Showing posts with label ఖమ్మం. Show all posts
Showing posts with label ఖమ్మం. Show all posts

Wednesday, July 10, 2013

అలనాటి వ్యవసాయ కూలీ పోరాటాలు: వనం జ్వాలా నరసింహారావు

అలనాటి వ్యవసాయ కూలీ పోరాటాలు

వనం జ్వాలా నరసింహారావు

          1966 లో డిగ్రీ పరీక్షలు రాసిన తరువాత, నా మకాం, హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా పురానికి మార్చాను. అలా, 1966-1969 మధ్య కాలంలో మా గ్రామంలో వున్న రోజుల్లో, ఆ తరువాత 1969-1971 మధ్య కాలంలో నాగపూర్లో ఎం.ఏ చదువుతూ అడపదడప లేదా శెలవుల్లో మా గ్రామానికి వచ్చిన సందర్భంలో, అదే విధంగా 1971-1973 మద్య కాలంలో ఖమ్మంలో ఉద్యోగ రీత్యా వుంటున్న సమయంలో, మా పరిసర గ్రామ రాజకీయాలతో ఒక కమ్యూనిస్ట్ అభిమానిగా సంబంధాలు పెట్టుకున్నాను. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని కూడా. సభలు సమావేశాలకు హాజరయ్యేవాడిని. మా గ్రామంలో రాజకీయపరంగా నా పాత్రకు సంబంధించి ప్రస్తావించాను. అప్పట్లో ఖమ్మం సమితిలో, పాలేరు నియోజక వర్గంలో, ఇప్పటి ముదిగొండ మండలంలో భాగంగా వున్న కమలాపురం, బాణాపురం, పెద మండవ, వల్లభి, నాచేపల్లి, గంధసిరి, పమ్మి, చిరు మర్రి, అనా సాగరం గ్రామాలతో పాటు మా గ్రామంలో జరిగిన వ్యవసాయ కూలీ పోరాటాలను స్వయంగా చూసే అవకాశం కలిగింది. ఆ పోరాటాలలో, అంతో-ఇంతో, మా వూళ్లో నాకు కూడా కొంత మేరకు పాత్ర వుంది. అదే విధంగా అలనాటి కాంగ్రెస్ రాజకీయాలు, నాటి సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్య రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు అండతో నెరపిన హత్యా రాజకీయాలను కూడా కళ్లారా చూశాను. బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా పరిసర గ్రామాలలో ఆ పోరాటాలు ఇతర ప్రాంతాల వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన తరహాలో జరిగాయంటే అతిశయోక్తి కాదేమో!

          పరిసర గ్రామాలలో వ్యవసాయ కూలీ పోరాటాల కార్యాచరణ పథకానికి-అమలుకు కేంద్రం బాణాపురం గ్రామం. సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో, అదే గ్రామానికి చెందిన హరిజన నాయకుడు బాజి హనుమంతు (ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నికై నాడు), కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగ రావు, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డి, పెద మండవ సర్పంచ్ తాళ్లూరి వైకుంఠం, పమ్మి గ్రామ సర్పంచ్ బుగ్గ వీటి రంగయ్య ప్రభృతులు చుట్టు పక్కలున్న పది-పదిహేను గ్రామాల వ్యవసాయ కార్మిక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల సాధనకై పోరాటం మొదలెట్టారు. వ్యవసాయ కూలీలకు కనీస కూలి రేట్లు అందేటట్టు చేయడమే వారి లక్ష్యం. కిషన్ రావు నాయకత్వంలో వారంతా పోరాట పద్ధతులను ఒక పక్కా ప్రణాళికా బద్ధంగా రూపొందించుకున్నారు.


          చుట్టుపక్కల గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ కాపుకొచ్చాక కూలీలతో  పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను "డబ్బాల" తో కొలిచి కూలీ నిర్ణయించేవారు. "డబ్బా" కు 16 "మానికలు". మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ కొట్టినవారికి మూడు "సోల" ల నుండి ఒక "మానిక" వరకు జొన్నలు కొలిచి కూలీగా ఇచ్చేవారు. సోల అంటే అర్థ శేరు. అయితే వేరు శనగ కొలిచే డబ్బాలు, జొన్నలు కొలిచి కూలి ఇచ్చే మానికలు అన్నీ తప్పుడివే. 16 "మానికలు" వుండాల్సిన డబ్బాలు వాస్తవానికి  20, 22 మానికలు పట్టేవరకుండేవి. మానికకు నాలుగు సోలలుండాలి కాని మూడున్నర వుండేవి. అలా రెండు వైపులా తప్పుడు కొలతలతో కూలీలకు ముట్టచెప్పేవారు భూస్వాములు. ఒకవైపు కూలీ తక్కువ...మరో వైపు తప్పుడు కొలతలు...ఇలా రెండు విధాలుగా మోసం జరిగేది. అదో రకం దోపిడీ అనాలి. సరిగ్గా ఆ పిచ్చి కొలతలకు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా వుద్యమం ప్రారంభమైంది. "వ్యవసాయంలో కష్టం చేసేది కూలోడు...కష్టానికి తగ్గ ప్రతిఫలం కోరే హక్కు అతడికి వుంది...న్యాయమైన కూలీ కోసం, ఖచ్చితమైన కొలతల కోసం మీరంతా పోరాడండి" అని పిలుపిచ్చారు కిషన్ రావు నాయకత్వంలో మిగిలిన గ్రామ సర్పంచులు. తొలుత పోరాటం బాణా పురం గ్రామంలో మొదలైంది.

          కిషన్ రావు ఇచ్చిన పిలుపుకు, ఆ నినాదానికి కూలీలలో మంచి స్పందన వచ్చింది. అంతా కలిసి కట్టుగా, ఐక్యంగా నిలబడ్డారు. తప్పుడు కొలతల డబ్బాలు, మానికలు కనుమరుగయ్యే సమయం ఆసన్నమైంది. కూలీలు, వారి ముఠాలు, డబ్బులు పోగు చేసుకుని ఖచ్చితమైన కొలత డబ్బాలు, మానికలు కొనుక్కున్నారు. వాటి ప్రకారం ఇస్తేనే పుచ్చుకుంటా మన్నారు. సమ్మె చేశారు. కూలీల ఐక్యత ముందు భూస్వాములు తలవంచక తప్పలేదు. ఆ గ్రామంలో ఖచ్చితమైన కొలతలు అమల్లోకి వచ్చాయి. బాణాపురం కూలీలు విజయం సాధించారు. తరతరాలుగా శ్రమ జీవుల కష్టాన్ని దోచుకు తింటున్న భూస్వాముల తప్పుడు కొలతలకు స్వస్తివాచకం పలికారు బాణాపురం గ్రామంలో. ఈ వుద్యమం పరిసర గ్రామాలకు కూడా పాకింది. ఆయా గ్రామాల కమ్యూనిస్ట్ నాయకులు బాణాపురం తరహాలోనే పోరాటానికి కూలీలను సిద్ధం చేశారు. గ్రామ-గ్రామాన సభలు సమావేశాలు జరిగాయి. వందల-వేల సంఖ్యలో, చిరకాలం నుండి భూస్వాముల ఎత్తుగడల కింద చీల్చ బడి, ఛిన్నా భిన్నమైన కులాలన్నీ ఒక్క చోట చేరాయి. తప్పుడు కొలతలు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా మహోద్యమం సాగింది. పిచ్చి మానికలు, డబ్బాల స్థానంలో కొత్తవి వచ్చాయి. నేటికీ మా పరిసర గ్రామాలలో అవే కొలతలుగా పనిచేస్తున్నాయి.

