Showing posts with label జ్యోతిబసు. Show all posts
Showing posts with label జ్యోతిబసు. Show all posts

Sunday, December 11, 2011

పౌర హక్కుల సంఘం: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 10

పౌర హక్కుల సంఘం

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో దవ అధ్యాయం ఇది).

నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, .ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ గారి తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు-డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.

సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం.

Tuesday, June 8, 2010

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో మార్పు సంకేతాలు : వనం జ్వాలా నరసింహా రావు

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో
మార్పు సంకేతాలు
వనం జ్వాలా నరసింహా రావు
కాంగ్రెస్ పార్టీ యోధాన-యోధుడు, సిద్ధాంత కర్త, ఇందిరాగాంధికి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చ్ 19, 1972 నుంచి, జూన్ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. గత ముప్పై మూడేళ్ల గా, ఏ పనైతే తన అధికారాన్నంతా ఫణంగా పెట్టినా కాంగ్రెస్ సాధించలేకపోయిందో, దాన్ని, అచిర కాలంలోనే మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించే రోజు దగ్గర పడుతుందని చెప్పడానికి ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఘన విజయమే నిదర్శనం.

ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని సడలించి 1977 లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని, జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర-లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో గెలిపించి, 27 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6, 2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు వారసత్వం అప్పగించారు. అప్పటినుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ (నవంబర్ 6, 2000 నుంచి ఇప్పటి దాకా) పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వస్తున్నాడు. ఇక ముందు అలా కాపాడగలగడం ఆయనకు కష్టమై పోతుందని చెప్పొచ్చు. మున్ముందు పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించే అవకాశాలు మెండుగా వున్నాయి.

వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న నేపధ్యంలో, అనేక కష్ట-నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ ప్రజా పోరాటం ఫలితంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి, నాలుగు దశాబ్దాల క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ, నిలుపుకో గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. ఆ మాటకొస్తే, ప్రపంచం మొత్తంలోనే, మొట్టమొదటి సారి, బుల్లెట్ ద్వారా కాకుండా బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా భారత దేశంలోని కేరళ రాష్ట్ర ఓటర్లకు దక్కింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన ఘనత కూడా భారత దేశానికే దక్కింది.

సామాన్య ప్రజానీకానికి మేలు చేయాలన్న లక్ష్యంతో వామపక్ష-కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక-నిరంకుశ విధానాలను ఎదుర్కొంటూ పశ్చిమ బెంగాల్ లో వామ పక్షాలు బలపడ సాగాయి. వామ పక్షాల ఐక్యతను-కూటమి అధికారాన్ని, సవాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొన్ని సార్లు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమత బెనర్జీ నాయకత్వంలో కొన్ని సార్లు, ఎన్నికల సమయంలో అవగాహనలు కుదుర్చుకున్నప్పటికీ, సుమారు నాలుగు దశాబ్దాలుగా "ఎర్రకోటకు బీటలు" పడకుండా అక్కడి ఓటర్లు జాగ్రత్త పడ్డారు.

చరిత్ర పుటలు తిరగేస్తే గాని పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్ర అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు. ఉద్యమాలు ఈ నాటివి కూడా కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, గత శతాబ్దపు నలభయ్యో దశాబ్దంలోనే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక-శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత బెంగాల్ కుంది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు నాయకత్వం వహించింది. స్వతంత్ర భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రంలో 1953 లో-1965 లో ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, 1954 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ బి. సి. రాయ్ వున్నప్పుడు సంభవించిన కరవుపై పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా పి. ఎల్. 480 పథకానికి వ్యతిరేకంగా 1960 నాటి విద్యార్థి పోరాటం, 1962 భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కినవే. అలాంటి ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది.

ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విడి-విడిగా, "యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో ఒక కూటమి, "పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండు కూటములు కలిసి "యునైటెడ్ ఫ్రంట్" గా కలిసి, మైనారిటీ కూటమికి చెందిన బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధిక సంఖ్యాక బలమున్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్, 1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. మూడు నెలల పాటు (2 నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా వున్న పి. సి. ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో వుంచడం కష్టం కావడంతో, అప్పటినుంచి ఏడాది కాలం రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.

ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19, 1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా "పశ్చిమ బెంగాల్ వ్యవహారాల" కొరకు కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేవలం 13 నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి మరి కొంతకాలం (మార్చ్ 19, 1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం కేరళతో (నంబూద్రిపాద్ ను తొలగించడంతో) ప్రారంభమై, బెంగాల్ కు పాకింది. క్రమేపీ భారత దేశ రాజకీయాలలో అలా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం "సాంప్రదాయం" గా మారిపోయింది. ఆ పాపంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా ఏం తీసిపోలేదు. కమ్యూనిస్ట్ పార్టీల సారధ్యంలో వున్న ప్రభుత్వాలను రద్దుచేస్తున్న రోజుల్లో, ఆ పార్టీ తప్ప ఇతర కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, ఆ చర్య తప్పని గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టం.

ఏదేమైనా, 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్ ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద పార్టీగా-ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి. సి.ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28, 1971). సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19, 1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

1972 ఎన్నికలు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ. సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల కారణంగా, రిగ్గింగుకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు తక్కువే వచ్చినా, ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి వుంటే, ఆ సంఖ్య 80 (సీపీఎం స్థానాలు) వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 216 స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగింతర్వాత-ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.

ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ను సీపీఎం నుంచి విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో 1997 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించింది కుమారి మమత బెనర్జీ. అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమత బెనర్జీ, సీపీఎం ను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది. తన పార్టీ పక్షాన గెలిచిన ఏకైక లోక్ సభ సభ్యురాలిగా 2004 లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అక్టోబర్ 2005 లో ఆందోళన చేశారు. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గతంలో గెలిచిన స్థానాలలో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. అయినా పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మమత నవంబర్ నెలలో టాటా మోటార్స్ కార్ల కర్మాగారం స్థాపన విషయంలో ఆందోళన చేసేందుకు సింగూరు వెళుతుంటే, మధ్యలో బలవంతంగా ఆపు చేసింది ప్రభుత్వం. శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన తెలియచేసిందామె. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగి ఫర్నీచర్ ను, మైకులను ధ్వంసం చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను (మెజారిటీ) గెల్చుకుని రాబోయే రోజుల్లో సీపీఎం కు గడ్దు రోజులు రాబోతున్నాయన్న సంకేతాన్ని పంపారు. తృణమూల్ ఆందోళన ఫలితంగానే నంది గ్రామ్ లో రసాయన కేంద్రం స్థాపన ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మమత చేసిన కృషికి సింగూరు, నంది గ్రాం సంఘటనలు ఉదాహరణలుగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. వీటన్నిటి నేపధ్యంలో, జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాయి. ఇక శాసన సభ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమౌతుంది మమత.

సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ ఇరవయ్యే డు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. దీనికితోడు, దీర్ఘకాలం అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకత రావడం కూడా సహజం. నంది గ్రాం, సింగూరు ఘటనలు, మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు సీపీఎం కు మునిసిపల్ ఎన్నికలలో పరాజయాన్ని చవి చూపాయి. సీపీఎం ఓటమి, తృణమూల్ గెలుపు తాత్కాలికమా, లేక, తాత్కాలికంగా శాశ్వతమా అన్నది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలకు బుద్దదేబ్ హాజరు కాకపోవడం వెనుక కారణాలు అన్వేషించాలి. పశ్చిమ బెంగాల్ లో పార్టీ పనితీరు పట్ల, పార్టీ ఓటమి పట్ల శాస్త్రీయంగా సమీక్ష జరిగిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి. సీపీఎం భాగస్వామ్య పక్షమైన సీపీఐ మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ పనితీరును విమర్శించింది. సీపీఎం అవలంబిస్తున్న "అహంకార పూరిత-ఉద్యోగ స్వామ్య-పెత్తందారీతన విధానాన్ని" దుయ్యబట్టింది మరో లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ దృష్టిలో, రాబోయే శాసన సభ ఎన్నికలలో సీపీఎం విజయం క్లిష్టమైందనే భావం వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆనందానికి హద్దుల్లేవనిపిస్తుంది. భవిష్యత్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని, సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించి తీరుతామని ధీమాతో వున్నారాయన.

కేవలం 20% మంది ఓటర్ల తీర్పుతో ఘన విజయం సాధించిన మమత, మిగతా ఓటర్ల తీర్పులో కూడా విజయం సాధించుతారో, లేదో, తేలే రోజు తొందరలోనే రాబోతుంది. అంతవరకూ వేచి చూద్దాం.