Showing posts with label కమ్యూనిస్ట్ పార్టీ. Show all posts
Showing posts with label కమ్యూనిస్ట్ పార్టీ. Show all posts

Wednesday, July 17, 2013

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు-కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

          డబ్బై దశకంలో మా చుట్టు పక్కల గ్రామ పంచాయితీలున్న పాలేరు సమితి, ఖమ్మం పంచాయితీ సమితిగా మారడం, మా గ్రామాలన్నీ అందులోకి రావడం జరిగింది. సమితి సభ్యులలో గణనీయమైన సంఖ్య కలిగి వున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) బలమైన ప్రతి పక్షంగా వ్యవహరిస్తుండేది. జిల్లా రాజకీయాలకు సంబంధించినంతవరకు, కాంగ్రెస్ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయి, ఒక వర్గం శీలం సిద్దారెడ్డి నాయకత్వంలో, మరో వర్గం జలగం వెంగళ్ రావు నాయకత్వంలో పని చేయసాగాయి. ఇద్దరూ కొంతకాలం మంత్రులే. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా వెంగళ్ రావు ముఠాకు చెందిన వ్యక్తి వుండేవాడు. ఖమ్మం సమితికి ఆయన అనుంగు శిష్యుడు సామినేని ఉపేంద్రయ్య అధ్యక్షుడు. సమితి అధ్యక్షుడుగా వుంటూ, ఆ అధికార దర్పంతో, గ్రామాలలో ముఠా తగాదాలను ప్రోత్సహించేవాడని ఆయనకు పేరుంది. ఖానా పురం, ముదిగొండ, వల్లభి గ్రామాలలో కక్షలు ప్రబలిపోవడానికి ఆయనే కారణం. కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తుండే, ఖానా పురం గ్రామ వాసి వేదాద్రి హత్యలో అతడి పాత్ర వుందనేవారు.

          కాంగ్రెస్ పార్టీ ముఠా తగాదాలు, చివరకు సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్యపై, సిద్దారెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దారి తీశాయి. నాడు సిపిఎం పార్టీ పక్షాన ఖమ్మం ఎమ్మెల్యేగా వున్న రజబ్ అలీ సహాయంతో, సమితిలోని ఆ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని, తన పదవిని నిలబెట్టుకున్నాడు ఉపేంద్రయ్య. తనకు సహాయం చేసిన పార్టీ అన్న విశ్వాసం కూడా లేకుండా, అదే పార్టీ కార్యకర్తలపై, మా చుట్టుపక్కల గ్రామాల కమ్యూనిస్టులపై దాడులు ప్రారంభించాడు ఉపేంద్రయ్య. బాణాపురం గ్రామంలో గండ్లూరి కిషన్ రావు నాయకత్వాన సాగుతున్న వ్యవసాయ కార్మిక రైతు కూలీ పోరాటాన్ని అణచివేయాలని పథకాలు పన్నుతున్న భూస్వాములను చేరదీశాడు. మా నాన్న పట్వారీగా పనిచేస్తున్న అమ్మపేట గ్రామ సర్పంచ్, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడైన కోయ వెంకట్రావును, కాంట్రాక్టుల ప్రలోభం చూపించి తనవైపు తిప్పుకున్నాడు. కోయ వెంకట్రావు సహాయంతో గంధ సిరి గ్రామం మీద దాడి చేయించాడు. ఆ దాడిని గ్రామ ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టారు. నాటి నుంచి వెంకట్రావు, ఉపేంద్రయ్యకు కుడి భుజంగా వ్యవహరించసాగాడు. బాణా పురంలో వుంటుండే వెంకట్రావు తమ్ముడు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని కోయ సత్యంను తన వైపు తిప్పుకున్నాడు అన్న. భవిష్యత్‍లో బాణా పురంతో సహా పరిసర గ్రామాలలో జరిగిన అనేక దాడులలో అన్నదమ్ములిద్దరు ముందుండేవారు. వారిద్దరితో పాటు మా మరో సరిహద్దు గ్రామం పమ్మికి చెందిన చిన కోటయ్య, పెద కోటయ్యలను కూడా చేరదీశాడు ఉపేంద్రయ్య. మిగిలిన గ్రామాల విషయం ఏమైనప్పటికీ, బాణా పురంలో మాత్రం కిషన్ రావు నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేయసాగాడు ఉపేంద్రయ్య. ఆ గ్రామ భూస్వాములను చేరదీసి, డబ్బు పోగు చేశాడు. దెబ్బ తీయడానికి కాచుక్కూర్చున్నాడు. వారి పథకంలో భాగంగా, వారి పంచన పడి వున్న భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించేందుకు, బాణా పురం, పమ్మి, పెద మండవ, అమ్మ పేట లాంటి కీలక గ్రామాలలో పోలీసు క్యాంపులు వెలిశాయి.


