Showing posts with label మాకినేని బసవ పున్నయ్య. Show all posts
Showing posts with label మాకినేని బసవ పున్నయ్య. Show all posts

Tuesday, December 20, 2011

రజబ్ అలీ రగడ: వనం జ్వాలా నరసింహారావు



తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 14
రజబ్ అలీ రగడ
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పద్నాలుగో అధ్యాయం ఇది).
రజబ్ అలీకి మాస్ లీడర్‍గా పేరుంది. జిల్లా నాయకత్వంతో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బాంక్ ఎన్నికలలో పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, రావెళ్ల సత్యంగారికి వ్యతిరేకంగా పనిచేసి, ఆయన ఓటమికి కారణమయ్యారు రజబ్ అలీ. 1965లో చంచల గూడా జైలులో వుండగా, సత్యంగారితో వాగ్వివాదం వచ్చి, ఆయనను చెప్పుతో కొట్టేశాడు. మోటూరు హనుమంత రావు, దేవులపల్లి వెంకటేశ్వర రావు, మానికొండ సుబ్బా రావు, గుంటూరు బాపనయ్య, దాట్ల సూర్యనారాయణ గార్ల లాంటి నాయకులంతా అక్కడే వుండడంతో, రజబ్ అలీ చర్యను చాలా సీరియస్‍గా తీసుకున్నారు. ముషీరాబాద్ జైలులో వున్న సుందరయ్య, బసవ పున్నయ్య, నాగిరెడ్డి, పుల్లారెడ్డి గార్లకు ఆ సంఘటనపై పూర్తి నివేదిక పంపారు. (డాక్టర్ వై.ఆర్.కె కూడా అప్పుడు అదే జైలులో వున్నారు). జైలు నుండి బయటకు వచ్చిన తరువాత కూడా రజబ్ అలీ, తన వారిని కూడ తీయటం ప్రారంభించాడు. అయినా ఆయనను సున్నితంగా మందలించి 1967 అసెంబ్లీ ఎన్నికలకు ఖమ్మం నియోజకవర్గం నుంచి నిలబెట్టి గెలిపించింది.
పార్టీకి, ఆయనకు ఖమ్మం పార్టీ నిర్మాణ సంబంధమైన విభేదాలు వచ్చాయి. పార్టీ లైన్‍తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెబుతూనే, పార్టీ నాయకత్వం పోకడ తనకు నచ్చ నందువల్ల విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. (ఖమ్మం జిల్లా పార్టీలో బ్రాహ్మణ పెత్తనం సాగుతున్నదని అంతర్గతంగా ప్రచారం చేశాడు). “ఖమ్మం డివిజన్ సిపిఎం పేరుతో ఆఫీసు బోర్డు పెట్టి, సెప్టెంబర్ 1971 నుండి 6 మాసాల పాటు సాగించారలా. తరువాత సిపిఐలో చేరారు.
1972, 1983, 1985, 1989, 1994 ఎన్నికలలో సిపిఐ పక్షాన పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. రజబ్ అలీ తో సిపిఐ కి వెళ్లిన వారిలో కొందరి పేర్లు గుర్తు చేసుకున్నారు డాక్టర్ గారు. వారు: తుళ్లూరు సత్యం (తనికెళ్ల), దొండపాటి వెంకయ్య (కొణిజర్ల), బొమ్మిశెట్టి నారాయణ (కొత్తగూడెం), వంకాయలపాటి వెంకయ్య, కర్నాటి కృష్ణయ్య, మహ్మద్ మౌలానా, వెంపటి రామకోటయ్య, వెంపటి సూర్యనారాయణ, ఆఫీసు రాఘవయ్య, చావా వెంకటేశ్వర రావు (కొక్కిరేణి), పారుపల్లి పుల్లయ్య, ఎర్రంనేని వెంకట నరసయ్య (గోకినేపల్లి) వున్నారు. వీరందరూ స్థానికంగా పలుకుబడి వున్నవారు, ఎక్కువగా కమ్మ కులానికి చెందినవారు కావడంతో జిల్లా మార్క్సిస్టు పార్టీకి బాగానే నష్టం కలిగిందని అన్నారాయన. ఆయన వెంట వెళ్ళిన వారంతా డాక్టర్‍గారికి వ్యక్తిగతంగా స్నేహితులే. కాని, రాజకీయంగా మార్క్సిస్టు పార్టీకి అండగా వున్నందుకు ఆగ్రహంతో వుండేవారు! వారి-వారి సంభాషణలలో డాక్టర్ గారిని "కొండపై కూర్చున్న గురువు" అని వ్యంగంగా చెప్పుకునే వారట. (డాక్టర్ గారి ఇల్లు, ఆసుపత్రి, గుట్టల బజారులో ఎత్తైన గుట్టపై వుంటుంది).
ఆ నాటి పార్టీ నాయకత్వాన్ని"బ్రాహ్మణాధిక్య గ్రూప్" గా చెప్పడం అత్యంత దారుణం అంటారు. వారంతా జంధ్యాలు తీసివేసి, కార్మికోద్యమానికి అంకితమైన త్యాగమూర్తులంటారాయన. ఉద్యమ క్షేమం తప్ప, మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత భావాలు ఏ కోశానా లేనివారు.
కమ్మ కులానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు కూడా ఆయనతో వెళ్లలేదు. రావెళ్ల సత్యంగారు, బోజెడ్ల వెంకటనారాయణగారు, రాయల వీరయ్యగారు, బోడేపూడి వెంకటేశ్వరరావు, ఏలూరి లక్ష్మీనారాయణ, పయ్యావుల లక్ష్మయ్య, కట్టా వెంకటనర్సయ్య మరికొన్ని పేర్లు చెప్పవచ్చు. కొత్తగా సిపిఐ లో చేరిన వారితోనే, తరువాత ఘర్షణలు ఎక్కువగా వచ్చాయి. బోజెడ్ల వెంకటనారాయణగారి కుటుంబం రెండుగా చీలింది. ఆయన గ్రామం నుండి ఇల్లు-వాకిలి, భూమీ అన్ని వదిలి కొంతకాలం ఖమ్మంలో తలదాచుకున్నారు. రాయల వీరయ్యగారిని దారి కాచి దాడి చేస్తే ఎముకలన్నీ విరిగి చావుతప్పి బయటపడడానికి ఐదారు మాసాలు పట్టింది.

