Showing posts with label జీ.వీ.కె. రెడ్డి. Show all posts
Showing posts with label జీ.వీ.కె. రెడ్డి. Show all posts

Saturday, June 19, 2010

IX-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-9) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-9
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న మీడియా అభివర్ణించిన "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ కు ఫోన్ చేసి, మరి కాసేపట్లో తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?). సుమారు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి, బాలాజి-వారణాసి-రంగారావు లాంటి వారి తోడ్పాటుతో లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ సంస్థగా నెలకొల్పి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టి, (దివంగత) ముఖ్యమంత్రి సమక్షంలో దానికి అనుగుణమైన అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయించి, అపారమైన అనుభవజ్ఞుడు వెంకట్ ను సీ.ఇ.ఓ గా నియమించి, లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు 15, 2005 న ప్రారంభించడానికి రామ లింగరాజు చేసిన కృషిని ఏనాడో-ఒకనాడు ఆయన మాటల్లోనే తెలుసుకోవాలి గాని, ఇతరులకు వర్ణించడం సాధ్య పడదు.

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు. కాకపోతే, ఊహాజనిత సమాధానాలు అన్వేషించి 108-అత్యవసర సహాయ సేవల "ఒడిదుడుకులకు" వాస్తవ కారణాలను అంచనా వేయొచ్చు. ఆ ప్రయత్నమే ఇది.

ఈ నేపధ్యంలో రాజు గారి ఆందోళనను అర్థం చేసుకోవాలి. సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన "భవిష్యత్ దర్శనం-విజన్" కు అనుగుణంగా సేవలు వ్యాపించడంతో ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. నాకు గుర్తున్నంతవరకు అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. గుజరాత్ రాష్ట్రాన్ని పొందడానికి మేం ఆ ప్రభుత్వం వెంట పడితే, ఇతర రాష్ట్రాలు మా ద్వారా అత్యవసర సహాయ సేవలు పొందడానికి మా వెంట పడసాగాయి ఆ తర్వాత. తిరిగి కొంతకాలానికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది అనేక కారణాలవల్ల. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. క్రమేపీ నెలకొంటున్న సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఇప్పుడా రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. జవాబు దొరికేలోపుల రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి తన జీ. వి. కె సంస్థ నుంచి (మీడియాలో సీ.ఇ.ఓ వెంకట్ చెప్పిన లెక్కల ప్రకారం) రు. 50 కోట్లకు పైగా సమకూర్చినట్లు తెలుస్తోంది.

ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి కారకులైన వారు, కనీసం ఒక్క విషయంలో నన్నా తక్షణ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని-అంతగా అత్యవసరం లేని-ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. అలా చేసిన ఖర్చు "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ ఎదుర్కుంటున్న "ఆర్థిక పరమైన ఒడిదుడుకులను" విశ్లేషించడానికి కేవలం దానికున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది. "ఆలస్యం అమృతం విషం" అన్నారు పెద్దలు.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. తెలిసో-తెలియకో, సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతికి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ఎవరిదో వారు వివరించాల్సిందే.

కష్టాలన్నీ ఒక్క సారే వస్తాయన్నది ఇ.ఎం.ఆర్.ఐ విషయంలోనూ జరిగింది. రాజు గారి నిష్క్రమణం కన్నా ముందే "అంబులెన్స్ యాక్సెస్ ఫౌండేషన్", "ట్రాన్స్ పరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్" అనే రెండు సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల పూర్వ రంగంలో అవకతవకలు జరిగాయని-ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా గుర్తించే విషయంలో పోటీ పద్ధతిని పాటించలేదని ఆరోపిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాయి. అవి తమ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను, కౌంటర్ అఫిడవిట్లలో వివిధ రాష్ట్రాలు వాటికిచ్చిన సమాధానాలను, సుప్రీం కోర్ట్ నోటీసుకు సంబంధించిన అంశాలను మరో సందర్భంలో వివరంగా తెలుసుకుందాం. ఇ.ఎం.ఆర్.ఐ ని ఉపయోగించుకుని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారన్న ఆరోపణతో ఒక "చోరీ కేసును" కూడా రామ లింగరాజు పై పెట్టడం జరిగింది అదే రోజుల్లో. ఈ ఆరోపణలను ఖండిస్తూ కూడా సమాధానం ఇచ్చింది సంస్థ. అదే రోజుల్లో న్యూ ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న "నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి)", ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పక్షాన, ఏప్రిల్ 2009 లో నిర్వహించిన అధ్యయనంలో, అధిక శాతం ఇ.ఎం.ఆర్.ఐ సేవలను కొనియాడుతూనే సంస్థా పరమైన లోటుపాటులను కూడా ఎత్తి చూపింది. ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి చెప్పిన మంచిని మరిచిపోయిన మీడియా ఎత్తి చూపిన లోటుపాటులను మాత్రం భూతద్దంలో ప్రదర్శించి మరీ కథనాలు ప్రచురించింది. అధ్యయన కమిటీ చెప్పిన విషయాలను వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం.

