Showing posts with label మర్రి చెన్నారెడ్డి. Show all posts
Showing posts with label మర్రి చెన్నారెడ్డి. Show all posts

Thursday, September 2, 2010

రెండు దశాబ్దాలుగా నేనెరిగిన-నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య : వనం జ్వాలా నరసింహారావు




ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో నాకు మొదటిసారి పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం, ఆయన మంత్రివర్గంలో రోశయ్య చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది.

కొణిజేటి రోశయ్య, నాలుగు దశాబ్దాల క్రితం 1968లో విధాన మండలి సభ్యుడిగా ఎన్నికై చట్టసభలో అడుగు పెట్టారు. శాసన మండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన ఆయన వాగ్దాటికి అడ్డుకట్ట వేయడానికి, 1983 లో అధికారంలోకి వచ్చిన ఎన్ టీ రామారావు మండలిని రద్దు చేసేంత వరకు, ఆయన విధాన సభ సభ్యుడుగా కొనసాగారు. తెనాలి, చీరాల నియోజక వర్గాలనుంచి శాసనసభకు, నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తొలిసారిగా 1979 లో, తదుపరి ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రివర్గ సభ్యుడిగా, కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు రోశయ్య. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1995-97 మధ్య కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. పాతికేళ్ల విరామం తర్వాత మరో మారు శాసనమండలి సభ్యుడుగా 2009 లో ఎన్నికయ్యారు. ఏ శాసన మండలి సభ్యుడిగా చట్ట సభల్లో ప్రవేశించారో, అదే మండలి సభ్యుడిగా, రోశయ్య సెప్టెంబర్ 3,2009 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బహుముఖ ప్రజ్ఞా శాలైన రోశయ్యకు 2007 అక్టోబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చింది. ఎన్జీ రంగా శిష్యుడిగా చెప్పుకునే రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను, 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టిన అప్రకటిత "ఆర్థిక రంగ నిపుణుడు" కొణిజేటి రోశయ్య. వరుసగా రెండు పర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు.

ఎల్లప్పుడూ తెల్లటి ఖద్దరు దుస్తులనే ధరించే రోశయ్య ఆజానుబాహుడు. గంభీరమైన కంఠస్వరం ఆయన సొత్తు. సంయమనం ఆయన ఆస్తి. ఆయన పంచె కట్టు తెలుగు దనానికే ప్రతీక . గిట్టని వారు సహితం ఆయన్ను ఫలానా వారి గ్రూపుకు చెందిన వ్యక్తిగా వేలెత్తి చూపలేదింతవరకు. మహాత్మా గాంధి సిద్ధాంతాలైన అహింస-సత్య శీలతకు ఆయన పర్యాయ పదం అనవచ్చు. డబ్బై సంవత్సరాల రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో విలక్షణమైన రాజనీతిజ్ఞుడిగా, అందరి వాడుగా, క్రమ శిక్షణ గల కాంగ్రెస్ వాదిగా మన్ననలను పొందారు. ఆశించని ముఖ్య మంత్రి పదవి, రోశయ్యకు దక్కడంతో, "అజాత శత్రువు" గా ఆయనకున్న పేరును, కొందరు అసూయాపరులు మలినం చేసే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని, లౌక్యంతో-ఓర్పుతో-నమ్రతతో, అనుభవం నేర్పిన ధైర్యంతో ఎదుర్కున్నారాయన. స్వర్గీయ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగి, సంక్షేమ-అభివృద్ధి పథకాల రూపకల్పన-అమలులో చేదోడుగా నిలిచి, ఎదురైన చిక్కు సమస్యలను పరిష్కరించే బాధ్యత తన భుజస్కంధాల మీద మోపుకునేవారు రోశయ్య. అసెంబ్లీలో-పాలనా వ్యవహారాలలో రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడుగా వ్యవహరించి నమ్మకానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యమంత్రిగా, తనదైన శైలితో విధాన పరమైన నిర్ణయాలను తీసుకుంటూ, చెరిపినా చెరగని ముద్ర ప్రభుత్వ పాలనపై వేశారాయన. క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి, ఒకటి వెంట మరొక సంక్షోభం రోశయ్యను వెంటాడాయి. ప్రకృతి భీభత్సం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం హింసాయుతంగా మారడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల లాంటి సంక్షోభాలను ఎదుర్కోని, ధైర్యంతో నిలదొక్కుకొని, పాలనను గాడిలో పెట్టారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.

ముఖ్యమంత్రిగా రోశయ్య పాలనకు ఏడాది పూర్తి అయింది. అవాంతరాలు ఎన్ని ఎదురైనా, అధిష్ఠానం అండదండలు ఒక వైపు, కాదన్న మంత్రులే కలిసిరావడం మరోవైపు, అపారమైన అనుభవం అన్ని వైపులా ఆయన పక్షాన వుండడంతో, రోశయ్య పాలన సజావు గా ముందుకు సాగుతోంది. పరిపాలన చక్కదిద్దడానికి రోశయ్యను మించిన కాంగ్రెస్ నాయకులు మరొకరు లేరనేది తేలిపోయింది. ఊపిరి పీల్చుకోకుండా చేసిన తెలంగాణ ఉద్యమం , సవాళ్లు విసిరిన అసమ్మతి కాంగ్రెస్ వాదుల వ్యవహారం , ఆశించని ఫలితాలు అందించని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు-శాసనసభ ఉప ఎన్నికలు, చంద్రబాబు నాయుడు లేవనెత్తిన బాబ్లీ వివాదం , బయ్యారం మైనింగ్‌ లీజుల వ్యవహారం, విద్యార్థుల ఫీజు చెల్లించే వివాదం లాంటి పలు అంశాలు, రోశయ్యను ఇరుకున పెట్టాయే తప్ప పెరుగుతున్న ఆయన ప్రతిష్టకు భంగం కలిగించ లేకపోయాయి. రాజకీయంగా ఆటుపోట్లను స్వపక్షం నుంచీ-విపక్షాలనుంచీ ప్రభుత్వం నిత్యం ఎదుర్కుంటూనే, తనపై విసిరిన ప్రతి సవాలునూ తనదైన శైలిలో రోశయ్య అధిగమించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఆకట్టుకుంది. ధిక్కార స్వరం వినిపిస్తున్న వారి విషయంలో రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి పైచేయి తనదే అని నిరూపించుకున్నారు. తనను అదే పనిగా విమర్శించేవారి నోళ్లు మూయించడంలో నూటికి నూరు పాళ్లు సఫలం అయ్యాడనాలి. బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో ప్రతికూలించిన ప్రకృతి ప్రస్తుతం సహకరించడం, ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగు పడటం రోశయ్యకు అనుకూలంగా మారాయి. ఆదిలో సహకరించని పలువురు మంత్రులను విశ్వాసంలోకి తీసుకొనడంలో రోశయ్య అవలంబించిన వైఖరి వల్ల అదే మంత్రులలో చాలామంది అనేక సందర్బాల్లో కలసికట్టుగా ప్రకటన చేయడం రోశయ్యకు మరో విజయం.

అధికార యంత్రాంగంలో మునుపటికంటే నిబద్ధత కనిపించడం, పరిపాలనలో చురుకుదనం చోటుచేసుకోవడం, అలిగిన మంత్రులే వాస్తవాలను అర్థంచేసుకుని పాలనలో క్రియాశీలక పాత్ర పోషించడం, విమర్శించిన స్వపక్షీయులే తప్పు సరి దిద్దుకుని రోశయ్యను సమర్థించడం, గతంలో రాజశేఖర రెడ్డికి అనుకూలంగా లేని కొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా రోశయ్యకు మద్దతు పలకడం, రోశయ్య ఏడాది పాలనకు విజయపు గుర్తులు. ఒక వైపు తనకంటూ ప్రత్యేక అజెండా అంటూ ఏదీ లేదని-దివంగత ముఖ్యమంత్రి అభివృద్ధి-సంక్షేమ పథకాలనే పటిష్టంగా అమలు పరచడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించినప్పటికీ, వాటి అమలుకు-వాటి అమలులో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న అక్రమాలను సవరించేందుకు, తనదైన శైలిలో, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రతిపక్షాల వారిని కూడా ఆశ్చర్య పరుస్తున్నది. పదే-పదే గొప్పలు చెప్పుకోకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు మాత్రమే కావాలన్న ఉద్దేశంతో కాకుండా, పథకాల అమలే ప్రధాన ధ్యేయంగా, ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనలో వ్యవహరిస్తున్న తీరు, పారదర్శకతతో-బాధ్యతాయుతంగా-జవాబుదారీతనంతో, అనునిత్యం రోశయ్య వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ ముఖ్యమంత్రులకు "బెంచ్ మార్క్" లా విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు కోత పడుతుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు ప్రచారమని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకుంటున్నారు. విమర్శించిన మంత్రులతో పని చేయించుకుంటూనే, ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసి, మరింత మెరుగైన పాలనకు ఇనుమడించిన సమర్థతకు పట్టంగట్టే దిశగా రోశయ్య అడుగువేస్తున్నారు. అధిష్టానం ఆమోదం, ఆశీస్సులు పుష్కలంగా వున్న రోశయ్య తన ప్రభుత్వాన్ని విమర్శలకు అతీతంగా నడిపించడానికి సర్వ శక్తులనూ ఒడ్డుతున్నారని త్రి కరణ శుద్ధిగా ఆయన తీసుకుంటున్న చర్యలు చెబుతున్నాయి.