Saturday, October 16, 2010

పయ్యావుల చెప్పిన వీర తెలంగాణా విప్లవ గాధ : వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరణ జరిగి
(అక్టోబర్ 21, 2010 న)
59 సంవత్సరాలు నిండిన సందర్భంగా

సూర్య దిన పత్రిక (17-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

ఐదేళ్ల పాటు సాగిన వీర తెలంగాణా విప్లవ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మైలు రాయి-కీలకమైన ఒక మలుపు రాయి. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి విప్లవ యోధుల సరసన పోరాటంలో పాల్గొన్న వారిలో చరిత్ర పుటల్లోకి ఎక్కనివారి పాత్రను తక్కువగా అంచనా వేయలేము. సరిగ్గా ఏభై తొమ్మిది సంవత్సరాల క్రితం, అక్టోబర్ 21, 1951న ఉపసంహరించబడిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఖమ్మం జిల్లా, గోకినేపల్లి గ్రామానికి చెందిన 85 సంవత్సరాల పయ్యావుల లక్ష్మయ్యకు ఇప్పటికీ, ఈ వయసులోను ఎన్నో విషయాలు గుర్తున్నాయి. సాయుధ పోరాట ఉద్యమంలో దూకిన పయ్యావుల లక్ష్మయ్య, తనను నిర్బంధించిన నిజామాబాద్ జైలు కిటికీ వూచలు కోసి, తప్పించుకుని, సొంత గ్రామం గోకినేపల్లికి చేరుకున్నారు. క్రమేపీ ఉద్యమం తీవ్రమైంది.

మైదానంలో రక్షణ లేదని లక్ష్మయ్య ప్రభృతులు, ఇల్లెందు అడవుల్లోకి పోయారు. అప్పటికే రంగ ప్రవేశం చేసిన యూనియన్ సైన్యాలు అడవుల్లోకి, గుట్టల్లోకి వీరిని గాలించుకుంటూ వచ్చాయి. మిలిటరీ ధాటికి తట్టుకోలేక మొదట్లో ఐదు గురితో ఏర్పాటైన దళాలు, క్రమేణ ముగ్గురి తో, ఇద్దరితో కుదించడం జరిగింది. మొండిగా ఉద్యమం సాగించారు. ఉద్యమం కొనసాగించడం సరైందా, కాదా అన్న మీమాంసలో లక్ష్మయ్య లాంటి వారున్నప్పటికీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మాత్రం, అడవుల్లో దళాలను అంటిపెట్టుకుని ముందుకు సాగేవారు. అప్పట్లో లక్ష్మయ్య పాలేరు ప్రాంతం ఇన్-చార్జ్ గా పనిచేశారు. నేలకొండపల్లి సమీపంలోని మూటా పురానికి చెందిన బాగం వీరయ్య రైఫిల్ పోగొట్టుకుని చిత్రహింసలకు గురై కూడా రహస్యాలు బయటపెట్టని విషయం గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

చకిలం శ్రీనివాస రావు కార్యదర్శిగా వున్న (ఏరియా కమిటీ) దళంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి (పార్లమెంట్ మాజీ సభ్యుడు), మచ్చా వీరయ్య, చిర్రావూరి లక్ష్మీనరసయ్య (ఖమ్మం మాజీ మునిసిపల్ చైర్మన్) లతో పాటు లక్ష్మయ్య కూడా వుండేవారు. ఒక సారి జరిగిన దాడిలో లక్ష్మయ్య వారినుంచి చీలి హుజూర్ నగర్ దళంలో కలిశాడు. అక్కడ మేదరమెట్ల సీతారామయ్య, నిజామాబాద్ జైలునుంచి తనతో పాటు పారిపోయి వచ్చిన వంకాయలపాటి కృష్ణయ్య కలిశారు. సీతారామయ్య ధైర్య సాహసాలను గుర్తుచేసుకుంటూ, ఒకసారి అడవి దేవులపల్లి-దేవరకొండ ప్రాంతంలో పోతున్నప్పుడు, తమను నిర్భంధించడానికి వస్తున్న గూర్ఖాలను పసిగట్టి ఎలా వెనుక దెబ్బతీసింది వివరించారు లక్ష్మయ్య. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్ మీద దాడి చేసేందుకు ప్రణాళిక తయారుచేయమని లక్ష్మయ్యను పార్టీ ఆదేశించించింది. సహచర ఉద్యమకారుడు వంకాయలపాటిని, మేదరమెట్లను, మరొకరిని కలుపుకుని, నలుగురు స్టేషన్ పై దాడికి ప్రణాళిక వేసుకున్నారు. పొగాకు అమ్మే బేర గాళ్ల వేషంలో వూళ్ళోకి సాయంత్రం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. వూరి బయట పొగాకు పరిచి, తరాజులు పెట్టి అమ్మకాలు మొదలెట్టారు. జనసంచారం తగ్గింతర్వాత ముసుగులు ధరించి, వెంట తెచ్చుకున్న తుపాకీలు పట్టుకుని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. దాడికి వచ్చింది నలుగురే అని భావించని పోలీసులు భయంతో, లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వెంటిలేటర్ల నుంచి బయటున్న వీరు కాల్పులు చేయడంతో లోపలున్న పోలీసులు గాయపడి చేతులెత్తి లొంగిపోయారు. బయట కొచ్చిన ఒక్కొక్కరి ని బంధించారు వీళ్ళు. వాళ్ళ దగ్గరున్న 14 తుపాకీలను కట్టకట్టి, మోయలేక, అతి కష్టం మీద ఊరి బయటకు చేర్చారు. అప్పటికి అక్కడున్న రాతి బావిలో పడవేసి, తర్వాత తీసుకున్నారు.

