Showing posts with label శ్రీశ్రీ. Show all posts
Showing posts with label శ్రీశ్రీ. Show all posts

Wednesday, November 2, 2011

జై తెలంగాణ - జై ఆంధ్ర - జై సమైక్యాంధ్ర : కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి? - వనం జ్వాలా నరసింహారావు

జై తెలంగాణ - జై ఆంధ్ర - జై సమైక్యాంధ్ర :

కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి?

సూర్య దినపత్రిక (4-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ పై సిపిఎం అస్పష్ట వైఖరి; పార్టీలో సహజమైన మిలిటెన్సీ లోపించడమే కారణమా?; సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామన్న ప్రకటనకే పరిమితం; సిపిఎం గతాన్ని మరచిందా?; ఆందోళన చెందుతున్న అసలైన మార్క్సిస్టులు; ఎవరిని సంతోషపెట్టడానికి ఇదంతా అనే అనుమానాలు - ఎడిటర్ సూర్య (4-11-2011)


1930వ దశకంలోనే భారత దేశాన్ని భాషా ప్రాతిపదికన పునర్విభజించి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, జాతీయోద్యమం తీర్మానించింది. దక్షినాదిన, విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహా కర్నాటక, బృహన్మహారాష్ట్రలు ఏర్పాటు చేయాలనీ, అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా భావించింది. ఆ ఆలోచనతోనే, 1946లో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య, "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న పేరుతో ఒక పుస్తకం రాశారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరిచే అనేక సూచనలు ఆ పుస్తకంలో ఆయన చేశారు. 1946లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో తెలంగాణా జిల్లాల నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు నరసింహా రెడ్డి, భీమిరెడ్డి నరసింహా రెడ్డి, ఆరుట్ల దంపతులతో పాటు, ఆంధ్ర జిల్లాల నుండి సుందరయ్య, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, లావు బాల గంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి తదితర నాయకులతో సహా వేలాదిమంది ఇరు ప్రాంతాల కార్యకర్తలు భుజం-భుజం కలిపి 1951 వరకు వీరోచిత పోరాటం చేశారు. నాలుగువేల మందికి పైగా ప్రాణాలను అర్పించారు. సెప్టెంబర్ 17, 1948 న నిజాం హైదరాబాద్ రాష్ట్రం - హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం, 1953లో భాషా ప్రాతిపదికన విభజన జరగడం, 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడం తెలియని వారెవరూ లేరు.

1953లో తెలంగాణ కోసం కొందరు గొంతు విప్పిన నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ "సమైక్యాంధ్ర సదస్సు" ను ఏర్పాటు చేసి, దానికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ సదస్సుకు శ్రీశ్రీ ప్రధాన ఆకర్షణ. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైంది. ఖమ్మం లో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహారదీక్షకు పూనుకోవడం ఉద్యమానికి నాందిగా చెపుతారు. అతని కుటుంబం వెంగళరావుకు అనుచర వర్గమన్నది అప్పట్లో అందరికీ తెలిసిన వాస్తవం. ఉద్యమానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. హైదరాబాద్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమం గ్రామ సీమల్లోకి పాకక పోయినా, నగర - పట్టణ ప్రాంతాలలో విద్యావంతులను ఆకట్టుకుంది. నగరంలో విధ్వంసం చోటు చేసుకుంది. ఆంధ్ర జిల్లాల వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లు కూడా మార్చుకున్న ఉదంతాలున్నాయి. హైదరాబాద్ నగర గోడలపై ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై, ఆయన భార్యపై అశ్లీల రాతలు వెలిశాయి.

