తనను కలిసేందుకు వచ్చే సందర్శకులను రాజశేఖర రెడ్డి పలక రించే తీరు, వారిని స్వాగతించి వచ్చిన కారణం అడిగే తీరు, వచ్చిన పని అయిపోయినప్పటికీ అనవసరంగా కాలయాపన చేస్తుంటే పరోక్షంగా వెళ్లిపొమ్మని సంకేతాలిచ్చే వైనం ఒక ప్రత్యేక శైలిలో ఉండేవి. సందర్శకుల విన్నపాల్లో, అభ్యర్థనల్లో తాను ఆలోచన చేయని ప్రజోపయోగమైన విషయాలే మన్నా వున్నయేమోనని ఆరా తీస్తున్నట్లు నాకనిపించేది. తానిచ్చిన వాగ్దానాలకు సంబంధించి నెరవేర్చలేని సామాజిక పరమైన అంశమే మన్నా తన దృష్టికి తీసుకొచ్చేందుకు తనను కలవడానికి వచ్చారేమోనన్న విధంగా ఆయన వ్యవహరించేవారు. సందర్శకులకు, కార్యార్థులై వచ్చే వారికి తాను ఇది- అది చేశానని గొప్పలు చెప్పేవారు కాదు. విషయాన్ని ఆకళింపు చేసుకునేందుకు అతి తక్కువ సమయం తీసుకునే వారు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం, ఆయన తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం వెనుక, మూడు దశాబ్దాలుగా ఆయనకు ప్రజలతో ఏర్పడ్ట సంబంధాల నేపథ్యంలో ఆయన అవగాహన చేసు కున్న వారి కోరికలున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు లోనై, విద్య-వైద్య పరమైన కనీస అవసరాలను నెరవేర్చుకోలేని వారి ఆక్రందనం ఉంది. బహుళార్థ సామాజిక అవసరాలున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తనకే అన్నీ తెలుసని, ఇతరుల సలహా-సంప్రదింపులు తనకు అవసరం లేదని ఆయనెప్పుడూ భావించిన విధంగా ఉండేవి కావు.
సాధారణంగా సంతానం కష్టాలపాలైనప్పుడు ముందుగా బాధ పడేది తల్లితండ్రులు. అలాగే పూర్వ కాలంలో ఉత్తములైన మహారాజులు తమ ప్రజ లను కన్న పిల్లల్లా చూసుకునేవారని విన్నాం- చదువుకున్నాం.అలాంటి సద్గుణాలే రాజశేఖర రెడ్డిలో కూడా ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలకు గుండె జబ్బుల ఆపరేషన్లు ఉచితంగా చేయించే సౌకర్యం, ఫ్లోరోసిస్ పీడిత ప్రజలను ఆయన ఆదుకున్న విధానం వాటిలో కొన్ని. ఆరోగ్య శ్రీ ఉచిత భీమా పథకం ద్వారా బీదా-బిక్కీకి కార్పొరేట్ వైద్య సౌకర్యం కలిగించడం ప్రజలను ఆయన కన్న బిడ్డలలాగా చూసుకున్నారనడానికి చక్కటి ఉదాహరణ.అందరూ అసాధ్యమని ఎలుగెత్తి ఘోషించిన ఉచిత విద్యుత్ సౌకర్యం సులభంగా సాధ్యమని నిరూపించడం వెనుక కూడా ఆయనకు తన ప్రజల పట్ల ఉన్న అభిమానం కనిపిస్తుంది.
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, పదవీ విరమణ చేసి ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న పలువురి ఉద్యోగాలు పోయా యి. వాస్తవానికి, రిటైర్మెంట్ వయసు నిండిన వారి విషయంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అది. నా విషయం పూర్తిగా ఆ నిబంధన కిందికి రాకపోయినా, ఉద్యోగం కోల్పోయిన వారిలో నేను కూడా ఉన్నాను. అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయాలలో ఒకటైన దాని మూలాన ఎంతో మంది కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కలగడమే కాకుండా, ఆయన కంటే ముందున్న ప్రభుత్వం తీసుకున్న పొరపాటు నిర్ణయం సరిదిద్దినట్లు నేను భావించాను. ఉద్యోగం పోయిందన్న చింత కొంత కాలంలోనే తొలగింది.
మీడియాకు లక్ష్మణ రేఖ అన్న అంశంపై, ప్రెస్ అకాడమీ-సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన అఖిల భారత స్థాయి సదస్సు హైదరాబాద్ లో జరిగింది. ఆ సాయంత్రం ముఖ్య మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో నేనూ ఉన్నాను. ఆ తర్వాత ఆ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను- వక్తల ప్రసంగాలను పుస్తకరూపంగా తీసుకొచ్చి, ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించినప్పుడు కూడా ఉన్నాను. ఆ రెండు సందర్భాల్లో, ఆయన మాటల్లో మీడియా స్వాతంత్య్రం విషయంలో ఆయన నిబద్ధత వ్యక్తం కాగా, మరొక టి, ఒకరి ప్రమేయం లేకుండా మీడియా తనంతట తానే బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ఆయన అభిప్రాయం స్పష్టంగా వెల్లడయింది.
ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) 108 అత్యవసర సహాయ సేవల ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య సలహాదారుడిగా దివంగత ముఖ్యమంత్రిని కలిసే అవకాశం చాలా సార్లు కలిగింది. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు మరీ ప్రీతిపాత్రమైనది. ఆరోహణ- అవరోహణల మధ్య మహాప్రస్థానం సాగిస్తున్న 108 అత్యవసర సహాయ సేవలు, ఈ రోజున పది రాష్ట్రాలలోని నలభై కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతూ, లక్షలాది ప్రాణాలు కాపాడడానికి కారణమయ్యాయంటే, అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చొరవే అనాలి.
రాజశేఖర రెడ్డి మరణంతో, ఆయన ఆలోచించి- రూపకల్పన చేసి- అమలుపరిచిన, అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల కొన సాగింపు ఒడిదుడుకుల్లో పడి పోయిందన్న భావన కలిగేలా ప్రభుత్వ పరంగా సంకేతాలొస్తున్నాయి. దానికి కారణాలుండవచ్చు- అవి సహేతుకమైన వీ కావచ్చు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాల్లో కొన సాగింపు కష్టతరమైనవేమన్నా ఉంటే, వాటి కారణాలు స్పష్టం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది- అనధికారులది. కొన్ని విధాన పరమైన నిర్ణయాల విషయంలో విమర్శలు కూడా వస్తున్నాయి. అందులోని నిజా నిజాలను కూడా ప్రజలకు తెలియచేయడం మంచిది.
