Showing posts with label సకల జనుల సమ్మె. Show all posts
Showing posts with label సకల జనుల సమ్మె. Show all posts

Monday, October 24, 2011

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?: వనం జ్వాలా నరసింహా రావు

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

(నమస్తే తెలంగాణ: 25-10-2011)

వనం జ్వాలా నరసింహా రావు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో, నూతనోత్సాహంతో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, నాటి నుంచి నేటి వరకు, పూర్తిగా అహింసాయుత మార్గంలో, ఆబాలగోపాలం తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో అంచలంచలుగా ఉదృతమై, ఊపందుకుంటున్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర పాలక పక్షాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ, ఆ మాటకొస్తే ఏ నియంతృత్వ దేశంలోనూ జరిగుండదు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రాంతంలోని ప్రజల-ఓటర్ల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకంటే ఎక్కువ వున్నప్పటికీ, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు, తెలంగాణకు మద్దతిచ్చే నాయకులను కలుపుకు పోవాలన్న వ్యూహంతో, 2004 ఎన్నికలలో రాష్ట్ర ఏర్పాటును తప్పక వ్యతిరేకిస్తాడని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి నాయకత్వాన (రాష్ట్రంలో) వున్న కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ అధిష్టానాన్ని నమ్మారు. కేంద్రంలో మంత్రి పదవిని అంగీకరించారు. నమ్మక ద్రోహం జరిగిందాకా పదవిలో కొనసాగారు. తాను పదవీ త్యాగం చేశారు. తన ఎమ్మెల్యేలతోను, రాష్ట్ర మంత్రులతోను రాజీనామాలు చేయించారు. ఇటు తెలంగాణ ప్రజలకు, అటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఏలుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి తన, తన పార్టీ వాళ్ల నిబద్ధతను ఎరుక పరిచారు. ఏం చేసినా ఆయననుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించలేక పోయారు. ఆయన ఎంపీ పదవికి ఎన్నిసార్లు రాజీనామా చేసి, మళ్లీ గెలిచినా, ఎవరికీ కనువిప్పు కాలేదు. తెలంగాణ ఏర్పాటు కాలేదు.

మళ్లీ ఎన్నిక లొచ్చే దాకా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, కాశీ-రామేశ్వరం మజిలీ కథలాగా కాసేపు, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందాన మరి కాసేపు సాగింది. తెలంగాణ వచ్చినా, రాకపోయినా, కనీసం కాంగ్రెస్ లోని తెలంగాణ వాదులకు కనువిప్పు కలగడానికి కెసిఆర్ వ్యూహం ఫలించిందనవచ్చు. 2009 ఎన్నికలలో, తెలుగు దేశంతో (మహా కూటమితో) మరో రకమైన వ్యూహాత్మకంగా చేతులు కలిపారు కెసిఆర్. సీట్లెన్ని వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే, ఈ సారి, తెలంగాణ తెలుగుదేశం వారిలో చలనం కలిగింది. పైకి చంద్రబాబు నాయుడి మాటలకు వంతపాడినా, టిడిపి తెలంగాణ వాదుల్లో కొంతలో కొంతైనా జ్ఞానోదయం కలిగిందనక తప్పదు. ఎన్నికలలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మళ్లీ కనుమరుగైంది. మరో ఉద్యమానికి తెర లేపక తప్పని పరిస్థితులు దరిమిలా కలిగాయి.

టిడిపి లోని తెలంగాణ మద్దతు దారులతో సహా, బిజెపి, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా ఉద్యమంలో దూకాయి. మరికొన్ని భావ సారూప్యతగల పార్టీలూ పుట్టుకొచ్చాయి. ఉద్యమించాయి. ఐనా తెలంగాణ రాలేదు. కెసిఆర్ ప్రయత్నాలు, ఆయనదైన శైలితో ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఇంతలో రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఆయన స్థానంలో పైకి తటస్థంగా, లోపల సమైక్యానికి అనుకూలంగా, దేని కీ ఇదమిద్ధంగా మద్దతు తెలియ చేయలేని రోశయ్య ముఖ్య మంత్రి అయ్యారు. మళ్లీ తెలంగాణ కథ మొదటికొచ్చింది. అస్థిర ప్రభుత్వం పాలనలో, కెసిఆర్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. నవంబర్ 2009 లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి రాక తప్పని పరిస్థితులొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్నట్లు చిదంబరంతో (కపట) ప్రకటన చేయించింది కేంద్ర ప్రభుత్వం. దీక్ష విరమించారు కెసిఆర్. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల బెదిరింపు రాజీనామాలు మొదలయ్యాయి. (అన్ని పార్టీలకు చెందిన) తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. మళ్లీ చిదంబరం మరో ప్రకటన. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (ఇద్దరు మినహా) ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే అంగీకరించబడ్డాయి. మరో ఆలశ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో, వస్తుందనుకున్న తెలంగాణ, ఎప్పుడో ఒకప్పుడు రాకపోతోందా అన్న మజిలీకి చేరుకుంది. ఓపికతో కమిటీ ప్రక్రియను స్వాగతించారు తెలంగాణ కోరుకునేవారు కూడా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

తెలంగాణాకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనుకున్న శ్రీకృష్ణ కమిటీ, గోడమీద పిల్లి వాటంగా, ఏమీ చెప్పకుండా దాటవేసింది. అది సేకరించిన సాక్ష్యాధారాలు నిబద్ధతతో పరిశీలించినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి వుండేది. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో కూడా తెలంగాణ రాలేదు. వస్తుందన్న నమ్మకం కలిగే విధంగా కేంద్రంలో ఈ వ్యవహారాన్ని ఒక "పార్ట్ టైమ్ జాబ్" లాగా చూస్తున్న చిదంబరం, అఖిల పక్షం సమావేశం అంటూ కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయసాగాడు. ఎన్నడో వేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ అసలా సంగతే మర్చిపోయింది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పర్యవసానంగా, రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి పీఠాన్ని అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కను చూపు మేరలో లేకుండా పోయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కూడా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రాంత ప్రభుత్వోద్యోగులు సమ్మె చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఏవో కొన్ని హామీలు ఇచ్చి అప్పట్లో సమ్మెను విరమింప చేసింది ప్రభుత్వం. మిల్లీనియం మార్చ్ కూడా రాష్ట్ర సాధన దిశగా ఫలితం కలగలేదు. ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, ఆత్మ హత్యలు, ఉద్రిక్తతలు ఎన్ని చోటుచేసుకున్నా తెలంగాణ రాలేదు.

కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా-బింకంగా-మొండి ధైర్యంతో గమనిస్తోందే కాని, నిర్ణయం తీసుకోవడంలో మాత్రం పురోగతి కనిపించలేదు. రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల మంది శాసన సభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రావు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. పార్టీలకు అతీతంగా-లాయల్టీలకు అతీతంగా, రాజీనామా చేసిన వారున్నారు. కాంగ్రెస్ వారిలో, అందరి కంటే ముందే రాజీనామా చేసింది జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ. ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో, రాజకీయ-రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే దిశగా, వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల, వాటి ఆమోదం అంత కష్టం కాకూడదనుకున్న ఎమ్మెల్యేలకు ఆశాభంగమే మిగిలింది. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

సమష్ఠి బాధ్యతా రాహిత్యం, సమన్వయ లోపం, అసమర్థ నాయకత్వంతో, పీకల లోతుకు మునిగి పోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్ ప్రభుత్వం దాని సారధి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఏ విషయంలోను ఒక విధానం అంటూ లేకుండా, ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకుండా ఇలా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నాయకత్వానికి, విధాన పరంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి, కీలకమైన విషయాలలో తమ విధానం ఇదంటూ పాలక పార్టీ ప్రకటించ లేక పోవడానికి, ప్రతి పక్ష పార్టీల సూచనలు-సలహాలు పాటించక పోవడానికి, వందల ఉదాహరణలు పేర్కొనవచ్చు. మధ్యలో ఏకాభిప్రాయమంటూ మరో వాదన లేవదీసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమస్యను, తన రాజకీయ అవసరాల కొరకు, చంద్రబాబు నాయుడి ఆధిపత్యాన్ని, పలుకుబడిని ఎదుర్కొని, ఎన్నికలలో విజయం సాధించడానికి, 2004 ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని గులాం నబీ ఆజాదులు, చిదంబరాలు, ప్రణబ్ ముఖర్జీలు, వారి అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మరిచిపోయారో? ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా వున్న అభిప్రాయం కలిగించారు ఇటువంటి చిదంబరాలు, ఆజాదులు. ఆనాడు ఏకాభిప్రాయంతోనే ఆ పని చేశారా? ఆ నాడు సీమాంధ్ర నాయకులను సంప్రదించే ఆ పని చేశాడా చిదంబరం, ఆజాద్? అప్పుడు గుర్తుకురాని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకు గుర్తుకు రావాలి? తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదిక్కడ ముఖ్యం. మాట మార్చే అలవాటే చిదంబరం నైజం అనడం ఇక్కడ ప్రధానం.

పోనీ, యుపిఎ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు ఏకాభిప్రాయం గుర్తుకు రాలేదా చిదంబరానికి? డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేయడానికి ముందర కాని, దరిమిలా చేసిన ప్రకటనప్పుడు కాని ఏకాభిప్రాయం మంచిదన్న భావనే కలగలేదా? వాస్తవానికి, డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు జరిగింది అన్ని పార్టీల ఏకాభిప్రాయం కాదా? ఒకనాడు శాసన సభలో చేసిన తీర్మానం ఏకాభిప్రాయం కాదా? ఒక రాష్ట్రంలోని ఒకటికి మించిన ప్రాంతాల ప్రజలు-ప్రజా ప్రతినిధులు నిలువుగా-అడ్డంగా-ఏటవాలు గా చీలిపోయినప్పుడు, ఎవరి సిద్ధాంతంతో వారు పట్టుదలగా వున్నప్పుడు, ఏకాభిప్రాయం నెపంతో, వారి మధ్య వైషమ్యాలు పెంపొందించడం కేవలం మాట మార్చేవారికి మాత్రమే సాధ్యపడుతుందని అనక తప్పదు. దొంగ... ఎదుటివారిని "దొంగ..దొంగా" అని అరిచి, తన దొంగతనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లే, తన పార్టీ మధ్యనే ఏకాభిప్రాయం సాధించలేని చిదంబరం, తెలుగుదేశం పార్టీని, దాని నాయకుడు చంద్రబాబు నాయుడునీ తప్పుబట్టడం మరీ హాస్యాస్పదం. ముందు తన తప్పు ఒప్పుకుని, ఇతరులు తప్పు చేశారంటే అర్థముంటుంది కాని, ఇతరులది తప్పు-తనది ఒప్పు అనడం ఎంతవరకు భావ్యం? ఇరు ప్రాంతాల వారికి వీలై నన్ని తక్కువ అభ్యంతరాలతో సమస్యను పరిష్కరించాలి తప్ప, ఏకాభిప్రాయం పేరుతో, దీర్ఘకాలికంగా వాయిదా వేసుకుంటూ పోతే, దొరికే ది పరిష్కారం కాదు కదా...మరిన్ని సమస్యల తోరణాలు మాత్రమే!

ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెతో నన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదా అన్న ధీమాతో, ప్రపంచ చరిత్రలో ఎవరూ కనీ-వినీ ఊహించని రీతిలో, ఉద్యమించారు తెలంగాణ ప్రజలు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమ్మెతో ప్రభుత్వానికి దిమ్మ తిరిగిందే కాని అసలు సమస్యను పరిష్కరించాలన్న ఇంగిత జ్ఞానం మాత్రం కలగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఏ సకల (తెలంగాణ) జనులకొరకు తాము ఇబ్బందులకు గురైనా సమ్మెకు దిగారో, ఆ సకల జనులే ఇబ్బందుల పాలవుతుంటే, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, పాఠశాలల-కాలేజీల సిబ్బంది సమ్మెను విరమించుకున్నారు (వాయిదా వేసుకున్నారు). రైలు రోకోలు, సార్వత్రిక బందులు ఏవీ కూడా ప్రభుత్వంలో చలనం తెప్పించలేక పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! ఈ నేపధ్యంలో, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవడానికి తెరాస అధినేత కేసీఆర్, మరో పర్యాయం ఆమరణ నిరాహారదీక్షకు దిగవచ్చనే వార్తలు కూడా వచ్చాయి.

ఇంకేం చేస్తే తెలంగాణ వస్తుంది? తెలంగాణ ప్రజలంతా ప్రతిరోజూ, ఏదో ఒక నిర్ణీత సమయాన, ఎవరింటి ముందర వారు వీధుల్లోకి వచ్చి ముక్త కంఠంతో ఢిల్లీ దాకా వినిపించేటట్లు తెలంగాణ ఏర్పాటు కావాలని నినాదాలు చేయాల్నా? ప్రతి తెలంగాణ వాది తన వంతు విరాళంగా నెలకు కనీసం ఒక్క రూపాయన్నా ఇచ్చి నెలకింత అని (నాలుగైదు కోట్ల రూపాయలు?) తెలంగాణ ఇచ్చిందాకా అధిష్టానానికి అధికారికంగా "ముడుపు" చెల్లించాల్నా? ప్రతివారం కనీసం కొన్ని లక్షల సంఖ్యలో ఒక్కో తెలంగాణ వాది దగ్గర నుంచి ఓ కార్డు ముక్క సోనియా గాంధీకి పోస్టు చేద్దామా? పోనీ ఇలాంటివే ఇంకేమన్నా మార్గాలు వెదుకుదామా?

కాదూ కూడదంటే సీమాంధ్ర ప్రభుత్వాన్ని బహిష్కరించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని మనం ఏలు కుందాం.

Thursday, September 29, 2011

ఉద్యమానికి ఊతం ప్రభుత్వ నిర్లిప్తత: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దినపత్రిక (30-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఉద్యమంలో అవాంఛనీయ ఘటనలు, చేయి దాటిపోతున్న పరిస్థితులు, ప్రత్యేక- సమైక్య వ్యూహ ప్రతి వ్యూహాలు, అటూ ఇటూ మాటల తూటాలు, సమస్య పరిష్కారం ఎవరికి సాధ్యం? – ఎడిటర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! వారిలో కొందరు మనసా వాచా తెలుగు వారందరూ సమైక్యంగా వుండాలని కోరుకునే "విశాలాంధ్ర" సిద్ధాంతానానికి కట్టుబడి వున్నవారు. వారలా భావించడంలో తప్పు లేదు. వచ్చిన చిక్కల్లా రాజకీయాలకు సీమాంధ్ర ప్రాంతం, వ్యాపారాలకు తెలంగాణ ప్రాంతం-అందునా హైదరాబాద్ తో అవసరం వున్న స్వార్థపరులతోనే! వారిలో కనీసం ఒకరిద్దరికి, కేంద్రంలో అధికారంలో వున్న కీలకమైన వారో, లేక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలు తెలుసుకునే అవకాశమున్న వ్యక్తులో, లేక, వారి సొంత నిఘా విభాగమో కాని, తెలంగాణ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయన్న సమాచారం తక్షణమే చేరుతుంది. అసలు కేంద్రానికి ఆ ఆలోచన వుంటుందో లేదో కాని, వుందన్న సంగతి మాత్రం బయటకొస్తుంది. అంతే, అప్పటివరకూ, తమ తమ వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతుండే ఆ నాయకులు, సమైక్యాంధ్ర నినాదంతో రంకెలేయడం ప్రారంభమవుతుంది. కలిసున్నా- విడిపోయినా, స్నేహంగా-కలిసున్న రోజులు కలకాలం గుర్తుండేలా భావించే సీమాంధ్రులకు కాని, తెలంగాణ వారికి కాని ఇలాంటి ఆలోచనలు రావు. అందుకే-ఇందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఉద్యమం. ప్రభుత్వం నిర్లిప్తతతో ఉద్వేగమవుతున్న ఆ ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నది ఇలాంటి స్వార్థపరులే.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన సకల జనుల సమ్మె పదిహేడవ రోజుకు చేరింది. శాంతి యుతంగా మొదలైన ఉద్యమం, అందులో పాల్గొంటున్న ఉద్యమకారుల ప్రమేయం లేకుండానే, క్రమక్రమంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలా జరగడానికి అవకాశం కలిగే ఒకటి రెండు సంఘటనలు గత వారం చోటు చేసుకోవడంతో, రోజురోజుకు పరిస్థితి చేయి దాటి పోతోంది. ఎలాంటి ఉప్పు-ఎక్కడనుంచి అందిందో కాని, ఇటీవల కొంత కాలంగా, ప్రశాంతంగా వుంటున్న లగడపాటి లోని సమైక్యాంధ్ర ఆకాంక్ష మరొక్క సారి బయటకొచ్చింది. ఉధృతంగా సాగుతున్న సకల జనుల సమ్మె నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కావాలని సృష్టించారో - లేక కాకతాళీయంగా జరిగిందో కాని, ఆయన చేసిన హడావిడి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మరింత ప్రేరణను ఇచ్చిందనాలి. రాజకీయ విశ్లేషకులు మాత్రం లగడపాటి రాజగోపాల్, హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రావడం వెనుక కొంత వ్యూహ రచన వుందనే అంటున్నారు. తనది కేవలం సమైక్యాంధ్ర నినాదమే కాదని, తెలంగాణ ఉద్యమంలో, ఆయన దృష్టిలో సీమాంధ్రులకెవరికైనా అన్యాయం జరిగితే, వారికి తన అండదండలు వుంటాయన్న మరో నినాదాన్ని ఆర్టీఏ ఆఫీసుకు పోవడం ద్వారా చెప్పకనే చెప్పారు. పనిలో పనిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేసే ఆలోచన కూడా వున్న విషయం ఆ విధంగా బయట పెట్టారు. సరే ఆయనను అరెస్ట్ చేయడంతో పోలీసులు అగ్నికి ఆజ్యం అన్ని వైపులనుంచీ పోశారనవచ్చు. హెచ్చరికలు-ప్రతి హెచ్చరికలు పార్లమెంటరీ భాషకు అతీతంగా సాగాయి. ఎవరూ వెనుకకు తగ్గలేదు. అరెస్టయిన లగడపాటిని విడుదల చేసినా, పంపించే వరకూ, వెళ్లకపోవడం విశేషం.

లగడపాటి రంగ ప్రవేశం తెలుసుకున్న తెలంగాణ వాదులు ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్ర బిందువుగా కదన రంగంలోకి దిగారు. ఆయనతో పాటు, ఎంపీ మధు యాష్కీ, ఎమ్మెల్యే విష్ణు, స్వామి గౌడ్, బీజేపీ నేత విద్యాసాగరరావు తదితరులు లగడపాటి చర్యను ఖండించడంతో పాటు, ఆర్టీఏ అధికారిని నిలదీశారు. కమిషనర్ గదిలోకెళ్లి ఆయన్ని ఘెరావ్ చేశారు. సంఘటనల్లో హరీష్ రావు చొక్కా చినిగింది. స్వామి గౌడ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఉద్యమం ఉద్వేగమైంది. ఐనా, ప్రభుత్వ నిర్లిప్తత నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. తెలంగాణ ఎన్ జీవోల నాయకుడు స్వామి గౌడ్ పై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మరుసటి రోజున ఆందోళనను ఉదృతం చేయడానికి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి, తెలంగాణ వాదులు సిద్ధమయ్యారు.

ఇంతలో వింతైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మధ్యే మార్గమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధిష్టానం ఆంతరంగికుల ద్వారా బయట పెట్టింది. మరో వైపు ఆ వార్తలను తనకు అనుకూలంగా, తెలంగాణ ఉద్యమానికి ఆసరాగా మలచుకోవడానికి, తన రాజీలేని పోరాటాన్ని మాటల తూటాల ద్వారా కొనసాగిస్తున్నారు తెరాస అధినేత చంద్రశేఖర రావు. "ఆరు నూరైనా, తలకాయ తెగిపడినా సరే హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేది లేదని", హైదరాబాద్ తో కూడిన తెలంగాణాయే కావాలని స్పష్టం చేశారు. 60 ఏళ్లుగా తెలంగాణ కోసం చేస్తున్న పోరాటంలో "ప్రాణాలర్పించైనా తెలంగాణ తీసుకు వస్తానని" కేసీఆర్ అనడం లగడపాటి లాంటి వారి వ్యూహాలకు పటిష్టమైన ప్రయోగాత్మక ప్రతి వ్యూహమే! వాస్తవానికి రెండు-మూడు రోజుల క్రితమే, సమాచారం వుండి అన్నారో, లేక, యాదృచ్ఛికంగా అన్నారో కాని, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆ అర్థం స్ఫురించే రీతిలోనే మాట్లాడారు. అంతో-ఇంతో తేడాతో రక్షణ మంత్రి ఆంటోనీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఆంతరంగం కూడా అలానే వుంది. ఏ మధ్యే మార్గమైనా, హైదరాబాద్ తో కలిసిన తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా నిర్ణయం దిశగా లేకపోతే, నాయకులకు అంగీకారమవుతుందేమో కాని, తెలంగాణ ప్రజలకు అవుతుందా? మధ్యే మార్గం సూచించడానికి గులాం నబీ ఆజాద్ చెపుతున్న ఒకే ఒక కారణం, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని పక్షాలను ఒప్పించడం మాత్రమే! రేపు ఒక పక్షం వారు, సమైక్యాంధ్ర తప్ప ఇంకేమీ వద్దంటే, గులాం నబీ ఆజాద్ అదే మధ్యే మార్గం అంటే తెలంగాణ వారు అంగీకరించాలా? ఇలాంటి వాదనలు చేస్తూనే, అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మభ్య పెటుతున్నది చాలక మళ్లీ ఇప్పుడు మధ్యే మార్గం అన్న కొత్త నినాదంతో రావడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే!

ఈ నేపధ్యంలో ఇటీవల బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న రాజకీయ నాయకుల మాటలు కొన్ని జుగుప్సాకరంగా, బాధాకరంగా, వింతగా వున్నాయనక తప్పదు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన కార్యాలయంలోనే పట్టుకుని, "మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కాని, సీమాంధ్రకు కాదు" అని ఒక ఎంపీ (పొన్నం ప్రభాకర్) అనడంతో ప్రారంభమైన ఈ మాటలు రోజురోజుకూ జోరందుకుంటున్నాయి. ముఖ్య మంత్రి తనను-తన పార్టీకి చెందిన ఎంపీనే అలా అనడానికి అవకాశం ఇచ్చి వుండాల్సింది కాదు. ఆ ఎంపీ అలా అనడానికి కారణం కూడా ఆయనే చెప్పారు. సకల జనుల సమ్మె ప్రభావం లేదని ముఖ్య మంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఆయన ఆరోపణ చేశారు. అంతేకాకుండా, ఆయన సీఎం ఎలా అయ్యారో (తప్పుడు నివేదికలిచ్చి) అన్న విషయంలో కూడా కిరణ్ కు నచ్చని విధంగా వ్యాఖ్యలు చేశారు (ఆయన దృష్టిలో సమంజసం కావచ్చు). ఆ వాదన అంతటితో ఆగిపోతే బాగుండేదేమో!"వాట్ నాన్‌సెన్స్ యూ ఆర్ టాకిం గ్?" అంటూ సీఎం ఫైర్ అయ్యారు. వెంటనే మరో కాంగ్రెస్ ఎంపీ వివేక్ తీవ్రంగా స్పందిస్తూ, "ఒక ఎంపీని నాన్‌సెన్స్ అంటారా?" అనడం, చివరకు అంతా సర్దుకుపోవడం జరిగింది. ఈ మాటలన్నీ బయట సీఎంను ఆ రోజు కలవడానికి వచ్చిన వారంతా (మంత్రులతో సహా) వినినట్లు మర్నాడు పత్రికల్లో వార్తలొచ్చాయి. ఏదో సామెత చెప్పినట్లు "మొగుడు కొట్టినందుకు కాదు...ఆడ బిడ్డ నవ్వినందుకు" అన్న చందాన వుందీ వ్యవహారమంతా. ఒక ముఖ్య మంత్రి సహనం కోల్పోవడం ఎంత భావ్యం కాదో, ఆయన సహనాన్ని పరీక్షించడం కూడా అంత మంచిది కాదు. గతంలో 1968-1969 వేర్పాటువాద ఉద్యమాలలో, అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకంగా ఎంత ఘాటైన పదాలు వాడ బడ్డాయో చరిత్ర తెలిసిన వారందరికీ జ్ఞాపకం వుండే వుంటుంది.

"తెలంగాణ తేలేమని అనుకున్న రోజున ఆత్మహత్య చేసుకొని చస్తాం" అని భావోద్వేగంతో రాజ్యసభ సభ్యుడు కేశవరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవకు చెందినవే. ఎంత మనస్థాపానికి గురైతే అలా అన్నారో గమనించాల్సిన విషయం. అంతటితో ఆగకుండా "అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధం" అని కూడా అన్నారు. అదే సమయంలో మరో మారు పొన్నం ప్రభాకర్ "సీఎం కావడానికి ఏయే రిపోర్టులు కేంద్రానికి పంపించారో చెబితే అదే దారిలో తెలంగాణ తెచ్చుకుంటాం" అంటూ ముఖ్యమంత్రికి మరో మారు సవాలు విసిరారు. అదే క్రమంలో సకల జనుల సమ్మె ప్రభావంతో కలిగిన కరెంటు కష్టాలను అధిగమించాలన్న ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలకు జైపాల్ రెడ్డి అడ్డుతగిలారన్న భావన కిరణ్ కుమార్ రెడ్డికి కలిగింది. సహజంగానే ఆయనకు కోపం వచ్చింది పాపం. దరిమిలా ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రికీ మధ్య వివాదం రాజుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సీఎంకు దూరం మరింత పెంచింది. "సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిపి వేయించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, గ్యాస్ కావాలని తాను కేంద్రం సహాయం కోరితే, జైపాల్ రెడ్డితో ఇవ్వొద్దని సలహా ఇచ్చారు" అంటూ సీఎం బహిరంగంగా పేర్కొనడం ఎంతవరకు సబబు? ఎంత కోపం వచ్చినా ఓర్పు వహించడం బాధ్యతాయుతమైన పదవులలో వున్నవారికి చాలా అవసరం. తామెందుకు అనవసరంగా మాటలు పడాలనుకున్నారేమో, జైపాల్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "సీఎం మాట్లాడింది నాన్‌సెన్స్" అని కేశవరావు, "అన్నీ తెలిసిన ముఖ్య మంత్రి ఇలా మాట్లాడితే ఎలా?" అని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్య మంత్రి వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి సంజాయిషీలాంటి సమాధానాలు, మళ్లీ వాటికి ప్రతి స్పందనలు, మామూలు స్థాయి వారికి తగునేమో కాని వారి స్థాయి వారికి తగినవి కాదని విశ్లేషకుల అభిప్రాయం. మరో రోజు గడిచిందో, లేదో, కరీంనగర్ లో బ్యాంక్ ఉద్యోగుల ర్యాలీలో, ఎంపీ పొన్నం ప్రభాకర్ మరో మారు సీఎం మీద నిప్పులు కురిపించారు. "ఈయనేమన్నా పోటుగాడా?" అంటూ, "మంత్రిగా కూడా పని చేయని వాడిని యాబై ఏళ్లకే ముఖ్య మంత్రిని చేశారు!" అని కటువుగా అన్నారు. లాబీ చేసి కుర్చీ ఎక్కిన కిరణ్ ను దింపేస్తామని కూడా హెచ్చరించారు. ఇక ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా వున్నాయి. "సీమాంధ్ర కోడి తలలు కూడా నరకలేరు తెలంగాణ ప్రాంతం వారు" అని ఆయన అనడం ఒక ఎత్తైతే, ఆ వ్యాఖ్యలను పొన్నం తిప్పికొట్టిన వ్యవహారం అదే మోతాదులో వుందనాలి. "తలలు నరకడం మొదలుపెడితే బిడ్డా, కోడి తలలు నరకం, మీలాంటి ఆంధ్రా తలలు నరుకు తాం'' అని ఆనంను ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు పొన్నం.

ఏదేమైనా ఉద్యమం ఉద్వేగమవుతోంది. సెగ రాజుకుంటుంది. అందరూ చేతులెత్తేసే పరిస్థితి కలగకూడదు. ఎవరికి వారు తమ చేతుల్లో లేదనడం ఎంతవరకు భావ్యం? ముఖ్య మంత్రి కిరణ్ కు చేతకాక, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీకి చేతకాక, కేంద్ర మంత్రులు ఆంటోనీ-ప్రణబ్-చిదంబరం లకు చేతకాక, ప్రధాని మన్మోహన్ కు చేతకాక పోతే మరి చేతనైంది ఎవరికి? ఆ సత్తా-సామర్థ్యం వున్న సోనియా గాంధీనో, ఆమె కొడుకు రాహుల్ గాంధీనో ఎంత తొంరగా కళ్లు తెరిస్తే అంత మంచిది. తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదు సమస్య. ప్రభుత్వం నిర్లిప్తత పెద్ద సమస్య. ఆ నిర్లిప్తతతో ఉద్వేగమవుతున్న ఉద్యమం అంతకన్నా పెద్ద సమస్య. నిలకడలేని రాజకీయ నాయకుల ధోరణి అంతకంటే అతి పెద్ద సమస్య. సమస్య పరిష్కరించక పోతే మిగిలేది "ఉద్వేగమే"!


Thursday, September 22, 2011

తిలా పాపం తలా పిడికెడు: వనం జ్వాలా నరసింహారావు

తిలా పాపం తలా పిడికెడు !

సూర్య దినపత్రిక (23-09-2011)

చరిత్ర ఎరుగని మహాపాతకం ఈ రాష్ట్రానికి పట్టిందా?

వనం జ్వాలా నరసింహారావు

"సకల జనుల సమ్మె" ప్రభావం వుందనే వారి వాదన-లేదనే మరి కొందరి వాదన, తీవ్రంగా వుందనే తెలంగాణ వాదుల ప్రకటనలు-అసలు ఏ మాత్రం లేనే లేదని బల్ల గుద్ది చెపుతున్న సమైక్య వాదుల మాటలు, అటూ-ఇటూ చెప్పలేని వారి నిర్వేదం-ములుకుల్లాంటి పలుకులు.... ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంటుంటే, ఎవరి వాదంతో ను ఏకీభవించలేని వారి పరిస్థితి గందర గోళంలో పడింది. అసలు, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారంటే, వీరి దృష్టిలో సమ్మె ప్రభావం అంటే ఏంటో, తెలిసే మాట్లాడుతున్నారా? లేక దీనికంటే మరింత ప్రభావం కనిపించాలనా? ప్రభావం లేదని అనడం ద్వారా సమ్మెలో పాల్గొంటున్న వారిని రెచ్చగొట్టడమా? నిజంగానే సమ్మె ప్రభావం లేదని అనుకోవాలా? పోనీ, సమ్మె మూలాన, ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇక్కట్లు సరిపోవడం లేదని అర్థం చేసుకోవాలా? తెలంగాణ కాంగ్రెస్ వాదులు-తెలుగుదేశం తెలంగాణ నాయకులు, ఒకపక్క తెలంగాణ రాష్ట్రం కావాలంటూనే, తమ-తమ అధినాయకత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆచి-తూచి, కర్ర విరగకుండా-పాము చావకుండా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి-వీలైనంత జాప్యానికి గురిచేయడానికి, తమ వంతు సహకారాన్ని మాటల తూటాల ద్వారా అందిస్తున్నారనాలి. ఒక రాజకీయ పరిష్కారం లభించాల్సిన అంశాన్ని తమ సొంత రాజకీయాల కోసం, సొంత ఎజెండాల కోసం, "రాజకీయం" చేయడం ఎంతవరకు సబబు? పట్టు విడుపులు వుండవా? రాష్ట్రం ఇలా రావణ కాష్టంలా మండాల్సిందే నా? ప్రభుత్వం (కేంద్రం కాని-రాష్ట్రం కాని) లో ఎందుకింత నిర్లిప్తత? సుపరిపాలన సంగతి దేవుడెరుగు! అసలు పాలనంటూ వుందా?

హైదరాబాద్ లో సుమారు దశాబ్దం క్రితం (చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా వున్న రోజుల్లో) దేశంలోనే ప్రప్రధమ "సుపరిపాలన కేంద్రం" స్థాపించి, నాటి బ్రిటీష్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ చేతుల మీదుగా ఆరంభించిన సందర్భంలో, చలోక్తిగా ఒకరన్న మాటలు ఈ సందర్భంగా పేర్కొనాలి. సుపరిపాలన కేంద్రం స్థాపించడానికి కారణం అంతవరకు సాగుతున్న పాలన మంచిగా లేదని అర్థం చేసుకోవాలా? అని సభా ముఖంగా సదరు వ్యక్తి ప్రశ్న వేశారు. ఎవరిచ్చారో కాని, ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తిగానే వుంది. ప్రజలకు అంతవరకు మంచి పాలన అందినప్పటికీ, అంతకంటే మెరుగైన పాలన కావాలని, పాలన చేసేవారిలో గణనీయమైన మానసిక పరివర్తన-ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, వాటికి కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించి-అమలు చేయించడానికే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ ఆ సమాధానం సారాంశం. అంటే ఏంటంటే...పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, పౌరులతో స్నేహంగా-మర్యాద పూర్వంగా వ్యవహరించినప్పుడే, ఆ ప్రభుత్వాన్ని "సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం" గా గుర్తించాలని టొనీ బ్లెయిర్ తో సహా పలువురు వక్తలన్నారు ఆ సందర్భంగా. బహుశా, ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరు తెన్నులు నిశితంగా గమనిస్తుంటే, ఈ లక్షణాలేవి వారి పాలనలో లేవనే భావించాల్సి వస్తుంది. సకల జనుల సమ్మె జరుగుతుంటే, ఎంత శాతం మంది అందులో పాల్గొన్నారనీ-ఏ ప్రాంతం వారు ఇబ్బందులకు గురవుతున్నారనీ-దాని ప్రభావం అసలే మాత్రం లేదనీ-సమ్మెవల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందా అనీ-కేంద్ర నిర్ణయంపై సమ్మె ప్రభావం ఏ మాత్రం పడదనీ.....బాధ్యతాయుతమైన పదవులు నిర్వహిస్తున్న వారు అనడం భావ్యం కాదు. రాష్ట్రం ఇవ్వడం-ఇవ్వక పోవడం సంగతి అలా వుంచితే, నిర్ణయాత్మకమైన కార్యాచరణ దిశగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రం ప్రభుత్వం అడుగులు వేయకపోవడమంటే, పాలననేది పూర్తిగా స్తంభించి పోయిందని ప్రయోగాత్మకంగా ప్రదర్శించడమే!

సమ్మె సంగతిలా వుంటే, ఒక్కో రాజకీయ నాయకుడు (కురాలు), ఒక్కో విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వింతగా-విడ్డూరంగా వుంది.

(తన) కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖంగా వున్న సంగతి, పార్టీ కార్యవర్గ సభ్యుడుగా తనకు ఎప్పటినుంచో తెలుసని, రాజ్య సభ సభ్యుడు కేశవరావు మరోమారన్నారు. తన నమ్మకానికి ఆధారంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఆ అంశం పెట్టిన సంగతి, దానికి అనుగుణంగానే డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన గురించి, అదేదో కొత్త విషయంలా బయట పెట్టారు. పాపం, పనిలో పనిగా, రోశయ్యను తప్పుబట్టారు. సీమాంధ్రులు రోశయ్యతో నాటకం ఆడించారని మరో కొత్త (పాత) విషయం కూడా చెప్పారు. కేశవరావు తన సరికొత్త వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావుని ఆయన నివాసంలో కలిసి మీడియాతో ఈ "బ్రేకింగ్ న్యూస్" ను చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, ఖమ్మం (తెలంగాణ జిల్లా) లోక్ సభ మాజీ సభ్యురాలు, సకల జనుల సమ్మె అనేది అసలు జరగడం లేదనే అర్థం స్పురించే రీతిలో మాట్లాడడం కూడా, ఈ సందర్భంలో అంత సమయోచితం కాదని కూడా పలువురంటున్నారు. ఆమె కనీసం ఆ మాటనే ముందర, ముఖ్యమంత్రితో ఒక్క సారి మాట్లాడి వుంటే, సమ్మె విజయవంతంగా సాగుతుందో లేదో తెలిసేదని కూడా ఆమె పార్టీకి చెందిన వారే రేణుకకు గుర్తు చేశారు. రేణుకా చౌదరి ఎక్కడి నుంచో తెలంగాణకు వచ్చారని నర్మగర్భంగా కేశవరావు అనడం గమనించాల్సిన విషయం. ఇక మరో కాంగ్రెస్ నాయకుడు, సీమాంధ్రుడైనా తెలంగాణకు ప్రతికూలం కాదని ముద్ర వేయించుకున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించాలని పెద్ద మనసుతో విజ్ఞప్తి చేసారు. ఆయన చేసే విజ్ఞప్తిని తన అధిష్టానానికి చేసి, తెలంగాణ ఇచ్చుడో-లేదో త్వరగా తేల్చమని అంటే ఆయన పెద్ద మనసుకు అర్థం వుండేది. సందులో సడేమియా అన్నట్టు, "రాహుల్ గాంధీ ప్రత్యేక దూత" గా దీపక్ బబారియా అనే ఒక పెద్ద మనిషి హైదరాబాద్ కొచ్చి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులన్నింటిని అవగాహన చేసుకున్నానని అంటున్నారు. ఈనెంతవరకు అర్థం చేసుకుంటారో, ఆయన చేసుకున్న దానిని రాహుల్ గాంధీకి ఎంతవరకు అప్ప చెపుతారో, ఆయనెంతవరకు సమస్యను ఆకళింపు చేసుకుంటారో, ఆ భగవంతుడి కే (బహుశా సోనియా గాంధీకి!) తెలియాలి. ఒక కీలక సమస్యను, ఇంత తేలికగా, ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ధోరణిలో మార్పు రావాలి.

ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెటను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. సకల జనులు-ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే, సమ్మెను విరమించమని విజ్ఞప్తి చేశారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. సమ్మె ప్రభావం లేదన్న ముఖ్య మంత్రి మాటల్లోనే, దాని ప్రభావం కనిపించింది. జంట నగరాలలో రెండు గంటల కరెంటు కోత, గ్రామ స్థాయికి చేరుకునే సరికి ఆ కోత ఎనిమిది గంటల దాకా వుండడం, సమ్మె ప్రభావం కాకపోతే మరింకేంటి? మహానది, వెస్ట్రన్ కోల్‌ ఫీల్డ్ నుంచి ఐదారు లక్షల టన్నుల బొగ్గు తెప్పించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడమంటే, అది సమ్మె ప్రభావం కాదా? ఉపాధ్యాయుల విధుల బహిష్కరణ, ప్రైవేటు స్కూళ్ల స్వచ్చంద బంద్ సమ్మె ప్రభావం అనాల్నా వద్దా? పాఠశాలలకు దసరా సెలవులను బాగా ముందుకు జరుపుతున్నా మనడం-మళ్లీ వెనుకంజ వేయడం, ప్రభుత్వం పరోక్షంగా సమ్మె ప్రభావాన్ని గుర్తించడమే కదా? ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులపై కొరడా ఝళిపించడం (సంబంధిత మంత్రి దృష్టికి వచ్చిన తర్వాత ఆ వుత్తర్వులను వెనక్కు తీసుకోవడం), అప్రెంటిస్ టీచర్లను క్రమశిక్షణకు గురిచేయడం సమ్మె ప్రభావం కాదా? పోనీ సమ్మె తీవ్రతను తగ్గించే ప్రయత్నం కాదా? రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని జోక్యం పరోక్షంగా కోరడం వాస్తవమే కదా? అలా జరిగిందనడానికి నిదర్శనం, పొరుగు రాష్ట్రాల నుంచి బొగ్గు, విద్యుత్తు, గ్యాస్ సరఫరా ఉదారంగా చేయాలని ప్రధానిని కిరణ్ కోరడమే! బహుశా సమ్మె ప్రభావాన్ని ప్రధాని కూడా గుర్తించినందువల్లే, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా వారి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండని సంబంధిత శాఖలను ఆదేశించారే మో! ఇంత జరుగుతున్నా ఎందుకీ నిర్లిప్తత?

ఈ నేపధ్యంలో, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవడానికి తెరాస అధినేత కేసీఆర్, మరో పర్యాయం ఆమరణ నిరాహారదీక్షకు దిగవచ్చనే వార్తలు వచ్చాయి. కుటుంబసభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కేశవరావు లాంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆయనను వారించారంటున్నారు. ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేకపోవటం, సకల జనుల సమ్మె కొనసాగుతున్న సందర్భంలో ఆయన నాయకత్వం అనుక్షణం కావాల్సిన అవసరం లాంటి కారణాలు, కేసీఆర్ ను ఆలోచనలో పడేసాయనవచ్చు. ఐనా ఆయన నిర్ణయమంటూ తీసుకుంటే, భగవంతుడు కూడా మార్చలేడని విశ్లేషకుల అభిప్రాయం. సకల జనుల సమ్మె ఉదృతంగా సాగుతున్నా కేంద్రం స్పందించక పోవడం, బహుశా కేసీఆర్ ను మనస్థాపానికి గురిచేసి వుండవచ్చు.

ఇదిలా వుంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులలో మళ్లీ అలజడి-ఒకింత కలకలం మరో మారు మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. సకల జనుల సమ్మెపై ముఖ్య మంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలను పంపుతున్నారని ఆరోపణ చేశారు. మరో అడుగు ముందుకు వేసి, విద్యార్థులను-ఉద్యోగులను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించ వద్దంటూ హెచ్చరిస్తున్నానని కూడా కోమటి రెడ్డి అన్నట్లు వార్తలొచ్చాయి. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేసి-ఆమోదింపజేసుకుని-గాంధీ జయంతి నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. మరో వైపు ఆయన సోదరుడు, లోక్ సభ సభ్యుడు రాజ గోపాలరెడ్డి రాజీనామా చేయాలని తెలంగాణ వాదులు డిమాండు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నల్గొండకు చెందిన మరో మంత్రి జానారెడ్డి సోనియాకు ఉత్తరం రాశానని ప్రకటించారు. ఇంకా రాతలేనా? చేతలేమన్నా వున్నాయా? అని అసలు-సిసలైన తెలంగాణ వాదులు వీరిలాంటి వారిని ప్రశ్నిస్తున్నారు.

ఎవరేమంటున్నారో....అనే విషయం... అనే వారికి అర్థం కాకపోయినా...వినే ప్రజలకు బాగా అవగాహనవుతోంది. ఈ నాటి ఈ పరిస్థితులకు ఎవరి బాధ్యత ఎంతో నాయకులకన్నా ప్రజలకే ఎక్కువ తెలుసు. ఎన్ని మాటలన్నా ఎన్నికల వరకు తప్పించుకోగలుగుతారే కాని, అప్పుడు ఎదుర్కోనున్న పరాభవాన్నుంచి తప్పించుకోలేరు కదా! ఈ "తిలా పాపాన్ని తలా పిడికెడు" పంచుకోక తప్పదు. తస్మాత్ జాగ్రత్త!