ఖమ్మంలో జులై నెల 6, 1969న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) - సిపిఎం ఆధ్వర్యాన సమైక్యతా సభ జరిగింది. నాటి మునిసిపల్ చైర్మన్ స్వర్గీయ చిర్రావూరి లక్ష్మీనరసయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ సభలో, శ్రీ శ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్య, గోరా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావు, నాటి సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, సమైక్యతను సమర్థిస్తూ ఉపన్యసించారు. సదస్సు తరువాత, సాయంత్రం నాలుగు గంటలకు మూడువేల మందితో ఊరేగింపు మొదలైంది. ఊరేగింపును అడ్డుకున్న వారికి బి.ఎన్. నాయకత్వాన ఎర్ర జెండా కర్రతో దుండగులను తరిమి కొట్టిన సంగతి అప్పట్లో పలువురి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలోని మొత్తం జిల్లాలలో సమైక్యత కోసం సిపిఎం చేసిన మొదటి ప్రయత్నం ఇది. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా సమైక్యతా వాద సదస్సులు జరిగాయి.

సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెపుతూ, ప్రజలలో అవగాహన కలిగించడానికి సిపిఎం అనేక కరపత్రాలను వేసిందా రోజుల్లో. సిపిఎం నాయకుడు స్వర్గీయ మోటూరి హనుమంతరావు అనేక వివరాలతో రాసిన "విశాలాంధ్రలో విషాదచ్ఛాయలు" పుస్తకం వేల కాపీలు రాష్ట్రం మొత్తం పంచబడింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా పార్టీ ఆధ్వర్యాన సదస్సులు, సభలు జరిగాయి. 1973 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర జిల్లాలలో "జై ఆంధ్ర ఉద్యమం" ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలోను, మార్క్సిస్టు పార్టీ దానికి వ్యతిరేకంగా తిరిగి పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం వెలువరించింది. సభలు నిర్వహించింది. ఆ సభలకు నాటి కృష్ణా జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి మానికొండ సుబ్బారావు, ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (మాజీ రాజ్యసభ సభ్యుడు) ఉపన్యాసకులుగా వెళ్లారు. ఆ సందర్భంలో కృష్ణా జిల్లా జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు (1983-1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రి), వారి శిష్య గణం సభా ప్రాంగణం చుట్టూ రాళ్లు పేర్చుకుని తెలంగాణ ప్రతినిధి డాక్టర్ యలమంచిలి ప్రసంగిస్తుండగా రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. బందోబస్తులో వున్న పోలీసు బృందం తగు రక్షణలు కలిగించింది. ప్రత్యేక వాదం ఉద్యమాలపట్ల, ఆ నాడు భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ తీసుకున్న క్రియాశీల వైఖరికి ఇవి కొన్ని ఉదాహరణలు.

2001-2010 మధ్య సాగిన - తరువాత సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎడల పార్టీ వైఖరికి, 1969-73 మధ్య తీసుకున్న వైఖరికి చాలా తేడా కనిపిస్తుంది. ఈ వైఖరికి బహుశా కారణం, ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో పెద్ద ఎత్తున లేకపోవడమైనా కావచ్చు, లేదా, అది కేవలం మాటల యుద్ధంగా వుండడం వల్ల కావచ్చు, లేక వివిధ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ 2004 లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడం వల్ల కావచ్చు, తిరిగి 2009 ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితితో కూడిన గ్రాండ్ అలయెన్స్ లో భాగస్వామి కావడం వల్ల కావచ్చు. ఏదేమైనా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించింది. 2004 లో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సిపిఎం ఎందుకు ప్రాతినిధ్యం నిరాకరించింది? తాము సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం వరకే ఎందుకు పరిమితం అవుతోంది? కొంత మంది నాయకులు "తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి లేదనీ" అనడం భావ్యమేనా? బాధ్యత కాంగ్రెస్ ది కాగా తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేయడం "తమ పార్టీ భుజాన తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం తప్పు" అనడం సిపిఎంకు సమంజసమేనా? చివరకు "కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే మేం వద్దన్నామా?" అనడం, "మేం వ్యతిరేకించమనీ" ఇచ్చే ప్రకటనలు తప్పు దోవ పట్టించే విగా లేవా? మార్క్సిస్టు పార్టీయే తరులు - అటు తెలంగాణ ప్రాంతం వారైనా, ఇటు ఆంధ్ర ప్రాంతం వారైనా - అపహాస్యం చేసే పరిస్థితికి సిపిఎం చేరుకోవడం అసలుసిసలైన మార్క్సిస్టులను ఆందోళనకు గురిచేస్తుందనక తప్పదు. ఎందుకీ అస్పష్ట వైఖరి? ఎవరిని సంతోషపెట్టడానికి ఇదంతా? ఇటీవల కాలంలో ఆ పార్టీకి సహజమైన "మిలిటెన్సీ" కూడా లోపించిందనక తప్పదు.

