Showing posts with label కమ్యూనిస్టు పార్టీ. Show all posts
Showing posts with label కమ్యూనిస్టు పార్టీ. Show all posts

Tuesday, January 10, 2012

“తెలంగాణ మార్క్సిస్టు సవ్యసాచి” ఖమ్మం జిల్లా రావెళ్ల సత్యం: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

సుమారు ఐదు దశాబ్దాల అనంతరం రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో జరుపుకునే ఏర్పాట్లలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తలమునకై వుంది.
ఖమ్మం జిల్లాలో (1964 లో) మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించిన తరువాత, పార్టీ పరంగా, బహు ప్రజా సంఘాల, రాష్ట్ర స్థాయి-అఖిల భారత స్థాయి మహాసభలు నిర్వహించినప్పటికీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా వున్న రోజుల్లో నిర్వహించిన రాష్ట్ర మహాసభలు తప్ప ఇంతవరకూ సిపిఐ(ఎం) ఒక్క సారికూడా రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరుపుకోలేదు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాముఖ్యత సంతరించుకున్న ఇతర సభలు ఎన్నైనా పేర్కొనవచ్చు. రాష్ట్ర ఎస్.ఎఫ్.. రెండో మహా సభలు ఖమ్మంలో 1967 జనవరి 2-7 తేదీలలో జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ కార్మిక మహా సభలు 1980 నవంబర్ లో జరిగాయి. ఆ నాటి పశ్చిమ బెంగాల్ రెవెన్యూ మంత్రి బినయ్ కృష్ణ చౌదరి, సుందరయ్య, కేరళ నుండి చాతున్నిమాస్టర్ హాజరయ్యారు. 1977 ఆగస్టులో యు.టి.ఎఫ్ రెండవ రాష్ట్ర మహా సభలు జరిగాయి. ఆ నాటి కేంద్ర విద్యామంత్రి ప్రకాశ్ చంద్ర చందుర్ హాజరయ్యారు. 1985 ఏప్రిల్ లో రాష్ట్ర ప్రజా నాట్య మండలి తృతీయ మహా సభలు జరిగాయి. రాష్ట్ర రైతు మహా సభలు 1986 ఏప్రిల్‍లో జరిగాయి. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బసు, బసవ పున్నయ్య హాజరయ్యారు. 1989 ఏప్రిల్ లో అఖిల భారత రైతు మహా సభలు పెద్ద ఎత్తున జరిగాయి. కేరళ ముఖ్య మంత్రిగా వున్న ఇ. కె. నాయనార్ హాజర్ అయ్యారు. 1996 నవంబర్ 2-4 తేదీలలో నాలుగవ అఖిల భారత వ్యవసాయ కార్మిక మహా సభలు ఖమ్మంలో జరిగాయి. ఈ విషయాలన్నీ సిపిఎం పార్టీ నుంచి ఎన్నికైన మాజీ రాజ్యసభ సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమ నాయకుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవిత చరిత్ర (ప్రచురణకు సిద్ధంగా వున్న) "అనుభవాలే అధ్యాయాలుగా" లో విపులంగా పేర్కొనడం జరిగింది. పలు సభలకు ఆహ్వాన సంఘ అధ్యక్షుడుగా నో, అనువాదకుడుగా నో, కీలక నిర్వాహకులలో ఒగరుగానో డాక్టర్ హాజరయ్యారు.
జిల్లా-రాష్ట్ర వ్యాప్తంగా రైతు-కూలీ ఉద్యమాలకు, గ్రామాలలో భూస్వాముల వ్యతిరేక పోరాటాలకు, ఆరణాల కూలీలకు-అధిక వడ్డీలకు-మేరల పెంపుకు-కుల వివక్షతలకు-దళిత-వెనుకబడిన వర్గాల ఐక్య ఉద్యమాలకు, పౌరహక్కుల ఉద్యమాలకు, ప్రభుత్వ మాన్యాలను-బంచరాయి భూములను పేదల స్వాధీనం చేసే ఉద్యమాలకు  ఏనాడో దూరమైన కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), ఒక్క సారి ఆ ఉద్యమ స్పూర్తి దాయకులైన ఖమ్మం జిల్లా వారిని కొందరినైనా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మంచిదేమో!
మార్క్స్-లెనిన్ నీతి సూత్రాలను నిబద్ధతతో పాటిస్తూ, వాటిని అమలు పెట్టడంలో స్థిర చిత్తుడుగా వుంటూ, ఎటువంటి బెదిరింపులకు-బలప్రయోగాలకు లొంగకుండా, ఆజన్మాంతం మంచి కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న అరుదైన వ్యక్తి ఖమ్మం జిల్లా గోకినేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ రావెళ్ల సత్యం. అనుక్షణం బీదా-బిక్కీ మధ్య మెదలాడుతూ, తెల్లటి ముతక బట్టల పంచె-అంగీ-పైన తెల్ల పచ్చ గళ్ల కండువా ధరించిన, ఒంటి చేతి చెట్టంత ఎత్తు పెద్దమనిషి సత్యం గారు. తన చిన్నతనంలో మామిడి చెట్టు ఎక్కి కిందపడినప్పుడు, చేతికి తగిలిన తీవ్రమైన దెబ్బ మూలాన, కుడి మోచేతి వరకు తొలగించాల్సి వచ్చింది. అలా ఒంటి చేత్తోనే, మరణించేంతవరకు, సవ్యసాచిలా కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని ఖమ్మం జిల్లాలో సమున్నతంగా నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. పన్నెండేళ్ల వయసులో, పొరుగూరు కమలాపురంలో వున్న బాబాయి వనం నరసింగరావును కలవడానికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా, రావెళ్ల సత్యంను, 1959 సంవత్సరంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చూడడం తటస్థించింది. ఆ తరువాత పరిచయం చేసుకున్నాను కొన్నాళ్లకు. ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకునే ప్రక్రియలో భాగంగా ప్రచారం కొరకు చుట్టుపక్కల గ్రామాలలో తిరుక్కుంటూ అక్కడకొచ్చారాయన. అప్పట్లో "జోడెద్దుల" కాంగ్రెస్ గుర్తుకు, "చేతి" గుర్తున్న కమ్యూనిస్టులకు మధ్యనే ప్రధాన పోటీ. అల నాడు ఆయన ప్రచారం చేసిన కమలాపురం గ్రామంలో, కమ్యూనిస్టు అభ్యర్థుల మీద పోటీ చేసిన బడా భూస్వాములకు సైతం ఒక్క టంటే ఒక్క ఓటు కూడా పడని వార్డులున్నాయంటే, అది రావెళ్ల సత్యం గొప్పదనంగానే భావించాలి.