1970 జనవరి నెల రెండో వారంలో, ఉపేంద్రయ్య కుట్రలను వివరించడానికి, కమ్యూనిస్ట్ పార్టీ గ్రామగ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఒకనాటి రాత్రి పమ్మి గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో గండ్లూరి కిషన్ రావు ప్రసంగిస్తున్న సమయంలోనే, అంతకు ముందే సిద్ధం చేసుకున్న ఒక పథకం ప్రకారం, బాణా పురంలో కోయ సత్యం నాయకత్వాన భూస్వాములు-వారి అనుయాయులు, స్థానిక పోలీసు క్యాంపు సహకారంతో, గ్రామంలో వున్న కమ్యూనిస్టులపై కవ్వింపు చర్యలకు దిగారు. ఎదురు తిరిగిన వారిని అమానుషంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, గ్రామంలో లేని కిషన్ రావుపైన పోలీసు కేసులు పెట్టించారు మర్నాడు. అలనాటి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దుర్గా ప్రసాద రావు తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని బహిరంగంగానే అనుకుండేవారు. పమ్మిలో మీటింగు ముగించుకుని గ్రామం చేరుకున్న కిషన్ రావును, ఆయన వెంట వచ్చిన జిల్లా సిపిఎం నాయకుడు రావెళ్ల సత్యం గారిని పోలీసులు విచారణ పేరుతో క్యాంపుకు పిలిపించారు. గ్రామంలోని సుమారు వంద మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను కూడా క్యాంపుకు పిలిపించారు. ఒక విధంగా అందరినీ అక్కడ బంధించారనాలి. ఆ తరువాత గుండాలు, పోలీసుల సహాయంతో దాడులు చేశారు. ఇదేం అన్యాయమని నిలదీసిన రావెళ్ల సత్యం గారిని గ్రామం విడిచి వెళ్లమని హుకుం జారీ చేశారు. ఎదురు తిరిగిన సత్యం గారిని ఏమీ చేయలేక పోయారు. గ్రామంలోనే వుండి పోయిన సత్యం గారు, చిత్ర హింసలకు గురైన గ్రామస్తులకు అండగా నిలిచారు. పోలీసు క్యాంపులో వున్న గండ్లూరి కిషన్ రావును, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులైన ముక్కా చిన నర్సయ్యను, అప్పి రెడ్డిని హింసించారు పోలీసులు. ఇదంతా సరిపోదన్నట్లు, అందరినీ తాళ్లతో బంధించి, నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

బాణా పురం గ్రామంలో జరిగిన దాడులకు నిరసనగా, వేలాది మంది చుట్టు పక్కల గ్రామాల వారు, వూరేగింపుగా వెళ్లి, ఖమ్మంలో బస చేస్తున్న నాటి హోం మంత్రి వెంగళ్ రావుకు మెమొరాండం ఇచ్చారు. ఆ నాడు జరిగిన బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోటూరు హనుమంత రావు హాజరై, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హోం మంత్రిగారు ఉత్తుత్తి వాగ్దానాలు చేశారు కూడా. బాణా పురంలో అలనాడు జరిగిన హింసా కాండలో ముక్కా చిన నర్సయ్య, పెరుమాళ్ల చంద్రయ్య లతో సహా కిషన్ రావు కూడా శారీరకంగా బాధలకు గురయ్యారు చాలా రోజుల వరకు. గుండాల దాడులు, కవ్వింపు చర్యలు, పోలీసులు బనాయించే దొంగ కేసులు నిత్య కృత్యమయ్యాయి. ఈ నేపధ్యంలో, కమ్యూనిస్ట్ కార్యకర్తలిచ్చిన మెమొరాండాన్ని విచారించాల్సిన హోం మంత్రి జలగం వెంగళ్ రావు, అది చేయకపోగా, బాణా పురం గ్రామానికి స్వయంగా వచ్చి, భూస్వాములతో సమావేశమై, "మీకు నేను అండగా వుంటా" నని హామీ ఇచ్చి వెళ్లాడు! కాకపోతే, సుమారు రెండు వందల మంది పోలీసు బలగంతో మాత్రమే ఆయన ఆ రోజు బాణా పురం రాగలిగాడు! ఇది జరిగిన కొన్నాళ్లకు, మా గ్రామ సరిహద్దు గ్రామైన పమ్మిలో కమ్యూనిస్ట్ వ్యవసాయ కూలి సంఘ కార్యకర్త పెరుమాళ్ల చంద్రయ్యను పట్ట పగలే బండ రాళ్లతో కొట్టి చంపారు. ఆ వూళ్లో పోలీసు క్యాంపు కూడా వుండేదప్పుడు. కాకపోతే, క్యాంపులోని పోలీసులు గుండాలకే మద్దతిచ్చేవారు. కోర్టులో ఆ కేసు నీరు కారి పోయింది. చంద్రయ్యను చంపిన కొన్నాళ్లకు, మందా నారాయణ అనే మరో వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు అదే పమ్మి గ్రామంలో.