వీటి వల్ల లాభం-నష్టం ఎంతవరకు జరిగిందో-జరగబోతుందో ఏమో కాని, మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ వార్తలొచ్చాయి. ఫలితంగా సీ.ఇ.ఓ వెంకట్ జనవరి 18, 2009 న పాత్రికేయులను ఆహ్వానించి సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన వివరణతో సమస్య చాలావరకు తాత్కాలికంగా సమసి పోయినా అనుమానాలు పూర్తిగా వీడలేదు. కష్టాలన్నీ ఒక్క సారే వచ్చినా వెంకట్ గారు ధైర్యాన్ని-స్థైర్యాన్ని కోల్పోలేదు. జనవరి 8, 2009 నుంచి, మే 26, 2009 వరకు ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకున్న పటిష్టమైన కార్యాచరణ పథకం ప్రకారమే ఆయన ముందుకు సాగారు. తనతో పనిచేస్తున్న సీనియర్ ఇ.ఎం.ఆర్.ఐ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులుండడంతో, భవిష్యత్ పై వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు నిరంతరం పాటుపడేవారాయన. అందులో భాగంగా మార్చ్ నెల 25, 2009 న, ప్రొఫెసర్ రంజన్ దాస్ తో చక్కటి శిక్షణా సంబంధమైన ఉపన్యాసాన్ని సీనియర్లకు ఇప్పించారు వెంకట్. ఆయనా పాల్గొన్నారందులో. భవిష్యత్ లో ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేస్తున్న ప్రతి "లీడర్" ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి, ఎలా సంస్థకు నిధుల సమీకరణలో తోడ్పడాలి, ఒక లక్ష్యంతో-ధ్యేయంతో ముందుకెలా సాగాలి అన్న సందేశం ఆ శిక్షణా కార్యక్రమానికి హాజరైన మా అందరిలో బలీయంగా నాటుకు పోయింది. "వ్యూహం అంటే ఏమిటి-వ్యూహ రచన ఎలా వుండాలి-పోటీని ఎలా ఎదుర్కోవాలి" లాంటి అంశాలపై రంజన్ దాస్ విశ్లేషణను మరో సందర్బంలో తెలుసుకుందాం.

వెంకట్ ఎదుర్కొన్న కష్టాల్లో అతి కీలకమైంది, "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". అదంత తేలికయిన విషయం కాదు. ఒక వైపు మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, ఇంకో వైపు సుప్రీం కోర్టులో కేసు, మరో వైపు మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, ఒక్కోసారి కింది స్థాయి ఉద్యోగులకు కూడా విశ్వ ప్రయత్నం చేసినా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో భాగంగా కనీసం పదికి పైగా సంస్థలను తడిమి చూశారు వెంకట్. అందులో చాలామంది, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో సరైన పారదర్శకత లేదని, కార్పొరేట్ గవర్నెన్సుకు ప్రాధాన్యత లేదని... ఇలా అసందిగ్ధమైన ఆరోపణలు చేసి తప్పుకున్నారు. మరికొందరిని "ఇంటి వాసాలు లెక్క పెట్టే తరహా మనుషులు" పనిగట్టుకుని మరీ తప్పు దోవ పట్టించారు. వెంకట్ గారు తలుపు తట్టిన సంస్థల్లో బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్, వారెన్ బఫర్ ఫౌండేషన్ లాంటివి కూడా వున్నాయి. బహుశా ఆయన "ఎక్కని-దిగని గడప లేదే మో !". పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

ఇక్కడొక విషయం చెప్పాలి. జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడి వుండవచ్చు గాని తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. నాకు అర్థమయినంతవరకు-అర్థం చేసుకున్నంతవరకు, రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు వెంకట్ గారు. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డి గారిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా వెంకట్ కు చేరి వుండాలి. జనవరి 21, 2009 న తాజ్ కృష్ణా హోటల్ లో వెంకట్ గారితో నేను కూడా వెళ్ళి డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశాం. పరిస్థితి వివరించి సంస్థను గట్టెక్కించమని కోరాం. నేను డాక్టర్. మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పౌర సంబంధాల అధికారిగా పనిచేశానని, ఆ సమయంలో చాలా సందర్భాల్లో డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశానని ఆయనకు గుర్తుచేశాను. ఆయన జ్ఞాపక శక్తికి నిజంగా జోహార్లు. అప్పటి సంగతులు ఆయన చాలా గుర్తుకు చేసుకోవడమే కాకుండా, చెన్నారెడ్డి గారిని బాగా పొగిడారు. జీ.వీ.కె మా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారుగాని, ఆయన హైదరాబాద్ లో లేనందున కుదర లేదు. ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారిని ఉదయమే వెళ్లి కలిశాం. పిరమల్, ఆయన కుమారుడు, వెంకట్, నేను కలిసి వెళ్లాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య గారు. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, సరిగ్గా మే 23, 2009 న వెంకట్ కు ఫోన్ చేసి, "పారదర్శకత-కార్పొరేట్ గవర్నెన్సుకు సంబంధించిన అస్పష్ట అంశాలను" పేర్కొని, ఆ నెపం మీద తమ నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి గారు ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు.

పిరమల్ అధినేత, ఆయన కుమారుడు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య గారిని కలిసినప్పుడు, (బహుశా) ఫోన్లో డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో (ఆయన జరిపిన చివరి సమీక్షా సమావేశంలో) మాట్లాడినప్పుడు లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి. ఈ కీలకమైన అంశం గురించి వివరంగా ముందు-ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.