1959 నాటికి స్వాతంత్ర్యం వచ్చి పన్నెండేళ్లు అయింది. ఐనా, ఓటర్ల జాబితాలో, మహాత్మా గాంధీ ఆశయమైన హరిజనోద్ధరణకు విరుద్ధంగా, దళితుల పేర్ల చివర "గాడు" చేర్చేవారు. "పుల్లిగాడు" సన్ ఆఫ్ "మల్లి గాడు" అని వుండడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ముఖ్యుడు రావెళ్ల సత్యం. బహుశా ఆయన లాంటి వారు చేసిన ఉద్యమ ఫలితంగానే, దరిమిలా పేర్ల చివర "గాడు" తగిలించడం మానుకుంది ప్రభుత్వం. రావెళ్ల సత్యం కృషి ఫలితంగా ఖమ్మం సమితి కింద వున్న అనేక గ్రామాలలో కమ్యూనిస్టు అభ్యర్థులు గెలుపొందడం, పంచాయితీ సమితిని పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది. అదనంగా మెరికలలాంటి కార్యకర్తలను కూడా తయారుచేయగలిగారాయన. ప్రగల్భాలను, దూషణ-భూషణలను, పదవీ వ్యామోహాలను, ధన దాహాలను దరికి రానీయని ఈ నిష్కళంక కమ్యూనిస్టు యోధుడు, పుచ్చలపల్లి సుందరయ్యకు ప్రియ శిష్యుడు.

