Showing posts with label 108-104 వైద్య సేవలు. Show all posts
Showing posts with label 108-104 వైద్య సేవలు. Show all posts

Monday, December 28, 2009

పేదరోగులకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం (పిపిపి) ద్వారా 108,104 వైద్య సేవలు

(సూర్య దిన పత్రికలో ప్రచురించబడింది)

ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణలు ప్రధానమం త్రి మన్మోహన్‌సింగ్‌ ఆలోచన మేరకు రూపకల్పన జరిగిన ‘జాతీ య గ్రామీణ ఆరోగ్య మిషన్‌’ ఏర్పాటుతో ఆరంభమయ్యాయనవచ్చు. (ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ నిధులతో రూపుదిద్దుకున్న ‘గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల’ కార్యక్రమంతో మొదలై, ‘రాజీవ్‌ఆరోగ్యశ్రీ’ పథకం రూపకల్పనతో, మూడు ముఖ్య కార్య క్రమాలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసే దశకు చేరుకుంది.

జాతీయస్థాయి లో, రాష్టస్థ్రాయిలో సంస్కరణల ఆరంభం, అమలు విజయవంతంగా జరుగుతుందంటే ప్రధానకారణం ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్య ప్రక్రియే అనాలి. ప్రభుత్వపరంగా ఇటీవల కాలం వరకూ అందిస్తున్న వైద్య-ఆరోగ్యరంగ సేవలలోని లోటుపాట్లను అధిగమించేందుకు సంస్కరణలే శరణ్యమన్న నిర్ణయానికి ఆ రంగంలోని నిపుణులొచ్చారు. ఈ సంస్కరణలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం- తద్వారా సేవలనందించే ప్రయత్నం. ఈ దిశగా పంచవర్ష ప్రణాళికలలోనూ, జాతీయ ఆరోగ్య విధానాలలోనూ, ప్రపంచబాంక్‌ ఆదేశాల మేరకూ కొంత ప్రగతి కనిపించినా, అసలైన పురోగతి గత నాలుగేళ్ళనుంచే కనిపిస్తున్నది.

జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ కార్యక్రమం కింద పలురాష్ట్రాల్లో అమలు జరుగుతున్న పథకాల్లో 20 ‘మార్గదర్శక సేవల’ సమగ్ర సమీక్ష జరగాలని, ఆ తరహా సేవలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షే మమంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం 2005 నుంచి ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ‘గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు’ కూడా ఒకటి.

వివిధ రకాలైన ఆరోగ్య సేవలను, ప్రత్యేకించి ప్రసూతి సదుపాయాలను గ్రామీణ మారుమూల ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉపయోగించుకోలేక పోవడానికి ప్రధాన కారణం, ఆసుపత్రికి రవాణా సౌకర్యం లేకపోవడమేనని డాక్టర్‌వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నాలుగేళ్ళ క్రితం అభిప్రాయపడింది. ఫలితంగా ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యంలో, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమం కింద గ్రామీణ అత్యవసర ఆరోగ్యరవాణా సేవలను అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకుంది. అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు 2005 లో అంబులెన్సులను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. తొలుత పైలట్‌ ప్రణాళికగా, రాష్ట్రంలోని నాలుగు (మహబూబ్‌నగర్‌, కడప, కర్నూల్‌, నిజామాబాద్‌) జిల్లాల్లోనూ, సమీకృత గిరిజనాభివృద్ధి ఏజన్సీ ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు 122 అంబులెన్సులను సమకూర్చింది. సంబంధిత జిల్లా కలెక్టర్‌ ఎంపిక చేసిన ప్రభుత్వేతర సంస్థలను గుర్తించి, అవసరమైన నిధులను కేటాయించి, బాధ్యతను వాటికి అప్పగించింది.

ఆరోగ్య రవాణా సేవలను ‘ఎన్జీవో’ల ద్వారా అందించడంతోపాటు, నాలుగేళ్ళక్రితం ‘భద్రత మీ హక్కు’ అన్న నినాదంతో, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపక చైర్మన్‌ నెలకొల్పిన ఈ.ఎం.ఆర్‌.ఐ (ప్రస్తుతం జి.వి.కె, ఇ.ఎం.ఆర్‌.ఐ) సంస్థ అత్యవసర సహాయసేవలను ఉచితంగా అందిం చేందుకు ముందుకు వచ్చింది. తొలుత తమ నిధులతోనే, ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకుండానే నిర్వహణ బాధ్యత చేపట్టేందుకు అంగీకరించడంతో, ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యంలో ఆ సేవల నందించేందుకు ఇ.ఎం.ఆర్‌.ఐ.ని కూడా ‘నోడల్‌ ఏజన్సీ’గా ప్రభుత్వం అప్పట్లో గుర్తించింది. దరిమిలా, ప్రభుత్వం మిగతా 18 జిల్లాల్లో మరో 310 అంబులెన్సులను ఇ.ఎం.ఆర్‌.ఐ. ద్వారా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధులలో ఆ పథకం క్రింద ఉన్న మేరకే ఇవ్వగలుగు తామని, మిగతావి ఇ.ఎం.ఆర్‌.ఐ. భరించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఇ.ఎం.ఆర్‌.ఐ. అంగీకరించింది.

