Showing posts with label సమిష్టి బాధ్యత. Show all posts
Showing posts with label సమిష్టి బాధ్యత. Show all posts

Monday, February 6, 2012

పాలనా రథంలో సరిగమలు-పదనిసలు: వనం జ్వాలా నరసింహారావు


పాలనా రథంలో సరిగమలు-పదనిసలు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వంపై ప్రత్యక్ష-పరోక్ష యుద్ధం ప్రకటించారు. సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వ్యవహార ప్రక్రియ కేంద్రంగా మొదలెట్టిన ఐఏఎస్‌ల సమరం దరిమిలా నేరుగా సర్కారుపైనే గురిపెట్టే వరకు పోయింది. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో "సెక్షన్ ఆఫీసర్" స్థాయి నుంచి సెక్రటరీమంత్రుల-ముఖ్యమంత్రి(?) వరకు అంతో-ఇంతో అందరూ దంచుకుంటారన్న అర్థం స్ఫురించే రీతిలో మీడియా ముందు ఐఏఎస్‌ల యూనియన్ నాయకులు అక్కసు వెళ్లబుచ్చారు. పైగా ఈ విషయం మీడియాతో సహా అందరికీ తెల్సిందే అన్నట్లు మాట్లాడారు! వారి మాటలను బట్టి, తమలో (అధికారుల) కొందరితో సహా కొందరు అనధికారులు(మంత్రులు) భారీ మొత్తంలో అవినీతికి కారణమై వుండవచ్చనీ, అందరినీ సమ న్యాయంతో శిక్షించాలనీ అర్థం చేసుకోవచ్చు. తప్పు జరిగిన విషయం, పరోక్షంగానైనా నేరంలో పాలు పంచుకున్న విషయం ఒప్పుకున్నందుకు వారిని అభినందించాల్సిందే!