          మా పరిసర గ్రామాల భూస్వాములు మరొక రకమైన వింత దోపిడీ చేసేవారు. కూలీలు పోగు చేసుకునే "పెంట కుప్పలను" వారు కారు చౌకగా కాజేయడం చేసేవారు. అదంతా ఒక ప్రణాళికా బద్ధంగా చేసేవారు దోపిడీ దారులు. కరవు కాలంలో కూలీలకు ఐదు-పది మానికలు ధాన్యం అప్పుగా ఇచ్చేవారు. అప్పిచ్చేటప్పుడు ఒక షరతు విధించేవారు. అప్పు పుచ్చుకున్న కూలీలు తమ పెంట కుప్పలను అప్పిచ్చినవారికే అమ్మాలని షరతు. పెంట కుప్పలను వారికిష్టమైన రేటుకే కొనేవాడు భూస్వామి. అప్పిచ్చిన ధాన్యానికి "నాగులు", "పెచ్చులు" (వడ్డీ లాంటిది) కట్టేవాడు. నిలువు దోపిడీకి కూలీని గురిచేసేవాడు. ఇక పెంట కుప్పలను తోలే "బండి జల్ల" కు ఒక నికరమైన కొలతలుండక పోయేది. బలిష్టమైన ఎద్దుల బండిని కట్టి, పెద్ద జల్ల నిండా పెంట పోయించి, జీత గాళ్లతో కరువు తీరా తొక్కించి, పెంటను కుక్కించేవాడు. పది బండ్లు అవుతుందనుకున్న పెంట నాలుగు బండ్లే అయ్యేది. అప్పు అలానే మిగిలేది. పెంట ఖాళీ అయ్యేది. దానికి వ్యతిరేకంగా కూలీలను సమీకరించారు కమ్యూనిస్ట్ నాయకులు. అప్పిచ్చిన ధాన్యానికి అడ్డగోలు నాగులు, పెచ్చులు కట్టడానికి వీల్లేదన్నారు కూలీలు. "పెంట జల్లలు" కొలత ప్రకారం వుండాలన్నారు. అడుగుకు ఫలానా రేటు వుండాలన్నారు. పెంట పోశాక తొక్కడానికి కుదరదన్నారు. భూస్వాములు కూడా బిగదీసుకున్నారు. అప్పులు ఇవ్వమన్నారు. జల్లలు మార్చమన్నారు. జల్లలు అల్లే ఎరుకలను, ఎరువులు నింపే పాలేర్లను తమకండగా కూలీలు సమ్మె చేయించారు. పెద్ద జల్లలు అల్లమని ఎరుకలు, పెంట బండ్లలో తొక్కమని పాలేర్లు భూస్వాములను బెదిరించారు. కూలీలంతా ఐక్యమయ్యారు. భూస్వాములు దిగి రాక తప్పలేదు. నాటి నుంచి నేటి వరకు మా పరిసర గ్రామాలలో కొల జల్లలు, కొల పెంటలు అమల్లో వున్నాయి.

భూస్వాముల మరో రకమైన దోపిడీ భూమి విస్తీర్ణాన్ని తక్కువ చేసి చెప్పడం...తద్వారా తక్కువ కూలీ చెల్లించడం. వేరు శనగ కూలీ, పెంట కుప్పల దోపిడీ విషయంలో విజయం సాధించిన వ్యవసాయ కూలీలు వరి నాట్లు, కోతలు, కలుపు తీయడం వంటి రోజువారీ పనులకు, కూలి రేట్లను పెంచాలని, పాలేర్ల జీతాలు పెంచాలని పోరాటాలు ప్రారంభించారు. ఆ పోరాటానికి కూడా గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో తొలుత బాణా పురం గ్రామం ముందంజ వేసింది. మా పరిసర చుట్టుపక్కల అన్ని గ్రామాలలోను నాట్లకు, కోతలకు, కలుపు తీయడానికి ఎకరానికి ఇంత అని కూలి ఇచ్చేవారు భూస్వాములు. సాధారణంగా అవంతా ముఠా కూలీలే కలిమిడిగా చేసేవారు. విడి కూలి వుండదు. ఇందులో కూడా భూస్వామి భూమి విస్తీర్ణానికి సంబంధించి దొంగ లెక్క చెప్పి కూలీలను మోసం చేసే వారు. ఇలాంటి దొంగ లెక్కలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు పోరాటం చేసి విజయం సాధించారు. బాణా పురంలో కూలీలు సాధించిన విజయాన్ని ఆసరా చేసుకుని, పరిసర గ్రామాలలోని ఇతర కూలీలు ఆ గ్రామం నడిచిన దారిలోనే తమ గ్రామాలలో కూడా విజయం సాధించారు.

ఇదిలా వుండగా చుట్టుపక్కల గ్రామాలలోని కూలీలు, బాణా పురం నుండి కూలి సంఘం తయారు చేసిన సరైన కొలత మానికలను తెచ్చుకున్నారు. ఆ మానికలతోనే తమ గ్రామాలలో కూడా కూలి ఇవ్వాలని భూస్వాములను నిలదీశారు. భూస్వాములలో గందరగోళం బయల్దేరింది. ఇలా మా ప్రాంతమంతా అన్ని గ్రామాలలోను కూలీలంతా ఒక్కటై నిల్చి కూలి పెంపుదల సాధించడమే కాకుండా వివిధ రకాల దోపిళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. భూస్వాములు ఆక్రమించిన ప్రభుత్వ బంచరాయి భూములను కూడా కూలీలు స్వాధీన పరచుకున్న ఘటనలు అనేకం వున్నాయి. ఆ మొత్తం పోరాటానికి గండ్లూరి కిషన్ రావు ముందుంటే, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులు ఆయనకు అందగా నిలిచారు.   



Saturday, July 6, 2013

ముదిగొండ-వల్లభి గ్రామాల హింసా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

ముదిగొండ-వల్లభి గ్రామాల హింసా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

మా గ్రామం పక్కనున్న కమలాపురం సరిహద్దు గ్రామం బాణా పురంతో సహా చుట్టుపక్కల గ్రామాల్లో కమ్యూనిస్టుల ఆధిక్యతను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య చాలాకాలం హింసా కాండ జరిగింది. ఇరు వర్గాల్లో ఎంతోమంది చనిపోయారు. బాణాపురం పక్క గ్రామమైన వల్లభిలో, మండల కార్యాలయమున్న ముదిగొండ, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాజకీయ హత్యలెన్నో జరిగాయి. ఖమ్మం జిల్లాకు "మార్క్సిస్టు-కమ్యూనిస్టుల కంచుకోట" అన్న పేరు నా చిన్నతనంనుండి వింటూనేవున్నాను. కాకపోతే, ఒకప్పుడు మా ప్రాంతంలో బలమైన ఉద్యమ నేపధ్యంలో నిర్మించబడిన కమ్యూనిస్ట్ పార్టీ, క్రమేపీ అంతర్గత కుమ్ములాటలతో, సొంతకంటిలో వేలు పొడుచుకున్న విధంగా బలహీనపడిపోయి, భవిష్యత్‌లో అలా పిలిపించుకునే అవకాశాలు ఉండవనే రీతిలో రూపాంతరంచెందిందనాలి. రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామ కిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ, కె. ఎల్. నరసింహారావు, బోడేపూడి వెంకటేశ్వర రావు వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుంది. రాష్ట్ర చరిత్రలో-ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికింది డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్‌ రాధా కృష్ణ, అడ్వకేట్ సుబ్బారావు నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోనే అనాలి.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. ఏభై సంవత్సరాల క్రితం ముదిగొండ-ఆ పరిసర గ్రామాలలో కూడా వారి ప్రభావమే ఉండేది. శీలం సిద్ధారెడ్డి రాజకీయంగా ఎదిగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం- శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.