అడుగడుగునా పోలీసు కాపలా అవరోధాల మధ్య, సానుభూతి పరుల సహాయం లభించేది. ఒక సారి ఈయన దళాన్ని వంద మంది పోలీసులు చుట్టుముట్టారు. సమీపంలోని జొన్న చేలలో, చుట్టూతా తుపాకీల పహరా మధ్య తప్పించుకునే ప్రయత్నంలో వుండగా, తోటి ఉద్యమకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపిస్తున్న లక్ష్మయ్యకు దండం పెట్టి, తాను పోలీసులకు చిక్కక ముందే చంపమని ప్రాధేయ పడ్డాడట. అతడిని భుజంపై వేసుకుని ఎలాగోలా లక్ష్మయ్య తప్పించుకోగలిగాడు. జొన్న చేలు దాటి, మరో దళానికి చెందిన సభ్యుడొకరిని, దొడ్డా నరసయ్య గ్రామం దగ్గరున్న చిలుకూరు సమీపంలో కలిశాడు లక్ష్మయ్య. ఒకరినొకరు క్షణకాలం అనుమానించినా కలిసిపోయారు. గాయపడిన సహచరుడిని, సుదూరంలో కనిపిస్తున్న గుర్రానికి కట్టి తీసుకెళ్దామని భావించారు. అయితే, ఆ గుర్రం సహాయంతోనే మరో సహచరుడు వంకాయలపాటి కృష్ణయ్య రావడం గమనించారు. మొత్తం మీద అందరూ కలిసి, చిలుకూరు నుంచి గొర్రగూడెం అడవులకు చేరుకున్నారు. అక్కడే హుజూర్ నగర్ దళం పని చేస్తున్నది. అప్పటికే, ఖమ్మం దళం కంటే పటిష్టంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న హుజూర్ నగర్ దళం, కాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నది.

పయ్యావుల లక్ష్మయ్యను కల్వకుర్తి జోనల్ కమిటీ కార్యదర్శిని చేసింది పార్టీ. సరిగ్గా అదే రోజుల్లో, ఉద్యమంతో బాగా అనుబంధమున్న ఒక సీనియర్ కార్యకర్తను అరెస్టు చేసింది ప్రభుత్వం. అతడు పోలీసు ఇన్ ఫార్మర్ గా మారిపోయాడు. గుట్టల్లో దళం సభ్యులను కలిసి, పాత పరిచయాలతో వారినుంచి సమాచారం సేకరించి, పోలీసులకు చేరవేయ సాగాడు. చివరకు వాడిని తమ దగ్గర నుంచి, ఎల్. బి. గంగాధర రావు సారధ్యంలోని కేంద్రానికి పంపారు. ఆ దళంలో, కొండన్న అనే మాజీ సైనికాధికారి సభ్యుడుగా వుండేవారు. అతను వీడి విషయం పసిగట్టాడు. అది గ్రహించిన ఇన్ ఫార్మర్ జరగబోయేది ఊహించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పార్టీకి, ఉద్యమానికి ద్రోహం చేశానని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా గొడ్డలితో నరికి చంపారని, ఆ సంఘటన మీద పార్టీలో చాలాకాలం చర్చ జరిగిందని, తప్పొప్పుల బేరీజు వేసుకోవడం కూడా జరిగిందని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య. ఏదేమైనా చరిత్ర మటుకు ముందుకు సాగింది.

కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలున్న విషయం ప్రస్తావించారు లక్ష్మయ్య. ఒకటి సుందరయ్య వర్గం కాగా, మరొకటి రావి నారాయణరెడ్డి వర్గం. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తర్వాత, తెలంగాణా సాయుధ పోరాటం కొనసాగించడమంటే, అది నెహ్రూ ప్రభుత్వాన్ని కూల దోయడానికి జరిగే కుట్రగా ప్రచారం మొదలైంది. యూనియన్ సైన్యాలు నిజాం సంస్థానంలో ప్రవేశించిన మరుక్షణం నుంచే, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఖండించే వర్గం మొదలైంది. తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించుతున్న నాయకత్వం లోని చండ్ర రాజేశ్వర రావు, మాకినేని బసవ పున్నయ్య, మద్దుకూరి చంద్రశేఖర రావు, పుచ్చలపల్లి సుందరయ్య అక్టోబర్ 20, 1951 న సమావేశమై, పోరాటాన్ని ఉపసంహరించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని అక్టోబర్ 21, 1951 న ప్రజలకు, పత్రికలకు విడుదల చేయడం రేడియోలో ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో పయ్యావుల లక్ష్మయ్య ప్రభృతులు, వారిలాంటి చాలామంది కార్యకర్తలు అజ్ఞాత వాసంలో వుంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

పోరాట విరమణ నిర్ణయాన్ని, దాని వెనుక వున్న భావాన్ని కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోలేక పోయారంటారు లక్ష్మయ్య. పోరాట విరమణ కార్యక్రమం ఉద్యమ కారులకు వివరించడానికి లక్ష్మయ్య జోనల్ కమిటీ కార్యదర్శిగా వున్న కల్వకుర్తి జోన్ ను ఎంపిక చేసింది పార్టీ నాయకత్వం. పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడ కొచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట వచ్చిన ఒక ప్రముఖ ఉద్యమ నాయకుడు (దరిమిలా ఆయన సీపీఐ లోను, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లోను పని చేశారు) సుందరయ్య గారి సమక్షంలో, "ఎప్పుడో పోరాటం విరమించాల్సింది" అని వ్యాఖ్యానించడంతో, అక్కడున్న వారంతా ఆయన్ను తప్పుబట్టి ఎదురు తిరిగారట. పోరాట విరమణ నిర్ణయాన్ని వివరించిన సుందరయ్య గారు, "ఆత్మ రక్షణ కొరకు పోరాటం కొనసాగిస్తే తప్పులేదు" అన్న మాటలను లక్ష్మయ్య బృందం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. "చంపవద్దు" అన్న మాట అర్థమయినా, ప్రభుత్వంతో తుపాకీల అప్పగింత విషయంలో చర్చ లింకా జరుగుతున్నాయని సుందరయ్య అనడాన్ని, ఆత్మ రక్షణ కొరకు వాటిని వాడుకోవచ్చని భావించారు.

సాయుధ పోరాటం కొనసాగుతున్న రోజుల్లో, ఇంకా తుపాకీలు అప్పచెప్పకముందు, పయ్యావుల లక్ష్మయ్య దళంలో పనిచేసిన వారిలో బూర్గుల రామకృష్ణా రావు గారి బంధువు హనుమయ్య ఒకరు. విద్యాధికుడైన హనుమయ్య, డాక్టర్ పరాంజిపే దగ్గర వైద్యం నేర్చుకున్నాడు. ఆత్మ రక్షణ కొరకు ఆయుధాలింకా ఉపయోగిస్తున్న తరుణంలో, ఒకానొక సందర్భంలో హనుమయ్యను నిర్భంధించినప్పుడు, ఆ గ్రామ పటేల్ ఆయనను కాపాడి నందువల్ల పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన సంగతిని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

ఎప్పుడో ఒకప్పుడు సాయుధ పోరాటం వస్తుందని సుందరయ్య గారు నమ్మేవారని, అందుకే, ఆయన మార్గాన్ని అనుసరించే తన లాంటి వారెందరో, తుపాకీల అవసరం తప్పక రావచ్చని భావించామని ఆనంద భాష్పాల మధ్య, వ్యక్తపరచలేని సుందరయ్య గారి మీదున్న అభిమానం మధ్య పేర్కొన్నారు. నందికొండ ప్రాజెక్టు కింద మునిగి పోయిన స్థలంలో, ఇప్పుడు సాగర్ జలాలు ప్రవహిస్తున్న అలనాటి ప్రాంతంలో, ఒక గుర్తు ప్రకారం తామంతా ఆయుధాలు దాచిపెట్టామని, అవి ఎప్పుడో ఒకప్పుడు భావి తరాల ఉద్యమకారులకు దర్శనమిస్తాయని, అపారమైన నమ్మకంతో, 85 ఏళ్ళ పయ్యావుల లక్ష్మయ్య అంటుంటే, ఆయన నమ్మకానికి జోహార్లు అనాలనిపించింది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి ఎనలేని సేవలందించిన అలనాటి వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు పయ్యావుల లక్ష్మయ్యను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణ మీద సీపీఎం నుంచి బహిష్కరించడం కడు బాధాకరమైన విషయం. విప్లవ యోధులను గౌరవించడమంటే ఇదేనని సోదాహరణంగా చూపించింది సీపీఎం. లక్ష్మయ్య లాంటి "తెలుగు సోమనాథ్ ఛటర్జీ" లు ఖమ్మం జిల్లాలో చాలామంది కనిపిస్తారు మనకు. వారిలో చాలామంది నుంచి ఇలాంటి గాధలెన్నో వినవచ్చు. ఇంత జరిగినా పార్టీ మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని అణు మాత్రం కూడా వదులుకోలేని లక్ష్మయ్య, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, తనను చూసేందుకు వచ్చిన వారితో, పార్టీతో-విప్లవంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటారు.

