Showing posts with label కాంగ్రెస్ పార్టీ. Show all posts
Showing posts with label కాంగ్రెస్ పార్టీ. Show all posts

Saturday, May 18, 2013

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు


నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలు ఆరంభం కానున్న నేపధ్యంలో....

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

 (ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను
పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించిన 1969 నాటి పరిణామాలు)

అవి నేను నాగపూర్ లో ఎం. ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న రోజులు. 1969-1971 మధ్యకాలం. ప్రత్యేక తెలంగాణ-జై ఆంధ్ర ఉద్యమాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కళాశాలలు, విశ్వ విద్యాలయాలు మూత బడడంతో డిగ్రీ పూర్తి చేసుకున్న నాలాంటి కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు నాగపూర్ లాంటి ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా తనదంటూ రాజకీయాలలో ఒక ముద్ర వేసుకుంటున్న రోజులు. సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపిస్తున్న రోజులవి. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. ఒక విద్యార్థిగా, రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎలెక్టోరల్ కాలేజి అంటే ఏమిటి లాంటి విషయాలతో పాటు, రాజకీయాలలో సమీకరణలు ఎలా వుంటాయో అర్థం చేసుకుంటున్న రోజులవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇప్పుడు రాసిన వ్యాసం ఇది.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు ఎంతో విలు వుంది. నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా అతి కొద్దిమంది ఆలోచనలను, సూచనలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచికూడా, మోడరేట్లనీ-అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారున్నప్పటికి, వారందరి ధ్యేయం-లక్ష్యం స్వాతంత్ర్య సాధనొక్కటే. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్ పార్టీలోని భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు. వారిలో అతివాద, మితవాద భావాలవారున్నారు. అతివాద సిద్ధాంతాలకు దగ్గరైన సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా ఎదురైన ప్రతిఘటనలను అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు-అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, ఈ నాటికీ దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని, వర్తమాన రాజకీయాల్లో ఒక అతి ముఖ్యమైన ఘట్టంగా పరిణమించిందనవచ్చు.

అయితే భారత జాతీయ కాంగ్రెస్ లో అంతకుముందు చీలికలు లేవనిగాని-రాలేదనికాని అనలేం. 1907 లో నాగపూర్ లో జరగాల్సిన అఖిలభారత కాంగ్రెస్ సభలు వాయిదాపడి, తర్వాత, సూరత్ లో జరిగాయి. అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికకావడం ఇష్టపడని మాడరేట్లు, సభలను సూరత్ కు మార్చి, రాష్ బిహారీ ఘోష్ కు నాయకత్వం అంటగట్టారు. సభా ప్రాంగణంలో వాగ్యుద్ధాలు తీవ్రస్థాయిలో జరిగాయి. పాత తరం నాయకత్వమని-కొత్తతరం నాయకత్వమని, రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. అతివాద భావాల వారు వేరుకుంపటి లాంటిది పెట్టుకొని, తమను తాము అసలైన జాతీయ వాదులుగా వర్ణించుకున్నారు. ఇక ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల వరకు పార్టీపై మాడరేట్లే ఆధిపత్యం. దరిమిలా పరిస్థితుల్లో మార్పు కనబడ సాగింది. అతివాదులుగా ముద్రపడిన వారంతా మాతృసంస్థైన కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో, భవిష్యత్ లో జరుగనున్న పరిణామాలకు సూచనలు పొడచూపాయి. నాయకత్వంలో కూడా మార్పులు-చేర్పులు చోటుచేసుకోవడం ఆరంభమయింది.


1969నాటి చీలిక, 1951లో సంభవించిన నాసిక్ సంక్షోభం, ఓ మోస్తారు అనాలి. కాకపోతే, అధ్యక్ష పదవికి అతి తీవ్రంగా జరిగిన పోటీలో, ఆచార్య జె. బి. కృపలానీని ఓడించిన పురుషోత్తమ దాస్ టాండన్, దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, రాజీనామా చేశారు. చేసి తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. కాంగ్రెస్ లో చీలికను నివారించారప్పట్లో. 1969లో దీనికి విరుద్ధంగా, నాటి అధ్యక్షుడు నిజలింగప్ప వ్యవహరించడంతో, చీలిక అనివార్యమయింది.

నవంబర్ 1969లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోవడానికి ప్రధాన కారణం, అంతకు కొద్ది నెలలక్రితం, జులై నెలలో, బెంగుళూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తలెత్తిన వివాదమే. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, జవహర్లాల్ నెహ్రూ హయాంలోను, సామాజిక-ఆర్థిక-విధానపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు-భిన్న ధృక్ఫధాలున్నవారు అనేకమంది వున్నప్పటికీ, వారంతా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసి, ఐకమత్యంగా పార్టీ బలపడేందుకు ఉమ్మడిగా కృషిచేశారు. నాలుగో సాధారణ ఎన్నికలనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది.

ఇదొక్క కాంగ్రెస్ కే పరిమితమై పోలేదు. అన్ని పార్టీలలోనూ ఈ సంఘర్షణ మొదలైంది. ఆ రోజుల్లో "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు), నీలం సంజీవరెడ్డి లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బాంకులను జాతీయం చేయడానికి అతివాదులు మద్దతిస్తే, సిండికేట్ వర్గం వారు వ్యతిరేకించారు. బెంగుళూర్ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై వచ్చిన విమర్శల లాంటివి ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలకు దారితీశాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న అతివాద వర్గం, సిండికేట్ వర్గం వారిని "సామ్యవాద-లౌకికవాద" విధానాలను వ్యతిరేకించేవారన్న నిర్ణయానికి వచ్చారు.

ఇందిరాగాంధి తీసుకున్న బాంకుల జాతీయం నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా బలపరుస్తూనే, సిండికేట్ ఒక అడుగు ముందుకు వేసి, నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు నిజలింగప్ప. ఇందిరాగాంధి సూచించిన వి. వి. గిరి పేరును గానీ, జగజీవన్ రాం పేరును గానీ పరిగణలోకి తీసుకోలేదు. ప్రధాన మంత్రిగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్ ఎంపిక చేయడాన్ని, దాని వెనుక నున్న ఉద్దేశాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలో మెజారిటీ నిర్ణయంకన్నా ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిందామె. దెబ్బకు దెబ్బగా, మొరార్జీ దేశాయ్ ని ఆర్థిక శాఖనుంచి తొలగిస్తూ నిర్ణయం ప్రకటించింది. భవిష్యత్ లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిచేసింది. వేరే శాఖను నిర్వహించడానికి ఇష్టపడని మొరార్జీ రాజీనామా చేశాడు.

జులై 19, 1969న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, 14 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని నిర్ణయం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించ తల్చుకున్న విధానాలకనుగుణంగా, సమసమాజ నిర్మాణం జరగాలంటే, ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరముందని ఆమె ప్రకటించారు. ఇందిరాగాంధి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంభవించనున్న భారీ మార్పులకు-రాజకీయ సమీకరణలకు-పునరేకీకరణలకు తొలి సూచనలు కనబడసాగాయి. పార్టీ ప్రణాళికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారిపై ఇందిరాగాంధి బహిరంగంగానే విమర్శలు చేయడంతో, ఆమెను నియంత్రించే ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించలేదు.