18 జిల్లాల్లో 310 అంబులెన్సులను, ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రారంభించగానే, మొదట్లో పైలట్‌గా ప్రవేశపెట్టిన 122 అంబులెన్సులను కూడా (జి.వి.కె) ఇ.ఎం.ఆర్‌.ఐ. ద్వారానే, ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నడపాలని నిర్ణయించింది. 2007 చివరికల్లా, ప్రభుత్వం సమకూర్చిన 432, (జి.వి.కె) ఇ.ఎం.ఆర్‌.ఐ. సమకూర్చుకున్న 70 కలిపి మొత్తం 502 అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించసాగాయి. అవసరాల కనుగుణంగా ప్రభుత్వం అంబులెన్సుల సంఖ్యను క్రమేపీ 802కు పెంచింది. ఫలితంగా, ఇప్పటివరకు (ఈ ఆర్టికల్ రాసే సమయానికి) సుమారు 30 లక్షలకు పైగా ఎమర్జెన్సీలకు అంబులెన్సులను పంపించి 49,000 మందికి పైగా ప్రాణాలను కాపాడిందీ పథకం. సుమారు 5,30,000 మందికి పైగా గర్భిణీ స్ర్తీలను ఆసుపత్రులకు అత్యవసర పరిస్థితుల్లో చేర్చడం జరిగింది.

లబ్ధిదారుల్లో సుమారు 47 శాతం మంది వెనుకబడిన వర్గాల వారు కాగా, 24 శాతం మంది షెడ్యూల్డ్ కులాలవారు, 12 శాతం మంది షెడ్యూల్డ్ తెగలవారున్నారు. క్రమంగా ‘108 అత్యవసర సహాయసేవల’ నందించే పథకంగా బహుళ ప్రాచుర్యం పొందాయి ఈ అంబులెన్స్‌ల సేవలు. ఈ కార్యక్రమం అమలుకు నిర్వహణ ఖర్చు ను (యాజమాన్య ఖర్చులు మినహా) ప్రభుత్వమే ఇప్పుడు భరిస్తోంది. ఆరోగ్య సంబంధింత సమాచార సహాయ పథకంగా ఫిబ్రవరి 2007లో ప్రారం భమైన 104 ఉచిత వైద్యసలహాలనిచ్చే కార్యక్రమాన్ని రూపొందిం చిన నాటి సత్యం ఫౌండేషన్‌ఆధ్వర్యంలోని ‘ఆరోగ్య- వైద్య సేవల యాజమాన్య, నిర్వహణ పరిశోధనాసంస్థ-హెచ్‌.ఎం.ఆర్‌.ఐ’తో ప్రభు త్వ ప్రైవే ట్‌భాగస్వామ్యంలో ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్రమేపీ 104 సేవల పరిధిని విస్తృతపరుచుకుంటూ, మరిన్ని ఆరోగ్య- వైద్య రంగసేవలను ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకోసాగింది ప్రభుత్వం. వాటిలో ముఖ్యమైంది ‘నిర్దిష్ట దిన సంచార ఆరోగ్య సేవల’ పేరుతో ఏర్పాటు చేసిన అధునాతన అంబులెన్సులు. మూడు కిలో మీటర్ల దూరంలో ఏ రకమైన ఆరోగ్య కేంద్రానికీ నోచుకోని 1500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి, నెల కోమారు, ఎంపిక చేసిన నిర్దిష్ట దినాన, సంచార ఆరోగ్య సేవలనందించే అంబులెన్స్‌వచ్చి నాలుగు గంటల పాటు సేవలనందిస్తుంది.

ప్రతి అంబులెన్స్ లో ఫార్మసిస్టులు, లాబ్‌ టెక్నిషియన్లతో పాటు అవసరమైన వైద్య పరికరాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, పౌష్టికాహార లోపాల పరీక్షలు, రక్త-మూత్ర పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, ఏ మందులు వాడాలో సూచనలివ్వడం జరుగుతుంది. గర్భిణీ స్ర్తీల ప్రసవ తేదీ నిర్ధారణ, చక్కెర- రక్తపోటు వ్యాధుల నిర్ధారణ చేయడమూ జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు, ప్రభుత్వానికి-హెచ్‌.ఎం.ఆర్‌.ఐ. సంస్థకు ఫిబ్రవరి 2008లో ఒప్పందం కుదిరింది. 2008 ఆగస్టు నుండి మొదలైన ఈ సేవల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 475 అంబులెన్సులను ఏర్పాటుచేసి, నిర్వహణ (యాజమాన్య ఖర్చులు మినహా) వ్యయమంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 47 లక్షల మందికి పైగా ప్రజలు ఈ పథకం ద్వారాలబ్ధిపొందారు. సుమా రు రెండున్నర లక్షల మంది గర్భిణీ స్ర్తీలు వైద్య పరీక్షలకు పేర్లు నమోదు చేయించుకున్నారు.