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్ధితులను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, అధిష్టానం, అరమరికలు లేని మద్దతును రోశయ్యకు ఇచ్చేందుకు సంపూర్ణ సహకారం ఇస్తున్నారు. పార్టీపరంగా అర-కొరగా మిగులున్న "శైశవ దశలోని అసంతృప్తి" విషయంలో ఆమె ఆలోచనలను రాష్ట్ర పార్టీ నేతలకు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిర్మొహమాటంగా వివరించారు. మరో పక్క భావి భారత ప్రధాని రాహుల్ గాంధి రాష్ట్రానికి చెందిన యువ ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఆహ్వానించి తన సందేశం వినిపించారు. ఇరువురు, రాష్ట్రంలో రోశయ్య సారధ్యంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రోశయ్య ప్రభుత్వానికి కాని, రాష్ట్ర కాంగ్రెస్ కు కాని, జాతీయ స్థాయిలో పార్టీకి కాని నష్ట పరిచే "యాత్రలకు" అధిష్టానం అనుమతి లేదన్న ప్రత్యక్ష-పరోక్ష సంకేతాలు స్పష్టంగా వ్యక్త పరిచింది సోనియా గాంధి.

వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, రోశయ్య నాయకత్వంలో ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటున్నది. నిధుల కొరత కారణంగా వివిధ పథకాలకు ప్రాధాన్య పరంగా నిధులు కేటాయించడంలో రోశయ్య ఆర్థిక శాఖలో తనకున్న అనుభవం దోహదపడుతున్నది. మద్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రోశయ్య ప్రభుత్వం ఘాటుగా తిప్పికొట్టింది. మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం రావడం నేరం కాదని స్పష్టం చేశారాయన. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు’ కు తాను వ్యతిరేకం కాదు-అనుకూలమూ కాదని, అధిష్ఠానం ఏం చెబితే దానికి కట్టుబడి ఉంటానని, సమస్యకు పరిష్కారం చూపేందుకే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసిందని ఆయన పలు మార్లు స్పష్టం చేయడం వెనుక ఆయన పార్టీ విధేయత అవగాహన చేసుకోవచ్చు. తనను అస్థిర పరిచేందుకు కొన్ని బలీయమైన శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న విషయం తెలిసి కూడా ఆయన స్పందనలో రాజకీయానికి తావులేకుండా వ్యాఖ్యలుండేవి. తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఏనాడు ఆయన ఉదహరించలేదు.

రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్వపక్షం నుంచే ధిక్కార స్వరాలు వినిపించాయి. రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరున్నారు. సహచర మంత్రుల్లో కొందరు, రాజ్యాంగ పరంగా తప్పనిసరిగా చేయాల్సిన పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కామని హటయోగం చేసేంతవరకూ వెళ్లింది వ్యవహారం. చివరకు అన్నీ సద్దుమణిగాయి. "అధిష్టానం ఆశీస్సులు వున్నంత వరకు" ఎవరెన్ని అన్నా ముఖ్యమంత్రి స్థానంలోంచి రోశయ్యను కదల్చడం జరిగే పని కాదని తేలిపోయింది. పాలనా పరంగా పట్టు సాధించడమే కాకుండా, పార్టీ పరంగా తన మాటకు తిరుగులేదని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు రోశయ్య. తొమ్మిది గంటల విద్యుత్‌ విషయంలో స్వపక్ష విమర్శకుల వాదనను తిప్పికొట్టే సందర్భంలోను, ఓబులాపురం గనుల అక్రమాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేయడంలోను, రాష్ట్రం వరదల్లో అతలా కుతలం అయినప్పుడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌-యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని రప్పించడంలోను, బాబ్లీ వివాదాన్ని పరిష్కరించేందుకు అఖిల పక్ష కమిటీ వాదనను ప్రధానికి వినిపించడానికి చొరవ తీసుకోవడంలోను, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పధకాలను యధా విధిగా కొనసాగించడంలోను, నిరంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై నేర్పుగా సమీక్షలు జరపడంలోను, అధికార యంత్రాంగంపై పట్టు సాధించడంలోను, పరిపాలనకు సంబంధించిన విషయాలలో ఎవరిని-ఎక్కడ-ఎందుకు-ఏ సందర్భంలో నియమించాలనే విషయంలోను, ప్రతి విషయంలోను ఆచి-తూచి మాట్లాడడంలోను, తనకు తానే సాటి అని, "సరి లేరు తనకెవ్వరని" నిర్ద్వందంగా నిరూపించుకుంటున్న ప్రతిభాశాలి ముఖ్యమంత్రి రోశయ్య.

Thursday, May 27, 2010

"జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ఏర్పాటును సూచించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి : వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
(దివంగత సీఎం చెన్నారెడ్డి పౌర సంబంధాల అధికారి)

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, 1990 మే నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు-తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున్ రావు-ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పాలనా దక్షత పదే-పదే గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. చెన్నారెడ్డి గారి దగ్గర పౌర సంబంధాల అధికారిగా ఆ సమయంలో పనిచేసిన నాకు అవన్నీ చాలా దగ్గరగా గమనించే అవకాశం కలగడమే కాకుండా, ఎన్నటికి మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలలో కనీసం కొన్నైనా, నేనే కాకుండా, వాటిని దగ్గరగా వీక్షించిన (నేటి ముఖ్యమంత్రి రోశయ్య , సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి-మాజీమంత్రి దివాకర రెడ్డి-సమరసింహా రెడ్డి ... ఇంకా మరికొందరు) పలువురి తో సహా, బహుశా పలువురు పాత్రికేయులకు-ఆ మాటకొస్తే వర్తమాన రాజకీయాలను గమనించే చాలామందికి గుర్తుండే వుంటాయని భావిస్తున్నాను.

అదే రోజుల్లో, ఆరోగ్యం బాగాలేనందున శస్త్ర చికిత్సకొరకు అమెరికా ప్రయాణానికి సిద్ధమై-కుటుంబ సభ్యులను విమానాశ్రయానికి పంపిన తర్వాత, మధ్యలో మంత్రివర్గ సమావేశానికి హాజరైయేందుకు వచ్చిన చెన్నారెడ్డి గారు తుఫాను తీవ్రతకు చలించిపోయి, ఆరోగ్యం విషయం పక్కనపెట్టి-ఏకంగా తన పర్యటననే వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాకు వెళ్లి, అక్కడకూడా ఆరోగ్యం కంటే ముందు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు-ఇబ్బందులకు గురైన ప్రజలకు శాశ్వత పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బాంక్ సహకారం కోరడానికి సంబంధిత అధికారులను కలుసుకోవడంలోనే వారం-పది రోజులు గడిపారు. తర్వాతే చికిత్సకు సిద్ధమయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన చెన్నారెడ్డి గారు, న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో, అలనాటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో చేసిన ప్రసంగంలో, మొట్ట మొదటిసారిగా "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" (National Calamities Corpus-Need of the Hour) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావన చేశారు. "జాతీయ విపత్తుల సహాయక నిధి" పేరుతో ఒకటి, "జాతీయ విపత్తుల ఆకస్మిక ఖర్చుల నిధి" పేరుతో మరొక టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ, చెన్నారెడ్డి సూచించిన దానికి-వీటికి చాలా తేడా వుంది. తుఫానుకు గురైన రాష్ట్రాలకు ఈ రెండు సంస్థలనుంచి నిధులను విడుదల చేసే విధానాన్ని, ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఫైనాన్స్ కమీషన్ ఆ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావడానికి ముందర, ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరగడం, దాని కొరకు అధిష్ఠానం ఆహ్వానం మేరకు పక్షం రోజుల ముందు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం-వెళ్లినప్పుడు విమానాశ్రయంలో వీడ్కోలు ఇచ్చిన అతి కొద్దిమందిలో నేనూ వుండడం, పీసీసీ అధ్యక్షుడుగా-ఆ హోదాలో హైదరాబాద్ తిరిగొచ్చినప్పుడు వేలాది అభిమానులు ఆయనకు స్వాగతం చెప్పడం, ఢిల్లీ నుంచి వచ్చిన చెన్నారెడ్డి గారికి విమానాశ్రయంలో "ముఖ్యమంత్రి స్థాయిలో పోలీసు ఏర్పాట్లు" జరగడం, ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని జరగబోయే ఎన్నికల్లో ఓడించగల సత్తావున్న నాయకుడు దొరికాడని కాంగ్రెస్ వారు భావించడం, చివరకు అలానే 1989 ఎన్నికల్లో జరగడం, అధిష్ఠానం ఆయన్ను మరో మారు ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం-దాని కొరకు పరిశీలకులు రావడం, నేను అతి దగ్గరగా గమనించాను.

