Sunday, March 28, 2021

పుత్ర కామేష్టి చేసిన దశరథుడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-50 : వనం జ్వాలా నరసింహారావు

 పుత్ర కామేష్టి చేసిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-50

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-03-2021)

సంతాన లాభం అనుగ్రహించమని వేడుకొనిన దశరథుడితో ఋశ్యశృంగుడు, ఆయన కోరిన విధంగానే జరుగుతుందని అంటాడు. కీర్తికి స్థానాలైన నలుగురు కొడుకులు ఆయనకు కలుగనున్నారనీ, విచారించ వద్దనీ అంటూ, తదేక ధ్యానంతో కొంచం సేపు ఆలోచిస్తాడు. దశరథుడికి కొడుకులు పుట్టేందుకు అధర్వణమంత్రాలతో యాగాన్ని చేయిస్తానంటాడు. అధర్వణ మంత్రాల ప్రకారం అగ్నిహోత్రుడిని ఉద్దేశించి హోమం చేయిస్తే తనకు కొడుకులు పుడతారని ఋశ్యశృంగుడు చెప్పిన మనోరంజకమైన మాటలను విన్న దశరథుడు సంతోషించి యజ్ఞానికి పూనుకుంటాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు, పరమఋషులు, తమతమ హవిర్భావంకొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు.

రావణుడు పెట్టే బాధలను బ్రహ్మతో విన్నవించుకున్న దేవతలు

         "నమస్కారం చేసిన ప్రతివాడికి స్వాధీనుడవయ్యే బ్రహ్మదేవా! నీ దయను పరిపూర్ణంగా పొందిన రావణాసురుడు, బ్రహ్మ వర బలంతో తననెవ్వరూ-ఏమీ చేయలేరని, గర్వంతో మమ్ములను బాధలకు గురిచేస్తున్నాడు. భుజబలంతో వాడినెదిరించి యుద్ధం చేసే సమర్థత మాకు లేదు. పోనీ, ఎలాగైనా వాడిని చంపుదామంటే, దేవతలవల్ల వాడికి చావు లేకుండా నీ విచ్చిన వరాన్ని మేము గౌరవించి, వాడిని చంపకుండా విడిచిపెట్టి, వాడి చేతిలో చెప్పరాని బాధలు పడుతున్నాం. వాడు మమ్మల్నే కాదు-ముల్లోకాలను మనోవ్యాకులంతో హాహా కారాలు చేసే విధంగా దుష్టుడుగా బాధిస్తున్నాడు. ఇంద్రుడిని స్వర్గంలో లేకుండా చేసే ప్రయత్నంలో వున్నాడు. నీ విచ్చిన వర బలంతో వసువులను, వ్రతులను, బ్రాహ్మణులను, యక్షులను చికాకుపరస్తున్నాడు. ఇది చేయొచ్చు-అది చేయకూడదని లేకుండా, వాడు చేసేవన్నీ చెడ్డపనులే. రావణాసురుడికి భయపడి సూర్యుడు వేడి కలిగించకుండా చంద్రుడి మాదిరి చల్లబడ్డాడు. వాయుదేవుడు వీచడం మానేశాడు. సముద్రుడు శుష్కించి భయంతో కదలడం లేదు. ఇక వాళ్ళ గతే అలావుంటే, మా సంగతి చెప్పేందుకేముంటుంది? వీడు బలహీనపడి జగాలన్నీ రక్షించబడే మార్గం లేదా?" అని దేవతలందరూ బ్రహ్మను వేడుకుంటారు. ఇలా తనను ప్రార్థించిన దేవతలతో, రావణాసురుడిని చంపే ఉపాయం తోచిందని సంతోషంతో అంటాడు బ్రహ్మ. దేవలతచేత, యక్షులచేత, దైత్యులచేతా, విద్యాధరులచేత, వసువులచేతా, ఆకాశ సంచారులచేత చావు లేకుండా మాత్రమే రావణాసురుడు తనను వరం కోరాడని, అంతకంటే తక్కువ వారైన మనుష్యుల చేతిలో చావు లేకుండా వరం కోరలేదనీ అంటాడు బ్రహ్మ. మనుష్యులు దుర్బలులనీ-వారికంటే వానరాదులు మరింత దుర్బలులనీ, వారు తననేమీ చేయలేరనీ అలక్ష్యంగా మాట్లాడాడు. కాబట్టి వాడి చావు మనిషి చేతిలో రాసిపెట్టి వుందని అంటాడు బ్రహ్మ సంతోషంగా. ఆవిధంగా బ్రహ్మ చెప్పగానే, రావణ వధకు ఉపాయమైతే దొరికింది కాని, వాడిని చంపగల మనిషెవ్వరని-ఎవరిని తాము ఆశ్రయించాలని ఆలోచనలో పడ్డారు దేవతలందరూ.

దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ విష్ణుమూర్తి

దేవతలు తమను రక్షించేవాడెవరోనని తెలుసుకొనేలోపలే, శిష్టులను రక్షించేందుకు, దుష్టులను శిక్షించేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు, దశరథుడి అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు. భగవంతుడు, ఎప్పుడు దేవతలు తనను శరణుకోరుతారా-ఎప్పుడు వారిని రక్షించాలా, అని ఎదురుచూస్తున్న విధంగా ఆయనే వారిని వెతుక్కుంటూ వచ్చాడని దీనర్థం. యాచించిన తర్వాత యాచకుల కోరిక నెరవేర్చడం ఉత్తమ లక్షణం కాదనీ, తనను శరణుజొచ్చిన వారికట్టి శ్రమ కలిగించకూడదని, భగవంతుడే స్వయంగా వచ్చాడు. అయితే, సర్వజ్ఞుడైన భగవంతుడికి, రావణుడి విషయం తెలియదా అన్న సందేహం రావచ్చు. తెలిసికూడా వాడు పెట్టే బాధలనుండి దేవతలను ఎందుకు కాపాడలేదు? ఎవరైనా తమను తాము రక్షించుకుంటామన్న ధైర్యం వున్నంతవరకు, స్వప్రయత్నం చేస్తున్నంతవరకు, దైవ సహాయం అందదు. దైవమే పరమ గతి-దైవ సహాయం లేని పురుష ప్రయత్నం వ్యర్థమని ఎప్పుడు భారం భగవంతుడిపైన వేస్తారో అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. మనం భగవంతుడికెదురుగా పది అడుగులేస్తే ఆయన పదికోట్ల అడుగులు వేసి మనను చేరుకుంటాడు. ఇది అనివార్య విధి. దేవతలు రక్షకుడిని కోరుకున్నప్పుడే భగవంతుడికి తెలిసిపోయింది. ఆశ్రిత రక్షణకు సిద్ధమయ్యాడు . కాంచనచేలుడు, జగన్నాయకుడు, శుభకరమైన దేహకాంతికలవాడు, శంఖ చక్ర గధ భయ ముద్రలతో మనోహరమైన వాడు, విష్ణుమూర్తి ఆవిధంగా దేవతలున్నచోటుకు వచ్చాడు. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన మనస్సును సంతోషపరచి, భక్తితో తమ బాధలు చెప్పుకున్నారు.

