కర్తవ్యబోధ చేసిన భగవానుని గీత
(18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామ విశేషాలు-2)
వనం జ్వాలా నరసింహారావు
(భక్తి పత్రిక, జులై నెల 2026)
(కురుక్షేత్రంలో తొలిరోజు
కురుపాండవ సేనలు ఒకరి ఎదురుగా మరొకరు మొహరించారు. యుద్ధ ప్రారంభ సూచనగా శంఖనాదాలు
చేశారు. ధర్మరాజు పెద్దలందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్జునుడిని విషాదయోగం
ఆవరించింది. దానినుంచి తేరుకోవడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మధ్యంలో
శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేశాడు. దానిని విన్న అర్జునుడు యుద్ధానికి
సన్నద్ధుడయ్యాడు. ఇంకా తొలిరోజు యుద్ధంలో అనేక విశేషాలున్నాయి) - సంపాదకుడు, భక్తి పత్రిక
పాండవ సర్వసేనాధిపతైన ధృష్టద్యుమ్నుడు, దేదీప్యమానంగా వెలుగొందుతూ, ముందుండి పాండవ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. భీష్ముడు నరవ్యూహం పన్నాడు. పాండవుల, శ్రీకృష్ణుడి సూచన మేరకు, నరవ్యూహం కంటే అపురూపమైన ‘అచల’ వ్యూహాన్ని ధృష్టద్యుమ్నుడు పన్నాడు. ఆ వ్యూహంలో యుద్ధం చేయడానికి అభిమన్యుడు, పాండవ కుమారులు, నకుల సహదేవులు, భీమసేనుడు, విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. వ్యూహం మధ్య భాగంలో ధర్మరాజు రథం మీద కూచున్నాడు. ముందు భాగంలో
అర్జునుడి రక్షణలో శిఖండి భీష్ముడికి ఎదురుబొదురుగా నిలిచాడు. వెనుక భాగంలో మగధ దేశానికి చెందిన సహదేవుడు, ధృష్టకేతుడు నిలిచారు.
ఇరుపక్షాల సేనలు పరస్పరం ఎదుర్కుంటూ భయంకరంగా ప్రకాశించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యం
అనే శంఖాన్నీ, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్నీ పూరించారు. ఇంతలో, ధర్మరాజు
ఉన్నట్లుండి తన కవచాన్ని తీసేసి, ఆయుధాలతో పాటు
రథం మీద పెట్టి, రథం దిగి, మౌనవ్రతం పూని, భీష్ముడున్న చోటుకు వెళ్లడం చూశారు అతడి తమ్ములు, శ్రీకృష్ణుడు, సాత్యకి మొదలైనవారు. కారణం తెలుసుకోవడానికి వారంతా ఆయన్ను అనుసరించారు. వారి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా
నిరాయుధుడై, భీష్ముడిని సమీపించిన ధర్మరాజు పితామహుడైన భీష్ముడి దగ్గరికి పోయి అతడి
పాదాలకు నమస్కారం చేశాడు.
ధర్మజునికి ఆశీస్సులు
యుద్ధం చేయడానికి భీష్ముడి అనుమతి, ఆశీర్వాదం కావాలని కోరాడు ధర్మరాజు. అలాగే అని, ఆయన శత్రువులను జయిస్తాడని, ఆయనేదైనా వరం కోరుకుంటే ఇస్తానని అన్నాడు భీష్ముడు
ధర్మరాజుతో. భీష్ముడిని యుద్ధంలో గెలిచే ఉపాయం చెప్పమని
అడిగాడు ధర్మరాజు. ఆయుధం పక్కకు పెట్టితే తప్ప తనను జయించడం దేవతలకు కూడా సాధ్యం కాదన్నాడు
భీష్ముడు. ధర్మరాజు ఆ తరువాత, ద్రోణుడు, కృపుడు, శల్యుడు వున్న చోటుకు వెళ్లి వారి పాదాలకు నమస్కారం చేసి, తాను వారితో యుద్ధం చేయడానికి అనుమతి, ఆశీర్వాదం కావాలని కోరాడు.