వి. వి. గిరి స్వతంత్ర అభ్యర్థిగా-వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్-శాసనసభ సభ్యులకు ఆగస్ట్ 13, 1969, పిలుపునిచ్చింది ఇందిరాగాంధి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర-జనసంఘ్ పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధి. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్ రాం కాంగ్రెస్ ఓటర్లకు ఆత్మ ప్రబోధం పిలుపివ్వడం జరిగింది. కాంగ్రెస్ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారి మద్దతు కోరడమంటే, ఏదో విధంగా ఎన్నికల్లో గెలుపు సాధించడమేనని, అది తప్పనీ, విలువలకు తిలోదకాలివ్వడమేననీ, ఇందిరాగాంధి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో చీలికను నివారించడానికే తాను "ఆత్మ ప్రబోధం" నినాదాన్ని ఇచ్చానని ఆమె పేర్కొంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వున్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఆమె ఆగస్ట్ 18, 1969 న లేఖ పంపుతూ, అందులో, "సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలని-అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు" అని పేర్కొని, వారందరి మద్దతు కోరింది ఇందిరాగాంధి. ఇదిలా వుండగా, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణ చేస్తూ, జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప నోటీసులు పంపాడు. అయితే, పార్టీ విధానాలను పాటించనివారికి క్రమశిక్షణ గురించి మాట్లాడడంలో అర్థంలేదని ఇందిరాగాంధి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో కొందరు కాంగ్రెస్ నాయకులు తమ స్వప్రయోజనాల కొరకు అవలంబించిన విధానాల వల్ల, ఎలా అభిమానులు పార్టీని వీడిపోయారో వివరించిందామె. జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లు తామే నిజమైన కాంగ్రెస్ వాదులమని, కాంగ్రెస్ వాదులు, ప్రజలు తమ వెంటే వున్నారని అధ్యక్షుడిచ్చిన నోటీసును సవాలు చేశారు. పార్టీకి చెందిన మెజారిటీ పార్లమెంట్-శాసనసభ్యులు ఇందిరాగాంధికి మద్దతు పలకడంతో, వి. వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. పార్టీపై ఆమెకున్న ఆధిక్యత ఋజువైంది.

ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించింది ఇందిరాగాంధి.

ఆమె తమిళనాడు పర్యటనకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్ అగ్రనాయకుడు నిజలింగప్ప అనుకూల వాది కామరాజ్ నాడార్ తో వచ్చిన విభేదాలవల్ల, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధి మద్దతుదారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేశాడు. దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టాడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప. ఇరువర్గాలు కొద్దిరోజుల కింద కుదుర్చుకున్న ఐక్యతా ఒప్పందానికి నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు విరుద్ధమైన వని పేర్కొంటూ, ఇందిరాగాంధి, వై. బి. చవాన్, జగ్జీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్, ఉమాశంకర్ దీక్షిత్, సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా అధ్యక్షుడికి లేఖను పంపారు. ఇందిరాగాంధి, నిజలింగప్ప మద్దతు దారుల మధ్య విభేదాలు ముదిరిపోవడంతో, అక్టోబర్ 18, 1969, గడువుకంటే ముందే, నూతన అధ్యక్షుడు ని ఎన్నుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని ఉదహరిస్తూ, సామ్యవాద-లౌకిక-అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ-అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అందుకే అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, నవంబర్ 1, 1969, సి. సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లను సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధి మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాలేదు. ఏ. ఐ. సి. సీ సమావేశం జరపాలని లేఖ పంపిన వర్కింగ్ కమిటీ సభ్యులందరూ ఇందిరాగాంధి ఇంట్లో సమావేశమయ్యారు. మెజారిటీ ఏ. ఐ. సి. సీ సభ్యుల అభ్యర్థన మేరకు నవంబర్ 22--23,1969న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశారా సమావేశంలో. నవంబర్ 12న ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించింది. అలా, అలనాడు, నీలం సంజీవరెడ్డి కారణాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, దరిమిలా కొన్నాళ్లకు, నేడు యుపిఎ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ (ఐ) గా అవతారమెత్తింది. ఆ తరువాత కాలంలో అదే సంజీవరెడ్డి ఏకగ్రీవ అభ్యర్థిగా రాష్ట్రపతి కాగలిగారు.

Saturday, November 17, 2012

ఇక రాహుల్ రాజ్యమేనా?: వనం జ్వాలా నరసింహారావు


ఇక రాహుల్ రాజ్యమేనా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (18-11-2012)

అందరూ అనుకున్నట్లే అయింది. "దేశ్ కీ నేతా రాహుల్ గాంధీ" అన్న ఆబాల గోపాలం కాంగ్రెస్ వర్గాల నినాదాలు సోనియా గాంధీ చెవిన పడ్డాయి. పన్నెండేళ్లకు పైగా మౌన ముద్ర వహించిన మేడం, కార్యకర్తల మొర ఆలకించారు. తనయుడు రాహుల్ గాంధీకి గురుతర బాధ్యత అప్పగించారు. గతంలో ఆయన ఇంత పెద్ద బాధ్యత నిర్వహించలేదని కాదు. ఐతే, అది ఏదో ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమై పోయింది. ఇప్పుడేమో యావత్ భారత దేశానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరంగా దిశా నిర్దేశం చేయాల్సిన బృహత్తర బాధ్యత అప్పగించబడింది. బహుశా రాహుల్ దృష్టికి రాకుండా ఏ ఒక్కరు కూడా ఎన్నికలలో పోటీ చేసే వీలుండదేమో! ముఖ్యంగా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఆయన చేతుల మీదుగానే రూపొందించాల్సి వుంటుంది. తన టీంను తానలా పూర్తిగా తయారు చేసుకుని, ఎన్నికల రంగంలో దిగి, విజయం సాధించి, ఆ విధంగా పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన సోనియా గాంధీ చేసి వుండవచ్చు. ఐతే ఇదంతా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించే స్థానాలపైన, దాని ఎన్నికల ముందస్తు-ఎన్నికల తదనంతరం అవగాహన కొచ్చే మిత్ర పక్షాలు సాధించే స్థానాలపైన ఆధార పడి వుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొనసాగుతున్న యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా వున్న పార్టీలు ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి-కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు గోపీలుగా వుంటూ ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నంలో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతున్నది మైనారిటీ ప్రభుత్వమే! సంఖ్యాపరంగా చూస్తే అది ఏ క్షణాన్నైనా కూలి పోవడానికి సిద్ధంగా వుందనాలి. పూర్తిగా దింపుడు కళ్లెం ఆశ మీద వుంది. తృణమూల్ ప్రభుత్వంలోంచి వైదొలగిన తరువాత ప్రారంభమైన ఈ పతనం కరుణానిధి అలకతో పతాక స్థాయికి చేరుకుంది. మజ్లిస్ కూడా దూరమైంది. మాయావతి, ములాయంలు దోబూచులాడుతున్నారు. ఈ నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు పోవడం కంటే కాంగ్రెస్ పార్టీకి మరో గత్యంతరం లేనే లేదు. అదే పనిలో మునిగి పోయింది కాంగ్రెస్ పార్టీ, దాని నూతన బాస్ రాహుల్ గాంధీ.


అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోక్ సభ ఎన్నికలకు, అవి కూడా అనుకున్న దానికంటే ముందుగానే జరుగవచ్చన్న ఊహాగానాల నేపధ్యంలో, పూర్తి స్థాయిలో సమాయత్తమౌతోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొందరు కొత్త వారిని చేర్చుకుంటే, మరి కొందరు పాతవారిని పార్టీ పని కోసమని బయటకు పంపింది. పార్టీని నష్ట పరుస్తున్నారని భావించిన మరి కొందరిని ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అలక పానుపు ఎక్కిన వారిని ఓదారుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ యువ నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో వేట ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా, వివిధ నియోజక వర్గాలలో భారీ స్థాయిలో సమాచార సేకరణకు శ్రీకారం చుట్టారు. విజయావకాశాలున్న నేతలు, ఇతర ప్రముఖుల కోసం ఆయన లోతుగా ఆరా తీస్తున్నారు. వారు పార్టీ సభ్యులు కాకపోతే, ఎలా వారిని తమలో చేర్చుకోవాలన్న అంశంపైనా దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రతి లోక్‌సభ స్థానానికీ తన సొంత వేగులను పంపుతున్నారు! ప్రతి సెగ్మెంట్ నుంచీ ప్రాధాన్యత క్రమంలో ముగ్గురి పేర్లను వారు గుర్తించి డిసెంబర్ తొలి వారానికల్లా రాహుల్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకొరకు, స్వయానా రాహుల్ గాంధీ తనదైన శైలిలో ఎంపిక చేసి, ప్రత్యేక తరహా శిక్షణ ఇచ్చిన పరిశీలకులు, ఆంధ్ర ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఇలా వివిధ రాష్ట్రాలకు పోయే బృంద సభ్యులలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నేతలు కూడా వున్నారు. ఈ సభ్యులకు పది-పదిహేను లోక్ సభ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, పలు వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడి.. గెలుపు గుర్రాలు కాగల అభ్యర్థులను గుర్తించనున్నారు.

ఇంతకూ ఈ పరిశీలకులు చేయాల్సింది ఏంటి? ముందుగా తమకిచ్చిన సుమారు ముప్పై ప్రశ్నలతో కూడిన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. దీని కొరకు శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వినికిడి. అభ్యర్థుల ఎంపిక పరిశీలన ఏ కోణంలో జరగాలి అన్న అంశంపై వ్యక్తిగత నైపుణ్యంతో కూడిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానికంగా గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో అంచనా వేయడం పరిశీలకుల ప్రధమ కర్తవ్యం. ఒక్కో నియోజక వర్గానికి మూడేసి పేర్లతో కూడిన జాబితా రూపొందించాలి. వారి విజయావకాశాలకు వివిధ కోణాల నుంచి గల కారణాలను విశ్లేషణా పూర్వకంగా అంచనా వేయాలి. పరిశీలనా క్రమంలో మండల స్థాయి పైనుంచి, జిల్లా స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించి తమ విశ్లేషణకు వాటిని జోడించాలి. సిట్టింగ్ ఎంపీల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారికి టికెట్ ఇవ్వకుండా వుండడానికి గల కారణాలను సహేతుకంగా పొందుపరచాలి. వీటన్నింటి కీ అదనంగా పరిశీలకులు సిఫార్సు చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వారు ఆ కోణంలో గెలుపు గుర్రాలా? కారా? అనేది తేల్చి చెప్పాలి. కిందటి ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి దారితీసిన కారణాలను అంచనా వేసి, అవి సరి చేయడానికి, అదే అభ్యర్థి సరైన వాడా? కాదా? అనేది విశ్లేషణ చేయాలి. ఇక అభ్యర్థి సామాజిక నేపధ్యం, కులం, మతం, గుణగణాలు, నిజాయితీ తనం, ఎలాగూ అంచనా వేయాలి. అభిప్రాయ సేకరణ కొరకు కేవలం పార్టీ ప్రముఖులనే కాకుండా, పార్టీతో అంతో-ఇంతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో అనుబంధం వున్న వారిని, స్థానికంగా ప్రముఖ వ్యాపార వేత్తలను, స్వచ్చంద సంస్థల కార్యకర్తలను, ప్రభుత్వేతర సంఘాల నాయకులను, పాత్రికేయులను, ఇతర ప్రముఖులను కూడా సంప్రదించాలి. మొత్తం మీద రాహుల గాంధీ అంచనాల మేరకు నివేదిక రూపొందించాలి. ఎవరికి టికెట్ కేటాయించాలనేది రాహుల గాంధీకి వదిలేయాలి!

రాహుల్ గాంధీ రాజకీయం ఫలిస్తుందా? ఆయన అనుకున్న అభ్యర్థులు దొరుకుతారా? అసలాయన మనస్సులో ఏముంది? ఈ కసరత్తంతా ఏదో విధంగా గెలిచే అభ్యర్థుల కొరకా? లేక, భవిష్యత్‍లో అవినీతికి తావులేని అభ్యర్థులనే రంగంలోకి దింపాలన్న మంచి ఆలోచనా? ఇవ్వాళ దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. సాక్షాత్తు రాహుల్ కుటుంబ సభ్యుడైన వాద్రాపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో, తాను అవినీతికి దూరం అని తెలిపే విధంగా అభ్యర్థుల ఎంపికకు రాహుల్ శ్రీకారం చుట్ట దల్చుకున్నాడా? ఆయన నిజంగా అలా భావిస్తే అలాంటి అభ్యర్థులు దొరకడం అంత సులువైన పనేనా? నేర చరిత్ర లేనివారు, నీతిమంతులు, కుల-మతాలకు అతీతులు అసలెవరైనా మిగిలారా? కోట్ల రూపాయలలో ఆర్థిక స్తోమత లేనివారు ఎన్నికలలో నిలబడి గెలిచే పరిస్థితులున్నాయా? ఇవన్నీ రాహుల్ గాంధీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నాడనేది ప్రధానమైన ప్రశ్న. ఎన్నో ఆశలతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్టానం రాహుల్‌ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించుకుంటే, భావి భారత ప్రధాని ఆయనే సుమా అనే రీతిలో రాహుల్‍కు బరువు బాధ్యతలు అప్పగించారు. కనీసం మన్మోహన్ సింగ్ ప్రసక్తే లేకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రధాన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆంటోనీ, ద్విగ్విజయ్ సింగ్‌లకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మన్మోహన్ సింగ్‌కు ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తుంటే రాబోయే రోజుల్లో అంతా రాహుల్ గాంధీదే హవా అనిపిస్తోంది.

ఇదిలా వుండగా, ముందస్తుగానే రావచ్చని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికలకోసం పార్టీపరంగా రాహుల్‌గాంధీకి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకు ధీటుగా సమాధానం చెపుతున్నాయి. వారికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఒకటి వెంట మరొకటి యుపిఎ భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వం నుంచి తొలగి పోతుంటే, దిగజారిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు, తద్వారా అన్నివిధాలా కలిగిన నష్టాన్ని చక్కదిద్దుకునేందుకు, కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం ఒక పక్క ఖండిస్తూనే, మరో పక్క తన ప్రయత్నాలలో తానుంది. ప్రతిపక్షాలు కూడా ముందస్తు ప్రయత్నంలో వున్నాయనడానికి ఉదాహరణ సమాజ వాది పార్టీ తీసుకున్న తాజా నిర్ణయమే! వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అప్పుడే 55 మంది పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే ఎన్నికలకు వెళ్లవచ్చని సిపిఎం సీనియర్‌ నాయకుడు సీతారాం ఏచూరి చెప్పడం మరో ఉదాహరణ. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే ఖండించింది. తమ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వానికి పూర్తిగా అయిదేళ్లు, అంటే 2014 వరకు, పాలించమని ప్రజలు అధికారమిచ్చారని, ప్రభుత్వం తన పూర్తి కాలపరిమితిని పూర్తిచేస్తుంది అని అంటుంది. యూపీఏ 2 అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి పుకార్లు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అయిదేళ్లు పాలించేందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పిచ్చారు. అలాగే ప్రభుత్వం అయిదేళ్ల వరకూ అధికారంలో ఉంటుంది’ అని ఆ పార్టీ అంటుంది. ముందస్తు ఎవ్న్నికలకు అవకాశమే లేదని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వానికి ముప్పేమీ లేదని బల్ల గుద్ది మరీ చెప్తోంది ఆ పార్టీ.

ఐతే, రాజకీయ పార్టీగా ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధమేనని ఏఐసిసి వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఎవరి దగ్గర నుంచీ రాదు.  కాకపోతే, కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌కు మరింత విస్తృతమైన పాత్ర ఇవ్వడం అనేది ఆయనను వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించ డానికి సూచనే కదా? దీనికి సమాధానంగా పార్టీ వర్గాలు, పార్టీలో రాహుల్‌కు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన స్థానం అలాగే ఉంటుంది’ అని చెప్తున్నారు. రాహుల్‌కు కాంగ్రెస్‌లో కొత్త పాత్ర ఇచ్చారు కనుక మధ్యంతర ఎన్నికలు వస్తాయా?’ అన్న ప్రశ్నకు, ఇది పూర్తికాలం కొనసాగే ప్రభుత్వమే కానీ, మధ్యంతర ప్రభుత్వం కాదు’ అని సమాధానం వస్తుంది.