పమ్మి హత్యాకాండ, పోలీసు కాల్పులు, హంతకులకు సహాయ పడుతున్న పోలీసు వ్యవహార శైలి.....ఇవన్నీ...బాణా పురం భూస్వాములలో ఉత్సాహాన్ని నింపింది. ఒక పథకం ప్రకారం, గండ్లూరి కిషన్ రావు కుడి భుజంలా పని చేస్తున్న ముక్కా చిన నర్సయ్యను హత్య చేశారు. 1970 వ సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో అనుకుంటా, చిన నర్సయ్య కోర్టు కేసుమీద ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లే దారిలో, భూస్వాముల గుండాలు కాపు కాచి, గండ్ర గొడ్డళ్లు, బరిశెలతో ఆయనపై దాడి చేశారు. తప్పించుకునే వీలు లేకుండా దెబ్బ తీశారు. హత్య చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను ఖమ్మంలో వున్నాను. బాబాయి నర్సింగ రావుకు ఈ వార్త తెలిసింది. వెంటనే నేలకొండపల్లి వెళ్దామన్నాడు. తోడల్లుడు జూపూడి ప్రసాద్ కారు తీసుకుని నేలకొండపల్లి వెళ్లి నర్సింగ రావును అక్కడ దింపి వచ్చినట్లు గుర్తుంది. బహుశా అది అప్పటికి మూడో హత్య అనుకుంటా. ఇంతలో పంచాయితీ ఎన్నికలొచ్చాయి. ఏమైనా సరే.... సాధ్యమై నన్ని గ్రామ పంచాయితీలను గెలిచి, సమితిని, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని జలగం ముఠా, ఆయన అనుయాయుడు ఉపేంద్రయ్య పథకం రూపొందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా బాణా పురం గ్రామ పంచాయితీని గెలవాలని పంతం పూనారు. కమలాపురం, గంధ సిరి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) లకు దక్కాయి. మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో, మొట్టమొదటి సారిగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి, పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంది. పమ్మిలో పోటీ తీవ్రంగా వుండేది. అయినా కమ్యూనిస్టులే గెలిచారు. నాచే పల్లిలోనూ అంతే. తొలుత బాణా పురం ఎన్నికలు జరగకుండా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు భూస్వాములు. ఎన్నికలు జరిగిన గ్రామాలలో చాలా భాగం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు, లేదా, సిద్దా రెడ్డి వర్గం అభ్యర్థులు గెలిచారు. ఉపేంద్రయ్య వర్గానికి అతి తక్కువ సీట్లొచ్చాయి మా ప్రాంతంలో. బాణా పురంలో స్టే ఎత్తి వేసింది కోర్టు. ఎవరెన్ని ఎత్తులు వేసినా, ఒక్క వార్డు (భూస్వాముల ఇళ్లున్న వార్డు) మినహా అన్నీ సిపిఎం పార్టీ గెలుచుకుంది. గండ్లూరి కిషన్ రావు మళ్లీ సర్పంచ్ అయ్యాడు. ఎన్నికల సమయంలో భూస్వాములు చేయని అరాచకం లేదు. ఐనా, ఓటమి తప్పలేదు.

          ఖమ్మం సమితికి సిపిఎం అభ్యర్థి రాయల వీరయ్య అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సిద్దారెడ్డి వర్గానికి దక్కింది. సిపిఎం అభ్యర్థి టి. వి. ఆర్ చంద్రం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడయ్యారు.

          ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది!

ఇదిలా వుండగా....మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో కూడా పోలీసు క్యాంపు వుండేది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు (అతడు 1970 పంచాయితీ ఎన్నికలలో వార్డు మెంబరుగా లాటరీలో గెలిచాడు. సర్పంచ్ గా మా పెదనాన్న గారి కుమారుడు వనం వరదా రావు ఎన్నికయ్యాడు) పోలీసుల అండతో గ్రామంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య పూర్వాపరాలు నాకింకా గుర్తున్నాయి. బహుశా సంక్రాంతి ముందు రోజనుకుంటా....నేను, మా ఆవిడ, మా ఇంటి నుంచి దగ్గర లోనే వున్న మా తోడల్లుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే కనిపించాడు వెంకట్రావు. ఒకరినొకరు పలకరించుకున్నాం. అప్పట్లో గ్రామంలో అతడికి పూర్తి వ్యతిరేకత వున్న కారణాన భయంతో ఖమ్మంలోనే వుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. ఎందుకో ఆ నాడు బాగా తాగి మా వూరు వెళ్లే ప్రయివేటు బస్సు ఎక్కి వాళ్ల వూరుకు బయల్దేరాడు. అప్పుడు మా పెద్దమ్మాయి బుంటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు. భోగి పండ్లు పోయడానికి మా అమ్మ ఖమ్మంలో ఆగింది. ఆ కార్యక్రమం అయిపోయింతర్వాత అమ్మను మా వూళ్లో దింపడానికి తోడల్లుడి కారులో రాత్రి పొద్దు పోయిన తరువాత బయల్దేరాం. వూళ్లోదాకా కారు పోయే వీలు లేనందున వూరి బయటే ఆపి అమ్మను ఇంటిదగ్గర దింపడానికి నడుచుకుంటూ పోయి దింపి వెనక్కు వచ్చాం. తిరిగి ప్రయాణమై ఖమ్మం చేరుకున్నాం. ఆ మర్నాడు మాకు తెలిసిన వార్త....కోయ వెంకట్రావును, మా గ్రామంలో బస్సు దిగగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకు పోయారని, అమ్మపేట తీసుకు పోయి హత్య చేసారని. సరిగ్గా అతడిని మా వూరి నుంచి తీసుకుపోయే సమయానికే నేను మా అమ్మను కారులో మా వూరికి వెళ్లడం యాధృఛ్చికం అయినప్పటికీ, నాకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండడం వల్ల, నాపై కూడా అనుమానం వచ్చింది కాని దానిని మా గ్రామ పటేల్ తుల్లూరి రామయ్య ఖండించాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, ఉపేంద్రయ్య, కమ్యూనిస్ట్ పార్టీపై ధ్వజ మెత్తాడు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును(శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రా రెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రా రెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గంధ సిరి గుండాలు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అరాచకం చేశారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అయితే, గంధ సిరి గుండాలు బాణా పురంపైన మాత్రం దాడి చేయలేకపోయారు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. తిరిగి ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు.


దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట" ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల అధీనంలో లేదు. అలాంటి నాయకులూ లేరు. 

Friday, July 5, 2013

స్థానిక గ్రామ పంచాయితీ రాజకీయాలతో అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు

స్థానిక గ్రామ పంచాయితీ రాజకీయాలతో అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

          1966 మార్చ్-ఏప్రిల్ నేలలో డిగ్రీ పరీక్షలు అసంపూర్తిగా రాయడం, ఎలాగూ ఫెయిల్ కాబోతుండడం, తక్షణం హైదరాబాద్‌లో చేయాల్సిన పనేమీ లేకపోవడం, నా మకాం హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా పురంకు మార్చడానికి దారితీసింది. అంతకుముందు చిన్నతనం నుండీ మా గ్రామంలో వుంటున్నప్పటికీ, రాజకీయాల జోలికి పెద్దగా పోలేదు. కాని డిగ్రీ చదువు పూర్తైన తరువాత గ్రామానికి పోవడంతో, ఎందుకో, నాలో కొంత మార్పొచ్చింది. రాజకీయాలంటే ఆసక్తి కలగడం మొదలైంది. అంతకు రెండేళ్ల క్రితం (1964 లో), మా పక్క గ్రామం కమలాపురం సర్పంచ్‌గా, కాలేజీలో నా సీనియర్ సహచరుడు, బాబాయి వనం నర్సింగరావు, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అలానే సమీపంలోని గ్రామాలైన బాణాపురం, గంధసిరి, మండవ, బుద్ధారం, చెర్వు మాధారం, అమ్మపేట, వల్లాపురం, చిరు మర్రి, ముదిగొండ, వల్లభి, నేలకొండపల్లి, ...తదితర గ్రామాలకు కూడా మా సమీప బంధువులో, లేక వారి ప్రతినిధులో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. బాణా పురానికి గండ్లూరి కిషన్ రావు (నాకు మామయ్య), గందసిరికి గండ్ర వీర భద్రా రెడ్డి, మండవకు అయితరాజు పట్టాభిరాం రావు (మా సమీప బంధువు), బుద్ధారానికి వెంకటేశ్వర రావు (నాకు మామయ్య), చెర్వు మాధారానికి కొరుప్రోలు చిన వెంకటేశ్వర రావు (నాకు మామయ్య), అమ్మపేట-వల్లాపురానికి కోయ వెంకట రావు (మా పెదనాన్న-నాన్న సూచించిన మనిషి), ముదిగొండకు రావులపాటి సత్యనారాయణ రావు (మా బంధువు) గారి మనిషి, వల్లభికి మా మామగారు అయితరాజు రాం రావు గారు, నేలకొండపల్లికి పెండ్యాల సత్యనారాయణ రావు గారు...ఇలా మా బంధువులో, స్నేహితులో, వారి దగ్గరి వారో దాదాపు అన్ని గ్రామాలకు సర్పంచులుగా వుండేవారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ శీలం సిద్దారెడ్డి వర్గంగా, జలగం వెంగళరావు వర్గంగా చీలిపోయి, గ్రామ-గ్రామాన, ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే స్థితిలో వున్న రోజులవి. శీలం వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సి. పి. ఎం పక్షం, జలగం వర్గానికి సి. పి. ఐ మద్దతుగా వుండేవి. సమితి అధ్యక్షుడుగా జలగం వర్గానికి చెందిన మేడేపల్లి (మా మేనమామ స్వర్గీయ కంకిపాటి రాజేశ్వర రావు గారు పట్వారీగా వున్న గ్రామం) గ్రామ వాసి సామినేని ఉపేంద్రయ్య వుండేవాడు.