ధర్మం ఎక్కడ వుంటుందో అక్కడ
శ్రీకృష్ణుడు వుంటాడని, శ్రీకృష్ణుడు ఎక్కడ వుంటే అక్కడ విజయం
సిద్ధిస్తుందని అన్నాడు ద్రోణాచార్యుడు. చేతిలో ఆయుధం ఉన్నంతవరకు తనను ఎవరూ చంపలేరన్నాడు. తనకు
కీడుమాట వినిపిస్తేనే శస్త్ర సన్యాసం
చేస్తానన్నాడు. యుద్ధంలో ధర్మరాజు గెలవాలని కృపాచార్యుడు, శల్యుడు దీవించారు. వారందరి దగ్గర సెలవు తీసుకుని ధర్మరాజు మరలి తన
స్థానానికి వెళ్లాడు. ధర్మరాజు అలా అందరి పెద్దల అనుమతి, ఆశీర్వాదం తీసుకుని మరలి వస్తున్న సమయంలోనే, తానున్నంతవరకు యుద్ధానికి రాకుండా భీష్ముడు నిషేధించిన కర్ణుడు, యుద్ధరంగానికి రావడం చూసిన శ్రీకృష్ణుడు అతడి దగ్గరికి వెళ్లి మర్యాదగా పలకరించాడు.
భీష్ముడిమీద కోపంతో కర్ణుడు
యుద్ధంలో పాల్గొనడం లేదని తెలిసిందని, కాబట్టి భీష్ముడు మరణించే వరకు అతడు పాండవ పక్షంలో చేరి
యుద్ధం చేయమని, అలా చేసి భీష్ముడి మీద పగతీర్చుకోమని సరదాగా మాట్లాడాడు. ఇది ఒక విధంగా
శ్రీకృష్ణుడి రాజనీతి చతురతకు చక్కటి ఉదాహరణ. కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు అవసరమని అంటారు. జవాబుగా కర్ణుడు తాను దుర్యోధనుడికి ఏనాడో తన ప్రాణం సమర్పించానని, వేరే పక్షంలో చేయడం న్యాయం కాదని స్పష్టం చేశాడు.
స్వామిభక్తికి ఇది చక్కటి ఉదాహరణ.
ధర్మరాజు మళ్లీ కవచం ధరించి
యుద్ధానికి సన్నద్ధుడయ్యే ముందు ఒక పిలుపిచ్చాడు కౌరవ పక్షంలో వున్నవారికి. అటు నుండి
ఎవరైనా వచ్చి పాండవ పక్షంలో చేరితే వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తానని అనగానే
ధృతరాష్ట్రుడి కొడుకు యుయుత్సుడు
వచ్చి చేరాడు. కౌరవ సేనాపతైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం వూదాడు. మిగిలిన రాజులు కూడా
అలా చేయగానే ఆకాశం యుద్ధవాద్యాల ధ్వనితో నిండిపోయింది. అప్పుడు
శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు
దేవదత్తాన్ని, ధర్మరాజు అనంతవిజయాన్ని పూరించారు. భీమ, నకుల సహదేవ, ద్రుపద, విరాట, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైనవారు తమ శంఖాలను పూరించారు.
యుద్ధభూమిలో గీతోపదేశం
సరిగ్గా ఆ సమయంలో, యుద్ధం ఇక ఆరంభించాల్సి వుండగా, అర్జునుడు గాండీవాన్ని ధరించి, అల్లెతాటిని మోగించి, బాణాలు చేత్తో తీసుకుని, శ్రీకృష్ణుడితో, తానిప్పుడు ఎవరితో యుద్ధం చేయాలో నిర్ణయించుకోవాలని, కాబట్టి రథాన్ని యుద్ధం మధ్యలోకి తీసుకుపొమ్మని అన్నాడు.