జలగం-శీలం వర్గాల ఆధిపత్య పోరు కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్ధారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్ధారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం సిద్ధారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు-వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి

ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గత శతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ, వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు (మా సమీప బంధువు) ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీప బంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరుసమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాం రావు (నాకు మామ గారు). అప్పటికే రాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామ వాస్తవ్యుడైన రాం రావు గారి మూడో కూతురే నా భార్య.

ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ-పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడి గా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీ, అదే బొమ్మకంటి ఎంపిక చేసిన సమితి అధ్యక్షుడికి భూమితగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి (భాగవతుల భిక్షం) కొడుకు (వేదాద్రి) ను ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా వల్లభిగ్రామంలో పడింది.

 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావెళ్ళ సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావెళ్ళ సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు. తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత సామినేని ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్ర (కమ్మ వారు) వర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్ర (బ్రాహ్మణులు) వర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.

సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేంద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరి కొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు కొందరు (ఉదాహరణకు అమ్మపేట సర్పంచ్ కోయ వెంకట్రావు) చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేంద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు.

ఈ నేపధ్యంలో, ముదిగొండ మండలం (అప్పట్లో ఖమ్మం సమితి) లోని వల్లభి గ్రామంలో, జరిగిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

నాటి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు వల్లభి గ్రామం దళితులు బలయ్యారు. నీలం సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళరావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి" గ్రామం ఒక భూ పోరాటానికి" వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికి, దళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసింది. దళితులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో, అగ్రవర్ణాలకు చెందిన కొందరు, పరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను కూడగట్టుకుని, దళిత వాడపై దాడి చేయడంతో, పిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన పరిస్థితి కలిగింది. అలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ నాశనం చేశారు. వారి పశువులను తరిమి వేశారు. గృహోపకరణాలను పాడు చేశారు. మొత్తం మీద దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాం రావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులకు ఇబ్బందులు తొలగ లేదు. దేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని ప్రచురించాయి. టైమ్, న్యూస్ వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, బ్రిడ్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయి. ఇక స్థానిక రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి.   ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసింది. బ్రహ్మానంద రెడ్డి తన మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవ రాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం కనిపించలేదు. గ్రామంలో రిజర్వుడు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా మకాం వేశారు. అయినా మార్పు కానరాలేదు.

సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రామ పెద్ద అయితరాజు రాం రావు భావించారు. స్నేహితుల సహాయంతో ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు.

సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడు, శాంతి, గ్రామ స్వరాజ్యం, హరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్‌ ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావే, అనుంగు శిష్యుడు, ఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలి, పోరాటం కన్నా శాంతే మేలని, తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా, సరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడా, వల్లభి గ్రామానికి వచ్చారు.

గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శాంతి యత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక రామాలయంలో దీక్షకు దిగారు. ఆయనకు అంతకు ముందు ఆ గ్రామం గురించి ఏ మాత్రం తెలియదు. ఆయనకు తెలియ చేయబడిందల్లా, ఆ గ్రామంలో, అగ్రవర్ణాల భూస్వాములకు, దళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలో, దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారని, వారు గ్రామంలోకి రావడానికి తాను పూనుకోవాలని మాత్రమే. అంతే, వెనుకా-ముందు చూడ కుండా, హుటాహుటిన బయల్దేరి, ఏ ఆర్భాటం చేయకుండా, నిరాహార దీక్షకు దిగారు. ఆయన డిమాండు నెరవేరింది. ఆ దీక్షకు, ఒక నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.

దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. చిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన దీక్ష విరమించేది లేదని శపధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదుకాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు, జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో- బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు. 

వల్లభిలో అయితే పరిస్థితి మారింది కాని, ఆ ప్రాంత రాజకీయాలు మాత్రం హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నికలొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలం వర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నర్సింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలి తీసుకుంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రా రెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.


(ఆ వివరాలన్నీ మరో మారు).  

Sunday, June 23, 2013

ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల విద్యార్థిగా: వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల విద్యార్థిగా
వనం జ్వాలా నరసింహారావు

హెచ్.ఎస్.సీ పరీక్షల్లో హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసవడమే కాకుండా లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాను. ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో చేరాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది. ఆ విషయాలలోకి పోయే ముందర ఒక్క సారి ఖమ్మం కళాశాల ఆవిర్భావం గురించి కొంత రాస్తే బాగుంటుందేమో!

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావించారట. అది తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు (జగ్గయ్య పేట వాసి) గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు ముందర శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఇటీవలే ఐదారు సంవత్సరాల క్రితం గెంటాల నారాయణరావు గారి విగ్రహాన్ని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు. గెంటాల నారాయణరావు గారి సమీప బంధువు భాను మూర్తి విగ్రహావిష్కరణకు చొరవ తీసుకోవడమే కాకుండా ద్రవ్య సహాయం కూడా చేశారు.

కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. కాలేజీ మైదానం పక్కనున్న షెడ్డుల్లో మా క్లాస్ జరిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి. సత్యనాధం లెక్చరర్, సుబ్బారావు ట్యూటర్ (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) మాకు ఇంగ్లీష్ చాలా చక్కగా బోధించేవారు. నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో (రచయిత గుర్తుకు రావడం లేదు) "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. తెలుగును ఎం. హనుమంతరావు సార్ చెప్పేవారు. ఆయన బోధించిన మనుచరిత్రలోని ఒక పద్యం ఇంకా గుర్తుంది. "అటజనికాంచె భూమిసురు డంబరచుంబి, శిర స్సర జ్ఝరీ పటల, ముహుర్ముహు ర్లుఠ, దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల, పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌, కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌". ఇక జనరల్ స్టడీస్ క్లాసులను జగన్మోహన రావు గారు, వై. వి. రెడ్డి గారు ఎంతో ఆహ్లాదకరంగా తీసుకునేవారు. వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు. ఎన్. వి. సాంబశివరావు సార్ లెక్కల సబ్జెక్ట్ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు బోధించేవారు. భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ ఎ. విస్సన్న పంతులు గారు, రసాయన శాస్త్రం ఆదిశేషా రెడ్డి గారు బోధించేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. భౌతిక శాస్త్రానికి చక్రపాణి గారు, రసాయన శాస్త్రానికి సి. ఆంజనేయులు గారు డిమాన్ స్ట్రేటర్లుగా పని చేశారు. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.