ఐతే, అసలు విషయం ఇంకొంత లోతుగా ఆలోచించాలి. అధికారుల-అనధికారుల మధ్య వుండాల్సిన సంబంధాలు, మంత్రివర్గ సమిష్టి బాధ్యత, కార్యదర్శి మంత్రికి ఫైలు పంపే విధానం, రొటీనా-ప్రత్యేకత సంతరించుకున్నదా? అన్న అంశాలను కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. సిబిఐ జాయింటు డైరెక్టర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు. పాలనాపరమైన అంశాలలో ఆయనకు అవగాహన లేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. జీవో ఇచ్చిన వాళ్లు దోషా? ఇప్పించిన వాళ్లు దోషా? అన్న మీమాంసలనూ లేవనెత్తారు. తెర వెనుక (ఏం జరిగిందో బయటపెట్టడానికి సిద్ధపడకపోయినా) ఎంతో తతంగం జరిగే ఆస్కారం గురించీ మాట్లాడారు ఐఏఎస్‌లు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము ఎలాంటి పరిస్థితులలో "తప్పు" చేశారో చెప్పకనే చెప్పారు పాపం! మంత్రులు తీసుకునే "నిర్ణయాలను" తాము అమలు పరిచే వారమేనని "భాష్యం" చెప్పారు. స్వతంత్రంగా ఏ ఒక్క ఐఏఎస్ అధికారి నిర్ణయం తీసుకోలేరని మరో కొత్త సంగతిని బయట పెట్టారు. బిజినెస్ రూల్స్ ను, కోడ్ ఆఫ్ కండక్టును, బాధ్యతలను, మంత్రులు-కార్యదర్శులు-ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలనే విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఇంతకూ తమదేమీ తప్పు లేదని, అంతా మంత్రులదే అన్న చందాన మాట్లాడారు. ఎవరు-ఎవరిని-ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ వ్యవహారమంతా అర్థం చేసుకోవడానికి ఐఏఎస్‌ల-మంత్రుల మధ్య ఎలాంటి అవగాహన వుండాలి, ఎవరు-ఎవరికి-ఎంత మేరకు జవాబుదారులు, నిర్ణయాల బాధ్యత సమిష్టి దా? కేవలం జీవోలను జారీ చేసినవారి దేనా? లేదా చివరగా "అప్రూవ్డ్‌" అని సంతకం పెట్టిన మంత్రి-ముఖ్యమంత్రిదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐఏఎస్ అధికారులలో ధిక్కారణ ధోరణి కొంత కనిపించింది. ఐతే, అది ఆయన మీద కాదు. ఆయన మంత్రివర్గ సభ్యులమీద మాత్రమే. అప్పట్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు తాము కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీ అన్న చందాన పనిచేయడం జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు వారి ఆవేదనకు కారణమనొచ్చు. ఒకానొక సందర్భంలో, శాసనసభ ఆవరణలో, పలువురి సమక్షంలో, ఒక అమాత్యుడు, తన శాఖ కార్యదర్శి-శాఖాధిపతి (ఇద్దరూ ఐఏఎస్ అధికారులే) కుమ్మక్కై తనతో తప్పు చేయించారని బాహాటంగా విమర్శించారు. మరో మంత్రి, తన శాఖలో జరిగిన తప్పంతా అధికారుల మీద తోసేశాడు. ఇలా మంత్రులకు-అధికారులకు సంబంధాలు బెడిసికొట్టడం ఇప్పుడేమీ కొత్త కాదు. అనాదిగా జరుగుతున్నదే.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-అమాత్యులకు మధ్య ఎలాంటి సంబంధాలుండాలనే చర్చ ఏనాడో మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఐనందున, చాలావరకు బ్రిటీషు సాంప్రదాయాలనే పాటిస్తున్నాం, అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. కాకపోతే ఆచరణలోకి వచ్చేటప్పటికి, మనదైన శైలిలో భాష్యం చెప్పుకుంటున్నాం. వారి మధ్య సంబంధాలంటే, ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటించడం కాదు. తమదే సరైందన్న వాదన వినిపించడమూ కాదు. "సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలు" అన్న అంశంపై బ్రిటన్‌లో, 1985 లో, "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" రూపొందించి, వారి మధ్య వుండాల్సిన సంబంధాలను అందులో పొందుపరిచారు. మరో పదేళ్ల తరువాత ఆ మెమొరాండంకు 1995 లో కొన్ని సవరణలు చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సమీక్షించడం సబబేమో! మెమొరాండంలో పేర్కొన్నట్లు, మంత్రులు చట్టసభలకు ఎలా జవాబుదారీ అవుతారో, అలానే, సివిల్ సర్వెంట్లు (ఐఏఎస్ అధికారులు) మంత్రులకు జవాబుదారీగా వుండాలి. అంటే, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వుండడం అని అర్థం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం అధికారి ప్రధమ కర్తవ్యం. సంబంధిత మంత్రికి అవసరమైన తగు సూచనలిస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాలలో సహకరిస్తూండాలి. తమ ఇష్టా-అయిష్టాలకు అతీతంగా, విధానాల రూపకల్పనలో-నిర్ణయాల అమలులో తోడ్పడుతూ, ఎన్నికలలో చేసిన వాగ్దానాలను వాస్తవం చేయాలి. మంత్రులందరూ విద్యావంతులు కానక్కరలేదు. కేవలం విద్యావంతులు మాత్రమే మంత్రులు కావాలని అనుకోవడమంటే, మంత్రి మండలి మరో "బ్యూరోక్రసీ" అవుతుంది కాని "డెమొక్రసీ" వ్యవస్థ కాదు. మంత్రుల నిర్ణయం కార్యదర్శుల-శాఖాధిపతుల సలహా-సూచనల మేరకే అన్నది అక్షర సత్యం.