దక్షిణ భారత దేశాన్ని 1977 దివి సీమ ఉప్పెన తర్వాత భీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫానుగా 1990 మే నెల మొదటి వారంలో సంభవించిన తుఫానును పేర్కొన వచ్చు. మే 4, 1990 న "ఉష్ణ మండల గందరగోళం" గా ప్రారంభమై, తుఫానుగా మారి, వాయువ్య దిశగా కదిలింది. మర్నాటి కల్లా, తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే 8 కల్లా భయంకరమైన తుఫానుగా మారి, ఆంధ్ర ప్రదేశ్‌పై కనీ-వినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫానుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సౌకర్యాలతో సహా అన్ని రకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జనజీవనం స్తంభించి పోయింది. లక్షలాది గుడిసె వాసులు నివాసాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. "గుడ్డిలో మెల్ల" గా, తప్పిపోతుందనుకున్న తుఫాను రాష్ట్రాన్ని తాకనున్నదన్నసంకేతాలు ముందుగా అందడంతో, సరైన నివారక చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి. పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సి. అర్జున్ రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని పలువురు భావించే "సహాయ పునరావాస కమీషనర్" గా అంతకు రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు నివారక చర్యల వివరాలు, ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి "మార్గదర్శి" గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాను ముగిసిన కొంత కాలానికి అర్జున్ రావు గారు, ఒక చిన్న కార్పొరేషన్ ఎండి గా వున్నప్పుడు, సహాయ పునరావాస కమీషనర్ గా ఆయన తీసుకున్న చర్యలపై "రీడర్స్ డైజెస్ట్" ఒక గొప్ప ఆర్టికల్ ప్రచురించింది.

అలనాటి ప్రకృతి భీభత్సానికి పది జిల్లాలు అతలాకుతలమై పోయాయి. ఆయా జిల్లాల పాలనా యంత్రాంగంతో పాటు, రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం చురుగ్గా కదిలి, ఇతర జిల్లాలకు చెందిన అధికారులను ఒక్కో జిల్లాకు వేయి మంది వంతున పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసింది ప్రభుత్వం అర్జున్ రావు గారి ఆధ్వర్యంలో-ముఖ్యమంత్రి నాయకత్వంలో. తుఫానుకు గురైన వారిని గుర్తించడానికి ఒక బృందం, సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి మరో బృందం, ఆహార పదార్ధాల సక్రమ సరఫరాకు ఇంకో బృందం, వసతి ఏర్పాటుకు మరో బృందం, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టేందుకు ఇంకో బృందం.... ఇలా ఎన్నో బృందాలుగా ఏర్పడి శాస్త్రీయంగా సహాయ-పునరావాస కార్యక్రమాలను అమలు పరిచారు. సిరి ఫోర్టు ఆడిటోరియంలో ప్రసంగించిన చెన్నారెడ్డి గారు తన ఉపన్యాసంలో అవన్నీ వివరించినప్పుడు అధికారులను అభినందించిన తీరు ఆయన పాలనా దక్షతకు మచ్చుతునక. తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి, నాకు గుర్తున్నంతవరకు చేసిన ప్రయత్నాలు కనీసం రెండు రోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించ నందువల్ల, ఆయనతో సహా మేమందరం ఎక్కిన వైమానికదళ హెలికాప్టర్ మొదటి రెండు రోజులు "మొరాయించింది". ప్రధాన మంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి ముందుకు కదలలేదు. "ప్రధాన మంత్రికన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళ్లుతారు? ఆయనకెందుకు మొదలు ఆ కీర్తి దక్కాలి" అని హెలికాప్టర్ మొరాయించే ఏర్పాటు జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనే ది వారికే వదిలేద్దాం. ముఖ్యమంత్రితో సహా, ప్రతిపక్ష నాయకుడి హోదాలో స్వర్గీయ ఎన్ టీ రామారావు గారు కూడా రాజభవన్ లో ప్రధానిని కలిసి, సహాయం కొరకు అర్ధించారు. అంతగా రాజకీయాలకు తావులేని విధంగా వుందాయన అభ్యర్థన ఆ రోజుల్లో. వారూ-వీరూ అనే తేడా లేకుండా అంతా రాజకీయమే-అన్నీ విమర్శలే ఈ రోజుల్లో. తర్వాత మరో మారు కూడా ప్రధాని వచ్చి తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో స్వర్గీయ రాజీవ్ గాంధి తుఫాను ప్రాంతాలలో రెండు రోజులు తిరిగారు అప్పట్లో. సహాయ-పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి గారు అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు మరో మారు పర్యటించారు. తుఫానులు తరచుగా వస్తున్నాయనో-లేక-మరేమైనా కారణముందో, ఈ రోజుల్లో ప్రధాని గాని, సోనియా గాని పర్యటనలకు ఎక్కువగా రావడం లేదు.

తుఫాను సంభవించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం గురించిన వివరాలు టెలిప్రింటర్లో సందేశం వచ్చింది. (ఫాక్సులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు అప్పటికింకా). అందులో సహాయం మొత్తం ఇంత అని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు ఆ మొత్తం అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. ఇంతలో వచ్చిన మరో మెసేజ్ లో ముఖ్యమంత్రి చెప్పిన రు. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది. అదీ ఆయన జ్ఞాపక శక్తి. ఆ సహాయం గురించి ఆయనే మాకు వివరించారు. రకరకాల అంశాలను అధ్యయనం చేసి ఆర్థిక కమీషన్ "ఇంత మొత్తం" ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రాష్ట్రానికి తక్షణ సహాయం కింద ఇవ్వాలని నిర్ణయిస్తుందని, ఆ మొత్తం అప్పట్లో రు. 86 కోట్లుగా మాకు విశదీకరించారు. అందులో కూడా మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తుందని ఆయనే చెప్పారు. అలనాటి తుఫానును "జాతీయ విపత్తు" గా పరిగణించాలని చెన్నారెడ్డి గారు చేసిన ప్రతిపాదనకు స్పందించిన ప్రధాని వీపి. సింగ్ "ఇది జాతీయ విపత్తు కాకపోతే మరింకేదీ జాతీయ విపత్తుగా అనలేం" అని వ్యాఖ్యానించడమంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అనుకోవాలి. అంతటితో ఆగకుండా, ఇక్కడ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అనుకోకుండా, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా పంపించారు రాష్ట్రానికి వీపి. సింగ్.

అయినా చెన్నారెడ్డి గారు తృప్తిపడలేదు. అందిన సహాయం ఏ మూలకు సరిపోదని ఆయన భావన. ఆ ఆలోచనతో "ప్రపంచ బాంక్" ను కదిపారు. " ఈ ఆధునిక ప్రపంచంలో కొంత బియ్యాన్ని పంచడంతో నో, మరో రకమైన ధాన్యాన్ని-పప్పు దినుసులను సమకూర్చడంతో నో, గుడిసెల మరమ్మతుకు అంతో-కొంతో ధనం సహాయం చేయడంతో నో సరి పుచ్చుకోవడం మన సంస్కృతిని-సాంప్రదాయాన్ని-ప్రపంచం దృష్టిలో మన గౌరవ ప్రతిష్ఠలను ప్రతిబింబించవు. శాశ్వతమైన ఏర్పాట్లు చేసినప్పుడే ఫలితం వుంటుంది" అన్నారాయన. ఏం జరిగిందో-ఎలా జరిగిందో అని అర్థం చేసుకునే లోపల, ప్రపంచ బాంక్ బృందం, తుఫాను సంభవించిన అతి కొద్ది రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో అధికారులు వెంట రాగా రెండు రోజులు పర్యటించింది బృందం. మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన వారికిచ్చిన "తుఫాను ప్రాంత సంగ్రహ సమాచారం (Detailed Brief on what is to be done ?)" వివరించిన తీరు ఆయన మేథస్సుకు నిదర్శనం. బహుశా ఆయన తప్ప మరొకరు ఆ విధంగా చేయలేరని నా ఉద్దేశం. ఆయన ఆ రోజు ప్రపంచ బాంక్ బృందానికి చేసిన సూచన (తుఫాను ప్రాంత) భావి తరాల వారికి శాశ్వత పరిష్కారం. తర్వాత ప్రభుత్వాలు నిజంగా అందులో ఎన్ని అమలు చేసాయోగాని అమలు చేసే వుంటే తుఫాను తాకిడికి జరిగే నష్టం చాలా వరకు నివారించగలిగే వీలుండేది. ఆయన ఇచ్చిన వివరణలో ప్రధానమైంది "కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించి అస్తవ్యస్థమైపోయిన డ్రైనేజి ఏర్పాటు" గురించి.