పి.యు.సి లో నా క్లాస్ మేట్స్ పేర్లు ఎక్కువగా గుర్తుకు రావడం లేదు. నా హెచ్.ఎస్.సీ క్లాస్ మేట్ ఎల్. వి.ఎస్.ఆర్. శర్మ నాతో పాటు పి.యు.సి లో కూడా చేరాడు. మరొక క్లాస్ మేట్ సి. బాల మౌళి. అతడు మా బజారులోనే (మామిళ్లగూడెం) నివసించే కొలిపాక ఆనంద రావు (అప్పట్లో సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసేవాడు) అనే మా శ్రీమతి వైపు బంధువుకు బావ మరిది. పి.యు.సి లో థర్డ్ క్లాస్ విద్యార్థిగా వున్నప్పటికీ, దరిమిలా హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసుకుని, సి.ఎ చదివి పెద్ద ఛార్టెడ్ అకౌంటెంటుగా పేరు తెచ్చుకున్నాడు. మరో పి.యు.సి విద్యార్థి సత్యనారాయణ ఇంజనీరయ్యాడు. క్లాస్ మేట్స్ గా వున్న నలుగురు అమ్మాయిల పేర్లు గుర్తున్నాయి. ఒకరు హేమ నళిని (మా బాబాయి వనం నర్సింగరావు ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు) కాగా, మరొకరి పేరు నయన తార (ఈ అమ్మాయి అక్క- నా డిగ్రీ క్లాస్ మేట్ చంద్ర లేఖను రసాయన శాస్త్రం లెక్చరర్ ఆదిశేషా రెడ్డి వివాహం చేసుకున్నాడు). ఇంకో అమ్మాయి పేరు దేవి (ఈమె అన్నయ్య బారు సీతారాం రావు నాకు సీనియర్). మరో అమ్మాయి ఫకీర్ బీ (ఈ అమ్మాయిని విద్యార్థి సంఘం నాయకుడు, ఆ తరువాత రాజకీయ నాయకుడు ఖాదర్ అలీ పెళ్లి చేసుకున్నాడు). నాకు గుర్తున్నంతవరకు ఒక్క దేవి తప్ప మిగతా అమ్మాయిలు పి.యు.సి లో ఫెయిలయ్యారు. నేను కూడా పి.యు.సి లో అత్తెసరు మార్కులతో థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. కాలేజీలో నేను పి.యు.సి చదువుతున్నప్పుడే బాబాయి వనం నర్సింగరావు బి. ఎస్సీ  డిగ్రీ మూడో సంవత్సరంలో చదువుతుండగా, ఆయన తమ్ముడు స్వర్గీయ వనం రంగారావు డిగ్రీ బి. ఏ రెండో సంవత్సరంలో చదివేవాడు.

పి.యు.సి లో చేరిన తరువాత చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఆసక్తి పెరగ సాగింది. కళాశాల రాజకీయాలపై-కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. వాటి మీద ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం బాబాయి నర్సింగరావు. ఖమ్మం కళాశాల రాజకీయాలలో నర్సింగరావు ది క్రియాశీలక పాత్రే కాకుండా "కింగ్ మేకర్" పాత్ర కూడా. ఆయనకు తోడు, బి. ఎస్సీ  డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మరో సమీప బంధువు-స్నేహితుడు కొండపల్లి శ్రీ భార్గవ కూడా కాలేజీ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించేవాడు. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ-లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అండ దండలుండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కాగా, మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. నర్సింగరావు కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ పక్షాన నాయకత్వం వహించేవాడు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా సాగుతుండేవి. కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు. కళాశాల రాజకీయాలకు మరో కేంద్రం మామిళ్ల గూడెం లోని మా ఇల్లు.

          మా ఇంట్లో మూడు పోర్షన్లుండేవి. ఒక దాంట్లో (మధ్య పోర్షన్) ఆ రోజుల్లో కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్న కె. వై. ఎల్. నరసింహారావు గారు, మరో దాంట్లో (దక్షిణ వైపు) ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్ గా పని చేస్తున్న జగన్మోహన్ రావు అద్దెకుండేవారు. ఉత్తరం వైపున్న పోర్షన్ మా కింద వుండేది. అమ్మా-నాన్నలు మా వూళ్లో ఎక్కువగా వుండేవారు. నేను హోటెల్ లో (ఆనంద రావు హోటెల్ అనుకుంటా) భోజనం చేస్తూ చదువుకునేవాడిని. బి. ఎస్సీ  ఫైనల్ ఇయర్ చదువుతున్న బాబాయి నర్సింగరావు, తమ్ముడు రంగారావుతో కలిసి వేరే గదిలో వుంటున్నప్పటికీ, ఎక్కువగా మా ఇంట్లోనే గడిపేవాడు. రాజకీయాలన్నీ అక్కడి నుంచే నడిచేవి. నేను పి.యు.సి లో చేరిన సంవత్సరం (1962-1963) జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో విద్యార్థి సంఘానికి పోటీ చేసిన వాళ్లలో సామినేని రాధాకృష్ణమూర్తి (అధ్యక్షుడు), ఖాదర్ అలీ (కార్యదర్శి), భార్గవ (కల్చరల్ కార్యదర్శి) పేర్లు గుర్తున్నాయి. ఆ ఏడాది అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన టి. రామయ్య గెలిచినప్పటికీ, కార్యదర్శితో సహా అధిక భాగం సీట్లను కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన వారం-పది రోజుల పాటు చాలా టెన్షన్ గా వుండేది. కొట్లాటలు జరిగేవి. దరిమిలా అంతా సర్దుకు పోయేది.

ఇంతకు ముందే చెప్పినట్లు నా పి.యు.సి చదువు పాడు కావడానికి మరో కారణం క్రికెట్ ఆట. కాలేజీలో చేరడంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టాను. "మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్" ఆధ్వర్యంలో మా బజారులోని ఒక ఖాళీ స్థలంలో ఆడడంతో పాటు, కాలేజీ మైదానంలో కళాశాల జట్టుకు ఆడడం కూడా చేసేవాడిని. లెక్చరర్లు వైద్య, జడ్డి, వరదరాజన్ లాంటి వాళ్ల మద్దతు కూడా బాగా లభించేది. విద్యార్థులతో సమానంగా వాళ్లు కూడా ఆటలో పాల్గొనేవారు. మా ఇంట్లో కూచుని క్యారం బోర్డు ఆడడమో, ఉదయం-సాయంత్రం క్రికెట్ ఆడడమో నిత్య కృత్యమై పోయింది. తీరిక దొరికినప్పుడు ఇంట్లో గదిలో కూడా, ఆ కాస్త స్థలంలో క్రికెట్ ఆడుతుంటే పక్క పోర్షన్ లో వుండే ఇంగ్లీష్ లెక్చరర్ కె. వై. ఎల్. నరసింహారావు గారు తరచుగ మందలించేవారు. పి.యు.సి చదువుతున్నప్పుడు, హెచ్.ఎస్.సీ చివరి రోజుల్లో కొనుక్కున్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో లెక్చరర్లు కూడా సైకిల్ మీదనే కాలేజీకి వెళ్తుండేవారు. కొందరైతే నడిచే వెళ్లేవారు. స్కూటర్లు, కార్లు లేనే లేవు. సైకిల్ పైన నేను, శర్మ డబుల్స్ పోయే వాళ్లం. గుట్టల బజార్ దగ్గర సైకిల్ తొక్కలేక ఇద్దరం దిగే వాళ్లం. వాడిని సైకిల్ తోయమని పురమాయించేవాడిని. గుట్ట ఎక్కిన తరువాత మళ్లీ డబుల్స్ రైడ్!

పి.యు.సి పరీక్షలొచ్చాయి. అప్పట్లో "పరీక్షలు రాయను" అనడం ఒక ఫాషన్. నేను అదే మాట అన్నాను మా నాన్నతో. బహుశా ఒకటో-రెండో సబ్జెక్టులు రాసిన తరువాత, మంచి మార్కులు రావని, థర్డ్ క్లాస్ లో పాసైతే, ఇంజనీరింగులో సీటు రాదని, అందుకే మిగతా పరీక్షలు రాయనని వూళ్లో వున్న నాన్నగారికి కబురు చేశాను. ఆయన హుటాహుటిన ఖమ్మం చేరుకుని, నాకు నచ్చ చెప్పి మిగతా పరీక్ష రాయడానికి ఒప్పించారు. హైదరాబాద్, వరంగల్ లలో (ఆ రోజుల్లో నాకు గుర్తున్నంతవరకు రెండే ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి) ఇంజనీరింగులో సీటు రాకపోతే, బెంగుళూరు పంపించి చదివిస్తానని అన్నారు. సరేనని చెప్పి పరీక్ష రాయడం కొనసాగించాను. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బొమ్మకంటి సత్యనారాయణ గారి సిఫార్సుతో, అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రి టి. హయగ్రీవా చారి గారి ద్వారా ఎంత ప్రయత్నించినా ఇంజనీరింగులో సీటు దొరక లేదు. బెంగుళూరు ఎమ్మెస్ రామయ్య కాలేజీలో ప్రయత్నం చేశాం కాని ఫలితం లేకపోయింది. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. శర్మ ఫెయిలయ్యాడు. చాలామంది ఫెయిలయ్యారు. ఒకరిద్దరు తప్ప ఇంజనీరింగులో-మెడిసిన్ లో సీట్లు తెచ్చుకున్నవారు లేరనే అనాలి. బాల మౌళి థర్డ్ క్లాస్ లో పాసయ్యాడు. హైదరాబాద్ వెళ్లి పోయాడు.

ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.

డిగ్రీలో ఎప్పటిలాగే చదువు, క్రికెట్, రాజకీయాలు కొనసాగాయి. చదువు తక్కువ, మిగతావి ఎక్కువ. నర్సింగరావు డిగ్రీ చదవడం పూర్తైనప్పటికీ, పరీక్ష పాసవనందున, కాలేజీతో అనుబంధం వుంచుకోవడంతో పాటు రాజకీయాలలో ఇంకా పాల్గొంటూనే వుండేవాడు. ఆయన వెంబడి మేమూ అదే పని. డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే నేను ఖమ్మంలో చదివాను. మరుసటి ఏడాది హైదరాబాద్ వెళ్లిపోయాను. ఆ వివరాలు తరువాత రాస్తాను. డిగ్రీలో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను కె. వై. ఎల్. నరసింహారావు గారు, వరదరాజన్ గారు, జడ్డి గారు, సత్యనాధం గారు బోధించేవారు. తెలుగు ఎం. హనుమంతరావు గారు. యడవల్లి ఆదినారాయణ గారు చెప్పేవారు. నాకు గుర్తున్నంతవరకు "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు" సబ్జెక్ట్ గా వుండేది తెలుగులో. బమ్మెర పోతన నాటకం కూడా వుండేది.

జనరల్ స్టడీస్ సబ్జెక్టును జగన్మోహన్ రావు, వై. వి. రెడ్డి, సుబ్రహ్మణ్యం గార్లు చెప్పేవారు. భౌతిక శాస్త్రం ఎమ్మెస్ ఆచారి గారు, . విస్సన్న పంతులుగారు బోధించేవారు. లెక్కలు కె. కోదండరాం రావు గారు, రసాయన శాస్త్రాన్ని జి. వి. నరసింహారావు (ఆర్గానిక్) గారు, ఆదిశేషా రెడ్డి (ఇన్ ఆర్గానిక్) గారు చెప్పేవారు. డిమాన్ స్తేటర్లుగా చక్రపాణి గారు, ఆంజనేయులు గారు డిగ్రీలో కూడా వుండేవారు. నా క్లాస్ మేట్స్ పేర్లు కొన్ని మాత్రమే గుర్తున్నాయి. అప్పట్లో "రౌడీ శంకర్" గా పేరు పొందిన ఎన్. శంకర్ రావు, మా ఇంటి ఎదురుగా వుండే మోటమర్రి వెంకట రామారావు, ఎస్. రాజేశ్వర రావు, సి.హెచ్. విజయ రామ శర్మ, ఎస్.ఎం.ఎన్. రాయ్, కళాధర్, నాగేశ్వర రావు, రోజా-పుష్ప అనే అక్క చెల్లెళ్లు, దేవి, చంద్రలేఖ నా క్లాస్ మేట్స్. శంకర్ రావు దరిమిలా మునిసిపల్ వార్డ్ మెంబర్ గా పని చేశాడు. వెంకట రామారావు హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేశాడు. రాజేశ్వర రావు, రాయ్, శర్మ బాంక్ అధికారులుగా రిటైర్ అయ్యారు. కళాధర్ ఏ. జి. ఆఫీస్ లో పని చేసి రిటైర్ అయ్యాడు. చంద్రలేఖ ఆదిశేషా రెడ్డి గారిని వివాహమాడింది. శర్మ, రాయ్, రాజేశ్వర రావు, నాగేశ్వర రావు క్రికెట్ ఆటగాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. మాతో పాటు మామిళ్లగూడెంలోనే వుంటుండే మా సమీప బంధువు వనం రంగారావు కూడా కాలేజీలో బి. ఎ లో చేరి క్రికెట్ ఆటగాడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. దరిమిలా రాష్ట్ర స్థాయి క్రీడాకారుడుగా ఎదిగాడు.


ఖమ్మం మామిళ్లగూడెంలో వున్న మా ఇంట్లో అద్దెకుంటుండే కె. వై. ఎల్. నరసింహారావు గారికి కాలేజీ ప్రిన్సిపాల్ గా పదోన్నతి వచ్చింది. ఆయన మా ఇంట్లో చాలా కాలం అద్దెకున్నారు. ఐతే, నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన ఏడాదే, మా కుటుంబం ఖమ్మంలో కాపురం పెట్టింది. అద్దెలకివ్వగా మిగిలిన ఒక్క పోర్షన్ మా కుటుంబానికి సరిపడకపోవడంతో కె. వై. ఎల్. నరసింహారావు గారిని ఖాళీ చేయమని మా నాన్నగారు కోరారు. ఆయన గారికి సరైన అద్దె ఇల్లు లభించనందున ఎంతకాలం గడిచినా ఖాళీ చేసే సూచనలు కనిపించ లేదు. మా కుటుంబానికి ఇంట్లో మిగిలిన ఒక్క పోర్షన్ సరిపోనందున ఎదురింటిలో ఒక భాగం అద్దెకు తీసుకుని వుండాల్సిన పరిస్థితి వచ్చింది. కె. వై. ఎల్. గారిని ఖాళీ చేయించేందుకు మా నాన్న గారు కొంత బలప్రయోగం వుపయోగించాల్సి వచ్చింది. ఆయన ఖాళీ చేయక తప్పలేదు కొంతకాలానికి. ఐతే, ఆయన కళాశాల ప్ర్రిన్సిపాల్ గా పని చేస్తున్నందున, నేను అక్కడే చదువుతున్నందున, నా చదువుకు ఆయనేమన్నా ఇబ్బందులు కలగ చేయవచ్చనే అనుమానంతో, మా నాన్నగారు నా చదువు హైదరాబాద్ కు మార్పించాలన్న ఆలోచన చేశారు. ఫలితంగా 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత ఏబై సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఆ నాడు వచ్చిన నేను, ఇక్కడే స్థిరపడి పోతానని అప్పట్లో భావించలేదు. ఆ విషయాలన్నీ ముందు---ముందు.

Saturday, June 8, 2013

ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం: వనం జ్వాలా నరసింహారావు

ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి  ఆలయం
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, ముత్తారం గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం వుంది. మా పూర్వీకులైన కృష్ణరాయల గారి కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే "భక్తి సంజీవని" అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.

ప్రాచీన కాలం నాటి మా ముక్తి వరం-ముత్తవరం రామాలయాన్ని గురించి మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు-కథలుగా చెప్పుకుంటారు. ముత్తారం రెవెన్యూ గ్రామానికి మరో రెండు శివారు వూళ్లున్నాయి. ఒకదాని పేరు "కోదండరామపురం". చాలా చిన్న వూరనాలి. ఆవూళ్లో కేవలం వెలమ కులస్తులే వుండేవారు. అన్నీ కలిసి పదిహేను కుటుంబాలు కూడా వుండవు. అందరూ వెలమ దొరలే. సాగర్ కాలువ నీటితో ముంపుకు గురైన ఈ గ్రామాన్ని ఇటీవలే కొంచెం దూరంలో పునర్నించారు. మరో శివారు గ్రామం నేను పుట్టి పెరిగిన వనం వారి కృష్ణా పురం.

మా పూర్వీకుల్లో ప్రసిద్ధిచెందిన వనం కృష్ణ రాయలు గారు దాన్ని నిర్మించినందున దానికాపేరొచ్చింది. ఆయన అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా హాజరయ్యే వాడట. కాలంగడుస్తున్నాకొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివరకో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇక ముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాలనుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొనిరమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణ రాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.

కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణ రాయలుగారు. కొంచం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తన ముందు రథం-దాని వెనుక ఈయన గుర్రం వూరిపొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే-కృష్ణ రాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడుదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్ని వైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.


ఆ రాత్రి కృష్ణ రాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ-పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు. కృష్ణ రాయలుగారు నిజమైన భక్తుడై నందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడనడానికి అదొక నిదర్శనం.

భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకు ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు-నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గత ఐదారు ఏళ్లలో మరీ శిథిలమై గర్భగుడిలోకి వర్షపు నీరుకూడా వచ్చే స్థితి కలగడంతో గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు నడుంకట్టారు. అయితే అన్ని గ్రామాల్లో లాగానే, మా వూళ్లోనూ రాజకీయాలున్నాయి-వర్గాలున్నాయి-ఈర్షాసూయలున్నాయి. మా ఇంటి పేరున్న ఈతరం రామ భక్తుడు, వరసకు బాబాయి, వనం గోపాలరావు ఆలయ పునరుద్ధరణకు అంకితమైన వారిలో ముఖ్యుడు. నేనేమో హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా నివసిస్తుండడంతో, ప్రతినెలా మా వూరికి పోయి వస్తున్నప్పటికీ, గుడి కట్టించే విషయంలో చూపించాల్సిన శ్రద్ధ చూప లేకపోయాను. అయితే ఆలయ నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగక పోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవపూర్వకంగా జరిగింది ముత్తారం దేవాలయం విషయంలో. మా పూర్వీకులు కట్టించిన ప్రాచీన దేవాలయ పునర్నిర్మాణానికి, పరోక్షంగా నాలో జొరబడి, నా వంతు సేవ చేసే అవకాశమిచ్చాడు భగవంతుడు.

మా నాన్న వనం శ్రీనివాసరావు గారు పదేళ్ల క్రితం చనిపోవడానికి మూడు రోజుల ముందర మా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సందర్భం వచ్చిన ప్రతి చోట అవి ప్రస్తావించాల్సిన అంశాలు. మా నాన్న చెప్పిన ముఖ్యమైన అంశాలలో రామాలయ ప్రస్తావన కూడా వుంది.

ప్రతిఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (ఉత్సవ) ప్రతిష్టించాలనీ నాపై ఒక భాద్యతపెట్టారు నాన్నగారు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన అప్పగించిన పని చాలాకాలం వరకు నెరవేర్చ లేకపోయాను. ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణం. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఉద్యోగ విరమణ చేయడానికి కొన్నాళ్లక్రితం ఒక మిత్రుడి ప్రోద్బలంతో వాసు దాసుగారి సుందర కాండ మందరాన్ని "మందర మకరందం" గా లఘు కృతిలో రాసిన కొద్ది రోజులకే శ్రీరాముడి దయ నాపై అపారంగా కలిగింది. జీవితంలో ఊహించని విధంగా, పదవీవిరమణ చేసిన ఏ ఉద్యోగికీ లభించని రీతిలో నాకు మంచి వేతనంతో 108-అత్యవసర సహాయ సేవల సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆదాయం పెరిగి, అప్పులు తీరడం మొదలయింది. పిల్లలంతా ఎదిగి, ఉద్యోగాల్లో కుదుటబడి నెనెంతంటే అంత ఇచ్చేందుకు తయారయ్యే రోజులొచ్చాయి. సరిగ్గా అప్పుడే నాన్నగారు చనిపోయే ముందు అప్ప చెప్పిన భాద్యతను నెరవేరుద్దామన్న ఆలోచనొచ్చింది. అయితే ఆ ఆలోచనా క్రమంలో- ఆలోచన కార్యరూపం దాలుస్తున్న సందర్భంలో దేవాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరుగనున్నదని ముందు నేనూహించలేదు.

2006 సంవత్సరం చివర్లో ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. మావూళ్లో మా పూర్వీకులనుండి సంక్రమించి, నాకింకా మిగిలిన ఆరెకరాలు వరి పొలాన్ని నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ కౌలు చేస్తుంటాడు ప్రతిసంవత్సరం. అతని సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారు చేయించి, 2007 లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. ముత్తారం దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహాపండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. యువకుడు. ఆ చుట్టుపక్కల ఏ దేవాలయంలోనూ కళ్యాణోత్సవాలు చేయించగలవాడు కానీ, ప్రతిష్టలు చేయించగలవాడు కానీ, ఆగమశాస్త్రం తెలిసినవాడు కానీ లేరు. అందరు భుక్తికొరకు అర్చకత్వం చేస్తున్నవారే. వాసుకు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన అధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగవైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది. మా కుటుంబం ఆ మూడు రోజులూ అక్కడే వున్నాం. వూరిపెద్దలు-చిన్నలు, విభేదాలు మాని ఏదో సమయంలో కార్యక్రమం చూడడానికి వచ్చారు. నాటి జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్, దేవాదాయ-ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు కూడా వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కొంత చర్చ జరిగింది.

మా గ్రామ సర్పంచ్ ముండ్ర అప్పారావు, మా బాబాయి వనం గోపాలరావు, దేవాలయ అర్చకుడు శ్రీనివాసరావు, ఇప్పటికీ ఇంకా వూళ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న మా తమ్ముడు అప్పాజీ (శ్రీరామచంద్రమూర్తి), గ్రామంలోనే ఇటీవల వరకు వ్యవసాయం చేయించి ఆర్థిక ఇబ్బందులవల్ల హైదరాబాద్ చేరుకున్న మరో తమ్ముడు నరహరి కలిసి చేసిన ఆలోచనతో గ్రామస్తులలో పలుకుబడి కలిగిన వారందరూ దేవాలయానికి వచ్చారు. జీర్ణావస్థలో వున్న దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించాలని అంతాకలసి ఆలోచన చేశాం. ప్రభుత్వం దగ్గర నుండి కొంత సహాయం పొందుదామనీ, విరాళాల రూపంలో కొంత వసూలు చేద్దామనీ నిర్ణయించాం. మా గ్రామంలో పుట్టి-పెరిగి, ఇంజనీరయ్యి, సంపాదనపరుడైన పరుచూరి ప్రసాద్ దేవాలయ పునరుద్ధరణకు పెద్దమొత్తంలో సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు. అయితే ఎలా-ఎవరికి నిర్మాణ పనిని అప్పగించాలనే విషయంలో సందిగ్ధత వుండడంతో వాయిదాపడుతూ వస్తున్నది. మరో వారంరోజుల తర్వాత మళ్లీ గుడిలో కలుద్దామనుకుని నిర్ణయించాం అప్పటికి.