ఈ అంశాన్ని ఒకరిద్దరు ప్రముఖ మార్క్సిస్టు నాయకుల దగ్గర ప్రస్తావించినప్పుడు సైద్ధాంతిక కోణంలో సమాధానాలు కొంత మేరకు లభించినా, సంతృప్తికరంగా లేవనే అనాలి. 2011 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సమర్థన అస్తిత్వం వుందన్నారు కొందరు సిపిఎం నాయకులు. ప్రాంతీయ అస్తిత్వ వాదం అనీ, ఈ సిద్ధాంతానికి మూలాలు పోస్టు మోడర్నిజంలో వున్నాయనీ, విజ్ఞులందరికీ తెలుసు. పోస్టు మోడర్నిజం అనేది సైద్ధాంతికంగా "యాంటీ మార్క్సియన్" అని చాలామందికి తెలుసు. ఇది ప్రాంతీయ కుల-జెండర్ వాదాలకు దారితీస్తుంది. ఈ నేపధ్యంలో ఆంగ్ల భాషలో వచ్చే మార్క్సిస్టు త్రైమాసిక పత్రికలో రెండు చక్కటి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఒకటి ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి ఇంతియాజ్ అహ్మద్ రాసిన ఇరవై పేజీల విపులమైన వ్యాసం. అదే సంచికలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వ్యాసం కూడా ఆ అంశంపైనే వుందన్నారు. ఆ రెండు వ్యాసాలు, ప్రస్తుత వేర్పాటు ఉద్యమ వాతావరణంలో, వామపక్ష ఆలోచనలు వున్నవారికి ఉపయోగకరంగా వుంటాయి. సమైక్యత నినాదానికి కట్టుబడే వుంటే, సిపిఎం వాటిని తెలుగులోకి అనువదించి, ప్రచారంలోకి తీసుకురావడంలో ఎందుకు వెనుకాడుతున్నదో అర్థం కావడం లేదని కూడా కొందరు సిపిఎం నాయకులు అభిప్రాయపడ్డారు.

"ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐదీ, సిపిఐ (న్యూ డెమాక్రసీ)దీ అత్యుత్సాహంగా వుంటే, మాది నిరుత్సాహంగా, నిర్లిప్తంగా వున్నట్లు తోస్తుందిఅని ముగించారు సిపిఎం పార్టీకి చెందిన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు.

అసలింతకీ మనముందున్న సమస్య, కేవలం సమైక్యమా? విభజనా? లేక మరింత లోతుగా పరిశీలించ వచ్చా? తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇది జాతుల, అంతర్జాతీయాల సమస్యను రంగంమీద కి తెస్తోంది. జాతి అంటే ఒక స్పష్టమైన అవగాహన లేకుండానే ఏ ప్రాంతానికి బడితే ఆ ప్రాంతానికి జాతి అనే ముద్ర తగిలించేవాళ్లున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వాళ్లూ-మద్దతిచ్చిన వాళ్లూ వున్నారు. అంతర్జాతీయ పౌభాతృత్వం పేరిట అనలు జాతుల ఉనికినే ప్రశ్నించేవారూ వున్నారు. రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఒకే భాష వుంటేమాత్రం రెండు గాని అంతకుమించి సంఖ్యలోగాని రాష్ట్రాలుంటే నష్టమేమిటని, తప్పేంటి? అని ప్రశ్నించేవారూ వున్నారు. వివిధ భాషలు గల ప్రాంతాలను ఒకే ఉమ్మడి రాష్ట్రంగా, ఇంగ్లీషు వాళ్లకాలంలోవలె చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందని సవాలు చేసేవారూ లేకపోలేదు. అందుకే జాతి అంటే ఏమిటన్న విషయంలో, అదీ మార్క్సిస్టు ఆలోచనా ధోరణితో, కొంత స్పష్టమైన అవగాహనకు రావడం సమస్యను అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుందేమో!