పూర్తిగా ప్రభుత్వ నిర్వహణగా అమలు జరుగుతున్నప్పటికీ, 108-104 సేవల తరహా ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యానికి భిన్నమైనదైనప్పటికీ, వాస్తవానికి ‘రాజీవ్‌ఆరోగ్యశ్రీ’ గొడుగు కిందున్న మరో అతిముఖ్యమెనై ‘ఆరోగ్యశ్రీ-సామాజిక ఆరోగ్యబీమా పథకం’ కూడా ఓ రకమైన ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యమే. ప్రభు త్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల తోడ్పాటుతో అమలవుతున్న ఈ పథకం దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల పాలిటి పెన్నిధి. 2007 ఏప్రియల్‌నుండి ఈ ‘ఆరోగ్యబీమా’ పథకాన్ని అమలులోకి వచ్చింది.
వ్యాధి నయం కోసమై రెండులక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చును పథకం ద్వారా బీమా సౌకర్యాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. ‘ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్‌ ట్రస్ట్’ కింద అమలవుతున్న ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు మూడున్నర లక్షల మందికి శస్త్ర చికిత్సలు ఉచితంగా వివిధ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో జరిగాయి. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అమలవుతున్న ఈ మూడు పథకాలు వినూత్నమైన మార్గదర్శకాలు. గ్రామీణ-గిరిజన ప్రాంతాల్లో వైద్యులు లేకపోవడంతో, మాతాశిశు మరణాలు అధికం కావడంతో, ఆరోగ్య-వైద్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, ప్రభుత్వ పరంగా పటిష్ఠంచేసే దిశగా రూపుదిద్దుకున్నవీ పథకాలు. అయితే పథకాల అమలు భాగస్వామ్య ప్రక్రియలో జరగడమే మేలని భావించిన ప్రభుత్వం అనుభవం, నిబద్ధత కలిగి ఉన్న సంస్థలకు ఆ పనిని అప్పగించి నిధులను సమకూరుస్తున్నది.

రాష్ట్రంలో ఒకే గొడుగు కింద అమలవుతున్న ఈ పథకాల మధ్య ఎంత సమన్వయం ఉంటే, విడివిడిగా ప్రస్తుతం లభిస్తున్న సేవలు అంతే మోతాదులో మెరుగ్గా లబ్ధిదారులకు 104 సేవలు వ్యాధుల నివారణకు ఉపయోగపడితే, వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి అత్యవసర పరిస్థితిలో 108 సేవల ద్వారా లాభం చేకూరగా, ఇతరులకు ‘ఆరోగ్యశ్రీ’ కింద చికిత్సచేయించుకునే వీలుకలుగుతుంది. ‘నిర్దిష్ట దిన ఆరోగ్య సేవల అంబులెన్స్’ ద్వారా వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో ఏ రకాల వ్యాధుల వారికి ఏ పథకం కింద అవసరమైన వైద్య సహాయం అందించవచ్చో తెలుసుకోవచ్చు. గర్భిణీస్ర్తీల పరీక్షల ఆధారంగా 108 అంబులెన్స్ వారికెప్పుడు ఉపయోగపడుతుందో నిర్ధారించవచ్చు. 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి చేర్చిన పేషెంట్‌కు ఆరోగ్యశ్రీ బీమాపథకాన్ని ఎలా వర్తింప చేయాలనేది సమన్వయం ఉంటే అర్థమవుతుంది.

బీమాపథకం కింద ఏ జబ్బుకు ఏనెట్‌వర్క్‌ఆసుపత్రి ఉపయోగపడుతుందోనన్న సమాచారం అంబులెన్స్ లో ఉంటే పేషెంట్‌ను నేరుగా అదే ఆసుపత్రికి తీసుకుపోయే వీలుకలుగుతుంది.

ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యానికి అటు ప్రభుత్వ పరంగా, ఇటు ప్రైవేట్‌ పరంగా నాయకత్వ పటిమగలిగి, నిబద్ధతతో, బాధ్యతాయుతంగా, దూరదృష్టితో భాగస్వామ్యాన్ని పటిష్ఠంగా కొనసాగించగలిగేవారు కావాలి. అవగాహన, బాధ్యతల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు, అవసరం మేరకు ప్రభుత్వ పరమైన నియంత్రణలు, ప్రైవేట్‌ భాగస్వామికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు సంబం ధించి పూర్తి స్వేచ్ఛ, ఏ రకమైన సేవలను ఎలా అందించాలన్న విషయంలో సంబంధిత ప్రభు త్వ శాఖల్లోని వివిధ స్థాయి అధికారుల అవగాహనా నైపుణ్యం, స్థిరమైన ప్రభుత్వం, ప్రైవేట్‌భాగస్వామి యాజమాన్య-నిర్వహణా నైపుణ్యం లాంటివి ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం విజయవంతంగా పనిచేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి.