం "పరాశర". అక్కచెల్లెళ్లు, అన్న తమ్ములు అందరూ, వారి వారి వృత్తుల్లో-ప్రవృత్తుల్లో సమాజం గుర్తింపు పొందారు. మా కాబోయే ఆవిడకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లెలు. అప్పటికి (మా పెళ్లినాటికి) అక్కలిద్దరికి, పెద్దన్నయ్యకు మాత్రమే వివాహమైంది. అక్కల పేర్లు: హైమ (భర్త కొండపల్లి లక్ష్మీ నరసింహారావు గారు), జ్యోతి (భర్త జూపూడి హనుమంత ప్రసాద్). చెల్లెళ్లు పేరు వాణి (భర్త విజయ శంకర్). పెద్దన్నయ్య పేరు డాక్టర్. పాండు రంగారావు గారు (భార్య కరుణ), రెండో అన్నయ్య పేరు డాక్టర్ వేణు మనోహర రావు (భార్య ఉష). తమ్ముడి పేరు వెంకట గనేష్ కుమార్ (భార్య నిర్మల). అన్నయ్యలిద్దరూ పేరొందిన డాక్టర్లు కాగా తమ్ముడు లాయర్. అక్క చెల్లెళ్లందరి కీ మంచి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్లు జరిపించారు. (Part V Next Follows)

వివాహబంధం-III: పెళ్లి పెద్దలు-సంధాన కర్తలు: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం- III
శ్రీ పప్పు లక్ష్మీనరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

వివాహ ప్రక్రియ-నాంది
వనం జ్వాలానరసింహారావు

మా పెళ్లికి ముందు కూడా ఇవన్నీ జరిగాయి. 1968వ సంవత్సరంలో, అప్పుడే డిగ్రీ పాసయ్యి, అప్పట్లో మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, నేను మా వూళ్లోనే వుంటూ వ్యవసాయం చేయిస్తున్నాను. వ్యవసాయంతో పాటు రాజకీయాల్లో కూడ చురుగ్గా పాల్గొంటున్నాను. మా వూళ్లో ఒక కులానికి చెందిన కొందరు పెత్తందార్లు, గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా, బలమెక్కువగా వున్న కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారిని గ్రామ సర్పంచ్ కాకుండా పెత్తనం చెలాయిస్తున్న రోజులవి. మా నాన్న వనం శ్రీనివాసరావు గారు కూడా గ్రామ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, అందరితో మంచిగా వుండాలనే ఆలోచనతో, వారికే మద్దతు పలికేవాడు.

అయితే పక్క గ్రామంలో వుంటున్న మా పెదనాన్న వనం శ్రీరాంరావు గారు అలా కాకుండా, ఆయన వూళ్లో తనకంటూ ఒక రాజకీయ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఆయన గ్రామం వల్లాపురం, మా నాన్న కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామం ఒకే పంచాయితీగా వుండేది. ఆ పంచాయితీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన అభ్యర్థి గెలవాల్సిందే. ఆయనకు నేనంటే ఆయన పిల్లలకంటే ఎక్కువ ప్రేమ. ఆయన రాజకీయ వారసుడిని నేనని అందరితో అనేవాడు. ఆయనకు నన్నెలాగైనా మా వూరికి పరిమితంచేసి, నన్ను రాజకీయాల్లో పూర్తిగా దించాలన్న కోరిక వుండేది. నాకూ రాజకీయాలంటే మక్కువే కాబట్టి ఆయన మాటలపై గురి కలిగింది. అయితే పక్క వూరు కమలాపురంలో వున్న బాబాయి స్ఫూర్తితో కమ్యూనిస్ట్ పార్టీమీద ఎక్కువ అభిమానంతో వుండేవాడిని. ఈ నేపధ్యంలో, పెదనాన్నగారి కుమారుడు, నా పాఠశాల క్లాస్ మేట్ గోవిందం (వరదా రావు), పెనుగంచిపోలు గ్రామ వాస్తవ్యులైన అప్పారావు-అన్నపూర్ణల కూతురు సావిత్రిని వివాహం చేసుకున్నాడు. అది పూర్తిగా పెద్దలు కుదిరించిన పెళ్లి. పెనుగంచిపోలులో జరిగిన ఆ పెళ్ళికి నేను హాజరయ్యాను.

ఆ పెళ్లికి అయితరాజు వారమ్మాయి విజయలక్ష్మి రాలేదు. కాని, ఆ తర్వాత ఖమ్మం శ్రీరాంరావు గారింట్లో జరిగిన "మూడు నిద్రల" తంతులో భాగమైన "మేజువాణి" కి నేను కూడా వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయి పాట పాడుతుంటే విన్నాను. అమ్మాయినీ చూశాను. "ఆవకాయ...మాగాయ..గోంగూర పచ్చడి..." అనే ఆ పాట అప్పటికీ-ఇప్పటికీ ఆమె పాడుతూనే వుంటుంది. బహుశా మా ఆవిడకు వచ్చిన-పాడగలిగిన పాట అదొక్కటేనేమో ! పాట పాడిన అమ్మాయి ఎవరని నేను మా పెదనాన్నగారిని అడగడం, ఎవరో ఆయన వివరించడం, పెళ్లి చేసుకుంటావా అని పరాచకంగా మాట్లాడడం జరిగాయప్పుడు. నేను మరిచిపోయినా, మా పెదనాన్న మరిచిపోకుండా, ఆ అమ్మాయంటే నేను ఇష్టపడుతున్నానని అయితరాజు రాంరావు గారికి చెప్పి సంబంధం కుదిరించడానికి నిశ్చయించుకున్నాడప్పుడు.

అప్పట్లో నాకింకా ఇరవై ఏళ్ల వయస్సే. అప్పట్లో నాకున్న ఒకే ఒక్క పట్టుదల మా వూళ్లో "పెత్తందార్ల" అభ్యర్థి కాకుండా, మేమనుకుంటున్న(కొంతమంది యువకుల బృందం) వ్యక్తి, పెత్తందార్లను ఎదిరించగలిగిన వ్యక్తి సర్పంచ్ కావాలని. ఆ దిశగా, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరులందరూ, అప్పటివరకూ బయటపడడానికి భయపాడిన వారితో సహా, నా మాట మీద నమ్మకంతో మా పక్షాన చేరారు. సరిగ్గా అదే రోజుల్లో, జనవరి నెల 1969 వ సంవత్సరంలో, ఒక నాడు, పెదనాన్న శ్రీరాంరావు గారు, మా సమీపంలోని వల్లభి గ్రామానికి చెందిన అయితరాజు రాంరావు గారిని, ఆయనతో పాటు ఆ గ్రామానికే చెందిన కొడాలి వెంకయ్యను తీసుకొని కృష్ణా పురంలోని మా ఇంటికొచ్చారు. నేనప్పుడు ఇంటిపక్కనే వున్న పొలంలో జొన్న కళ్ళం వేయిస్తున్నాను. అప్పట్లో మాకు ఏటా 150-200 బస్తాల పచ్చ జొన్నలు, 300-400 బస్తాల వడ్లు పండేవి. కందులు, పెసలు, వేరుశనగ కూడా పెద్ద మోతాదులో పండేవి. పది అరకల వ్యవసాయం-పది మందికి పైగా పనివాళ్లు (జీత గాళ్లు అనేవారప్పుడు)-పది జతల ఎడ్లు-నాలుగు పెద్ద బండ్లు-కచ్చడం-మేనా-పల్లకి వుండేవి మాకు.

ఇంతకూ ఆ ముగ్గురొచ్చినకారణం-అయితరాజు రాంరావు గారి మూడో కూతురు విజయలక్ష్మికి, నాకు పెళ్లి జరిపించే ప్రతిపాదన చేయడానికి. పెళ్లి సంబంధాల ప్రతిపాదనలు చాలా గమ్మత్తుగా వుంటాయి. ఇంతకు ముందే చెప్పినట్లు, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. మా విషయంలో ఇరు పక్షాలకు కావాల్సిన వ్యక్తి శ్రీరాంరావు గారు. అయితరాజు రాంరావు గారి తోడల్లుడు కూతురునే తనకొడుక్కు చేసుకున్నందువల్ల వాళ్ళకు, మా నాన్నకు అన్నగారైనందున మాకు-ఇలా ఇద్దరికీ కావాల్సిన పెద్ద ఆయన. అలానే అయితరాజు రాంరావు గారి గ్రామానికి చెందిన కొడాలి వెంకయ్య (కులం వేరైనా, బంధువు కాకపోయినా, మా నాన్నకు తెలిసినాయన) కూడా. వాస్తవానికి రాంరావు గారు మా ఇంటికి రావడానికి మరొకరి తోడు అవసరంలేదు. ఆయన, మా నాన్న చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు "ఒరేయ్" అని పిల్చుకునే చనువుంది. అయినా, వివాహ సంబంధం కుదిరించడానికి, ఇలాంటి ప్రక్రియ అందరూ చేయడం ఆచారంగా వస్తున్నది. దీనికి కారణం, ఇది కేవలం రెండు కుటుంబాలను మాత్రమే కలపడం కాకుండా, ఇరువైపుల సంబంధీకులను కూడా కలపేటందుకే.

మా అమ్మా-నాన్న వెంటనే వారి ప్రతిపాదనకు అంగీకరించి, పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు. ఆ సమయంలో రాంరావు గారి కూతురు విజయలక్ష్మి, విజయవాడలో తల్లి గారి తరపున బాబాయైన తుర్లపాటి హనుమంతరావు (రాంరావు గారి తోడల్లుడు) గారి ఇంట్లో వుంటూ, హోమియో వైద్య చికిత్స చేయించుకుంటున్నందున, ఆమెను ఖమ్మం పిలిపించిన తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటుచేశారు. పెళ్లి చూపులకు మేమొస్తున్నామని చెప్పడానికి రాంరావు గారు విజయవాడకు వెళ్లారు. ఆ సమయంలో హనుమంతరావు గారింట్లో వారి బావమరిదులు భండారు శ్రీనివాసరావు, భండారు పర్వతాల రావు గారు కూడా వున్నారు. శ్రీనివాసరావు, నేను ఖమ్మం రికాబజార్ హైస్కూల్లో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. రాంరావు గారి రెండో కూతురు భర్త జూపూడి ప్రసాద్ కూడా మాతో కలిసి చదువుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు మా ఇద్దరి పరిచయం గురించి, నాకు క్రికెట్ ఆటంటే అభిమానం అన్న సంగతీ చెప్పాడని మా ఆవిడ తర్వాత నాకు చెప్పింది. శ్రీనివాసరావుకు కాబోయే సతీమణి నిర్మలా దేవి (దుర్గ) విషయం తెలుసుకుని, కాబోయే పెళ్లి కూతురుకు బోలెడు బహుమానాలు కొని ఇచ్చిందట. ఆమెగారికి, అప్పటికీ-ఇప్పటికీ ఇలా అందరికీ బహుమానాలు ఇవ్వడం అలవాటే. అదొక అరుదైన సద్గుణం ఆమెలో. పెళ్లి చూపులతో మా వివాహ ప్రక్రియ మొదలవడానికి నాంది జరిగిందలా.(Part IV Next Follows)

Tuesday, February 23, 2010

వివాహబంధం-I: బాల కాండ మందర మకరందం-సీతా కల్యాణ ఘట్టం - వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-I

శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
వనం జ్వాలానరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండను, "బాల కాండ మందర మకరందం" గా రాస్తున్న సందర్భంలో, సీతా కల్యాణ ఘట్టం చదువుతున్నంతసేపూ, నలబై సంవత్సరాల క్రితం జరిగిన మా వివాహం పదే-పదే గుర్తుకొచ్చింది. నాకే కాదు అది చదివిన వారికెవరికైనా అలా గుర్తుకు రావడం సహజం. ఒక్క మా పెళ్ళి విషయాలే కాకుండా, మేం జరిపించిన మా ఇద్దరమ్మాయిల పెళ్లి, అబ్బాయి పెళ్లి కూడా గుర్తుకొచ్చాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక వివాహం జరగాలన్నా, జరిపించాలన్నా పెళ్ళికి ముందు, పెళ్ళిలో, పెళ్లైన తర్వాత చోటుచేసుకునే ప్రతి విషయానికి సంస్కృతీ-సాంప్రదాయ పరంగానే కాకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచించినా ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. నేను బాల కాండలో సీతా కల్యాణ ఘట్టం చదివి-రాసిన తర్వాత, హ్యూస్టన్ కు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు సాహితీ సమితివారు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాను. అందులో శ్రీయుత పప్పు నరసింహమూర్తి గారు "హిందూ సాంప్రదాయ వివాహ వేడుక" గురించి మాట్లాడినప్పుడు మరొక్క సారి మా పెళ్ళి నాటి సంగతులు జ్ఞప్తికొచ్చాయి. ఆయన చెప్పిన విషయాలను, సీతా కల్యాణ ఘట్టంలోని విషయాలను మా వివాహానికి అన్వయం చేసుకుంటూ, "వివాహబంధం" గురించి రాద్దామన్న ప్రయత్నమే ఇది.

విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు అవలీలగా జనక మహారాజు దగ్గరున్న శివ ధనుస్సు వింటిని అరచేత్తో పట్టుకొని, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోతుంది. ఇది చూసిన జనకుడు, సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లైందని అంటాడు విశ్వామిత్రుడితో. "నా కూతురు వీర్య శుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయగా, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞలేదని అంటాడు రాముడు. విశ్వామిత్రుడి ఆదేశం మేరకు, మిథిలకు రమ్మని ఆహ్వానిస్తూ, దశరథుడి దగ్గరకు దూతలను పంపాడు జనకుడు. దూతలు అందించిన వార్తను విన్న దశరథ మహారాజు వామదేవ-వశిష్ఠాదులను, మంత్రులను పిలిపించి "మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడు. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు.

మర్నాడు దశరథుడు చతురంగ బలాలతో, వాసుదేవుడు-వశిష్టుడు-జాబాలి-కాశ్యపుడు- మార్కండేయుడు-కాత్యాయనుడు లాంటి పెద్దలతో కలిసి బయలుదేరి ఐదవ రోజు పగటిపూట కల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు స్వాగతం పలికి, "నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది" అంటాడు. వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి. మర్నాడుదయం, జనకుడి ఆహ్వానాన్ని అందుకుని దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు.

హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్టుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు. "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య" అంటూ మొదలుపెట్టి, చివరలో అంబరీషుడుకి నహుషుడు, అతడికి యయాతి, అతడికి ఆభాగుడు, అతడికి అజుడు, అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు" అని సూర్యవంశ క్రమాన్ని సవివరంగా తెలియచేశాడు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులనీ, వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైందనీ, వీరందరు అసమాన ధర్మరతులు-వీరులనీ, సత్యమంటే ప్రీతికలవారనీ అంటూ, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.

ఇక్ష్వాకుల వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని కూడా వినిపించాడు. తమ వంశానికి పూర్వీకుడు ధర్మాత్ముడైన "నిమి" అనీ, అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడనీ, ఆయనే మొదటి జనకుడనీ, ఆ పేరే తమ వంశంలో "జనకుడు" అని రాసాగిందనీ, అదే వంశ నామం అయిందనీ అంటాడు. మిథి కొడుకు దగ్గరనుంచి మొదలెట్టి, మహారోముడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు , హ్రస్వరోముడికి తను తన తమ్ముడు కుశధ్వజుడు కొడుకులమని వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుందనీ, ఆ రోజున వివాహం చేద్దామనీ అంటాడు.

ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవ శాలకు చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్టుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్టుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్టుడు జనకుడికి తెలియచేశాడు.

వశిష్టుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తామన్న వశిష్టుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు (జనకుడి పురోహితుడు) తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్టుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్టుడు హోమం చేశాడు.

సీతా కల్యాణ ఘట్టం

" సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువ బెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

“ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

" కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు.

తర్వాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.

వివాహమైన మర్నాటి ఉదయం, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. సరేనన్న జనకుడు, దశరథ మహారాజుతో కలిసి, తాను కొంతదూరం ప్రయాణంచేసి-వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు.(Part II Next)