మన దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అవి కేవలం పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే ఏర్పడినవిగావు. భాషా ప్రయుక్తంగా ఏర్పడినవి. పేరుకు భాషా ప్రయుక్తం అంటున్నా నిజానికి అవి వివిధ జాతులు గానూ కూడా వున్నాయి. భారతదేశం (అంటే "ఇండియన్ యూనియన్") ఒక్కటే అయినా అది వివిధ జాతుల కూటమి కూడాను. ఈ జాతుల సమైక్యతే మన దేశపు ఏకత్వాన్ని, ఔన్నత్యాన్నీ కాపాడుతుంది. ప్రపంచంలో ఏక జాతి దేశాలూ వున్నాయి. బహుళ జాతి దేశాలూవున్నాయి. చైనా, ఇండియా వంటివి బహుళ జాతి దేశాలు. సకల జాతి, సకల దేశ సమైక్యతే విశ్వ మానవ కళ్యాణానికి దోహదం చేస్తుంది. అది కేవలం భౌగోళికంగా సమైక్యంగా వుండాలని లేదు. ఒక మనిషి వేరొకమనిషినీ, ఒక జాతి వేరొక జాతినీ దోపిడీ చేయడం అంతమవ్వాలి. అందుకు ఆర్ధిక వ్యత్యాసాలూ జాతి విచక్షణలూ పోవాలి. అప్పుడు వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది. సోషలిస్టు వ్యవస్థే వర్గ రహిత సమాజాన్ని తీర్చిదిద్దగలదు. కాని అది మనదేశంలో జరగడం లేదే? జరిగే సూచనలు కూడా లేవే?

సమైక్యత అనేది సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యం గనుక ఈలోగా ఏ జాతీ ఒక్కటి గా వుండవలసిన అవసరంలేదని కానీ, వుండి తీరాలని కానీ, ఎన్ని ముక్కలుగా చీల్చినా పరవాలేదని కానీ, అసలు విభజన ఆలోచనే తప్పనీ, ఎవరికి నచ్చిన భాష్యం వారు చెప్పడం సరైంది కాదు. ఇవన్నీ దారితప్పిన వాదనలు తప్ప మార్క్సిస్టు వాదనలు కనే కావు. ఒక జాతిగా వున్న వాళ్లు అవకాశమున్న చోట ఒకే రాష్ట్రంలో వుండటం ఎంత మంచిదో-అదెంత జాతి అభివృద్ధికి దోహద కారి అవుతుందో, అదే విధంగా అవసరమైతే-ప్రజలు కోరుకుంటే, ఒక జాతి విభిన్న భాగాలుగా చీలడం, విభిన్న జాతులకు చెందిన భాగాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం అంతే దోహద కారి అవుతుంది.

జాతి అన్న దానికి సరైన నిర్వచనాన్ని లెనిన్ - స్టాలిన్ లు ఇచ్చారు. “ఒకే భాష, ఒకే భూభాగం, ఒకే ఆర్ధిక వ్యవస్థ ఒకే సాంఘిక సంస్కృతీ సముదాయంగా గలదీ, స్థిరమైన సమాజంగా చారిత్రక పరిణామం పొందినదీ ఒక జాతిగా పరిగణించబడుతుంది”. చైనా, ఇండియా లాంటి దేశాల్లో వున్న వారంతా ఒకే జాతి వారా? భాష ఒకటే అయినా ఒకే దేశంలో వున్న వారందరూ ఒక జాతి వారు కాజాలరు. ఇంగ్లండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇంగ్లీషు భాషే మాతృ భాషగా వున్నది. అయినా వారంతా విభిన్న జాతులుగా రూపొందారు. ఇంగ్లండు, ఐర్లాండు లలో మాట్లాడేది ఒకే భాష. సన్నిహిత భూ భాగంకూడా వున్నది. అయినా అవి రెండూ రెండు జాతులుగా పరిణామం చెందాయి. ఆలాగే కెనడా, అమెరికాలు సన్నిహితంగా వున్నా ఒకే జాతిగా పెంపొందలేదు. అందుకనే భాష, భూభాగం, సంస్కృతీ, చరిత్రా, ఆర్ధిక వ్యవస్థ, స్థిరమైన మనుగడ వంటి లక్షణాలన్నీ కలిసి వుంటేనే సమైక్యత సాధ్యమవతుందేమో! సాధ్యంకాకపోవడానికీ అవకాశాలున్నాయి కూడా!

ఈ లక్షణాలన్నీ తెలుగు జాతి కలిగివుందా? సమాధానం "అవును" కావచ్చు, "కాదు" కావచ్చు. పూర్తి ఫ్యూడల్ వ్యవస్థలో, ఉర్దూ భాష పెత్తనం క్రింద కొన్నేళ్లు తెలంగాణా నలిగింది. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీషు భాష పెత్తనం క్రింద కొంత పెట్టుబడి దారీ ప్రభావంలో ఆంధ్ర ప్రాంతం కొన్నేళ్లు నడిచింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నేపధ్యంలో విశాలాంధ్రగా ఏర్పడ్డాయి. విడివిడిగా, కలిమిడిగా దేని అస్తిత్వం దానికే వుంది. మరిప్పుడు కలిసున్నా, విడిపోయినా లాభనష్టాలు ఒకటేగా? ఒకరు విడిపోతా మన్నప్పుడు మరొకరికి అభ్యంతరం ఎందుకుండాలి? సమాధానం దొరకని ప్రశ్నలు.

కమ్యూనిస్టు పార్టీలలో సగ భాగం కలిసి వుండాలంటుంటే, మరో సగ భాగం విడిపోవాలని ఉద్యమిస్తున్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పిన సూక్తులు ఎవరికి వర్తిస్తా యో వారే తేల్చాలి! END

Wednesday, April 28, 2010

“ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ” తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు : వనం జ్వాలా నరసింహారావు

ఏప్రియల్ 30నుండి మే నెల1, 2010 వరకు జరుపుకుంటున్న
నూరేళ్ల శ్రీశ్రీ విరసం మహాసభల సందర్భంగా

భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి
“ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ”
తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు
వనం జ్వాలా నరసింహారావు

తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, "తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను, అలవోకగా అనువదించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఏకైక రచయిత గాను, కవిత్వం ద్వారా మరో ప్రపంచాన్ని వీక్షించిన మహా మనీషిగాను, అంచనాలకు అందని వ్యక్తి గాను అందరికీ సుపరిచితుడైన మహాకవి శ్రీ శ్రీ అనబడే శ్రీరంగం శ్రీనివాసరావు భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ (ఆంధ్ర ప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్-ఏ.పీ.సి.ఎల్.ఏ) తొలి అధ్యక్షులనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. నా వరకు నాకు మాత్రం ఆ విషయాలను వివరంగా తెలియచేసిన వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు-రాజ్యసభ మాజీ సభ్యుడు-పేరొందిన ప్రజా వైద్యుడు-భారతదేశంలోనే పౌరహక్కుల ఉద్యమానికి నాంది పలికిన మేధావి డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తి.

సోవియట్ యూనియన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల నడుమ తలెత్తిన సైద్ధాంతిక విభేదాల దరిమిలా, కారణాలేమైనప్పటికీ, భారత-చైనా దేశాల మధ్య 1962లోయుద్ధం జరిగింది. యుద్ధం నేపధ్యంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుకూల వాదులుగా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా పడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంనుండే, కమ్యూనిస్టుల కంచుకోటగా, ఖమ్మం జిల్లాకు పేరుండడంతో, ఆ జిల్లాకు చెందిన ముఖ్యమైన నాయకులందరినీ నిర్బంధించింది ప్రభుత్వం. ఇదిలా వుండగా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న నేపధ్యంలో, అంతకు ఒక ఏడాది క్రితం నుంచి, ఖమ్మం పట్టణంలోని స్థానిక డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్ వై.ఆర్.కె) ఇంట్లో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు-సానుభూతిపరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే వేదిక కింద సమావేశమై సిద్ధాంత పరమైన అనేక విషయాలపై చర్చించుకుంటుండేవారు. ఎవరు-ఎందుకు పెట్టారోగాని, అలా ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండె సమావేశాలకు హాజరయ్యేవారిని "ఆదివారం సంఘం" అని ఎద్దేవాగా పిలవడం జరిగింది.

పార్టీపట్ల, సిద్ధాంతాలపట్ల సంపూర్ణ విశ్వాసమున్న డాక్టర్ వై.ఆర్.కె, తన వంతు కృషిగా, కమ్యూనిస్ట్ నాయకుల విడుదలకు-పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేయసాగారు. స్థానిక ఖమ్మం న్యాయవాదులైన బోడేపూడి రాధ, కె.వి.సుబ్బారావుల మద్దతు కోరారు. ఆ ముగ్గురి (మేధావి త్రయం అన్న పేరొచ్చింది వారికి)కలయిక భవిష్యత్ భారత పౌర హక్కుల ఉద్యమానికి నాంది కాబోతున్నట్లు ఆనాడు వారితో సహా ఎవరూ ఊహించలేదు. కలిసి ఉద్యమించడానికి అంగీకరించిన "మేధావి త్రయం", సాధ్యమైనంత త్వరలో విజయవాడలో ఒక సదస్సు నిర్వహించాలని, ఆ సదస్సులో పౌరహక్కుల సంస్థ స్థాపన ప్రక్రియను ప్రారంభించాలని, అదే రోజున బహిరంగ సభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకుంది. వారు జరుపదల్చుకున్న సదస్సుకు-బహిరంగసభకు ఆహ్వానించాలనుకున్న వారిలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు శ్రీపాద అమృత డాంగే (సీ.పీ.ఐ), ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ (సీ.పి.ఐ.ఎం) లు ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని భావించిన నంబూద్రిపాద్ ను, జ్యోతిబసును అప్పటికింకా నిర్బంధంలోకి తీసుకోలేదు ప్రభుత్వం. డాంగే, నంబూద్రిపాద్ లతో పాటు ఇంకెవరెవరిని పిలవాలన్న ఆలోచన చేసిన మేధావి త్రయం "శ్రీ శ్రీ” ని ఆహ్వానించాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల ఉద్యమ వాది జస్టిస్. ఎన్.సీ. ఛటర్జీని, ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో వుంటున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కడియాల గోపాల రావును కూడా ఆహ్వానించాలని నిర్ణయం జరిగింది.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా విజయవాడ న్యాయవాది కే.వి.ఎస్.ఎన్ ప్రసాదరావు సారధ్యంలో, మేధావి త్రయం మార్గదర్శకత్వంలో, ఖమ్మం "ఆదివారం సంఘం" ఆశించిన రీతిలో పౌర హక్కుల ఉద్యమానికి విజయవాడ లోని "రైస్ మిల్లర్స్ సంఘం" భవనం వేదికగా శ్రీకారం చుట్టడానికి రంగం సిద్ధమయింది. అనుకున్నట్లు గానే నాలుగైదు వందల మంది డెలిగేట్స్ తో సదస్సు మొదలయింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వారే కాకుండా పలువురు సానుభూతి పరులు హాజరయ్యారు సదస్సుకు. ఇక సదస్సులో నిర్ణయం తీసుకుని సాయంత్రం బహిరంగ సభలో వెల్లడి చేయడమొక్కటే మిగిలింది. ఇంతలో అక్కడ చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన చిలికి-చిలికి గాలివానయ్యి, సీపీఐ కి చెందిన కార్యకర్తలంతా సదస్సును బహిష్కరించి వెళ్లిపోయారు. అప్పటికే విజయవాడ చేరుకున్న తమ నాయకుడు డాంగేని కలిసి బహిరంగసభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు వారంతా. చివరకు సాయంత్రం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభకు సీపీఐ కి చెందిన వారెవరూ హాజరవ్వలేదు. సదస్సులో "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ" ను నెలకొల్పాలని, ఉద్యమాన్ని ప్రతి జిల్లాకు తీసుకుపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగసభలో ప్రకటించారు.