"యావత్ భారత దేశంలో ఆంధ్ర ప్రాంతపు వ్యవసాయ దారులు, వ్యవసాయోత్పత్తిలో అగ్రగణ్యులని, 1924 లో, అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాయల్ అగ్రికల్చరల్ కమీషన్ పేర్కొంది. దానికి ప్రధాన కారణం అక్కడి డెల్టా ప్రాంతం-డ్రైనేజి వ్యవస్థ. అందుకే భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్ర ప్రదేశ్ కు పేరొచ్చింది. దురదృష్టవశాత్తు తుఫాను మూలంగా డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా నాశనమై పోయింది. అలా పాడై పోవడానికి, రాజకీయ నాయకుల-రకరకాల భూ ఆక్రమణదారుల ప్రోత్సాహంతో, డ్రైనేజి ప్రాంతంలో కాలువలకు చెందిన కొంత భాగాన్ని కబ్జా చేసుకోవడమే కారణం. కొందరు దురాశ పరుల మూలాన మొత్తం డ్రైనేజి వ్యవస్థ పగుళ్లకు దారితీసింది-పనికి రాకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలోని సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పొడవనున్న తీర ప్రాంతంలోని చాలా భాగం తుఫాను తాకిళ్లకు గురయ్యే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి శాశ్వతంగా అక్కడి ప్రజలను కాపాడాలి". అని ప్రపంచ బాంక్ బృందానికి వివరించి, "తుఫాను ఆవాసాలను" ఆ ప్రాంతాలలో పటిష్ఠంగా నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయమని అడిగారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విషయం గురించి ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడు మొయిన్ కురేషీతో చర్చించాలని చెన్నారెడ్డికి సూచించారు బృందంలోని సభ్యులు.

అప్పట్లో ప్రపంచ బాంక్ సహాయం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరి. ఇప్పుడూ అవసరమే కాని వారి దృష్టికి తీసుకెళ్తే చాలు. చెన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి డ్రైనేజి వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బాంక్ సహాయం విషయం చెప్పి, వారిచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. మొదట్లో వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణాన్ని వారం-పది రోజుల అనంతరం కొనసాగించారు. అత్యవసరంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సినప్పటికీ, జూన్ 6, 1990 అర్థ రాత్రి ఆసుపత్రిలో చేరేంతవరకు, నిత్యం ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ తన ప్రధమ కర్తవ్యంగా భావించానని అమెరికా నుంచి వచ్చిన చెన్నారెడ్డి సిరి ఫోర్టు ఆడిటోరియంలో చెప్పారు. చెన్నారెడ్డి గతంలో రాష్ట్ర ఆర్థిక-పారిశ్రామిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సందర్భంలో మొయిన్ కురేషీని కలిసిన సందర్భాలు ఇరువురూ గుర్తుచేసుకున్నారు. పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను తయారు చేయాలని, చేయించిన తదుపరి, తప్పక ఆర్థిక సహాయం చేస్తామని ఆయన దగ్గర హామీ తీసుకున్నారు చెన్నారెడ్డి. ఇరువురి కలయిక తర్వాత కేవలం పద్నాలుగు రోజుల్లో నిష్ణాతులైన పలువురు ప్రపంచ బాంక్ నిపుణుల బృందం రాష్ట్రానికి రావడం, వివరంగా అంచనాలను రూపొందించడం జరిగింది. భవిష్యత్ లో ప్రపంచ బాంక్ హామీ నెరవేరడం వల్లనే పాడై పోయిన డ్రైనేజి వ్యవస్థ బాగుపడింది ఆ తర్వాత.

ఆరోగ్యం కుదుట పడింతర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్టు ఆడిటోరియంలో మాట్లాడుతూ, తుఫాను భీభత్సాలను-ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి, అప్పట్లో అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోదని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఫైనాన్స్ కమీషన్ సమీక్షల ఆధారంగా అయిదు సంవత్సరాల కాలపరిమితికి సరిపడా ప్రకృతి వైపరీత్యాల సహాయ విధానం అమలు సరిపోదన్నారు. ఒకటి-రెండు రాష్ట్రాల నుంచో, కేంద్ర నుంచో నిధులను సేకరించి "జాతీయ విపత్తుల సహాయక నిధి" ని ఏర్పాటు చేయడంతో సరిపోదని, అన్ని రాష్ట్రాలలోని పౌరులందరి విరాళాలతో-భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక " న్యూక్లియస్ నిధి" ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ-అంతర్జాతీయ విపత్తులలో-విషాదాల్లో, తమ వంతు పాత్ర నిర్వహించాలన్న భావన ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు చెన్నారెడ్డి. ప్రణాళికా సంఘం సరైన ఆలోచన చేసి, భారత దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని-ప్రతి పౌరుడిని "విధిగా" తోచినంత విరాళం ఇచ్చే విధంగా "శాశ్వత నిధిని" ఏర్పాటు చేసే, ఆ నిధులతో నడిచే "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ను నెలకొల్పాలని సూచించారు చెన్నారెడ్డి. అలా చేస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో, తమ విరాళాలతో, తమ తోటి వారికి సహాయం అందిందన్న సంతృప్తి ప్రతి పౌరుడిలో కలుగుతుందని ఆయన భావించారు. అలా జరిగుంటే బాగుండేదేమో !

Friday, January 8, 2010

జ్వాలా మ్యూజింగ్స్-1 (మూడో సారి అమెరికా ప్రయాణం)

2009 ఆగస్ట్ నెలనుండి విరామం - సెప్టెంబర్ లో అమెరికాకు ప్రయాణం

వనం జ్వాలా నరసింహారావు

మా అబ్బాయి ఆదిత్య శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో, అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న గూగుల్ సంస్థలో పనిచేస్తున్నాడు. కొడుకు, కేడేన్స్ సంస్థలో పనిచేస్తున్న కోడలు పారుల్ రమ్మంటే సెప్టెంబర్, 2009 మూడో వారంలో అమెరికా దేశానికొచ్చాం. అమెరికా రావడం ఇది మూడోసారి. హైదరాబాద్ లో వుంటున్న మనుమడు పాఠశాలలకు శలవులిచ్చినందువల్ల, మా వెంట, అమెరికా వచ్చాడు మూడు వారాలుండి పోవడానికి. కోడలు, నవంబర్ చివరి వారంలో ప్రసవించాల్సి వుంది. (విరోధి నామ సంవత్సరం-మార్గ శిర మాసం-సప్తమి తిథి, నవంబర్ 24 ఉదయం 8-36 కు ధనిష్ఠ నక్షత్రంలో మా మూడో మనుమరాలు కనక్ పుట్టింది. ఇంతకు ముందు ఇద్దరు మనుమరాళ్లున్నారు-బుంటి కూతురు మిహిర, కిన్ని కూతురు మేధ. యష్విన్-అన్ష్ లు మనుమలు). మేం వచ్చినప్పుడు కనక్ పుట్టడానికి కొంత వ్యవధి వున్నందు వల్ల, వాసు దాసుగారి మందరం రామాయణం బాల కాండను లఘు కృతిలో రాయడం ప్రారంభించి, నెలరోజుల్లో పూర్తి చేశాను. ఇంకా అమెరికాలో నాలుగు నెలల వరకూ వుండాలి కనుక, ఆ సమయంలో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే, ఆదిత్య "జ్వాలా మ్యూజింగ్స్" పేరుతో "బ్లాగ్" ను డిజైన్ చేసి, నేనింతవరకు రాసినవి-రాయదల్చుకున్నవి, అన్నీ ఒక చోట వుండే విధంగా, అందులో పెట్టమని సలహా ఇచ్చాడు. కోడలు పారుల్, నా శ్రీమతి విజయలక్ష్మి, అమెరికాలోనే-హ్యూస్టన్లో వుంటున్న రెండో కూతురు కిన్నెర-అల్లుడు కిషన్, హైదరాబాద్ లో వుంటూ టీవీ9 లో పనిచేస్తున్న పెద్దమ్మాయి ప్రేమ-అల్లుడు విజయ గోపాల్ కూడా ఆదిత్య చెప్పింది చేస్తే బాగుంటుందని అనడంతో ఎన్నేళ్ల క్రితం నుంచో రాసిన వాటిలో ప్రాముఖ్యతా క్రమంలో బ్లాగ్ లో చేర్చడం మొదలెట్టాను. దాంతో పాటు ప్రతివారం వర్తమాన విషయాల మీద, క్రితం వారం జరిగిన సంఘటనల ఆధారంగా ఏదైనా రాస్తే బాగుంటుందన్న ఆలోచనతో రాయడం ప్రారంభించాను. ఎక్కడ మొదలుపెట్టాలా అని ఆలోచిస్తుండగా, నాకూ-ఆగస్ట్ నెలకూ వున్న అనుబంధం గుర్తుకొచ్చింది. అదే మొదటి మ్యూజింగ్స్. మూడోసారి అమెరికా పర్యటన అనుభవాలతో ఇది కొనసాగుతుంది ప్రస్తుతానికి.