ఏదేమైనా రాహుల్ రాజ్యం రాబోతోంది. ఒక వేళ కాంగ్రెస్ ఓడితే అంతా తారుమారు కావచ్చు. అది వేరే సంగతి!

Sunday, August 5, 2012

సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం: వనం జ్వాలా నరసింహారావు


సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం
వనం జ్వాలా నరసింహారావు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ సోనియా గాంధీతో సమావేశమైనట్లు, రాజీ మార్గం గురించి చర్చించినట్లు మీడియాలో కధనాలొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని వైఎస్సార్సీపి నేతలు ఖండించడం కూడా జరిగింది. కలవడం, కలవకపోవడం అటుంచి, రాజీ మార్గం ఎంచుకోవడంలో మాత్రం తప్పేంటి? జగన్మోహన్ రెడ్డికి ముందర ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి పోలేదు? ఎంతమంది వారిలో స్వగృహ ప్రవేశం చేయలేదు? ఇతర పార్టీలలో వుంటూ ఎంతమంది కాంగ్రెస్‌ను అనరాని మాటలని, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి ప్రధాన భూమిక పోషించడం లేదు? అదే విధంగా భవిష్యత్‍లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశాలు లేవని ఎందుకు భావించాలి? ఎందుకు ఆ పార్టీ వారు భుజం తడుముకోవాలి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అందులోకి రావాలని అనుకునేవారికి మామూలే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ () కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారిని, ప్రజా బలం వున్న వారిని, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారిని, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

ఉదాహరణకు, ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి, రాజీవ్ గాంధిని, ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, దూషించారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్, కాంగ్రెస్ () లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర మాటేంటి? ఈ నాడు సోనియాకు అతి సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంగతేంటి? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే. జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? ఇవ్వాళ శరద్ పవార్ లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా?




కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. తనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్‍లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్టమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్‌కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్‍లో తన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించుకున్నారు నెహ్రూ.

1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా జనగణమణ..” వుండాలా, “వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, “డెమోక్రాటిక్ పార్టీని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదనిఅన్నారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. తనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు సంజీవయ్య. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని మినిస్టీరియలిస్టులుఅని, ఏసీ వర్గాన్ని డిసిడెంట్లుఅని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ హోం మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో విషయంలో ఈ రోజు ఆయనను బాహాటంగా విమర్శించే వారు, ఆయనున్నప్పుడు నోరు విప్పడానికే జంకేవారు.
          
నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం విభజించి పెత్తనం సాగించడంఅనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే, ఆంధ్ర ప్రదేశ్‌పైనా పడక మానదు. యుపిఎ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అత్యధిక స్థానాలను సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో సంధి ప్రయత్నాలను చేయక తప్పని పరిస్థితి



కాకపోతే, ఆ పని ఇప్పుడు చేస్తే మంచిదా? 2014 ఎన్నికల తరువాత చేస్తే మంచిదా? అని ఆలోచించుకోవాలి. ఏదేమైనా, చేరేది లేదు-చేతులు కలిపేది లేదని తెగేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి! ఎవరి వ్యూహం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

Thursday, July 5, 2012

"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?: వనం జ్వాలా నరసింహారావు


"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?
సూర్య దినపత్రిక (06-07-2012)
వనం జ్వాలా నరసింహారావు

స్వర్గీయ పివి నరసింహా రావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా, ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరైనా రహస్యంగా అడుగుతే, వచ్చిన సమాధానం, మరొక్క సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వున్నదని అట. దానికి కారణం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడమే. అలానే ప్రణబ్ ముఖర్జీని ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరన్నా అడుగుతే ఠంఛన్‍గా వచ్చే సమాధానం, ఏ నాటికైనా ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాలని వుందని. ఆ కోరిక ఇక తీరే అవకాశం లేదు. ఒక సారి రాష్ట్రపతి ఐన తరువాత ప్రధాని అయ్యేందుకు కుదరదని తెలిసినా, ఆయన ఆ పదవిని ఎంచుకోవడానికి కారణం, ఇప్పట్లో, కాంగ్రెస్ పార్టీ మరో మారు అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనందునే. ఆ విషయం బాగా అర్థం చేసుకున్న ప్రణబ్, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, తనకెలాగూ ప్రధాని అయ్యేందుకు వీలు కాదు అని భావించి రాష్ట్రపతి పదవికి అంగీకరించారు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, దేశంలోను, రాష్ట్రంలోను 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేనట్లే. దీనికి కారణాలు అనేకం. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి కాయ కల్ప చికిత్స చేసినా, ఆంధ్రప్రదేశ్ చేయి జారిపోయినట్లే!
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొంది 2009 లో మరో మారు ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు గురిచేస్తోంది.


అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య గారి నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని ఈ వ్యాస రచయిత భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది. 
2009 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ విజయం, తెలంగాణలో తెరాస అభ్యర్థి విజయం కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించాయి. అధిష్ఠానానికి నెత్తి బొప్పి కట్టించేలా చేశాయి. నెత్తి మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం. కాకపోతే, చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు కాంగ్రెస్‌కు రెండు సీట్లిచ్చాయి. ఇదేదో తన ఘనతగా చాటుకుంటున్నాడు చిరంజీవి. ఆయన తన సినీరంగ పలుకుబడితో జనాలను ఆకర్షించుకోగలడేమో కాని, ఓటర్లను ఆకట్టుకోలేరనేది మరో మారు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసో-తెలియకో, ప్రత్యక్ష జోక్యంతోనో-పరోక్ష ఒత్తిడితోనో, ఆ పార్టీ రచించిన ప్రణాళికా వ్యూహం బెడిసికొట్టిందనాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్-తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర ప్రతికూలతకు దారి తీశాయి. మరి ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే, నాలుగో కృష్ణుడి రూపంలో, జైపాల్ రెడ్డో-జానారెడ్డో-శషిధర రెడ్డో-డి. శ్రీనివాసో-లేదా, మరో వ్యక్తో రావాలి. కాకపోతే ఆ వచ్చే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కాదన్న నమ్మకం లేదు.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర, రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డకో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా? ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?  
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌ గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్తమౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన తెలంగాణ అంశంపైన, వైఎస్‌ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌ దూకుడు పైన రాహుల్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు మీడియా కధనాలొచ్చాయి. రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు. ఇప్పటికే రాహుల్‌ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమై పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారంటున్నారు. అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్‌ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
సీనియర్ పార్టీ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డికి రాహుల్ కబురు పంపి మరీ కలుస్తున్నాడు. ఈ కలయిక వెనుక కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆశయముందా? లేక తాత్కాలికంగా నాయకత్వ మార్పు గురించిన ఆలోచన వుంటుందా? ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేం. ఇటీవల కాలంలో పాల్వాయి గోవర్ధన రెడ్డిని సంప్రదించడం కొంచెం ఎక్కువైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ నాయకత్వం మార్చే అవకాశం వుంటే, సీనియర్ నాయకుడైన ఈ తెలంగాణ ప్రాంత వ్యక్తికి కూడా అవకాశాలుండవచ్చేమో! ఏదేమైనా ప్రత్యేక తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా, రాయల తెలంగాణాను ఏర్పాటు చేసి, తెరాసతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన సీమాంధ్ర ప్రాంతానికి మొదలు ఢిల్లీ నుంచి ఒక నాయకుడిని దిగుమతి చేసి ముఖ్యమంత్రిని చేయడం, ఆ తరువాత చిరంజీవిని పీఠం ఎక్కించడం జరగొచ్చని భావిస్తున్నారు.