లంకానగరం జయించనలవి కానిదా? : వనం జ్వాలా నరసింహారావు

 లంకానగరం జయించనలవి కానిదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (28-03-2021) ప్రసారం  

హనుమంతుడు సీతావిషయం లంకలో జరిగినది జరిగినట్లే చెప్పగా రామచంద్రమూర్తి వినిసంతోషించిసుగ్రీవుడిని చూసి, "మన హనుమంతుడికి సమానమైనవాడని చెప్పగలవాడు ఈ లోకంలో ఎవరైనా వున్నారాలేడు...లేడు....లేడు. హనుమంతుడు కాకుండా మరెవ్వరికైనా ఆ సముద్రాన్ని దాటడం సాధ్యమయ్యేదా? రావణుడు పాలించే లంకను ఎంతటివాడైనా తన బలసంపదతో ప్రవేశించడం సాధ్యమాఒక వేళ రాక్షసులను ఏమరచి లోపల ప్రవేశించినా మళ్లీ ప్రాణాలతో తిరిగిరావడం సాధ్యమాఅలా చేయగలగడం మన హనుమంతుడికి ఒక్కడికే చెల్లింది అన్నాడు.

రాముడు ఇంకా ఇలా అన్నాడు. "సుగ్రీవుడి యోగ్యతకు తగ్గట్లు రాక్షసులను వధించి లంకాదహనం చేశాడు హనుమయజమాని చెప్పని అవసరమైన కార్యక్రమం కూడా నెరవేర్చే దూతను బుద్ధిమంతులు పురుషోత్తముడు అంటారు. ఇది ఉత్తమ దూత లక్షణం. హనుమంతుడు పురుషోత్తముడైనందున రాక్షసులకు చిక్కినాతన గౌరవానికి హానికలుగకుండాతనను దూతగా నియమించిన సుగ్రీవుడికి సంతోషం కలిగేట్లు నియమిత కార్యాన్ని సాధించాడుఇది ఆయన తన స్వామికి చేసిన ఉపకారంజానకిని చూసి వచ్చి నాకు, లక్ష్మణుడికిమా ఉత్తమ రఘువంశానికి ప్రాణాలిచ్చి రక్షించాడు.  నేనే రాజుగా వుంటే సర్వరాజ్యం నీకిచ్చేవాడిని. అది కూడా లేదాయె. కాబట్టి నువ్వు చేసిన దానికి బదులుగా నా కౌగిలిని తీసుకో ఆంజనేయా! ప్రార్థిస్తున్నాను. ఇది బదులుగా అంటున్నాను కాని సమానంగా అనడం లేదు. ఇది నువ్వు చేసినదానికి సమానం కాదు. అయినాఈ అల్ప దక్షిణను శాస్త్రోక్త దక్షిణగా తీసుకోమని నాకున్న అల్పమైన ఈ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను".

“నా ప్రార్థన నిరాకరించక మన్నించమని కోరుతున్నానుకృపతో పరిగ్రహించునువ్వు నిరాకరిస్తే నాకంతకంటే వేరే మరణం లేదుఎందుకు నా కౌగిలి సమానం కాదంటున్నానాఅక్కడ చావడానికి సిద్ధంగా వున్న సీత ప్రాణాలు నిలిపావుఆ వార్త తెచ్చి ఇక్కడ నా ప్రాణాలు నిలిపావుఇలా ఇద్దరి దేహాలు నువ్వు ఇస్తేనేను ఒక్క దేహాన్ని ఇవ్వడం ఎలా సమానమవుతుందికాదునేనేం చేయాలిఏమీ చేయలేకపోయానని బాధపడుతున్నానునా ఈ దుఃఖాన్ని నేనిచ్చిన దానిని ప్రేమతో స్వీకరించి అణచివేయినువ్వు చేసిన ఉపకారాలకు ఇది సమానం కాదనడానికి ఇంకో కారణం కూడా వుందినువ్వు నాకు సుగ్రీవుడితో స్నేహం కుదిర్చి గొప్ప ఉపకారం చేశావు. అప్పటినుండి నీకెలా ప్రత్యుపకారం చేయాల్నా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇది రెండోది. ఈ రెంటికీ నేనిచ్చిన అల్పం ఎలా సమానం కాగలదుకాబట్టి హెచ్చుతక్కువలు ఆలోచించకుండా నేనిచ్చిన అల్పాన్ని ప్రేమతో స్వీకరించు" అన్నాడు రాముడు.

రాముడు కౌగిలి ఇవ్వడం అంటే తనను తాను సమర్పించుకొనడమే. ఆత్మాత్మీయనిక్షేపం అన్నట్లుగా తనను సమర్పించుకోవడంఅంటేతనకున్న సర్వస్వాన్ని, అంటేనిత్యవిభూతిలీలావిభూతి రెండూ అర్పించినట్లే. వీటితో ఆయనకేం ప్రయోజనమంటేఆయనకు ప్రియమైనది ఇస్తేనే కదాప్రయోజనం అనవచ్చు. హనుమంతుడికి ప్రియమైంది శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహమే. పరస్వరూపంతో ఆయనకు పని లేదు. ఎవరికేది ప్రియమో దానినే భగవంతుడు వాడికిస్తాడు. కాబట్టి ఆ దివ్యమంగళ విగ్రహం మీద హనుమంతుడికి ప్రీతి అని తెలిసి రాముడు దాన్నే ఇచ్చాడు. దాంతో హనుమంతుడు తృప్తి చెందాడు.

ఆ తరువాత శరీరం పులకరిస్తుంటే రామచంద్రమూర్తి ఆంజనేయుడిని నిండుమనస్సుతో కౌగలించుకుని సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడు. "జానకీదేవిని వెతికే పని చక్కబడింది. కాని సముద్రాన్ని తలచుకుంటే దిగులుగా వుంది. దాటడానికి సాధ్యపడని సముద్రాన్ని దాటివానరులందరూ దక్షిణ దిక్కు తీరానికి చేరే ఉపాయం నీకేమైనా తెలిస్తే చెప్పు. వానరులారా! సీత ఎక్కడున్నదిఎలా వున్నదిఅనే విషయం మీరు చెప్తే విన్నాను. అక్కడికి మనం పోవాలికదాపోయే మార్గంలో సముద్రాన్ని దాటాలికదామీరంతా ఆ సముద్రాన్ని ఎలా దాటాలో ఉపాయం వుంటే చెప్పండి". ఈ విధంగా వానరులకు చెప్పిరామచంద్రమూర్తి ఆంజనేయుడితో కలిసి ఆలోచన చేశాడు.

సముద్రాన్ని దాటడం ఎలా అని విచారపడే శ్రీరామచంద్రమూర్తిని చూసి సుగ్రీవుడు ఆయనకు ధైర్యం కలిగించే మాటలను చెప్పాడు. “ఏ ఉపాయం చేస్తే పాపాత్ముడైన రావణుడిని యుద్ధంలో చంపి సీతాదేవిని తీసుకురావచ్చో ఆ మార్గాన్ని ధీరుడివై చేపట్టు. నువ్వు చేయాల్సినదంతా సముద్రాన్ని దాటి లంక చేరడానికి ఏం చేయాలన్న ఆలోచనే. లంక కనబడితే ఇక రావణుడు చచ్చినట్లే. రామచంద్రా! ఒకటి మాత్రం నిశ్చయం. సేతువు కట్టకుండా సముద్రాన్ని దాటడం దేవతలకైనా సాధ్యంకాదు. సేతువే ఏర్పాటైతే వానరులు సముద్రాన్ని దాటడం శత్రుసంహారం చేయడం తధ్యం. ఆ విషయంలో నువ్వు సందేహించాల్సింది లేదు. ఎందుకంటే ఈ వానరులు కామరూపులు. యుద్ధంలో శూరులు. కలహానికి భయపడరు. కాబట్టి నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టు. అది నీకు తగదు. శౌర్యం వున్నవాళ్లు పనులు చేయడాని అధైర్యపడరు" అని అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న రామచంద్రమూర్తిహనుమంతుడితో, "హనుమంతానువ్వు లంకానగరాన్ని కళ్లారా చూశావుకదాదానిలో కోటలెన్ని వున్నాయిసైన్యం ఎంతమేరకు వుందిచెప్పులంకకు ద్వారాలెన్నికోటలెన్నివాటిని ఏవిధంగా కట్టించారురాక్షసుల ఇండ్లు ఎన్నివాటిని రక్షించడానికి ఎలాంటి ఉపాయం చేశారుఇవన్నీ చెప్పుతీరిగ్గా లంకంతా తిరిగి చూశావు కదాఅన్నింటికీ సమర్థుడివి కాబట్టి నీకీ విద్య కూదా తెలిసే వుండాలివివరంగా చెప్పుఅని అన్నాడు.

జవాబుగా హనుమంతుడు, "దేవాలంకకు నలుదిక్కులా నాలుగు ద్వారాలున్నాయివాటి ద్వారాలను అడ్డగడియ చెట్లతో బంధించి వుంచారుఆ ద్వారాలలోని రాతి యంత్రాలతో ఆ మార్గాన వచ్చిన విరోధిసైన్యం అక్కడే చచ్చిపోతుందిరాక్షసులు నిర్మించిన శతఘ్నులు వేటుకు వందమందిని చంపగలవుఅవి ద్వార-ద్వారాన విశేషంగా ఏర్పాటుచేయబడి వున్నాయికోటగోడలను పగులగొట్టి లోపలికి పోవడం సాధ్యపడదుఆ పట్టణం చుట్టూ మిక్కిలి భయంకరమైన మొసళ్లతో నిండి చాలా లోతులో నీరున్న కందకాలున్నాయిఆ కందకాలమీద ప్రజల రాకపోకలకు అనుకూలంగా వుండే విధంగా వెడల్పాటి వంతెనలున్నాయి. శత్రువులు వచ్చినప్పుడు యంత్రాలను తిప్పితేఆ వంతెనలు లేచి కోట ద్వారాలకు తలుపుల్లాగా అడ్డుపడతాయి. అక్కడ ఇండ్ల వరసలున్నాయి. అవికూడా ఆ పలకల వంతెనల్లాగే శత్రువులు వచ్చినప్పుడు లంకాపురాన్ని రక్షిస్తాయి”.

“లంకలో జలదుర్గంకృత్రిమ దుర్గంపర్వత దుర్గంవనదుర్గాలనే నాలుగు రకాల భయంకర దుర్గాలున్నాయిఇవి ఇతరులకు సాధ్యపడవులంక నిరాధారంగా సముద్రతీరంలో వున్నదిదానిలోకి ప్రవేశించడం దేవతకు కూడా సాధ్యంకాదునావలు కూడా దాని సమీపంలోకి పోవడానికి దారిలేదుపర్వత శిఖరం అమరావతిలాగా వుందిబయటి వార్త లోపటికి పోవడం కానీలోపలివార్త బయటికి రావడానికి కానీ వీలుకాదుగొప్ప యంత్రాలునానారకాల అగడ్తలుశతఘ్నులు వున్నాయిజయించడానికి ఏదీ సాధ్యపడదుతూర్పునుండి సైన్యం రావడానికి వీలుపడదుఆ ద్వారంలో పదివేలమంది రాక్షసులు సైన్యానికి ముందు నిలిచి యుద్ధంచేయడానికి సిద్ధంగా వుంటారు ఎల్లప్పుడూదక్షిణద్వారం దగ్గర శూలాలు ధరించిన శూరులుఅజేయులు, పరాక్రమవంతులు లక్షమంది రాక్షసులు నాలుగు రకాలైన సేనలతో కాపలాకాస్తుంటారు. పడమటి వాకిట్లో పదిలక్షలమంది రాక్షసులు కాపలాగా వుంటారు. వీరికి అస్త్రవిద్యకూడా తెలుసు. ఉత్తరద్వారం దగ్గర పది అర్బుదాల రాక్షసులు ఏనుగులుగుర్రాలు వాహనాలుగా రక్షిస్తుంటారు. వీరంతా రావణుడికి పూజ్యులువిశ్వాసపాత్రులు".