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినేపల్లి గ్రామం సాయుధపోరాట కమ్యూనిస్టు వీరులకు, స్వాతంత్ర్య సమరయోధులకు పుట్టిల్లు. స్వర్గీయ మచ్చా వీరయ్య లాంటి కామ్రేడ్స్ నాయకత్వంలో ఆ గ్రామానికి చెందిన అనేకమంది కార్యకర్తలు వీర తెలంగాణ విప్లవ సాయుధ తిరుగుబాటులో పాల్గొని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా-రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. అలా పోరు సలిపినవారిలో రావెళ్ల సత్యం ఒకరు. వీర తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రపుటల్లో చిర స్థాయిగా నిలిచింది. నూనూగుమీసాల లేత వయసులోనే, వైవాహిక బంధాన్ని కూడా లెక్క చేయకుండా, వున్న ఒక్క చేతితో తుపాకి పట్టుకుని, బుల్లెట్లు సంధించిన థీశాలి రావెళ్ల. 1945-1946 మధ్య కాలంలో, ఉర్దూలో ప్రాధమిక విద్యాభ్యాసం ముగించుకున్న రావెళ్ల సత్యం, ఇతరులకు సహాయపడేందుకు, తన ఇంటి ఆవరణలోని పశువుల పాకలో ఒక పాఠశాలను నిర్వహించేవారు. చివరకు అదే కమ్యూనిస్టు పార్టీకి అడ్డగా మారింది. అలా ఆరంభమైన ఆయన కమ్యూనిస్టు జీవన యానం, 1945-1948 మధ్య కాలంలో, పొరుగునున్న కృష్ణా జిల్లా మలకాపురం సరిహద్దు కాంపుకు చేరుకుని, సమరయోధుడుగా శిక్షణ పొంది, పై కమిటీ ఆదేశాల మేరకు అజ్ఞాతవాసానికి పోయేటట్లు చేసింది. అజ్ఞాతంలో వుండగానే కృష్ణా జిల్లా సరిహద్దులో అరెస్టు కాబడి, మద్రాస్ రాష్ట్రంలోని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. జైల్లో, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, మోటూరు హనుమంతరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో కామ్రేడ్ రాయల వీరయ్య కూడా నిర్బంధంలో వుండేవారప్పుడు. కడలూరు జైలులో ఆయన నిర్బంధంలో వున్నప్పుడు, ఒకరోజు జైలులో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో, తోటి డిటెన్యూ రాయల వీరయ్య చేతి వేళ్లు తెగిపోయాయి. 1951 డిసెంబర్ నెలలో, మొదటి సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత, సహచర డిటెన్యూలతో పాటు రావెళ్ల కూడా విడుదలయ్యారు. జైలునుంచే ఆయన సరాసరి ఎన్నికల ప్రచార సమరంలోకి దూకారు. 

అప్పట్లో ద్విసభ్య నియోజక వర్గాల ఆనవాయితీ వుండేది. వాటిలో ఖమ్మం ఒకటి. ఆ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, సంచీ చేతబట్టుకుని, సుమారు రెండు నెలల పాటు, ఒంటరిగా తిరిగారు రావెళ్ల. ఇంకా అప్పటికి, ప్రభుత్వ నిర్భంద ఛాయలు ప్రజలను భీతావహులను చేస్తూనే వున్నాయి. పలువురింకా నిజాం జైళ్లలో మగ్గుతూనే వున్నారు. కొందరప్పటికీ, అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. వయోజనులకు అదే మొదటి ఓటింగ్. కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తల కొరత కొట్టొచ్చినట్లు కనబడేది. అన్ని లోటులనూ రావెళ్ల పూరించారు. తానే ఆన్నీ అయ్యారు. ఎన్నికల ఫలితాలలో విజయం పార్టీ పరమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఇంకా సడలించనందున, పి.డి.ఎఫ్ (పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్) పేరుతో, చేతి గుర్తుతో, ఖమ్మం ద్విసభ్య నియోజకవర్గం నుండి పోటీలోకి దిగిన కమ్యూనిస్టు అభ్యర్థులిద్దరూ గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా స్వర్గీయ నామవరపు పెద్దన్న, జనరల్ అభ్యర్థిగా కర్నాటి కృష్ణయ్య భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం, అనారోగ్యానికి గురైన రావెళ్ల సత్యం, హైదరాబాద్ ఎర్రగడ్డ క్షయ ఆసుపత్రిలో చేరి, స్వస్థత చేకూరగానే, ఖమ్మం చేరుకుని, పార్టీ పూర్తికాలం ఆర్గనైజర్‌గా పనిచేయడం ప్రారంభించారు. 1960 లో ఖమ్మం జిల్లా మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేసి సహకార ఉద్యమానికి పేరు-ప్రతిష్టలు తేవడమే కాకుండా, రైతుబాంధవుడని పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలం ఖమ్మం జిల్లా సహకార బాంక్ ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు. 1964 లో పార్టీ చీలిపోయినప్పుడు, సిపిఎం పక్షాన వుండి, ఆ సంవత్సరం మిగతా నాయకులతో పాటు నిర్బంధానికి గురై, 16 మాసాల పాటు హైదరాబాద్ సెంట్రల్ జైలు జీవితం గడిపారు. నాయకుల నిర్బంధాలతో కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలను ఆపలేమని భావించిన ప్రభుత్వం, అందరు డిటెన్యూలతో పాటు 1966 మే నెలలో రావెళ్ల సత్యంను కూడ విడుదల చేసింది. పార్టీ చీలిపోయినా, రావెళ్ల లాంటి వారి చొరవతో, పెద్దగా సిపిఎంకు నష్టం జరగలేదు. 1967 సాధారణ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఖమ్మం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచారు.

రావెళ్ల సత్యంకు ఏ పని అప్ప చెప్పినా కార్య దక్షతతో చక్కదిద్దేవారని పేరుండేది. కిచెన్ మేనేజ్‌మెంటులో కడు నేర్పరి. కడలూరు జైలులోను, హైదరాబాద్ సెంట్రల్ జైలులోను అదే డ్యూటీ ఇచ్చారాయనకు. సెంట్రల్ జైలులో రోజువారీ వంట సరుకులు-కూరగాయలు కొని తేవడం, దగ్గరుండి వండించి వడ్డించడం ఆయన చాలా పకడ్బందీగా నిర్వహించేవారని, అదే జైలులో డిటెన్యూగా వున్న ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమ నాయకుడు డాక్టర్ వై. రాధాకృష్ణ మూర్తి చెప్తుండేవారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి జిల్లా-రాష్ట్ర-అఖిల భారత పార్టీపరమైన మహాసభలకు వంటశాల నిర్వహణ బాధ్యత ఆయనకే అప్ప చెప్పేవారు. ప్రతి పైసాకి జమా ఖర్చులు రాసేవారు. ఎల్లవేళలా, పాకెట్ సైజు అకౌంటు పుస్తకం, చిన్న పెన్ను, ముతక చొక్కా పక్క జేబులో ఒక చైన్ కీ గడియారం ఆయన దగ్గరుండేవి. ముత్యాలలాంటి దస్తూరీతో అకౌంటు పుస్తకంలో ఎప్పటి లెక్కలప్పుడే రాసే అలవాటుండేది ఆయనకు. గ్రామాలలో తిరగని ప్రతి దినం, ఉదయాన్నే గోకినేపల్లి నుంచి బస్‍లో ఖమ్మం వచ్చి, పార్టీ పనులన్నీ చక్కదిద్దుకుని, తిరిగి రాత్రికి బస్సు ఎక్కి ఇంటికి చేరుకునేవారు. అలా ఒకరోజు ఇంటికెళ్తున్నప్పుడు, ఆదమరిచి వున్న సమయంలో ఎవరో ఆయన గడియారాన్ని తస్కరించారు. పరధ్యానానికి ఆమడ దూరంలో వుండే రావెళ్ల, ఆ రోజున, కేరళ కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ మరణించాడన్న తప్పుడు వార్త వినడంతో అలా అయిపోయారు. గడియారం పోయినందుకు చాలా మనోవేదనకు గురయ్యారు రావెళ్ల.

1964 సంవత్సరం నాటికి, రెండు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఒకవైపు స్థానిక సంస్థల కింద వుండే గ్రామ పంచాయితీలకు-సమితులకు మెరుగైన అధికారాలున్నప్పటికీ, రాజకీయపరమైన వివక్షలు-కక్షలు-కార్పణ్యాలు తీవ్రంగా వుండేవి. కాంగ్రెస్ గుప్పిట్లో వున్న ఖమ్మం పంచాయితీ సమితి పరిధిలోని గ్రామాలలో అనేక రకాల వేధింపులకు ప్రజలు గురవుతుండేవారు. గ్రామాలలో రైతు, కూలీల బ్రతుకులు దుర్భరంగా వుండేవి. దానికి తోడు అతివృష్టి, అనావృష్టి సమస్యలుండేవి. భూస్వాముల, ధనికుల ప్రత్యక్ష-పరోక్ష దోపిడీ కొనసాగేది. సరైన రహదారి సౌకర్యం వుండకపోయేది. విద్యుత్ సౌకర్యం వున్న గ్రామాలు ఏ ఒకటి-రెండో మాత్రమే. ఆ రోజులు నిజాం పాలనకు నకలంటే అతిశయోక్తి కాదేమో! ఆ నేపధ్యంలో రావెళ్ల సత్యం సారధ్యంలో, స్థానిక మార్క్సిస్టు నాయకులైన గండ్లూరి కిషన్‌రావు (సమితి మాజీ ఉపాధ్యక్షుడు), తాళ్లూరి వైకుంఠం, బాజి హనుమంతు (మాజీ ఎమ్మెల్యే), వనం నరసింగరావు (పాలేరు సహకార చక్కెర కర్మాగారం మాజీ అధ్యక్షుడు), చుట్టు పక్కల గ్రామాలలోని రైతు-కూలీ సమస్యలను అధ్యయనం చేయడం, సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడం మొదలైంది. వాస్తవానికి ఆ ప్రయత్నం ఎన్నో సత్ఫలితాలను ఇచ్చింది.

1968 లో సిపిఎం పార్టీపై నక్సలిజం ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్తంగా నక్సలిజం వూపందుకుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు, తీవ్రవాదంవైపు మొగ్గుచూపినవారికి, వ్యతిరేకించిన సిపిఎం వారికి మధ్య చర్చలు-వాదోపవాదాలు జరిగాయి. పుచ్చలపల్లి సుందరయ్య వాదనతో ప్రభావితుడైన రావెళ్ల సత్యం నాయకత్వంలో పనిచేస్తున్న గండ్లూరి, బాజి, వనం లాంటి వారంతా, నక్సలిజంవైపు ఆకర్షితులైన బత్తుల, బోసు, లింగాల లాంటి వారితో ఎవరి మార్గం వారే చూసుకుందాం అని చెప్పారు. వారిని పల్లెలు వదిలి తుపాకిలు పట్టమనితాము మాత్రం పల్లెల్లోనే వుండి ప్రజలను చైతన్య ఉద్యమాలవైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు. ఆ సంభాషణ అనంతరం అడవుల్లోకి వెళ్ళిన బత్తుల వెంకటేశ్వరరావు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పల్లెల్లోనే వుండిపోయిన ఇతరుల నాయకత్వంలో రైతు-కూలీ ఉద్యమాలు సాగాయి. ఆరణాల కూలీలు, అధిక వడ్డీలు, జెట్టీలు, తక్కువ మొత్తంలో పాలేర్ల వేతనాలు, మేరల పెంపు, కుల వివక్షతలకు వ్యతిరేకంగా రావెళ్ల సత్యం బృందం నాయకత్వంలో దళిత-వెనుకబడిన వర్గాల ఐక్య ఉద్యమం వూపందుకుంది. ప్రభుత్వ మాన్యాలు, బంచరాయి భూములు పేదల స్వాధీనమయ్యాయి. కూలీల శ్రమ దోపిడీ చిహ్నాలైన "పిచ్చ మానికలు", "కుండలు" ధ్వంసమయ్యాయి. భూస్వాముల భూములలో కలుపుకున్న మిగులు ప్రభుత్వ భూములు పేదల వశమయ్యాయి. వరి నాట్ల, జొన్న కోతల, వేరు శనగ పీకుడుకు ఇవ్వాల్సిన కూలీ రేట్లను ముఠా నాయకులే నిర్ణయించే స్థాయికి ఉద్యమం చేరుకుంది. చివరకు భూస్వాములు కొనుక్కునే పశువుల ఎరువు ఎక్కించాల్సిన "బండి జల్లల" కొలతలు కూడా కూలీలే నిర్ణయించడం మొదలైంది. అదో మహోద్యమం. ముదిగొండ మండలంలోని అన్ని గ్రామాలకు ఆ ఉద్యమం పాకింది. బలపడింది. సహజంగానే ధనిక రైతుల్లో వ్యతిరేకత మొదలైంది. రైతులను కలుపుకుపోయి ఉద్యమాన్ని బలోపేతం చేస్తే మంచిదన్న  రావెళ్ల సత్యం సూచనను కూలీలు అర్థం చేసుకోలేక పోయారు. దాంతో, ధనిక రైతులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం సమితి అధ్యక్షుడు సామినేని ఉపేంద్రయ్యను ఆశ్రయించారు. నాటి హోంమంత్రి జలగం వెంగళ్ రావు అనుయాయుడైన ఉపేంద్రయ్య అండతో రావెళ్ళ అనుచరులపై గ్రామ-గ్రామాన నిర్బంధ కాండ మొదలైంది. దానికి కేంద్రంగా బాణాపురం గ్రామాన్ని ఎంచుకున్నారు.

ముదిగొండ మండలం బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్‌రావు మీద ప్రారంభమైన పోలీసు దమన కాండ, చుట్టుపక్కల గ్రామాలైన పమ్మి, అమ్మ పేట, గంధసిరి, కమలాపురం గ్రామాలకు కూడా విస్తరించింది. పోలీసు క్యాంపులు పెట్టి మరీ కమ్యూనిస్టులను-సానుభూతిపరులను హింసించసాగారు. హత్యాకాండ కూడా మొదలైంది. లైసెన్సులు లేని తుపాకిల వాడకం కూడా వెలుగులోకి వచ్చింది. ఐనా, ప్రభుత్వం ఒక పక్షాన్నే సమర్థించడం కొనసాగింది. ముక్క చిన నర్సయ్య, గండ్ర వీరభద్రా రెడ్డి లాంటి నాయకులు హత్యకు గురయ్యారు. అంతా పోలీసులకు తెలిసే జరిగిందని అనుకునేవారు. ధనవంతులైన భూస్వాములకు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా, విచక్షణారహితంగా రావెళ్ల సత్యం నాయకత్వంలో పని చేస్తున్న కమ్యూనిస్టులందరి పైనా క్రిమినల్ కేసులు బనాయించేవారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాటిలో "బైండోవర్ కేసులు" వుండేవి. ఆ నేపధ్యంలో 1970 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీలో జలగం వెంగళ్ రావును వ్యతిరేకిస్తున్న మరో జిల్లా మంత్రి శీలం సిద్దారెడ్డి వర్గంతో సర్దుబాటు చేసుకున్న మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, రావెళ్ల సత్యం ప్రాంతమైన గోకినేపల్లి ఫిర్కాలో అత్యధిక స్థానాలు సంపాదించి తిరిగి ఖమ్మం సమితిని చేజిక్కించుకుంది. దురదృష్టవశాత్తు సమితి అధ్యక్షుడుగా కావాల్సిన రావెళ్ల సత్యంను, కో-ఆప్షన్ సభ్యుడుగా ఎన్నికవకుండా, పార్టీకి చెందిన కొందరు కుట్ర పన్నడంతో ఆయన ఓడిపోయారు. ఆయన స్థానంలో రాయల వీరయ్యను అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్‌రావును ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. 1982 సంవత్సరానికల్లా ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పెనుమార్పులు సంభవించాయి. వామపక్షాల మధ్య ఒడంబడిక కుదిరింది. ఖమ్మం సమితికి సిపిఎం, పక్కనే వున్న తిరుమలాయపాలెం సమితికి సిపిఐ అభ్యర్థులు పోటీచేశారు. ఖమ్మం సమితి అధ్యక్షుడుగా రావెళ్ల సత్యం ఎన్నికయ్యారు. సమితి అధ్యక్షుడుగా ఆయన సేవలు చిరస్మరణీయం. అటెండర్ దగ్గర నుంచి, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వరకు సత్యం సలహాలకు విలువిచ్చేవారు.

జనవరి 1927 లో గోకినేపల్లి గ్రామంలో జన్మించిన రావెళ్ల సత్యం ఫిబ్రవరి 2, 1985 న గుండె జబ్బుతో అరవై సంవత్సరాలన్నా నిండకుండానే మరణించారు. వాస్తవానికి రావెళ్ల సత్యంను 1985 లో జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. విధి వక్రించి ఆయన మరణించడంతో అది నెరవేరలేదు. ఆయనే కనుక బ్రతికుండి పోటీచేసి గెలిచినట్లయితే, జిల్లాలో సిపిఎం పతాకాన్ని ఎంతో సమున్నత స్థానానికి తీసుకెళ్తేవారు. అది జరగకపోగా, అలనాటి ఆయన సహచరులంతా పార్టీనుండి బహిష్కృతులై సిపిఎం పడుతున్న కష్టాలను బయట నుంచే బాధతో గమనిస్తున్నారు. 

Saturday, November 5, 2011

పౌరహక్కులను హరించి వేసేందుకు నాంది పలికిన ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు

ఈ అరెస్టులు సూచిస్తున్నదేమిటి?

ఆంధ్ర జ్యోతి దినపత్రిక (8-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానంకు చెందిన ఒక్కో కాంగ్రెస్ నాయకుడు ఒకరోజొక మాట, మర్నాడొక మాట, ఒకదానికి మరొకటి పొంతన లేకుండా మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒకానొక రోజుల్లో, రాజకీయ పార్టీల నాయకులు, "స్పష్టత" తో మాట్లాడడమే విశ్వసనీయతకు గీటు రాయిగా భావించేవారు. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నేపధ్యంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేది లేదని (ఆమె నిర్ణయం మనకు నచ్చినా నచ్చకపోయినా) స్పష్టంగా తేల్చి చెప్పింది ఇందిరాగాంధి. ఈ రోజుల్లో, ఎంత "అస్పష్టత" వుంటే అంత విశ్వసనీయత అనుకుంటున్నారు (ముఖ్యంగా కాంగ్రెస్) రాజకీయ నాయకులు. ఆరంభంనుంచీ నేటి వరకూ ఒక్క మాట మీద నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే, ఏ రాజకీయ పార్టీలో కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పష్టత అనేది నూటికి నూరుపాళ్లు వుందా అని ప్రశ్నిస్తే "లేదు" అనే సమాధానమే వస్తుంది. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలని నినాదమిచ్చిన భారతీయ జనతా పార్టీకి "ఇచ్చే స్థితి లో వున్నప్పుడు స్పష్టమైన విధానం కొరవడినందున, "అడిగే స్థాయి" కి వచ్చిందాకా "స్పష్టత" రాలేదు. ఇక కమ్యూనిస్టులలో సగం మందికి ఒక రకమైన అస్పష్టత వుంటే, ఇంకో సగం మందికి వేరే విధమైన అస్పష్టత. అలానే మిగతా పార్టీలు కూడా.

డిసెంబర్ తొమ్మిది (2009) న చెప్పిన మాట మార్చిన "కాంగ్రెస్ పార్టీ-యూపీఏ కేంద్ర మంత్రి" చిదంబరం, బక్రీద్ తరువాత తెలంగాణపై ప్రకటన చేస్తామని చెప్పి రోజన్న తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై "పిడి" ని ప్రయోగించింది. ఇది శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని అమలు చేయడానికా? ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాడుతున్నవారిని అణగదొక్కే చర్యలకు శ్రీకారం చుట్టడానికా? ఇవేవీ కాకపోతే టిఆర్ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యుడిని అర్థ రాత్రి దాటిన తర్వాత పిడి చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన ఆగత్యం ఏమిటి? అరెస్టు చేయబడిన వ్యక్తికి గతంలో మావోయిస్టు కార్యకర్తలతో సంబంధాలు వుండవచ్చు. జనశక్తి, మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని వుండవచ్చు. కానిప్పుడు అందరిమధ్యా, ప్రజాస్వామ్య ఉద్యమాల మధ్యా వుంటూ, గుర్తింపు పొందిన ఒక ప్రాముఖ్య తెలంగాణ రాజకీయ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్నాడే! అంటే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై పిడి చట్టం ప్రయోగించడం, పౌరహక్కులను ఉల్లంఘించడం మొదలైందనుకోవాలా?

ఇలా పౌరహక్కులను అణచి వేయడం గమనిస్తుంటే, గతం గుర్తుకొస్తోంది. భారత చైనా యుద్ధం నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ చీలిపోవడం, పిడి చట్టం కింద చైనా వాదులుగా ముద్రపడిన సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు వేయి మందికి పైగా, అర్థరాత్రి అరెస్ట్ కావడం జరిగింది. అలనాటి కేంద్ర హోం శాఖ మంత్రి గుల్జారిలాల్ నందా పిడి చట్టానికి రూపకర్తంటారు. ఏదేమైనా అప్పుడు అరెస్టు కాబడింది కమ్యూనిస్టులే కాబట్టి, అందునా అతివాద గ్రూపుకు చెందిన (ఇంకా నక్సల్‍బరీ ఉద్యమం రాలేదు) వారు కాబట్టి, పిడి చట్టాన్ని కాని, అరెస్టులను కాని ఖండించిన రాజకీయ పార్టీలు ఒక్కటీ కూడా లేవు. చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలమీద ఉపయోగించలేదన్న సంతృప్తితో వున్నారు వారంతా!

దశాబ్దంన్నర తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దరిమిలా, అన్ని రాజకీయ పార్టీలకు అరెస్టులు స్వానుభవంలోకొచ్చ్చాయి. అప్పుడు గుర్తుకువచ్చింది వారందరికీ. భారత చైనా యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న సిపిఎం నాయకుల అరెస్టును అప్పుడే ఖండించి వుంటే, తమకీ గతి పట్టి వుండేది కాదని! వాస్తవానికి, ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐపై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, ఖమ్మం జిల్లాకు చెందిన అలనాటి పౌరహక్కుల ఉద్యమ ఆద్యులు-"మేధావి త్రయం" గా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు కె.వి.సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణలు చెప్పారు. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించినా, ఇతరులు తమకెందుకులే అని నిర్లిప్తతతో వున్నారు. ఆ నిర్లిప్తత పర్యవసానమే ఎమర్జెన్సీ అరెస్టులు, ఈనాటి తెలంగాణ ఉద్యమ నేతల పిడి అరెస్టులు.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు ("పిడి", "మీసా", "ఎస్మా" లాంటివి) ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో (ఇప్పుడు ఎమర్జెన్సీ కాకపోయినా-తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో) పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జెళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లోనే ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డి. యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఐతే ఎన్ని రకాల పౌరహక్కుల సంఘాలు ఆవిర్భవించినా, ఎన్ని ఉద్యమాలు నడిచినా, జరిగే నష్టం జరుగుతూనే వుంది. పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుందనీ, భవిష్యత్‍లో జరగదన్న నమ్మకం లేదనీ, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే అభిప్రాయపడిందంటే అంతకంటే ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంటుంది? కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే(సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ ఏడాది, జనవరి 2011 మొదటి వారంలో, ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో, అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం . 1976 లో, ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి (ఇందిరాగాంధీ) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009 , ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రికరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. జబల్పూర్ అదనపు మెజిస్ట్రేట్-శివ కాంత్ శుక్లాల హెబియస్ కార్పస్ కేసు సుప్రీం కోర్టు ముందుకు విచారణకొచ్చింది. తీర్పిచ్చిన ఐదుగురిలో, నలుగురు న్యాయమూర్తులు ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. అదే జరిగిందిప్పుడు.

ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.

అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ నాడు, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యమకారులతో సహా ఎవరి పౌరహక్కుల ఉల్లంఘన జరగడానికి వీలులేదని ఘంటాపథంగా నొక్కి చెప్పాలి. అరెస్టులు ఇంతటితో ఆగిపోవాలి. అరెస్టు ఐన వారి పౌరహక్కులు తక్షణమే పునరుద్ధరించబడాలి.

తెలంగాణ-సమైక్యాంధ్ర అన్న విషయాన్ని కాసే పన్నా మరిచిపోయి, పౌరహక్కుల ఉల్లంఘన జరిగిందని ఎలుగెత్తి చాటడమే మేధావుల (ఆంధ్రా మేధావులతో సహా) కనీస కర్తవ్యం. పౌరహక్కుల కొరకు పోరాడే మీడియా కనీస ధర్మం. End