          మా గ్రామ సర్పంచ్‌గా పర్చూరి వీరభద్రయ్య గారుండేవారు. ఆయన మనసులో-భావాలలో కమ్యూనిస్ట్ అయినప్పటికీ, గ్రామ సర్పంచ్‌గా కావడం మటుకు కాంగ్రెస్ వారి ఆశీస్సులతోనే! జిల్లాలోని ఇతర గ్రామాలలో వున్న ఆయన సమీప బంధువులంతా కమ్యూనిస్ట్ పార్టీ వారే. మా వూరు ప్రజల్లో చాలా భాగం కమ్యూనిస్ట్ అభిమానులైనప్పటికీ, గ్రామ పెత్తందార్ల దాష్టీకం కింద భయంతో, గ్రామ రాజకీయాలలో తలదూర్చడానికి భయపడేవారు. వాళ్లను కూడగట్టి ఒక గొడుగు కిందకు చేర్చే వాళ్లు అప్పట్లో లేనందున, నోరు మూసుకుని, గ్రామ కాంగ్రెస్ పెద్దలు చెప్పిన మాటకు తల వంచి, వాళ్ళు సూచించిన అభ్యర్థినే ఏకగ్రీవంగా సర్పంచ్‌గా అంగీకరించే వారు. గ్రామంలో పోలీసు పటేల్ తుల్లూరి రామయ్య, మాలీ పటేల్ నీరు కొండ వెంకయ్య, వాళ్ల అనుయాయులైన చాగంటి వారి కుటుంబాలు, వారి మాట జవదాటని శివారు గ్రామ పెద్దలు వాడపల్లి రాజేశ్వర రావు గారు, పెత్తనం చెలాయించేవారు. మా నాన్న గారిని కూడా వారితో కలుపుకుపోయేవారు. నాన్న సమీపంలోని అమ్మపేట గ్రామ పట్వారీ అయినప్పటికీ, మా గ్రామంలోను పెద్ద మనిషి కిందే లెక్క. పంచాయితీ ఎన్నికల తేదీ ప్రకటించగానే, వీరంతా కలిసి (సాధారణంగా) మా ఇంట్లో సమావేశమయ్యేవారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా పర్చూరి వీరభద్రయ్య గారి పేరును సర్పంచ్‌గా ప్రతిపాదించి, గ్రామంలోని రచ్చ బండ దగ్గర ఆ పేరే ప్రకటించి, ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఎవరూ పోటీకి దిగే సాహసం చేయక పోయేవారు. అలా అప్పటికి మూడు-నాలుగు పర్యాయాలు జరిగింది. గ్రామంలో పటేల్ మీద, వాళ్ల మనుషుల మీద వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వుండేది. సరిగ్గా ఆ రోజుల్లోనే నేను మా గ్రామం చేరుకున్నాను.

          మా గ్రామంలో మల్లెల అనంతయ్య అనే నిబద్ధతగల ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త వుండేవాడు. అతడొకరకమైన మనిషి. ఎవరికీ భయపడేవాడు కాదు. గ్రామ పెద్దలు చెప్పే ప్రతిమాటకూ ఎదురు చెప్పేవాడు. ఐనా ఎవరూ అతడిని పెద్దగా పట్టించుకోక పోయేవారు. పంచాయితీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా, పోటీ చేస్తానని ముందుకొచ్చేవాడు. అతడి ప్రయత్నాలకు గ్రామ పెద్దలు అడ్డుపడేవారు. ఆతడికి పెద్దగా ఆస్తి-పాస్తులు లేవు కాబట్టి, జనం ఆయన వెంట (పోవాలని వున్నా) పోవడానికి జంకేవారు. గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టుకుని గ్రామంలో మనుగడ సాగించడం కష్టమని వూళ్లో ప్రజల భావనగా వుండేది. నేను గ్రామానికి రావడంతోనే, ఆపాటికే, అంతో-ఇంతో కమ్యూనిస్ట్ భావాలను కలిగి వున్న నన్ను కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేపట్టాల్సిందిగా కోరాడు అనంతయ్య. దానికి కారణం లేకపోలేదు...ఒకటి నేను కమ్యూనిస్ట్ అభిమానిని కావడం...రెండోది నేను కూడా ఇతర గ్రామ పెద్దల లాగానే ఆస్తిపరుడిని కావడం. బహుశా నేను నాయకత్వం వహిస్తే కమ్యూనిస్ట్ అభిమానులు ధైర్యంగా నిలబడగలరని అనంతయ్య నమ్మకం కూడా కావచ్చు. నేను గ్రామానికి వచ్చిన మొదటి రోజుల్లోనే మా పొలం పక్క నుండి రోడ్డు వేసే విషయంలో నాకు, మా గ్రామ పటేల్‌కు కొంత వాదన అయింది. నా మాటకు విలువ ఇవ్వకుండా, తన పెత్తనం చెలాయించాడు పటేల్. నాకు కూడా అతడి మీద కొంచెం కోపం కలిగి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని వుండేది. కాకపోతే, మా నాన్న గారు, పటేల్ మంచి స్నేహితులు. మా ఇల్లు, వాళ్ల ఇల్లు ఎదురెదురుగా వుంటాయి. ప్రతి రోజు ఉదయం నాన్న గారు, పటేల్ రామయ్య కలవకుండా వుండక పోయేవారు. నాన్నకి కూడా వూళ్లో పెద్దలతో పంచాయితీకి దిగడం ఇష్టం లేక అందరితో మంచిగా వుండేవాడు. గ్రామ సర్పంచ్‌గా పర్చూరి వీరభద్రయ్య గారి పేరును నాన్నతోనే ప్రకటించేవారు. 