హనుమంతుడి మాటలను విన్న రామచంద్రమూర్తి ఈ విధంగా అన్నాడు. "లంకను పాడుచేయడం పెద్ద పనికాదని భావిస్తున్నానురావణాసురుడి పురాన్ని ధ్వంసం చేస్తానుసత్యం చెప్తున్నానుప్రయాణానికిదే మంచి ముహూర్తంఈ ముహూర్తానికి విజయం అని పేరుఇప్పుడు మనం బయల్దేరి పోతే పగవాడు జానకిని తీసుకుని ఎక్కడికి పోగలడుఎక్కడికి పోయినా చస్తాడుఈ ముహూర్తానికి "అభిజిత్అని పేరు. ఈ రోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంనా జన్మ నక్షత్ర్రానికి ఆరవది కాబట్టి శుభం కలుగుతుందిరేపు చంద్రుడు హస్తతో కూడి ఏడవతారై ధనతార అవుతుందిఅది అశుభంరేపు ప్రయాణం చేయకూడదుకాబట్టి ఈ రోజే సైన్యంతో సహా ప్రయాణం చేయాలిమంచి శుభశకునాలు కనపడుతున్నాయికాబట్టి రావణుడిని చంపి సీతను తేవడం సత్యంశత్రువులను నాశనం చేసి, జయం పొందిఅవమానాన్ని పోగొట్టుకుంటావని చెప్పేవిధంగా కంటిపైభాగం అదురుతున్నదిప్రయాణం చేయడానికి ఇదే సరైన సమయం”.

రామచంద్రమూర్తి ఇలా చెప్పగా, సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు గుహలనుండి, పర్వత శిఖరాలనుండి, భూమ్యాకాశాలు దద్దరిల్లేట్లు భయంకరంగా బయల్దేరారు వానరులు. రామచంద్రమూర్తి లక్ష్మణ సుగ్రీవులతో కలిసి సంతోషంగా, అతివేగంగా, దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశాడు. శ్రీరాముడి వెంట వానర సైన్యం నడిచింది. ఎవరికివారు తామే రావణుడిని చంపుతామని అన్నారు. మహాబలవంతుల మధ్యన రామలక్ష్మణసుగ్రీవులు పోయారు. సుగ్రీవుడు ముందు పోతున్నాడు. త్వరగా నడవమని వానరులను ప్రోత్సహించారు. సముద్రధ్వనితో సమానమైన ధ్వనితో సముద్రం పొంగి వెల్లువగా మారిన విధంగా వానరసేన చక్కగా తోలబడ్డ గుర్రాల దండు వేగంలాగా రామచంద్రమూర్తి పక్కనే నడిచాయి.

          లక్ష్మణుడు రామచంద్రమూర్తితో సీతాదేవిని మళ్లీ ఆయన తీసుకుని వస్తాడనీ,  భూమ్మీద, ఆకాశం మీద, కనిపించే శుభశకునాలు కార్యసిద్ధి తెలియచేస్తున్నాయనీ అంటాడు. రాముడి అవతార కాలంలో జాతకఫలాలు సూచించినట్లేదండయాత్రాకాలంలో గోచార ఫలాలు రాక్షసుల విపరీత పరిణామానికి సూచనలు అయ్యాయి. శుభ శకునాలు తెలుపుతూ లక్ష్మణుడు అన్నకు సంతోషం కలిగే విధంగా చెప్తుంటే రామచంద్రమూర్తి సైన్యాన్ని వేగంగా నడిపించాడు.

ఇలా ఒక రాత్రి, ఒక పగలు విడవకుండా ప్రయాణం చేశారు. రామచంద్రమూర్తి మహేంద్రపర్వతంమీద ఎత్తైన శిఖరం ఎక్కి తాబేళ్లు, చేపలు అమితంగాకల సముద్రన్ని చూశాడు. మలయ పర్వతం, సహ్య పర్వతం దాటి సముద్రాన్ని సమీపించి, అక్కడ ఆంజనేయుడి మీదనుండి దిగి సముద్రతీరంలో వుండే వనం దాటి చెలియలి కట్ట దగ్గర అలలతో కడుగబడిన ప్రదేశానికి చేరారు.

రామచంద్రమూర్తి సుగ్రీవుడిని చూసి, "వానర రాజా! సముద్ర తీరం చేరాం. ఏదైనా ఒక ఉపాయం చేసి దీన్ని దాటాలికాని వ్యర్థంగా కాలం గడపకూడదు” అన్నాడు. సముద్రతీరాన సేనలన్నీ ఏఏ సేన ఏఏ చోట దిగాల్నో ఆ విధంగానే దిగిన తరువాత రామచంద్రమూర్తి సముద్రానికి ఆవలి ఒడ్డున సీతాదేవిని తలచుకుని దుఃపడుతున్నాడు. సీతాదేవి దుఃఖిస్తున్నదని హనుమంతుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని మరీ-మరీ దుఃఖించాడు. “సీత జీవించే వుందని హనుమంతుడు చెప్పాడు. కాబట్టి నేను కూదా జీవించగలిగాను. కాని నేనామెను చూడగలనా? నా భార్యను, స్త్రీరత్నాన్ని, భూపుత్రికను సీతను విడిచినందున కలిగిన దుఃఖం నేనెప్పుడు మాసిన గుడ్దను వదిలినట్లు వదిలి సుఖపడతానోకదా?” అని అంటాడు.   

ఇలా రాముడు శోకిస్తుంటే సాయంకాలమై సూర్యుడు అస్తమించాడు. ఆయన బాధ పోయేట్లు లక్ష్మణుడు సమాధాన పరిచే మాటాలు చెప్పాడు. అవి విని, సీతను స్మరించుకుంటూ రామచంద్రుడు సంధ్య వార్చాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Saturday, March 27, 2021

పాండవుల అరణ్యవాసం, కామ్యక వనం నుండి ద్వైత వనానికి (ఆస్వాదన-12) : వనం జ్వాలా నరసింహారావు

 పాండవుల అరణ్యవాసం,  కామ్యక వనం నుండి ద్వైత వనానికి

(ఆస్వాదన-12)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక, ఆదివారం సంచిక (28-03-2021)

జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేయడానికి ఉత్తర దిక్కుగా పయనించారు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, విదురులెవరూ పాండవులకు జరిగిన అపకారాన్ని వారించలేదు. వెంట వస్తామన్న పురజనులను ధర్మారాజు వద్దని మరలిపోమ్మన్నాడు. అరణ్యం చేరుకున్న పాండవులు గంగానదీ తీరాన ‘ప్రమాణం అనే మర్రిచెట్టు కింద విడిది చేశారు. మర్నాడు ఉదయం అనేకమంది బ్రాహ్మణోత్తములు పాండవులతో పాటు అరణ్యవాసానికి సిద్ధమై వారి దగ్గరికి వచ్చారు.