ప్రభుత్వమంటే, సమిష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మండలి, దాని అధినేత ముఖ్యమంత్రి. ఏ ఒక్క మంత్రి పొరపాటు చేసినా, బాధ్యత అందరిది అన్న విషయాన్ని మరిచిపోయిన నేటి కాలం మంత్రులు, బాహాటంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రినీ తప్పుపట్టుతున్నారు. పాలనాపరమైన విధాన నిర్ణయాలలో మంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత వుందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత వుంది. సంబంధిత శాఖ మంత్రికి సివిల్ సర్వెంటు తోడ్పడడమంటే, తనకు తెలిసిన సమస్త సమాచారంతో పాటు, తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా-నిష్పక్షపాతంగా-రాగద్వేషాలకు అతీతంగా, సలహాలు-సూచనలు ఇవ్వాలి. వారిచ్చే సలహా మంత్రి ఆలోచనా ధోరణికి భిన్నమైనదైనా, అనువైన-శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాల్సిందే! సివిల్ సర్వెంట్లు ఉద్దేశపూర్వకంగానో, మరే ఇతర కారణాలవల్లనో, అలా చేయకుండా, వేరే విధంగా చేసి మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసినా, తప్పుదోవపట్టించినా, అది అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇంతా జరిగిన తరువాత, ఇదంతా రికార్డు అయిన తరువాత, మంత్రి తీసుకునే నిర్ణయంపై అధికారికి ఎటువంటి అభిప్రాయభేదాలున్నా, అరమరికలు లేకుండా, చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో , ఆ నిర్ణయాన్ని అమలు చేసితీరాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం స్పష్టంగా చెపుతోంది. ఎమ్మార్ కుంభకోణంలోగాని, జగన్ అక్రమాస్తుల సంపాదన ఆరోపణల విషయంలోగాని, ఓబులాపురం గనుల వ్యవహారంలో కాని, ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్న మరే అంశం విషయంలో కాని, అధికారుల-మంత్రుల మధ్య ఇదంతా ఎంతవరకు చోటుచేసుకున్నదనేది బహిర్గతం కావాల్సిన సమయం వచ్చింది. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే, ప్రభుత్వ పనితీరు, పాలనలో సమర్ధత, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి.

అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహాను ఇచ్చినా, మంత్రులను మభ్య పెట్టినా, మంత్రులకు తెలియకుండా అత్యంత రహస్య సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేసినా, దాని దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వ పాలనా రధం పైనా, పడుతుంది. పర్యవసానం ఏదైనా తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంట్ల (ఐఏఎస్ అధికారుల) పై రాజకీయ ఒత్తిడుల ప్రభావం కూడా పడవచ్చు. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా ధోరణికి అనుగుణంగా వుండే సలహాను మాత్రమే ఇవ్వాలని-అలాంటిదే పొందాలని, సివిల్ సర్వెంట్లపైనా ఒత్తిడులు వచ్చే అవకాశాలు చాలా సార్లు వస్తాయి. బ్రిటన్ లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలలో ఇది అరుదుగా జరగొచ్చు. మన దేశంలో ఇలాంటివి చాలానే. వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా-విరుద్ధంగా, ఐఏఎస్ అధికారులతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు వుంటుందనేది ప్రశ్నార్థకం. మంత్రి ప్రోద్బలం లేకపోయినా అలాంటి తప్పులు అధికారులు చేసే అవకాశాలు లేవా?