Thursday, June 10, 2010

బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి స్టాలిన్ జోస్యం-భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు విప్లవ పాఠాలు : వనం జ్వాలా నరసింహారావు

(జూన్ నెల 12, 13, 14 తేదీలలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
హైదరాబాద్ లో జరుపుకున్న నేపధ్యంలో)

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.

హైదరాబాద్ లో మూడు రోజులు జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సమావేశాలలో సమకాలీన జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు, పార్టీ భవిష్యత్ లో అవలంబించాల్సిన వైఖరికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. యూపీఏ వైఫల్యాలను ఎండగట్టడంలో వామ పక్షాలు విఫలమయ్యాయని, పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వామ పక్షాలకు పెద్ద ఎదురుదెబ్బని-పరాజయంగా భావించాలని, బెంగాల్ అనుభవం దృష్ట్యా కమ్యూనిస్ట్ పార్టీ విధాన-రాజకీయ వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని సమావేశాలను ప్రారంభించిన జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా, మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.

ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919 లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920 న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టకర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. "కోమిన్టిర్న్" సంస్థకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం ఎన్ రాయ్, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి పలువురు కమ్యూనిస్ట్ భావాల నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924 న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్ర కేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడిందనాలి.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925 లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. ఇదిలా వుండగా, వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. కాకపోతే, ప్రభుత్వం అంచనాలకు విరుద్ధంగా, ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933 లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరి కీ కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948 లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి.

చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్ఘోనష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కైు-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అప్పటివరకు అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే, గోవిందన్ నాయర్, ముజఫర్ అహ్మద్ ల నాయకత్వం, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ఒకప్పుడు అదే జోషి నెహ్రూకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆయనను తప్పుబట్టింది పార్టీ. డాంగే వర్గం లేవనెత్తిన "జాతీయ వాదన" కు అనుకోకుండా లోక్ సభలో పార్టీ ఉప నాయకుడు ఏ కే గోపాలన్ నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యకరమైన విషయం. నెహ్రూ చర్యకు తమ పూర్తి మద్దతుంటుందని గోపాలన్ ప్రకటించారు. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపిఐ సెక్రెటేరియట్ లోని ఎనిమిది మంది సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే-గోపాలన్-ముజఫర్ అహ్మద్ లు నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తులు" గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ (అంతకు ముందు లేని పదవి) గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది.

అదే సమయంలో, భారత-చైనా యుద్ధం నేపధ్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. డాంగే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో, మధ్యే మార్గంలో, అతివాద-మితవాద వర్గాలకు సమాన దూరంలో వున్న నంబూద్రిపాద్ లాంటి వారు, అతివాదుల వైపు మొగ్గడానికి దారితీసింది. క్రమేపీ సంభవించిన కొన్ని పరిణామాలు పార్టీ చీలిక దిశగా తీసుకెళ్లాయి. చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. మే నెల 1981 లో కారణాలేమైనప్పటికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరోక్ష వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, ప్రపంచ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డాంగేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" తో విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.

ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి. (End)