అర్జునుడు కోరినట్లే రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాడు
శ్రీకృష్ణుడు. బంధు మిత్రులను చూసిన అర్జునుడు దుఃఖానికి లోనయ్యాడు. తన గాండీవం జారిపోతున్నదని, ఈ క్రౌర్యానికి
తాను ఒడిగట్టలేనని, ఇంతమంది చచ్చిపోయాక కలిగే సౌఖ్యాలు ఏపాటివని శ్రీకృష్ణుడితో అన్నాడు.
తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సహోదరులను, గురువులను, స్నేహితులను, స్వార్ధ బుద్ధితో సంహరించి పొందే రాజ్యసుఖాలు రక్తంతో తడిసినట్టివి. అవేం సంతోషం
కలిగిస్తాయి? ఎలాంటి కీర్తిని తెచ్చిపెట్ట గలవు? ఏ అభ్యున్నతిని
చేకూర్చగలవని అన్నాడు. యుద్ధమార్గం తాను అంగీకరించ లేనన్నాడు
అర్జునుడు. ఇంతటి పాపం చేయడానికి పూనుకోవడమా? రాజ్యం మీద ఆశతో బంధువులను చంపుకోవడమా? అని అర్జునుడు పలుకుతూ రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకుని కూలబడి కూచున్నాడు. దీన్నే
అర్జున విషాదయోగం అని అంటారు. దీని
పర్యవసానమే భగవద్గీత ఉపదేశం. అప్పుడు ఆర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడం ఆరంభించాడు.
అర్జునుడికి ఇలాంటి ఆలోచన తగదని, మనస్సులోని తక్కువ భావాన్ని విడిచిపెట్టి గొప్పవాడివి కమ్మని, యుద్ధానికి లెమ్మని హెచ్చరించాడు. అర్జునుడు అలాగే విషాద తన్మయత్వంతో రథం మీద
కూలబడి కూచుని శ్రీకృష్ణుడికి జవాబిచ్చాడు. తాను భీష్మ, ద్రోణులలాంటి బంధుమిత్రులను చంపడం పరాక్రమం కాదని, కాబట్టి యుద్ధం చెయ్యలేనని అన్నాడు. తాను ధర్మం తెలియని మూఢుడినని, తనకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యం తెలియచేయాలని అర్జునుడు
శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. ఏ మాత్రం దుఃఖించదగని వారికోసం అర్జునుడు దుఃఖిస్తున్నాడని, వున్నవారికి, విధివశం వల్ల తప్పనిసరిగా చనిపోయినవారికి దుఃఖించాల్సిన
అవసరం లేదని, మనసు ఉజ్వలమైన వివేకంతో కూడినదైతే దుఃఖాలన్నీ
నశిస్తాయని శ్రీకృష్ణుడు అన్నాడు.
‘మానవదేహం బాల్యం, యౌవనం, వార్థక్యం అనే
అవస్థలు పొందినట్లుగా, చినిగిపోయిన పాతబట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్లు, ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతుంది. ఆత్మ దేహాంతరగమనం వల్ల నశించదు. నశించేది శరీరం మాత్రమే. ఆత్మకు పుట్టుక, చావు అనేవి లేవు. ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకు హానిచేయలేవు. ఆత్మ (పురుషుడు) బాధించేవాడు
కాదు. బాధను పొందేవాడూ కాదు. ఆత్మకు అభావం లేదు. ఆత్మ
శాశ్వతం. శరీరం నశించేది. దానికి అస్తిత్వం లేదు. ఈ కారణం వల్ల ఎవరూ శోకించాల్సిన అవసరం
లేదు. చావుపుట్టుకలు సహజ పరిణామం అని
సరిపెట్టుకోవాలి.’ ఆత్ముడు నశిస్తాడు అని అనేవాడు, ఆత్ముడు నశింపచేస్తాడు అని అనేవాడు, ఇద్దరూ అవివేకులే! అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం చేశాడు.
‘ఆత్మ నశించదు. ఎవరినీ నాశనం చేయదు. పురుషుడు, ఆత్మ అంటే నేనే! వేరొకడు కాదు. పురుషోత్తమత్త్వం అభివ్యక్తం
కావడానికి ఆత్మత్వస్ఫూర్తి వుంటుంది. అదే సర్వక్రియలకూ
పూనుకుంటుంది’ ఆత్మకు బాధింపబడడం లేదని, బాధించడమూ లేదని వివరించాడు. అర్జునుడి అహంకార, మమకారాలను తొలగించాడు. అర్జునుడు యుద్ధానికి చేయాల్సిన
స్వకర్మావలంబనం వదలరాదని తెలియచేసే మాటలను చెప్పాడు.
క్షత్రియులకు ముఖ్య కర్తవ్యం యుద్ధమని, దానివల్ల స్వర్గం లభిస్తుందని, లేచి యుద్ధం చెయ్యమని బోధించాడు. ఇంక ఇలా అంటాడు: ఫలితాల పట్ల మమకారం విడిచి కర్తవ్యాలను నిర్వహించాలి. ఫలితాలు, జయాపజయాలు భగవదర్పితం చేయాలి. తత్త్వజ్ఞానం లభిస్తే ఇక కర్మ
నాశనం తానంతట అదే కలుగుతుంది. ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడు
అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు.
విశ్వరూప సందర్శనయోగం
శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి, అతడి అనుమానాలన్నిటినీ పోగొట్టాడు. అర్జునుడు లేచి నిలుచుని, శ్రీకృష్ణుడితో, ఆయన అందించిన సందేశం, చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనదని, తనమీద ఎంతో దయ వున్నది కాబట్టే ఇలాంటి ఆత్మజ్ఞానం తనకు కలిగించాడని, ఆయన చెప్పిన ఆధ్యాత్మికతత్త్వం వినడం వల్ల తన భ్రమ తొలగిందని, యోగీశ్వరులు చూడడానికి తహతహలాడే ఆయన రూపం తనకు
దర్శింపచేయమని ప్రార్థించాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి ప్రసాదించి తన
విశ్వరూపాన్ని ప్రదర్శించగా, అర్జునుడు దానిని సందర్శించాడు.
ఆ విశ్వరూపం వర్ణనాతీతం.
సర్వ ప్రపంచంతో కూడిన, సమస్త సృష్టికి మూలకారణమైన, భూమ్యాకాశ దిక్కులన్నీ కలిగిన, దేదీప్యమానంగా వెలుగొందిన, ఆ విశ్వరూపాన్ని కాంచిన అర్జునుడు శ్రీకృష్ణుడిని పరిపరివిధాల స్తుతించాడు.
తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, అసలాయన ఎవరో చెప్పమని వేడుకున్నాడు. జవాబుగా, తాను
లోకాలన్నిటినీ నాశనం చేసే యముడిని సుమా! అన్నాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామ రంగంలో జనసందోహాన్ని సంహరించడానికి
ఉద్యుక్తుడనయ్యానని, అర్జునుడు తాను చంపుతున్నట్లు భ్రమలో పడనక్కర
లేదని, భీష్మద్రోణులంతా అవశ్యం చావాల్సినవారేనని, తాను చంపే వీరందరినీ అర్జునుడే చంపినట్లుగా భావించి విజయం కైకొని రాజ్యం ఏలుకొమ్మని
అన్నాడు.
అర్జునుడు నిమిత్తమాత్రుడే
అని, లేచి యుద్ధం చెయ్యమని ఆదేశించాడు. ఆ మాటలు విన్న అర్జునుడు వణకుతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి
నమస్కారం చేశాడు. తాను ఎక్కువసేపు ఆయన
విశ్వరూపం చూడలేనని, శాంత స్వరూపం ధరించమని వేడుకున్నాడు. సామాన్యులు దర్శించలేని తన విశ్వరూపాన్ని అర్జునుడికి
మాత్రమే చూపానని అంటూ వెనుకటి
ఆకారాన్ని ధరించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి రహస్యమైన జ్ఞానాన్ని అందించానని, అతడా సందేశాన్ని అవగాహన చేసుకుని, తనకు నచ్చిన రీతిలో ప్రవర్తించమని చెప్పాడు శ్రీకృష్ణుడు
అర్జునుడికి.
ఇప్పుడు చెప్పినదానికంటే
గొప్ప రహస్యం చెప్తానని అంటూ, ధర్మాలు ఎన్నో
వున్నప్పటికీ, వాటికి ఎన్నో ప్రత్యామ్నాయాలు వున్నప్పటికీ, వాటన్నిటి కంటే రక్షించేవాడు తానే అని నమ్మి తన శరణు
పొందమని, అలా చేస్తే పాపాలన్నీ పోగొట్టి సంతోషం
చేకూరుస్తానని చెప్పాడు. శ్రీకృష్ణుడి
మీద తనకు పరిపూర్ణ భక్తి విశ్వాసం కలిగాయని, అన్ని అనుమానాలు తొలగిపోయాయని, ఆయన విశ్వరూప సందర్శనం వల్ల తన జ్ఞానం దృఢ౦గా పాదుకున్నదని, ఇక ఆయన చెప్పినట్లుగా నడచుకుంటానని అన్నాడు అర్జునుడు. ఇలా
అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగనమస్కారం చేసి, గాండీవం ధరించి నిలిచాడు. భీష్ముడి మొదటి రోజు యుద్ధం ప్రారంభం అయింది.
తొలిరోజు యుద్ధం
అర్జున
విషాదయోగం, శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం, ఫలితంగా జ్ఞానోదయం అనంతరం, కౌరవ సేనాధిపతిగా భీష్ముడు
కదనరంగంలో ముందున్నాడు. పాండవులు భీముడిని ముందుంచుకుని భీష్ముడు నడుస్తున్న చోటుకు దగ్గరిగా
తమ సైన్యాలను తరలించారు. భీముడు విజృంభించడంతో దుశ్శాసనుడితో
సహా దుర్యోధనుడి ఎనిమిదిమంది తమ్ములు ఆయన్ని ఎదిరించారు. నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు విజృంభించారు. ఆవిధంగా యుద్ధం ప్రారంభం
కాగానే పాండవుల పక్షాన భీముడు, కౌరవుల పక్షాన దుశ్శాసనుడు ముందుగా దూసుకు వచ్చారు. పాండవ, కౌరవ సేనలు భీకరంగా పోరాడాయి.
అదే సమయంలో అర్జునుడికి, భీష్ముడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. సాత్యకి, కృతవర్మతో తలపడ్డాడు. అభిమన్యుడు, బృహద్బలుడిని ఎదుర్కున్నాడు. భీమసేనుడి మీద భీష్ముడు కోపించాడు.
విలువిద్యలో ఆరితేరిన ధనుష్కుడైన
భీష్ముడిని, భీముడు గదతో కాకుండా ధనుస్సు పూని సమ యుద్ధం
చేయడం ఒక విశేషం. సహదేవుడికి, దుర్ముఖుడికి మధ్య యుద్ధం జరిగింది. ధర్మరాజు, సాక్షాత్తూ
నకులసహదేవుల మేనమామైన శల్యుడిని ఎదుర్కున్నాడు. పాండవ సేనాపతైన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని
తాకాడు. మగధ దేశాధిపతైన సహదేవుడు, భూరిశ్రవుడితో యుద్ధం చేశాడు. ధృష్టకేతుడు కురువృద్ధుడైన బాహ్లికుడిని తలపడ్డాడు. అలంబసుడికి, ఘతోత్కచుడికి భీకరమైన రాక్షస పోరు జరిగింది. శిఖండి అశ్వత్థామను ఎదిరించాడు. భగదత్తుడు, విరాటుడి మీద విజృంభించాడు. కేకయరాజైన బృహత్ క్షత్రవిభుడు, కృపుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. జయద్రథుడికి, ద్రుపదుడికి తీవ్రంగా పోరు జరిగింది. వికర్ణుడు, యుధామన్యుడు
తలపడ్డారు.
శకునిని, ధర్మరాజు తనయుడు ప్రతివింధ్యుడు ఎదుర్కోగా, కాంభోజరాజు భీముడి కొడుకైన శ్రుతసోముడితో తలపడ్డాడు.
ఉలూచి-అర్జునుడి కొడుకు ఇరావంతుడు
ధృతరాష్ట్రుడి కొడుకైన శ్రుతాయువును ఎదుర్కొన్నాడు. విందుడు, అనువిందుడు
కుంతిభోజుడిని, అతడి కొడుకు పురజిత్తును ఎదుర్కొన్నారు. దీర్ఘబాహుడు ఉత్తరుడి మీదికి
విజృంభించాడు. నకులుడి కొడుకు
శతానీకుడు ఉలూకుడిని ఎదుర్కొన్నాడు. మరొకవైపు భీష్ముడు యుద్ధం చేస్తుంటే పాండవుల సేనలు తల్లడిల్లిపోయాయి. ఆ సమయంలో
అభిమన్యుడు కౌరవ సేనను ఎదుర్కొన్నాడు. శల్యుడిని, కృతవర్మను, వివింశతిని, కృపుడిని చీకాకు పరచి, భీష్ముడి మీదకు విజృంభించాడు. భీష్మాదులంతా కలిసి అభిమన్యుడిని
ఎదుర్కొన్నారు. అయినా అతడు చలించలేదు.
ఒకానొక సమయంలో అభిమన్యుడి
బాణాలకు భీష్ముడి జెండా విరిగి నేలమీద పడిపోయింది. ఆ కార్యాన్ని సాధించి అభిమన్యుడు
వీరవిహారం చేసేటప్పుడు భీముడు అతడికి తోడుగా వచ్చి, భీష్ముడిని ఎదిరించాడు. శల్యుడిని సొమ్మసిల్ల చేశాడు.
అభిమన్యుడికి, భీముడికి బాసటగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయరాజులు, విరాటరాజు చేరారు. భీష్ముడి వీరోచిత పోరాటం కొనసాగింది. ఉత్తరుడు శల్యుడిని ఎదుర్కొని విరథుడిని చేయగా, శల్యుడు శక్తి ఆయుధంతో ఉత్తరుడిని చంపాడు. ఉత్తరుడి సోదరుడు శంఖుడు శల్యుడిని ఎదిరించాడు. భీష్ముడు శంఖుడిని అడ్డుకోగానే, అర్జునుడు రథాన్ని అటువైపు మళ్లించాడు. భీష్మార్జునులు ఒకరిమీద ఒకరు
విజృంభించారు. శల్యుడు, శంఖుడి గుర్రాలను నేలమీద పడగొట్టాడు.

యుద్ధం కొనసాగుతుండగా, భీష్ముడు విజృంభించగా, ఆ అద్భుత పరాక్రమానికి పాండవులు ఆశ్చర్యపోయారు. భీష్ముడి బలపరాక్రమాలకు దుర్యోధనాదులు సంతోషించారు. ఈ విధంగా కౌరవపాండవ సేనల్లోని
గొప్ప వీరులు ఒకరితో ఒకరు తలపడగా యుద్ధం భీకరంగా సాగింది. యుద్ధం ఆ విధంగా దాదాపు
మధ్యాహ్న సమయం వరకు సాగింది. ఆ
తరువాత భీష్ముడు భయంకరుడై విజృంభించి, పాండవ సేనను పలురకాలుగా చికాకు పరిచాడు. వారిని తాకి, వారు పన్నిన వ్యూహాలను చెదరిపోయేట్లు రణక్రీడ సలిపాడు. ఇంతలో
సూర్యుడు అస్తమించాడు. చీకట్లు వ్యాపించాయి. యుద్ద్ధం ఆపుచేసి ఇరుపక్షాల సేనలు ఆవాసాలకు వెళ్లిపోయారు.