ఏదేమైనా ఇటీవలకాలంలో, అఖిల భారత సర్వీసులకు చెందిన "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" అధికారులు కొందరు వివాదాలలో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడడం, బెడిసికొట్టినప్పుడు మంత్రులదే తప్పని వాదించడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. ఒక ఎస్. ఆర్. శంకరన్ లాగా పిలిపించుకునే వారిని వేళ్లమీద లెక్కించాల్సి వస్తోంది. కారణం: అత్యంత బాధ్యతతో కూడిన పదవులు అతి పిన్న వయసులోనే చేపట్టి నందువల్ల కావచ్చు. మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. సంప్రదాయాలను పాటించకపోవడం కావచ్చు. సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు కాకపోవడం వల్ల కావచ్చు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" (ఐఏఎస్) ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి "ఉక్కు వ్యవస్థ" గా అభివర్ణించారు. స్వాతంత్ర్యానంతరం, ప్రభుత్వ విధి-విధానాల రూపకల్పనలో సహాయపడేందుకు, నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలనా యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో "ఐఏఎస్" ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో ఆ పనిచేస్తూ వచ్చిన, "ఇండియన్ సివిల్ సర్వీస్" కు విప్లవాత్మకమైన మార్పులు-చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. ఈ సర్వీసుకు ఎంపికైన అభ్యర్థులు పౌర పరిపాలనలోను, విధానాల రూపకల్పనలోను-నిర్ణయాలలోను, ఆంతరంగిక-విదేశీ సంఘర్షణలను చాకచక్యంగా  అంచనావేసి నివారించడంలోను, కీలక పాత్ర పోషించ దగ్గ వ్యక్తులై వుంటారు. సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు విభిన్న రకాల విద్యలలో తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన అభ్యర్ధులను ఒక క్రమ పద్ధతి ప్రకారం, విస్తృతమైన-కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. ఇలా ఎంపికైన వారి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత వుంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కూడా లేదు. దేశ సమగ్రత-సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు ఈ వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని సర్దార్ పటేల్ అనేవారు.

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు, పనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభించాలి. కాని, ఇటీవల కాలంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందుతున్నారన్న ఆరోపణలు అనేకం వస్తున్నాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకుంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, మంత్రుల ఆదేశాలకు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గణనీయంగా పెరిగింది. దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోంది. ఏదైనా పాలనాపరమైన నిర్ణయం ప్రజోపయోగం కొరకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులు, మంత్రుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం "ఒత్తిడి" కిందకు రాదు. అది సరైన సమయంలో సరైన స్పందన అనాలి. అలా కాకుండా మంత్రుల వ్యక్తిగత ప్రయోజనాలకొరకు తల ఊపితే దాని ఫలితం అనుభవించక తప్పదు. "ఆన్ రికార్డ్" అభ్యంతరం చెప్పాలి. అలా జరిగిందో, లేదో, తెలుసుకునే ప్రయత్నమే సిబిఐ దర్యాప్తు అని భావించాలి. కాకపోతే, సిబిఐ ఎందుకు రాజకీయ నాయకులను విచారించడం లేదో అనేదే అంతుచిక్కని ప్రశ్నదోషులైన వారు రాజకీయ నాయకులైతే తప్పకుండా విచారణ జరగాలు. శిక్షార్హులు కావాలి.

ఐఏఎస్ అధికారులు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజం ఎత్తడం ఇదే మొదటి సారి కాదు. లోగడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, దాదాపు ఇంతే మోతాదులో, రాష్ట్రం వేధింపులనుండి రక్షించమని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి, జనవరి 1989 లో అలనాటి ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి, హెచ్ కే బాబు  ఫిర్యాదు చేశారు. కాకపోతే, అప్పట్లో ఫిర్యాదుకు కారణం, ఇప్పటి లాగా సిబిఐ వేధింపులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుండే ఏసిబి సంస్థ సుమారు నలభైమంది ఐఏఎస్‍లపై దర్యాప్తు చేపట్టడమే. అప్పట్లో ఐఏఎస్ అధికారులతో కొందరి ఐపిఎస్ అధికారులు కూడా జతగా తమ గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకోవడం విశేషం. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం 1989 లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి కల్యాణ కృష్ణన్ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. ఆర్. నాయర్‌ను ఢిల్లీకి పిలిపించారు కూడా . ఇప్పుడు కూడా రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగును కలిసి సిబిఐ మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో వుంది. ఏం జరుగనున్న దో వేచి చూడాలి. 