ఆగస్ట్ నెలకూ నాకూ అవినాభావ సంబంధం-జన్మతో ఏర్పడ్డ అనుబంధం. ఆగస్ట్ 15, 1947న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి, ఆగస్ట్ 8, 1948న (నా పుట్టిన తేదీలో మూడు ఎనిమిదులున్నాయి) పుట్టాను నేను. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజులవి. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చేసి, స్వతంత్ర భారతావనిలో కలిపేందుకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మీద పోలీస్ యాక్షన్ జరిపేందుకు సన్నాహాలు మరోపక్క జరుగుతున్న రోజులవి. ఈ విషయాలను నాన్న వనం శ్రీనివాస రావు గారు చెపితే విన్నాను-చరిత్రలో చదువుకున్నాను. సెప్టెంబర్ 13, 1948న మొదలయిన పోలీస్ యాక్షన్, సెప్టెంబర్ 17, 1948న-కేవలం నాలుగైదు రోజులలోనే ముగిసి, యావద్భారత ప్రజల ఆనందోత్సాహాల మధ్య, హైదరాబాద్ రాజ సంస్థానం భారత దేశంలో విలీనమయింది.

అప్పటినుంచి, ఒక నెల అటు-ఇటుగా నా జీవితంలో ముఖ్య సంఘటనలన్నీ జులై-సెప్టెంబర్ నెలల మధ్యనే జరిగాయి-ఇంతవరకూ జరుగుతూనే వున్నాయి. యాదృచ్చికమే కావచ్చు. నా పెళ్లైన రెండేళ్లకు జులై 8, 1971న మా పెద్దమ్మాయి ప్రేమ మాలిని పుట్టింది. అది పుట్టడానికి మూడు రోజుల ముందర ఎం. ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పాసయ్యాను. అది పుట్టిన మూడు వారాలలో, అదే నెల ఆఖరు వారంలో, అనుకోకుండా (ఖమ్మం జిల్లా విద్యాధికారిణితో బస్ ప్రయాణంలో) అయిన పరిచయంవల్ల, నా జీవితంలో మొట్టమొదటి ఉద్యోగం రావడం, వెంటనే ఆగస్ట్ నెలలో ఆ ఉద్యోగంలో చేరడం జరిగింది. రెండేళ్లు తిరిగేసరికల్లా జులై-ఆగస్ట్ 1973లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ కోర్స్ లో సీటు లభించి చేరడం, ఏడాదిలో ముగిసి, ఇంకా పరీక్షలు రాయక ముందే, జులై 1, 1974న బీ.హెచ్.ఇ.ఎల్. హయ్యర్ సెకండరీ పాఠశాల (హైదరాబాద్) లో లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరడం జరిగింది. జులై నెలాఖరులో పరీక్షలు జరిగి నాకు యూనివర్సిటీ రెండో రాంక్ ఆగస్టులో రావడం మరో విశేషం. ఆ తర్వాత పదకొండేళ్లకు ఆగస్ట్ 1985లో సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి చంద్రమౌళి గారితో డాక్టర్ ఏ. పి. రంగారావు ద్వారా పరిచయం కావడం వల్ల, కొన్నాళ్లకు గవర్నర్ కుముద్ బెన్ జోషి అధ్యక్షత నున్న "చేతన గ్రామీణాభివృద్ధి స్వచ్చంద సంస్థ” లో ప్రాజెక్ట్ అధికారిగా చేరడం (మొదలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) జరిగింది. బీ.హెచ్.ఇ.ఎల్. హయ్యర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి. వై. పద్మావతి గారి దగ్గర క్రమశిక్షణను, ఇంగ్లీష్ భాషను (కొద్దో-గొప్పో) అలవాటు చేసుకుంటే, రాజ్ భవన్ లో పనిచేస్తున్న రోజుల్లో అధికార-అధికారేతర, రాజకీయేతర-రాజకీయాలకు చెందిన అనేక మందితో పరిచయాలయ్యాయి. ఈ నాటికీ ఆ పరిచయాలు కొనసాగుతూ, జీవితంలో ఎదుగుదలకు-నేను పనిచేస్తున్న సంస్థలకు నా ద్వారా లాభం చేకూరేందుకు ఎంతగానో పనికొచ్చాయి.

మూడేళ్ల తర్వాత ఆగస్ట్-సెప్టెంబర్ 1988లో, పాత్రికేయ మిత్రుడు పర్సా వెంకట్ ద్వారా, స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారితో మొదటి సారి పరిచయమయింది. ఆ పరిచయంతో ఆయనకు దగ్గరై, రెండోసారి ఆయన 1989లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయనకు పౌర సంబంధాల అధికారిగా పనిచేశాను. అయితే ఆయన అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత దాదాపు జులై-ఆగస్ట్ 1990నుంచి ఆయనకు దూరమవుతూ వచ్చి, ఆర్నెల్ల తర్వాత (రాజ్ భవన్) ఉద్యోగం కోల్పోయి, తిరిగి ఆగస్ట్ 1991లో హస్తకళల అభివృద్ధి సంస్థలో ఉద్యోగంలో చేరాను. నాలుగేళ్ల తర్వాత సెప్టెంబర్ 1995 మొదటి వారంలో (అప్పటి ఐ. ఓ.ఏ) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఫాకల్టీ మెంబర్ గా చేరాను డిప్యుటేషన్ మీద. అప్పటికి రెండు-మూడు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. జులై 1999లో మొట్ట మొదటి సారి నేను-శ్రీమతి కలిసి సిన్సినాటిలో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వెళ్లేందుకు అమెరికా ప్రయాణం అయ్యాం. వచ్చిన వెంటనే మొదటిసారి తానా మహాసభలను చూశాం. నా పుట్టిన తేదీకి నాలుగు రోజుల ముందు, ఆగస్ట్ 4, 1999న "ఫస్ట్ గ్రాండ్ చైల్డ్"-మనుమడు యష్విన్ పుట్టాడు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏడు సంవత్సరాల డిప్యుటేషన్ పూర్తయిన తర్వాత, నిబంధనలు ఒప్పుకోనందున జులై 31, 2002న రిలీవ్ అయి, మాతృ సంస్థ హస్తకళల అభివృద్ధి సంస్థలో చేరి, మర్నాడు ఆగస్ట్ 1, 2002న స్వచ్చంద పదవీ విరమణ చేశా నక్కడ. అక్కడ రిలీవ్ అయ్యి, అయిదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిపై, తిరిగి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో, అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉద్యోగంలో చేరాను ఒక రోజు తర్వాత. అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే, సెప్టెంబర్ 3, 2002న ఇంకో మనుమడు, అన్ష్ పుట్టాడు. వాడు పుట్టిన కొద్ది రోజులకే యు. ఎన్. డి. పి ప్రాజెక్ట్ కింద నాకు ఇంగ్లాండ్ దేశంలోని “థేమ్స్ వాలీ యూనివర్సిటీలో” మూడు వారాల శిక్షణకు వెళ్లే అవకాశం దొరికింది.

అంతా బాగుందనుకుంటున్నప్పుడే 2004లో ఎన్నికలు జరగడం, కోరుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. నాకింకా అప్పటికి మరో మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ వుంది. ఏప్రియల్ 2003లో మనుమరాలు మేధ పుట్టినప్పుడు అమెరికా వెళ్లిన సందర్భంగా రాసిన "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-సుందరకాండ మందర మకరందం" ప్రధమ ముద్రణ పుస్తకాన్ని(బాపు బొమ్మ కవర్ పేజీతో) ఆగస్ట్ 8, 2004న ఆవిష్కరించడం జరిగింది. అయినా అనుకున్నదొకటి-అయిందొకటి. అనతికాలంలోనే, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిటైర్‌మెంట్ వయసు కంటె ఏడాది ముందరే ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాను ఆగస్ట్ 31, 2004న. ఎంత ప్రయత్నం చేసినా ఆ ఉద్యోగం తిరిగి సంపాదించలేకపోయాను. ఏడాది తర్వాత ఆగస్ట్ నెలలోనే "సెంటర్ ఫర్ మీడియా స్టడీస్" హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లు అక్కడ పనిచేసింతర్వాత, 108-అత్యవసర సహాయ సేవలను అందించే ఈ. ఎం. ఆర్. ఐ సంస్థలో చేరి, మూడున్నర సంవత్సరాల తర్వాత ఆగస్ట్ నెల ప్రారంభం కావడానికి ఒకరోజు ముందర 31-07-2009న ఉద్యోగాన్ని వదిలేసి, విరామం కొరకు అమెరికాకు ప్రయాణం కట్టాను. సెప్టెంబర్ 22న శాన్ ఫ్రాన్ సిస్కో చేరుకున్నాను శ్రీమతితో కలిసి కొడుకు ఆదిత్య-కోడలు పారుల్ దగ్గరకు. వీరి వివాహం ఆగస్ట్ 20, 2008న జరిగింది. అంతకు ముందు “08-08-08”న మా షష్టి పూర్తి జరుపుకున్నాం.

అమెరికా ప్రయాణానికి ముందు నెలలో ఆగస్ట్ 8, 2009న "సుందర కాండ మందర మకరందం" ద్వితీయ ముద్రణ పుస్తకావిష్కరణ ఎప్పటిలాగే, బంధువుల-స్నేహితుల మధ్య మా ఇంటిలో ఆరుబయట జరుపుకున్నాం. ప్రధమ ముద్రణ-ద్వితీయ ముద్రణ పుస్తకాన్ని డాక్టర్. రంగారావు గారే ఆవిష్కరించారు. మొదటి ముద్రణ ఆవిష్కరణకు, సీనియర్ ఐ. ఏ. ఎస్ అధికారి, అప్పటి రాష్ట్ర సమాచార-పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. వి. రమణాచారి, పొరుగునున్న చిలకపాటి విజయ రాఘవాచార్యులు రాగా, రెండవ ముద్రణ ఆవిష్కరణకు వచ్చినవారిలో సినీ కళాకారుడు తనికెళ్ల భరణి, సూర్య పత్రిక సంపాదకులు హరినాథ్, రామ భక్తుడు సీతారామయ్య, రావులపాటి-భండారు-రాంపా కుటుంబాలున్నాయి.

Sunday, January 3, 2010

ఉద్యమం తొలిపొద్దులో.. ... వనం జ్వాలా నరసింహారావు

Please click this link for my article published in Andhra Jyoti Daily in its Edit Page on 3rd January, 2010.

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/01/03/ArticleHtmls/03_01_2010_004_002.shtml?Mode=1

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2010/jan/3edit3


ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర నినాదమూ పుట్టిందనవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (నాడు) కొందరు భావిస్తే, తెలంగాణ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు ఆనాడే అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది.

అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారు. అయినా పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి.

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టనాలలో, ఆరంభమైంది "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయం జరిగింది. దీంతో ఆయన సహోద్యోగులందరూ తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం కళాశాల విద్యార్థి "రవీంద్రనాథ్" (మా జూనియర్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. అప్పట్లో రాష్ట్ర హోం మంత్రిగా వున్న జలగం వెంగళ రావు ఉద్యమాన్ని అణచడానికి తన రాజకీయ చతురతను చూపాడు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నాకు నాలుగేళ్లు సీనియర్) రూమ్ లో, మల్లికార్జున్ (ఇప్పటి కీర్తి శేషులు) తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని (ఆయన రెండోసారి 1989-1990 లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయనకు ముఖ్య పౌర సంబంధాల అధికారిగా పని చేశాను) కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి.

చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. 1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు.

ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు కేంద్రం మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు. ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు.

వనం జ్వాలా నరసింహారావు

Friday, January 1, 2010

మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏ(వే)ర్పాటు ఉద్యమం-ఎక్కడి గొంగళి అక్కడే

Please Click this link for the article carried in SUJANARANJANI of Siliconandhra-San Francisco, USA

http://siliconandhra.org/nextgen/sujanaranjani/jan10/telamgana.html

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు (ఆనాడే) అభిప్రాయపడ్డారు. "విశాలాంధ్ర" ఏర్పాటు జరగాలని ప్రాణత్యాగం చేసినవారెందరో వున్నారు. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కూడా జరిగింది. అది జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి తెలంగాణ ఏర్పాటు జరుగుతుందా-జరగదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే వుందనాలి. ఈ నేపధ్యంలో, ఉద్యమాన్ని గత నాలుగు దశాబ్దాలకు పైగా గమనిస్తూ, అంతో ఇంతో ఆ ఉద్యమంతో సంబంధం వున్న వ్యక్తిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పూర్వాపరాలను గురించి "సిలికానాంధ్ర-సుజనరంజని" పాఠకులకు తెలియచేసే ప్రయత్నమే ఇది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, క్రమేపీ, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టనాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.

ముఖ్యమంత్రి కావాలని ఎన్నా(న్నే)ళ్లు గానో కలలుకంటున్న ఆంధ్ర ప్రాంతంనుండి ఖమ్మం జిల్లాకు వలసవచ్చిన "సెటిలర్" తెలంగాణ కాంగ్రెస్ నాయకుడొకరు, ఖమ్మంలో మొదలైన నాటి ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి పరోక్షంగా మద్దతిచ్చారని బహిరంగ రహస్యంగా చెప్పుకునేవారు చాలామంది. ఆ తర్వాత కాలంలో ఉద్యమ పుణ్యమో-మరేదో కాని ఆయన కోరికైతే నెరవేరి, ముఖ్య్యమంత్రి కాగలిగినా, ఆయన మాత్రం తెలంగాణ ఏర్పాటుకు ఆవగింజంత సహాయం కూడా చేయలేదు. ఏర్పాటుకు వ్యతిరేకించిన వారిలో ఆయన కూడా ఒకరు. ఇక నాటి ఉద్యమం విషయానికొస్తే: కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టనం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. అప్పట్లో రాష్ట్ర హోం మంత్రిగా వున్న జలగం వెంగళ రావు ఉద్యమాన్ని అణచడానికి తన రాజకీయ చతురతను చూపాడు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నాకు నాలుగేళ్లు సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి. ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని (ఆయన రెండోసారి 1989-1990 లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయనకు ముఖ్య పౌర సంబంధాల అధికారిగా పని చేశాను) కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి.

ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. 1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.

నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించ బడుతున్నామని తెలంగాణ వాసులు గ్రహించినా, అధిక సంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కొరకు ఎదురుచూచారు. పదవి లేని-రాని నాయకులెవరైనా ఉద్యమం మళ్లీ ఆరంభించి-నడపక పోతారానని ఎదురు చూడసాగారు. రాజకీయ స్వార్థం కోసమైనా ఎవరైనా తమకండగా వుండకపోతారానని భావించసాగారు. సరిగ్గా పదేళ్ల క్రితం వారి కోరిక నెరవేరింది. చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దొరకని కె. చంద్రశేఖర రావు-కేసీఆర్, "తెలంగాణ రాష్ట్ర సమితి"-టీ ఆర్ ఎస్ ని స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఒకరకంగా ఏకాభిప్రాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ-ఎవరూ సాధించని విజయాన్ని సాధించారని చెప్పాలి. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో, వై ఎస్ ఆర్ నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ-అటు పార్లమెంటు లోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగి, టీ ఆర్ ఎస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తేగలిగాడు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసుకుంటూ పోగలిగాడు. పార్టీలో తనకు ఎదురు తిరిగిన ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయగల సమర్థుడుగా ఎన్నో మార్లు నిరూపించుకున్నాడు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్ని మార్లైనా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు. తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు. అంతవరకూ బాగానే వుంది.


జాతీయ స్థాయిలో ఇంత చేయగలిగిన కేసీఆర్ "ఇంట గెలిచి రచ్చ గెలవాలనే" నానుడిని అర్థం చేసుకోలేకపోయాడు. తన రాష్ట్రంలో తనకంటే బలమైన తన ప్రధాన ప్రత్యర్థిని అంచనా వేయడంలో తప్పటడుగు వేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇంతమంది మద్దతు కూడగట్టుకోగలిగిన కేసీఆర్, వై. ఎస్. రాజశేఖర రెడ్డి మద్దతు కూడగట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోయాడు. వై ఎస్ ఆర్ అందించిన స్నేహ హస్తాన్ని వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలచుకోలేక పోయాడు. శాసనసభలో తన వాళ్లలో చాలామందిని ఆయనకప్పచెప్పాడు. టీ ఆర్ ఎస్ ను బలహీన పరుస్తుంటే ప్రేక్షకుడిలాగా చూడసాగాడు. రాజశేఖరరెడ్డి మద్దతు సాధించకుండా సోనియా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదని గ్రహించ లేకపోయాడు. ఒక్కో సారి అనవసరమైన ఎదురుదాడికి దిగాడు. తిరుగులేని అధికారంలో వున్న వై ఎస్ ఆర్ కి అధికారంలో లేని కేసీఆర్ ను బలహీన పరచడం తేలికై పోయింది. కేసీఆర్ ఒకతప్పుతర్వాత మరో తప్పు చేయసాగాడు. అయినా ఉద్యమాన్ని నడపగలిగాడు. తప్పటడుగులు వేస్తూనే నిలదొక్కుకోగలిగాడు. ఈ నేపధ్యంలో వచ్చాయి 2009 సారస్వతిక ఎన్నికలు.


ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థి బలాన్ని అంచనావేయ లేకపోయాడు. తన బలమెంతో తెలుసుకోలేకపోయాడు. ఎవరు శాశ్వత మిత్రులో-శాశ్వత శత్రువులో గుర్తించడంలో విఫలమయ్యాడు. ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసే బదులు, తెలంగాణ రాష్ట్ర సాధనను వ్యతిరేకిస్తున్న శక్తులతో చేతులు కలిపాడు. తన బలాన్ని-తెలంగాణ ప్రజలలో తనపై వున్న నమ్మకాన్ని నిరూపించ గలిగే వీలు కలిగినా, చేజిక్కిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు. అన్ని పార్టీలవారు తెలంగాణ పేరును ఉచ్చరించకుండా ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేకుండా చేయగలిగినా, తనకంటూ ప్రత్యేకతను టీ ఆర్ ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లు మరిచిపోయి, ఎన్నికల్లో చేసిన తప్పిదాలకే ప్రాముఖ్యతనిచ్చి, అనుకోని ఓటమిని రుచి చూపించారు. గుడ్డిలో మెల్లగా కేసీఆర్ మాత్రం తన సీటును దక్కించుకోగలిగాడు. ఏ ప్రజలైతే 1971 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చి తెలంగాణ కావాలన్నారో, ఆ ప్రజలే అస్పష్టమైన తీర్పిచ్చారు. తెలంగాణాలో గెలిచిన అన్ని పక్షాలకు చెందిన అభ్యర్థులు, ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ, తీర్పేంటి అన్నది అర్థంకాని ప్రశ్నలాగా మిగిలిపోయింది. చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించాడు కేసీఆర్. కొంతకాలం అజ్ఞాతంలో గడిపాడు.


అజ్ఞాతాన్ని వీడిన కేసీఆర్ బహిరంగంగా, పత్రికాముఖంగా తన తప్పిదాలను ఒప్పుకుంటూనే, భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడిచేశాడు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్థి చెపుతున్నట్లు టీవీ చానళ్లద్వారా (టీవీ9) ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ ప్రస్తుతానికి నిరాశే మిగిలింది.

ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంధాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో ప్రస్తుతానికి "చిదంబర రహస్యం" గానే భావించాలి.

ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఏం జరుగనున్నదో వెండి తెరపై చూడాల్సిందే.
(వ్యాసం ప్రచురణ అనంతరం-చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జనవరి 5, 2010 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర ఏర్పాటు మరో అడుగు వేస్తుందని ఆశించుదాం)
వనం జ్వాలా నరసింహారావు

Thursday, December 31, 2009

సేవా తత్పరుడు, స్నేహశీలి (డాక్టర్ వై. ఎస్. రాజశేఖరరెడ్డి)

సేవాతత్పరుడు, స్నేహశీలి

(Published on 6th September, 2009 in Andhra Jyothi Daily)

డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పనలో-అమలులోనే కాకుండా రాజకీయపరంగా కూడా ఊహ కందని శూన్యం ఏర్పడనుందా అన్న సందేహం కలగడం సహజం. ఎప్పుడో-ఏనాడో, పిన్న వయస్సులోనే, బహూశా తప్పని పరిస్థితుల్లో-కుటుంబ రాజకీయాల నేపధ్యంలో, వైద్య వృత్తిని వదిలి, రాజకీయ రంగప్రవేశం చేసిన డాక్టర్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి స్థాయికెదగడానికి ఆయన సొంత-స్వయం కృషే ప్రధాన కారణమనాలి. రాజకీయాల్లో ప్రవేశించినప్పటినుంచీ అపజయమనేది లేకపోయినా, అసలు-సిసలైన విజయం సాధించడానికి మాత్రం 2004 సంవత్సరం వరకూ ఓపిగ్గా వేచి చూడాల్సి వచ్చింది. తన పార్టీ వారితోనూ-ఇతర పార్టీలవారితోనూ నిరంతరం పోరాటం చేస్తూ-"నిత్య అసమ్మతి వాది" గా పేరు తెచ్చుకుంటూనే, తన లక్ష్యం-ధ్యేయం నెరవేర్చుకున్న థీశాలి రాజశేఖర రెడ్డి.

2004 ఎన్నికల్లోనూ, అంతకు ముందు చేసిన పాదయాత్రలోనూ, ఆయన చేసిన వాగ్దానాల అమలు దిశగా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ, మనందరికీ అందనంత ఎత్తుకెదిగి, చివరకు కనిపించని లోకాలకు చేరుకున్నారాయన. 2004 ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాలకు అదనంగా 2009 ఎన్నికల్లో చేసినవి రెండే రెండు వాగ్దానాలు. లోగడ చేసిన వాగ్దానాలనే పటిష్ఠంగా అమలుచేసి-మరింత ముందుకు తీసుకెళ్లడమే తాను చేస్తున్న ఇతర వాగ్దానాలని 2009 ఎన్నికల్లో చెప్పేవారు రాజశేఖరరెడ్డి. ఆయన అధికారంలో వున్న అయిదేళ్ల-నాలుగునెలల కాలంలో చేసిన వాగ్దానాల అమలుకొరకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాలకు స్వయంగా రూపకల్పన చేయడమే కాకుండా, వాటి అమలు విషయంలో నిరంతరం శ్రద్ధ కనపరిచేవారాయన.

అది, నిరంతరం పేద ప్రజలకు కడుపునిండా రెండు పూటలా అన్నం పెట్టడానికి ఉద్దేశించిన "ఆహార హామీ పథకమే" కావచ్చు, బడుగు-బలహీన వర్గాల అభ్యున్నతికి రూపొందించిన "ఉపాది హామీ పథకాలే" కావచ్చు, హృద్రోగంతో బాధపడుతుండే చిన్నారులను ఆదుకునేందుకుద్దేశించిన "ఉచిత శస్త్ర చికిత్సా పథకమే" కావచ్చు, లక్షలాది ఎకరాలకు సాగునీరందించే "జల యజ్ఞం పథకమే" కావచ్చు, స్వయం సహాయక-డ్వాక్రా మహిళలకుద్దేశించిన "పావలా వడ్డీకే ఋణ సౌకర్యం పథకమే" కావచ్చు, "ఇందిర ప్రభ" పేరుతో రూపుదిద్దుకున్న సమగ్ర భూ పంపిణీ అభివృద్ధి ప్రణాళికలే కావచ్చు, గ్రామీణ స్థితిగతులను స్వయంగా పరిశీలన-అధ్యయనం చేసేందుకు చేపట్టిన "పల్లె బాట" కార్యక్రమమే కావచ్చు, త్రికరణ శుద్ధిగా అమలు పరచదల్చుకున్న "మైనార్టీల సంక్షేమ పథకమే" కావచ్చు, "ఆరోగ్య భీమా పథకమే" కావచ్చు, "108-104 అత్యవసర-సాధారణ వైద్య-ఆరోగ్య సహాయ సేవలే" కావచ్చు ... ... ... ఇలా ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పనకు-అమలుకు యావద్భారత దేశానికే రాజశేఖరరెడ్డి తన ముందు చూపు ఆలోచనలతో "మార్గదర్శి" అయ్యాడనాలి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూమికున్న ప్రాధాన్యతను, భూమితో పేదలకున్న అనుబంధాన్ని-అవసరాన్ని గుర్తించిన రాజశేఖరరెడ్డి, నిరుపేదలకు స్వావలంబన చేకూర్చే దిశగా లక్షలాది ఎకరాల భూపంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, చిత్తశుద్ధితో అమలుపర్చారు. మహాత్మాగాంధి ఆశయాలకనుగుణంగా, ఇందిరాగాంధి ఆలోచనలకు ప్రతిరూపంగా తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టి అమలు జరుపుతున్నా అనేవారాయన. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అన్నివిధాలా కృషిచేసి, నిరంతరం బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేసేవారాయన. రాష్ట్రంలో కరవును శాశ్వతంగా పారద్రోలే దిశగా, వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని బయటపడవేసేందుకుద్దేశించిన సేద్యపు నీటిపారుదల ప్రాజెక్టులను ఒక యజ్ఞంగా చేపట్టాడు రాజశేఖరరెడ్డి. బంజరుభూములన్నీ సాగులోకి తేవాలన్నదే తన ధ్యేయంగా చెప్పేవారాయన.

అటవీ హక్కుల రక్షణ చట్టం కింద పన్నెండు లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమిపై ఆదివాసీలకు హక్కు కలిగించారాయన. "ఇందిర ప్రభ" పేరుతో బడుగులకు వెలుగులిచ్చిందీ, "సమగ్ర గ్రామీణ సంక్షేమానికి" చర్యలు చేపట్టిందీ, పేదలకు వరమైన "పనికి ఆహార పథకం" ప్రవేశ పెట్టిందీ, "భూ పంపిణీ" కి భూరి సన్నాహం చేసిందీ, "సునామీ బాధితులకు బాసటగా" నిల్చిందీ, "సమాచార స్రవంతి" కి శ్రీకారం చుట్టిందీ, "పల్లె బాట" స్ఫూర్తితో "నగర బాట" చేపట్టిందీ, రైతుల మేరుకోరి "ఉచిత విద్యుత్ పథకం" అమలు పర్చిందీ-కాలానుగుణంగా మార్పులు చేసిందీ, ఏటేటా అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ కు రూపకల్పన చేసిందీ, ఉపాధికి ఊతమిచ్చిన "యువ శక్తి" పథకాన్ని అమలు పర్చిందీ, కరవుపై కదన భేరి మోగించిందీ, రైతు చైతన్యానికి "పొలం బాట" పట్టిందీ.. ... ... వీటన్నిటి ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం "దశ" మార్చే "దిశ" గా ప్రస్థానం చేసిందీ, స్వర్గీయ రాజశేఖరరెడ్డే.

2009 ఎన్నికలకు కొన్ని రోజుల ముందర మిత్రుడు భండారు శ్రీనివాస రావుతో కలిసి నేను, ప్రస్తుత ఛీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క కలిసి, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మార్క్సిస్ట్ కంచుకోటలైన గ్రామాల్లో పర్యటించినప్పుడు, పార్టీలకతీతంగా రాజశేఖరరెడ్డి పథకాలవల్ల లబ్ది పొందామని వందలాది మంది గ్రామస్తులు చెప్పారు.

రాజశేఖరరెడ్డికి అన్నింటికన్నా మించింది "స్నేహ ధర్మం" అని ఆయన శత్రువులు కూడా ఒప్పుకుంటారు-ఎప్పుడూ అంటుంటారు. ఆ స్నేహ ధర్మమే ఆయనకు 1999 ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేసిందన్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే. స్నేహ ధర్మానికి విరుద్ధంగా ఆయనే కనుక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో 1999 ఎన్నికలలో ఒప్పందం కుదుర్చుకున్నట్లైతే, ఆయన సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెల్చుకొని, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వాడే. అయితే ఖమ్మం శాసనసభ స్థానం కొరకు పట్టుబట్టిన కమ్యూనిస్టులు, దానికీ-రాష్ట్రంలోని ఇతర స్థానాలలో ఒప్పందానికీ ముడివేసి లింకు పెట్టారు. ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ టికెట్ ను తన స్నేహితుడికిచ్చేందుకు వాగ్దానం చేసిన రాజశేఖరరెడ్డి, మాట నిలబెట్టుకునేందుకు, కమ్యూనిస్టులతో ఎన్నికల ఒప్పందం వద్దనుకున్నాడు. ఆయన అంచనా మేరకు ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థే గెలిచాడు. కాకపోతే రాష్ట్రంలో మెజారిటీ సీట్లను పొందడానికి ఆ సీటు అడ్డొచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రి కావడానికి మరో ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది.

రాజకీయంగా పరిణితి చెందిన రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో కమ్యూనిస్టులతోనూ-టీ.ఆర్.ఎస్ తోనూ సీట్ల ఒప్పందం కుదుర్చుకుని, కాంగ్రెస్ పార్టీని విజయ పథాన నిలిపారు. ఆయన చిరకాల ఆశయం నెరవేరింది. మిత్రుడు భండారు శ్రీనివాస రావుకు రాజశేఖరరెడ్డితో వున్న సాన్నిహిత్యం నాకు లేకపోయినా, ఆయన ద్వారా పరిచయమైన రాజశేఖరరెడ్డిని, అడపాదడపా, ఏదో ఒక సందర్భంలో, గత పాతికేళ్లకు పైగా కలుస్తుండేవాడిని. మరీ గత నాలుగైదు ఏళ్లుగా, ఇ.ఎమ్.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల సంస్థలో "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం" అమలు పరిచే విభాగానికి సలహా దారుడి హోదాలో పనిచేయడం వల్ల, ఉద్యోగ రీత్యా చాలా సార్లు కలుసుకునే అవకాశం కలిగింది.

అయితే, ఇక్కడో విషయం ప్రస్తావించాలి. 1989-1990 మధ్య కాలంలో నేను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు పౌర సంబంధాల అధికారిగా పనిచేసాను. అప్పటి వరకూ శ్రీనివాస రావు, నేను చాలా సార్లు రాజశేఖరరెడ్డిని కలుసుకుంటుండె వాళ్లం. చెన్నారెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న సందర్భంలో జరిగిన ఒక చిరు సంఘటనతో, రాజశేఖరరెడ్డిని, చాలాకాలం వరకు కలిసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అసలు విషయానికొస్తే: 1990 లో రాజశేఖరరెడ్డి గారు ఒక పర్యాయం న్యూ ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు వెళ్లినప్పుడు, తనకు జరిగిన అమర్యాదకు కోపగించిన ఆయన సీరియస్ కావడం, అమర్యాదకు కారణమైన వారిని మందలించడం జరిగింది. ముఖ్యమంత్రిగా వున్న చెన్నారెడ్డి గారు, ఆ విషయం తెలుసుకొని, ఆ సంఘటనను తనకు ప్రత్యర్థిగా పనిచేస్తున్నాడని భావించిన రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా పత్రికల్లో వచ్చే విధంగా నన్నొక పత్రికా ప్రకటన విడుదల చేయమని నాకు సూచించారు. అలా చేస్తే రాజశేఖరరెడ్డికి నాపై కోపమొస్తుందని నా జర్నలిస్ట్ మిత్రులు చెప్పినా పట్టించుకోకుండా, పౌర సంబంధాల ఉద్యోగిగా నా భాద్యత నెరవేర్చాను. అది జరిగిన తర్వాత ఏపీ భవన్ పై కోపగించిన రాజశేఖరరెడ్డి, నాకు తెలిసినంతవరకు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే దాకా అక్కడికి వెళ్లలేదు. శ్రీనివాసరావుతో కలిసి రాజశేఖరరెడ్డిని ఒక పర్యాయం కలిసినప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది. పెద్ద మనస్సుతో ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి నేను ఆయన దగ్గరకు వెళ్లడం ప్రారంభించాను. ఆయనకు అసలు నాపై కోపముందో లేదో కాని, వుందని నేను భావించాను.

రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎమ్.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎమ్.ఆర్.ఐ సంస్థకు పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. ఆ క్రితం రోజున ఇ.ఎమ్.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో సమీక్షించారు. ఆ సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య ఖర్చులనూ తప్పదనుకుంటే సమకూరుస్తానని హామీ ఇచ్చారాయన.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్ దేశానికి పోవడానికి ముందర తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత చేసిన మొదటిది. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎమ్.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం, ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎమ్.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎమ్.ఆర్.ఐ గా మార్పుచెందడం జరిగింది. అలాంటి మహనీయమైన వ్యక్తి ఇక మనమధ్యన లేరు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి.