Thursday, September 2, 2010
రెండు దశాబ్దాలుగా నేనెరిగిన-నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య : వనం జ్వాలా నరసింహారావు
Thursday, May 27, 2010
"జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ఏర్పాటును సూచించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి : వనం జ్వాలా నరసింహారావు
Friday, January 8, 2010
జ్వాలా మ్యూజింగ్స్-1 (మూడో సారి అమెరికా ప్రయాణం)
Sunday, January 3, 2010
ఉద్యమం తొలిపొద్దులో.. ... వనం జ్వాలా నరసింహారావు
http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/01/03/ArticleHtmls/03_01_2010_004_002.shtml?Mode=1
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2010/jan/3edit3
ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర నినాదమూ పుట్టిందనవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (నాడు) కొందరు భావిస్తే, తెలంగాణ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు ఆనాడే అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది.
అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారు. అయినా పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి.
సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టనాలలో, ఆరంభమైంది "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయం జరిగింది. దీంతో ఆయన సహోద్యోగులందరూ తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం కళాశాల విద్యార్థి "రవీంద్రనాథ్" (మా జూనియర్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. అప్పట్లో రాష్ట్ర హోం మంత్రిగా వున్న జలగం వెంగళ రావు ఉద్యమాన్ని అణచడానికి తన రాజకీయ చతురతను చూపాడు.
కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నాకు నాలుగేళ్లు సీనియర్) రూమ్ లో, మల్లికార్జున్ (ఇప్పటి కీర్తి శేషులు) తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.
ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని (ఆయన రెండోసారి 1989-1990 లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయనకు ముఖ్య పౌర సంబంధాల అధికారిగా పని చేశాను) కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి.
చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.
హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. 1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు.
ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు కేంద్రం మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు. ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు.
వనం జ్వాలా నరసింహారావు
Friday, January 1, 2010
మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏ(వే)ర్పాటు ఉద్యమం-ఎక్కడి గొంగళి అక్కడే
http://siliconandhra.org/nextgen/sujanaranjani/jan10/telamgana.html
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు (ఆనాడే) అభిప్రాయపడ్డారు. "విశాలాంధ్ర" ఏర్పాటు జరగాలని ప్రాణత్యాగం చేసినవారెందరో వున్నారు. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కూడా జరిగింది. అది జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి తెలంగాణ ఏర్పాటు జరుగుతుందా-జరగదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే వుందనాలి. ఈ నేపధ్యంలో, ఉద్యమాన్ని గత నాలుగు దశాబ్దాలకు పైగా గమనిస్తూ, అంతో ఇంతో ఆ ఉద్యమంతో సంబంధం వున్న వ్యక్తిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పూర్వాపరాలను గురించి "సిలికానాంధ్ర-సుజనరంజని" పాఠకులకు తెలియచేసే ప్రయత్నమే ఇది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, క్రమేపీ, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టనాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.
ముఖ్యమంత్రి కావాలని ఎన్నా(న్నే)ళ్లు గానో కలలుకంటున్న ఆంధ్ర ప్రాంతంనుండి ఖమ్మం జిల్లాకు వలసవచ్చిన "సెటిలర్" తెలంగాణ కాంగ్రెస్ నాయకుడొకరు, ఖమ్మంలో మొదలైన నాటి ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి పరోక్షంగా మద్దతిచ్చారని బహిరంగ రహస్యంగా చెప్పుకునేవారు చాలామంది. ఆ తర్వాత కాలంలో ఉద్యమ పుణ్యమో-మరేదో కాని ఆయన కోరికైతే నెరవేరి, ముఖ్య్యమంత్రి కాగలిగినా, ఆయన మాత్రం తెలంగాణ ఏర్పాటుకు ఆవగింజంత సహాయం కూడా చేయలేదు. ఏర్పాటుకు వ్యతిరేకించిన వారిలో ఆయన కూడా ఒకరు. ఇక నాటి ఉద్యమం విషయానికొస్తే: కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టనం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. అప్పట్లో రాష్ట్ర హోం మంత్రిగా వున్న జలగం వెంగళ రావు ఉద్యమాన్ని అణచడానికి తన రాజకీయ చతురతను చూపాడు.
కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నాకు నాలుగేళ్లు సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి. ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని (ఆయన రెండోసారి 1989-1990 లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయనకు ముఖ్య పౌర సంబంధాల అధికారిగా పని చేశాను) కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి.
ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. 1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.
నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించ బడుతున్నామని తెలంగాణ వాసులు గ్రహించినా, అధిక సంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కొరకు ఎదురుచూచారు. పదవి లేని-రాని నాయకులెవరైనా ఉద్యమం మళ్లీ ఆరంభించి-నడపక పోతారానని ఎదురు చూడసాగారు. రాజకీయ స్వార్థం కోసమైనా ఎవరైనా తమకండగా వుండకపోతారానని భావించసాగారు. సరిగ్గా పదేళ్ల క్రితం వారి కోరిక నెరవేరింది. చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దొరకని కె. చంద్రశేఖర రావు-కేసీఆర్, "తెలంగాణ రాష్ట్ర సమితి"-టీ ఆర్ ఎస్ ని స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఒకరకంగా ఏకాభిప్రాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ-ఎవరూ సాధించని విజయాన్ని సాధించారని చెప్పాలి. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో, వై ఎస్ ఆర్ నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ-అటు పార్లమెంటు లోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగి, టీ ఆర్ ఎస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తేగలిగాడు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసుకుంటూ పోగలిగాడు. పార్టీలో తనకు ఎదురు తిరిగిన ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయగల సమర్థుడుగా ఎన్నో మార్లు నిరూపించుకున్నాడు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్ని మార్లైనా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు. తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు. అంతవరకూ బాగానే వుంది.
జాతీయ స్థాయిలో ఇంత చేయగలిగిన కేసీఆర్ "ఇంట గెలిచి రచ్చ గెలవాలనే" నానుడిని అర్థం చేసుకోలేకపోయాడు. తన రాష్ట్రంలో తనకంటే బలమైన తన ప్రధాన ప్రత్యర్థిని అంచనా వేయడంలో తప్పటడుగు వేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇంతమంది మద్దతు కూడగట్టుకోగలిగిన కేసీఆర్, వై. ఎస్. రాజశేఖర రెడ్డి మద్దతు కూడగట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోయాడు. వై ఎస్ ఆర్ అందించిన స్నేహ హస్తాన్ని వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలచుకోలేక పోయాడు. శాసనసభలో తన వాళ్లలో చాలామందిని ఆయనకప్పచెప్పాడు. టీ ఆర్ ఎస్ ను బలహీన పరుస్తుంటే ప్రేక్షకుడిలాగా చూడసాగాడు. రాజశేఖరరెడ్డి మద్దతు సాధించకుండా సోనియా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదని గ్రహించ లేకపోయాడు. ఒక్కో సారి అనవసరమైన ఎదురుదాడికి దిగాడు. తిరుగులేని అధికారంలో వున్న వై ఎస్ ఆర్ కి అధికారంలో లేని కేసీఆర్ ను బలహీన పరచడం తేలికై పోయింది. కేసీఆర్ ఒకతప్పుతర్వాత మరో తప్పు చేయసాగాడు. అయినా ఉద్యమాన్ని నడపగలిగాడు. తప్పటడుగులు వేస్తూనే నిలదొక్కుకోగలిగాడు. ఈ నేపధ్యంలో వచ్చాయి 2009 సారస్వతిక ఎన్నికలు.
ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థి బలాన్ని అంచనావేయ లేకపోయాడు. తన బలమెంతో తెలుసుకోలేకపోయాడు. ఎవరు శాశ్వత మిత్రులో-శాశ్వత శత్రువులో గుర్తించడంలో విఫలమయ్యాడు. ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసే బదులు, తెలంగాణ రాష్ట్ర సాధనను వ్యతిరేకిస్తున్న శక్తులతో చేతులు కలిపాడు. తన బలాన్ని-తెలంగాణ ప్రజలలో తనపై వున్న నమ్మకాన్ని నిరూపించ గలిగే వీలు కలిగినా, చేజిక్కిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు. అన్ని పార్టీలవారు తెలంగాణ పేరును ఉచ్చరించకుండా ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేకుండా చేయగలిగినా, తనకంటూ ప్రత్యేకతను టీ ఆర్ ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లు మరిచిపోయి, ఎన్నికల్లో చేసిన తప్పిదాలకే ప్రాముఖ్యతనిచ్చి, అనుకోని ఓటమిని రుచి చూపించారు. గుడ్డిలో మెల్లగా కేసీఆర్ మాత్రం తన సీటును దక్కించుకోగలిగాడు. ఏ ప్రజలైతే 1971 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చి తెలంగాణ కావాలన్నారో, ఆ ప్రజలే అస్పష్టమైన తీర్పిచ్చారు. తెలంగాణాలో గెలిచిన అన్ని పక్షాలకు చెందిన అభ్యర్థులు, ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ, తీర్పేంటి అన్నది అర్థంకాని ప్రశ్నలాగా మిగిలిపోయింది. చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించాడు కేసీఆర్. కొంతకాలం అజ్ఞాతంలో గడిపాడు.
అజ్ఞాతాన్ని వీడిన కేసీఆర్ బహిరంగంగా, పత్రికాముఖంగా తన తప్పిదాలను ఒప్పుకుంటూనే, భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడిచేశాడు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్థి చెపుతున్నట్లు టీవీ చానళ్లద్వారా (టీవీ9) ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ ప్రస్తుతానికి నిరాశే మిగిలింది.
ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంధాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో ప్రస్తుతానికి "చిదంబర రహస్యం" గానే భావించాలి.
ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఏం జరుగనున్నదో వెండి తెరపై చూడాల్సిందే.
(వ్యాసం ప్రచురణ అనంతరం-చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జనవరి 5, 2010 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర ఏర్పాటు మరో అడుగు వేస్తుందని ఆశించుదాం)
వనం జ్వాలా నరసింహారావు
Thursday, December 31, 2009
సేవా తత్పరుడు, స్నేహశీలి (డాక్టర్ వై. ఎస్. రాజశేఖరరెడ్డి)
సేవాతత్పరుడు,
స్నేహశీలి
(Published on 6th September, 2009 in Andhra
Jyothi Daily)
డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో, ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్రంలో, అభివృద్ధి సంక్షేమ పథకాల
రూపకల్పనలో-అమలులోనే కాకుండా రాజకీయపరంగా కూడా ఊహ కందని శూన్యం ఏర్పడనుందా అన్న సందేహం
కలగడం సహజం. ఎప్పుడో-ఏనాడో, పిన్న వయస్సులోనే, బహూశా తప్పని పరిస్థితుల్లో-కుటుంబ రాజకీయాల నేపధ్యంలో, వైద్య వృత్తిని వదిలి, రాజకీయ రంగప్రవేశం చేసిన
డాక్టర్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి స్థాయికెదగడానికి ఆయన
సొంత-స్వయం కృషే ప్రధాన కారణమనాలి. రాజకీయాల్లో ప్రవేశించినప్పటినుంచీ అపజయమనేది
లేకపోయినా, అసలు-సిసలైన విజయం సాధించడానికి మాత్రం 2004
సంవత్సరం వరకూ ఓపిగ్గా వేచి చూడాల్సి వచ్చింది. తన పార్టీ
వారితోనూ-ఇతర పార్టీలవారితోనూ నిరంతరం పోరాటం చేస్తూ-"నిత్య అసమ్మతి
వాది" గా పేరు తెచ్చుకుంటూనే, తన లక్ష్యం-ధ్యేయం
నెరవేర్చుకున్న థీశాలి రాజశేఖర రెడ్డి.
2004
ఎన్నికల్లోనూ, అంతకు ముందు చేసిన పాదయాత్రలోనూ,
ఆయన చేసిన వాగ్దానాల అమలు దిశగా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ,
మనందరికీ అందనంత ఎత్తుకెదిగి, చివరకు
కనిపించని లోకాలకు చేరుకున్నారాయన. 2004 ఎన్నికల్లో ఆయన
చేసిన వాగ్దానాలకు అదనంగా 2009 ఎన్నికల్లో చేసినవి రెండే
రెండు వాగ్దానాలు. లోగడ చేసిన వాగ్దానాలనే పటిష్ఠంగా అమలుచేసి-మరింత ముందుకు
తీసుకెళ్లడమే తాను చేస్తున్న ఇతర వాగ్దానాలని 2009 ఎన్నికల్లో
చెప్పేవారు రాజశేఖరరెడ్డి. ఆయన అధికారంలో వున్న అయిదేళ్ల-నాలుగునెలల కాలంలో చేసిన
వాగ్దానాల అమలుకొరకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాలకు స్వయంగా రూపకల్పన చేయడమే కాకుండా, వాటి అమలు విషయంలో నిరంతరం శ్రద్ధ కనపరిచేవారాయన.
అది,
నిరంతరం పేద ప్రజలకు కడుపునిండా రెండు పూటలా అన్నం పెట్టడానికి
ఉద్దేశించిన "ఆహార హామీ పథకమే" కావచ్చు, బడుగు-బలహీన
వర్గాల అభ్యున్నతికి రూపొందించిన "ఉపాది హామీ పథకాలే" కావచ్చు, హృద్రోగంతో బాధపడుతుండే చిన్నారులను ఆదుకునేందుకుద్దేశించిన "ఉచిత
శస్త్ర చికిత్సా పథకమే" కావచ్చు, లక్షలాది ఎకరాలకు
సాగునీరందించే "జల యజ్ఞం పథకమే" కావచ్చు, స్వయం సహాయక-డ్వాక్రా
మహిళలకుద్దేశించిన "పావలా వడ్డీకే ఋణ సౌకర్యం పథకమే" కావచ్చు,
"ఇందిర ప్రభ" పేరుతో రూపుదిద్దుకున్న సమగ్ర భూ పంపిణీ
అభివృద్ధి ప్రణాళికలే కావచ్చు, గ్రామీణ స్థితిగతులను స్వయంగా
పరిశీలన-అధ్యయనం చేసేందుకు చేపట్టిన "పల్లె బాట" కార్యక్రమమే కావచ్చు,
త్రికరణ శుద్ధిగా అమలు పరచదల్చుకున్న "మైనార్టీల సంక్షేమ
పథకమే" కావచ్చు, "ఆరోగ్య భీమా పథకమే" కావచ్చు,
"108-104 అత్యవసర-సాధారణ వైద్య-ఆరోగ్య సహాయ సేవలే"
కావచ్చు ... ... ... ఇలా ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పనకు-అమలుకు
యావద్భారత దేశానికే రాజశేఖరరెడ్డి తన ముందు చూపు ఆలోచనలతో "మార్గదర్శి"
అయ్యాడనాలి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూమికున్న ప్రాధాన్యతను, భూమితో
పేదలకున్న అనుబంధాన్ని-అవసరాన్ని గుర్తించిన రాజశేఖరరెడ్డి, నిరుపేదలకు
స్వావలంబన చేకూర్చే దిశగా లక్షలాది ఎకరాల భూపంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,
చిత్తశుద్ధితో అమలుపర్చారు. మహాత్మాగాంధి ఆశయాలకనుగుణంగా, ఇందిరాగాంధి ఆలోచనలకు ప్రతిరూపంగా తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టి అమలు
జరుపుతున్నా అనేవారాయన. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి
అన్నివిధాలా కృషిచేసి, నిరంతరం బడ్జెట్ లో వ్యవసాయానికి
పెద్దపీట వేసేవారాయన. రాష్ట్రంలో కరవును శాశ్వతంగా పారద్రోలే దిశగా, వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని బయటపడవేసేందుకుద్దేశించిన సేద్యపు
నీటిపారుదల ప్రాజెక్టులను ఒక యజ్ఞంగా చేపట్టాడు రాజశేఖరరెడ్డి. బంజరుభూములన్నీ
సాగులోకి తేవాలన్నదే తన ధ్యేయంగా చెప్పేవారాయన.
అటవీ హక్కుల రక్షణ చట్టం కింద పన్నెండు లక్షల ఎకరాలకు పైగా
అటవీ భూమిపై ఆదివాసీలకు హక్కు కలిగించారాయన. "ఇందిర ప్రభ" పేరుతో
బడుగులకు వెలుగులిచ్చిందీ,
"సమగ్ర గ్రామీణ సంక్షేమానికి" చర్యలు చేపట్టిందీ, పేదలకు వరమైన "పనికి ఆహార పథకం" ప్రవేశ పెట్టిందీ,
"భూ పంపిణీ" కి భూరి సన్నాహం చేసిందీ, "సునామీ బాధితులకు బాసటగా" నిల్చిందీ, "సమాచార
స్రవంతి" కి శ్రీకారం చుట్టిందీ, "పల్లె బాట"
స్ఫూర్తితో "నగర బాట" చేపట్టిందీ, రైతుల మేరుకోరి
"ఉచిత విద్యుత్ పథకం" అమలు పర్చిందీ-కాలానుగుణంగా మార్పులు చేసిందీ,
ఏటేటా అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ కు రూపకల్పన చేసిందీ, ఉపాధికి ఊతమిచ్చిన "యువ శక్తి" పథకాన్ని అమలు పర్చిందీ, కరవుపై కదన భేరి మోగించిందీ, రైతు చైతన్యానికి
"పొలం బాట" పట్టిందీ.. ... ... వీటన్నిటి ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
"దశ" మార్చే "దిశ" గా ప్రస్థానం చేసిందీ, స్వర్గీయ రాజశేఖరరెడ్డే.
2009
ఎన్నికలకు కొన్ని రోజుల ముందర మిత్రుడు భండారు శ్రీనివాస రావుతో
కలిసి నేను, ప్రస్తుత ఛీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క
కలిసి, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మార్క్సిస్ట్
కంచుకోటలైన గ్రామాల్లో పర్యటించినప్పుడు, పార్టీలకతీతంగా రాజశేఖరరెడ్డి
పథకాలవల్ల లబ్ది పొందామని వందలాది మంది గ్రామస్తులు చెప్పారు.
రాజశేఖరరెడ్డికి అన్నింటికన్నా మించింది "స్నేహ
ధర్మం" అని ఆయన శత్రువులు కూడా ఒప్పుకుంటారు-ఎప్పుడూ అంటుంటారు. ఆ స్నేహ
ధర్మమే ఆయనకు 1999
ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేసిందన్న సంగతి చాలామందికి
తెలిసిన విషయమే. స్నేహ ధర్మానికి విరుద్ధంగా ఆయనే కనుక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో 1999
ఎన్నికలలో ఒప్పందం కుదుర్చుకున్నట్లైతే, ఆయన
సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెల్చుకొని, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వాడే. అయితే ఖమ్మం శాసనసభ స్థానం కొరకు
పట్టుబట్టిన కమ్యూనిస్టులు, దానికీ-రాష్ట్రంలోని ఇతర
స్థానాలలో ఒప్పందానికీ ముడివేసి లింకు పెట్టారు. ఖమ్మం స్థానానికి కాంగ్రెస్
టికెట్ ను తన స్నేహితుడికిచ్చేందుకు వాగ్దానం చేసిన రాజశేఖరరెడ్డి, మాట నిలబెట్టుకునేందుకు, కమ్యూనిస్టులతో ఎన్నికల
ఒప్పందం వద్దనుకున్నాడు. ఆయన అంచనా మేరకు ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థే గెలిచాడు.
కాకపోతే రాష్ట్రంలో మెజారిటీ సీట్లను పొందడానికి ఆ సీటు అడ్డొచ్చింది. ఫలితంగా
ముఖ్యమంత్రి కావడానికి మరో ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది.
రాజకీయంగా పరిణితి చెందిన రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో
కమ్యూనిస్టులతోనూ-టీ.ఆర్.ఎస్ తోనూ సీట్ల ఒప్పందం కుదుర్చుకుని, కాంగ్రెస్ పార్టీని విజయ పథాన నిలిపారు. ఆయన చిరకాల ఆశయం నెరవేరింది.
మిత్రుడు భండారు శ్రీనివాస రావుకు రాజశేఖరరెడ్డితో వున్న సాన్నిహిత్యం నాకు
లేకపోయినా, ఆయన ద్వారా పరిచయమైన రాజశేఖరరెడ్డిని, అడపాదడపా, ఏదో ఒక సందర్భంలో, గత
పాతికేళ్లకు పైగా కలుస్తుండేవాడిని. మరీ గత నాలుగైదు ఏళ్లుగా, ఇ.ఎమ్.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల సంస్థలో
"ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం" అమలు పరిచే విభాగానికి సలహా దారుడి
హోదాలో పనిచేయడం వల్ల, ఉద్యోగ రీత్యా చాలా సార్లు కలుసుకునే
అవకాశం కలిగింది.
అయితే, ఇక్కడో విషయం ప్రస్తావించాలి. 1989-1990
మధ్య కాలంలో నేను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న
కాలంలో ఆయనకు పౌర సంబంధాల అధికారిగా పనిచేసాను. అప్పటి వరకూ శ్రీనివాస రావు,
నేను చాలా సార్లు రాజశేఖరరెడ్డిని కలుసుకుంటుండె వాళ్లం. చెన్నారెడ్డి
గారి దగ్గర పనిచేస్తున్న సందర్భంలో జరిగిన ఒక చిరు సంఘటనతో, రాజశేఖరరెడ్డిని,
చాలాకాలం వరకు కలిసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అసలు
విషయానికొస్తే: 1990 లో రాజశేఖరరెడ్డి గారు ఒక పర్యాయం న్యూ
ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు వెళ్లినప్పుడు, తనకు
జరిగిన అమర్యాదకు కోపగించిన ఆయన సీరియస్ కావడం, అమర్యాదకు
కారణమైన వారిని మందలించడం జరిగింది. ముఖ్యమంత్రిగా వున్న చెన్నారెడ్డి గారు,
ఆ విషయం తెలుసుకొని, ఆ సంఘటనను తనకు
ప్రత్యర్థిగా పనిచేస్తున్నాడని భావించిన రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా పత్రికల్లో
వచ్చే విధంగా నన్నొక పత్రికా ప్రకటన విడుదల చేయమని నాకు సూచించారు. అలా చేస్తే
రాజశేఖరరెడ్డికి నాపై కోపమొస్తుందని నా జర్నలిస్ట్ మిత్రులు చెప్పినా
పట్టించుకోకుండా, పౌర సంబంధాల ఉద్యోగిగా నా భాద్యత
నెరవేర్చాను. అది జరిగిన తర్వాత ఏపీ భవన్ పై కోపగించిన రాజశేఖరరెడ్డి, నాకు తెలిసినంతవరకు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే దాకా
అక్కడికి వెళ్లలేదు. శ్రీనివాసరావుతో కలిసి రాజశేఖరరెడ్డిని ఒక పర్యాయం
కలిసినప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది. పెద్ద మనస్సుతో ఆయన దాన్ని పెద్దగా
పట్టించుకోలేదు. తిరిగి నేను ఆయన దగ్గరకు వెళ్లడం ప్రారంభించాను. ఆయనకు అసలు నాపై
కోపముందో లేదో కాని, వుందని నేను భావించాను.
రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత
ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర
సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎమ్.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు
కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా
కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల
వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న
పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్
లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ
ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు
పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎమ్.ఆర్.ఐ సంస్థకు
పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన
వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.
జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. ఆ క్రితం
రోజున ఇ.ఎమ్.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో
జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి
ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి,
ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర
సహాయ సేవలందించే విషయంలో సమీక్షించారు. ఆ సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి
ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ
సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ
ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95%
నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు.
యాజమాన్య ఖర్చులనూ తప్పదనుకుంటే సమకూరుస్తానని హామీ ఇచ్చారాయన.
ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు,
108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో
గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం
ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్
దేశానికి పోవడానికి ముందర తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత
చేసిన మొదటిది. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని,
108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు
చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా
ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి,
జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే
ఇ.ఎమ్.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం,
ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎమ్.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎమ్.ఆర్.ఐ గా
మార్పుచెందడం జరిగింది. అలాంటి మహనీయమైన వ్యక్తి ఇక మనమధ్యన లేరు. ఆయన లేని లోటును
ఎవరూ తీర్చలేరు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి.