Tuesday, January 24, 2012

ఈ మంత్రివర్గ విస్తరణ...సి. ఎం. కు ప్లస్సా, మైనస్సా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (19-01-2012)
వనం జ్వాలా నరసింహారావు
(ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి; మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ అవసరం; మధ్యేమార్గం పార్టీకి శ్రేయస్కరం కాదు; పద్ధతి మార్చుకోవాల్సిన అధిష్టానం; అప్పుడే రాష్ట్రంలో పార్టీకి గౌరవం....ఎడిటర్)


సమిష్టి బాధ్యతారాహిత్యానికి, సమన్వయ లోపానికి నిలువెత్తు నిదర్శనమైన రాష్ట్ర మంత్రి మండలిలో మరో ఇద్దరు-ముగ్గురు చేరవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కష్ట కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్షానికి అండగా నిలిచిన నాటి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు చిరంజీవి అనుయాయులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని, వారీపాటికే బంధు మిత్రులకు తమ ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపారని, మీడియాలో కబుర్లొచ్చాయి. సర్వసాధారణంగా మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రికి బదులుగా, ఆ విషయాన్ని, తాజా కాంగ్రెస్ నాయకుడు-మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ప్రకటించడం కొంత ఎబ్బెట్టుగా వున్నప్పటికీ, వార్త బయటకు పొక్కడానికి మాత్రం ఆయనదే బాధ్యత అనాలి. అసలాయనకు వారిద్దరిమీదనే ఎందుకంత ప్రేమ అన్నది అంతుచిక్కని విషయం. ఇక వారిద్దరిలో కనీసం ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లోను, మంత్రిపదవి దక్కకుండా చేయాలని, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి మాట నెగ్గేలా చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగితే, ఆయనకు వ్యతిరేకంగా, కొందరు మంత్రివర్గ సభ్యులతో సహా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, పలు ఎన్నికల బహిరంగ సభలలో అశేష జనాన్ని ఆకర్షించి, ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చిరంజీవికి ఆ కోరిక నెరవేరలేదు. పోనీ పార్టీని బతికించుకుని, కనీసం వచ్చే ఎన్నికల నాటికన్నా, మళ్ళీ తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో వున్నాడా అంటే, అదీ చేయలేకపోయాడు. నెత్తిమీద కుంపటి దించుకుని, పార్టీని-పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెంచుకుంటున్నాడు. అదిప్పట్లో నెరవేరే అవకాశం లేనప్పుడు, తన అనుయాయులకు రాష్ట్ర మంత్రి మండలిలో స్థానం కలిపించమని అడిగే బదులు, తానే రాష్ట్ర మంత్రివర్గంలో చేరకూడదా? రాష్ట్ర మంత్రి పదవి తన స్థాయికి తగదనుకుంటున్నాడా? లేక, ఏకంగా కేంద్రమంత్రిగా నో, అవకాశం చిక్కితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నో కావాలని కలలు కంటున్నాడా? మించిపోయిందేమీ లేదు! తాను చేరదలుచ్కున్నట్లు ముఖ్యమంత్రికి, గులాంనబీ ఆజాద్‌కు సంకేతం ఇచ్చి, అటు కిరణ్‌కుమార్‌కు, ఇటు బొత్స సత్యనారాయణకు కొంత ఊరట కలిగించడం మంచిది. కడప కాంగ్రెస్ నాయకులకూ మంచిది కూడా!


ఏదేమైనా, కాంగ్రెస్ రాజకీయం, ఎక్కడ జరగాలో అక్కడికే మళ్లీ చేరింది. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ రాజకీయాలెప్పుడూ ఢిల్లీలోనే జరుగుతాయి. మధ్య-మధ్య రాష్ట్ర రాజధానికి, అప్పుడప్పుడూ జిల్లాలకూ చేరుకుంటాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంప్రదింపులకు ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకునే లోపునే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లడం గులాంనబీ ఆజాద్‌తో మాటామంతీ జరపడం జరిగిపోయాయి. చెరో మాట అనడంతో, సీను సోనియాగాంధీ దగ్గరకు మారింది ప్రస్తుతానికి. ఫలానావారికి మంత్రివర్గంలో చోటు దక్కనుందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఇంతకూ విస్తరణా? పునర్వ్యవస్థీకరణా? చిరంజీవి చెప్పినట్లు కేవలం ఆ ఇద్దరికి మాత్రమే చోటు కలిగించడమా? ముఖ్యమంత్రికి-సహచర మంత్రివర్గ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒకరిద్దరికి మాత్రమే ఉద్వాసనా? శాఖల్లో సమూలంగా మార్పులు-చేర్పులా? అనే విషయమన్నా ఈ సారి తేలుతుందేమో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఉపఎన్నికలలో, అలానే 2014 ఎన్నికలలో పరువు-ప్రతిష్టలతో బయట పడాలంటే, కనీసం గౌరవప్రదమైన ప్రతిపక్షంగానన్నా ఎన్నికవాలంటే, అధిష్టానం తన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం వుంది. ఏ అధిష్టానమైతే, కనీసం ఒక్కసారన్నా మంత్రిపదవి అనుభవం పొందని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టిందో, అదే అధిష్టానం, ఆయనా పీఠం మీద పటిష్టంగా వుండడానికి చర్యలు తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత అనేక సమస్యలను ఢీ కొన్నప్పటికీ, తడబడుతూ అడుగులు వేసినప్పటికీ, గత ఏడాది కాలంలో, కష్టాల కడలిని అధిగమించు తూ, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతున్నారనే ది వాస్తవం. అలాంటప్పుడు, ఆయనను బలపర్చాల్సిన అధిష్టానం, సమాంతరంగా దానికి విరుద్ధంగా ఏ చర్యను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రోత్సహిస్తే నష్టం పార్టీకే! అందుకే, తప్పో-ఒప్పో, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పూర్తిగా కాకపోయినా, పరిమిత మోతాదులోనన్నా స్వేచ్ఛ ఇవ్వాలి. అధిష్టానం అభీష్టం మేరకు, ఢిల్లీ నాయకులు చెప్పిన ఒకరిద్దరికి మంత్రి మండలిలో స్థానం కలిగించమని కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించడంతో సహా, ఆయన కావాలనుకున్న "టీం" ను ఏర్పాటు చేసుకునే వీలు కలిగించాలి. ఆయన తొలగించాలనుకుంటున్న మంత్రులను, అధిష్టానం దృష్టిలో ఏదో ఒక ప్రత్యేకమైన కారణం వుంటే తప్ప, అలా చేసే వీలు కిరణ్ కుమార్ రెడ్డికి కలిగించాలి. అవసరమైతే, అల నాడు అంజయ్య విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన విధానాన్నే, నేడు సోనియాగాంధీ కూడా పాటించి తీరాలి. హైదరాబాద్ రావాలి. వచ్చి ఆయనకు మద్దతుగా తానూ-తన అధిష్టానం నూటికి-నూరు పాళ్లు వుందన్న సంకేతాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వారిని తొలగించనన్నా తొలగించాలి-లేదా-తప్పు ముఖ్యమంత్రి దే అని భావిస్తే తదనుగుణంగా చర్యలన్నా చేపట్టాలి. మధ్యేమార్గం మంచిదికాదు. పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.


ఈ నేపధ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సహా, చిన్నా-చితకా పార్టీలు కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ, ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, ఏదో ఒక పేరుమీద యాత్ర చేపట్టడమో, పనిగట్టుకుని ప్రత్యర్థుల మీద దాడికి దిగడమో, లేదా ఎదురుదాడి చేయడమో, అదేమీ కాకపోతే టెలివిజన్ ఛానళ్ల పుణ్యమా అని చర్చలలో పాల్గొన్నప్పుడు అందివచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా, తమ-తమ వ్యూహాలను కాసింత బహిర్గతం చేయడమో గమనించాల్సిన విషయం. గతకొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు; తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు పోరుబాట; జగన్ రైతు దీక్షా శిబిరం; తెరాస-ఐకాస సమైక్యతా వాదుల యాత్రలను అడ్డుకునే ప్రయత్నాలు; భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయడం అనే విషయాలు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అధిష్టానం నియమించిన సమన్వయ కమిటీ సాధించిదేమిటో కాని, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు-కుమ్ములాటలు మాత్రం బహిర్గతం అయ్యాయి. కిరణ్‍కూ, బొత్సకూ; ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విభేదాలున్న ట్లు స్పష్టమైనాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు గులాంనబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేస్తే, బొత్సను అడ్డుకునే ప్రక్రియకు కిరణ్ శ్రీకారం చుట్టారనుకుంటున్నారు. కొందరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, విడతలవారీగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలను (సూర్య దినపత్రిక) ప్రముఖంగా ప్రచురించారు. వారికి కొందరు ఎంపీల మద్దతుకూడా వుందని అంటున్నారు. ఇదంతా గమనించిన ఆజాద్‌కు ఆగ్రహం కూడా కలిగిందట. ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ ఎంత సీరియస్‌గా వుంటుందో కాని, ప్రతిపక్షాలు మాత్రం ఒక కన్నేసి వుంచాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సడలిందని ప్రచారం చేయసాగాయి. ప్రజా సమస్యలను ఆయన అసలే పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. ముఖ్యంగా రైతు సమస్యలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజం ఎత్తాయి. చివరకు మీడియా కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపాయి.


ఇందులో భాగంగా, ఒకానొక పాపులర్ టెలివిజన్ ఛానల్, రైతు ఆత్మహత్యలపై-సమస్యలపై, అన్ని రాజకీయ పార్టీల-రాజకీయేతర ప్రముఖుల-పాత్రికేయుల-సామాజిక కార్యకర్తల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో ఒక ఆసక్తికరమైన గోష్టిని నిర్వహించిందిటీవల. గోష్టిలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచనలను రేకెత్తించే అంశాలను తెరమీదకి తెచ్చారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో గ్రామీణ-వ్యవసాయదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ బహిర్గతం చేసిన విషయాలను ప్రభుత్వం పట్టించుకుని తీరాల్సిందే. వెలుగులోకి వస్తున్న రైతు ఆత్మహత్యలను, సాధారణ ఆత్మహత్యలుగా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి మూడు గంటలకు దేశవ్యాప్తంగా సంభవిస్తున్న చోటుచేసుకుంటున్న ఆరు రైతు అత్మ హత్యలలో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినదే అని ఆయన అన్నారు. మద్దతు ధర లేక, సాంప్రదాయ పద్దతులకు స్వస్తి పలికిన నేపధ్యంలో, పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడం వల్ల కూడా రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. మరి ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు చేపట్టిన రైతు పోరుబాట కాని, జగన్ రైతు దీక్షా శిబిరం కార్యక్రమం కాని, ఎంతవరకు రైతు సమస్యలను ప్రతిబింబించాయో ప్రశ్నార్థకమే!
          
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని భావనలో వున్న కిరణ్ కుమార్ రెడ్డికి, అందుకే, అధిష్టానం మరింత మద్దతు ఇవ్వాలి. రైతు సమస్యలతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పార్టీపరంగా ఆయనకు వ్యతిరేకతను తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఈ విషయాలపై అధిష్టానం దృష్టి సారించాలి.


(ఈ ఆర్టికల్ 18-01-2012, మంత్రివర్గ విస్తరణ జరుగవచ్చన్న ఊహాగానాలకు పూర్వం రాసింది)