తనను చూడడానికి వచ్చి వేదాంత పరమార్థాన్ని వివరించిన శౌనకుడనే బ్రాహ్మణ ఋషితో ధర్మరాజు, తాము చేసేది వనవాసం అనీ, తమతో అడవికి రావద్దని ఎంత చెప్పినా వినకుండా వస్తామన్న బ్రాహ్మణులకు ఆహారం ఏవిధంగా సమకూర్చి పెట్టాలని అడిగాడు. పూర్వకాలంలో భీమ, వైన్య, కార్తవీర్య, నహుషాదులు ఏవిధంగా సూర్యుడిని ఆరాధించి ఆహారాన్ని సాధించి ప్రజలను కాపాడారో, అలాగే, ధర్మరాజును కూడా సూర్యుడిని పూజించమని సలాహ ఇచ్చాడు శౌనకుడు.

పాండవ పురోహితుడైన ధౌమ్యుడు ధర్మరాజుకు 108 ఆదిత్యనామాలు సరైన ఉచ్చారణతో నేర్పించి ఉపదేశించాడు. ఆ ఉపదేశం ప్రకారం ధర్మరాజు గంగా జలాలలో నిలిచి నిష్టగా సూర్యుడి గురించి అష్టోత్తరశతనామాలు ఉచ్చరిస్తూ జపం చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు తపస్సు నచ్చిందని, ఆయన అడవిలో వుండే 12 సంవత్సరాలు అక్కడ లభించే పండ్లు, కూరగాయలు, వేళ్లు ఆయన పాకశాలలో ద్రౌపదిచే వండబడి తరుగని నాలుగు రకాల వంటకాలుగా ఏర్పడగలవని చెప్పి ఒక రాగి పాత్ర ఇచ్చి మాయమయ్యాడు. నాటినుండి ద్రౌపది ఆ అక్షయ పాత్రలో వండిన శాకమూలాలతో బ్రాహ్మణులను తృప్తి పరిచాడు. ధృతరాష్ట్రుడు ఎప్పటికప్పుడు పాండవుల విషయాలను విడురుడిని అడిగి తెలుసుకుంటున్నాడు. ఒకానొక సందర్భంలో తన మాట ధృతరాష్ట్రుడు వినడం లేదని ఆయన్ను వదిలి పాండవుల దగ్గరికి పోయిన విదురుడు కొంతకాలం తరువాత ధృతరాష్ట్రుడి కోరిక మీద వెనక్కు వెళ్లాడు.

పాండవులు అక్కడి నుండి కామ్యక వనానికి వెళ్లారు. ఇదిలా వుండగా పాండవుల దగ్గరికి వెళ్ళిన విదురుడు మళ్లీ వెనక్కు వచ్చి ధృతరాష్ట్రుడికి సన్నిహితుడు కావడంతో దుర్యోధనుడికి అనుమానం వచ్చింది. ఒకవేళ పాండవులను వనవాసం నుండి వెనక్కు రమ్మంటారేమో అన్న అనుమానం కలిగింది. పాండవులమీద దండెత్తాలని నిర్ణయించిన దుర్యోధనుడు యుద్ధానికి బయల్దేరుతుండగా ఆ వృత్తాంతాన్ని దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్న వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అది అధర్మం అని వారించి, ధృతరాష్ట్రుడికి పిర్యాదు చేశాడు. పాండవుల మీద వాత్సల్యం చూపమన్నాడు వ్యాసుడు. 

తన మాట కొడుకు వినడని ధృతరాష్ట్రుడు వ్యాసుడికి చెప్పాడు. ఆయన్నే దుర్యోధనుడికి ప్రబోధం చెయ్యమన్నాడు. ఆ పని మైత్రేయ మహర్షి వచ్చి చేస్తాడని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో ధర్మరాజును కలిసి మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. పాండవులను కలిసిన సంగతి చెప్పాడు. పాండవులతో విరోధం మానమని మైత్రేయుడు దుర్యోధనుడికి చెప్పాడు. జవాబుగా దుర్యోధనుడు తన తొడలమీద చరిచి చప్పుడు చేస్తూ, మైత్రేయుడిని పరిహసించాడు. దానికి కోపగించిన మైత్రేయుడు, జరగబోయే ఘోర యుద్ధంలో భీమ గదాఘాతం వల్ల దుర్యోధనుడి తొడలు విరుగుతాయని శపించాడు. ఆ తరువాత మైత్రేయుడు ధృతరాష్ట్రుడికి కిమ్మీరుడనే రాక్షసుడు భయంకరమైన అడవిలో ఎలా భీముడి చేతిలో సంహరించబడింది వివరించాడు.

ఇదిలా వుండగా, అడవిలో వున్న పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడి నాయకత్వంలో పాంచాల, యాదవ, వృష్ణి, బోజాంధకులైన బంధువులు వచ్చి దార్తరాష్ట్రులను నిందించారు. దృష్టద్యుమ్నుడు కూడా వచ్చాడు తన మేనల్లులతో. తనను స్తుతించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు, తామిద్దరం నరుడు, నారాయణుడు అనే ఆది ఋషులమని, వారిలో నరుడు అర్జునుడని, తాను నారాయణుడినని, ఇద్దరూ గొప్ప శక్తి కలిగి మనుజలోకంలో అవతరించామని చెప్పాడు. శ్రీకృష్ణుడితో ద్రౌపది తనకు కౌరవ సభలో జరిగిన పరాభవాన్ని చెప్పి దుఃఖించింది. ఆ సమయంలో దుశ్శాసనుడి దుష్ట చేష్ట కంటే కర్ణుడు తనను పరిహసిస్తూ నవ్విన నవ్వు తన మనస్సును ఘోరంగా కాలుస్తున్నదని అన్నది. జవాబుగా శ్రీకృష్ణుడు, ద్రౌపదీదేవి హృదయ తాపం కారణంగా, అర్జునుడి బాణాలకు దార్త్రరాష్ట్రులు మృత్యు సదనానికి చేరక తప్పదని అన్నాడు. తాను ఆ సమయంలో అక్కడ లేకపోవడం వల్ల అనర్థం జరిగిందని, ఉన్నట్లయితే ఆ పాపపు జూదాన్ని ఆపుచేసేవాడినని అన్నాడు.

తాను మాయాద్యూతం జరిగిన సందర్భంలో లేకపోవడానికి కారణమైన సౌంభకాఖ్యానం చెప్పాడు. సాల్వుడి దండయాత్ర దగ్గరి నుండి అతడి సంహారం వరకు వివరించాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలోని సౌంభక వృత్తాంతం ఒక అద్భుత కల్పన. 20, 21 వ శతాబ్దాలలో విజ్ఞాన శాస్త్రం అత్యద్భుతంగా మానవ మేధకు కొత్త కొత్త విషయాలను నేర్పింది. సౌంభకం రోదసీ యానం చేయగల ఒక కృత్రిమ గ్రహం లాంటిది కావచ్చు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు పాండవులను వీడ్కొని సుభద్ర, అభిమన్యుడుతో కలిసి ద్వారకకు వెళ్లాడు. దృష్టద్యుమ్నుడు తమ మేనల్లులతో కలిసి ద్రుపదనగారానికి పోయాడు. పాండవులు అక్కడి నుండి బ్రాహ్మణులతో కలిసి ద్వైతవనానికి వెళ్లారు. అక్కడ జాగ్రత్తగా వుండాలని తమ్ముళ్లకు చెప్పాడు ధర్మరాజు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

విభీషణుడి రాజనీతి రావణుడికి నచ్చలేదా? : వనం జ్వాలా నరసింహారావు

 విభీషణుడి రాజనీతి రావణుడికి నచ్చలేదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (27-03-2021) ప్రసారం

శ్రీరామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంత, అంగడ, తదితర వానర నాయకులు సేన సముద్రాన్ని దాటే ఉపాయం ఆలోచిస్తున్న సమయానికి  లంకలో రావణుడు, హనుమంతుడు ఒక్కడే చేసిన అసాధ్యమైన, కార్యాలను తలచుకుంటూ, రాక్షస వీరులను "హనుమంతుడు అతిశయించిన శక్తితో ఎవరికీ సాధ్యపడని లంకాపురంలో ప్రవేశించి, నన్ను తృణంకంటే నీచంగా ఎంచి, నా ఇంట్లో ప్రవేశించి, సీతను చూసి, గోపురాలను విరగతన్ని, నేలకూల్చి, రాక్షసులను చంపి పట్టణాన్ని భీభత్సంగా కాల్చాడు. అయిందేదో అయింది. దానికి విచారపడి ప్రయోజనం లేదు కదా! ఇక జరగాల్సిన పని గురించి చెప్పండి. నేనేం చేయాలి? నేనేం చేస్తే నాకు, మీకు మేలు కలుగుతుంది?” అని అడిగాడు. 

రావణుడు ఈ విధంగా చెప్పగా, రాక్షసులు, చేతులు జోడించి ఇలా అన్నారు. రాక్షసేశ్వరా! పట్టిసాలు, శక్తులు, ఋష్టులు, పరిఘములు, శూలాలు నిండిన గొప్ప సైన్యం నీకుండగా నువ్వెందుకు ఇలా విచారిస్తావు? యుద్ధంలో సమస్త దిక్పాలకుల గర్వం అణచి ఇంద్రలోకానికి పోయి నువ్వు ఇంద్రుడిని జయించలేదా? యమపురిలో ప్రవేశించి, మృత్యుదేవతను కలవర పర్చలేదా? లోకం దిగ్భ్రమ పొందేట్లు జయించలేదా? రాక్షసేశ్వరా! నువ్వే ఏ ఆలోచనా చేయనక్కర లేదు. ఏ కార్యమూ చేయాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా వుండు. వానరులందరినీ ఒక్క ఇంద్రజిత్తే చంపగలడు”.

సభలో వున్న రాక్షసులందరూ చెప్పిన తరువాత మంత్రులుఇతర ప్రముఖులు వారి అభిప్రాయాలను కూడా చెప్పారుఅందులో ముఖ్యుడైన ముఖ్య సేనానాయకుడు ప్రహస్తుడు తనకు ఆజ్ఞ ఇస్తే ఇప్పుడే పోయి రామలక్ష్మణులను హతం చేస్తానని అంటాడు. తానొక్కడినే ఈ నిమిషంలో పోయి వానర సమూహాలు ఆకాశానికి ఎగిరిపోయినా సరేసముద్రంలో దాగినా సరేపాతాళానికి పోయినా కూడా పట్టుకుని చంపుతాను అంటాడు దుర్ముఖుడు.  వజ్రదంష్ట్రుడు అనే వాడు తానొక్కడే ఎవరి సహాయం లేకుండా లక్ష్మణ సుగ్రీవుడితో సహా రాముడిని ఇప్పుడే చంపుతానుఅది చూసి వానరులందరూ బెదిరి సంతాపంతో పరుగెత్తుతారని అన్నాడు.

కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు తన భుజబల పరాక్రమంతో యుద్ధరంగంలో రాముడినిలక్ష్మణుడినిహనుమంతుడినిసుగ్రీవుడిని చీల్చి పారేస్తాను. మిగిలిన వానర సైన్యమంతా తునాతునకలుగా చిటికలో ఖండిస్తానని చెప్పాడు. ఇలా వజ్రహనుడు, యజ్ఞహుడు, నికుంభుడు, రభసుడు, మహాపార్శ్వుడు, రశ్మికేతువు, సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, మహోదరుడు, అగ్నికేతుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, విరూపాక్షుడు, ధూమ్రాక్షుడు, దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, ఇలా అందరూ మాట్లాడారు. ఇలా అయుధాలు ధరించి పౌరుషపు మాటలు పలుకుతున్న వారిని ఆపుచేస్తూ విభీషణుడు అన్నకు నమస్కారం చేసి ఇలా అన్నాడు.

"రాజనీతిలో కార్యం సాధించడానికి సామ, దాన, భేద అనే మూడు ఉపాయాలున్నాయి. ఈ మూడు ఉపాయలతో కార్యం సాధించలేకపోతే అప్పుడు దండమనే నాలుగో ఉపాయం అవలంభించాలని చెప్తున్నారు. మొదటి మూడు ఉపాయాలను ప్రయత్నించకుండా యుద్ధానికి దిగడం శాస్త్రవిరుద్ధం. రాముడు నివారింపకాని పరాక్రమవంతుడు. అతడిని పరాక్రమంతో జయించడం ఎలా సాధ్యం? వానరాధిపతైన సుగ్రీవుడు రాముడికి తోడుగా వున్నాడని విన్నం కదా? చూశాం కదా? వానరసేన ఎంతో, ఎలాంటిదో మనకు తెలుసు కదా? ఇలాంటప్పుడు శత్రువులను అలక్ష్యం చేయవచ్చా? రాముడిమీదకు యుద్ధానికి పోవడానికి కారణం ఏంటి? ఆయన మీకు చేసిన అపకారం ఏంటి? ముందు ఎవరెవరికి అపకారం చేశారు? రాముడు ఖరాదులమీదికి దండెత్తి వచ్చాడా? ఖరుడు రాముడి మీదికి దండెత్తి పోయాడా? ఖరుడే కదా పోయింది. తన ప్రాణానికి అపాయం కలిగినప్పుడు వారి శక్తికొద్దీ తమ్ము తాము రక్షించుకొనడం సహజమే కదా? అలాగే తన్ను తాను రాముడు రక్షించుకొంటే తప్పేంటి? రావణుడే కదా ముందు పోయి ఎక్కడో అడవిలో వున్న రాముడి భార్యను అపహరించి తెచ్చాడు. ఇందులో అన్యాయం ఎవరిది? కలహానికి కాలు దువ్వినవారెవ్వరు? సీతాదేవి ఇక్కడ లేకుంటే హనుమంతుడు ఇక్కడికి వచ్చేవాడా? అంతపని చేసేవాడా? ఇదెందుకు మీరు ఆలోచించరు?”.

"అన్నా! రామచంద్రమూర్తి సామాన్యమైన బలం కలవాడు కాదు. సారవంతమైన మహా బలం కలవాడు. దేహబలానికి తోడు ధర్మపు నడవడిలో ఆసక్తికలవాడు. ధర్మం వున్న చోటే విజయం వుంటుంది. కాబట్టి ధర్మబలం, దాని వెంట దైవబలం కలవాడు అయిన రామచంద్రుడితో నువ్వు అకారణంగా కలహానికి దిగడం సరైంది కానేకాదు. కాబట్టి సీతాదేవిని రాముడికి అర్పించు. లంక శత్రువుల బారిన పడకముందే సీతాదేవిని రాముడికి అప్పచెప్పు. వానరసేన లంకకోటలు లగ్గలు పట్టకముందే సీతాదేవిని శ్రీరాముడికి అర్పించడం గౌరవకరం. నువ్వు సీతాదేవిని రాముడికి తిరిగి ఇవ్వకపోతే రాక్షసులతో సహా లంకానగరం నాశనమై పోతుంది. అన్నా! నీకు మేలు కలుగుతుంది. మంచిమాటలే చెప్పాను కాని, దానికి విరుద్ధంగా నేనేం చెప్పలేదు. సీతాదేవిని రామచంద్రుడి దగ్గరకు పంపించు".

విభీషణుడి మాటలు రావణుడికి కోపం తెప్పించాయి. ఆ మాటలు విన్న రావణాసురుడు సభ చాలించి, అందరినీ పంపించి, తన ఇంటికి పోయాడు. అతడి వెంటే, రావణుడి ఇంటికి పోయిన విభీషణుడు తన మాటలుగా ఇలా చెప్పాడు. "అన్నా! ఏనాడైతే సీత ఈ వూరికి దాపురించినదో ఆ దినం మొదలు లెక్కలేని అపశకునాలు లంకాపురంలో కనపడుతున్నాయి. ఈ అపశకునాలకు కారణం సీత ఇక్కడ వుండడమే. సీతను శ్రీరాముడికి అర్పించు. అన్నా! సీతాదేవిని ఇవ్వడం న్యాయమా? అన్యాయమా? ఇస్తే కలిగే ఫలం ఏమిటి? ఇవ్వకపోతే కలిగే నష్టం ఏమిటి? రాబోయేది అంతా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చేయి. ఆలోచించకుండా తొందరపడి ఏదీ చేయొద్దు". అని చెప్పాడు. తన తమ్ముడు చెప్పిన వాక్యాలు చెవిలో పడగానే రావణుడు కోపగించి విభీషణుడిని విడిచి లోపలికి పోయాడు. అందరి ఎదుట అతడిని ఏమీ అనలేక తానే వెళ్లిపోయాడు.

హితులైన వారు తనను అనాదరం చేసిన కారణాన, తానుగా చేసిన సీతాహరణం పాప కార్యమైనందున, సీతమీద కల కామాతిశయం వల్ల బుద్ధి నాశనం కావడాన, రావణాసురుడు తేజోహీనుడై శుష్కించసాగాడు. ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తున్నది. ఇది అందరితో కలిసి చేయాల్సిన పని. ఇప్పుడేం చేయాలి? అని మంత్రులతో, హితులతో ఆలోచించడానికి, తాను చేసినది అందరికీ సమ్మతమే అని నిరూపించడానికి రావణుడు సభకు పోయి తన వారందరినీ పిలిపించాడు. వారంతా, వున్నట్లుండి తమను పిలిపించడం వల్ల ఏమి అపాయం వచ్చిందో అని రావణుడి క్షేమం విచారించడానికి వచ్చారు. విభీషణుడు, శుకుడు, ప్రహస్తుడు కూడా వచ్చారు. ఆ రాక్షసులలో ఒక్కడైనా గట్టిగా మాట్లాడినవాడు లేడు. అక్రమంగా వాదించేవాడు లేడు.

అప్పుడు రావణుడు సేనానాయకుడైన ప్రహస్తుడితో "సేనాపతీ! నువ్వు త్వరగా పోయి, నాలుగు రకాలైన యోధులను, వీరులైనవారిని, ఇదివరకంటే ఎక్కువగా కాపలా పెట్టు" అని చెప్పగా అతడు రాజాజ్ఞ ప్రకారం పట్టణం లోపల, వెలుపల, అన్ని ప్రదేశాలలో పట్టణం రక్షించడానికి వేర్వేరు రాక్షసులను వేర్వేరు స్థలాలలో వుండడానికి నియమించాడు. "రాక్షసేశ్వరా! అన్ని సేనలను అన్ని స్థలాలలో నిలిపాను. భయం లేదు. సందేహం లేకుండా మీ పని మీరు చేయవచ్చు" అని ప్రహస్తుడు చెప్పాడు. రావణుడప్పుడు తాను చేయదల్చుకున్న కార్యం గురించి చెప్పసాగాడిలా.

"రాక్షసులారా! ధర్మం, అర్థం, కామం....వీటిలో ఏది చేయతగింది అని ఆలోచిస్తే ఏది చేసిన కీడు, మేలు, సౌఖ్యం, దుఃఖం, ప్రియం, అప్రియం కలుగునో అని విచారించి మంచి-చెడు నిశ్చయించండి. మీ ఆలోచన ప్రకారమే పోవాలని అడుగుతున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేదంతా ముందే చెప్పాలని నా మనసులో వుండేది. కాని కుంభకర్ణుడు నిద్రపోతున్నందువల్ల చెప్పలేదు. ఆరు నెలలు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నాడు కదా! కాబట్టి ఇప్పుడు చెప్పుదామనుకున్నాను”.

రావణుడు రాక్షసులతో ఇలా చెప్పసాగాడు. "రాముడి భార్య సీతను, దండకారణ్యంలో వుండగా తెచ్చాను. ఎందుకు తెచ్చానంటారా....ముల్లోకాలలో వెతికినా అలాంటి అందగత్తె ఇంకొకరు లేరు. ఆమెను నా భార్యగా చేసుకోవాలని భావించి తెచ్చానుకాని ఆమె ఇంతవరకు నా పానుపు ఎక్కడానికి అంగీకరించలేదు. సీత నాకు లభించకపోతే నేను మదనతాపంతో చావడం తధ్యం. కాబట్టి నేను బతికుండాలని అనుకుంటే నాకు తగిన ఉపాయం చెప్పండి. ఆ రాజకుమారులు సీతాదేవి ఇక్కడ వున్న విషయం తెలుసుకుని సుగ్రీవుడి సారధ్యంలో వానరసేనతో సముద్ర తీరానికి వచ్చి వున్నారు. మీరు నాకు చెప్పాల్సిన ఆలోచన ఏంటంటే, సీతాదేవిని తిరిగి ఇవ్వడానికి వీల్లేదు...రాముడిని చంపాలి...దానికి తగ్గ ఉపాయం కావాలి”.

రావణుడి ఏడుపు విని కోపంతో కుంభకర్ణుడు వాడితో ఇలా అన్నాడు. "రామలక్ష్మణులు ఇద్దరూ రక్షిస్తున్న సీతాదేవిని నువ్వు ఎవరిని అడిగి ఎత్తుకొచ్చావు? ఆలోచించిన తరువాతే ఏ పనైనా చేయాలికదా? పనైన తరువాత ఆలోచన చేస్తారా ఎవరైనా? కార్యం నువ్వు చేయకముందు మా ఆలోచన అడిగితే నీకీ మనక్షోభ లేకుండా ఉపాయం చెప్పేవాళ్లం. అలా చేసి వున్నట్లయితే మంచి జరిగేది. కార్యం చేసి, ఇప్పుడు ప్రాణం మీదకు వచ్చిన తరువాత విచారపడితే లాభం ఏమిటి? నువ్వు దోషయుక్తమైన పనిని, అపాయంతో కూడిన పనిని, చేశావు. నిన్ను రాముడు అక్కడే చంపకుండా విడవడం అంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడివే! నీతోడబుట్టిన కారణాన నాకు ఇప్పుడు నీతో నిల్వక తప్పుతుందా? తప్పదు. రాముడి నెత్తురు నేను పూర్ణంగా తాగుతాను. ఆ తరువాత నువ్వు సుఖపడు. రామలక్ష్మణులను చంపి వానరులందరినీ భక్షించి, తేల్పులు తీస్తూ, నీకు విజయం, సౌఖ్యం కలిగిస్తాను".

రావణుడు చేసిన పని మంచిదికాదని కుంభకర్ణుడు చెప్పడం వల్ల అతడికి కోపం వచ్చిందని గ్రహించిన మహాపార్శ్వుడనే వాడు రావణుడితో “నీకోరికను యుద్ధం ద్వారానే తీర్చుకో. పగవారు ఇక్కడికి వస్తే మేమే వాళ్లందరినీ చంపుతాం. సందేహం లేదు. నీ అంతట నువ్వు నీ కోరిక ప్రకారమే నడుచుకో” అన్నాడు. రావణుడు చెప్పిన మాటలను, కుంభకర్ణుడి వదరు మాటలను, వినీ-వినీ, హితంగా, స్వప్రయోజనంగా విభీషణుడిలా అన్నాడు.

         “వానరులు రాకముందే సీతను రాముడికివ్వు. వానరులకంటే ముందే వాయువేగంతో, పిడుగుల గుంపుతో సమానమైన రామబాణాలు వచ్చి, రాక్షసుల తలలు నేలపడవేస్తాయి. అవి రాకముందే సీతను రాముడికివ్వు. అప్పుడు నీవల్ల రాక్షసులకు చేటు తప్పుతుంది” అంటాడు. విభీషణుడు పిరికివాడని ఇంద్రజిత్తు నిందించాడు. ఇంద్రజిత్తు పిల్లవాడని, అతడి బుద్ధి ఇంకా పరిపక్వం కాలేదని, మంత్రాలోచనలో యథార్థం తెలుసుకునే శక్తి లేదని తేల్చేశాడు విభీషణుడు. హితం ఉపదేశించే విభీషణుడి ముఖం చూసి (మృత్యుప్రేరితుడైన) రావణుడు కఠినమైన మాటలతో నిందించాడు మరోమారు. తమ్ముడివని చంపకుండా వదులుతున్నాననీ, “పాపాత్ముడా! కులద్రోహీ! ఛీ...పో. నా ఎదురుగా నువ్వు వుండవద్దు” అనీ అన్నాడు రావణుడు.

         ఇలా కఠినంగా మాట్లాడిన అన్నమీద కోపంతో, ఇక ఈ పాపాత్ముడి నేలమీద అడుగు పెట్టకూడదని, రావణుడి పంచప్రాణాలు పోతున్నాయా అన్నట్లు ఆకాశానికి ఎగిరి విభీషణుడు ఆయనకు హితం బోధించాడు మళ్లీ.  సీతను దొంగిలించి తెచ్చి అధర్మ కార్యం చేశావని చెప్పాడు. “నన్ను వెళ్లిపోమ్మన్నావు. అలాగే పోతాను. నన్ను విడిచి రాక్షసులను, లంకను, నిన్ను చక్కగా నిర్విచారంగా కాపాడుకో. నీకు మేలు కలుగుగాక!” అని వెళ్ళిపోయాడు. రావణాసురుడు చేసిన తెలివితక్కువ పని విభీషణుడుని విడవడమే. రావణుడు విభీషణుడి రాజనీతి విన్నట్లయితే శత్రుపక్షంలో చేరి వుండేవాడు కాదు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)