          ఇదిలా వుండగా, గ్రామ రాజకీయాలలో కొన్ని కీలకమైన ఘటనలు జరిగాయి. గ్రామంలో చాగంటి నారాయణ అనే ఒక వ్యక్తి తాగుడుకు బానిసై, వూళ్లో ఎవరినీ లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. "చాగంటి" ఇంటి పేరుగల కుటుంబాలు మా గ్రామంలో పది-పదిహేను దాకా వుండేవి. అన్నీ మధ్యతరగతి కుటుంబాలే. గ్రామంలోని ఒక బజారుని "చాగంటి వారి వీధి" అని కూడా పిలిచేవారు. వాళ్లంతా కలిసి కట్టుగా వుంటూ, అవసరమైతే ఎవర్నైనా ఎదిరించడానికి, కొట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండేవారు. చాగంటి నారాయణ, గ్రామ పటేల్ తుల్లూరి రామయ్యకు, సన్నిహితంగా మసలేవాడు చాలా కాలం వరకు. పటేల్ అండ చూసుకుని గ్రామంలో అందరిమీద పెత్తనం చేసేవాడు. తాగకపోతే అంత ఉత్తముడు ఎవరూ లేరన్నట్లుగా వ్యవహరించేవాడు. అతడిని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చేసేవాడు పటేల్ (సినిమా ఫక్కీలో). చివరకు పటేల్‌కు ఎదురు తిరిగాడు నారాయణ. ఒకరినొకరు బెదిరించుకునే దాకా పోయింది వ్యవహారం. గ్రామంలో తనను ఎదిరించేవాడు వుండడం సహించలేని రామయ్య ఎలాగైనా చాగంటికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అదృష్టవశాత్తు అతడి ప్రమేయం లేకుండానే, ఒక దసరా పండుగ నాడు, గ్రామంలో వుండే బత్తుల రాజులు అనే యువకుడు, సైకిల్ చైన్‍తో చాగంటిని చితకబాదాడు. వారిద్దరికీ ఏదో విషయంలో తగాదా వచ్చి ఆ పని చేశాడు రాజులు. "శత్రువు శత్రువు మిత్రుడు" అన్న సామెత ప్రకారం ఆ సంఘటనలో రాజులుకు వత్తాసు పలికిన పటేల్ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. చాగంటి వారి కుటుంబాలు కూడా ఆ రోజున నారాయణకు మద్దతుగా రాకపోవడానికి కారణం అతడికి ఏ విధంగానైనా కనువిప్పు కలగాలనే. మర్నాడు హూంకరించుకుంటూ పటేల్ ఇంటి మీదకు యుద్ధానికి వచ్చిన నారాయణను మరింత నిర్వీర్యం చేశాడు పటేల్. గ్రామంలో ఇక ముందెన్నడూ నారాయణను పెత్తనం చేయనివ్వనని స్పష్టం చేశాడు. పటేల్‌కు, చాగంటి నారాయణకు ఆ విధంగా పూర్తిగా బెడసి కొట్టింది.

అదే రోజుల్లో, రకరకాల కారణాల వల్ల, గ్రామంలోని మరో మోతుబరి రైతు, బత్తుల సురేందర్ (తరువాత రోజుల్లో వాళ్ల అబ్బాయి ఆదినారాయణ గ్రామ సర్పంచ్‌గా చేశాడు) పటేల్ రామయ్య మీద పగ పెంచుకున్నాడు. ఇలా గ్రామంలో ఒకరి వెంట మరొకరు బహిరంగంగా-కొంత ధైర్యంగా పటేల్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు రాసాగారు. నన్ను వాళ్లల్లో కలుకుని వ్యూహం పన్న సాగారు. నేను కూడా రాజకీయాలపై మక్కువతో కొంత, కమ్యూనిస్ట్ పార్టీపై అభిమానంతో కొంత వాళ్లకు అనుకూలంగా వుండసాగాను. దీనికి తోడు, పక్క గ్రామంలో వున్న బాబాయి నర్సింగరావు, బాణాపురం సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు, వల్లాపురంలో వుండే పెదనాన్న వనం శ్రీ రాం రావు గారు, గోకినేపల్లి వాస్తవ్యుడు-జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ (సి. పి. ఎం) నాయకుడు రావెళ్ల సత్యం గారి ప్రోత్సాహం మాకు లభించింది. ఎన్నేళ్లగానో మా వూరిని కమ్యూనిస్ట్ పార్టీ పరం చేయాలని అనుకుంటుండే వాళ్లకు ఇదో మంచి అవకాశంగా దొరికింది. గ్రామానికి చెందిన పర్చూరు రఘుపతి, చేబ్రోలు సత్యం, పటేల్ మీద కోపంగా వున్న చాగంటి నారాయణ, వాళ్ల కజిన్ చాగంటి సత్యం, దమ్మాలపాటి వీరయ్య, దేవబత్తుల పుల్లయ్య, దళిత వాడల నాయకులు కొందరు మాతో చేతులు కలిపారు. వాస్తవానికి మా గ్రామంలో కమ్యూనిస్ట్ ఓటర్లే ఎక్కువగా వుండేవారు. బయటపడడానికి భయపడే వాళ్లు. మొత్తం మీద వీరందరినీ ఒక తాటిమీదకు తెచ్చే బాధ్యత నెత్తి నేసుకున్నాడు మల్లెల అనంతయ్య. అందరూ కలిశారు. కలిసి వుండాలని "పసుపు బియ్యాల" తో ప్రమాణం చేశారు. నాన్న గారికి నేనలా వారితో కలిసి పని చేయడం ఇష్టం లేదు. నన్ను చాలా సార్లు మందలించారు కూడా. ఇంతలో పంచాయితీ ఎన్నికలు రానే వచ్చాయి.