ఏ.పీ.సీ.ఎల్.సి అధ్యక్షుడిగా శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాలరావును, ఉపాధ్యక్షులుగా న్యాయవాదులు కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్. ప్రసాదరావులను, సభ్యులుగా న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావు, డాక్టర్ వై.అర్.కే లతో సహా మరి కొంత మందిని ఎన్నుకున్నారు డెలిగేట్లు. సదస్సు తీసుకున్న నిర్ణయాలను, కార్యాచరణ పథకాన్ని బహిరంగ సభలో ప్రకటించారు. నలభై వేల మందికి పైగా హాజరయిన బహిరంగ సభ వేదిక మీదున్న ప్రముఖుల్లో ఎన్.సీ.ఛటర్జీ, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులు ముఖ్యులు. ఆ విధంగా మొట్టమొదటి పౌర హక్కుల ఉద్యమానికి అధ్యక్షుడిగా శ్రీ శ్రీ వ్యవహరించసాగారు కొన్నాళ్లపాటు. కేవలం నామమాత్రంగా వ్యవహరించడమే కాకుండా జిల్లాలలో జరిగిన బహిరంగసభలకు తప్పకుండా హాజరయ్యేవారు శ్రీ శ్రీ.

పౌరహక్కుల ఉద్యమాన్ని బలీయంగా ముందుకు తీసుకెళ్లాలంటే, ఉద్యమ లక్ష్యాలను సాధించాలంటే, జిల్లా స్థాయి సదస్సులు-బహిరంగసభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. తదనుగుణంగానే, కర్నూల్, అనంతపూర్, నల్గొండ జిల్లా సూర్యాపేటలలో సభలు జరిగాయి. మూడు చోట్లా ప్రధాన ఆకర్షణ సభలకు హాజరై చక్కటి ఉపన్యాసం చేసిన శ్రీశ్రీ నే. నవంబర్ 1965 మూడవ వారంలో నిర్వహించిన సూర్యాపేట సదస్సు అన్నింటిలోకి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునేవారు. సరిగ్గా అది జరిగిన వారం రోజులకు మేధావి త్రయాన్ని, వారితో పాటు కర్నాటి రామ్మోహన్ రావును, రాష్ర్ట్రవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ నాయకత్వాన్నిముందస్తునిర్భంద చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం. వీరంతా అరెస్టయినప్పటికీ, ఆ తర్వాత పది రోజులకు అనుకున్న ప్రకారం న్యాయవాది ఏడునూతుల పురుషోత్తమ ఆవు ఆధ్వర్యంలో, నిర్వహించిన ఖమ్మం సదస్సుకు, నంబూద్రిపాద్, కడియాల గోపాల రావులు హాజరయ్యారు. శ్రీ శ్రీ రాలేదు. ఏ.పీ.సీ.ఎల్.ఏ ఆధ్వర్యంలో ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో నిర్వహించిన చివరి సదస్సు అదే.

ఖమ్మంలో అరెస్టయిన డాక్టర్ వై.ఆర్.కె ప్రభృతులను నిర్భంధించిన హైదరాబాద్ ముషీరాబాద్ జైల్‌లోనే వున్న మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లా రెడ్డి లాంటి ప్రముఖ నాయకులను కలిసే అవకాశం కలిగిందని డాక్టర్ రాధాకృష్ణమూర్తి అన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న కాసు బ్రహ్మానందరెడ్డిని పెరోల్ పై విడుదలైన సుందరయ్యగారు కలుసుకున్నప్పుడు, "మీ అందరికంటే పౌర హక్కుల ఉద్యమం చేపట్టిన మేధావి త్రయం లాంటివారు ఎక్కువ ప్రమాదకరమైన వ్యక్తులు" అని వ్యాఖ్యానించారట. అంటే ఆనాటి శ్రీ శ్రీ అధ్యక్షతన చేపట్టిన పౌరహక్కుల ఉద్యమం ప్రభుత్వంపై అంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిందనాలి.

ఆ తర్వాత కాలంలో పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని జైలునుంచే నడపాలని భావించారు. "హెబియస్ కార్పస్ పిటీషన్" అనే ఆయుధాన్ని ఉపయోగించారు. కొందరు హైకోర్టును, మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వై.ఆర్.కే, బోడేపూడి రాధలు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసినందున వారిని భద్రతా కారణాల దృష్ట్యా నాటి ప్రభుత్వం విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి తిహారీ జైల్లో వుంచింది విచారణ జరిగినంత కాలం. అప్పటికే తిహారీ జైలుకు హెబియస్ కార్పస్ విచారణకు తీసుకొచ్చిన వారిలో హరికిషన్ సింగ్ సూర్జిత్, ఏ.కె. గోపాలన్, బీ.టీ.రణదివే, మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, నాగభూషణం పట్నాయక్, హరే కృష్ణ కోనార్ లాంటి ప్రముఖ మార్క్సిస్ట్ నాయకులున్నారు. వారంతా, ఒక ప్రణాళిక ప్రకారం అనధికారికంగా పోలిట్ బ్యూరో సమావేశం జరుపుకునేందుకు తీహారీ జైలును వేదికగా ఉపయోగించుకున్నారు.

పిటీషన్ విచారణలో వుండగానే, పౌర హక్కుల ఉద్యమ ప్రభావం వల్లనో-దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం నిర్భందాలకు వ్యతిరేకంగా వెల్లడవుతున్నందువల్లనో, కేంద్ర ప్రభుత్వం ఏప్రియల్ 29, 1965న, పీడీ చట్టం కింద అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని, సుప్రీం కోర్టుకు ఆ విషయాన్ని తెలియచేసింది. ఆ విధంగా అంతా విడుదలయ్యారు. బహుశా ఆ విధంగా ఆలోచిస్తే, శ్రీ శ్రీ అధ్యక్షతన చేపట్టిన పౌరహక్కుల ఉద్యమం తన ప్రభావాన్ని చూపిందని అనాలి.

తర్వాత కాలంలో చాలా రోజులకు, బలమైన పౌరహక్కుల ఉద్యమాన్నొకటి నిర్మించాలన్న ఆలోచనొచ్చింది పుచ్చలపల్లి సుందరయ్య గారికి 1982లో. అదేదో కేవలం సీ.పి.ఎం నాయకత్వాన వుండేది కాకూడదని, ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా, పార్టీ రహిత మేధావుల ఆధ్వర్యంలో వుండాలని భావించారాయన. నవంబర్ 1982లో రఘునాథ రెడ్డి అధ్యక్షుడిగా, డాక్టర్ వై.ఆర్.కే ప్రధాన కార్యదర్శిగా, సురవరం సుధాకర రెడ్డి-విఠల్ కార్యదర్శులుగా, అన్ని పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు కార్యవర్గ సభ్యులుగా పౌరహక్కుల సంస్థ ఆవిర్భావం జరిగింది. కారణాలే వైనా, 1989లో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత రఘునాథ రెడ్డి గవర్నర్ కావడంతో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఉద్యమం ఆగిపోలేదు. కొనసాగుతూనే వుంది ఏదో ఒక రూపేణా.

కాలక్రమేణా ప్రభుత్వాల ఆలోచనా విధానంలోను మార్పు కనిపించ సాగింది. చట్ట పరంగా మానవ హక్కుల సంస్థలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయడం మొదలయింది. జాతీయ మానవ హక్కుల కమీషన్, రాష్ర్ట స్థాయి హక్కుల కమీషన్లు ఏర్పాటయ్యాయి. పౌర హక్కుల ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం తన వంతుగా మానవ హక్కుల పరిరక్షణకు పూనుకుంది. ఇదంతా జరగడానికి కారణం అలనాటి శ్రీ శ్రీ సారధ్యంలో ఆవిర్భవించిన పౌర హక్కుల సంస్థే అనడం అతిశయోక్తి కాదేమో !