ఆ రోజున సమావేశానికి వచ్చిన వారందరికీ, కృష్ణుడొచ్చిన వేళా విశేషంవల్ల రాముడికి కూడా కొత్త ఆలయం తప్పక వస్తుందన్న నమ్మకం కుదిరింది. నాకూ ఆనందం వేసింది. నా వంతు విరాళంగా లక్షా నూటపదహారు రూపాయలు ప్రకటించాను. మరుక్షణమే ఒకరి తర్వాత ఇంకొకరు తాహతుకు మించి విరాళాలు ప్రకటించారు. కొంద రైతే దేవాలయంలోని కొన్ని నిర్మాణాలకు పూర్తి ఖర్చు తామే భరిస్తా మంటూ ముందుకొచ్చారు. తర్వాత జరిగిన సమావేశానికి పర్చూరు ప్రసాద్ హాజరై, దేవాలయానికి సంబంధించిన మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయమంతా భరిస్తానని మాటిచ్చాడు.

2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. దేవాలయం పూర్తికావడానికి సర్పంచ్ అప్పారావు చేసిన కృషి నిజంగా అభినందించాలి. ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగవైభోగంగా, అశేష జనవాహిని మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఘనత అర్చకుడు వాసుగారి ది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఉత్తర ద్వారం నిర్మాణంకూడా జరిగింది. పవళింపు సేవకు అద్దాలమేడ నిర్మాణంకూడా జరిగింది. సుమారు 50లక్షల రూపాయల వ్యయంతో చుట్టు పక్కల ఏ గ్రామంలో లేనంత గొప్ప దేవాలయం-రామాలయం మా ముత్తారంలో నిర్మించబడింది.

భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు హాజరవుతుంటాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి.


పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు. End

Sunday, January 29, 2012

శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శించిన ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం: వనం జ్వాలా నరసింహారావు


శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శించిన 
ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి  ఆలయం
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, ముత్తారం గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఈ నెల (జనవరి, 2012) 21 వ తేదీ, శనివారం నాడు దర్శించారు. ఆయనను భక్తులు-పూజారి పూర్ణ కుంభ స్వాగతంతో ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా చినజీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రతిఒక్కరు విగ్రహ రూపంలో వున్న ఆ దేవుళ్లను విశ్వసనీయతతో పూజించాలని సూచించారు. నిత్యం భగవన్నామ స్మరణతో, చింతనాతత్పరతతో, ఆధ్యాత్మిక జీవన సాధకులుగా ముందుకు సాగాలని భక్తులకు ఉపదేశించారు. వైష్ణవ సాంప్రదాయానికి కులమతాలు లేవని ఆయన అన్నారు. అన్నింటిలోనూ వైష్ణవ సంప్రదాయం ఉత్తమమైనదని ఆయన అన్నారు. ఆనాడు భక్త రామదాసు ఎన్నో కష్టాలు పడి భద్రాచలం లాంటి ఆలయాలు నిర్మించారని, వనం కృష్ణరాయలు శ్రీరాముడిని పూజించి ముత్తారం దేవాలయం నిర్మించి, రాముడిని ఇక్కడకు తీసుకొచ్చారని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని చినజీయర్ స్వామి అన్నారు.  చినజీయర్ స్వామి ఆలయాన్ని పరిశీలించి అక్కడున్న శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను, ఆండాళ్ అమ్మవారి విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముత్తారం చుట్టుపక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి చినజీయర్ స్వామి సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. ఆయా వెంట అహోబిల మఠం చినజీయర్ స్వామి కూడా వున్నారు. (ఆ కార్యక్రమంలో మా వూరి పెద్దలందరితో పాటు నేనూ పాల్గొన్నాను).

మా పూర్వీకులైన కృష్ణరాయల గారి కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే "భక్తి సంజీవని" అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.

ప్రాచీన కాలం నాటి మా ముక్తి వరం-ముత్తవరం రామాలయాన్ని గురించి మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు-కథలుగా చెప్పుకుంటారు. ముత్తారం రెవెన్యూ గ్రామానికి మరో రెండు శివారు వూళ్లున్నాయి. ఒకదాని పేరు "కోదండరామపురం". చాలా చిన్న వూరనాలి. ఆవూళ్లో కేవలం వెలమ కులస్తులే వుండేవారు. అన్నీ కలిసి పదిహేను కుటుంబాలు కూడా వుండవు. అందరూ వెలమ దొరలే. సాగర్ కాలువ నీటితో ముంపుకు గురైన ఈ గ్రామాన్ని ఇటీవలే కొంచెం దూరంలో పునర్నించారు. మరో శివారు గ్రామం నేను పుట్టి పెరిగిన వనం వారి కృష్ణా పురం.

మా పూర్వీకుల్లో ప్రసిద్ధిచెందిన వనం కృష్ణ రాయలు గారు దాన్ని నిర్మించినందున దానికాపేరొచ్చింది. ఆయన అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా హాజరయ్యే వాడట. కాలంగడుస్తున్నాకొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివర కో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇక ముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాలనుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొనిరమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణ రాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.

కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణ రాయలుగారు. కొంచం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తన ముందు రథం-దాని వెనుక ఈయన గుర్రం వూరిపొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే-కృష్ణ రాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడుదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్ని వైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.

ఆ రాత్రి కృష్ణ రాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ-పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు. కృష్ణ రాయలుగారు నిజమైన భక్తుడై నందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడనడానికి అదొక నిదర్శనం.
భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకు ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు-నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గత ఐదారు ఏళ్లలో మరీ శిథిలమై గర్భగుడిలోకి వర్షపు నీరుకూడా వచ్చే స్థితి కలగడంతో గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు నడుంకట్టారు. అయితే అన్ని గ్రామాల్లో లాగానే, మా వూళ్లోనూ రాజకీయాలున్నాయి- వర్గాలున్నాయి-ఈర్షాసూయలున్నాయి. మా ఇంటి పేరున్న ఈతరం రామ భక్తుడు, వరసకు బాబాయి, వనం గోపాలరావు ఆలయ పునరుద్ధరణకు అంకితమైన వారిలో ముఖ్యుడు. నేనేమో హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా నివసిస్తుండడంతో, ప్రతినెలా మా వూరికి పోయి వస్తున్నప్పటికీ, గుడి కట్టించే విషయంలో చూపించాల్సిన శ్రద్ధ చూప లేకపోయాను. అయితే ఆలయ నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగక పోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవపూర్వకంగా జరిగింది ముత్తారం దేవాలయం విషయంలో. మా పూర్వీకులు కట్టించిన ప్రాచీన దేవాలయ పునర్నిర్మాణానికి, పరోక్షంగా నాలో జొరబడి, నా వంతు సేవ చేసే అవకాశమిచ్చాడు భగవంతుడు.

మా నాన్న వనం శ్రీనివాసరావు గారు పదేళ్ల క్రితం చనిపోవడానికి మూడు రోజుల ముందర మా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సందర్భం వచ్చిన ప్రతి చోట అవి ప్రస్తావించాల్సిన అంశాలు.
          నాన్నగారిని గురించి నాకు తెలిసినంతవరకు: బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, బాల్యంలో నా వరకు నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ-కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామ పెద్దలతోనూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పొరుగూర్లో వున్న పెదనాన్నగారితో ఆయన మెలిగిన విధానం-తర తరాల వైరం మరిచిపోయేందుకు అందించిన స్నేహ హస్తం-స్నేహ ధర్మం తప్పిన ఆయనపై నాన్న గారి తిరుగుబాటు-సాధించిన తిరుగులేని విజయం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని-నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మపేట-ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్నగారు చెప్తే తెలుసుకున్నాను-కొన్ని స్వయంగా చూసాను. నా చిన్నతనంలో నాన్నగారు గుర్రం స్వారీ చేస్తూ, తెల్లటి కమీజు ధరించి-ధోవతి కట్టి బయటకు వెళ్లడం-వెళ్తున్నప్పుడు గ్రామ వీధుల్లో అరుగులమీద కూచున్న వారందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం కూడా బాగా జ్ఞాపకం వుంది. ఆయన కమీజుకు పెట్టుకున్న బంగారపు గుండీలు కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత కాలంలో సైకిల్ పై వెళ్లేవారు కొన్నాళ్లు.
మా నాన్న చెప్పిన ముఖ్యమైన అంశాలలో రామాలయ ప్రస్తావన కూడా వుంది.
ప్రతిఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (ఉత్సవ) ప్రతిష్టించాలనీ నాపై ఒక భాద్యతపెట్టారు నాన్నగారు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన అప్పగించిన పని చాలాకాలం వరకు నెరవేర్చ లేకపోయాను. ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణం. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఉద్యోగ విరమణ చేయడానికి కొన్నాళ్లక్రితం ఒక మిత్రుడి ప్రోద్బలంతో వాసు దాసుగారి సుందర కాండ మందరాన్ని "మందర మకరందం" గా లఘు కృతిలో రాసిన కొద్ది రోజులకే శ్రీరాముడి దయ నాపై అపారంగా కలిగింది. జీవితంలో ఊహించని విధంగా, పదవీవిరమణ చేసిన ఏ ఉద్యోగికీ లభించని రీతిలో నాకు మంచి వేతనంతో 108-అత్యవసర సహాయ సేవల సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆదాయం పెరిగి, అప్పులు తీరడం మొదలయింది. పిల్లలంతా ఎదిగి, ఉద్యోగాల్లో కుదుటబడి నెనెంతంటే అంత ఇచ్చేందుకు తయారయ్యే రోజులొచ్చాయి. సరిగ్గా అప్పుడే నాన్నగారు చనిపోయే ముందు అప్ప చెప్పిన భాద్యతను నెరవేరుద్దామన్న ఆలోచనొచ్చింది. అయితే ఆ ఆలోచనా క్రమంలో- ఆలోచన కార్యరూపం దాలుస్తున్న సందర్భంలో దేవాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరుగనున్నదని ముందు నేనూహించలేదు.
2006 సంవత్సరం చివర్లో ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. మావూళ్లో మా పూర్వీకులనుండి సంక్రమించి, నాకింకా మిగిలిన ఆరెకరాలు వరి పొలాన్ని నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ కౌలు చేస్తుంటాడు ప్రతిసంవత్సరం. అతని సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారు చేయించి, 2007 లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. ముత్తారం దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహాపండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. యువకుడు. ఆ చుట్టుపక్కల ఏ దేవాలయంలోనూ కళ్యాణోత్సవాలు చేయించగలవాడు కానీ, ప్రతిష్టలు చేయించగలవాడు కానీ, ఆగమశాస్త్రం తెలిసినవాడు కానీ లేరు. అందరు భుక్తికొరకు అర్చకత్వం చేస్తున్నవారే. వాసుకు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన అధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగవైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది. మా కుటుంబం ఆ మూడు రోజులూ అక్కడే వున్నాం. వూరిపెద్దలు-చిన్నలు, విభేదాలు మాని ఏదో సమయంలో కార్యక్రమం చూడడానికి వచ్చారు. నాటి జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్, దేవాదాయ-ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు కూడా వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కొంత చర్చ జరిగింది.
మా గ్రామ సర్పంచ్ ముండ్ర అప్పారావు, మా బాబాయి వనం గోపాలరావు, దేవాలయ అర్చకుడు శ్రీనివాసరావు, ఇప్పటికీ ఇంకా వూళ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న మా తమ్ముడు అప్పాజీ (శ్రీరామచంద్రమూర్తి), గ్రామంలోనే ఇటీవల వరకు వ్యవసాయం చేయించి ఆర్థిక ఇబ్బందులవల్ల హైదరాబాద్ చేరుకున్న మరో తమ్ముడు నరహరి కలిసి చేసిన ఆలోచనతో గ్రామస్తులలో పలుకుబడి కలిగిన వారందరూ దేవాలయానికి వచ్చారు. జీర్ణావస్థలో వున్న దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించాలని అంతాకలసి ఆలోచన చేశాం. ప్రభుత్వం దగ్గర నుండి కొంత సహాయం పొందుదామనీ, విరాళాల రూపంలో కొంత వసూలు చేద్దామనీ నిర్ణయించాం. మా గ్రామంలో పుట్టి-పెరిగి, ఇంజనీరయ్యి, సంపాదనపరుడైన పరుచూరి ప్రసాద్ దేవాలయ పునరుద్ధరణకు పెద్దమొత్తంలో సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు. అయితే ఎలా-ఎవరికి నిర్మాణ పనిని అప్పగించాలనే విషయంలో సందిగ్ధత వుండడంతో వాయిదాపడుతూ వస్తున్నది. మరో వారంరోజుల తర్వాత మళ్లీ గుడిలో కలుద్దామనుకుని నిర్ణయించాం అప్పటికి.
ఆ రోజున సమావేశానికి వచ్చిన వారందరికీ, కృష్ణుడొచ్చిన వేళా విశేషంవల్ల రాముడికి కూడా కొత్త ఆలయం తప్పక వస్తుందన్న నమ్మకం కుదిరింది. నాకూ ఆనందం వేసింది. నా వంతు విరాళంగా లక్షా నూటపదహారు రూపాయలు ప్రకటించాను. మరుక్షణమే ఒకరి తర్వాత ఇంకొకరు తాహతుకు మించి విరాళాలు ప్రకటించారు. కొంద రైతే దేవాలయంలోని కొన్ని నిర్మాణాలకు పూర్తి ఖర్చు తామే భరిస్తా మంటూ ముందుకొచ్చారు. తర్వాత జరిగిన సమావేశానికి పర్చూరు ప్రసాద్ హాజరై, దేవాలయానికి సంబంధించిన మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయమంతా భరిస్తానని మాటిచ్చాడు.
2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. దేవాలయం పూర్తికావడానికి సర్పంచ్ అప్పారావు చేసిన కృషి నిజంగా అభినందించాలి. ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగవైభోగంగా, అశేష జనవాహిని మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఘనత అర్చకుడు వాసుగారి ది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఉత్తర ద్వారం నిర్మాణంకూడా జరిగింది. పవళింపు సేవకు అద్దాలమేడ నిర్మాణంకూడా జరిగింది. సుమారు 50లక్షల రూపాయల వ్యయంతో చుట్టు పక్కల ఏ గ్రామంలో లేనంత గొప్ప దేవాలయం-రామాలయం మా ముత్తారంలో నిర్మించబడింది.
భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు హాజరవుతుంటాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి.
పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.