          అప్పట్లో మూడంచెల పంచాయితీ వ్యవస్థ వుండేది. గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగేవి. తొలుత "వార్డు సభ్యులను" ఎన్నుకునేవారు. ఓటింగ్ వార్డు వారీగా జరిగేది. అదే రోజు సాయంత్రం గెలిచిన వార్డు సభ్యులంతా సాధారణ మెజారిటీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. కొద్ది రోజుల తరువాత, సర్పంచ్ లంతా కలిసి సమితి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ముందుగా సమితికి ఆరుగురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అందరూ కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. వివిధ కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ నాయకులను కో-ఆప్ట్ చేసుకుంటారు. కో-ఆప్ట్ చేసుకున్న సభ్యులకు కూడా సమితికి పోటీ చేసే అర్హత వుంటుంది. ఆ తరువాత సమితి అధ్యక్షులంతా కలిసి ఇదే ప్రక్రియలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అక్కడా కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే పద్ధతి వుంటుంది. జడ్. పి. చైర్మన్ గా పిలువబడే ఆ వ్యక్తిది చాలా పవర్ ఫుల్ హోదా. మన రాష్ట్రంలో కాబినెట్ మంత్రులుగా వుంటూ రాజీనామా చేసి, కొందరు జిల్లా పరిషత్  అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జడ్. పి. చైర్మన్లకు, ఎంత పలుకుబడి-ప్రాబల్యం వుండేదంటే, వాస్తవానికి వాళ్ల అంగీకారం లేకుండా ముఖ్య మంత్రి కావడం కూడా కష్టంగా వుండేదారోజుల్లో. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని కూడా మార్చగలిగే స్థితిలో వుండేవారు అప్పుడప్పుడూ. సమితిలో ఒక్క ఓటుతో అదృష్టం తారుమారయ్యేది. అదే ఒక్క ఓటు జడ్. పి. లో కీలకమయ్యేది. ఖమ్మం జడ్. పి. లో అలా జరిగింది కూడా.

          మా గ్రామ పంచాయితీలో అప్పట్లో తొమ్మిది వార్డులుండేవి. చాగంటి నారాయణను తాగుడు మానేయాలని నిబంధన విధించాం. అలా చేస్తే ఎన్నికల తరువాత అతడే సర్పంచ్ అని హామీ ఇచ్చాం. నేను పోటీ చేయాలంటే నాకింకా ఓటింగ్ వయసు రాలేదప్పటికి. కంకిపాటి హనుమంతరావు (అడ్వకేట్) ను బరిలో వుండమంటే అయన అంగీకరించలేదు. ఇంతలో బత్తుల సురేందర్ పసుపు బియ్యాల ప్రమాణం మరిచిపోయి మా వ్యతిరేక (పటేల్) కాంగ్రెస్ పార్టీ గ్రూప్‍లో చేరి పోయాడు. చాగంటి నారాయణ పోటీ చేసిన వార్డులోనే ఆయనా పోటీకి దిగాడు. ఆయన సోదరుడు, వూరంతటికీ మంచివాడని పేరున్న బత్తుల సత్యనారాయణ "రైతులందరు" వుండే వార్డులో పోటీకి దిగాడు పటేల్ పక్షాన. మల్లెల అనంతయ్య, చేబ్రోలు సత్యం, దమ్మాలపాటి వీరయ్య, దేవబత్తుల నాగేశ్వర రావు, తిరుపతయ్య...తదితరులు కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన (ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి) వార్డు మెంబర్లుగా పోటీ చేసారు. ఒక్క బత్తుల సత్యనారాయణ పోటీ చేసిన వార్డు మినహా, మిగతావన్నీ మాకే దక్కాయి. చివరి క్షణం వరకూ మా వార్డు మెంబర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసారు వాళ్లు. చివరకు చాగంటి నారాయణ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు, మా ఇంటి మీద, నా పై దాడికి దిగారు ప్రత్యర్థులు. వాళ్లకు తెలియకుండా, కన్ను కప్పి, పక్క వూరు కమలాపురం పోయి, అక్కడ నుంచి, సహాయంగా కొందరిని తెచ్చుకోవాల్సి వచ్చింది.

          చాగంటి నారాయణను గ్రామంలో ఎన్నటికీ పెత్తనం చేయనీయనన్న పటేల్ మాట చెల్ల లేదు. కాకపోతే...దీనికి ముగింపు వేరే విధంగా జరిగింది. అచిర కాలంలోనే...తాగుడుకు మరోసారి బానిసైన నారాయణ మళ్లీ పటేల్ పక్షంలో చేరి పోయాడు. కమ్యూనిస్టులకు నిరాశే మిగిలింది. అదెలా జరిగిందంటే....మా గ్రామ పంచాయితీతో పాటే ఇతర గ్రామాలకు కూడా ఎన్నికలు జరిగాయి. పక్కనున్న వల్లాపురం-అమ్మపేట ఉమ్మడి గ్రామ పంచాయితీ ఎన్నిక మాత్రం వాయిదా పడింది. సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సి. పి. ఎం)-శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గాలు గెలుచుకున్నాయి. సమితి దక్కించుకోవడానికి, ఇంకొక పంచాయితీ అవసరం, అటు శీలం వర్గానికి (సి. పి. ఎం మద్దతుతో), ఇటు జలగం వర్గానికి (సి. పి. ఐ మద్దతుతో) వుంది. వల్లాపురం ఎన్నిక కీలకమై పోయింది. ఖమ్మం సమితి ఎవరు గెలుస్తే, వారి పక్షమే జడ్. పి. గెలుచుకునే పరిస్థితి నెలకొంది. ఓ వారం రోజుల్లో వల్లాపురం ఎన్నిక జరిగింది. జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, అతిరథ-మహారథులు, అందరూ వల్లాపురం చేరుకున్నారు. మా పెదనాన్న సారధ్యంలో ఆ గ్రామ పంచాయితీకి, మరో పెదనాన్న కుమారుడు వనం వరదా రావు (సిద్ధారెడ్డి వర్గానికి చెందిన) ఎన్నికయ్యాడు. అప్పటికింకా సమితి ఎన్నిక ఐదారు రోజులే వుంది. వల్లాపురం ఎన్నిక కావడంతోనే జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో "క్యాంపులు" పెట్టే చర్యలు చేపట్టారు. ఆ క్యాంపుకు మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణ కూడా వెళ్లాలి. అప్పుడే పేచీ పెట్టాడు వెళ్లనని. అప్పటికే మా గ్రామ పటేల్‌తో రహస్య ఒప్పందం కుదిరుండాలి! చివరికి బలవంతం మీద వెళ్లక తప్పలేదు. క్యాంపులోనే తాగుడికి అలవాటు పడ్డాడని కొందరంటారు.

          పద్ధతి ప్రకారం నిర్ధారించిన తేదీ నాడు ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. ఇరు పక్షాలకు, ఎవరి లెక్క ప్రకారం వారికి, ఒకే ఒక్క ఓటు మెజారిటీ. మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణను, ఇరు వర్గాల వారు తమ ఓటు కింద వేసుకున్నారు. చాగంటి నారాయణ కూడా తెలివిగా వ్యవహరించడం మొదలెట్టాడు. మొదటి కో-ఆప్టెడ్ సభ్యుడిగా శీలం-సి. పి. ఎం అభ్యర్థి గెలిచాడు. రెండవ అభ్యర్థిగా గోకినేపల్లి గ్రామానికి చెందిన, ప్రముఖ సి. పి. ఎం నాయకుడు రావెళ్ల సత్యం, శీలం-సి. పి. ఎం పక్షాన పోటీలో వున్నాడు. చాగంటి అతడికి ఓటు వేయకపోవడంతో ఓడి పోయాడు. గెలిచినట్లయితే అతడే సమితి అధ్యక్ష అభ్యర్థి. తెలివిగా ఆయనను ఓడించారు ప్రత్యర్థులు. ఆ సమయంలో చాగంటికి వార్నింగ్ పోయింది. గీత దాటితే పరిస్థితులు తీవ్రంగా వుంటాయన్న హెచ్చరికలు పోయాయి. మొత్తం మీద, ఆ తరువాత నాలుగు కో-ఆప్టెడ్ సభ్యులుగా శీలం-సి. పి. ఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. వారిలో రాయల వీరయ్య ఒకరు. ఓటమికి గురి కాబోతున్న జలగం గ్రూపు అభ్యర్థి సామినేని ఉపేంద్రయ్య, శీలం గ్రూపు కాంగ్రెస్ వారిని తనకు మద్దతు ఇవ్వమని వేడుకున్నా ఫలితం లేకపోయింది. రాయల వీరయ్య సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఉపేంద్రయ్య గ్రూపు ఆ తరువాత ఎన్నికను బాయ్ కాట్ చేయడంతో, బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వీరయ్య ఎన్నికను కోర్టులో సవాలు చేశారు. తాత్కాలికంగా ఎన్నిక రద్దు అయింది. కిషన్ రావు ఇన్-ఛార్జ్ అధ్యక్షుడుగా చాలాకాలం పని చేశారు. ఆ సారి జడ్. పి. కూడా శీలం వర్గానికే దక్కింది.        

          తన పదవీ కాలం పూర్తిగా ముగియకుండానే, చాగంటి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన స్థానంలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన కమ్యూనిస్ట్ మల్లెల అనంతయ్య సర్పంచ్ అయ్యాడు.
అదో అనుభవం....        


Sunday, December 11, 2011

పౌర హక్కుల సంఘం: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 10

పౌర హక్కుల సంఘం

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో దవ అధ్యాయం ఇది).

నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, .ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ గారి తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు-డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.

సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం.